తామస మనువు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తామస మనువు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, అక్టోబర్ 2014, మంగళవారం

తామస మనువు జననం- విశ్లేషణ

తామస మనువు జననం- విశ్లేషణ

ఈ ఘట్టం లో విశ్లేషించవలసిన అంశం నా మనస్సునకు తట్టినది ఒక్కటే ఉన్నది. అది ప్రాపంచిక విషయముల మీద వైరాగ్యం కలిగి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్న ఒక తపస్వి మనస్సుని ఒక లేడి వంటి జంతువు కదిలించటం.
ఇటువంటి విషయములు ప్రస్తావనకు వచ్చినప్పుడు మన హిందూ ధర్మ శాస్త్రముల మీద మనకే కొంచెం అపనమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది. దానికి కారణం మనం ఆ విషయమును గురించి తప్ప అందులోని సూక్ష్మ అర్ధమును గ్రహించే ప్రయత్నం చేయలేకపోవుట.
లెక్కకు మించిన ఆయుష్షు కలిగిన సురాష్ట్రుడు, తన భార్యలు, ప్రజలు, మంత్రులుతన ముందే చనిపోవటం చూసాడు కనుక అతనికి వైరాగ్యం కలిగినది. అందుకని అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేయనారంభించాడు. అదికూడా ఘోరమయిన తపస్సు. ఐతే ఇక్కడ ఒక విషయం గమనించండి. అతను ఏమి కోరి తపస్సు చేస్తున్నాడు? ఏ విధమైన కోరికా లేదు. కేవలం భగవత్ సాక్షాత్కారం కోసం మాత్రమే! అతనికి దేహం మీద, దానివలన సంభవించే ఏ విధమైన భోగం మీద కోరిక లేదు కనుకనే తన రాజ్యమును వదలి తపస్సునకు వెళ్ళాడు.
ఇక వర్షం రావటం అనేది సృష్టిలో సహజం. ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నపుడు, పంచాభుతాత్మకమైన శరీరం తనలో ప్రాణమును నిలుపుకోవాలనే చూస్తుంది కనుక ఆధారం కోసం చేతులు వెతికాయి. అప్పుడు తనకు దొరికిన ఒక లేడి ని పట్టుకోవలసి వచ్చినది.
ఇక్కడ ఒక విషయం గమనించండి. అతని చేతికి ఒక లేడి దొరికింది. అంటే అది కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుని పొతూ ఉంది. నాకు తెలిసి లేడి కంటే మానవుని శరీరం నీటిలో ఈదే సామర్ధ్యం కలిగి ఉంటుంది. కనుక తన చేతికి దొరికిన ఆ లేడి ప్రాణములను కాపాడాలన్న దృఢ నిశ్చయం ఆ తపస్వికి కలిగి, ఒడ్డునకు చేరే, లేడిని చేర్చే ప్రయత్నం చేసి ఉండాలి. అలా ఒడ్డుకు చేరిన తరువాత, లేడి తన ప్రాణములను కాపాడినందుకు అతనిపై కృతజ్ఞతా భావం ఉంచుకొనుట సహజం.
అలా కాకుండా ఆ తపస్వి మనస్సు ఆ లేడి వలన కదలటం విచిత్రం. తపస్వి అనేవాడు తన మనస్సును నిగ్రహించే సామర్ధ్యం కలిగి ఉంటాడు. అప్పటికి చాలా కాలం నుండి అతను తపస్సులో ఉన్నాడు కనుక అతని మనస్సును నియంత్రించటం అతనికి తెలుసు. కానీ అతని మనస్సు కదిలినది. దానికి కారణం తనకు తెలిసి ఉన్నదేమో అని తనని తను పరిశీలించుకుని ఉండాలి. కానీ అటువంటిది ఏమి అతని తపొదృష్టికి అందలేదు. కనుక ఈ విధంగా తన మనస్సు చలించుటకు కారణం ఆ లేడికి తప్పని సరిగా తెలిసి ఉండాలి.
తనకు తెలిసిన గతజన్మ గురించి చెప్పిన సంగతులను విన్న సురాష్ట్రుడు ఆమెను మానవ కన్యగా అయ్యే అవకాసం కలిగించాడు. ఆమెతో రాజ్యమునకు వెళ్లి, రాజ్య భోగములను అనుభవించాడు.

  1. ఒక తపస్వి ఇలా ఎందుకు చేసాడు ?

తపస్వి అంటే తనగురించి కాక ఈ లోకం, ప్రజల గురించి ఆలోచించే వాడు. ఆమె తన గత జన్మ గురించి చెప్తున్న సమయంలో ఆమె చెప్పిన ఒక విశేషం అతనిని ఈ విధంగా రాజ్యమునకు తిరిగి వచ్చేందుకు ప్రోత్సహించి ఉండాలి.
అది వారికి ఒక మనువు పుట్టబోతున్నాడు అని.
మనువు అంటే అత్యంత గొప్పదయిన భాద్యత. అటువంటి భాద్యతలను గ్రహించబోయే వాడు తపోధనుడయిన తనకు, విజ్ఞానవతి అయిన ఉత్పలమాలకు జన్మించటం సరి ఐనదే అని అతను భావించి, అటువంటి మనువు అరణ్యములలో ఉండే కంటే, ఒక రాకుమారునిగా పుట్టి, అలాగే విద్యాభ్యాసం చేసుకుంటే, అతనికి, అతను పరిపాలించబోయే ప్రజలకు మేలు జరుగుతుంది అని భావించి తిరిగి రాజ్యమునకు వచ్చి ఉండాలి.

నా మనస్సుకు తట్టిన విశ్లేషణ ఇది. ఇంతకంటే గొప్పగా, ఏ పండితులవారయిన చెప్పగలిగితే, వారి పాదములకు నమస్కరించి, దానిని తిరిగి మీ అందరికి తెలిపే ప్రయత్నం చేస్తాను.

27, అక్టోబర్ 2014, సోమవారం

తామస మనువు

పూర్వకాలమునందు సురాష్ట్రుడు అనే పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. అతని మంత్రి పేరు నరసింహశర్మ. సురాష్ట్రుడు ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు. యజ్ఞయాగాదులు చేస్తూ ప్రజలను తన కన్నబిడ్డలవలే చూసుకుంటూ ఉండేవాడు. యుద్ధమునకు వెళితే అరివీర భయంకరుడుగా ఉంటూ, మహశూరుడుగా గుర్తించేవారు.
అతని మంత్రి అయిన నరసింహశర్మ అత్యంత రాజభక్తి కలిగి, అన్ని కార్యములలో రాజునకు కుడి భుజంలా, తలలో నాలుకలా ఉండేవాడు. ఇతనికి  అమితమైన రాజభక్తి వలన ప్రత్యక్ష పరమేశ్వరుడైన సూర్యుని గురించి తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు వరంకోరుకోమనగా, నరసింహశర్మ తమ రాజయిన సురాష్ట్రుని మీది భక్తి, ప్రేమ వలన అతనికి అమితమైన ఆయుష్షు ఇవ్వమని కోరాడు. సూర్యుడు తధాస్తు అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు.
నరసింహశర్మ తమ రాజ్యమునకు తిరిగి వచ్చి రాజునకు జరిగిన సంగతి, అతనికి తాను సంపాదించి పెట్టిన వరమును గురించి చెప్పెను. అప్పటినుండి సురాష్ట్రుడు మరింత ధర్మబద్దంగా పరిపాలన చేయసాగాడు. ఐతే అమితమైన ఆయుష్షు ఇతనికి మాత్రమే ఉన్నది కానీ భార్యలకు, మంత్రులకు లేకపోవుట చేత వారంతా తన కన్నుల ముందరే కాల గర్భంలో కలిసిపోవుట చూసి అతనికి ఈ రాజ్యపాలనయందు విరక్తి కలిగినది. ఆ విరక్తి కారణంగా తన రాజ్యమును మంత్రిమండలికి అప్పగించి తను అడవికి వెళ్లి తపస్సు చేయనారంభించాడు.
మండు వేసవికాలంలో పంచాగ్నియందు (నాలుగు వైపులా అగ్ని కుండలు, కన్నులతో అగ్నికుండం వంటి సూర్యుని చూస్తూ) ఘోరమైన తపస్సు చేసాడు. వర్షాకాలంలో ఆకాశం క్రింద, చలికాలంలో కంఠంవరకు నీటిలో మునిగి ఘోరమైన తపస్సు చేసాడు.
కొంతకాలం అలా తపస్సులో గడచిపోయినది. తరువాత వర్షాకాలం వచ్చినది. ఆకాశం, నేల కలసిపోయే విధంగా అతి భయంకరమైన వర్షం ప్రారంభం అయినది. భూమి మొత్తం నీటితో నిండి, ప్రవహించసాగెను. సురాష్ట్రుడు కూడా ఆ నీటిలో కొట్టుకుని పోవుచుండగాఅతను ఆధారం కోసం ప్రయత్నించాడు. ఆ ప్రవాహంలో తనతోపాటు కొట్టుకు వస్తున్న ఒక లేడి ఆ రాజు చేతికి దొరికినది. అలా ఆ రాజు, లేడి కలిసి ఒక అడవికి చేరుకోగలిగారు. ఆ సమయంలో అత్యంత ఇంత తపోదనుడయిన ఆ సురాష్ట్రుని మనస్సు ఆ లేడి వలన కదిలినది. అది తనకే ఆశ్చర్యం కలిగించగా ఆ లేడిని స్వయంగా దీనికి కారణం ఏమిటి అని అడిగాడు.
దానికి బదులుగా ఆ లేడి తన గత జన్మ సంగతులు చెప్పి, ఆమె అతని మొదటి భార్య, ఉత్పలమాల అనే పేరు కల దానిని అని చెప్పినది.
ఆమె శాపవిమోచనం కలిగేందుకు రాజు సురాష్ట్రుడు ఆమెను కౌగలించుకున్నాడు.
ఆమె వెంటనే మానవ రూపమును పొందినది. ఆమెను ఉత్పలమాలగా గుర్తించి, ఆమెను తీసుకుని తమ రాజ్యమునకు తిరిగి వచ్చాడు. తన మంత్రులకు, రాజ్య ప్రజలకు జరిగిన సంగతి చెప్పి అందరి ముందు ఆమెను యధావిధిగా వివాహం చేసుకుని, సర్వభోగములను అనుభవించ సాగాడు.
కొంతకాలం తరువాత ఆ ఉత్పలమాల ఒక మంచి శుభ ముహూర్తమందు ఒక పుత్రునకు జన్మనిచ్చినది. ఆనందించిన సురాష్ట్రుడు తన రాజ్యం మొత్తం పుత్రొత్సవములను జరిపించాడు. కాలక్రమంలో ఆ పుత్రుని గారాబంగా పెంచుతూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి ఈ పుత్రుడే తామస మనువుగా ప్రసిద్ధి పొందుతాడు అని చెప్పినది. ఆ నాటి నుండి ఆ బాలుని అందరూ తామసుడు అని పిలిచేవారు.
తామసుడు అత్యంత చిన్నవయస్సులోనే అన్ని శాస్త్రములను అభ్యసించెను. తరువాత తామసునకు రాజ్యమును అప్పగించి సురాష్ట్రుడు, ఉత్పలమాల తపోవనమునకు వెళ్ళిపోయారు.
తామస మనువు జననం విశ్లేషణ ఇక్కడ చూడండి. 

ఉత్పలమాల - సురాష్ట్రుని మొదటి భార్య జన్మ వృత్తాంతం

ఉత్పలమాల సురాష్ట్రుని మొదటి భార్య. తమ అమాత్యుడు నరసింహశర్మ చేసిన తపస్సు ఫలితంగా సురాష్ట్రుడు అమితమైన ఆయుష్షు కలిగి ఉన్నాడు. కనుక కాల గమనంలో ఉత్పలమాల గతించి పోయినది.
మరు జన్మలో ధృఢధన్వుని వంశంలో జన్మించినది. కానీ ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఒకనాటి సమయంలో తన చెలికత్తెలతో వనము నందు సంచరిస్తుండగా, ఒక మునికుమారుడు ఆమెను చూసి, ఆమె అందమునకు వశుడయ్యి, తనను వివాహం చేసుకోమని కోరాడు.
ఆమెకు పూర్వజన్మ గుర్తు ఉన్న కారణంగా ఆమె మనస్సు నందు సురాష్ట్రుడు  ఉన్నాడు. కానీ ఆ విషయం బ్రాహ్మణకుమారునకు చెప్పనవసరం లేదని భావించి, " ఓ బ్రాహ్మణోత్తమా! నేను ఒక రాజ కన్యను, నీవు ముని పుత్రునివి! కనుక నీవు నీకు తగినట్లుగా ఒక బ్రాహ్మణ కన్యను చూసి వివాహం చేసుకో!" అని చెప్పినది.
అలా మాట్లాడుతున్న రాకుమారి తనను అవమానించినది అని భావించిన ఆ ముని కుమారుడు ఆమెను లేడిగా తిరుగుము అని శపించాడు.
ఆ శాపము విని భయం కలిగిన రాకుమారి ఆ ముని కుమారుని క్షమాపణ కోరి, శాపవిమోచనం చెప్పమనగా, ఆ ముని కుమారుడు ఆమె లేడిగా తిరుగుతున్న సమయంలో, సంభవించిన అత్యంత భయకరమైన వర్షం కారణంగా నీటిలో కొట్టుకు పోయే సమయమందు, నీ పూర్వజన్మ భర్త (సురాష్ట్రుడు) నిన్నుఆధారంగా చేసుకుని ఈది, గట్టుకు వచ్చిన సమయంలో, నీకు పూర్వజన్మ స్మృతి  కలుగుతుంది. అప్పుడు ఆ రాజు నీ కంఠమును కౌగలించుకొనిన మరుక్షనణం నీకు మానవ రూపం తిరిగి లభిస్తుంది. అప్పుడు నీవు అతనిని వివాహం చేసుకుని, కొంతకాలమునకు అతని కారణంగా ఒక మనువు కు జన్మనిస్తావు అని శాపవిమోచనం చెప్పారు.
కాలాంతరంలో  మనకు గల 14 మంది మనువులలో నాలుగవ వాడయిన తామస మనువు వారికి జన్మించాడు.