31, మే 2020, ఆదివారం

రాక్షస స్త్రీలు - పిల్లలు - పార్వతీదేవి

మన పురాణములలో రాక్షస స్త్రీలు గర్భం ధరిస్తే, పుట్టిన పిల్లలు వెంటనే ప్-పెద్దవారు అవుతారు   అంతే కాక ఆ పిల్లలు తమ తల్లికి సమానమయిన వయస్సు కలిగిన వారు అవుతారు. మరి ఇంతకీ ఇది ఎలా సాధ్యం? దానికి కారణం ఏమిటి?
దీనికి సమాధానం మనకు రామాయణంలో ఉత్తరకాండలో చెప్పారు. 
బ్రహ్మ తాను సృష్టి మొదలుపెట్టిన సమయంలో మొట్ట మొదటగా ఉన్న జలంలో కొన్ని ప్రాణులను సృష్టించాడు. ఆలా పుట్టిన వారు బ్రహ్మను ఏమి చెయ్యాలి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ వారిని ఆ జలమును రక్షించమని చెప్పాడు. వారిలో కొందరు "రక్షామ" అని కొందరు "యక్షామ" అని అన్నారు. రక్షామ అన్నవారిని రాక్షసులు అని, యక్షామ అన్నవారిని యక్షులు అని పేరుపెట్టారు. 

రాక్షసులకు  హేతి, ప్రహేతి అనే ఇద్దరు నాయకులు ఉన్నారు. వారిలో ప్రహేతి పరం ధర్మాత్ముడు. అతను  గృహస్థధర్మమును స్వీకరించటానికి యముకుని చెల్లి అయిన భయ ను వివాహం చేసుకున్నాడు. వీరికి విద్యుత్కేశుడు అనే కుమారుడు కలిగాడు. 
ఆ విద్యుత్కేశునికి యుక్త వయస్సు రాగానే అతనికి సంధ్యపుత్రికని ఇచ్చి వివాహం చేశారు. ఆమె కొంతకాలమునకు గర్భం ధరించింది. అయితే గర్భంధరించి ఉన్న ఆమె తన భర్తతో కొంతకాలం సుఖంగా గడపాలి అని కోరుకున్నది. ఆలా జరగటానికి అడ్డంగా ఉన్న నెలలు నిండని గర్భమును స్రావం చేసుకుని అక్కడి నుండి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది. 
అయితే బయటకు వచ్చిన నవజాత శిశువు ఏడుపు మొదలు పెట్టాడు. అదే సమయమునకు అటువైపుగా వెళుతున్న పార్వతీ పరమేశ్వరులు ఆ బిడ్డను చూసి, జాలి పడ్డారు. వారి జాలి చూపులు సోకిన ఆ బిడ్డ అప్పటికి అప్పుడే యుక్తవయస్కుడు అయ్యాడు. 
అప్పుడు పార్వతీదేవి రాక్షస స్త్రీలకు ఒక వరం ఇచ్చింది. ఆ వరం ప్రకారం రాక్షస స్త్రీలు గర్బంధరించిన వెంటనే ప్రసవిస్తారు, ప్రసవించిన బిడ్డలు కూడా వెంటనే పెద్దవారు, తమ తల్లి వయస్సు కలిగినవారు అవుతారు. 
అక్కడ ఉన్న శిశువు మీద ఆప్యాయత తో శివుడు అతను  సుఖంగా నివసించటానికి వీలుగా ఒక గాలిలో ప్రయాణించే నగరమును నిర్మించి ఇచ్చాడు. ఆ రాక్షసుని పేరు సుకేశుడు

30, మే 2020, శనివారం

వైశ్రవణుడు - దిక్పాలకత్వం

మనం ఇంతకు ముందు నవబ్రహ్మ లలో ఒకరయిన పులస్త్యుడు - విశ్రవసుడు , విశ్రవసునికి భరద్వాజుని కుమార్తెయందు కలిగిన వైశ్రవణుని జననం గురించి తెలుసుకున్నాం కదా!
 ఇప్పుడు అతనికి దిక్పాలత్వం, ధనాధిపత్యం ఎలా సంక్రమించింది,  లంక కు అధిపతి ఎలా అయ్యాడు అని తెలుసుకుందాం!

వైశ్రవణునికి తండ్రి విశ్రవసునివలెనే ధర్మాచరణ పరాయణుడు. అతను అనేక సంవత్సరములు 
తపస్సు చేసాడు. వెయ్యి సంవత్సరములు తపస్సు చేసిన తరువాత అతను కేవలం గాలిని మాత్రమే పేల్చి తపస్సు చేసాడు. ఆ ఘోరమయిన తపస్సుని చూసి దేవతలు ఆశ్చర్యపోయిఅందరూ బ్రహ్మదేవునిలో కలసి అతనికి దర్శనం ఇచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనిని వరం కోరుకోమని అడుగగా, అతను దిక్పాలత్వమును, ముల్లోకముల లోని ధనము పైన ఆధిపత్యము కావలి అన్ని కోరుకున్నాడు. అప్పటివరకు కేవలం ముగ్గురు దిక్పాలకులు ఉన్నారు. ఇంద్ర, వరుణ మరియు యముడు. అప్పుడు బ్రహ్మ అతనిని ఉత్తర దిక్కునకు అధిపతిని చేసాడు. అంతే కాక అతనికి ధనాధిపత్యం కూడా ఇచ్చారు. వానితో పాటు ఆటను అన్ని లోకములు తిరుగుటకు వీలుగా అద్భుతమయిన ఒక విమానము కూడా ఇచ్చారు. ఆ విమానం పేరే పుష్పక విమానం! దీని ప్రత్యేకత ఎంతమంది ఎక్కినా ఇంకా కొందరు ఎక్కటానికి చోటు ఉంటుంది. 

ఆ వరములను పొందినతరువాత  వైశ్రవణుడు తన తండ్రి దగ్గరకు వెళ్లి తాను పొందిన వరములా గురించి చెప్పి, తాను ఉండుటకు వీలుగా ఒక ప్రదేశం చూపించమని అడిగాడు. అప్పుడు విశ్రవసుడు ఆ సమయమునకు కాళీ గా ఉన్నస్వర్ణ  లంకా నగరమును తనకు నివాసంగా మార్చుకోమని చెప్పాడు. 
అప్పటి నుండి వైశ్రవణుడు లంకను తన నగరంగా మార్చుకుని అక్కడ నివాసం ఉన్నాడు. 

29, మే 2020, శుక్రవారం

ఉడుతా భక్తి - ఆ భక్తికి కారణం పూర్వజన్మ!!

ఉడుతా భక్తి అనే మాట మన తెలుగు వారు సహజంగా మనం చేసి పని ఎదుటివారికి  అంత ముఖ్యమయినది కాకపోయినా మనం వారిమీద ఉన్న ప్రేమ అభిమానంతో చేసే పనిని  ఎదో ఉడుతా భక్తి గా చేసాం అని చెబుతూ ఉంటారు.  
శ్రీ రాముని కరుణకు సంబందించిన ఉదాహరణ చెప్పాలంటే ముందుగా చెప్పేది సేతు బంధన సమయంలో ఉడుత చేసిన చిన్న సహాయమునకు శ్రీరాముడు దానిని తన చేతులలోకి తీసుకుని దానిని నిమురుట, ఆ నిమిరినప్పుడు పడిన శ్రీరాముని వేళ్ళ గుర్తులు ఇప్పటికీ ఆ ఉడుతల వీపుపైన ఉన్నాయి అని చెప్తారు కదా! 
మరి ఇంతకీ అలా రాముని చేతులతో నిమిరించుకున్న ఉడుత ఏమి అయ్యింది? ఆ ఉడుతకు రాముని కార్యంలో సహాయం చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది?  
దానికి కారణం ఆ ఉడుత పూర్వజన్మ.  ఆ పూర్వజన్మ కథను అద్భుత రామాయణంలో ప్రస్తావించారు. ఆ కథను ఇప్పుడు మన చూద్దాం!

పూర్వ కాలంలో ఒక బ్రాహ్మణ కుమారుడు కాశీ నగరమునకు వెళ్లి అక్కడ సకల విద్యలు నేర్చుకుని తిరిగి తన స్వగ్రామమునకు చేరుకున్నాడు. అతని పాండిత్యమును నిలిచి వాదములలో ఎవ్వరూ నిలువలేక పోయారు. అతని ఖ్యాతి నలుదిశలా వ్యాపించసాగింది. అతనితో పాటుగా అతని తండ్రిని కూడా ప్రజలు కీర్తించేవారు. అయితే ఆ పొగడ్తలను విన్న అతని తండ్రి ఆ పొగడ్తలను చాలా మర్యాదగా మా అబ్బాయి ఇంకా చిన్న పిల్లవాడు వాడు నేర్చుకోవలసినది చాలా ఉన్నది అని చెప్పే వాడు. ఆ మాటలు ఆ కుమారునికి రుచించలేదు. తన తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తనను అలా చిన్న పిల్లవానిగానే వీచుస్తారు కనుక తన తండ్రి చనిపోతేనే బాగుండు అనుకోవటం మొదలుపెట్టాడు. 
అలా ఆలోచిస్తూ కొంతకాలానికి తానే తన తండ్రిని చంపెయ్యాలి అని అనుకున్నాడు. ఒక రోజు తన తండ్రి ఇంటిలోకి వస్తున్న సమయంలో అతని మీదకు ఒక కర్రను గురిచూసి విసిరాడు. ఆ దెబ్బకు మూర్ఛిల్లిన తండ్రి, కొంతసేపటికి తేరుకుని ఎంత విద్యా, జ్ఞానము ఉన్నా విచక్షణను కోల్పోయిన కారణంగా ఇంత క్రూరమయిన కార్యం చేసాడు కనుక , క్రూరమృగంగా జన్మించమని శపించాడు. కొడుకు తన తరువాతి జన్మలో ఒక పెద్దపులిగా అడవిలో జన్మించాడు 
ఒకసారి తండ్రి బ్రాహ్మణుడు వేరే ఉరికి వెళ్ళవలసి వచ్చి ఆ అడవిమార్గంలో వెళుతూ ఉండగా, పులిగా జన్మించిన కుమారుడు అతనిమీద దాడి చేయబోయాడు. మృగ జన్మలో ఉండికూడా ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తున్నవు కనుక ఎవ్వరికీ హాని చేయని ఉడుత జన్మ ఎత్తు అని మరలా తండ్రి ఆ పులికి శాపం ఇచ్చాడు. అప్పుడు ఆ పులికి గత జన్మ, ఆ జన్మలో సంపాదించుకున్న జ్ఞానము జ్ఞాపకము వచ్చి, తన తండ్రి పాదములపై పడి క్షమాపణ కోరి, ఆ శాపమునకు విమోచనము చెప్పమని అడిగెను. అలా కుమారునిలో పశ్చాత్తాపం గమనించిన బ్రాహ్మణుడు, నీకు ఏమి ఉపకారామ్ జరుగక పోయినా నీవు ఏనాడయితే పక్క వారికి సహాయం చేస్తావో ఆనాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నిన్ను స్పర్శిస్తాడు. ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. 
ఆ రోజు నుండి ఆ ఉడుత అలా సముద్రతీరంలో గడుపుతూ ఉంది. 
తాను చేయగలిగిన అతి చిన్న సహాయం రామునికి అందించింది. ఆ సాయమునకు బదులుగా రాముడు ఆ ఉడుతను పట్టుకున్న కారణంగా ఆ బ్రాహ్మణ కుమారునికి శాపవిమోచనం కలిగింది. 

27, మే 2020, బుధవారం

కశ్యపుడు - కుటుంబం

కశ్యపుని గురించి మనం ఇంతకు  ముందు చాలా సార్లు చెప్పుకున్నాం! నవ బ్రహ్మ లలో ఒకడయిన దక్షుడు తన 13 మంది కుమార్తెలనుకశ్యపునికి ఇచ్చి వివాహం చేసాడు అని కూడా తెలుసుకున్నాం కదా! ఈ 13 మంది దక్షుని కుమార్తెల గురించి అనేక పురాణములలో అనేక రకములుగా చెప్పారు. ఇప్పుడు మనం మహాభారతంలో మరియు భాగవతంలో ఏమి చెప్పారో చూద్దాం!
ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశి కశ్యపుని వంశంలోనివే అని చెప్తారు. అటువంటి విచిత్రమయిన కుటుంబం గురించి తప్పకుండా తెలసుకోవాలి కదా!

 కశ్యపుని భార్యలుగా చెప్పబడిన 13 దక్ష పుత్రికలు, వారివలన కశ్యపునికి కలిగిన సంతానం ఇప్పుడు చూద్దాం!

 మహాభారతం ప్రకారం:
  1. అదితి          : ఆదిత్యులు 
  2. దితి              : దైత్యులు
  3. దనువు         : దానవులు 
  4. కాల              : వినాశనుడు, క్రోధుడు మొదలగు 8 మంది 
  5. అనాయువు : విక్షర, బాల, వీర, వృత్రులు 
  6. సింహిక        : రాహువు 
  7. ముని           : భీమసేనాదులయిన గంధర్వులు 16 మంది 
  8. కపిల           : అమృతం గోగణం, బ్రాహ్మణులు, అప్సరసలు 
  9. వినత          : గరుడ, అనూరుడు 
  10. క్రోధ             : క్రోధవశగణములు 
  11. ప్రాద్ధ           : సిద్దులు 
  12. క్రూర          : సుచంద్రాదులు 
  13. కద్రువ        : నాగులు 

భాగవతం ప్రకారం:
  1. అదితి          : ఆదిత్యులు 
  2. దితి              : దైత్యులు
  3. కాష్ట
  4. దనువు         : దానవులు 
  5. అరిష్ట           : గంధర్వులు 
  6. తామ్ర           : డేగ, గ్రద్ద 
  7. క్రోధవశ        : సర్పములు 
  8. సురస          : యాతుధానులు అనే ఒక రకం పిశాచములు 
  9. సురభి          : సురభులు 
  10. ముని            : అప్సరసలు 
  11. తిమి             : తిమింగలములు మొదలగు జలచరములు 
  12. ఇల              : చెట్లు 
  13. సరమ          : గిట్టలు చీలి ఉండే జంతువులు  

అయితే విచిత్రంగా భాగవతంలో తారక్ష్యుడు అనే వానికి భార్యలుగా వినత, కద్రువలను చెప్పారు. ఈ  వినత, కద్రువలను మహాభారతంలో కశ్యపుని భార్యలుగా చెప్పారు. 

26, మే 2020, మంగళవారం

సుమిత్ర, కైక విష్ణు అంశలకు తల్లులు ఎలా కా గలిగారు?

మనం ఇంతకు ముందు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎందుకు పుట్టాడు అని  చెప్పుకున్నాం  కదా! అయితే ఇంతకూ ముందు చెప్పినట్లు కొన్ని కధలలో అవి చెప్పిన గ్రంధం/పురాణం ను బట్టి ఆ సంఘటనలలో కొంత మేరకు మార్పులు ఉంటాయి.
ఒక జన్మలో ఆ కశ్యపుడు, అదితి లు శ్రీరాముని తన కుమారునిగా పొందుటకు దశరధునిగా మరియు కౌసల్య గా జన్మించారు. ఆ సమయంలో రామునితో పాటుగా శ్రీమహావిష్ణు అంశలు అయిన ఆదిశేషువు, శంఖ , చక్రములు కూడా లక్ష్మణ భరత శత్రుజ్ఞులుగా జన్మించారు. వీరికి తండ్రి దశరధ మహారాజు కాగా లక్ష్మణ, శత్రుజ్ఞులకు తల్లి సుమిత్ర, భరతుని కి తల్లి కైకేయి.
ఇంతకూ ముందు మనం చెప్పుకున్నట్లు శ్రీ మహావిష్ణువును పుత్రునిగా పొందుటకు కశ్యపుడు, అదితి తమ ముందు జన్మలో తపస్సు చేశారు. మరి సుమిత్ర, కైకేయి ఏమి చేశారు? వారికి శంఖం - భరతునిగా, ఆదిశేషుడు - లక్ష్మణుడిగా, చక్రం - శత్రుజ్ఞుడుగా ఎలా జన్మించారు? దానికి కారణం ఏమి అయ్యి ఉంటుంది?

మనం ఇంతకూ ముందు అసూయ గురించి, మదం మరియు క్రోధం గురించి చెప్పుకున్నప్పుడు కశ్యపుని భార్యలు అయిన వినత, కద్రువల మధ్య మాత్సర్యం గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం కదా!
కశ్యపునికి దక్షుడు తన 13 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేసాడు. ఆ 13 మందిలో అదితి, వినత కద్రువ కూడా ఉన్నారు. ఐతే కశ్యప ప్రజాపతి తన భార్యలందరికి సమానమయిన సమయమును కేటాయిస్తూ, ఎవరి సమయమునకు వారి వద్ద ఉండేలా ప్రణాళిక ప్రకారం నడచుకునేవాడు.
అయితే ఒకసారి కశ్యపుడు వినత దగ్గర ఉండగా, కద్రువ కోపంగా వచ్చింది. ఆ సమయంలో కశ్యపుడు కద్రువ వద్ద ఉండాల్సింది. ఆ కోపం మొత్తం వినత మీద తీర్చుకోవటానికి కద్రువ వినతకు శాపం ఇచ్చింది. ఆమె శాపం ప్రకారం వినత గర్భంలో సర్పము, మంట జన్మించాలి. అయితే ఆ శాపం విన్న వినతకు కూడా కోపం వచ్చింది, ఆ కోపంలో కద్రువకు అత్యంత అపకీర్తికలగాలని శపించింది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన తమ అక్క, కశ్యపుని మొదటి భార్య అయిన అదితి వారిని వారించ ప్రయత్నించగా తన కోపం ఇంకా చల్లారని కద్రువ తన భర్త అయినా కశ్యపుడు, వినత మరియు అదితి కూడా మానవ జన్మ ఎత్తవలసినది అని శపించింది.
అయితే ఆ కోపములు శాంతించిన తరువాత వినత కద్రువతు తమ తప్పు తెలుసుకుని, ఆ జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెంది శ్రీమహా విష్ణువు గురించి అద్భుతమయిన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమహా విష్ణువు, వారు మానవ జన్మ ఎత్తిన సమయంలో తానూ స్వయంగా వివిధ రూపములలో వారికి పుత్రునిగా జన్మిస్తాను అని వరం ఇచ్చారు. ఆ వరం ప్రకారమే కౌసల్య (అదితి) కి రాముని(విష్ణువు)గా, సుమిత్ర (వినత) కు లక్ష్మణుడు (సర్పం-ఆదిశేషుడు), శత్రుఘ్నుడు (అగ్ని-చక్రం - సుదర్శనం) గా, కైక (కద్రువ) కు భరతుని (శంఖం) గా జన్మించాడు.  కైక, రాముని వనవారం పంపుట వలన తనకు అనంత కాలంవరకు  తరగని అపకీర్తి ప్రాప్తించింది. 

23, మే 2020, శనివారం

రామ, హనుమల తొలి పరిచయం! హనుమంతుని వేషం!

రామాయణంలో కథను మలుపు తిప్పే ఘట్టములలో ముఖ్యమయినది హనుమంతుడు శ్రీరాముని కలుసుకునే ఘట్టం. 
రాముని, లక్ష్మణుడిని కలుసుకునే సమయమునకు హనుమంతుడు సుగ్రీవుని వద్ద మంత్రిగా ఉన్నాడు. ఆ సమయమునకు సుగ్రీవుడు తన రాజ్యమును కోల్పోయి, తన సొంత అన్నగారయిన వాలితో శత్రుత్వం వలన ప్రాణ భయంతో ప్రపంచం మొత్తం తిరిగి, చివరకు వాలి రాకుండా ఉండగలిగిన ప్రాంతం ఋష్యమూకం అని తెలుసుకుని ఆ పర్వతం మీద నివాసం ఉంటున్నాడు. ఆ సమయమునకు అతనితో హనుమంతుడు, జాంబవంతుడు మొదలయిన ముఖ్యులు ఉన్నారు. 
ఆ సమయంలో ఋష్యమూక పర్వత ప్రాంతంలో కొత్తగా కనిపించిన, ముని వేషదారులయిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవునికి వాలి తనకోసం వారిని పంపించాడేమో అన్న భయం కలిగింది. ఆ భయమును తననుండి దూరం చేయవలసినదిగా తన మంత్రి అయినా హనుమంతుని కోరాడు. దానికోసం హనుమంతుడు ఆ ఇద్దరు ముని వేషదారుల పూర్వాపరముల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆ విధమయిన విషయములు తెలుసుకోవాలంటే ముందు ఆ ఇద్దరికీ  ప్రశ్నలు అడుగుతున్నా వారి మీద నమ్మకం కలగాలి . ఒక వేళ ఆ వచ్చినవారు వాలి తరపున వచ్చి ఉంటే వారిని అక్కడే నిలువరించే సాహసం కలవాడు హనుమంతుడు కనుక సుగ్రీవుడు హనుమంతుడిని ఆ పనికోసం పురమాయించాడు.  
ఇప్పుడు సమస్య హనుమంతుడు ఏ వేషంలో వారి ముందుకు వెళ్ళాలి అని!
అనేక రామాయణములలో ఈ ఘట్టం లో హనుమంతుడు 
  1. భిక్షకుని/ సన్యాసి వేషం  అని  చెప్తారు.  
  2. వటువు / బ్రహ్మచారి వేషం అని చెప్తారు. 
మరి ఇంతకూ హనుమంతుడు ఈ వేషంలో వెళ్ళాడు?
  1. భిక్షకుని/ సన్యాసి వేషం ః ఒకవేళ హనుమంతుడు సన్యాసి వేషంలో వెళ్ళినట్లయితే, కథప్రకారం హనుమంతుడు ఆ సోదరుల వద్దకు చేరగానే వారికి నమస్కరించాడు. ఒక భిక్షకుడు / సన్యాసి గృహస్తుకు నమస్కారం చేయడు. హనుమంతుడు భిక్షకుని/ సన్యాసి వేషం లో కనుక అలా చేస్తే రామ లక్ష్మణులకు ముందుగా అతని మీద అనుమానం కలుగుతుంది. తరువాతి ఘట్టములు మన ఊహకు అందని విధం గ ఉండేవి. సుగ్రీవ రాముల మైత్రి ప్రారంభం కూడా అనుమానాస్పదంగానే ఉండేది కదా! 
  2. వటువు / బ్రహ్మచారి వేషం: ఈ వేషం అయితే ఎవరికీ అయినా నమస్కారం చేయవచ్చు. అంటే కాకుండా ఇతను ఆ ఇద్దరినీ ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనే సంకల్పంతో వచ్చాడు కనుక వటువు వేషం అయితే అతను ఈని ప్రశ్నలు అడిగినా వటువుకు కలిగిన సహజసిద్దమయిన జిజ్ఞాస వలన అడుగుతున్నాడు అని అనుకోవటానికి ఆస్కారం దొరుకుతుంది. 
కనుక హనుమంతుడు తొలిసారిగా రామలక్ష్మణులను కలసినప్పుడు ఆటను బ్రహ్మచారి వేషంలో కలిసాడు. 







22, మే 2020, శుక్రవారం

చిలుక - ఉపకారం

మానవుని జీవితంలో ఒకరికి ఉపకారం చేయటం, మరొకరి సహాయం తీసుకోవటం చాలా సహజం. అయితే మనం ఒకరి వద్ద సహాయం తీసుకుంటే వారి పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయం గురించి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పారు. ఆ కదా ఇప్పుడు మనం చూద్దాం!
ఒకానొక సమయంలో కాశీ దేశంలో ఒక వేటగాడు ఉన్నాడు. ఆ వేటగాడు ఒకసారి వేటకు వెళ్లి ఒక జింకను వెంబడించాడు. ఆ జింకకు గురిపెట్టి ఒక విషపూరితమయిన బాణమును వదిలాడు. ఆ జింక ఆ బాణం నుండి తప్పించుకుని పారిపోయింది. ఆ బాణం తిన్నగా వెళ్లి ఒక పెద్ద చెట్టుకు తగిలింది. చాలా పువ్వులతో, కాయలతో అద్భుతంగా ఉన్న ఆ చెట్టు ఒక్కసారిగా ఆ బాణమునకు ఉన్న విషం కారణంగా నిర్జీవం అయిపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక కాపురం ఉండేది.
ఆ చెట్టు నిర్జీవంగా మారినా, ఆ చిలుకకు ఇప్పుడు ఏ సహాయం చేసే స్థితిలో లేకపోయినా, ఆ చిలుక ఆ చెట్టు తొర్రలోనే నివసిస్తూ ఉంది. ఎండ,  చలి,వర్షం వంటి ఏ పరిస్థితి లోనూ ఆ చిలుక ఆ చెట్టును వదిలిపోలేదు. కారణం ఆ చెట్టు ఇంతకు  ముందు ఆ చిలుకకు ఆశ్రయం కలిగించుట వలన కలిగిన గౌరవ మర్యాదలు. ఏమి జరిగినా తనకు ఎంతో సహాయం చేసిన ఆ చెట్టును వదిలి పోకూడదు అని ఆ చిలుక దృఢసంకల్పం గురించి ఇంద్రునికి తెలిసింది. ఆ చిలుకను పరీక్షిద్దామని ఇంద్రుడు మానవ రూపంలో ఆ చిలుక దగ్గరకు వచ్చాడు.
ఆ చిలుకను చూసి ఇంద్రుడు "ఓ చిలుకా, ఈ అడవిలో ఎన్నో పుష్పించిన, ఫలములు ఉన్న చెట్లు ఉండగా నీవు ఈ ఎండిపోయిన చెట్టు తొర్రలో ఎందుకు ఉంటున్నావు ?" అని అడిగాడు.
ఆ మాటలు విన్న చిలుక "ఓ దేవేంద్రా ! మనకు సహాయం చేసిన వారిని అంటిపెట్టుకుని ఉండుట మన ధర్మం కదా! ఈ వృక్షం ఫలములతో పుష్పములతో ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చింది, ఇప్పుడు దీనికి ఆ శక్తి లేదు, ఆశ్రయం ఇచ్చినప్పుడు తీసుకుని, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం మనకు సహాయం చేసిన వారిని వదలి వెళ్ళిపోతే కృతఘ్నత అవుతుంది కదా!"అని సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న దేవేంద్రుడు, నేను మారువేషంలో వచ్చినా ఈ చిలుక నన్ను గుర్తుపట్టింది అంటే అది దీని పూర్వజన్మ శుభఫలముల వలెనే కనుక తానూ ఆ చిలుకకు సహాయం చేయాలి అని కున్నాడు.
అప్పుడు ఆ చిలుకతో "ఓ చిలుకా! నీవు చెప్పిన ధర్మమునకు నేను ఏంటో సంతోషించాను, నీకు ఏదయినా వరం ఇవ్వాలి అనుకుంటున్నాను నీకు ఏమి కావాలో కోరుకో" అన్నాడు. ఆ మాటలు విన్న చిలుక "ఓ దేవేంద్రా! ఈ వృక్షమునకు తిరిగి పూర్వ స్థితి కలిగించు అని చెప్పింది"
 ఆ మాటలు విన్న దేవేంద్రుడు అత్యంత సంతోషించి ఆ చెట్టు మీద అమృతం చల్లి , ఇంతకూ ముందు ఉన్న వైభవం కంటే ఇంకా ఎక్కువ వైభవమును కలుగజేసాడు.
మనం మనకు సహాయం చేసిన వారికి కష్టం కలిగిన పరిస్థితిలో వారికి తిరిగి మన సహాయమును అందించాలి 

21, మే 2020, గురువారం

ఋచీకుడు - పరశురాముడు - విశ్వామిత్రుడు

ఋచీకుడు నవబ్రహ్మలలో  ఒకరయిన భృగు మహర్షి యొక్క కుమారుడు. ఇతను తన తండ్రి వలెనే  అత్యంత తపస్సంపన్నుడు. ఆ తపస్సులో నిమగ్నమయ్యి ఉండుట వలన ఆటను వివాహం చేసుకోకుండానే వృద్దాప్యమును పొందాడు. అయితే ఒకసారి అతను సత్యవతి అనే రాజకుమారిని చూసి, వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె వివరములు కనుక్కున్నాడు. ఆమె జహ్నుని కులంలోని కుశనాభుని కుమారుడయిన గాధి పుత్రిక. కనుక ముందుగా తన తండ్రి అయినా భృగువు అనుమతి తీసుకుని, మహారాజు అయిన గాధి వద్దకు వెళ్ళి రాకుమార్తెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. ఆ ప్రతిపాదన రాజుకు ఇష్టం కాలేదు.  ముసలివాడయిన ఒక ఋషికి తన కుమార్తెను ఇవ్వటం గాధికి ఇష్టంలేదు. ఆ విషయం తిన్నగా చెబితే ఆ మహర్షి శపిస్తాడేమో అని భయం. అందుకే అతి కష్టసాధ్యమయిన ఒక కోరిక కోరాలి అని తలచి, కన్యాశుల్కం / ఓలి కింద తనకు శరీరం మొత్తం తెల్లగా ఉండి, కేవలం ఒక్క చెవిమాత్రమే నల్లగా ఉండే వెయ్యి గుఱ్ఱములు ఇస్తే ఆమెను వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు.

ఆ మాటలు విన్న  ఋచీకుడు వరుణదేవుని ప్రార్ధించాడు. ఆ ప్రార్థనలకు మెచ్చి వరుణుడు ఋచీకుడు ఎక్కడ కావాలంటే అక్కడే ఆ అశ్వములు వస్తాయి అని చెప్పాడు. ఆ తరువాత ఋచీకుడు గంగానది ఉత్తరపు ఒడ్డున ఆ గుఱ్ఱములు రావాలి అని సంకల్పం చేసాడు. అలా వచ్చిన గుఱ్ఱములను తీసుకుని గాధి కి ఇచ్చి, అతను రాకుమారి సత్యవతిని వివాహం చేసుకున్నాడు.
వీరి వివాహమయిన కొంతకాలానికి ఋచీకునికి సంతానేచ్ఛ కలిగింది. ఆ మాట తన భార్యకి చెప్పగా, ఆ సత్యవతి తన తండ్రికి వంశోద్ధారకుడు లేదు కనుక తనతో పాటు తన తల్లి కోసం కూడా పుత్ర సంతానం కలిగేలా చూడామణి ప్రార్ధించింది. ఆ ప్రార్ధన విన్న ఋచీకుడు ఒక బ్రాహ్మణత్వం కలిగిన ప్రసాదమును, ఒక క్షత్రియత్వం కలిగిన ప్రసాదమును ఇచ్చి బ్రాహ్మణ ప్రసాదమును సత్యవతి ని స్వీకరించమని, క్షత్రీయ ప్రసాదమును ఆమె తల్లిని స్వీకరించమని , ఆ తరువాత వారు ఋతుస్నాతలు అయినా సమయంలో సత్యవతిని మేడిచెట్టును, ఆమె తల్లిని రావి చెట్టును కౌగలించుకోమని చెప్పాడు.
ఆ సమయం వచ్చినప్పుడు సత్యవతి , ఆమె తల్లి ఇద్దరూ తమతమ ప్రసాదమును, వారు కౌగలించుకోవలసిన చెట్టును తారుమారు చేశారు. ఆ విషయం గమనించిన ఋచీకుడు సత్యవతి వద్దకు వచ్చి బ్రాహ్మణుడయిన తనకు క్షత్రియ అంశతో, గాధి మహారాజుకు బ్రాహ్మణ అంశతో ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న సత్యవతి బాధపడి, తనకు సద్బ్రాహ్మణుడు కుమారునిగా ప్రసాదించమని అడిగింది. అప్పుడు ఋచీకుడు తన తపో శక్తిని ప్రయోగించి, తమకు ఒక బ్రాహ్మణుడే కుమారునిగా పుట్టేలా, మనుమడు మాత్రం క్షత్రీయ లక్షణములతో పుట్టేలాగా మార్చాడు. ఆ విధంగా ఋచీకుడు, సత్యవంతులకు పుట్టిన పుత్రుడు జమదగ్ని, వారి మనుమడు క్షత్రియ లక్షణములు కలిగిన పరశురాముడు.
మహారాజు గాధికి బ్రాహ్మణ లక్షణములతో జన్మించిన వాడు విశ్వామిత్రుడు.

20, మే 2020, బుధవారం

సుందోపసుందులు

పూర్వం దైత్య వంశంలో నికుంభుడు అనే దైత్యునకు సుందుడు, ఉపసుందుడు  అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారిద్దరూ అత్యంత స్నేహభావంతో పెరిగి పెద్దవారయ్యారు. ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఒకసారి ఇద్దరూ  కలిసి అనేక సంవత్సరములు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు. వారిని ఇంద్రుడు అనేక రకములుగా పరీక్షించినా వారు తపస్సును మానలేదు. ఇక తప్పని పరిస్థితిలో బ్రహ్మదేవుడు వారు ముందు ప్రత్యక్షం అయ్యి వరమును కోరుకొమ్మని అడిగాడు.
అందరు దైత్యులు లాగానే మరణం లేని వరం కోరుకున్నాడు. కానీ ఆ వరం ఇవ్వటం సాధ్యంకాదు అని బ్రహ్మదేవుడు చెప్పిన తరువాత, వారు ఒక విచిత్రమయిన కోరిక కోరారు.
వారు కోరిన వరం , వారు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగేలాగా,అన్ని మంత్రములు, మాయలు వారి వశంలో ఉండేలాగా, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలిగేలాగా, వారిని యుద్ధ రంగంలో ఎవరూ ఓడించకుండా, ఒకవేళ వారిద్దరూ ఒకరితో ఒకరు గొడవపడి యుద్ధం చేసుకుంటే మాత్రమే చనిపోయేలాగా వారు వరం కోరుకున్నారు.
బ్రహ్మదేవుడు తధాస్తు అని దీవించి వారికి ఆ వరములు ఇచ్చాడు.
వర గర్వితులయిన దైత్యులు అన్ని లోకముల మీద దండెత్తి వానిని స్వాధీన పరుచుకోవటం మొదలు పెట్టారు. వీరి ఆగడాలు సహించలేని దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, బ్రహ్మదేవుడు అలోచించి, విశ్వకర్మను పిలిపించాడు. విశ్వకర్మ చేత తిలోత్తమ అనే అప్సరసను సృజింపజేసి ఆమె ను ఆ దైత్యుల వద్దకు పంపారు.
ఆ సుందోపసుందులు ఆమెను చూసి మోహించి, తనకు మాత్రమే సొంతం, తనకు మాత్రమే సొంతం అని గొడవ పడి, వారిలో వారే  యుద్ధం చేసుకుని , చివరకు మరణించారు.  

19, మే 2020, మంగళవారం

పినాకం - శివుని విల్లు

శివుని ధనస్సును పినాకం అంటారు. దాని వల్లనే శివునికి పినాక పాణి అని పేరు వచ్చింది. అయితే ఆ పినాకమును ఎవరు తయారుచేసారు ? దానిని శివునకు ఎవరు ఇచ్చారు? దీనికి సమాధానం స్వయంగా శివుడే పార్వతికి చెప్పిన ఘట్టం మనకు మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కనిపిస్తుంది.
మనం ఇంతకూ ముందు కల్పములు మరియు యుగములు గురించి చెప్పుకున్నాం కదా! వాని లోని మొదటి కల్పంలోని మొదటి కృతయుగంలో కణ్వుడు అనే మహర్షి మహానిష్ఠ కలిగి అత్యంత కఠినమయిన తపస్సు చేసాడు. ఆటను తపస్సులో లీనమయ్యి ఉండగా, అతని శరీరంమీద పెద్ద పుట్టలు ఏర్పడ్డాయి. పుట్టమీద ఒక వెదురు మొక్క జన్మించినది. ఆ వెదురు మొక్క సహజంగా కాక అతని తపస్సు వలె అత్యంత గొప్పగా పెరిగింది. దాని పొడవు, వెడల్పు చాలా ఎక్కువగా పెరిగాయి. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వరములను ఇచ్చాడు.
 ఆ వెదురుని బ్రహ్మదేవుడు తనతో తీసుకుని వెళ్ళాడు. దానిని విశ్వకర్మకు ఇచ్చి రెండు విల్లులు చేయమన్నాడు. అలా తయారయిన విల్లులే శివుని చేతిలో ఉండే పినాకం, ఇంకా శ్రీ మహా విష్ణువు చేతిలో ఉండే శారఙము. ఆ రెండు ధనస్సులే కాక మిగిలిన చిన్న ముక్కతో మరొక విల్లును తయారుచేసాడు విశ్వకర్మ. ఆ మూడవ ధనస్సే అర్జునుని చేతికి వచ్చి చేరిన గాండీవము.

18, మే 2020, సోమవారం

విష్ణుమూర్తికి దాస్యం చేయటానికే శివుడు హనుమంతునిగా పుట్టాడా?

మనం ఇంతకుముందు హనుమంతుడు శివుని అంశ ,వాయువు పుత్రుడు ఎలా అయ్యాడు అని చెప్పుకున్నాం! దానితో పాటు దశరధుని పుత్రకామేష్టి ఫలమయిన పాయసం కారణంగా హనుమానితుడు జన్మించాడు అనే విషయం కూడా చెప్పుకున్నాం!  మరి అసలు హనుమంతుని జన్మకు సార్ధకత అతని దాస్యభక్తి అని మనకు అందరికి తెలుసు కదా! మరి విష్ణుమూర్తికి దాస్యం చేయటానికే శివుడు హనుమంతునిగా పుట్టాడా?
మన పురాణములలో ఒక కథాప్రకారం అవును అనే చెప్పుకోవాలి మరి. ఆ కధ ఏమిటో చూద్దామా!

పుర్వకాలంలో గార్దభనిస్వనుడు అనే ఒక పరమశివ భక్తుడు ఉండేవాడు. అయితే ఎల్లప్పుడూ శ్రీహరిని ద్వేషిస్తూ ఉండేవాడు. శివునికి భక్తుడు అవ్వటం వలన శివునికొరకు  అత్యంత ఘోరమయిన తపస్సు చేసి తనకు జాగ్రత్తు, సుషుప్తి మరియు స్వప్నావస్థలలో ఎవ్వరి చేత మరణం రాకుండా వరం సంపాదించాడు. ఆ వర గర్వంతో  విష్ణుభక్తులను హింసించటం మొదలుపెట్టాడు.    అలాగే  దేవతలను కూడా హింసించాడు. అతని బాధలు పడలేక దేవతలు, మునులు బ్రహ్మదగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ వారిని తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. వారి బాధలని ఆలకించిన శ్రీమహావిష్ణువు వారిని ఓదార్చి, ఆ రాక్షసుడిని చంపి, అందరికి శాంతిని కలిగిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట విన్న శివుడు విష్ణువు వద్దకు వచ్చి, అతను గార్దభనిస్వనుని కి ఇచ్చిన వరముల గురించి చెప్పి, అతనిని నిర్జించుట అసాధ్యం అని చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీహరి నవ్వి పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదు కదా! అలాగే గార్దభనిస్వనుడు కూడా మరణిస్తాడు అని చెప్పారు. శ్రీ హరి చెప్తున్న ఆ మాటలు విన్న శివునికి కుతూహలము పెరిగి, ఒకవేళ శ్రీ మహావిష్ణువు కనుక ఆ గార్దభనిస్వనుడిని సంహరించినట్లయితే తాను స్వయంగా శ్రీమహా విష్ణువుకు దాస్యం చేస్తాను అని పలికారు.
శివుని మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వారు.
తరువాత అతను విశ్వమోహన సౌందర్యవతియైన జగన్మోహిని రూపందాల్చి ఆ గార్దభనిస్వనుడు నివసించే అంతఃపురం దగ్గరకు వెళ్లి మధురస్వరంతో సామవేద గానం ప్రారంభించారు. ఆ అద్భుత గానమునకు ఆకర్షితుడయ్యి గార్దభనిస్వనుడు అంతఃపురంనుండి బయటకు వచ్చి ఆ జగజన్మోహిని సౌందర్యం చుసి మోహితుడయ్యి  ఆమె ఎవరు? ఎక్కడినుండి వచ్చింది? మొదలయినవి వివరములు అడిగాడు. తరువాత అతని గురించి గొప్పలు చెప్పుకున్నాడు, అలా చెప్పుకుని ఆమెను తనని వివాహం చేసుకోమంటూ ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదనను వినిన మోహిని,  ఆమెను నాట్యగానములలో  ఓడించితే అలాగే చేద్దాం అని అతనికి సవాలు చేసింది. ఆ సవాలని స్వీకరించిన అతను అలా  నాట్యం చేస్తున్న మోహినిని చూసి మైమరిచిపోసాగాడు. ఆ అదును చూసుకుని మోహిని అతనికి సురాపానమును చేతికి అందించింది. ఆమెమీద వ్యామోహం తో ఉన్న గార్దభనిస్వనుడు దానిని  తాగి జాగ్రదావస్థ కాక స్వప్నావస్తా కాక ఉన్న సమయంలో జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు వృకనారాయణావతారం ధరించి గార్దభనిస్వనుడిని తన వాడి అయిన గోళ్ళతో చంపివేసాడు.

ఆ విషయం తెలుసుకున్న శివుడు శ్రీమహావిష్ణువు వద్దకు వచ్చి తాను దాస్యమును స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నాను అని తెలుపగా దానికి శ్రీమహావిష్ణువు ఆ దాస్యమునకు సరిఅయిన సమయం అప్పుడు కాదని, ద్వాపర యుగంలో  తాను శ్రీరామావతార సమయంలో ఆ ముచ్చట తీర్చుకుందాం అని చెప్పారు.
తరువాత శ్రీహరి తన రామావతారమును గురించి, ఆ సమయంలో అతనికి శివుని అవసరం గురించి ఇలా చెప్పారు.
రామావతారంలో నా శక్తి అయిన లక్ష్మి అపహరించబడినప్పుడు, నేను నా అవతార కార్యమును పూర్తిగావించుటకు నాకు తోడుగా ఓ మహాదేవా! తమరు ఆదిశక్తి సహితముగా నా అంశను కూడా పొంది , ఆ కార్యమును సాధించుటకు నాకు నవ్యశక్తి ని ప్రసాదించి, నన్ను పరిపూర్ణునిగా చేయండి. 

17, మే 2020, ఆదివారం

సువర్చల అప్సరస

ఒకసారి బ్రహ్మలోకంలో అప్సరసలు నాట్యం చేస్తున్న సమయంలో, సువర్చల అనే ఒక అప్సరస సరిగా నాట్యం చేయలేదు. దానికి కోపగించిన బ్రహ్మదేవుడు ఆమెకు గ్రద్ద కమ్మని శాపం ఇచ్చారు. తాను చేసిన తప్పుకు చింతించిన సువర్చల తనకు శాప విమోచనం కలిగే మార్గం చెప్పమని కోరుకున్నది. ఆ ప్రార్ధన విన్న బ్రహ్మదేవుడు శాంతించి, ద్వాపరయుగంలో దశరధ మహారాజు పుత్రకామేష్టి చేసినప్పుడు, ఫలంగా దొరికిన పాయసము ను తాకగానే ఆమెకు శాప విమోచనం దొరుకుతుంది అని చెప్పారు. ఆ రోజునుండి ఆమె గ్రద్దగా మారి విమోచనం కలిగే రోజు కోసం ఎదురుచూస్తూ ఉంది. 
దశరధుని పుత్రకామేష్టి జరిగినప్పుడు ఆమె కైకేయి పాయసం పాత్ర తీసుకుని వెళ్లింది.  ఆమెకు శాప విమోచనం జరిగింది. 

హనుమంతుడు- దశరధుని పుత్రకామేష్టి

మనం ఇంతకు ముందు హనుమంతుడు శివుని అంశ , వాయుపుత్రుడు ఒకేసారి ఎలా అయ్యాడు అని తెలుసుకున్నాం కదా! అలాగే హనుమంతుని జన్మకు సంబందించిన మరొక విచిత్ర మయిన విషయం ఇప్పుడు తెలుసుకుందాం! ఈ విచిత్రమయిన సంఘటన ఆనందరామాయణం లో చెప్పారు. మూల వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టం చెప్పలేదు.

దశరథమహారాజు తనకు పుత్రులు కలగాలని, తన భార్యలతో కలిసి ఋష్యశృంగుని అద్వర్యం లో పుత్రకామేష్టి చేశారు. ఆ యాగంలో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యి దశరధుని చేతికి ఒక కలశమును అందించారు. ఆ కలశంలో ఉన్న పాయసమును దశరధుడు తన ముగ్గురు భార్యలకు సమానంగా పంచాడు. అప్పుడు దశరధుని మూడవ భార్య అయినా కైక చేతిలోని పాయసం నిండిన పాత్రను ఒక గద్ద తన ముక్కుతో పట్టుకుని వేగంగా వెళ్లి పోయింది. ఆ హఠాత్ సంఘటనతో దిగులు చెందిన కైకకు దశరధుని మిగిలిన భార్యలు అయినా సుమిత్ర, కౌసల్య తమతమ పాయసమునందలి కొంత కొంత భాగములు ఇచ్చారు.
అలా ఆ పాయసపాత్రను పట్టుకుని వేగంగా పైకి ఎగిరిన గ్రద్ద ఆ పాయసము తనను తాకగానే ఒక అప్సరసగా మారి వెళ్లి పోయింది. అలా అప్సరసగా మారిన గ్రద్ద వదిలేసిన ఆ పాయసపాత్రను
వాయుదేవుడు అంజనాద్రి పై పుత్రుని కొరకు పరమ శివుని ప్రార్ధిస్తున్న అంజనాదేవి వొడిలో పడేవిధంగా చేసాడు. పరమేశ్వర ప్రసాదంగా భావించి అంజనాదేవి దానిని స్వీకరించి, ఏకాదశమ రుద్రుని అంశగా శ్రీ హనుమంతునికి జన్మను ఇచ్చింది.



16, మే 2020, శనివారం

తిలోత్తమ

మనకు పురాణములలో అనేక సందర్భాలలో అప్సరసల ప్రస్తావన వస్తుంది. ఇంతకు ముందు మనం 31 మంది అప్సరసల పేర్లు చెప్పుకున్నాం కదా!   వారిలో ఒకరు తిలోత్తమ.
ఇప్పుడు ఆ తిలోత్తమ జన్మకు కారణం తెలుసుకుందాం!

ఈ సంఘటనను మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పారు.  ఆ ఘట్టం ప్రకారం తిలోత్తమను సృష్టించిన వాడు విశ్వకర్మ. పుర్వం సుందుడు, ఉపసుందుడు అనే రాక్షసులు, బ్రాహామా వర గర్వితులయ్యి సకల లోకములను భాదించుతూ ఉండగా, వారిని సంహరించాలంటే ఉన్న ఒకే ఒక మార్గం వారిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి, యుద్ధం చేసి చనిపోవటం మాత్రమే మార్గం అని గ్రహించి, ఇద్దరు వీరుల మధ్య కలహం మొదలు అవ్వాలి అంటే దానికి కారణం ధనం లేదా మగువ మాత్రమే అయ్యి ఉండాలి అని భావించారు. వారికి ఇంతకూ మునుపే అనేకములయిన ధనరాశులు ఉన్నాయి కనుకకేవలం స్త్రీ మాత్రమే ఆ కార్యమును సాధించగలడు అని భావించి, ఆ కార్యమునకు సరిపోయే విధంగా ఒక అద్భుతమయిన సౌందయము కల అప్సరసను సృష్టించవలసినది గా బ్రహ్మ విశ్వకర్మను కోరాడు.
అటువంటి అద్భుతమయిన స్త్రీని తయారు చేయటానికి విశ్వకర్మ సకల సృష్టి లోని అమూల్యములు, అద్భుతములు అయిన అందములను చిన్న నువ్వుల పరిమాణంలో పేర్చి, అత్యంత సుందరమయిన స్త్రీని మలిచాడు. దానికి ప్రాణం పోసాడు. అలా ఉద్భవించిన స్త్రీకి తిలోత్తమ అనే పేరు పెట్టారు. 

15, మే 2020, శుక్రవారం

అఙాతవాసం - పాండవుల పేర్లు

మహాభారతం లోని ముఖ్య మయిన ఘట్టములలో ఒకటి పాండవుల వనవాసం, వారి అఙాతవాసం. మరి పాండవులు వారి అఙాతవాసంను విరాటరాజు కొలువులో గడిపారు. మరి అక్కడ వారు ఏ పేర్లతో, ఏమి పని చేస్తూ గడిపారు? ఇప్పుడు తెలుసుకుందాం!

ధర్మరాజు - కంకుభట్టు అనే పేరుతో రాజా ఆస్థానంలోని ప్రవేశించాడు. రాజు కు మానసిక ఉల్లాసం కలిగించే శాస్త్ర చర్చలు చేయటం, స్నేహపూర్వకమయిన జూదం ఆడటం అతను చేస్తూ ఉంటాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు  జయుడు.
భీముడు- వలలుడు అనే పేరుతో ఒక వంటవానిగా విరాట రాజు వద్ద చేరాడు. ఇతని వంట అద్భుతం.  వంట మాత్రమే కాక మల్ల విద్య కౌశలం కూడా ప్రదర్శించే వాడు.  అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయంతుడు.
అర్జునుడు- బృహన్నల అంటే పేడి వానిగా విరాటుని ఆశ్రయించాడు. ఇతను స్వర్గంలో ఉన్న సమయంలో ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇలా వాడుకున్నాడు. అంతే కాక స్వర్గంలో ఉన్న సమయంలో నేర్చుకున్న సంగీత, నృత్య శాస్త్రములను అంతఃపురంలోని కన్యలకు నేర్పించేవాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు విజయుడు.
నకులుడు - దామగ్రంథి అనే పేరుతో అశ్వశిక్షకుడుగా అక్కడ చేరాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు విజయత్సేనుడు
సహదేవుడు - తంత్రీపాలుడు అనే పేరు తో గోసంరక్షకుడుగా చేరాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయద్బలుడు.
ద్రౌపది -  మాలిని అనే పేరుతో విరాటుని అంతఃపురంలో అతని రాణి సుధేష్ణ వద్ద సైరంద్రి గా ఉన్నది. అయితే పాండవులకు మరొక పేరూరు ఉన్నట్లు, వారు ద్రౌపదికి మరో పేరు సంకేతనామం గా పెట్టుకొనలేదు.  

14, మే 2020, గురువారం

ధర్మరాజు -- 16 కళలు

మనకు ఉన్న ముఖ్యమయిన గ్రంధాలు రెండు. రామాయణం, మహాభారతం. రామాయణం సూర్య వంశంలో జన్మించిన రాముని యొక్క చరితము. కానీ మహాభారతంలో చంద్ర వంశం గురించి చెప్పినా, ఏ ఒక్కరి గురించి మాత్రమే చెప్పిన కధ కాదు. కానీ ఈ కధలో ప్రధానుడు, ఇప్పటి మన భాషలో "హీరో" గా పిలువటానికి అర్హత  గలిగిన వాడు పాండవుల లో పెద్దవాడు అయిన ధర్మరాజు.
ఇంతకు  ముందు మనం రాముని గురించి  పదహారు కళల (లక్షణాల )గురించి చెప్పుకున్నాం కదా! అలాగే ధర్మ రాజు ని చంద్రునిలా  పదహారు కళలు కలిగిన వానిగా చెప్పిన సందర్భం మహాభారతం లో ఒకచోట కనిపిస్తుంది . అది విరాట పర్వం మొదటి భాగంలో, వారు విరాటుని కొలువులో పనిచేయవలసి ఉంటుంది  అని నిర్ణయించుకున్న తరువాత తన తమ్ములు ధర్మరాజు గురించి చెప్పిన సందర్భంలో ఈ పద్యం చెప్తారు.

సీ : మహనీయ మూర్తియు, మానవైభవమును, 
సౌకుమార్యంబును,సరసతయును  
మార్దవంబు, బ్రభుత్వ మహిమయు, నపగత 
కల్మషత్వంబును, గౌరవంబు 
శాంతియు, దాంతియు, జాగంబు, భోగంబు 
గారుణ్యమును, సత్యసారతయును 
ధర్మమయ క్రియా తత్పరత్వంబును 
గీర్తి, ధనార్జన క్రీడానంబు 

ఆ : గలిగి జనుల నేల గాని, యెన్నందును 
నొరులఁ గొల్చి తిరుగ వెరవు లేని 
యట్టి నీవు విరటు నెట్టి చందంబున 
ననుచరించు వాడ వధిప ! చెపుమ !

భావం : ఓ ధర్మరాజా! నీకు చక్కని రూపం, అభిమాన వైభవం, సౌకుమార్యం, సరసత, మృదుత్వం,ప్రాభవం, నిష్కల్మషత్వం, గౌరవం, శాంతి, దాంతి,  త్యాగం, భోగం, దయ , సత్యం, ధార్మిక క్రియాశీలత, కీర్తి , ధనము అనేవి నీకు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఇతరులను సేవించే నేర్పు నీకు లేదు, (ఇప్పటివరకు అటువంటి అవసరం నీకు రాలేదు), అటువంటి నీవు సామాన్యుడు అయిన విరాటుని ఎలా సేవించగలవు? చెప్పు!

13, మే 2020, బుధవారం

మన్మదావస్థలు

అలంకార శాస్త్రములను అనుసరించి మన్మదావస్థలు దశ విధములు. వాని గురించి చెప్పే శ్లోకం చూద్దామా !
చక్షుఃప్రీతిః ప్రధమం చింతాసంఘస్తతో ధ  సంకల్పః
నిద్రాచ్ఛేదస్తనుతా విషయనివృత్తి స్త్రపానాశః
ఉన్మాదో మూర్ఛా మృతిరిత్యతే స్మరదశా దశైవ న్యుః

భావం ః కనులతో చూచుట వలన చక్షుప్రీతి, ఆలోచనలలో కలిసినట్లు ఉహించుకొనుట, కలవాలి అనే సంకల్పం, నిద్ర లేకుండా జాగారం, శరీరం కృశించుట, ఆరాటం, సిగ్గును కూడా మరచి ప్రవర్తించుట, ఉన్మాదం, మూర్ఛ మరియు చివరికి చనిపోవుట అనే ఈ పది లక్షణములను మన్మదావస్థలుగా ప్రబంధములలో నిర్వచించారు. 

11, మే 2020, సోమవారం

సాక్షులు

మనం ఏదయినా న్యాయసంబంధమయిన విషయములు చర్చించవలసి వస్తే, ఆ సమయంలో ముఖ్యంగా పరిగణలోనికి తీసుకునేది సాక్ష్యుల వాంగ్మూలములు. మరి మన శాస్త్రములలో చెప్పిన సాక్ష్యములు ఎన్ని రకములు  ఏమిటి? ఇప్పుడు చూద్దామా!

మన శాస్త్రములు చెప్పినదాని ప్రకారం సాక్ష్యములు పదకొండు రకములు.  ఈ పదకొండు రకముల సాక్షులను తిరిగి రెండు రకములుగా విభజించారు. 

కృతసాక్ష్యులు : ముందుగానే నిర్ణయించబడిన సాక్ష్యులు. వీరు ఐదు రకములు. 
  • లిఖితుడు
  • స్మారితుడు
  • యదృచ్చాభిజ్ఞుడు
  • గూడుడు 
  • ఉత్తరుడు 
అకృతసాక్ష్యులు: ముందుగా నిర్ణయించ బడని సాక్ష్యులు. వీరు ఆరుగురు 

  • గ్రామస్థులు 
  • ప్రాడ్వివాక 
  • లేఖకసభ్యులు 
  • రాజు 
  • కార్యాధికారి 
  • వాదిచే పంపబడిన వాడు

7, మే 2020, గురువారం

వసిష్టుడు- పుత్రశోకం

మానవుని జీవితంలో అత్యంత బాధాకరమయినవి అష్ట కష్టములు అని చెప్పుకున్నాం కదా! అయితే వాతన్నేంటిని మించిన అత్యంత భాదాకరామయిన విషయం తన సొంత బిడ్డలను పోగొట్టుకోవటం. ఒక బిడ్డను పోగొట్టుకుంటేనే అంత కష్టం అయితే, వందమంది కొడుకులను ఒకేరోజు పోగొట్టుకుంటే?? ఆ బాధ ఎంత వర్ణనాతీతమో కదా!!!
ఇంతకీ ఇంతటి కష్టం ఎవరికీ వచ్చింది? ఆ భాదను వారు ఎలా భరించారు? ఆ బాధనుండి ఎలా బయట పడ్డారు? ఈ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం!

వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ల మధ్య స్పర్ధలు పెరుగుతున్న సమయంలో శాపవశాత్తూ రాక్షసుడిగా మారిన కల్మాషపాదుడు వశిష్ఠుని పుత్రులు శక్తి మొదలయిన వారు అయిన వందమందిని ఒకే రోజు చంపేశాడు. దానికి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు ఏం  చేసాడు?
తన తపో బలం ఏంటో ఉన్నా , ఆ కల్మాషపాదుడిని శపించలేదు, తన పుత్రులను బ్రతికించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. విధిని తప్పించుకొనుట సాధ్యం కాదు అని అనుకున్నాడు. కానీ తన పుత్రులు మరణించిన భాధను భరించలేక ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు మొత్తంగా ఐదు సార్లు ఆ ప్రయత్నం చేసాడు. ఎంత మహర్షి అయినా, బ్రహ్మర్షి అయినా పుత్ర వియోగ బాధ ను భరించుట కటం కదా!

మరి ఇంతకీ అతను ఆ బాధనుండి ఎలా బయట పడ్డాడో తెలుసా? అతను  అత్యంత బాధాకరమయిన స్థితి లో ఉన్న వశిష్ఠుడు తన ఆశ్రమములో గర్భంతో ఉన్న శక్తి భార్య అయిన తన కోడలిని చూసాడు. ఆమె పేరు అదృశ్యంతి. ఆమె గర్భంలో ఉన్న శిశువు వేదములు చదవటం అతనికి వినిపించింది. ఆ కడుపులోని బిడ్డ స్వరం చక్కని శక్తి మహర్షి స్వరంలా వినిపించ సాగింది. ఆ బిడ్డ కడుపులో ఉండగా శక్తి ఉచ్చరించే వేదములను  ఆ బిడ్డ విన్నాడు. ఇప్పుడు అదే వేదములను చక్కని స్వరంతో ఉచ్చరిస్తున్నాడు. ఆ చక్కని స్వరం విన్న వశిష్ఠుని మనస్సు  ఊరట చెందింది.

అత్యంత బాధ కలిగినప్పుడు సామాన్య మానవుని నుండి మహర్షి, బ్రహ్మర్షులయినా ఒకేరకంగా ఆలోచిస్తారు. కానీ ఆ బాధను మరచిపోయే మార్గం తెలుసుకుని, ఆ కారణంకోసం తన జీవితాలను అంకితం చేస్తే వారు అత్యంత శక్తివంతులు అవుతారు.








6, మే 2020, బుధవారం

లంక- స్వర్ణలంక

 ఇంతకు ముందు ఎన్నిసార్లు మనం లంక  గురించి చెప్పుకున్న అది స్వర్ణ లంక  అని చెప్పుకున్నాం కదా! ఇంతకీ అది స్వర్ణ లంక ఎందుకు అయ్యింది? ఆ లంక త్రికూటాచల పర్వతంలో ఉన్నది అని చెప్తారు కదా! ఇంతకీ ఆ త్రికూటాచల పర్వతం ఏమిటి?

దీని గురించి ఆనంద రామాయణంలో సారకాండ - చతుర్దాశ్వాసం లో చెప్పారు.

మనం ఇంతకు  ముందు టపా లలో మహాభారతములోని ఆదిపర్వంలో గరుడుడు - ఆకలి  గురించి చెప్పుకున్నాం కదా!
ఆనంద రామాయణం ప్రకారం ఇలాంటి సందర్భం గురించి చెప్పారు కానీ అది  గజేంద్ర మోక్షం తరువాత  జరిగిన సంఘటన వలే చెప్పారు.
శ్రీ హరి గజేంద్రమునకు ముక్తిని ప్రసాదించిన తరువాత వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ గరుడుడు తిరిగి ఆ గజేంద్రమోక్షం జరిగిన ప్రదేశమునకు వచ్చాడు. అక్కడ ఉన్న ఏనుగు (ఆనంద రామాయణం ప్రకారం ఏనుగు కు అక్కడే మోక్షం ప్రాప్తించింది ) మరియు మొసలి కళేబరములు ఆరగించటానికి గరుడుడు తిరిగి వచ్చాడు. అతను వచ్చే సమయమునకు అక్కడ ఒక గ్రద్ద ఉంది దాని పేరు భృభంగం. గరుడుడు దానిని కూడా చంపి ఆ గ్రద్దను ఒక కాలితో, ఏనుగు మరియు మొసలిని మరొక కాలితో పట్టుకుని పైకి ఎగిరాడు. కూర్చొని తినటానికి మంచి స్థానం కోసం చూస్తుండగా, ఒక బంగారమును స్రవించే జంబూ వృక్షం యొక్క కొమ్మపై కూర్చునే ప్రయత్నం చేసాడు. కానీ ఆ కొమ్మ విరిగింది. అలా విరిగిన కొమ్మకు వాలఖిల్యులు ఉన్నారు, కనుక ముక్కుతో ఆ కొమ్మను పట్టుకుని ఎక్కడికి వెళ్లాలో తెలియక గంధమాధన పర్వతం మీద ఉన్న తన తండ్రి కశ్యపుని దగ్గరకు వెళ్ళి, వాలఖిల్యులను అక్కడ విడచి,  తనకు ఎవ్వరు నివశించని ఒక ప్రదేశం గురించి చెప్పమని అడిగాడు. దానికి సమాధానంగా తన తండ్రి కశ్యపుడు వంద యోజనముల సముద్రమునకు అవతల ఒక లంక ఉన్నది అని  అక్కడ ఎవ్వరూ  నివాసం ఉండరు కనుక అక్కడకు వెళ్లి  తినవచ్చును అని చెప్పాడు.   ఆ లంకకు చేరుకున్న గరుడుడు మూడు జంతువులను అక్కడే తిన్నాడు. అలా తిన్న సమయంలో ఆ మూడు జంతువుల ఎముకలు మూడు కొండలుగా ఏర్పడ్డాయి. ఆ మూడు కొండలను త్రికూటములు అంటారు. అంతే  కాకుండా అతను తీసుకు వచ్చిన  జంబూ వృక్ష కొమ్మను కూడా అక్కడే వదిలాడు. కనుక ఆ కొమ్మ నుండి స్రవించిన స్వర్ణం అక్కడ ఉన్న మూడు కొండలలో చేరి అవి గట్టిపడి, అత్యంత దృఢమయిన త్రికూటములుగా ఏర్పడ్డాయి. అప్పటి నుండి ఆ లంకను స్వర్ణ లంక / త్రికూటాచలం అని అంటారు.
కాల క్రమం లో ఈ లంకను రాక్షసులు , తరువాత ధనాధిపతి కుబేరుడు, ఆతరువాత రావణుడు స్వాధీనం చేసుకున్నారు.

5, మే 2020, మంగళవారం

షట్చక్రవర్తులు

మన పురాణములలో అత్యంత ముఖ్యమయిన రాజులు, చక్రవర్తులు ఆరుగురు ఉన్నారు అని చెప్తారు. ఆ ఆరుగురిని గురించి చెప్పే శ్లోకం కింద మీకోసం!

హరిశ్చంద్రో నలోరాజా పురుకుత్సః పురూరవాః
సగరః కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తిన ః

హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు మరియు కార్తవీర్యార్జునుడు అనే ఈ ఆరుగురిని కలిపి షట్చక్రవర్తులు అంటారు.


4, మే 2020, సోమవారం

గరుడుడు-- ఆకలి

గరుడుడు తన తల్లిని దాస్యం నుండి విముక్తురాలిని చేయుటకు బయలుదేరాడు. తన తల్లి ఆశీర్వాదం తర్వాత తన తండ్రి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. తల్లి చెప్పిన నిషాదులని తినిన తర్వాత కూడా అతని ఆకలి తీరలేదు కనుక తినుటకు ఏమయినా దొరుకుతుందా అని ఆటను తండ్రిని ఆడిగాడు. అప్పుడు కశ్యపుడు విభావసుడు - సుప్రతీకుడు అనే అన్నదమ్ముల గురించి, వారు ఈ జన్మలో ఏనుగు, తాబేలు గా పుట్టుట గురించి చెప్పి వానిని తినమని చెప్పాడు. అవి ఉండే చోటు గురించి తెలుసుకుని గరుడుడు అక్కడికి వెళ్లి ఆ రెండింటిని తన రెండు కళ్ళతో పట్టుకుని అత్యంత  వేగంగా పైకి ఎగిరాడు.
ఎక్కడయినా కూర్చుని తినాలని ఒక స్థలం కోసం వెతుకుతూ  అలంబం అనే శిఖరం ఉన్న క్షేత్రానికి చేరుకున్నాడు. ఆ క్షేత్రం లో రోహిణము అనే వృక్షం అతనికి ఆతిధ్యం ఇవ్వటానికి సిద్ధపడి తన అతిపెద్ద కొమ్మను అతని కోసం చూపింది. దాని మీద గరుడుడు కూర్చోగానే ఆ కొమ్మ విరిగింది. అలా విరిగిన ఆ కొమ్మకు వాలఖిల్యులు ఉండుట గమనించిన గరుడుడు ఆ కొమ్మను తన ముక్కుతో పట్టుకున్నాడు. అలా రెండు కాళ్లతో ఏనుగు,  తాబేలు మరియు ముక్కుతో ఆ విరిగిన కొమ్మను తీసుకుని తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాడు. కశ్యప ప్రజాపతి గరుడుని నోటిలో ఉన్న కొమ్మను దానికి వేళ్ళాడుతున్న వాలఖిల్యులను చూసి వారికి నమస్కరించగా వారు వారి తపస్సును కొనసాగించుటకు  హిమాలయాలకు వెళ్లిపోయారు.
ఆ తరువాత గరుడుడు తనకు లభించిన ఆహారం తినుటకు వీలుగా ఒక స్థలం చూపమని అడుగగాదానికి కశ్యపుడు తాని నివసిస్తున్న గంధమాదన పర్వతానికి లక్ష ఆమడల దూరంలో నిష్పురుషం అనే కొండ ఉన్నది అని , అక్కడ ఎవరూ ఉండరు కనుక అక్కడకు వెళ్లి తినమని చెప్పాడు. అక్కడకు వెళ్లి గరుడుడు తన ఆకలి తీర్చుకున్నాడు. అక్కడి నుండి అమృతమును తీసుకు రావటానికి స్వర్గానికి బయలుదేరాడు. 

3, మే 2020, ఆదివారం

హనుమంతుడు-పుష్పక విమానము- పార్వతి

లంకలో సీతాదేవిని వెతుకుటకు వచ్చిన హానానుమంతుడు ఎంత జాగ్రత్తగా వెతుకుతున్నాడో ఇంతకు ముందు ఒక చక్కని పద్యంలో చూశాం కదా!

అలా వెదుకుతున్న హనుమంతుడు లంక  అంతా కలియదిరిగి, సీత జాడ తెలియక వెదుకుతూ రావణుని పుష్పక విమానం వద్దకు వచ్చి ఆ విమానపు సౌందర్యానికి, కాంతికి తనను  తాను మరచి అలాగే నిలుచుండి  పోయాడు.
అప్పుడు అతనిని తిరిగి కార్యోన్ముఖుడ్ని చేయటానికి సాక్షాత్తు పార్వతీదేవి చిన్న పాప రూపంలో వచ్చింది అని మల్లెమాల రామాయణం లో కవి వర్ణించారు.
చిన్న పాపగా వచ్చిన పార్వతీదేవి అలాగే బొమ్మలా నిలబడిన హనుమంతుని విచిత్రంగా చూసి అతని కన్నులలోకి ఉఫు  అని ఊదినది. వెంటనే తేరుకుని హనుమంతుడు తన తప్పును వెంటనే  గ్రహించి క్షమాపణ అడిగాడు. దానికి బాల రూపంలో ఉన్న పార్వతి, ఎవరయినా ఇంత సౌందర్యము కల్గిన ఈ పుష్పక విమానమును చూసి తమను తాము మరిచిపోవుట సహజం అని చెప్పి ఆ పుష్పక విమానం కథను చెప్పటం మొదలుపెట్టింది.
ముందుగా బ్రహ్మదేవుని కొరకు విశ్వకర్మ చేసాడు. దాని తరువాత అత్యంత తపస్సు చేసిన ధనాధిపతి అయిన కుబేరుడు  దీనికి అధిపతి అయ్యాడు. ఆ తరువాత యుద్ధంలో కుబేరుడిని ఓడించిన రావణుడు దీనిని స్వాధీనం చేసుకున్నాడు అని ఆ పుష్పక విమానం కథను చక్కగా హనుమంతునకు సాక్షాత్తు పార్వతి దేవి చెప్పింది.  అలా పార్వతి చెప్పిన మాటలు విని హనుమంతుడు ఆమెకు నమస్కారం చేసి, సీతని వెదకుటకు ఆ పుష్పక విమానంలోకి ప్రవేశించారు. 

2, మే 2020, శనివారం

వాలఖిల్యులు

బ్రహ్మాండ పురాణం మరియు భాగవతం ప్రకారం వాలఖిల్యులు నవబ్రహ్మలలో ఒకరయిన క్రతువు పుత్రులు. క్రతువు దేవహుతి, కర్ధముల పుత్రిక అయిన క్రియను వివాహం చేసుకున్నారు. ఈ క్రతువు మరియు క్రియలకు కలిగిన సంతానమే 60,000 మంది వాలఖిల్యులు.
వీరు బొటన వేలు పరిమాణంలో ఉండి నిరంతరం తపస్సులో ఉంటారు. వారి తపస్సు అత్యంత కఠినమయినది. వారు చెట్టు కొమ్మలకు తలక్రిందులుగా వ్రేళ్ళాడుతూ తపస్సు చేస్తారు.
వీరు తపస్యులు అయిన కారణంగా కశ్యప ప్రజాపతి పుత్రుల కోసం పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు వీరిని ఆహ్వానించారు. ఆ ఇష్టి కి వెళ్లే వారు అందరూ  మోయగలిగినంత చెరువు (యాగం లో ఉపయోగించుటకు వీలు అయిన వస్తువులు, కర్రపుల్లలు వంటివి) తీసుకు రావటం పరిపాటి కనుక వీరు తాము మోయగలిగిన గడ్డి పరకలు తీసుకు వచ్చారు.
వారిని చూసి ఆ సమయంలో అక్కడ ఉన్న ఇంద్రుడు వెక్కిరింతగా నవ్వాడు. అలా నవ్విన ఇంద్రుని చుసిన వాలఖిల్యులు అత్యంత బలవంతుడు, అనితర సాధ్యుడు ఈ ఇంద్రుని కంటే వంద రెట్లు బలం కలిగిన వాడు అయిన మరో ఇంద్రుడు ఈ యాగ ఫలముగా పుట్టుగాక అని అన్నారు. అంటే వారి కోపము కూడా ఇతరులకు (ఇక్కడ కశ్యపునకు) మేలు చేసింది. ఇలా వాలఖిల్యులు చెప్పటం విన్న ఇంద్రుడు కశ్యపుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. ఆ మాటలు విన్న కశ్యపుడు ఇది వరకు బ్రహ్మచే నియమించబడిన ఇంద్రుని కాదనుట సరి కాదు అని, తనకు కలగబోయే సంతానం పక్షి గా, ఆ పక్షులలో ఇంద్రునిగా ఉంటుంది అని వాలఖిల్యులను కోరాడు. దానికి అత్యంత దయగలిగిన వాలఖిల్యులు  ఒప్పుకున్నారు.
ఆ పుత్ర కామేష్టి కారణం గా కశ్యపునకు గరుడుడు జన్మించాడు. ఆ గరుడునకు పక్ష్మీంద్రుడు అనే పేరు కూడా ఉన్నది.
తరువాతి కాలంలో తన తల్లి దాస్య విముక్తి కోసం ప్రయత్నిస్తున్న గరుడుడు ఆకలి తీర్చుకోవటం కోసం తండ్రి ఆదేశం మేరకు గజమును, తాబేలును తినటానికి ప్రయత్నం చేసినప్పుడు విరిగిన రోహిణము అనే వృక్ష కొమ్మకు తల క్రిందులుగా వ్రేళ్ళాడుతూ తప్పస్సు చేసిన వారు వీరే.  

1, మే 2020, శుక్రవారం

తెలుగు మధురమయిన పద్యం - 2

రామాయణములో అత్యంత ముఖ్యమయినది, ఎంతో ప్రాముఖ్యం కలిగినది సుందరకాండ. ఆ సుందర కాండ ముఖ్య ఉద్దేశ్యం హనుమంతుడు సీతాదేవిని లంకలో వెతుకుట. ఆ ఘట్టమును అనేక కవులు అనేక రకములుగా వర్ణించారు. అటువంటి వర్ణనలలో ఉన్న ఒక సీస పద్యం మల్లెమాల రామాయణం లోనిది మీకోసం!
ఈ పద్యమునకు సందర్భం : హనుమంతుడు లంకలో సీతాదేవి కోసం ఎంత ఏకాగ్రతగా, మిగిలినవారికి తన ఉనికి తెలియకుండా ఉండేలా ఎంత జాగ్రత్తగా మసలుకుంటూ వెతుకుతున్నాడో చెప్తున్న సందర్భం

కడునేర్పు తో పాలు కాజేయ వంటింట 
మెల్లగా తారాడు పిల్లివోలె 
కటిక చీకటివేళ కలవారి గృహములో 
దూరి యన్వేషించు దొంగవోలె 
బొక్కలోపల గూడ నెక్క డేమున్నదో 
నక్కి గాలించు నక్కవోలె 
అతినిగూఢ మ్మైన ఆత్మతత్వమ్మును 
తనలోన వెదకెడు తపసివోలె 

ఇంత మంచి అచ్చ తెలుగు పద్యమునకు విడిగా భావం చెప్పటం అవసరం లేదు కదా!