29, ఆగస్టు 2022, సోమవారం

శ్రీనాధుని చే చెప్ప బడిన గణేశ ప్రార్ధన

 శ్రీనాధుడు రచించిన భీమఖండం లో గణపతిని స్తుతిస్తూ చెప్పిన పద్యం చాలా బాగుంది.

ఏనికమోముతార్పెలుక నెక్కినరావుతురాజు సౌరసే

నానియనుంగుబెద్దన వినాయకదేవుడు కర్ణతాళఝం

ఝానిలతాడనంబున నిరంతరమున్ బ్రబలాంతరాయసం

తానమహాఘనాఘన కదంబములన్ విదళించు గావుతన్


తాత్పర్యం: ఏనుగు ముఖం కలిగి, తన వాహనము ఎలుకను ఎక్కిన కుమారస్వామికి స్వయాన పెద్ద అన్న అయిన వినాయకుడు, తన పెద్ద పెద్ద చెవులను విసురుతూ ఎల్లప్పుడూ అత్యంత దట్టంగా అలుముకుంటున్న విఘ్నములు అనే కారు మబ్బులను చెల్లా చెదురుగా పోగొట్టును గాక. 






30, మార్చి 2022, బుధవారం

నల దమయంతుల వివాహం అందరికి సంతోషకారకం అయ్యిందా?

మనం ఇంతకు ముందు దమయంతి నల మహారాజుల వివాహం గురించి,  ఆ వివాహానికి దేవతలు రావడం, వారిని పరిక్షించి,వారికి వరములను ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత వారి  జీవితంలో సంభవించిన మార్పులను గురించి ఇప్పుడు చూద్దాం! 

ఇంద్రాది దేవతలు స్వయంవరం అయిన తరువాత ఆకాశ మార్గంలో వెళుతూ ఉండగా వారికి ద్వాపర, కలి యుగములు భౌతిక దేహముతో పురుషుల వలే ఎదురు వచ్చారు. వారిని చుసిన దేవతలు వారిని ఆపి ఎక్కడకు బయలుదేరారు అని అడుగగా వారు దమయంతి స్వయంవరం లో పాల్గొనడానికి వెళ్తున్నామని చెప్పారు. వారిద్దరిలో కూడా కాళీ అత్యంత ఉత్సాహంగా ఉండడాన్ని గమనించిన దేవతలు వారికి ఆ స్వయంవరం పూర్తి అయినది అని చెప్పారు. ఆ మాటలు విన్న ఆ ఇద్దరు యుగ పురుషులు నిరాశ చెందారు. కానీ దేవతలు అంతటితో ఆగకుండా ఆ దమయంతి నలుని తప్ప దేవతలను కూడా వివాహం చేసుకోనని చెప్పిందని, దానికి ప్రముఖ మయిన కారణం నలుని ధర్మ పరాయణత అని చెప్పిన మాటలు వారు చెప్పారు. 

ఆయా మాటలను విన్న  కలి  కి ఆవేశం వచ్చింది.నలునిలో ఉన్న ఏ ధర్మదక్షతను ఆమె అతనిని వరించిందో ఆ ధర్మమునకు నలుని దూరం చేస్తాను అని కలి ప్రతిజ్ఞ చేసాడు. 

అలా కాళీ చేసిన ప్రతిజ్ఞ కు ద్వాపరుడు కూడా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. 

మరి వారు నలుని నిజంగా ధర్మ బ్రష్టుని చేశారా? లేదా? చేస్తే ఎలా చేయ గలిగారు? దాని వలన నల దమయంతిల జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అని తరువాతి టపా లలో చూద్దాం!

16, మార్చి 2022, బుధవారం

విదుర నీతి - 13

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు అంతే కాకుండా పండితులకు ఉండే ముఖ్య లక్షణముల గురించి తెలుసుకుందాం! 


సంస్కృత శ్లోకం:

నాప్రాప్యమభివాంచంతి నష్టం నేచ్ఛన్తి శోచితుం

ఆపత్సు చ న ముహ్యంతి నరాః పండిత బుద్ధయః

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

పోయిన దానికిదాదల పోయడశక్యార్ధములకుబోడాపదలన్

బాయడు ధైర్యముదీనుల రోయడుతత్వజ్ఞుడగునరుండు మహీశా!

భావంః పండితుడు తను పొందలేక పోయినదాని గురించి దుఃఖించడు, తనకు సాధించడానికి అసాధ్యమయిన లక్ష్యములను సాధించాలని కోరుకొనడు, తన లక్ష్యములను సాధించే క్రమంలో ఎదురయిన సమస్యలను చూసి ధైర్యమును కోల్పోడు, అంతే కాకుండా తన ముందు ఎవరయినా ధైర్యమును కోల్పోయిన వారిని అనాదరించడు. 

15, మార్చి 2022, మంగళవారం

నలుడు, దమయంతిల వివాహం

మనం ఇంతకుముందు దమయంతి స్వయంవరమునకు దేవతలు వచ్చారని, వారు నలుని దమయంతి వద్దకు రాయభారానికి పంపారని, ఆ రాయబారాన్ని తీసుకుని నలుడు దమయంతి దగ్గరకు వెళ్ళడం గురించి చెప్పుకున్నాం!

నలుడు దమయంతి సమాధానాన్ని దేవతలకు చెప్పాడా? వారు స్వయంవరమునకు ఎలా వచ్చారు?ఆ తరువాత స్వయంవరం ఎలా జరిగింది?  అని ఇప్పుడు తెలుసుకుందాం!

దమయంతి సమాధానమును నలుడు దిక్పాలకులయిన దేవతలకు తెలియజేసాడు. దమయంతి సమాధానమును విన్న దేవతలు ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు, కానీ వారు దమయంతి స్వయం వరమునకు తప్పకుండా రావాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దిక్పాలకులు నలుగురు (ఇంద్ర,వరుణ,అగ్ని మరియు యమధర్మరాజు) ఆ స్వయంవరమునకు నలుని రూపంలో వచ్చారు.

ఆ స్వయంవరమండపం లో అన్ని రాజ్యముల నుండి రాజులు వచ్చారు. వారిలో కొందరు కేవలం ఆమెను చూడడానికి మాత్రమే వచ్చారు. దమయంతి తన చేతిలో వరమాలతో ఆ మండపం లోనికి వచ్చింది. ఆఅమె పక్కన ఉన్న చెలికత్తెలు ఆమెకు ఒకొక్క రాజు గొప్పతనమును చెబుతూ వస్తున్నారు. అలా వస్తున్న వారికి ఒక దగ్గర ఐదుగురు నల మహారాజులు కనిపించారు. అప్పుడు చెలికత్తెలకు ఏమి చెప్పాలో అర్ధంకాలేదు. దమయంతికి కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉంది. ఆమెకు అక్కడ ఉన్న ఐదుగురిలో ఒక్కడు నలుడు ఆని మిగిలిన వారు దేవతలు అని తెలుసు కనుక ఆమె వారిని మనస్సులోనే ప్రార్ధించడం మొదలుపెట్టింది. వారిలో మానవుడయిన నలుడు ఎవరో తెలుసుకొనగలిగే ఉపాయమును చెప్పమని కోరుకున్నది. ఆమె దృడసంకల్పానికి సంతోషించిన దేవతలు నిజమయిన నలుని పాదములు భూమిని తాకుతూ ఉంటాయని ఆమెకు స్పురించింది. ఆమె అక్కడ ఉన్న ఐదుగురు నలమహారాజులను గమనించింది. ఆ ఐదుగురిలో కేవలం ఒక్కరి పాదములు మాత్రమే నేలను తాకుతూ ఉన్నాయి. మిగిలిన నలుగురి పాదములు భూమిని తాకకుండా ఉన్నయి. అప్పుడు దమయంతి తన వరమాలను నలుని మెడలో వేసింది. 

వారి వివాహాన్ని చూసి సంతోషించిన ఇంద్రుడు, నల మహారాజు చేసే ప్రతి యజ్ఞమునకు స్వయంగా వచ్చి హవిర్భాగమును స్వీకరిస్తానని, అగ్నిదేవుడు నలుని కోరికపై అతను ఎక్కడ కావాలంటే అక్కడకు వస్తానని, వరుణుడు కూడా నలుని కోరికపై ఎక్కడికి అయినా వస్తానని, యమధర్మరాజు నలుని మనస్సు ఎల్లవేళలా ధర్మం పైననే నిలచేలా చేస్తానని వరములు ఇచ్చారు. 

14, మార్చి 2022, సోమవారం

అష్ట వినాయకులు

 మనం ఇంతకు ముందు ఏకాదశ రుద్రుల గురించి,  నవ బ్రహ్మల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం స్వయంభువులుగా అవతరించిన అష్ట వినాయకుల గురించి తెలుసుకుందాం!

వీని గురించి స్వయంగా వేద వ్యాసుడే ఒక శ్లోకంలో చెప్పాడు. ఆ శ్లోకం ఇప్పుడు మనం చూద్దాం!

స్వస్తిశ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం

బల్లాళం మురులం వినాయక మిదం చింతామణీ దేవరం

లేన్యాద్రిం గిరిజాత్మకం సురవరం విఘ్నేశ్వరం ఓఝురం

గ్రామే రంజన సంస్థితో గణపతిః కుర్యాత్ సదా మంగళం

  1. మయూరేశ్వరుడు
  2. సిద్ధి వినాయకుడు
  3. బల్లాళేశ్వరుడు
  4. వరద వినాయకుడు
  5. చింతామణి గణపతి
  6. గిరిజా పుత్రుడు
  7. విఘ్నేశ్వరుడు
  8. మహాగణపతి

13, మార్చి 2022, ఆదివారం

దశగ్రీవుడు రావణుడు ఎలా అయ్యాడు?

 మనం ఇంతకుముందు మనం దశగ్రీవునికి నంది ఇచ్చిన శాపం గురించి తెలుసుకున్నాం కదా! ఆ తరువాత ఏమి జరిగింది? దశగ్రీవునికి రావణ అనేపేరు ఎలా వచ్చింది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం!

నంది శాపం తరువాత దశగ్రీవుడు తన పుష్పక విమానమును ఆపిన ఆ పరమేశ్వరుని కోసం చూశాడు. కానీ నంది దశగ్రీవుని వెళ్ళనివ్వలేదు. అప్పుడు వారి మధ్య చిన్న యుధ్ధం జరిగింది. ఆ సందర్భంలో దశగ్రీవుని అహం, గర్వం మరింతగా పెరిగి, విచక్షణ కోల్పోయాడు. ఏ శిఖరం మీద అయితే పరమేశ్వరుడు ఉన్నాడని నంది చెప్పాడో ఆ శిఖర మూలమును, కొండనే ఎత్తాలని ప్రయత్నం చేసాడు. దానికోసం అతను తన పది తలల, ఇరవై చేతుల బలములను ఒడ్డాడు. అప్పుడు, ఆ కైలాస శిఖరం కొద్దిగా కంపించింది. ఆ కంపనమునకు పార్వతీదేవి తన భర్త చేతిని కొంచెం గట్టిగా పొదివి పట్టుకుంది. ఆమె భయమును పోగొట్టాలంటే ఆ కంపనను ఆపాలన్న ఉద్దేశంతో తన కాలి బొటనవేలుని కొద్దిగా నొక్కి ఉంచాడు. 

పైనుండి వచ్చిన ఆ ప్రతిఘటనను అతని శక్తి తట్టుకోలేక అతను ఆ కొండకింద ఇరుక్కుపోయాడు. ఆ సమ్దర్భంలో అతను చాలా పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. ఆ అరుపులకు ముల్లోకములు అల్లాడిపోయాయి. ఆ శబ్ధానికి దేవేంద్రుని దేవలోకం కూడా కంపించింది. ఆ సందర్భంలో దశగ్రీవుడు బ్రహ్మదేవుని సహాయం కోరాడు. కానీ ఆ సమయంలో అతనిని పరమేశ్వరుడు తప్ప ఎవ్వరూ కాపాడలేరని తెలుసుకుని, అతనినే ప్రార్ధించడం, స్తుతించడం మొదలుపెట్టాడు. 

అతని గర్వం ఆ సందర్భాన్ని బట్టి కొంతవరకు తగ్గింది. అతను ఎంతో పెద్దగా అరుస్తూనే స్తుతించడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడచిన తరువాత, శివుడు సంతోషించి తన పట్టును సడలించాడు. అప్పుడు దశగ్రీవుడు తన చేతులను, కాళ్ళను ఆ పర్వతం క్రిందినుండి తీసుకుని, లేచి నిలబడ్డాడు. 

అతనిని చూసి భోళాశంకరుడు అయిన పరమేశ్వరుడు  దశగ్రీవునికి వరం ఇవ్వాలని అనుకున్నాడు. అంతేకాక అతని అరుపుల వలన అన్నిలోకములు అదిరిపోయాయి, భయమునకు గురి అయ్యాయి కనుక అతనికి "రావణ" అనే పేరు ఇచ్చాడు. 

తరువాత రావణుడు అతనికి పరమేశ్వరుడు ఇస్తానన్న వరమును గుర్తు చేస్తూ, అతనికి ఇంతకుముందే బ్రహ్మదేవుడు అమరత్వాన్ని ప్రసాదించాడు కనుక తనకు అమరత్వమును గురించిన వరము అవసరములేదని, అయితే ఇంతకు ముందు తపస్సు కారణంగా, ఇప్పుడు కైలాస పర్వతమును ఎత్తేకారణంగా అతని ఆయుష్షు తగ్గిపోయినది కనుక అతని ఆయుష్షును తిరిగి ఇవ్వమని, అంతేకాకుండా ఆతనికి ఒక దివ్య ఆయుధం ఇవ్వవలసినదిగా కోరుకున్నాడు. అతను కోరుకున్న వరములను ఇచ్చిన పరమేశ్వరుడు అతనికి చంద్రహాసము అనే ఒక దివ్య ఖడ్గమును ఇచ్చాడు. ఆ ఖడ్గమును భక్తితో పూజించమని, ఒకవేళ దానికి అవమానం జరిగితే అప్పుడు ఆ ఖడ్గం అతని వద్దకు తిరిగి చేరుతుంది అని చెప్పాడు. ఆ షరతునకు అగీకరించిన రావణుడు పరమేశ్వరుని వరములను స్వీకరించి తిరిగి పుష్పక విమానం ఎక్కి తన లంకకు వెళ్ళిపోయాడు. 

ఇక్కడ విషయం మనం చూస్తే, రావణునికి అతనికి అమరత్వం ఉన్నది అని గట్టి నమ్మకం లేదు. కారణం అతనికి అమరత్వం ఉన్నది  అని నమ్మకం ఉంటే అతను తన తరిగిపోయిన ఆయుష్షు గురించి మాట్లాడవలసిన అవసరమే లేదు కదా! కానీ అతను అతని తరిగిపోయిన ఆయుష్షుని తనకు ఇవ్వమని కోరుకున్నాడు. అతని వివేకం పూర్తిగా పోయింది. అతని ముర్ఖత్వం, ఆవేశం, దురుసుతనం, అతను కోరుకున్నది చేయాలనుకునే పట్టుదల అతనికి పెరిగిపోయింది. అతని ఆలోచనలు మరింత క్రూరంగా మారిపోయాయి. 

దశగ్రీవుడు రావణునిగా మారడం అతని పతనమునకు నాంది అని చెప్పవచ్చు. 

11, మార్చి 2022, శుక్రవారం

విదుర నీతి - 12

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు అంతే కాకుండా పండితులకు ఉండే ముఖ్య లక్షణముల గురించి తెలుసుకుందాం! 

సంస్కృత శ్లోకం:

క్షిప్రం విజానాతి ఛిరంశ్రుణోతి, విజ్ఞాయ చార్ధం భజతేన కామాత్

నా సంపృష్ణో వ్యౌపయుంక్తే పరార్ధే, తత్ప్రజ్ఞానం ప్రధమం పండితస్య 

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

వినుటగురూక్త వాక్యమును వేగముజెందక సావధానత్

వినియదిమానసంబున జపించుటపిమ్మట తత్పదార్ధముం

గనుటయుదానగార్యమనఘంబుగజేయుట పృష్టుడయ్యుదా

మునవచియింపకుండుటివి ముఖ్యగుణంబులు కౌరవేశ్వరా!


భావం:

ఏ విషయమును అయినాసరే సులభంగా అర్ధం చేసుకునే గుణం, ఎంతసేపయినా ఎదుటి వారు చెప్తున్న విషయాలను శ్రద్ధగా వినే గుణం, కావాలనుకున్న దానిని కేవలం కోరికతో మాత్రమే కాకుండా ఉచితానుచితములు అలోచించి పొందాలని అనుకునే గుణం, ఇతరుల గురించిన విషయములు అవసరము లేనిదే అడుగని గుణం అనేవి పండితులకు ఉండే ముఖ్య గుణములు.

8, మార్చి 2022, మంగళవారం

దశగ్రీవుని మరణానికి ఒక కారణం నంది శాపమా?

మనం ఇంతకుముందు దశగ్రీవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం! అతని వివాహం, అతని జననం, పక్కవారి ప్రభావం వలన అతను తన విచక్షణా శక్తిని కోల్పొతున్న సందర్భాలగురించి, తెలుసుకున్నాం! కానీ  దశగ్రీవునికి నంది శాపం ఎందుకు ఇచ్చాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం!

తన అన్న కుబేరుని ఓడించిన తరువాత  దశగ్రీవుడు పుష్పక విమానం సొంతం చేసుకుని గర్వంతో విర్రవీగ సాగాడు. అలా ఒకసారి హిమాలయ పర్వతముల మీదుగా వెళ్తూఉండగా అతని విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ముందుకు వెళ్ళలేదు. అలా విమానం ఆగిపోవడనికి కారణం ఏమిటో అర్ధంకాలేదు. అప్పుడు అక్కడికి శివుని భక్తుడు, అనుచరుడు అయిన నంది వచ్చాడు. 

ఆ విమానం అలా అగిపోవడానికి కారణం వారు ఉన్న ప్రాంతం అని, ఆ ప్రాంతంలో పరమేశ్వరుడు పార్వతీ దేవితో సంచారం చేస్తుంటాడు కనుక అక్కడి నుండి ఎవ్వరూ వెళ్ళకూడదు కనుక తన మార్గమును మార్చుకొమ్మని చెప్పాడు. అప్పటికే గర్వం తలకెక్కిన  దశగ్రీవుడు నంది చెప్పిన మాటలను విని, నందిని, అతని సగం మనిషి మరోసగం ఎద్దు రూపమును చూసి ఆ ఎద్దులా ఉన్న ముఖాన్ని చూసి, కోతిలా ఉన్నది అని హేళన చేసాడు. అంతే కాకుండా పరమేశ్వరుడు అనే పేరు అతను ఇంతకు ముందు తన అన్న కుబేరుని వద్ద విని ఉండడం వల్ల అన్నగారి మీద కోపం పరమేశ్వరుని పైకిమారింది, అందువలన అతను కోపంగా ఆ పరమేశ్వరుడు ఎవరు? అని అమర్యాదగా మాట్లాడాడు. 

అతని మాటలకు కోపగించిన నంది అతనిని శపించాడు. అతని శాపం ప్రకారం  దశగ్రీవుడు, అతని జాతి, కోతుల వలన పరాభవం పాలయ్యి, ఆ కోతులే  దశగ్రీవుని మరణానికి కారణం అవుతారు. అతని శాపమును విన్న  దశగ్రీవునికి మరింత నవ్వువచ్చింది. దానికి కారణం అతనికి ఉన్న బ్రహ్మవరం. కానీ అతను తను కోరుకున్నవరంలో అతను మానవులను, కోతులనుండి రక్షణ కోరుకొనలేదు అనే విషయం మరచిపోయాడు. 

6, మార్చి 2022, ఆదివారం

విదుర నీతి - 11

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు. 

సంస్కృత శ్లోకం:

యధాశక్తి చికీర్షంతి యధా శక్తి చ కుర్వతే

న కించిదవమన్యంతే పండితా భరతర్షభ

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

మీరినపనులకొడంబడ, కేరినినిందింపకాత్మ హితకార్యములన్

సైరించుకొనెడుపూరుషు డారయునైహిక సుఖంబు హస్తిపురీశా

భావంః

ఓ భరత వంశ మహారాజా! తన తెలివితో పరణితి కలిగి ఎవరయితే తన శక్తిని అర్ధం చేసుకుని ఆ శక్తికి తగిన పనులు చేస్తాడో, తను చేయగలిగిన ఏ పనిని అయినా చులకనగా అనుకోకుండా ఉంటాడో అతనినే పండితుడు లేదా జ్ఞాని అని అంటారు.

4, మార్చి 2022, శుక్రవారం

దమయంతి స్వయంవరం ఎలా సాధ్యం?

మనం ఇంతకుముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావం నుండి తప్పించ గలిగిన శ్లోకం గురించి,  నలుని గురించి, దమయంతి గురించి,  స్వయంవరానికి బయలు దేరిన నలునికి దేవతలు ఎదురయినప్పుడు నలుడు వారికి ముందుగానే మాట ఇవ్వడం గురించి, నలుడు వెళ్ళి దమయంతిని కలిసి, దేవతల తరపున దూతగా వచ్చిన విషయము గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు దమయంతిదేవి నిర్ణయం గురించి తెలుసుకుందాం!

నలుని మాటలను విన్న దమయంతి అత్యంత ఆవేదన చెందింది. తాను ఎంతగానో ప్రేమించే నలుడు తన వద్దకు ఇటువంటి ప్రస్థావన తీసుకురావడం ఆమెకు అత్యంత బాధ కలిగించింది. ఆమె నలునితో తాను అతనినే వరించానని, హంస రాయభారం పంపి, ఇప్పుడు ఈ విధంగా మరొకరిని వివాహం చేసుకొమ్మని చెప్పడం భావ్యం కాదు అని,  స్త్రీ కి ఉండే సహజ బేలతనం కారణంగా ఆమె కన్నీరు పెట్టుకుంది. అతనినే తన భర్తగా 

 నలుని దౌత్యము విఫలం కాకుండా ఏ మార్గంలో తను నలుని వివాహం చేసుకోవాలో నిర్ణయించికుంది. ఆమె కధనం ప్రకారం ఒక దూత తను చెప్ప వలసిన విషయము చెప్పడం మాత్రమే అతని భాద్యత. నలుడు దూతగా తన భాద్యత పూర్తి చేసాడు. అతని మాటలను పూర్తిగా పాటించ వలసిన అవసరం దమయంతికిలేదు. కనుక ఆమె స్వయంవరంలో నలుడిని మాత్రమే వరిస్తాను అని చెప్పింది. 

3, మార్చి 2022, గురువారం

విద్వత్పద్ధతి - 1

 మనం ఇంతకుముందు భర్తృహరి సుభాషితములలో మూర్ఖ పద్దతి గురించి చెప్పుకున్నాం! ఇప్పటి నుండి విద్వత్పద్ధతి గురించి తెలుసుకుందాం!

శాస్త్రోపస్కృతశాబ్ధసుందరగిరః శిష్యప్రదేయాగమా

విఖ్యాతాః కవయో వసంతి విషయే యస్య ప్రభోర్నిర్ధనాః

తజ్జాడ్యం వసుధాధిపస్య సుధియ స్త్యర్ధం వినాపీశ్వరాః

కుత్స్యాః స్యుః కుపరీక్షకైర్న మణయో యైరర్ఘతః పాతితాః

అర్ధం:

శాస్త్ర గిరం = శాస్త్రములచే, ఉపస్కృత = సంస్కరింప బడిన, శబ్ధ = శబ్ధములచే, సుందర= అందమయిన, గిరః = వాక్కులు గలవారు, శిష్య = శిష్యులకు, ప్రదేయ= ఈయదగిన, చెప్ప గలిగిన, నేర్పగలిగిన, ఆగమాః = శాస్త్రములు కలవారు, విఖ్యాతాః = ప్రసిధ్ధులు నగు, కవయః = పండితులు, నిర్ధనాః= ధన హీనులై, యస్య = ఏ, ప్రభోః = రాజు యొక్క, విషయే = దేశమునందు, వసన్తి = ఉంటారో, తత్= అది, వసుధాధిపస్య= రాజు యొక్క, జాడ్యం= మౌఢ్యము, సుధియస్తు= బుధిమంతులన్ననో, అర్ధం= ధనము, వినాపి=  లేకయే, ఈశ్వరాః = సమర్ధులు, మణయః = రత్నములు, యైః= ఏ, కుపరీక్షకైః = పరీక్ష చేయడం తెలియక, అర్ఘతః = అర్హమయిన వెల, పాతితాః = తక్కువ చెప్పినా, తే= వారు, కుత్స్యాః = తగ్గిన విలువ, మణయః= రత్నములు, న= కావు 

తాత్పర్యంః

వ్యాకరణాదిశాస్త్ర పఠనముచేతనిర్ధుష్టముగను మనోహరముగాపలుకుతూ విధ్యార్ధులకు శాస్త్రంబుల బొధించుచు సుప్రసిధ్ధులయిన పండితులు ఏ రాజు దగ్గర అయినా ధనవిహీనులయి ఉంటే అది ఆ ప్రభువు/ రాజు తెలివి తక్కువ తనమును మాత్రమే తెలుపుతుంది. ఒక రత్నముల గురించి జ్ఞానములేని వర్తకుడు అమూల్య రత్నమునకు తక్కువ వెల చెప్పినందువలన ఆ రత్నమునకు ఉన్న విలువ తగ్గిపోదు కదా!

ఈ శ్లోకమునకు తెలుగు పద్యం

సకలకళా విభూషితులు శబ్ధవిదుల్ నయతత్వబోధకుల్

ప్రకటకవీంద్రు లేనృపతి పజ్జను నిర్ధనులై చరింతు రా

వికృతపుజాడ్య మాదొరది విత్తము లేకయ వారు పూజ్యులం

ధకజనదూషితంబులు ఘనంబులు గావె యంమూల్యరత్నముల్

2, మార్చి 2022, బుధవారం

దశగ్రీవుడు - మండోదరి వివాహం

 మనం ఇంతకు ముందు దశగ్రీవుని గురించి, అతని  మూర్ఖత్వం పక్కన ఉన్నవారి వలన ఏ విధంగా పెరుగుతోందో తెలుసుకున్నాం కదా! పంచకన్యలలో ఒకరయిన మండోదరిని దశగ్రీవుడు ఎలా వివాహం చేసుకున్నాడు అని ఇప్పుడు తెలుసుకుందాం!

దశగ్రీవుడు కుబేరుని గెలిచిన తరువాత అతని పుష్పకవిమానం లాక్కుని గర్వంతో ప్రవర్తిస్తున్న సమయంలో అనుకోకుండా ఒకసారి వారికి దితి పుత్రుడు దైత్యులలో ఒకడయిన మయుడు అతని కుమార్తె మండోదరిని కలిశాడు. 

అప్పుడు మయుడు తన భార్య ఒక అప్సరస  అని, ఆమె కొంతకాలం అతనితో గడిపిన తరువాత మాయావి,దుంధుభి అనే ఇద్దరు పుత్రులను, మండోదరి అనే ఈ పుత్రికకు జన్మను నిచ్చిన తరువాత దేవలోకమునకు వెళ్ళో తిరిగిరాలేదు అని, ఇప్పుడు మండోదరికి వివాహ వయస్సు వచ్చినందు వలన తగిన వరునికోసం చూస్తున్నానని చెప్పాడు. దశగ్రీవుడు కూడా తనని తాను పరిచయం చేసుకున్నాడు. తాను పులస్త్యుని మనుమడిననీ, విశ్రవనుని పుత్రుడననీ తన పేరు దశగ్రీవుడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న మయునికి ఒక ఆలోచన తట్టింది. 

అప్పటికే దశగ్రీవుని గురించి, అతని దుర్వ్యవహారముల గురించి, అతని అన్నతోనే యుద్ధం చేసిన విషయం గురించి అన్నీ తెలిసినా మయుడు తన కుమార్తెను దశగ్రీవునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. ఆ ప్రస్థావనను దశగ్రీవుడు అంగీకరిం చాడు. అప్పుడు అక్కడికి అక్కడే అగ్నిసాక్షిగా వివాహం చేయించాడు. 

1, మార్చి 2022, మంగళవారం

విదుర నీతి - 10

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు. 

సంస్కృత శ్లోకం:

యస్య కృతం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః

 సమృద్ధిరసమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే

యస్య సమ్సారిణీ ప్రజ్ఞా ధర్మార్ధావనువర్తతే

కామాదర్ధం వృణీతే యః స వై పండిత ఉచ్యతే

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

ఏ మనుజుండు పండితసమీడ్యుడు సంసృతిసాగరంబునన్

బాములనెన్ని జెందిన విపక్వమనస్కత ధర్మమర్ధమున్

గామముకంటె శ్రేష్టమని గాంచి మదిన్విడనాడకుండునో

యామనుజుండు తత్వవిదుడండ్రు జనంబులు మానవేశ్వరా! 

భావం:

ఎవరైతే తాను చేసే పనిని చలి, వేడి, భయము, అభిమానము, కలిమి, లేమి అనేవాటికి లోబడి తమ పనిని ఆపకుండా పని చేసుకుంటూ పోతారో వారిని, ఎవరి బుధ్ధి ధర్మార్ధములను కామము కంటే గొప్పది అని మనస్సులో గట్టిగా భావిస్తూ ఉంటాడో అటువంటి వానిని పండితుడు లేదా జ్ఞాని అని చెప్తారు. 

28, ఫిబ్రవరి 2022, సోమవారం

అయోధ్య - సరయు నది పుట్టుక

 సుర్యుని పుత్రుడయిన 14 మంది మనువులలో ఒకరు అయిన వైవస్వత మనువు అతని భార్య శ్రధ్ధాదేవిలకు సంతానం కలుగుట కోసం వసిష్టమహర్షి చేత యజ్ఞం  చేయించారు అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం! ఆ యజ్ఞం జరుగక ముందు కధనం ఇప్పుడు చూద్దాం!

వైవస్వత మనువు తన భార్యతో కలసి అయోధ్యా అనే నగరమునకు నిర్మించారు. వారు యజ్ఞము చేయుటద్వారా సంతానమును పొందాలని అనుకుని గురు వసిష్టుని ఆశ్రయించారు. కానీ పురాణముల ప్రాకారం ఒక యజ్ఞము చేసినందు వలన అత్యంత ఫలితము పొందాలంటే ఆ క్రతువు నీటి దగ్గర జరగాలి. అయోధ్యా నగరం దగ్గరలో ఏవిధమయిన నీటి వనరులు లేవు కనుక  యజ్ఞము చేయాలని అనుకుంటే ముందుగా అయోధ్యా నగరమునకు నీటి వనరులను సమకూర్చవలసిన అవసరం ఉంది. కనుక వసిష్టుడు వైవస్వతునకు తన కర్తవ్యం భోదించాడు. అప్పుడు వైవస్వతుడు తన శరముతో మానససరోవరమునుండి ఒక నదిని బయలుదేరదీశాడు. ఆ నది అయోధ్య పక్కనుండి వెళ్ళేలా ఎర్పాటు చేసాడు. 

ఆ నది పుట్టుక శరం వలన కలిగింది కనుక ఆ నదికి శరయు నది అనీ, మానస సరోవరము నుండి పుట్టినది కనుక ఆ నదికి సరయు నది అనే పేర్లు వచ్చాయి. ఆ నది ఒడ్డున వారు యజ్ఞము చేసి సంతానమును పొందారు.

27, ఫిబ్రవరి 2022, ఆదివారం

నల దమయంతి ల పరిచయం

మనం ఇంతకుముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావం నుండి తప్పించ గలిగిన శ్లోకం గురించి,   నలుని గురించి, దమయంతి గురించి,  స్వయంవరానికి బయలు దేరిన నలునికి దేవతలు ఎదురయినప్పుడు నలుడు వారికి ముందుగానే మాట ఇవ్వడం గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు ఆ సంక్లిష్ట పరిస్థితి నుండి ఎలా బయట పడ్డాడో చూద్దాం!
    ఇంద్రాది దేవతల మాటలు విన్న నలుడు ఆశ్చర్యమునకు గురి అయ్యాడు. తాను కూడా అదే స్వయంవరమునకు బయలుదేరానని చెప్పాడు. అలా ఒకే స్వయంవరమునకు వెళ్తున్న తనతో ఆ రాకుమారి వద్దకు దేవతలను వివాహం చేసుకోవాలని ప్రస్థావన తీసుకుని దౌత్యం చేయడం సమంజసం గా ఉండదు అని తన భావన దేవతలకు వివరించాడు. 
కానీ ఇంద్రాదిదేవతలు అతనిని పరీక్షించడానికే అక్కడికి వచ్చారు కనుక వారు నలుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాడానికే నిర్భందించారు. ధర్మనిరతుడయిన నలుడు దమయంతి దగ్గరకు దేవతల తరపున దూతగా వెళ్ళాల్సిన పరిస్థితి తప్పలేదు. 
అప్పుడు నలునికి మరొక సందేహం కలిగింది. దమయంతి ఒక రాకుమార్తె. ఆమె స్వయంవరమును కూడా ప్రకటించిన ఈ సందర్భంలో ఆమె మందిరంలో కాపలా కొరకు భటులు నిరంతరం ఉంటారు వారిని ఏమార్చి ఆమెవద్దకు ఎలా చేరుకోవాలి? అని. ఆ సమస్యకు దేవతలే ఉపాయం అందించారు. అతను విదేహ రాజ్యములోని దమయంతి రాజ భవనము/ అంతఃపురం ప్రవేశించే సమయంలో అతనిని దేవతల కృపవలన ఎవ్వరూ అడ్డుకొనరు అని దేవతలు వరం ఇచ్చారు. 
ఆ వర ప్రభావం కారణంగా నలుడు సులభంగా దమయంతీదేవి అంతఃపురాన్ని చేరుకున్నాడు. ఆ అంతఃపుర శోభను చూస్తూ ముందుకు నడిచాడు. అతను దమయంతిని చూశాడు. ఆమె అతనిని చూసి ఆశ్చర్యపోయింది. తన అంతఃపురంలోనికి రావడానికి ఎంత ధైర్యం? నలుని రూపలావణ్యముల గురించి ఇంతకు ముందు విని ఉండుట వలన, ఆమె అతని రూపమును చూసి భటులను పిలవకుండా మాట్లాడడం మొదలు పెట్టింది.
అతనికి ఇంతకు ముందు హంస వివరించిన దాని కంటే దమయంతి అతనికి అత్యంత సుందరంగా కనిపించింది.  అతను తనను తాను అమెకు పరిచయం చేసుకున్నాడు. అతను అక్కడికి వచ్చిన కారణం కూడా ఆమెకు వివరించాడు. 
ఇప్పుడు ధర్మసంకటంలో దమయంతి పడింది. ఆమె తాను కోరుకున్న నలుని వివాహం చేసుకుంటే, అతను సరిగా దూత పని చేయలేదన్న అపకీర్తి వస్తుంది, అలాగని ఆమె దేవతలలో ఒకరిని వివాహం చేసుకోలేదు.
మరి ఆమె స్వయంవరం ఎలా జరిగింది? ఆమె నలునికి ఏమి సమాధానం చెప్పి పంపింది? నలుడు దేవతలకు ప్రియంగా దూత కార్యమును చేసినట్లుగా ఎలా అనుకోవాలి? తరువాతి టపాలలో చుద్దాం!

26, ఫిబ్రవరి 2022, శనివారం

మూర్ఖుని సంతోష పెట్టడం కుదురుతుందా!

 మనం ఇంతకు  ముందు భర్తృహరి సుభాషితాలలో మూర్ఖపద్ధతి గురించి, మూర్ఖుని మనస్సు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మరొక శ్లోకం చూద్దాం!

లభేత సికతాసు తైలామపి యత్నతః పీడయన్

పిబేచ్చ మృగతృష్ణి కాసు సలిలం పిపాసార్ధితః

కదా చిదపి పర్యటన్ శశవిషాణమాసాదయే

న్నతు ప్రతినివిష్ట మూర్ఖ జనచిత్తమారాధయేత్


అర్ధం ః  యత్నతః = ప్రయత్నమువలన, సిక తాసుఅపి= ఇసుక నుండి కూడా, తైలం= నూనెను, లభేత = పొందవచ్చును, పిపాస = దాహం వలన, అర్ధితః = నీటిని కోరుకునేవానికి, మృగతృష్ణికాసు = ఎండమావులలో, సలిలం = నీటిని, పిబేత్= త్రాగవచ్చును, పర్యటన్= బాగా తిరిగి తిరిగి, కదా చిదపి= ఒకానొక సమయంలో, శశ = కుందేలు, విషాణం = కొమ్ము, ఆసాదయేత్= పొందవచ్చు, ప్రతినివిష్ట = మొండిపట్టు పట్టిన, మూర్ఖ జన = ముర్ఖుల, చిత్తం=మనస్సును, ఆరాధయేత్= మెప్పించడం, న = కుదరదు. 

తాత్పర్యంః

ప్రయత్నంచేసి ఇసుక నుండి కూడా చమురు/ నూనెను తీయ్యవచ్చు, బాగా దాహంగా ఉన్నప్పుడు ఎండమావిలోని నీటిని త్రాగ వచ్చు, ప్రపంచం మొత్తం తిరిగి తిరిగి కుందేటికొమ్మును కూడా సాధింపవచ్చు కానీ మూర్ఖుని మనస్సును ఎవ్వరూ సమాధాన పరచలేరు.

 ఇదే శ్లోకమునకు తెలుగు అనువాదం 

తెలుగు అనువాదం

తివిరి ఇనుమున దైలంబు దీయవచ్చు

దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు

దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు

జేరి మూర్ఖులమనస్సు రంజింప రాదు

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

పుష్పక విమానం రావణునికి ఎలా లభించింది?

 మనం ఇంతకుముందు దశగ్రీవుడు అత్యంత బలశాలి, సకల శాస్త్రముల జ్ఞానము కలిగి ఉండి కూడ  తన చుట్టూ ఉన్నవారి మాటలు విని తన వివేకాన్ని పూర్తిగా కోల్పోతున్న విధానాన్నిచూసాం! ఇంతకు ముందు భాగంలో మనం దశగ్రీవుని అరాచకాలను గురించి విన్న కుబేరుడు తన తమ్ముని ధర్మమార్గంలోనికి మార్చడానికి ఒక ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నం గురించి, దానికి దశగ్రీవుడు ఎలా స్పందించాడు అని తెలుసుకుందాం!

కుబేరుడు తన తమ్ముని అధర్మ ప్రవృత్తి గురించి తెలుసుకుని, అతనిని మంచి మార్గంలోనికి మార్చడనికి ఒక ప్రయత్నం చేయడనికి ఒక దూతను పంపాడు.  ఆ దూత దశగ్రీవుని వద్దకు వచ్చి, కుబేరుడు అతనికి చెప్పమన్న అన్ని విషయములను చెప్పాడు. కానీ ముందే అధర్మ మార్గంలో ఉన్న దశగ్రీవునికి ఆ మాటలు రుచించలేదు. అంతేకాక ఆ మాటలలో కుబేరుడు తాను పరమశివునకు మిత్రుడని చెప్పడం అతని అహానికి పెద్ద శరాఘాతంగా అనిపించింది. కుబేరుడు తనను హెచ్చరిస్తున్నట్లుగా అతనికి అనిపించింది. దానివలన అతను తన ఆధిపత్యాన్ని చూపించడానికి, కుబేరుని దూతను హతమార్చాడు. అంతేకాక అతను స్వయంగా కుబేరుని పై యుధ్ధాన్ని ప్రకటించాడు. 

అలకాపురి చుట్టూ తన రాక్షససేనను మొహరింపజేసాడు. ఆ సేనను చూసిన యక్షులు కూడా తమ యుధ్ధాన్ని ప్రారంభించారు. యుధ్దం హొరాహోరీగా సాగింది. అనేక మంది యక్షులు తమ ప్రాణాలను కోల్పోయారు.  ధర్మ యుధ్దం చేస్తున్న కుబేరుడు రాక్షస సేనలను తమపురినుండి తరమ సాగాడు. తమ అపజయాన్ని పసిగట్టిన దశగ్రీవుడు మాయా యుధ్ధాన్ని ప్రారంభించాడు. ఆ మాయా యుధ్ధంలో కుబేరుడిని దశగ్రీవుడు ఒడించాడు. అతని దగ్గరి నుండి పుష్పకవిమానమును లాక్కున్నాడు. అప్పటినుండి ఆ పుష్పక విమానం అతని వద్దనే ఉంది. 

24, ఫిబ్రవరి 2022, గురువారం

విదుర నీతి - 9

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఎనిమిది  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు. 

సంస్కృత శ్లోకం:

యస్య కృతం న జానన్తి మన్త్రం మస్త్రితం పరే

కృతమేవాస్య జానన్తి స వై పండిత ఉచ్యతే


శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

పరధనలోలుపుండు భయవంతుడు వృధ్య సమృధివిఘ్న సం

భరితుడు గాక యెవ్వడు స్వమంత్రితమంత్రణ కార్యసంతతిన్

బరుల కఱుంగనీక తనపాలిటికార్యము జక్కజేయునా

నరుడిలబండితుండని జనంబులు మెత్తురు కౌరవేశ్వరా

భావం:

ఇతరుల ధనమును పొందాలని లేని, భయములేని వాడు అయ్యి, తను చేయాలనుకున్న పనులకు చెందిన అలోచనలను ఇతరులకు తెలియకుండా చేస్తూ, కేవలం తన పనుల ద్వారా అతని ఆలోచనలను తెలియ పరుస్తూ ఉంటారో అటువంటి వారినే పండితులు అంటారు.

23, ఫిబ్రవరి 2022, బుధవారం

ఇంద్రాది దేవతలు నలునికి వేసిన ముందరికాళ్ళ బంధం!

మనం ఇంతకు ముందు నలుని గురించి, దమయంతి గురించి, వారి మద్యన జరిగిన హంస రాయభారం గురించి తెలుసుకున్నాం కదా! ఆ తరువాత భీమసేనుడు తన కుమార్తె దమయంతికి స్వయంవరం ప్రకటించారని కూడా చెప్పుకున్నాం!

స్వయంవరానికి భీముడు సకల రాజ్యములకు చెందిన రాజులను అహ్వానించాడు. అందరు రాజులు ఆ స్వయంవరానికి వచ్చేసారు. 

ఆ సమయంలోనే నారదుడు ఆ దమయంతి స్వయంవర వార్తను తీసుకుని స్వర్గమునకు వెళ్ళాడు. దమయంతి సౌందర్యమును, గుణవర్ణనము విన్న తరువాత దేవేంద్రునితో కలిసి అందరు దిక్పాలకులు ఆ స్వయంవరమును చూడడానికి బయలుదేరారు. వారికి నారదుని వలన దమయంతికి సరి అయిన వరుడు నలుడు అని తెలుసుకున్నారు. వారు నలుని ధర్మనిరతిని పరిక్షించాలని అనుకున్నారు. 

వారు స్వయంవరానికి వెళ్తున్న నలునికి ఎదురు వచ్చారు. వారు నలుని చూసి తమను తాము పరిచయం చేసుకోకుండానే తమకు నలునివల్ల ఒక సహాయం కావాలని, నలుడు వారి తరపున దూతగా వెళ్ళాలని కోరుకున్నారు. వారు ఎవరో తెలుసుకోకుండానే వారికి సహాయం  చేస్తాను అని, దూతగా వారి అభీష్టం నెరవేరుస్తాను అని మాట ఇచ్చేసాడు. 

అప్పుడు దేవతలు నలునితో ఇంద్రుడు, తాను ఇంద్రుడననీ, తనతో ఉన్న వారు దిక్పాలకులనీ, వారు దమయంతీదేవి స్వయంవరమునకు వచ్చామనీ, కనుక నలుడు వారి తరపున ఆమె వద్దకు వెళ్ళి, వారి గొప్పతనములను, బిరుదులను, వారి వారి శౌర్య ప్రతాపాలను వివరించి చెప్తే ఆమె వారిలో ఎవరినైనా వివాహం చేసుకొనుటకు అవకాశం దొరుకుతుంది కనుక నలుడిని అలా దౌత్యం జరుపమని కోరుకున్నాడు. 

తాను ప్రేమించి, వివాహం చేసుకోవాలని అనుకున్న అమ్మాయి వద్దకు మరొకరి గురించి దౌత్యం చేయడానికి నలుడు ఒప్పుకున్నాడా? అలా ఒప్పుకోకుండా మాట తప్పాడా? తరువాతి టపాలలో చుద్దాం!

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

మూర్ఖుని మూర్ఖత్వానికి మందు

మనం ఇంతకు ముందు మూర్ఖ పద్దతి అనే శీర్షిక పై కొన్ని శ్లోకములు చెప్పుకున్నాం! ఇప్పుడు మనం ఆ ముర్ఖుని మూర్ఖత్వమునకు మందు అనేది ఉన్నదా లేదా అనే విషయం చూద్దాం!

సంస్కృత శ్లోకం

శక్యో వారయితుం జలేన హుతభుక్ఛత్రేణ సూర్యాతపో

నాగేంద్రో నిశితాఙ్కు శేన సముదో దణ్డేన గౌర్గర్దభః,

వ్యాధిర్భేషజసఙ్గ హైశ్చ వివిధైర్మన్త్రప్రయోగైర్విషం

సర్వస్యౌషధమస్తి శాస్త్రవిహితం మూర్ఖస్య నాస్త్యౌషధం

అర్ధంః 

శక్యః = భరించగలిగిన, సూర్య తపః = సూర్యుని ఎండ, చత్రేణ = గొడుగుతో, హుతభుక్ = నిప్పు, జలేన = నీటిచేత, సమదః = బాగా మదంతో ఉన్న, నాగేంద్ర = ఏనుగు, నిశిత = వాడియగు,  అంకుశేన = అంకుశము చేత, గౌః = ఎద్దు, గార్ధభః = గాడిద, దండేన = కర్రతో, వారయితుం = వారించుట, శక్యః =  వీలగును, వ్యాధిః= రోగము, భేషజ = మందులను, సంగ్రహ = తీసుకొనుట, చ= వలన, విషం = విషము, వివిధైః = అనేక రకములయిన, మంత్ర = మంత్రముల, ప్రయోగైః = ప్రయోగముల వలన, సర్వస్వ= అన్నింటికీ, శాస్త్ర= శాస్త్రములలో,  విహితం= విధించబడిన, ఔషదం= మందు, అస్తి= కలదు, మూర్ఖస్య= మొండి వానికి, నాస్తి= లేదు.

అదే శ్లోకమునకు తెలుగు పధ్యంః

జలముల నగ్ని చత్రమున జండమయూఖుని దండతాడనం

బుల వృషగర్ధభంబులను బొల్పగుమత్తకరీంద్రమున్ సృణిం

జెలగెడురోగ మౌషధముచే విషముం దగు మంత్రయుక్తిని

మ్ముల దగ జక్కజేయు నగు మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే


తాత్పర్యంః

అగ్నికి జలము, ఎండకు గొడుగు, మదగజంబు నకు అంకుశము, ఎద్దు గాడిద మొదలయిన జంతువులకు కర్ర, రోగమునకు రకరకములయిన మందులు, సర్ప విషమునకు చాలా రకములయిన మంత్రములు,  అనేక శాస్త్రములలో నివారణముగా చెప్పబడినవి కానీ మూర్ఖుని యొక్క మూర్ఖత్వమును పోగొట్టగలిగిన ఔషదం ఏ శాస్త్రములోనూ చెప్పలేదు.

21, ఫిబ్రవరి 2022, సోమవారం

దారితప్పిన దశగ్రీవుడు

 మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది  అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది, దశగ్రీవుడు నిజంగా అంత చెడ్డవాడా,  కైకసి కుమారులు  పొందిన వరముల గురించి, అతనిపై ఉన్న చెప్పుడు మాటల ప్రభావాన్ని గురించి తెలుసుకున్నాం కదా! 

ఎంత మంచివారయినా తమ చుట్టూ ఉన్నవారిని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. ఆ విషయం దశగ్రీవుని విషయంలో నిజం అని మనం చూడవచ్చు. అతను తన చుట్టూ తన తాత సుమాలి, అతని మంత్రులు ఉన్నారు.  వారు చెప్పే మాటలు వింటూ కాలం గడుపుతున్న దశగ్రీవునికి వారి అలోచనలలో నుండి అనేక చెడ్డ ఆలోచనలు అతని మెదడులో ఊపిరి పోసుకోసాగాయి. అతని మనస్సులోనికి అరిషట్వర్గములు ప్రవేశించాయి. అతనికి తను సొంతం చేసుకున్న స్వర్ణలంక చిన్నది అనిపించసాగింది. హింస ప్రవృత్తి పెరిగింది. స్వార్ధం పెరిగిపోయింది. అహంకారం మితిమీరి ప్రవర్తించసాగాడు. ఋషులను మునులను భాదించడం మొదలు పెట్టాడు. అతని పద్దతులను, అతని జీవన విధానంలోని మార్పులను తెలుసుకున్న అతని అన్న కుబేరుడు అతనిని మార్చాలని అనుకున్నాడు. మరి అతను ఏమి చేసాడు? దశగ్రీవుడు అన్నగారి మాట విన్నాడా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

20, ఫిబ్రవరి 2022, ఆదివారం

విదుర నీతి - 8

మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఏడు  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగంలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగమునకు కొనసాగింపు. 

సంస్కృత శ్లోకం:

నిషేవతే ప్రశస్తాని నింన్దితాని నసేవతే

అనాస్తికః శ్రద్ధదాన ఏతత్పండిత లక్షణమ్

క్రోధో హర్షశ్చ దర్పశ్చ హ్రీస్తంభో మాన్య మానితా

యమర్ధాన్నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే 


శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

జనహిత కార్య సంతతిని సల్పుచుగ్రోధముగర్వముబ్బుసి

గ్గునుజననింద్యసేవన ముకుత్సితబుధ్దియు నాత్మసంస్తవం

బను నివిలేకదానపరుడై సదయుండును శ్రద్ధధానుడౌ

జనుడిలబండితుండని ప్రశంసకునుక్కును కౌరవేశ్వరా!

భావం:

మంచిపనులు చేయడం, నిందింపదగిన పనులను చేయకుండా ఉండుట, నాస్తికుడుకాకుండా ఉండుట, తాను చేసేపనుల పై శ్రద్ధ కలిగి ఉండుట మరియు కోపమును, మితిమీరిన సంతోషమును, గర్వమును, సిగ్గును, బిడియము, తనకు తానే అధికుడు అనుకోవడము అనే లక్షణములు లేకుండా ఉండే వానిని పండితుడు అంటారు. 

19, ఫిబ్రవరి 2022, శనివారం

దమయంతి -- హంస

మనం ఇంతకు ముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావాన్ని తగ్గించుకునే శ్లోకాన్ని తెలుసుకున్నప్పుడు నలుని గురించిన ప్రస్తావన,  నలునికి హంస దొరకడం గురించి, ఆ హంస దమయంతికి అతని గురించి చెప్తాను అని చెప్పడం గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు దమయంతి గురించి తెలుసుకుందాం!
విదర్భరాజు భీముడు, అతని భార్య కు సంతానం లేదు. వారు దమనుడు అనే మహర్షికి అనేక సపర్యలు, సేవలు చేసి అతని అనుగ్రహాన్ని సంపాదించారు. అప్పుడు వారికి దముడు, దాంతుడు, దమనుడు అనే ముగ్గురు కుమారులు, దమయంతి అని ఒక కుమార్తె కలిగారు. ఆమె అపురూప సౌందర్యవతి, గుణశీలి. ఎలావేళలా ఆమెను కనిపెట్టుకుని ఉండడానికి అమె చుట్టూ అనేకమంది పరిచారికలు ఉండేవారు. వారు నలుని గురించి అనేక విషయములు చెప్తూ ఉండేవారు. వారి వద్ద నుండి నలుని ప్రసంశలు విన్న దమయంతి మనస్సులో నలునిపై ప్రేమ చిగురించింది. 
ఆ సమయంలోనే నలుని దగ్గరి నుండి వచ్చిన హంసల గుంపు ఆమె ఉన్న ఉద్యానవనమునకు వచ్చింది. ఆ హం స ల గుంపును చూసిన ఆమె చెలికత్తెలు వానిని పట్టుకోవాలని ప్రయత్నించసాగారు. అక్కడ జరుగుతున్న కోలాహలం వల్ల హంసలు అటూ ఇటూ పరుగులు పెడుతూ వారికి దొరకకుండా తప్పించుకోసాగాయి. కానీ నలునితో మాట్లాడిన హంస తనకు తానుగా వచ్చి దామయంతీదేవి కి దొరికిపోయింది. అంతేకాక ఆ హంస నలుని ప్రస్తావన తెచ్చి, ఈ భూమండలంమొత్తం మీద ఆమెకు భర్త కాగలిగిన సుందరుడు, రాఅజ కుమారుడూ కేవలం నలుడు మాత్రమే అని అనేక విధములుగా చెప్పింది. ముందే నలుని గురించి ఆలోచనలలో ఉన్న దమయంతికి ఇప్పుడు హంస కూడా అలాగే చెప్పడమ్ వల్ల ఆమె మరింతగా అతని ఆలోచనలలో మునిగిపోయింది. ఆమె చెలికత్తెల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆమె తండ్రి భీముడు ఆమెకు స్వయంవరాని ఏర్పాటు చేసాడు. 
మరి ఆమె తనకు నచ్చిన వరుడిని స్వయంవరంలో వరించిందా? ఆ స్వయంవరం ఎంత విచిత్రంగా జరిగింది? అనే విషయాలు తరువాతి టపాలలో చుద్దాం!

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

నీచుల మనఃస్తత్వం

మనం ఇంతకు ముందు  భర్తృహరి సుభాషితాలలో కొన్ని చెప్పుకున్నాం! ఇప్పుడు మూర్ఖ పద్దతి లో మూర్ఖుడు తన వద్ద ఉన్న నీచమయిన దానిని చూసి తన పక్కన ఉన్న గొప్పవానిని ఎలా నిరాకరిస్తాడో చూద్దాం!

సంస్కృత శ్లోకం

క్రిమికులచితం లాలాక్లిన్నం విగన్థి జుగుప్సితం

నిరుపమరస ప్రీత్యా ఖాద న్ఖరాస్థినిరామిపం

సురపతిమపి శ్వా పార్శ్వస్థం విలోక్య నశఙ్కతే

నహి గణయతి క్షుద్రో జంతుః పరిగ్రహఫల్గుతాం

అర్ధంః

శ్వా = కుక్క, క్రిమి= పురుగుల, కుల= గుంపుచే, చితం= నిండిన, లాలా= లాలాజలంతో, క్లిన్నం = తడిచినది, నిండినది, విగంధి= చెడ్డవాసన కలది, జుగుప్సితం = అసహ్యం కలిగించునది, నిరామిషం= మాంసము లేనిది, ఖర= గాడిద, అస్థి = ఎముక, నిరుపమ= సమానమయినది ఏదీ లేని , రస= రుచి,  ప్రీత్యా= ఇష్టంతో, ఖాదత్= కొరుకుతూ, పార్శ్వస్థం= పక్కనే ఉన్న, సుర= దేవతల, పతిం= నాయకుడు, అపి = అయినను, విలోక్య = చూసినా, న శంకతే= సిగ్గు పడదు, క్షుద్రః = నీచమయిన, జంతుః= ప్రాణి, ప్రతిగ్రహ= తీసుకొన్న, ఫల్గుతాం= తక్కువ తనమును, న గణయతి హి = అస్సలు లెఖ్ఖ చేయదు కదా!

ఈ సంస్కృత శ్లోకమునకు చక్కని తెలుగు పద్యం

క్రిమిసముదాయసంకులము గేవల నింద్యము పూతిగంధ హే 

యమును నిరామిషంబును ఖ రాంగభవం బగునెమ్ము గుక్క దా 

నమలుచు జెంత నున్న సురనాధుని గన్గొని సిగ్గు జెందద 

ల్ప మని నిజస్వభావము దలంపదు నీచపు బ్రాణి యెయ్యెడన్ 

తాత్పర్యంః

కుక్క పురుగులు కలిగిన, నోటినుండి కారు లాలా జలంతో తడిసిన, కంపుకొట్టే, అసహ్యము కలిగించే, మాంసము లేని గాడిద ఎముకను చాలా ఇష్టముగా కొరుకుతూ , తన పక్కనే సాక్షాత్తు ఆ దేవేంద్రుడే వచ్చి నిలిచినా, అతనిని చూడడు, సిగ్గు పడదు. నీచమయిన ప్రాణులు తమకు దొరికిన వస్తువులు నిజంగా నీచమయినవా, గొప్పవా? అని అస్సలు లేఖ్ఖ చేయవు కదా!  

17, ఫిబ్రవరి 2022, గురువారం

విదుర నీతి - 7

  మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఆరు  భాగములు చెప్పుకున్నాం కదా! ఈ భాగంలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు. 

సంస్కృత శ్లోకం:

ఆత్మజ్ఞానం సమారంభస్తితిక్షా ధర్మనిత్యతా

యమర్థాన్నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

తనుదా నెఱుగుటయోరిమి, యునుబేదలకిడుట వేగ మొందమియునులే

నినరులు తగరీపదవికి, వినుజ్ఞానము లేమిదాని విధమెట్లన్నన్


భావం: ఆత్మజ్ఞానము, ప్రయత్నము, దుఃఖములను ఓర్చుకొనగలిగిన శక్తి, ధర్మానికే ఎల్లవేళలా కట్టుబడి ఉండడం అనేవి ఎవరికి తన మార్గంలో ఆటంకములు కావో వారినే పండితులు అంటారు.  

16, ఫిబ్రవరి 2022, బుధవారం

కుబేరుడు శివునితో స్నేహం

మనం ఇంతకు ముందు గుణనిధి గురించి, అతను దొంగగా మారుట,  అతనికి శివలోకం లభించిన విధానం, తరువాత అతను దమనుడు అనే రాజుగా జన్మించి జన రంజకంగా పరిపాలించిన సంగతి ,తరువాత అతను పులస్త్యుని వంశంలో విశ్రవసునికి కుమారునిగా జన్మించడం, అతనికి వైశ్రవణుడు అని పేరు పెట్టడం, అతను దిక్పాలకత్వం పొందడం,  ఆ తరువాత అతనే కుబేరునిగా మారడం గురించి కూడా తెలుసుకున్నాం! అయితే ఆ కుబేరుడు పరమ శివునికి మిత్రుడు అని చెప్తారు. అతనికి పరమ శివునికి స్నేహం ఎలా కుదిరింది?

పార్వతిదేవి శాపానికి గురి అయిన తరువాత కుబేరుడు పశ్చాత్తాపాన్ని పొందాడు. ఆ పశ్చాత్తాపంతో సుదీర్ఘకాలం మౌనవ్రతం చేసాడు. అతని మౌనవ్రతాన్ని చూసి ప్రసన్నుడయిన ప్రమ శివుడు కుబేరిని వద్దకు వచ్చి, అటువంటి కఠినమయిన వ్రతమును పూర్వకాలంలో తాను స్వయంగా చేసానని, మళ్ళీ ఇంతకాలం తరువాత కుబేరుడు చేసాడు కనుక అతనికి తనతో సమానంగా, అతని స్నేహితుని స్థానం ఇచ్చాడు. అంతేకాకుండా అతనికి ఏకాక్షి అని పింగళి అని పేరు ఇచ్చాడు. 

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

సూర్యుడు సంధ్యాదేవి కలయిక - అశ్వినీ దేవతలు

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి, ఆ నిజం తెలుసుకున్న సూర్యుడు తన ప్రభావాని తగ్గించుకుని తన భార్య వద్దకు బయలుదేరాడు అని, సూర్యుని నుండి తొలగించిన ప్రకాశాన్ని ఉపాయోగించి దేవశిల్పి విశ్వకర్మ దేవతలకు అనేకా రకములయిన ఆయుధాలను తయారు చేసాడు అని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు సూర్యుడు సంధ్యాదేవి వద్దకు ఎలా వెళ్ళాడు? అప్పుడు ఏమి జరిగింది అని తెలుసుకుందాం!

తన భార్య ఎక్కడ ఉన్నదో ముందే తెలుసుకున్న సూర్యుడు తన ప్రకాశాన్ని తగ్గించుకున్న తరువాత ఆమె వద్దకు ఉత్తరకురుదేశమునకు బయలుదేరాడు. ఆమె ఆడగుర్రం రూపంలో ఉన్నది కనుక అతనుకూడా మగ గుర్రం రూపాన్ని ధరించి అమె వద్దకు వెళ్ళాడు. అలా తన వద్దకు వచ్చిన భర్తతో అమె ఇద్దరు కుమారులను (కవల పిల్లలు) కన్నది. అయితే వారు గుర్రం రూపంలో ఉండగా వారికి సంతానం కలిగింది కనుక ఆ ఇద్దరిని అశ్వినులు అని పిలిచారు. వారే దేవవైద్యులుగా ప్రసిద్ది పొందారు. ఆ తరువాత సూర్యునికి, సంధ్యాదేవికి రేవతుడు అని ఒక కుమారుడు జన్మించాడు. అతను సకల శస్త్రాస్త్రకోవిదుడు. 

14, ఫిబ్రవరి 2022, సోమవారం

భారత సాహిత్యం - కొన్ని చిత్రమయిన ప్రక్రియలు

 భారతదేశంలో సాహిత్యానికి, సాంప్రదాయాలకు ఉన్న ప్రాముఖ్యత మనకు అందరికి చాలా బాగా తెలుసు. మన దేశంలోని అనేక బాషలలో మన పురాణ ఇతిహాసములు అనువదించబడినా అందరూ ముక్తకంఠంతో నమ్మే విషయం ఆ పురాణములు, ఇతిహాసములు మొదటగా చెప్పబడినది దేవ బాష అయిన సంస్కృతంలోనే. మన దేశంలో ఉన్న అనేక  బాషలలో అనేక ప్రక్రియలపై ప్రయోగములు చేస్తూ, మన పండితులు కీర్తిని గడిస్తూ ఉండడం మనం చూశాం. ఇటీవలి కాలంలోనే మన తెలుగు బాషకు ప్రత్యెకమయిన అవధానంలో పేరెన్నిక గన్న శ్రీ గరికిపాటి నరసింహారావు గారిని పద్మశ్రీ వరించడం మనం చూశాం.  

అటువంటి సాహిత్య ప్రక్రియలు మనకు ఎన్నో ఉన్నాయి. వానిలో కొన్ని

  1. అనులోమ విలోమ కావ్యములు - ఇటువంటి కావ్యములలో ఒక శ్లోకమును ముందు నుండి చివరి వరకు చదివితే ఒక అర్ధం వస్తుంది, చివరి నుండి మొదటికి చదివితే మరొక అర్ధం వస్తుంది. ఇటు వంటి కావ్యములకు ఉదాహరణగా రాఘవయాదవీయం చెప్తారు. 
  2. ద్వర్ధి కావ్యములు- ఇటువంటి కావ్యములలోఒక శ్లోకమునకు రెండు రకముల అర్ధము చెప్తూ, ఆ రెండు అర్ధములతో రెండు విభిన్నములయిన కధలను చెప్పడం.  ఇటు వంటి కావ్యములకు ఉదాహరణగా హరిశ్చంద్రనలోపాఖ్యానం, రాఘవపాండవీయం చెప్తారు. 
  3. ఏకాక్షరి శ్లోకములు ః ఒక శ్లోకములో, లేదా పద్యములో ఒకేఒక్క అక్షరం మాత్రం ఉపయోగించి చెప్పవలసిన అర్ధం వచ్చేవిధంగా చెప్తారు. ఇటువంటి శ్లోకములు మనం త్వరలోనే చూద్దాం!
  4. కేవలం రెండు అక్షరములు మాత్రం ఉపయోగించి చెప్పవలసిన అర్ధం వచ్చేవిధంగా చెప్తారు. ఇటువంటి శ్లోకములు కూడా మనం త్వరలోనే చూద్దాం!
సాహిత్యంలో ఇవి కొన్ని ప్రక్రియలు మాత్రమే. ఇంకా ఎన్నెన్నో ఉన్నయి. 

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

ఉన్నతులు దిగజారడం మొదలయితే....

 ఒక్కసారి పతనం అవ్వడం మొదలయితే అది ఎక్కడివరకు వెళుతుందో చెప్పే శ్లోకం. ఈ శ్లోకం మన ప్రవచన కర్తలు  చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు మనం సంస్కృత శ్లోకాన్ని, దానికి చెందిన తెలుగు అనువాద పద్యమును చూద్దాం!

సంస్కృత శ్లోకం

శిరశ్శార్వం స్వర్గాత్పశుపతిశిరస్తః క్షితిధరం

మహీధృదుత్తుఙ్గాదవనియవనేశ్చాపి జలధిమ్

అధో గఙ్గా నేయం పదముపగతా స్తోక మధవా

వివేకభ్రష్టానాం భవతి వినిపాతః సతముఖః

అర్ధంః 

సా ఇయం గంగా= ఎంతో ప్రముఖ్యత కలిగిన గంగా నది, స్వర్గాత్= స్వర్గము నుండి, శార్వం = శివుని, శిరః= శిరస్సు, పశుపతి శిరస్తః =శివుని శిరస్సు నుండి, క్షితిధరం = హిమాలయ పర్వతమును, ఉత్తుంగాత్= ఎత్తయిన, మహిధ్రాత్= ఆ కొండ నుండి, అవనిం= భూమిని, అవనేః చ అపి, భూమి నుండియు, జలధిం= సముద్రమును,అధః = క్రింద, పాతాళమునకు, స్తోకం = కొంచెం, పదం = చోటును, ఉపగతా = పొందినది, అధవా = అలా కాక. వివేక భ్రష్టానాం= తెలివి మాలిన వారికి, శతముఖః= నూఱుత్రోవలుగల, వినిపాతః = అధోగతి, భవతి= కలుగుతున్నది.


అదే శ్లోకమునకు తెలుగు పధ్యంః

ఆకాశంబుననుండి శంభునిశిరం బందుండి శీతాద్రి సు

శ్లోకంబైనహిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య

స్తోకాంభోధి బయోధినుండి పవనాం ధోలోకముం జేరె గం

గా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్టసంపాతముల్


తాత్పర్యంః

గంగానది మొదట ఆకాశము నుండి ఈశ్వరుని తలపైనికి, అక్కడి నుండి హిమాచల పర్వతము మీదికి, ఆ పర్వతము మీది నుండి భూమి మీదకు, అక్కడి నుండి సముద్రములోనికి, అక్కడి నుండి పాతాళమునకు వచ్చినది. గొప్ప స్థితిలో నుండి జారిన వారికి అనేక రకములయిన కష్టములు కలుగుతాయి.


12, ఫిబ్రవరి 2022, శనివారం

విదుర నీతి - 6

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఐదు  భాగములు చెప్పుకున్నాం కదా! ఐదవ భాగంలో విదురుడు ధర్మారాజు గుణములను వివరించాడు. ఇప్పుడు అతను తమ రాజ్యంలో పరిస్థితిని వివరిస్తున్నాడు. 

సంస్కృత శ్లోకం:

దుర్యోధనే సౌబలే చ కర్ణే దుఃశాసనే తథా

ఏతేష్వైశ్వర్యమాధాయ కథం త్వం భూతిమిచ్ఛసి


శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

శకునిరాధాత్మజాత దుశ్శాసనాగ్ర, జాతుదుర్యోధనాది శీర్షంబులందు

రాజ్యమిడిసిరిగోర గౌరవమహీశ తలచితివి కాని చెల్లదధర్మలగుట


భావం: దుర్యోధనుడు, సౌబల రాజయిన శకుని, కర్ణుడు, దుశ్శాసనులపై రాజ్యభారమును ఉంచి, ఇంకా మంచి జరగాలని నీవు ఏవిధంగా అనుకొంటున్నావు?

విశ్లేషణః

ఇంతకుముందు భాగంలో విదురుడు ధర్మరాజు మంచితనం, ఉదారత, అతను పెదతండ్రి స్థానంలో ఉన్న దృతరాష్టునికి ఇచ్చే గౌరవం, అటువంటి ధర్మరాజును దృతరాష్టుడు వివక్షతతో చూడడం చెప్పి, ఇక్కడ అతను ఎవరికోసం అలా చేస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. దుర్యోధనుడు స్వభావరిత్యా ఎలాంటి వాడయినా అతని చుట్టూ ఉన్నవారు అతనిని మంచి మార్గంలో నడిపేవారు కాదు. అతని మీద శకుని దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్ణుని చూసుకుని అతని అహంకారం మరింత పెరుగుతూ ఉంటుంది. ఇక తమ్ముడయిన దుశ్శాసనుడు అన్నగారు ఏమి చెప్తే అది తప్పకుండా పాటిస్తాడు. ఇలా అతని చుట్టూ ఉన్న ఈ ముగ్గురివల్ల అతని పొగరు, అహంకారం మరింత గా పెరుగుతూ ఉన్నప్పుడు, వీరి సంరక్షణలో రాజ్యం సుఖంగా ఉండే అవకాశం లేదు.  

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

దేవశిల్పి - దేవతల ఆయుధాలు

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, యమునికి చాయాదేవి ఇచ్చిన శాపం గురించి, ఆ శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి, ఆ నిజం తెలుసుకున్న సూర్యుడు తన ప్రభావాని తగ్గించుకుని తన భార్య వద్దకు బయలుదేరాడు అని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

సూర్యుని నుండి తొలగించిన ప్రకాశాన్ని దేవశిల్పి విశ్వకర్మ కొన్ని విచిత్రమయిన శక్తివంతములయిన ఆయుధాలను, వాహనాలను తయారు చేయడానికి ఉపయోగించాడు. అలా తయారుచేయబడిన వస్తువులు

  1.  విష్ణుమూర్తి సుదర్శన చక్రం, 
  2. పరమశివుని త్రిశూలం, 
  3. కుమారస్వామి శక్తి ఆయుధం,
  4. యముని దండం
  5.  వసువులకు శంఖములు,
  6. అగ్నికి రధము,
  7.  కుబేరునికి పుష్పకము మరియు కొందరు దేవతల ఆయుధములు తయారుచేసెను. 
అంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రం, పరమశివుని త్రిశూలం కూడా సూర్యుని తగ్గించబడిన ప్రకాశంనుండి తయారు చేశారంటే సుదర్శన చక్రం, త్రిశూలంకి ఉన్న శక్తి అపరిమితం కాదా! మన పురాణాల ప్రకారం సుదర్శన చక్రం, త్రిశూలల శక్తి అపరిమితం, వానిని కేవలం విష్ణుమూర్తి , పరమశివులు మాత్రమే సంధించగలరు. మరి ఇక్కడ మనం నేర్చుకున్నదానికి, నిజానికి ఉన్నతేడాను ఎలా అర్ధం చేసుకోవాలి? తరువాతి టపాలలో చూద్దాం!

10, ఫిబ్రవరి 2022, గురువారం

నలుడు -- హంస

 మనం ఇంతకు ముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావాన్ని తగ్గించుకునే శ్లోకాన్ని తెలుసుకున్నప్పుడు నలుని గురించిన ప్రస్తావన చూశాం! మరి ఆ నలుడు ఎవరు? అతనికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉన్నది? అని ఇప్పుడు తెలుసుకుందాం!

నిషాద రాజ్యమునకు రాజు వీరసేనుడు. అతని కుమారుడు నలుడు. నలునికి విదర్భ రాజ పుత్రిక అయిన దమయంతి గురించి అనేక విషయములు తెలుస్తూ ఉండుటవలన ఆమె అంటే అతనికి ప్రేమ కలిగింది. 
ఒకరోజు నలుడు తన ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా అతనికి ఆకాశంలో తిరుగుతున్న హంసల గుంపు కనిపించింది. వానిని వెంబడిస్తూ వెళ్ళిన అతను ఒక హంసను పట్టుకున్నాడు. మిగిలిన హంసలు అక్కడి నుండి ఎగిరి పోయాయి కానీ ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. 
నలునికి పట్టుబడిన హంస అతని మనస్సులో ఉన్న దమయంతి పై ప్రేమను గమనించి, నలుడు ఇప్పుడు తనను వదిలితే తను వెళ్ళి దమయంతికి అతని గురించి గొప్పగా చెప్తానని మాట ఇచ్చింది. దమయంతి పేరు విన్న నలునికి తిరిగి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేకుండానే ఆ హంసను వదలి పెట్టాడు. ఆ తరువాత ఆ హంస నిజంగా దమయంతి దగ్గరకు వెళ్ళిందా లేదా? వెళితే ఏమి చెప్పింది? దమయంతికి నలుని పైన ప్రేమ కలిగిందా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

9, ఫిబ్రవరి 2022, బుధవారం

చ్యవన మహర్షి - నామకరణం

మనం ఇంతకుముందు చ్యవన మహర్షి సుకన్యను ఎలా వివాహం చేసుకున్నారు అని, అతనికి తిరిగి యవ్వనం ఎలా వఛింది అని తెలుసుకున్నాం కదా! ఇంతకీ ఈ చ్యవన మహర్షి ఎవరు? ఎవరి పుత్రుడు? అతనికి ఆపేరు ఎందుకు పెట్టారు అని ఇప్పుడు తెలుసు కుందాం!

పూర్వకాలంలో భృగువు అనే మమర్షి ఉండేవాడు. అతను అనేక యజ్ఞములు, యాగములు చేస్తూ ఉండేవాడు. ఆ యాగములను ఆపాలని దమనుడు అనే దైత్యుడు అనుకున్నాడు. ఒకరోజు సాయంకాల సమయం లో భృగువు అడవిలోనికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆశ్రమంలో కేవలం అతని గర్భవతి అయిన భార్య మాత్రమే ఉన్నది. ఆశ్రమం  లో ఎవ్వరూ కనిపించక ఆ దమనుడు ఋషి, అతని భార్య ఎక్కడ ఉన్నారు అని గద్దించి అడుగగా, భయపడిన ఆగ్నిదేవుడు అతనికి గర్భవతి అయిన ఋషిపత్ని ఉన్న వైపును తన జ్వాలలతో చూపాడు. అప్పుడు దమనుడు అ ఋషిపత్ని జుట్టు పట్టుకుని బయటకు లాక్కొని వచ్చాడు. 

అలా బయటకు లాగుకొని వస్తున్న సమయంలో ఆఅ మె గర్భం నుండి శిశువు బయటకు వచ్చాడు. అతను వచ్చీ రాగానే ఆ ప్రదేశమంతా ప్రకాశం నిండిపోయింది. ఆ బాలుడు తన తల్లిని బయటకు లాగుతున్న దమనుని కోపంగా చూడగానే అతను అక్కడికక్కడే భస్మం అయి పోయాడు. 

ఆ బాలుడు గర్భం నుండి చ్యుతుడు అయిన కారణంగా అతనికి చ్యవనుడు అని పేరు పెట్టారు.

8, ఫిబ్రవరి 2022, మంగళవారం

శ్రీకృష్ణదేవరాయలు - నమస్కారం


శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవుల గురించి మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా! తన ఆస్థానంలో కావులకు స్థానం కల్పించి వారిని పోషించుటే కాక శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆయన  ఆముక్తమాల్యద అనే ప్రబంధమును రచించారు. ఈ గ్ర్రంధము గోదాదేవి గురించిన కధను చెప్తుంది. ఆ ప్రబంధము మొదలుపెడుతూ శ్రీకృష్ణదేవరాయలు మొట్టమొదటగా చెప్పిన పధ్యం మనం ఇప్పుడు చెప్పుకుందాం!


శ్రీ కమనీయ హారామణిం జెన్నుగ దానును గౌస్తుభంబునం

దాకమలావధూటియు నుదారత దోప బరస్పరాత్మలం

దాకలితంబు లైన తమ యాకృతులచ్ఛత బైకి దోపన

స్తోకత నందు దోచె నన శోభిలు వేంకటభర్త గొల్చెదన్


అర్ధం ః

శ్రీ = లక్ష్మిదేవి, కమనీయ = అందమయిన, హార= హారమందలి, మణిన్‍= రత్నంలో, చెన్నుగ= గొప్పగా, తానును = తను, కౌస్తుభం = కౌస్తుభ మణి, నందు= లోపల, ఆ = ఆ, కమలావధూటియును = లక్ష్మీదేవియును, ఉదారత = గొప్పగా,తోపన్= ప్రతిబింభించగాఅ, పరస్పర = ఒకరికొకరు, ఆత్మలందు= హృదయము/ మసస్సులలో, ఆకలితంబులైన = ప్రేమగా నిలచి ఉన్న, తమ = తమ ఇద్దరి, ఆకృతులు = ఆకారములు, అచ్ఛతన్= శరీరముల స్వచ్ఛత చేత, పైకి తోపన్= పైకి కనిపిస్తూ ఉండగా, అస్తోకతన్= ఆధిక్యము వలన, అందున్= ఆ రత్నములందు, తోచె = కానవచ్చెను,  అనన్ = అన్నట్లుగా, శోభిలు = ప్రకాశిస్తున్న, వేంకటభర్తన్ = వేంకటేశ్వరస్వామిని, కొల్చెదన్= నమస్కరిస్తాను. 


తాత్పర్యంః

లక్ష్మీదేవియొక్క సుందరమయిన కంఠహారమందలి మణియందు వేంకటేశ్వరుడు, అతని కౌస్తుభమణిలోలక్ష్మీదేవి ప్రతిబింబించగా, పరస్పరము వారి మనస్సులందు ప్రేమాతిశయముచేత నిలచి ఉన్న తమ ఇద్దరి ఆకారములును శరీరము స్వచ్ఛముగా ఉండుట వలన బహిః ప్రకాశములై కనిపిస్తున్నశ్రీ వేంకటేశ్వరస్వామికి నమస్కరిస్తున్నాను. 


7, ఫిబ్రవరి 2022, సోమవారం

సంధ్య- ఛాయ- సూర్యుడు- విశ్వకర్మ

  మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, యమునికి చాయాదేవి ఇచ్చిన శాపం గురించి, ఆ శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

తన భార్య పిల్లలమీద వివక్ష చూపడానికి కారణం తెలుసుకోవడానికి సూర్యుడు తిన్నగా ఛాయాదేవి వద్దకు వెళ్ళి ఆమె పిల్లల మధ్య అలా ఎందుకు వివక్ష చూపుతోందో అని అడిగాడు. ఆమె సూర్యునికి సరి అయిన సమాధానం చెప్పలేక పోవాడాన్ని గమనించిన సూర్యునికి అమె పై అమితమైన కోపం వచ్చింది. అప్పుడు అతను ఆమెను శపిస్తానని అన్నాడు. సూర్యుని మాటలకు భయపడి, ఆమె సంధ్యాదేవికి ఇచ్చిన మాట ప్రకారం ప్రాణ సంకట సమయంలో నిజమును చెప్పవచ్చు అని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు తన ప్రాణములకు సంకటం ఉన్నది అని గమనించి ఆమె నిజాన్ని అతనికి తాను సంధ్యాదేవిని కానని, ఆమె తయారు చేసిన ఒక ఛాయను మాత్రమే అని, సంధ్యాదేవి చాలాకాలం క్రితమే తనను అక్కడ ఉంచి వెళ్ళిందనీ, సావర్ణి, శనైశ్చరుడు తన పిల్లలు అని చెప్పింది.  

ఛాయాదేవి చెప్పిన  విషయాలను విన్న సూర్యుడు సంధ్యాదేవి ఇంకా పుట్టింట్లోనే ఉన్నది అనే ఆలోచన వల్ల మామగారయిన దేవశిల్పి విశ్వకర్మ దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. సూర్యుడు చెప్పిన విషయాలను విన్నవిశ్వకర్మ, కొంతకాలం క్రితం  తన కుమార్తె తన వద్దకు వచ్చిందనీ,  వచ్చినప్పుడు ఆమె సుర్యుని వేడిని తాను భరించలేక పోతున్నందున అలా వచ్చినట్లు చెప్పిందని, ఆమెకు నచ్చజెప్పి ఆమెను తిరిగి పంపానని, ఆమె అప్పుడే తన వద్ద నుండి తిరిగి వెళ్ళి పోయిందని చెప్పాడు. అప్పుడు ఆమెకు ప్రియం కలిగించేలా సూర్యునికి అతని వేడిని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తానని  దేవశిల్పి విశ్వకర్మ చెప్పాడు. మామగారు చెప్పిన మాటలు విన్న సూర్యుడు  అతను చెప్పిన మాట ప్రకారం  ఒక భ్రమియంత్రంలో ప్రవేశించి అతని ప్రకాశమును 16వ వంతునకు తగ్గించుకున్నాడు.

ఆ తరువాత సూర్యుడు స్వయంగా తన దివ్య దృష్టి ద్వారా తన భార్య సంధ్యాదేవి ఎక్కడ ఉన్నదో తెలుసుకుని, ఆమె  వద్దకు వెళ్ళాడు. 

6, ఫిబ్రవరి 2022, ఆదివారం

నిజమయిన జ్ఞానం

మనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తామో, మనకు ఏమీ తెలియనప్పుడు అంతా తెలిసినట్లు ఎలా ప్రవర్తిస్తామో, వివరించి చెప్పే చక్కని సంస్కృత శ్లోకం, దానికి తగిన తెలుగు పద్యం ఇప్పుడు చూద్దాం! 

సంస్కృత శ్లోకం

యదా కించిత్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం

తధా సర్వజ్ఞోస్మీత్యభవ దవలిప్తం మమ మనః

యదా కించిత్కించితిద్భుధజనసకాశాదవగతం

తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః

అర్ధంః

అహం = నేను, యదా= ఎప్పుడు, కొంచిద్ జ్ఞ= తక్కువ జ్ఞానం కలిగిన వాడు, గజఏవ= ఏనుగు వలే, మదఅంధ= గర్వము వల్ల కళ్ళు మూసుకుని పోయిన వాడు, సమభావం = ఉంటినో, తధా= అప్పుడు, సర్వజ్ఞ= అన్నీ తెలిసిన వాడు, అస్మిఇతి = అయితిని, మమ = నా యొక్క, మనః= మనస్సు, అవలిప్తం= గర్విం, అభవత్= కలిగినది, యదా= ఎప్పుడు, కించిత్ కించిత్ = కొంచెం కొంచెం, బుధ జన= పండితుల, సకాశాత్= దగ్గరి నుండి, అవగతం = తెలిసిన తదా=అప్పుడు, మూర్ఖ = మూర్ఖుడిని, అస్మిఇతి= అయ్యాను, జ్వర= జ్వరము, ఇవ = వలే, మే = నా, మదః= గర్వము, వ్యపగతః= పోయినది

ఈ సంస్కృత శ్లోకమునకు చక్కని తెలుగు పద్యం

తెలివి యొకింత లేనియెడదృప్తుడ నై కరిభంగి సర్వమున్

దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి యిప్పుడు

జ్జ్వలమతు లైనపండితుల సన్నిధినించుక భోధశాలి నై

తెలియనివాడనై మొలగితిం గతమయ్యె నీతాంతగర్వమున్

తాత్పర్యంః

నేను కొద్దిగా జ్ఞానం ఉన్నప్పుడు, మనస్సులో గర్వం కలిగి, కళ్ళు మూసుకుని పోయి, గజం వలే ఉన్నాను, తరువాత పండితుల సహచర్యం వల్ల, కొద్ది కొద్దిగా జ్ఞానం కలిగిన తరువాత, నిజంగా నేను ఎంత మూర్ఖుడినో తెలిసింది.  నా మనస్సులోని గర్వం ఒక జ్వరం లా విడిపోయింది. 

5, ఫిబ్రవరి 2022, శనివారం

విదుర నీతి- 5

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో నాలుగు భాగములు చెప్పుకున్నాం కదా! నాలుగవ భాగంలో దృతరాష్ట్రుడు చెప్పిన సమాధానం చూశాం కదా! ఇప్పుడు ఆ తరువాత విదురుడు చెప్పిన మాటలు తెలుసుకుందాం!


సంస్కృత శ్లోకం:

రాజా లక్షణసంపన్నస్త్రైలోక్యస్యాధిపో భవేత్

ప్రేష్యస్తే ప్రేషితశ్చైవ దృతరాష్ట్ర యుధిష్టిరః

విపరీత తరశ్చ త్వం భాగధేయే న సమ్మతః

అర్చిషాం ప్రక్షయాచ్ఛైవ ధర్మాత్మాధర్మకోవిదః

ఆనృశంస్యాదనుక్రోశాద్ధర్మాసత్యా త్పరాక్రమాత్

గురుత్వాత్త్వయి సంప్రేక్ష్య బహూన్ల్కేశాంస్థితిక్షతే


శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః 

అనవిదురుండుపల్కెసకలావనినాధుడు ధర్మకోవిదుం

డును శుభమూర్తి స్వచ్ఛయశుడు జితసత్యుడు ధర్మరాజుగా

నని నిను రాజ్యమూనుటకనర్హుని గా మదిదా నెఱింగిస

త్యనయదయానృశంస్యపరుడై భువినీకిడి గాసి నొందడే

భావం: దృతరాష్ట్రుడు చెప్పిన మాటలు విన్న విదురుడు "ఓ రాజా! ఎంతో గొప్ప లక్షణములు ఉన్న యుధిష్టరుడు సకల లోకములకు ప్రభువు కాగలిగిన వాడు, నీ మాటలను శ్రద్ధగా విని ఆచరించే వాడు. కానీ అతనిని నీవు అడవులకు పాంపావు. నీవు ధర్మం తెలిసిన వాడవు, కానీ కంటిచూపు లేని నీవు అతని విషయంలో నిజంగానే గుడ్డివానిలా ప్రవర్తించి, అతని రాజ్యమును తిరిగి ఇవ్వడానికి నిరాకరించావు. అజాతశత్రువయిన అతను దయ, ధర్మ,సత్య,పరాక్రమములు కలిగి ఉన్నప్పటికీ నీ పైన ఉన్న గౌరవ మర్యాదల కారంణం గా అన్నింటినీ భరిస్తున్నాడు "

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

యముని శాప పరిష్కారం

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ  గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

తల్లితో శపించబడిన యముడు, తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా వివరించాడు. యముడు చెప్పిన మాటలు విన్న వివస్వంతుడు / సూర్యుడు ఆలోచించాడు.  యమునికి సంధ్యాదేవి ఇచ్చిన శాపమును తప్పించే అవకాశం లేనందువలన సూర్యుడు ఆతనికి మధ్యేమార్గంగా ఒక వరం ఇచ్చాడు. అతని తల్లి ఇచ్చిన శాప కారాణంగా యముని కాలు  భూమిపై పడాలి, దానికి సూర్యుడు యముని కాలులోని మాంసమును క్రిములు తీసుకుని భూమిపైకి వెళతాయి అని, అలా జరగడం వలన అతని కాలులోని మాంసం భూమి పైకి వెళ్ళిన కారణంగా యమునికి పుర్తిగా శాప విమొచనం కూడా కలుగుతుంది అని చెప్పాడు. ఆ పరిష్కారం విన్న యముడు తన అవేశమును తగ్గించుకుని వెళ్ళిపోయాడు. 

ఒక తల్లి తన బిడ్డలందరినీ సమానంగా చూస్తుంది. కానీ తన భార్య ముందు పుట్టిన పిల్లలు, తరువాత పుట్టిన పిల్లల మధ్య భేదం ఎందుకు చూపుతోందో అర్ధం కాలేదు. ఆ విషయాన్ని తెలుసుకోవడనికి  సూర్యుడు తన భార్య వద్దకు బయలుదేరాడు. 

మరి తరువాత ఏం జరిగింది? నిజం బయటపడిందా, లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

3, ఫిబ్రవరి 2022, గురువారం

మూర్ఖుడిని మాటలతో మార్చడం వీలవుతుందా!

మనం ఇంతకు  ముందు భర్తృహరి సుభాషితాలలో మూర్ఖపద్ధతి గురించి, మూర్ఖుని మనస్సు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మరొక శ్లోకం చూద్దాం!

వ్యాళం బాలమృణాళితన్తుభింసౌ రోద్ధుం సముజ్జృమ్భ తే

భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమప్రాంతేన నన్నవ్యాతి

మాధుర్యం మధుబింధునా రచయితుం క్షారాంభుధే రిహతే

మూర్ఖాన్యః ప్రతినేతుమిచ్ఛతి బలాత్సుక్తైః సుధాస్యందిభిః

అర్ధం ః  వ్యాళం = మదపుటేనుగును, బాలమృణాలతంతుభిః =లేత తామర తూటిలోని దారములతో,రోద్ధుం =కట్టుటకు, సముజ్జృంభతే = ప్రయత్నించును,భేత్తుం = పగులగొట్టుట/ కోయుట,వజ్ర మణిం= రత్నములలో శ్రేష్టమయిన వజ్రమును, శిరీష కుసుమ = దిరిసెనపువ్వు యొక్క, ప్రాంతేన = అంచుతో, సన్నహ్యతి = పూనుకొనుట,మాధుర్యం = తియ్యదనం,మధు = తేనె, బింధునా= చుక్కతో,  రచయితుం = చేయుటకు,క్షారాంబుధేః =ఉప్పు సముద్రమునకు,  ఈహతే = ప్రయత్నిస్తాడో, మూర్ఖాన్= మూర్ఖులను, బలాత్= బలవంతంగా. ప్రతినేతుం = మార్చాలని, ఇచ్ఛతి = అనుకుంటాడో, అసౌ= అతడు,  యః = ఎవడు, సుధాస్యందిభి = తీయ్యని, సూక్తిభిః = మంచి మాటల చేత, 

తాత్పర్యంః

మదపుటేనుగులను తామరతూటిదారముతో బందించాలని అనుకునే వాడు, దిరిసెనపువ్వుకొన చేత వజ్రమును కోయాలని అనుకునే వాడు, సముద్రంలోగల ఉప్పు నీటిని తియ్యాగా మార్చాలని అనుకుని దానిలో ఒక్క తేనెచుక్కను వేసే వాడు, మూర్ఖుని మనస్సును మంచి మాటలతో మార్చాలని అనుకునే వాడు అందరూ సమానం. 


 ఇదే శ్లోకమునకు తెలుగు అనువాదం 

తెలుగు అనువాదం

కరిరాజు బిసతంతుసంతతులచే గట్టన్ విజృంభించువా

డురువజ్రంబు శిరీషపుష్పములచే నూహించు భేదింపదీ

పురచింపన్ లవణాబ్ధిన్ మధుకణంబుం జిందు యత్నించు ని

ద్ధరణిన్ మూర్ఖులు దెల్ప నెవ్వడు సుధాధారనుకారోక్తులన్

2, ఫిబ్రవరి 2022, బుధవారం

విదుర నీతి - 4

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో మూడు భాగములు చెప్పుకున్నాం కదా! మూడవ భాగంలో విదురుడు దృతరాష్టృని అదిగిన ప్రశ్నల గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు ఆ ప్రశ్నలకు దృతరాష్టృడు సమాధానం ఇచ్చాడా లేదా? అని తెలుసుకుందాం!

సంస్కృత శ్లోకం:

శ్రోతుమిచ్ఛామి తే ధర్మ్యం పరం నైఃశ్రేయసం వచః

అస్మిన్రాజర్షివంశే హి త్వమేకః ప్రాజ్ఞసంమతః

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః 

అనవిని ధృతరాష్టృండనె, విను కౌంతేయాగృజోక్తివినకునికంజిం

తనుజెంది ధర్మమునీ,లిని రాజర్షికులవర్య తెలియంజెపుమా

భావంః

విదురుని మాటలు విన్న దృతరాష్టృడు, కౌంతేయ పుత్రులలో పెద్దవాడయిన ధర్మరాజు మాటలు (సమాధానం) సంజయుడు చెప్పనందువల్ల కలిగిన ఆలోచన కారణంగా, ఈ రాజర్షికులములో పుట్టిన నీ నోటి నుండి ధర్మబద్దమయిన గొప్ప  శుభములను కలిగించే మాటలను వినాలి అనుకుంటున్నాను. 

విశ్లేషణః

ఇక్కడ దృతరాష్టృడు విదురునికి సమాధానం ఇచ్చాడా లేదా? అబద్దం అయితే చెప్పలేదు. అలాగని నిజము పూర్తిగా చెప్పలేదు. ఈ సందర్భంలో మనకు దృతరాష్టృని లౌక్యం తెలుస్తుంది. అతనికి  మంచి చెడుల మద్య వ్యత్యాసం బాగా తెలుసు. కానీ ఆమాటలు బయట పెట్టని లౌక్యం ఉంది. మంచి మాటలు వినాలని ఉంది తప్ప ఆ మాటలలోని మంచిని స్వీకరించే మనస్తత్వం మాత్రం లేదు. 

31, జనవరి 2022, సోమవారం

పిల్లలను దండించుట ఆశీర్వదించడమా?

 పాశ్చాత్య సంస్కృతికి మన సంస్కృతికి ఉన్న అనేక భేదములలో ముఖ్యమయినది, తరువాతి తరములకు అవసరమయినది అని మనం భావించేది పిల్లలను క్రమశిక్షణలో పెంచడం. మన దగ్గర పిల్లలను పెంచడానికి, వారిని ఏ వయస్సులో ఎలా పెంచాలో, వారికి దండన విధించడం వల్ల వచ్చే లాభములు ఏమిటో మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా!

ఇప్పుడు అటువంటిదే పతంజలి వ్యాకరణ భాష్యంలో చెప్పిన శ్లోకం  చూద్దాం!

సామృతైః పాణిఖిర్ఘ్నన్తి గురువో న విషోక్షితైః

లాలనా శ్రయిణో దోషాస్తాడనాశ్రయిణో గుణాః

భావంః
దండించుట వల్ల పిల్లలు, శిష్యులు తప్పులు లేని వారు, మంచి గుణములు ఉన్నవారు అవుతారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లోపల ఈర్ష్యాద్వేషములు పెట్టుకోరు. తమ దయ గలిగిన అమృతతుల్యమయిన చేతులతో కొడతారు. అది పిల్లలను ఆశీర్వదించడమే.

30, జనవరి 2022, ఆదివారం

ఛాయాదేవి సవతి ప్రేమ

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు సంధ్యాదేవి వెళ్ళి పోయిన తరువాత ఛాయ ఏమి చేసింది? ఇప్పుడు తెలుసుకుందాం!

సంధ్యాదేవి వెళ్ళిన తరువాత ఛాయ పూర్తిగా సంధ్యాదేవిలానే ప్రవర్తించ సాగింది. వివస్వంతునికి ఆమె సంధ్యాదేవికాదు అన్న అనుమానమే రాలేదు. వారికి ఇద్దరు పుత్రులు జన్మించారు. వారు సావర్ణి, శనైశ్చరుడు. 

సావర్ణి ః వైవస్వత మనువు తరువాత వచ్చే మనువు సావర్ణి మనువు. 

శనైశ్చరుడుః సర్వప్రాణుల కర్మ ఫలదాత

అప్పటి వరకూ సంధ్యాదేవివలెనే ప్రవర్తించిన ఛాయాదేవి, తనకు సంతానం కలిగిన తరువాత తన పిల్లలను ప్రేమగా చూసుకుంటూ సంధ్యాదేవి పిల్లలను వివక్షతతో చూడసాగింది. 

ఆ వివక్షతను కొంతవరకూ భరించిన యముడు, కొంతకాలమునకు భరించలేక ఆమెను నిలదీశాడు. అలా నిలదీస్తున్న సమయంలో అతను కోపమునకు వశుడయ్యి తన కాలును ఆమె పైకి ఎత్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఛాయాదేవి యముని కాలు భూమిపై పడాలని శపించింది. 

అలా సవతిప్రేమను చూపిన ఛాయాదేవిని వివస్వంతుడు ఏమి చేశాడు? ఆమె సంధ్యాదేవి కాదు అని తెలుసుకున్నారా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

29, జనవరి 2022, శనివారం

విదురనీతి - 3

 మనం ఇంతకు ముందు విదురనీతి శీర్షికలో రెండు భాగాలు  చెప్పుకున్నాం! రెండవ భాగంలో దృతరాష్ట్రుడు విదురుని ప్రశ్నించటం చూశాం! ఇప్పుడు ఆ విదురుడు చెప్పే సమాధానం ఎంత విచిత్రంగా ఉందో  చూద్దాం!

సంస్కృత శ్లోకం:

అభియుక్తం బలవతా దుర్బలం హీనసాధనం 

హృతస్త్వం కామినం చోరమావిశన్తి ప్రజాగరాః

కచ్చిదేతైర్మహాదోషైర్న స్పృష్టోసి నరాధిప

కచ్చిన్న పరవిత్తేషు గృధ్యన్నిపరితప్యసే

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

ఇలబలశాలితోడ నెదురేగెడు హీనబలుడు నన్యకాం 

తల నెదగోరువాడపహృతస్వుడు చౌర్యసమర్ధుడన్న వీ 

రలు గతనిద్రులౌదురు ధరావరయుంటివె వీరిలోన న 

న్యుల ధనమున్ హరింపదలపుంచితివే కతమెద్ది మేల్కొనన్ 


భావం:

ఓ మహారాజా! తనకంటే బలవంతుడిని ఎదుర్కోబోతున్న వాడు, తన ఆస్తిని/ సొమ్మును అంతటినీ పోగొట్టుకున్న వాడు , పరస్త్రీలను మనసునందు కోరుకుంటున్న వానికి, ఇతరుల సంపద దోచుకోవాలని అనుకున్న వారికి నిద్ర రాదు. కనుక మహారాజా మీరు ఇటువంటి ఆలోచనలు ఏమయినా ఉన్నాయా!

విశ్లేషణ:

మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు విదురుడు సాక్షాత్తు ధర్ముని అవతారం. అతనికి ధర్మాధర్మముల విచక్షణ ఉంది. ఇక్క డ దృతరాష్ట్రుడు రాజు, విదురుడు అతనికి వరుసకు తమ్ముడే అయినా అతనికి కేవలం సలహాలు చెప్పే అవకాశం తప్ప అతనిని తిన్నగా ప్రశ్నించే అవకాశం లేదు. కనుక పైన అడిగిన ప్రశ్న అడిగాడు. ఆ సమాధానం చుస్తే నిజంగా అన్ని సందర్భాలు కూడా ఆ సమయంలో దృతరాష్ట్రునికి సంబంధించినవే. 

సంజయుడు పాండవుల సభలో ఎం జరిగిందో ధృతరాష్ట్రునికి చెప్పలేదు. 

తనకంటే బలవంతుడిని : ధృతరాష్ట్రునికి అన్ని వేళలా తమకంటే పాండవులే బలవంతులు అనే నమ్మకం ఉంది. కనుక ఒక వేళ వారు సంధికి ఒప్పుకోకుండా తిన్నగా యుద్ధానికి రమ్మన్నారేమో అని అతని అనుమానం!

తన ఆస్తిని/ సొమ్మును అంతటినీ పోగొట్టుకున్న వాడు: ధృతరాష్ట్రునికి ఆ రాజ్యం మీద సింహాసనం మీద విపరీతమయిన వ్యామోహం. అదే అతని సర్వస్వం. దానిని ఆ పాండవులు లక్కుంటారేమో అని భయం

పరస్త్రీలను మనసునందు కోరుకొనుట:  ఇది ధృతరాష్ట్రుని దృష్టి కాక పోయినా, ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తున్నప్పుడు, అతను ఏమీ మాట్లాడలేదు, పరస్త్రీని మనస్సులో కొరుకొవడానికీ, ఆమెకు నలుగురిలో అవమానం జరుగుతున్నప్పుడు దానిని ఆపకుండ ఉండడానికి తేడాలేదు

ఇతరుల సంపద దోచుకోవడంః నిజంగా ధృతరాష్ట్రునికి పాండవుల రాజ్యమును దోచుకోవాలని కోరిక ఉంది. 

ఇది విదురుని గొప్పతనం. తాను అడగాలని అనుకున్నది అడుగుతూనే, మహారాజు తప్పులను ఎత్తి చూపటం. 

28, జనవరి 2022, శుక్రవారం

కలికాల ప్రభావాన్ని తప్పించుకునే మార్గం

 మనం ఇంతకు ముందు కలి ప్రభావం, కలికాలంలో మానవుని లక్షణముల గురించి తెలుసుకున్నాం కదా!

ఇప్పుడు ఆ కలి ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఒక సులభమయిన మార్గం గురించి చెప్పుకుందాం!

ఈ మార్గన్ని స్వయంగా వ్యాసభగవానుడే మహాభారతంలో అరణ్యపర్వంలో చెప్పాడు. మనం ఇప్పుడు వ్యాసుడు చెప్పిన సంస్కృత శ్లోకం, దాని కవిత్రయ భారతంలోని తెలుగు అనువాదం కూడా చెప్పుకుందాం!

శ్లోః 

కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ

ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం

 తెలుగు అనువాదంః

కర్కోటకుని, దమయంతి, బుణ్యమూర్తియైన నలుని

ఋజు చరిత్రుడైన ఋతుపర్ణు గీర్తింప గలిభయంబు లెల్ల గ్రాగు నధిప

భావంః కర్కోటకుడు అనే పాము, భార్యాభర్తలయిన నల దమయంతుల గురించి, రఘువంశజుడయి మంచి ప్రవర్తన కలిగిన ఋతుపర్ణుడు అనే రాజుని నిరంతరం తలుచుకొనుట వలన కలి వలన కలిగే భయములు అన్నీ తొలగుతాయి. 

విశ్లేషణ

ఈ శ్లోకమును వ్యాసుడు నలదమయంతుల కధకు ఫలశ్రుతిగా చెప్పాడు. వీరి కధ అనేక మలుపులతో ఆసక్తి దాయకంగా ఉంటుంది. ఎంతో అన్యోన్య దాంపత్యమునకు ఉదాహరణగా నలదమయంతులు, వారు విడిపోయిన సమయంలో దమయంతి చూపిన మనోధైర్యం, నలుడు తాను  దూరమయితే తన భార్య పుట్టింటికి వెళ్ళి సంతోషిస్తుంది అనే త్యాగం, తనకు ఉపకారం చేసిన వ్యక్తికి అపకారం రూపంలో ఉపకారం చేసిన కర్కోటకుడు, తాను ఒక రాజు అయ్యి ఉండీ తన వద్ద పనిచేసే ఒక వ్యక్తికి ఎలా మర్యాద ఇవ్వలి, ఒక విషయం వారి వద్ద నేర్చుకున్నప్పుడు వారికి తిరిగి ప్రత్యుపకారం ఎలా చేయాలి అని ఋతుపర్ణుని వద్ద మనం నేర్చుకోవలసిన పాఠములు. ఈ విషయములు అన్నీ మనం అర్ధం చేసుకోగలిగినప్పుడు, కలి అనే విషప్రభావం నుండి మనం బయట పడగలుగుతాము.

ఈ పాఠములు మనం రాబోయే టపాలలో తప్పకుండా నేర్చుకుందాం!

27, జనవరి 2022, గురువారం

చ్యవన మహర్షి - అశ్వినీదేవతలు

మనం ఇంతకు ముందు చ్యవన మహర్షి గురించి, అతని వివాహం సుకన్యతో జరగటం గురించి, సుకన్యకు అశ్వినీ దేవతలు ఇచ్చిన వరం గురించి తెలుసుకున్నాం కదా! 
మరి వారు సుకన్య కోరికను మన్నించారా లేదా తెలుసుకుందాం!
సుకన్య మాటలు  విన్న అశ్వినీదేవతలు ముసలివాడయిన చ్యవన మహర్షిని తీసుకుని దగ్గరలోని కొలనులో మునిగారు. కొంతసేపటికి ఆ కొలనులోనుండి  అత్యంత సుందరమయిన, ఒకేరూపం కలిగిన ముగ్గురు యువకులు బయటకు వచ్చారు. వారిలో ఇద్దరు అశ్వినీ దేవతలుగాను, ఒకరు తన భర్త చ్యవనుని గాను సుకన్య గ్రహించింది. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని వారించమని వారు కోరగా, ఆమె తన భర్తనే తిరిగి వరించింది. 
 సహాయమునకు ప్రతిఫలంగా చ్యవన మహర్షి, యజ్ఞములలో దేవతలకు లభించే సురాపానం సేవించే అర్హతను వారికి కలుగజేస్తాను అని మాట ఇచ్చాడు. 
ఇప్పటి వరకు అశ్విని కుమారులను మనం అశ్వినీదేవతలు అని చెప్పుకున్నాం కదా! మరి వారికి దేవతలతో సమానంగా యజ్ఞములలో సురాపానం అర్హత ఎందుకు లేదు? వారి కి అలా అర్హతలేకుండా పోవటానికి వారు చేసారు? తరువాతి టపాలలో నేర్చుకుందాం.