4, ఆగస్టు 2019, ఆదివారం

నవగ్రహములు - మండలముల ఆకారములు

మనకు తొమ్మిది గ్రహములు ఉన్నాయి. ఆ నవ గ్రహములకు సంబందించిన నవరత్నముల గురించి ఇంతకు ముందు మనం  చెప్పుకున్నాం కదా ! ఇప్పుడు వాని మండలముల గురించి తెలుసుకుందాం! ఆ మండలములు  వివిధములయిన ఆకారములు కలిగి ఉంటాయి. ఆ ఆకారముల గురించి అగ్ని పురాణములో చాలా వివరించారు. అవి

  1. సూర్యుడు - గుండ్రనిది 
  2. చంద్రుడు - చతురస్ర ఆకారం 
  3. అంగారకుడు - త్రికోణము 
  4. బుధుడు - బాణాకారము 
  5. గురుడు - దీర్ఘ చతురస్రము 
  6. శుక్రుడు - పంచకోణము 
  7. శని - ధనురాకారం 
  8. రాహువు - చేట ఆకారం 
  9. కేతువు - జెండా ఆకారం 






7, జులై 2019, ఆదివారం

నవ రత్నములు - నవ గ్రహములు

మన శాస్త్రముల ప్రకారం మానవుని జీవత గమనము మొత్తం నవగ్రహముల గమనముపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ నవగ్రములకు ప్రతీకగా మన పెద్దలు నవరత్నములు చెప్పారు. ఆ గ్రహములకు సంబంధించిన ఆయా రత్నములు ధరించితే ఆయా గ్రహముల శాంతి దృష్టి కలుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఏయే గ్రహములకు ఏ రత్నములు చెప్పారో చూద్దాం!


  1. సూర్యుడు - పద్మరాగం (కెంపు)
  2. చంద్రుడు - ముత్యము 
  3. అంగారకుడు - పగడము 
  4. బుధుడు - పచ్చ 
  5. గురుడు - పుష్యరాగం 
  6. శుక్రుడు - వజ్రము 
  7. శని - నీలము 
  8. రాహువు - గోమేధికము 
  9. కేతువు - వైడూర్యము  



27, జూన్ 2019, గురువారం

సుకాలినులు

సుకాలినులు అనే పితృ దేవతలు మూర్తగణములు.  వీరు ద్యులోకం పైన నక్షత్రకాంతిలో ప్రకాశించు జ్యోతిర్భాసి అనే లోకంలో నివసిస్తారు. వీరి తండ్రి గారు వశిష్ఠుడు. వీరిని శ్రాద్ధకాలంలో బ్రాహ్మణులు పూజిస్తారు. వీరి మానస పుత్రి పేరు గౌ:



25, జూన్ 2019, మంగళవారం

ఆజ్యపులు

ఆజ్యపులు అనే పితృగణములు మూర్తగణములు . వీరు పులహుని పుత్రులు కొందరు, కర్దమ ప్రజాపతి పుత్రులు కొందరు. వీరు నివసించు లోకము సర్వ కామనాలు చక్కగా తీర్చే కామదుఘాము అనే లోకము. వీరిని శ్రాధ సమయములో వైస్యులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు విరజ. ఈమె నహుషునికి భార్య, మహారాజు యయాతి కి తల్లి. 



23, జూన్ 2019, ఆదివారం

హవిష్మంతులు

హవిష్మంతులు అనే పేరుగల పితృగణము మూర్తగణము. వీరి తండ్రి అంగీర: ప్రజాపతి. వీరు నివసించు లోకము సూర్యమండలములో గల మరీచి గర్భములు, అంటే లోపలవైపునకు కూడా కిరణములు కలవి అని అర్ధము కలిగిన లోకములు. వీరిని శ్రాద్ధములు జరిపించు క్షత్రియులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు యశోద. 
ఆమె సూర్యవంశమునకు చెందిన అంశుమంతుడు అనే రాజునూ వివాహం చేసుకున్నది. వారికి జన్మించిన పుత్రుడు దిలీపుడు. దిలీపుని పుత్రుడు భగీరధుడు. సాక్షాత్తు ఆకాశగంగను భూమి మీదకు తెచ్చినది ఇతనే. 



21, జూన్ 2019, శుక్రవారం

సోమపులు

మనం ఇంతకు ముందు 7గురు పితృ దేవతల పేర్లు వారిలో ఆమూర్తగణముల గురించి తెలుసుకున్నాం కదా! ఇపుడు మూర్త గణముల గురించి తెలుసుకుందాం! వారిలో మొదటి గణము  సోమపులు.
వీరు స్వధాకారము నుండి జన్మించారు. వీరు బ్రహ్మ లోకములోని మానసములు అనే లోకములో నివసిస్తారు. వీరు అనంతమయిన యోగ సిద్ధి చేత బ్రహ్మత్వము పొందారు. వీరి పుత్రిక పేరు నర్మద, ఈమె సకల జలములకు ప్రతీక.
ఈ సోమపులు సకల పితృదేవతల కు ప్రతీకలు కనుకనే శ్రాద్ధము చేసే తప్పుడు స్వధాకారం చెప్తారు మరియు జలముల దగ్గర తర్పణములు చేస్తారు. 



19, జూన్ 2019, బుధవారం

బర్హిషదులు

ఈ పితృగణము అమూర్త గణము. వీరి తండ్రి పులస్త్యుడు.వీరు నివసించు లోకము  ధ్యు లోకంలోనే కాంతివంతములయిన మరికొన్ని లోకములు, విభ్రాజములు. 
వీరిని అసుర, దానవ , గంధర్వ, అప్సరస యక్షులు, ధ్యు లోకములోని దేవతలు అందరూ  ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు పీవరి. ఆమె యోగులకే యోగిని అనే చెప్తారు. 



17, జూన్ 2019, సోమవారం

అగ్నిష్వాత్తులు

అగ్నిష్వాత్తులు అనే పితృగణము అమూర్త గణము. వీరి తండ్రి మరీచి, వీరు నివసించు లోకము  సోమ పధము. వీరు అగ్నియందు అనేకములయిన హవిస్సులు వేసి యజ్ఞములు చేశారు కనుక వీరికి ఈ పేరు వచ్చింది. వీరిని సకల దేవతలు ఆరాధిస్తారు.
వీరి పుత్రిక పేరు : ఆచ్చోదా, అమావాస్య 



15, జూన్ 2019, శనివారం

వైరాజులు

పితృదేవతలలో ఆమూర్తి గణములలో మొదటి వారు వైరాజులు. వారి తండ్రి పేరు  విరాజుడు. వీరు నివసించు లోకము ద్యు లోకము. వీరిని మానవ దేవతా భేదం లేకుండా అందరూ  ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు మేన దేవి.ఈమె ఒకానొక శాపం కారణంగా భూలోకమునకు రావలసి వచ్చి, హిమవంతుడిని వివాహం చేసుకున్నది. ఆ తరువాత ఆమె పార్వతిదేవికి  తల్లి అయినది. 

13, జూన్ 2019, గురువారం

పితృ దేవతలు - సత్యవతి

ఇంతకు  ముందు మనం పితృ దేవతలు , వారి పుత్రిక అమావస్య గా ఎందుకు పిలవ బడుతుంది అని తెలుసుకున్నాం కదా !
ఆ విషయం  తెలుసుకున్నప్పుడు ఆమెకు పితృదేవతలు ఇచ్చిన శాపం గురించి కూడా తెలుసుకున్నాం! ఆమెను భూలోకంలో మానవజన్మ నెత్తమని వారి శాపం.  వారి శాపమును విన్న అమావస్య అత్యంత బాధకు, పశ్చాతాపమునకు లోనయ్యి ఆ శాపమునకు కలుగు ఉపశమనమును తెలుపమని కోరినది. భూత భవిష్య వర్తమాన కాలములను తెలుసుకొనగలిగిన ఆ పితృ దేవతలు ఆమెకు జరుగబోయే విషయములను చక్కగా వివరించారు.

ఆమె 28వ ద్వాపరయుగములో ఒక దివ్య పురుషునకు జన్మనివ్వవలసి ఉన్నది. అతను మాత్రమే తరువాత వచ్చు అనేక అల్పబుద్ధి, అల్ప ఆయుష్షు కల్గిన మానవులను కాపాడే విధంగా వేదములను విభాగం చేయగలడు. అయితే అతని జననం వలన ఆమె కన్యత్వం చెడదు. ఆ తరువాత ఆమె సముద్ర అంశతో జన్మించిన శంతనుడు అనే ఒక మహారాజును వివాహం చేసుకుంటుంది.
తెలిసింది కదా ఆమె ఎవరో! ఆమే మత్స్య గంధి, యోజన గంధి  అని పిలువ బడే సత్యవతి. 

11, జూన్ 2019, మంగళవారం

పితృ దేవతలకు అమావస్య తిధి ఎందుకు ఇష్టమంటే ...!

మనం ఇంతకు ముందు పితృదేవతలు 7 గణములని వారి పేర్లు చెప్పుకున్నాం కదా! వారిలో అగ్నిష్వాత్తులు అనే పితృదేవతలకు ఆచ్చోదా అనే మానస పుత్రిక ఉన్నది. ఆమె ఒక వెయ్యి దివ్య సంవత్సరములు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన పితరులు సంతుష్టులై ఆమెను వరం కోరుకొమ్మని అడిగారు. అయితే వచ్చిన ఆ పితృదేవతలలో మావసుడు అనే వానిని ఆమె వరించింది. ఆమె చేసిన ఈ ధర్మ దూరమయిన పనికి ఆ పితృ దేవతలు  ఆమెను భూలోకములో జన్మించమని శపించారు.
అయితే ఆ మావసుడు ఆమెను పుత్రికా దృష్టితో చూసినందువలన ఆమె మావాస్య కాలేదు. అంటే ఆమె అమావాస్య అయినది. ఆమె చేసిన తపస్సును పితృదేవతలు మెచ్చారు కనుక అమావస్య తిధి రోజు పితరులకు అర్పించినది ఏదయినా అక్షయము అవుతుంది.

9, జూన్ 2019, ఆదివారం

పితరులు

శ్రాద్ధము మొదలయిన కర్మలలో మనకు తరచుగా వినిపించే పేరు పితృదేవతలు. అయితే వారు ఎవరు? దీనికి సమాధానము హరివంశములో చెప్పారు.

అమూర్తానాంచ ముర్తానాం పితౄణం దీప్తతేజసం
నమష్యామి సదాతేషాం ధ్యాయినాం యోగ చక్షుషా !

దీనికి అర్ధం : రూపము కలిగిన వారును, రూపము లేనివారూ, అత్యంత ప్రకాశవంతమయిన తేజస్సు కలిగినవారు, యోగ శక్తి సంపన్నమయిన కన్నులతో, ధ్యానము ద్వారా అన్ని విషయములగురించి తెలుసుకోగలిగినవారు , అటువంటి యోగ చక్షువులు కలిగినవారి చే ధ్యానింప బడే వారు అయిన పితృ దేవతలకు సదా నమస్కరింతును.

అంటేఅనేక గణములుగా ఉన్న పితరులతో కొందరికి రూపములు ఉన్నాయి మరి కొందరికి లేవు. మొత్తం పితర గణములు 7. వానిలో

అమూర్త గణములు : రూపములు లేని వారు
  1. వైరాజులు 
  2. అగ్నిష్వా త్తులు 
  3. బర్హిషదులు 
మూర్త గణములు : రూపములు ఉన్నవారు 

9, మే 2019, గురువారం

రామాయణం - ఒక భక్తుని జీవితం

మనం ఇంతకూ ముందు రామాయణం గురించి అనేక విషయములు చెప్పుకున్నాం! రామాయణంలోని వివిధ సంఘటనలను మానవుని దేహంలోని ఏడు  చక్రములతో ఎలా పోల్చారో,  రామాయణమునకు ఉన్న ఆధ్యాత్మిక అర్ధం ఏమిటో, రామాయణమును కల్పవృక్షం, వేదం  మరియు గాయత్రీ మంత్రములతో ఎలా పోల్చాలో చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మహా రామ భక్తుడు అయిన తులసీదాసు రామాయణంలోని ఏడు కాండలను ఒక భక్తుని జీవితంలో రామభక్తిలో చేరుకునే అనేక సోపానములతో పోల్చారు. అవి ఏంటో చూద్దామా!


  1. బాల కాండ - సుఖ సంపాదన సోపానం 
  2. అయోధ్య కాండ - ప్రేమవైరాగ్య సంపాదన సోపానం 
  3. అరణ్య కాండ - విమల వైరాగ్య సంపాదన సోపానం 
  4. కిష్కింద కాండ - విశుద్ధ సంతోష సంపాదన సోపానం 
  5. సుందర కాండ - జ్ఞాన సంపాదన సోపానం 
  6. యుద్ధ కాండ - విజ్ఞాన సంపాదన సోపానం 
  7. ఉత్తర కాండ - అవిరళ హరిభక్త సంపాదన సోపానం 

6, మే 2019, సోమవారం

రామాయణం - 7 చక్రములు

మనం ఇంతకు ముందు మనం రామాయణం దానిలోని ఆధ్యాత్మిక అర్ధం గురించి చెప్పుకున్నాం కదా! ఆ రామాయణం మానవునిలో ప్రాణశక్తిని మేల్కొలిపి 7 చక్రములను జాగృతం చేసి పరమాత్ముని చేరుకొనే మార్గంలో కలిగే అనేకములయిన అనుభవాలను చెప్తుంది అని పెద్దల వాక్కు. అయితే రామాయణంలో ఏ సంఘటనలు ఆయా చక్రములను సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం!


  1. మూలాధారం: రామాయణంలో శివధనుర్బంగం జరిగిన సంఘటన ను మూలాధారంగా చెప్తారు. స్థిరత్వమును చేకూర్చే ఈ చక్రమును శ్రీరాముని కళ్యాణముతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  2. స్వాధిష్టానం: రామాయణంలో కైక అడిగిన రెండు వరముల కారణంగా శ్రీరాముడు వనవాసమునకు వెళ్లే సంఘటనను స్వాధిష్టాన చక్రం గా చెప్తారు. భావావేశములకు మూలమయిన ఈ చక్రమును విపరీతమయిన భావావేశము నిండిన ఈ సంఘటనతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  3. మణిపుర: వనవాసమునకు వెళ్లిన సీతారాములకు దివ్యమయిన ఆభరణములు పరమ పతివ్రత అయిన అనసూయాదేవి ఇవ్వటం అనే సంఘటనను మణిపుర చక్రంగా చెప్తాము. ఈ ఆభరణములు తరువాతి కధలో అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తాయి. అటువంటి దివ్య మణిమయములయిన ఆభరణములు సీతాదేవికి సంక్రమించే సంఘటనను మణిపుర చక్రంతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  4. అనాహతం: వనవాసం సజావుగా ఆనందముగా సాగుతున్న సమయములో శూర్పణఖ ప్రవేశించుటను అనాహత చక్రంతో పోల్చారు. సరిగ్గా రామాయణంలో అసురవధ ఈ ఘట్టంతరువాతనే ముఖ్యంగా జరుగుతుంది కనుక అడ్డంకులు తొలగించు అనాహత చక్రం తో ఈ సంఘటనను పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  5. విశుద్ధి: సీతా వియోగం వలన పరితపిస్తున్న శ్రీరాముడు  పరమ శుద్ధ భక్తురాలయిన శబరిని కలిసిన సంఘటనను ఈ విశుద్ధి చక్రంతో పోల్చారు. 
  6. ఆజ్ఞా: రామాయణంలో సుగ్రీవుని ఆజ్ఞతో సీతాదేవిని వానరులు వెతుకుటకు బయలుదేరు సంఘటనను ఆజ్ఞా చక్రం మొదలుగా పోల్చారు. అయితే సహజంగా ఈ చక్రం వరకు చేరిన ప్రాణమునకు దివ్య దర్శనం జరుగుతుంది. మరి రామాయణంలో జరిగిన ఆ క్షణకాల దివ్య దర్శనం ఎం అయ్యి ఉంటుంది?  దీనికి సమాధానంగా మన పెద్దలు కిష్కిందకాండలో సీతను వెతుకుతూ వెళ్లిన హనుమంతుడు మొదలగు వారికి కలిగిన ఒక అనుభవాన్ని చెప్తారు. సూర్యప్రభాదేవి . అనుకోకుండా ఒక కొండా గుహలో బందీలయిన వానర వీరులను సూర్యప్రభాదేవి ఒక్క క్షణకాలంలో సముద్ర తీరమునకు చేర్చుతుంది. 
  7. సహస్త్రారం: ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది అని చెప్పుకున్నాం కదా! రామాయణంలో శ్రీరామ పట్టాభిషేకం ఘట్టమును ఈ చక్రముతో పోల్చారు. 

3, మే 2019, శుక్రవారం

మానవుని దేహంలో 7 చక్రములు

మానవుని దేహంలో 7 చక్రములు ఉంటాయి. ఆ చక్రములను జాగృతం చేస్తే మానవుని మేధస్సు నిరుపమానంగా వృద్ధి చెందుతుంది. మరి ఆ చక్రములు ఏవో చెప్పుకుందాం!


  1. మూలాధారం : పేరు లో చెప్పినట్లు ఏది మూలమునకు ఆధారంగా ఉంటుంది. మానవుని దేహములో ఈ చక్రం వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. ఈ చక్రంలో భూ తత్త్వం ఉంటుంది.  సహజంగా ఈ చక్రము ఎరుపు రంగు కలిగి నాలుగు పత్రములు కల్గిన చక్రంగా చెప్తారు. ఈ చక్రం మానవుని దేహంలో స్థిరత్వమును కలిగిస్తుంది 
  2. స్వాధిష్టానం: ఈ పేరుకు అర్ధం స్వ - అధిష్టానం. మానవుని శరీరంలో ఈ చక్రం పొత్తికడుపు భాగం లో ఉంటుంది. ఈ చక్రం జలతత్వం కలిగి ఉంటుంది. సహజంగా ఈ చక్రం నారింజరంగు కలిగిన ఆరు పత్రములు కలిగి ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో భావావేశములు మరియు కోరికల కు నియంత్రిస్తుంటుంది. 
  3. మణిపుర: దీనికి అర్ధం మణుల పురము అని. మానవుని దేహంలో ఈ చక్రం బొడ్డు భాగంలో ఉంటుంది. ఈ చక్రం అగ్నితత్వం కలిగి ఉంటుంది. సహజంగా ఈ చక్రం ఎరుపు రంగులో త్రికోణంగా ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో ఆహారము జీర్ణ క్రియను నియంత్రిస్తుంది.  
  4. అనాహతం: ఈ పేరుకు అర్ధం అనా- హతం, అడ్డంకులు లేనిది. మానవుని దేహంలో ఈ చక్రం హృదయస్థానంలో ఉంటుంది. ఇది వాయు తత్త్వం కలిగి ఉంటుంది. ఈ చక్రం ఆకుపచ్చ రంగులో మధ్య షట్కోణం దానిచుట్టూ 12 కమల దళములు కలిగి ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో జాగృతం అవుట వలన తమపర భేదం లేని అవ్యాజమైన ప్రేమ మూర్తులు గ ఉంటారు. 
  5. విశుద్ధి: ఈ పేరుకు అర్ధం పరిశుభ్రం చేయునది అని. మానవుని దేహంలో ఈ చక్రం కంఠ భాగంలో ఉంటుంది. ఈ చక్రం ఆకాశ తత్త్వం కలిగి ఉంటుంది. ఈ చక్రం నీలం రంగు కలిగి తలక్రిందులుగా ఉన్న త్రిభుజం దానిచుట్టూ 16 వంకాయరంగు దళములు కలిగిన పద్మముగా ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో జాగృతం అవుట  వలన నిస్సందేహంగా నిజములను చెప్పగలుగుతారు. వారి మనోభావాలను సూటిగా చెప్పగలుగుతారు. 
  6. ఆజ్ఞా: ఈ పేరుకు అర్ధం స్వాధికారత. మానవుని దేహంలో ఈ చక్రం కనుబొమల మధ్య ఉంటుంది. ఈ చక్రానికి ఏవిధమయిన తత్త్వం ఉండదు. ఈ చక్రం పారదర్శికం గా ఉన్న కమలం దానిలో రెండు తెలుపు దళములతో ఉంటుంది. ఈ చక్రం జాగృతం అవుట వలన  మానవునికి తనగురించి తనకు పూర్తిగా తెలుస్తుంది, భౌతిక విషయములకు మించి అనేక విషయముల జ్ఞానం కలుగుతుంది. 
  7. సహస్త్రారం: ఈ పేరుకు అర్ధం వేయి దళముల పద్మం. మానవుని దేహంలో ఈ చక్రం మాడు పైభాగం లో ఉంటుంది. ఈ చక్రము ఏ విధమయిన భౌతిక ధాతువుల తత్వమూ కలిగి ఉండదు. ఈ చక్రం వేయిదళముల పద్మం, ఈ పద్మం చుట్టూ లేత గులాబీరంగు కంటి ఉంటుంది. ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది. 

30, ఏప్రిల్ 2019, మంగళవారం

పాండవులు - ఇంద్రుడు

 మహాభరతం లో ఎన్ని సార్లు ఎంతమంది సమాధానాలు చెప్పినా మల్లి మల్లి అందరు అడిగే ప్రశ్న ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండుట ధర్మమేనా?
ఈ ప్రశ్నకు మహాభారతంలో అనేక సందర్భములలో అనేక వృత్తాంతములతో ఇది ధర్మమే అని చెప్పారు. ఆ వృత్తాంతములు చెప్పే ముందు అసలు పంచ పాండవులు ఎవరు? ద్రౌపది ఎవరు అని ముందుగా చూద్దాం!

ద్రౌపది - స్వర్గ లక్ష్మి
ధర్మరాజు - యమధర్మ రాజు అంశ
భీముడు - వాయుదేవుని అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశ

ఇలా పాండవులు వివిధ దేవతల అంశాలుగా చెప్పబడినా , వారిలో నుండి బయటకు వచ్చిన ఆయా అంశలు కూడా ఇంద్రుని అంశలే అని ద్రౌపది కల్యాణ సమయంలో స్వయంగా వ్యాసుడు ద్రుపదునికి చెప్పాడు.
ఇదే కథను మార్కండేయ పురాణంలో మరోవిధంగా చెప్పారు. ఆ కదా ప్రకారం :

ఇంద్రుడు దేవతల రాజు. అత్యంత ధర్మవంతునిగా ఉండవలసిన భాద్యత అతనిది. కానీ ఆ విధంగా చేయవలసిన అనేక సందర్భములలో కొన్నిసార్లు అధర్మం చేయవలసి వచ్చింది. అలా అధర్మం చేసినప్పుడు అతనిలోని కొంత శక్తి కోల్పోతూ వచ్చాడు. అయితే అతను కోల్పోయిన ఆ శక్తి ఆయా సందర్భములలో అతనిని ఉద్దరించటానికి సహాయం చేసిన దేవతలకు ఆ  శక్తి అంశలుగా చేరాయి. మరి ఇంద్రుడు ఏ పనులు చేసాడు, ఆలా  చేసినప్పుడు  అంశ ఏ దేవతలను చేరిందో తెలుసుకుందాం!

అహల్యా వృత్తాంతం : గౌతమ ముని శాపం తర్వాత అత్యంత జుగుప్సాకరంగా మారిన అతని శరీరమును తిరిగి పూర్వ రూపం వచ్చేలా ప్రయత్నించిన వారు దేవా వైద్యులయిన  అశ్విని దేవతలు. కనుక ఇంద్రుడు ఆ సమయంలో కోల్పోయిన శక్తి ఈ సందర్భంలో అశ్వినీ దేవతలకు సంక్రమించింది.  

వృత్రాసుర వధ : వృత్రాసురుని వధ తరువాత అతనికి బ్రహ్మహత్యాపాతకం సంక్రమించింది. 
ఆ బ్రహ్మహత్యాపాతకమును కొంత తాను తీసుకున్న వాయుదేవునికి కొంత ఇంద్రతేజస్సు సంక్రమించింది. 

త్రిశిరుని వధ : త్రిశిరుడు అనే రాక్షసుని సంహరించిన తరువాత ఆ పాపంలో కొంత పాపం తాను తీసుకుని ఇంద్రునికి సహాయం చేసిన యమునిలో ఇంద్ర అంశ కొంత వచ్చి చేరింది. 

కనుక కుంతీ దేవి, మాద్రిదేవి వివిధదేవతలను ఉపాసించి పుత్రులను కోరినప్పుడు ఆయా దేవతలు వారివద్ద ఉన్న ఇంద్రుని అంశలను వారికి పుత్రులుగా ఇచ్చారు కనుక 

ధర్మరాజు - యమధర్మ రాజు అంశ గా వచ్చిన ఇంద్ర అంశ
భీముడు - వాయుదేవుని అంశగా  వచ్చిన ఇంద్ర అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశగా వచ్చిన ఇంద్ర అంశ

కనుక అందరు పాండవులు కూడా ఇంద్రుని అంశలే. మరి ఇంద్రుని రాజ్యలక్ష్మి అయిన స్వర్గ లక్ష్మి  పాండవుల పట్ట మహిషి అయిన ద్రౌపది గా వచ్చినది.   

27, ఏప్రిల్ 2019, శనివారం

వాల్మీకి - ఒక ఆలోచన

ఇది వరకు మనం ఆధ్యాత్మరామాయణం లో శివుడి పార్వతితో చెప్పిన ఒక శ్లోకమును ఆధారముగా చేసుకుని వాల్మీకి ప్రచేతసుల కుమారుడు అని చెప్పుకున్నాం కదా! మరి మనకు తెలిసిన కథ సంగతి ఏమిటి? ఆ విషయం తెలుసుకునే ముందు అసలు మనకు తెలిసిన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం!

అనగనగా ఒక బోయవాడు. వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. వేట దొరకనప్పుడు దారి కాచి బాటసారులను దోచుకుని ధనం సంపాదించేవాడు. ఒకరోజు నారద మునిని అలానే బెదిరించగా తాను చేస్తున్నది పాపం కనుక ఆ పాపంలో వాని కుటుంభం సభ్యులు పాలు పంచుకుంటారేమో అడుగ మని చెప్పగా, బోయవాడు వెళ్లి అందరిని అడుగగా ఎవ్వరూ ఆ పాప భారమును స్వీకరించుటకు సుముఖంగా ఉండకపోవుట చూసి వైరాగ్యము కల్గిన బోయవాడు నారదుని కాళ్లపై పడగా , నారదుడు అతనికి "రామ" మంత్రం ఉపదేశించారు.  ఆ మంత్రము నోరుతిరుగక పోవుట వలన నారదుడు బోయవానికి "మర" అని పలుకమని తరుణోపాయము చెప్పారు. ఆ తారక మంత్రములో నిమగ్నుడయిన అతని చుట్టూ పుట్టలు పట్టాయి. కొన్ని రోజుల తరువాత ఆ పుట్టలోనుండి బయటకు చచ్చాడు కనుక అతనిని వాల్మీకి అని సంభోదించారు.

అయితే ఈ కథలోని కొన్ని భాగాలు కొంచెం ఆలోచిస్తే ప్రక్షిప్తాలేమో అనే అనుమానం తప్పకుండా వస్తుంది.

  1. ఈ కథ జరిగిన కాలం: రామాయణం ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణ రచన రాముడు భూమిమీద నడయాడుతున్న కాలంలోనే జరిగింది, అనగా సుమారుగా త్రేతా యుగ చివరి సమయం . అంటే అతను తపస్సు చేసిన కాలం అంతకంటే ముందు అనగా ద్వాపర మధ్య లేక మొదటి భాగం.  మరి ఆ కాలంలో దారి దోపిడీ లు జరిగేవా? కొంచెం అనుమానమే కదా!
  2. కుటుంబ సభ్యులు పాప భారం తీసుకోము అని చెప్పటం: ఆ యుగములలో ఎవరి ధర్మం వారికి ప్రాణప్రదం. ఆ కాలం లో భర్త పాపములో భాగము తీసుకోను అని చెప్పే సందర్భం ఉండే అవకాశం ఉంటుందా?
  3. మంత్రం: మన సనాతన ధర్మములో ఉన్న అనేక మంత్రముల కంటే అతి చిన్నదయిన, సరళమయిన మంత్రం "రామ", ఈ మంత్రం నోరుతిరుగాక పోవటం, "మర" అనేది నోరు తిరగటం ఎంతవరకు నిజమై ఉండవచ్చు?
కనుక వాల్మీకి బోయవాడు అని చెప్పే విషయం కంటే వాల్మీకి ప్రచేతసుల కుమారుడు అని నమ్మటానికి కొంత అవకాశములు ఎక్కువగా ఉన్నాయి అని నా అభిప్రాయం!

25, ఏప్రిల్ 2019, గురువారం

ప్రచేతసులు - వాల్మీకి

ఇది వరకు మనం రామాయణం - వేదం అని ఎలా చెప్పవచ్చు? అనే దాని గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు అదే శ్లోకంలో ఒక విచిత్రమయిన విషయాన్ని గురించి చెప్పుకుందాం!
వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే 
వేదః ప్రాచేసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా!

ఈ శ్లోకము ఆధ్యాత్మరామాయణం లోనిది. ఈవిధంగా సాక్షాత్తు శివుడు పార్వతికి చెప్పాడు. ఈ శ్లోకములో రామాయణము వేదమని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నది వాల్మీకి గురించి. ఈ శ్లోకంలో శివుడు వాల్మీకి ని ప్రాచేసా అని సంబోధించారు. అంటే వాల్మీకి ని ప్రచేతసుని కుమారునిగా చెప్పారు. అది ఎలా సాధ్యం?

మనకందరికి తెలిసిన కథ ప్రకారం వాల్మీకి ఒక బోయవాడు. దారి దోపిడీ దొంగ. మరి ఆటను ప్రచేతసుల  కుమారునిగా శివుడు ఎందుకు చెప్పారు?

ప్రాచిన బర్హి గారి 10 మంది కుమారులను కలిపి ప్రచేతసులు అంటారు. వారు 10 మందికి ఒకరే భార్య. ఆమె పేరు మారిష. వీరి సంతానములలో మనకు బాగా తెలిసిన వారు దక్షుడు. వారికీ కల్గిన పడవ సంతానమే వాల్మీకి అని చెప్తారు. 

మరి వాల్మీకి బోయవాడు కాదా? అనే ప్రశ్నకు సమాధానం తరువాతి టపాలో చూద్దాం! 


22, ఏప్రిల్ 2019, సోమవారం

ఇతిహాసము - నిర్వచనము

మనం ఇంతకు ముందు పురాణముల నిర్వచనం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఇతిహాసమునకు నిర్వచనము తెలుసుకుందాం!

ఇతిహాసము : అంటే ఇది ఈవిధముగా జరిగినది అని అర్ధము. దీనిని విపులంగా శ్లోకరూపంలో ఎలా చెప్పారో ఇప్పుడు చూద్దాం!

ధర్మార్ధ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితం 
పూర్వ వృత్త కధా యుక్త ఇతిహాసం ప్రచక్ష్యసే!

దీని భావం: ఇదివరకు జరిగిన అనేక సంఘటనలను కధా రూపంలో  ధర్మార్ధ కామ మోక్షములను అన్వయించుచూ చెప్పేదే ఇతిహాసం.

14, ఏప్రిల్ 2019, ఆదివారం

రామాయణము - ఆధ్యాత్మిక అర్ధము

రామాయణము లోని  కధ చిన్నపిల్లలకు కూడా చాల బాగా తెలుసు. ఈ కధలోని విశిష్టత పట్టే, కొట్టే , తెచ్చే అను మూడు మాటలలో చెప్పవచ్చు. ఆలా కాకుండా సవిస్తారంగా వర్ణించవచ్చు. సర్వదా ఒక మానవుడు ఏ మార్గంలో చరించాలో చెప్పేది రామాయణం. ఇప్పుడు ఆ కథను మనం క్లుప్తంగా చెప్పుకుందాం! ఆ తర్వాత ఆ కధలో దాగిఉంది అని మన పెద్దలు చెప్పిన ఆధ్యాత్మిక కోణం గురించి తెలుసు కుందాం!
కథ : రాముడు సీత దంపతులు. పదితలలు ఉన్న రావణాసురుడు ఆమెను అపహరించి, సముద్రం అవతల లంకలో దాచివుంచాడు. అప్పుడు రాముడు హనుమంతుని సహాయంతో సీత లంకలో ఉన్నదని గుర్తించి రావణుని సంహరించి సీతను తిరిగి తెచ్చుకున్నాడు.

ఆధ్యాత్మిక అర్ధము: అర్ధము తెలుసుకోవటానికి ముందు ఇంకా కొన్ని విషయములు చూద్దాం!

రాముడు - పరబ్రహ్మ
సీత - జీవాత్మ / జీవరూపిణి
దశకంఠుడు, రావణుడు - దశ ఇంద్రియములు
సముద్రం - సంసారం
లంక - దేహం
హనుమంతుడు - గురువు

పరబ్రహ్మ నుండి జీవాత్మను దశ ఇంద్రియములు దూరం చేస్తాయి. పరబ్రహ్మ కు జీవాత్మకు మధ్య సాగరమే సంసారం మరియు దేహమనే లంకలో జీవాత్మ బంధించ బడింది. జీవాత్మ పరమాత్మను చేరుకోవాలంటే గురువు ప్రమేయం తప్పనిసరిగా అవసరం. 

8, ఏప్రిల్ 2019, సోమవారం

రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్న

రాముడు ఈ పేరు వింటే ఒక విధమయిన మానసిక శాంతి లభిస్తుంది కదా! పూర్వకాలంలో నవజాత శిశువులకు పేరు పెట్టవలసిన సందర్భంలో పెద్దలు వారి జాతకమునకు, వారి వ్యవహారమునకు, భవిష్యత్తులో వారు చేయబోయే కార్యములను ముందే సూచిస్తూ పేర్లు పెట్టేవారట. ఒకవేళ వారు పెద్దఅయిన తరువాత ఈ పేరుకు మించి వారు ఘనమైన పనులు చేస్తే వారికి అసలుపేరు కంటే వ్యవహార నామమే ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కుతుంది.

ఉదాహరణకు రావణాసురుని పేరు చూడండి. పుట్టినప్పుడు పెద్దలు ఇతనికి అనేక కళలలో ప్రావీణ్యం ఉంటుంది. అత్యంత మేధాసంపన్నుడు, ఇతను ఒక్కడే పది మంది పుత్రులకు సరిపడు తెలివితేటలు కలవాడు అని "దశగ్రీవుడు" అని పెట్టారు. తీరా ఇతను పెద్ద అయిన తరువాత కైలాసపర్వతం ఎత్తినప్పుడు కలిగిన భాద వలన పెద్దగ రొద పెట్టి, శివుని చేత "రావణా" అని పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఎవరిని ఐనా మీకు దశగ్రీవుడు తెలుసా అని అడగండి. గ్రీకు వీరుని తమ్ముడా అని మిమ్మల్నే అడుగుతారు.

అలాగే రామాయణంలో దశరధునికి పుట్టిన నలుగురు పుత్రులకు పేర్లు పెట్టే సమయంలో వారు అన్ని చూసి, వారికి సార్ధక నామదేయములు పెట్టారు. అవి రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్న. ఇంతకీ వారికి ఆ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటే కింది పద్యం చూడండి.

గీ.  రాముడయ్యెను భువనాభి రాముడగుట
      లక్ష్మణుండయ్యె శౌర్యాదిలక్ష్మికతన
     భరము దీర్చెడివాడౌట భరతుడయ్యె
     దునుమువాడౌట రిపుల శత్రుఘ్నుడయ్యె

ఈ పద్యం శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రిగారు చెప్పిన "శ్రీమదాంధ్ర పద్మ పురాణం" లో పాతాళ ఖండంలో, పూర్వకల్ప రామాయణం లో చెప్పబడినది. 

6, ఏప్రిల్ 2019, శనివారం

భరతుడు వంటి సోదరుడు ....

భరతుడు, రామాయణం లోని అనేక వ్యక్తుల చేత అనుమానించబడిన వాడు. దశరధుడు, గుహుడు చివరకు తన సోదరుడయిన లక్ష్మణుడు కూడా అతనిని అనుమానించారు. అటువాని భరతుని గురించి శ్రీ రాముడు ఏమన్నాడో తెలుసా!
న సర్వే భ్రాతర స్తాత భవంతి భారతోపమాః 
 అంటే భరతుని వంటి సోదరుడు ఎవరికయినాను లభించుట దుర్లభము అని అర్ధము.  మరి శ్రీ రామునితో అంత చక్కగా తనగురించి చెప్పించుకున్న భరతుడు ఎలాంటి వాడు? నిజంగా శ్రీ రామునితో అటువంటి పొగడ్తలకు అర్హుడా?

అర్హుడే అని వాల్మీకి రామాయణం చెప్తుంది. దానికి కారణం అతని హృదయంలోగల భాతృ భక్తి. దానికి ఈ కింద శ్లోకమే తార్కాణం.

అభిషేక్ష్యతి రామతు రాజా యజ్ఞంను యజ్ఞంను యక్ష్యతే!
ఇత్యహం కృత సంకల్పో హృష్టో యాత్రా మాయాశిషం!!
తదిదం హ్యన్యధా భూతం వ్యవదీర్ణం మనోరమ !!!

     నేను ఏంతో సంతోషంగా తాతగారి ఇంటికి వెళ్ళాను. నేను అటు వెళ్ళగానే తండ్రిగారి అన్నగారయిన శ్రీరాముని రాజుగా ప్రకటించి, పట్టాభిషేకం చేసి ఆ తరువాత యాగాన్ని కూడా జరిపించి ఉంటారని అనుకున్న.  ఈ శ్లోకమునకు ఉన్న అర్థమును చూసి మన పెద్దలు భరతుని వ్యక్తిత్వమును చాలా చక్కగా విశ్లేషించారు. భరతుడు ఈ విధంగా అనుకున్నాడు అంటే, అతను శ్రీరామ పట్టాభిషేకం అతని పరోక్షంలో జరగాలని అనుకున్నాడు. అలా ఎందుకు అనుకోని ఉండవచ్చు? 2 కారణములు 
  1. భరతునికి రాజ్యకాంక్ష ఉండి శ్రీరామునికి పట్టాభిషేకం అవుతుంటే చూడలేక !
  2. భరతునికి దశరధుడు తన తల్లి కైకేయికి వివాహం జరిగిన సమయంలో ఆమె తండ్రికి ఇచ్చిన మాట తెలిసి. 
ఈ రెండు సందర్భాలలో మొదటిది అసలు సంభవమే కాదు, ఒకవేళ తాను శ్రీరామ పట్టాభిషేకం చూడలేక అమ్మమ్మగారి ఇంట్లో ఉండగా పట్టాభిషేకం జరిగి పోవాలి అని కోరుకుంటే, అతను తిరిగి వచ్చాక రాజ్యం అకంటకంగా తన పరం అవుతున్నప్పుడు మరలా రామునికోసం అడవులలోనికి పరుగులు పెట్టాడు కదా!
అంటే దీనిని బట్టి మన పెద్దలు ఎలా విశ్లేషించారంటే భరతునికి దశరధుడు తనతల్లికి ఇచ్చిన 2 వరముల గురించి తెలిసిన తెలియక పోయినా, తన తాతగారికి దశరధుడు ఇచ్చిన వాగ్దానం బాగా తెలుసు.  దశరధుని రాముని పైన గల ప్రేమ, రామునికి గ రాజ్య పరిపాలనా దక్షత , రాజ్యంలో ప్రజల కు రాముని పై గల ప్రేమ అన్ని తెలుసు. కనుక రాజ్యమును పరిపాలించే అవకాశం తనకు ఉంది తెలిసినా తన అన్నగారికి పట్టాభిషేకం జరగాలి అని కోరుకున్నాడు. మరి అటువంటి భరతుని గురించి రాముడు ఆలా చెప్పటం చాలా సబబే కదా!

4, ఏప్రిల్ 2019, గురువారం

సీతా రామ వియోగం

శ్రీరామ పట్టాభిషేకం తరువాత జరిగిన సంఘటనల క్రమాన్ని వివరించేది ఉత్తర కాండ. ఆ ఉత్తర కాండ లో ముఖ్యమయిన ఘట్టం సీతా రామ వియోగం. అయితే ఈ సీత రామ వియోగానికి గల కారణాన్ని అనేక పురాణములలో, అనేక కవులు రచించిన రామాయణములలో అనేక రకములుగా చెప్పారు. ఇప్పుడు వాని గురించి తెలుసు కుందాం. 
  1. వాల్మీకి రామాయణం: మనం అన్నింటికన్నా ముందు ముఖ్యంగా చెప్పుకోవలసినది వాల్మీకి రామాయణం గురించే. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో శ్రీరాముడు రాజ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అని వేగులను అడిగినప్పుడు ప్రజల ఆంతర్యములో దానవుడు చెరబత్తిన స్త్రీ తమకు రాణిగా ఉండుట వారికి అంగీకారం కాదు అని అనుకుంటున్నారు అని మాత్రమే వేగులు చెప్పారు. ఆ విషయం విన్న శ్రీరాముడు రాజ్యంలోని ప్రజలకు సీత ఆమోదయోగ్యంగా లేదు కనుక సీతను పరిత్యజించాడు. 
  2. పద్మ పురాణం : పద్మ పురాణం లో ఈ సంఘటన  ఇప్పుడు మనమందరము చెప్పుకుంటున్న రాజకుని నింద  వలన జరిగినది అని చెప్పబడింది. అయితే ఆ రజకుడు కూడా అలా చేయటానికి కారణంగా ఒక కథను చెప్తారు. ఆ కథను ఇక్కడ చదవండి.  
  3. ఆధ్యాత్మ రామాయణం: ఈ రామాయణంలో సీత రాముడు ఏమి చేసినా చక్కాగా ముందే మాట్లాడుకుని వారు అనుకొనిన విధముగా చేస్తారు అని ప్రతిపాదించారు. సీతాపరిత్యాగ విషయముకూడా అంతే. వారు ఏకాంతములో ఉండగా సీతాదేవి దేవతలు తనను ముందుగా వైకుంఠమునకు రమ్మని కోరుతున్నారని చెప్పగా, శ్రీ రాముడు తనకు ముందుగానే ఈ విషయములు అన్ని తెలుసు కనుక దానికి సంబందించిన ప్రణాళిక సిద్దము చేసుకున్నాను అన్ని చెప్పారట. ఆ ప్రణాళిక ప్రకారమే లోక నింద మిషగా సీతను పరిత్యజించి, ఆమె ముని ఆశ్రమములో కుమారులను కనిన తరువాత లోకమునకు తన పాతివ్రత్యమును నిరూపించుకొను మిషతో భూగర్భమునకు తిరిగి చేరుకొనినది. అక్కడి నుండి వైకుంఠమునకు చేరినది. 

2, ఏప్రిల్ 2019, మంగళవారం

రామాయణం - వేదం

రామాయణం సాక్షాత్తు  వేదం అని చెప్తారు.

వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే 
వేదః ప్రాచేసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా!

పరమాత్మ వేదవేద్యుడు. అంటే పరమాత్మ కేవలం వేదముల ద్వారానే తెలియదగినవాడు. అలాగే వేదములు కేవలం పరమాత్మగురించి మాత్రమే చెప్తాయి. కానీ ఒకసారి పరమాత్మ హఠాత్తుగా తన నామ,రూప, స్థానములను మార్చుకుని దశరథాత్మజుడు అయ్యాడట. అతని రూప, నామ , స్థానములు తెలియని వేదం సతమతమయ్యి అతని కోసం వెతికినదట. ఎక్కడ వెతకాలి తెలియక కవి మరియు ఋషి అయిన వాల్మీకి దగ్గరకు వచ్చిందట. అయితే పరమాత్మ రామునిగా ఉన్న విషయం తెలిసిన వాల్మీకి వేదము యొక్క రూపమును ఒక కావ్యముగా  మార్చినాడట. 

31, మార్చి 2019, ఆదివారం

రామాయణం - కల్ప వృక్షం

మనకు ఉన్న అనేకములయిన పురాణములలో ఉత్తమమయినది రామాయణం. ఒక మానవుడు తన కర్మలతో, ధర్మ దీక్షతో పురుషోత్తముడు అవ్వవచ్చు అని మనకు నిరూపించిన ఉత్తమ గ్రంధం అది. అటువంతో ఈ అద్భుతమయిన గ్రంధమును మన పెద్దలు కల్పవృక్షం అని చెప్పారు. వృక్షం అనే పదమునకు రామాయణమును ఎందుకు, ఎలా అన్వయించ వచ్చో ఈ శ్లోకం లో చెప్పారు.

శ్రీమద్బ్రహ్మ తదేవ బీజ మమలం యస్యాంకుర శ్చిన్మయః 
కాండై స్సప్తభి రన్వితో తివితతో ఋష్యాలవాలోదితః 
పత్రై స్తత్త్వ సహాస్రకై  స్సువిలస ఛ్చ ఖా శతై పంచభి 
శ్చాత్మ ప్రాప్తి ఫల ప్రదో విజయతే రామాయణ స్వస్తారః     

రామాయణం ఒక కల్ప వృక్షం అయితే ఆ వృక్షం లో వివిధ భాగములు

  1. బీజం : బ్రహ్మ బీజం 
  2. వేర్లు : ఋగ్వేదం (ఇక్కడ చెప్పలేదు కానీ మరికొన్ని చోట్ల ఇలా చెప్పారు)
  3. అంకురం : చిన్మయము 
  4. కాండము : రామాయణములో 7 కాండలు ఉన్నాయి. రామాయణము 7 కాండములు గల మహా వృక్షం 
  5. చెట్టు పాదు : దండకారణ్యములో గల మునులు 
  6. ఆకులు : రామాయణము లోని అనేక సన్నివేశములు, సంఘటనలు 
  7. కొమ్మలు : సర్గలు, రామాయణములో 500 సర్గలు ఉన్నాయి 
  8. ఫలము : ఆత్మ తృప్తి 
శ్రీరామ తాపత్యుపనిషత్తులో ఈ విధం గా చెప్పారు 

యథైవ వట బీజస్థ ప్రాకృతస్థో మహాద్రుమః 
తదైవ రామబీజస్థం జగదేతచ్చరాచరమ్ !

ఎంతో పెద్దదయిన వట వృక్షం అత్యంత చిన్నదయిన బీజంలో ఉండి, కాలక్రమములో విస్తరించినట్లు  ఈ చరాచర జగత్తు మొత్తం శ్రీ రాముడను బీజంలో నిక్షిప్తమై ఉండి , అతని నుండే విస్తసించినది. 

29, మార్చి 2019, శుక్రవారం

రామాయణం - గాయత్రి మంత్రము

రామాయణం ని వాల్మీకి మహర్షి రచించినప్పుడు దానికి "సీతాయా చరితం మహత్" "పౌలస్య వధ" అని కూడా పేరు పెట్టారు. అంతే కాకుండా మన పెద్దలు ఈ  రామాయణం నకు గాయత్రీ మంత్రమునకు గల అవినాభావ సంబంధం అనేక రకములుగా చెప్పారు.
వారు చెప్పిన అనేక రకములయిన సంబంధములలో కొన్ని ఇక్కడ చెప్పుకుందాం!

  1. సంఖ్య : రామాయణం లోని శ్లోకముల సంఖ్య 24000, గాయత్రి మంత్రము లోని అక్షరముల సంఖ్య  24. కనుక ఈ గాయత్రి మంత్రములలోని ఒకొక్క అక్షరంతో ఒకొక్క వెయ్యి శ్లోకములను వ్రాసి , ఆ మంత్ర అర్థమును నిబంధించారని మన పెద్దలు చెప్తారు. అలాగే  గాయత్రీ రామాయణం అను పేరున రామాయణము 24 శ్లోకములతో లోకములో ప్రసిద్ధి లో ఉన్నది. 
  2. రామాయణం లో మనకు 7 కాండలు ఉన్నాయి. అవి 
బాలకాండ 
అయోధ్య కాండ 
అరణ్య కాండ 
కిష్కింద కాండ 
సుందరకాండ 
యుద్ధ కాండ 
ఉత్తర కాండ 

వీనిలో ఒక్కొక్క కాండ గాయత్రి మంత్రం లోని ఏ భాగాన్ని సూచించునో ఇప్పుడు చూద్దాం! 

  • బాలకాండ : తత్స వితృ 
  • అయోధ్య కాండ : వరేణ్య 
  • అరణ్య కాండ : భర్గో 
  • సుందరకాండ : దేవస్య 
  • యుద్ధ కాండ : ధీమహీ 
  • ఉత్తర కాండ : ధీయోయోనః  
3. గాయత్రి మంత్రమునకు ఆదిమంత్రము, మహామంత్రము అని పేరు. 
     అలాగే రామాయణమునకు ఆది కావ్యము, మహా కావ్యము అని పేరు 
4. గాయత్రి మంత్రమునకు మహర్షి విశ్వామిత్రుడు 
    రామాయణమున శ్రీరామునకు సర్వశాస్త్రములను నేర్పించింది కూడా విశ్వామిత్రుడే 
5. గాయత్రి మంత్రాధిదేవత సవిత 
    శ్రీ రాముని వంశమే సూర్య వంశము. 
6. గాయత్రి మంత్రమునకు ముఖము అగ్ని దేవుడు 
    శ్రీ రామావతారమునకు అగ్నియే మూలము 
7. గాయత్రి మంత్రమునకు హృదయం శ్రీవిష్ణువు, శిఖ రుద్రుడు 
    రామాయణం లో శ్రీ విష్ణు అవతారమయిన శ్రీరాముడు హృదయము, రుద్రుని అంశ కల్గిన            హనుమంతుడు రామాయణమునకు శిఖ వంటి వాడు. 

27, మార్చి 2019, బుధవారం

సీత - చిలుక శాపం

రామాయణములో ఉన్న అనేక ఘట్టములలో శ్రీరాముడుకి  ఇప్పటికి అపకీర్తిని తెచ్చి పెడుతున్న ఘట్టం సీతాపరి త్యాగం. కేవలం ఒక చాకలివాని మాటలకు శ్రీరాముడు సీతను పరిత్యజించాడు అని చెప్పుకుంటాం. అయితే ఇలా చాకలివాని ప్రస్తావన మూల రామాయణం అంటే వాల్మీకి రామాయణంలో లేదు. ఆ ప్రస్తావన పద్మపురాణంలో ఉంది. ఆ చాకలి వాడు ఆలా చేయటానికి కారణం కూడా పద్మ పురాణం పాతాళ కండములో వివరించారు.
ఆ కధ ప్రకారం 
సీతా దేవి తన చిన్నతనంలో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా ఒక చెట్టు మీద జంటగా ఆనందముగా ఉన్న చిలుకల జంటను చూసింది. అప్పటికే ఆ చిలుకలు సీతను చూసి ఆనందముగా, ఈ సీతను శ్రీరాముడు వివాహం చేసుకుంటాడు, గొప్ప రాజుగా కీర్తిని గడిస్తాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సీత ఆ చిలుకలను పట్టించి పంజరంలో ఉంచి వారు ఇంతకు ముందు మాట్లాడుకుంటున్న విషయమములను గురించి విస్తారముగా చెప్పమని కోరుకున్నది.
ఆ మాటలు విన్న చిలుకలు తాము ఇంతకు ముందు వాల్మీకి ఆశ్రమములో ఉన్నప్పుడు ఆ మహర్షి రామాయణమును రచించారని, ఆ సమయములో వారు శ్రీ రాముడు భువిలో అవతరిస్తారని, మిథిలా రాజ పుత్రిక సీతను వివాహం చేసుకుంటారని, అనితరసాధ్యమయిన పనులు చేసి కీర్తిని గడిస్తారని, తమ రాజ్యమును సుభిక్షంగా పరిపాలిస్తారని చెప్పాయి. ఆ మాటలు విన్న సీత సంతోషించి ఆ జంటలోని మగ పక్షిని పంజరములోనుండి విడుదల చేసింది. కానీ గర్భవతి అయిన ఆడ చిలుకను పంజరంలోనే ఉంచింది. ఆడ చిలుక తనను తన భర్త వద్దకు పంపమని అర్ధించినా ఆమె బాల్య చాపల్యము వలన ఆ చిలుక ప్రసవించిన తరువాత మాత్రమే  బయటకు పంపుతాను అని చెప్పెను. తన భర్త వద్దకు వెళ్లలేకపోయిన బాధతో సీతకూడా గర్భవతిగా ఉన్నప్పుడు పతివియోగ బాధను అనుభవించగలదని శపించి ఆ అడా చిలుక మరణించెను. తన ప్రియమయిన భార్య అలా శపించటం వినిన మగ చిలుక ఆ శాపాన్ని నిజం చేయటానికి తన చిలుక శరీరమును గంగలో మునిగి పరిత్యజించి, అయోధ్యలో చాకలివానిగా జన్మించినది.

9, మార్చి 2019, శనివారం

108 మహేశ్వర మూర్తులు

మన వేద, పురాణ మరియు ఆగమముల ప్రకారం శివుడు అరూపరూపి. కానీ శివుడు చూపిన కొన్ని లీలలననుసరించి శివునికి కొన్ని రూపములు చెప్పారు. వానిని మనం ఇంతకు  ముందు మనం 23 శివలీలలుగా చెప్పుకున్నాం. వానితో పాటుగా మరికొన్ని రూపములను కలిపి ఈ 108 మహేశ్వర మూర్తులుగా చెప్తారు.
అవి


  1. బిక్షాటన మూర్తి
  2. నటరాజ మూర్తి
  3. అజ ఏకపాదుడు
  4. యోగ దక్షిణా మూర్తి
  5. లింగోధ్భవ మూర్తి
  6. కామదహనమూర్తి (కామారి)
  7. త్రిపురాంతక మూర్తి (త్రిపురారి )
  8. మహాకాళేశ్వర మూర్తి 
  9. జలంధరి 
  10. గజాంతక 
  11. వీరభద్ర 
  12. కంకాళ భైరవ మూర్తి 
  13. కళ్యాణ సుందర మూర్తి 
  14. వృషభారూఢ మూర్తి
  15. చంద్రశేఖర మూర్తి 
  16. ఉమా మహేశ్వర మూర్తి 
  17. హరిహర మూర్తి 
  18. అర్ధనారీశ్వర మూర్తి 
  19. కిరాత మూర్తి 
  20. చండీశ్వరానుగ్రహ మూర్తి 
  21. చక్రపాద స్వరూప మూర్తి 
  22. సోమస్కంద మూర్తి
  23. గజముఖానుగ్రహ మూర్తి 
  24. నీలకంఠ 
  25. సుఖాసన మూర్తి 
  26. పంచముఖ లింగ మూర్తి 
  27. సదాశివ మూర్తి 
  28. మహాసదాశివ మూర్తి 
  29. ఉమేష మూర్తి 
  30. వృషభాంతిక మూర్తి 
  31. భుజంగారలలిత మూర్తి 
  32. భుజంగత్రాస మూర్తి 
  33. సంధ్యాంరిత్త మూర్తి 
  34. సదానృత మూర్తి 
  35. చండ తాండవ మూర్తి 
  36. గంగాధర మూర్తి 
  37. గంగవిసర్జన మూర్తి 
  38. జ్వరభగ్న మూర్తి 
  39. శార్దూలహర మూర్తి 
  40. పశుపత మూర్తి 
  41. వ్యాఖ్యాన దక్షిణామూర్తి 
  42. విన దక్షిణామూర్తి 
  43. వాగులేశ్వర మూర్తి 
  44. ఆపాయుద్దరణ మూర్తి 
  45. వటుక భైరవ మూర్తి 
  46. క్షేత్రపాల మూర్తి 
  47. అఘోర మూర్తి 
  48. దక్షయజ్ఞహర మూర్తి 
  49. అశ్వారూఢ మూర్తి 
  50. ఏకపాద త్రిమూర్తి 
  51. త్రిపాద త్రిమూర్తి 
  52.  గౌరీవరప్రద మూర్తి 
  53. గౌరీలీలా సమన్విత మూర్తి 
  54. వృషభహారణ మూర్తి 
  55. గరుఢాంతిక మూర్తి 
  56. బ్రహ్మశిరఃచ్చేదక మూర్తి 
  57. కూర్మారి 
  58. మస్త్యారి 
  59. వరాహారి 
  60. శరభేశ్వర మూర్తి 
  61. రక్తబిక్షప్రధాన మూర్తి 
  62. గురుమూర్తి 
  63. ప్రార్ధన మూర్తి 
  64. శిష్యభావ మూర్తి 
  65. ఆనందతాండవ మూర్తి 
  66. శాంత తాండవ మూర్తి 
  67. సంహార తాండవ మూర్తి 
  68. కపాలీశ్వర మూర్తి 
  69. మహా మృత్యుOజయ మూర్తి 
  70.   త్రయాక్షర మృత్యుంజయ  మూర్తి 
  71. షడక్షర మృత్యుంజయ  మూర్తి 
  72. అంధాసురసంహార మూర్తి 
  73. జువాపరాజ్ఞాన మూర్తి 
  74. సింహాసన మూర్తి 
  75. ఇళాకేశ్వర మూర్తి 
  76. సత్యనాధ మూర్తి 
  77. ఈశాన మూర్తి 
  78. తత్పురుష మూర్తి 
  79. అఘోర మూర్తి 
  80. వామదేవ మూర్తి 
  81. అనంతేశ్వర మూర్తి 
  82. కుమారానుగ్రహ మూర్తి 
  83. హయగ్రీవానుగ్రహ మూర్తి 
  84. మహారుద్ర మూర్తి 
  85. నర్తన రుద్ర మూర్తి 
  86. శాంతరుద్ర మూర్తి 
  87. యోగ రుద్రమూర్తి 
  88. క్రోధ రుద్ర మూర్తి 
  89. వృంజి రుద్రమూర్తి 
  90. ముహుంట  రుద్ర మూర్తి  
  91. ద్విభుజ రుద్ర మూర్తి 
  92. అష్టభుజ రుద్ర మూర్తి 
  93. దశభుజ రుద్ర మూర్తి 
  94. త్రిముఖ రుద్ర మూర్తి 
  95. పంచముఖాభీషణ రుద్ర మూర్తి 
  96. జ్వాలకేశశద్భుజ రుద్ర మూర్తి 
  97. అఘోర రుద్ర మూర్తి 
  98. విష్ణుధర్మొత్తర రుద్ర మూర్తి 
  99. భీమా రుద్ర మూర్తి 
  100. స్వర్ణాకర్షణ రుద్ర మూర్తి
  101.  భీషణ భైరవ మూర్తి 
  102. కపాల భైరవ మూర్తి 
  103. ఉన్మత్త భైరవ మూర్తి 
  104. క్రోధ భైరవ మూర్తి 
  105. ఆశితంగ భైరవ మూర్తి 
  106. రురు భైరవ మూర్తి 
  107. చండ భైరవ మూర్తి 
  108. సంహార భైరవ మూర్తి 

7, మార్చి 2019, గురువారం

నటరాజ మూర్తి - ఆహార్యం

నటరాజ మూర్తి శివునికి గల అనేక రూపములలో ఒకటి అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! అలాగే శివుని రూపం ఆహార్యం గురించి, వినాయకుని ఆహార్యం గురించి  దానిలో దాగి ఉన్న రూపాత్మకత గురించి కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాం! ఇప్పుడు నటరాజ రూపం ఆహార్యం గురించి చెప్పు కుందాం.
ఇది నటరాజ స్వామి రూపం. ఇప్పుడు మనం ఈ రూపం, దీనిలోని విశేషములు గురించి తెలుసు కుందాం.

నటరాజ స్వరూపం పంచ కృత్యాత్మకం. ఇది శివుని సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది.

  1. అపస్మారక పురుష : నటరాజు పాదముల కింద ఉన్న మానవుని రూపం అపస్మారక పురుషునిది. అపస్మారక స్థితిని నియంత్రణలో ఉంచితేనే జ్ఞానము ప్రకాశిస్తుంది అని దాని భావం 
  2. ఢమరు : పైన ఉన్న ఒక చేతిలో ఢమరు ఉంది. శివ రూప విశ్లేషణ లో మనం ఢమరు గురించి చెప్పు కున్నాం. ఇది నిరంతర జ్ఞాన ప్రవాహమునకు ప్రతీక 
  3. నిప్పు : పైన ఉన్న రెండవ చేతిలో నిప్పు ఉంది. ఈ నిప్పు లయమునకు ప్రతీక. అంతే కాకుండా మండపము వలే తన చుట్టూ అగ్ని కీలలు ఉంటాయి. ఇవి ప్రకృతి నటరాజ నాట్యమును సరిగా ప్రతిబింబిస్తాయి. 
  4. కింద ఉన్న ఎడమ చేయి పైకి లేచిన తన పాదమును చూపిస్తూ ఉంటుంది. తన పాదములను ఆశ్రయించమని దాని అర్ధం. 
  5. అభయ ముద్ర : క్రింద ఉన్న కుడి చేయి అభయ ముద్రలో ఉంటుంది. తన పాదములను ఆశ్రయించిన వారికి తన రక్ష సర్వదా ఉంటుంది అని ఈ అభయం. 
  6. జింక: కొన్ని చోట్ల నటరాజు చేతిలో జింక పిల్ల ఉంటుంది. జింక చంచలత్వమునాకు ప్రతీక. చంచలమయిన మనస్సును నియంత్రించుట అలవరచుకొమ్మని దాని అర్ధం. 
  7. పుర్రె : శివుని తలలో ఒక పుర్రె కనిపిస్తుంది. ఈ పుర్రె లయమునకు ప్రతీక 
  8. గంగ : నటరాజ సిగలోని గంగ కరుణకు ప్రతీక 
  9. నెలవంక : నటరాజ సిగలోని నెలవంక కాలమునకు ప్రతీక 
  10. భుజంగం : నటరాజు తలమీద ఉన్న పాము సహస్రార చక్రమును చేరుకొన్న కుండలిని శక్తి కి ప్రతీక
  11. మూడవ కన్ను : ఇది శివుని సర్వజ్ఞతకు ప్రతీక 
  12. మకర కుండలము: నటరాజ కుడి చెవికి మకర కుండలములు ఉంటాయి. ఇది పురుషత్వానికి ప్రతీక 
  13. తాటంకము: నటరాజు ఎడమ చెవికి తాటంకములు ఉంటాయి. ఇది స్త్రీత్వానికి ప్రతీక. 
  14.  పుఱ్ఱెల మాల: నటరాజు మెడలోని పుర్రెల మాల అనేక సృష్టి లయములకు ప్రతీకలు. 
  15. భస్మం : భస్మము స్వచ్ఛతకు ప్రతీక. ఈ వస్తువయినా అగ్నిలో పునీతమయితే మిగిలేది భస్మమే. అలాగే మానవుని జీవనానంతరం మిగిలేది కూడా భస్మమే. కనుక ఈ లోకములలోని ఆకర్షణలు చూసి దేవుని మరచిపోవద్దు అని హెచ్చరిక ఈ భస్మ దారుణం. 
  16. రుద్రాక్ష : ఈ రుద్రాక్షలు తన భక్తులు చేసిన పాపములు చూసి జాలితో దయతో శివుడు కార్చిన కన్నీరు అని చెప్తారు. కనుక రుద్రాక్షలు నటరాజు జాలి కి ప్రతీక 
  17. ఉపవీతం : నటరాజ స్వామి ఉపవీతంలో 96 పోగులు (దారపు వరుసలు) ఉంటాయట. ఇవి 96 తత్వములకు ప్రతీకలు అని చెప్తారు. ఇవి నటరాజు ధరించుట వలన వానికి అన్నింటికి తానే  అధిపతి అని అర్ధం. 
  18. పాము : నటరాజుని చుట్టుకుని ఉన్న పాము విశ్వశక్తి కి ప్రతీక 
  19. పులి చర్మం : పులి అహంకారమునకు, కామమునకు ప్రతీక. ఆ పులి చర్మమును ధరించుట వలన మన అహంకారమును, కామమును అదుపులో ఉంచగలను అని చెప్పుట. 



5, మార్చి 2019, మంగళవారం

త్రిశూలం

మనం ఇంతకు ముందు శివుని ఆహార్యం గురించి చెప్పుకున్నాం కదా! అక్కడ త్రిశూలం గురించి కొంచెం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ త్రిశూలం  గురించి మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

త్రిశూలం  అంటే మూడు శూలములు కలిగినది అని అర్ధం. ఈ త్రిశూలము
    • త్రి గుణములు - సత్వ, రజః తమో గుణములకు 
    • త్రికాలములు - భూత భవిష్యత్ వర్తమాన కాలములకు  
    • త్రిస్థితులకు - జాగృత్, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులకు 
    • త్రితాపములను - ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనే మూడు తాపములకు 
    • త్రి కార్యములకు - సృష్టి, స్థితి, లయము 
    •  ధర్మ, అర్ధ , కామములు 
శివుడు ఆది దేవుడు కనుక తన వద్ద ఉన్న శూలము ద్వారా మనలోని ఇన్ని చెడు గుణములను ఒకేసారి నియంత్రిOచ గలడు. వీనిని నియంత్రించటం ద్వారా తాను మాయకు అధిపతి అని మనకు తెలుస్తుంది. 
అయితే మరి ఉన్న మూడు శూలము లలో ఒకటి (మధ్యలోనిది) పొడవు కొంచం ఎక్కువగా ఉంటుంది కదా మరి అది ఎందుకు?
ఈ త్రిశూలం  మన మానవ దేహం లోని నాడీ వ్యవస్థను సూచిస్తుంది. అతి ముఖ్యమయిన ఇడా, పింగళ,  సుషుమ్న నాడులను ఇది సూచిస్తుంది. మన దేహంలో ఇదా పింగళ నాడులు భృకుటి మధ్యభాగం వరకు వస్తాయి (ఆజ్ఞా చక్రం వరకు మాత్రమే), కానీ సుషుమ్నా నాడి పైన ఉన్న 7 వ చక్రం (సహస్త్రార చక్రం) వరకూ వెళ్తుంది.

4, మార్చి 2019, సోమవారం

నటరాజు ఆరాధన - పంచ సభలు

పరమ శివుని అనేక రూపములలో అతి ముఖ్యమయినది నటరాజ రూపం. ఈ రూపం శివుని పంచ కృత్యములను సూచిస్తుంది. దేవాలయములలో నటరాజు ఆరాధన జరిగే ప్రదేశములను సభలు అంటారు. తమిళనాడు లోని వివిధ దేవాలయములలో ని అనేక సభలలో అతి ముఖ్యమయినవి పంచ సభలు. అవి

  1. కనక సభ - చిదంబరం 
  2. రజత సభ - మధురై 
  3. రత్న సభ - తిరువళంగడు
  4. తామ్రసభ -  తిరునెల్వేలి 
  5. చిత్రసభ - కుట్రాళం 
ఇవి కాక చెప్పుకోదగిన మరికొన్ని సభలు 
  1. అద్రి సభ - హిమాలయములు 
  2. ఆది చిత్ సభ - తిరువేంకాడు 
  3. పెరూర్ కనకసభ - పెరూర్ 

3, మార్చి 2019, ఆదివారం

శివుని అష్టమూర్తులు

 శివుని అష్టమూర్తి తత్వముల గురించి మన పెద్దలు అనేక రకములుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాని గురించి అవి మనం మన కళ్ళతో దర్శించుకోవటానికి  వీలుగా ఎక్కడ వెలిశాయో చెప్పుకుందాం. ఇంతకూ ముందు మనం శివుని పంచభూత లింగముల గురించి చెప్పు కున్నాం కదా ఇప్పుడు వానితో పాటు మిగిలిన మూడు లింగముల గురించి కూడా చెప్పు కుందాం.
శివుని అష్టమూర్తులు  సర్వప్రాణకోటి యొక్క సృష్టి, స్థితి మరియు లయములకు మూలమై ఉన్నాయి. అవి :

  1. శర్వ : భూ రూపము : శివుడు భూమి తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం భూరూపమున ఉన్న శివుని కంచి (తమిళ నాడు) లో ఏకామ్రేశ్వరునిగా దర్శించ వచ్చు 
  2. భవ : జల రూపము . శివుడు జలమే తనరూపముగా కలిగి ఉన్నాడు. మనం జలరూపమున ఉన్న శివుని జలగండేశ్వరము/ జంబుకేశ్వరం  (తమిళనాడు) లో జలగండేశ్వరునిగా దర్శించ వచ్చు. 
  3. రుద్ర : అగ్ని రూపము. శివుడు అగ్నిని తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం అగ్ని రూపమయిన శివుడ్ని అరుణాచలం(తమిళనాడు) లో అరుణాచలేశ్వరుని గా దర్శించవచ్చు 
  4. ఉగ్ర: వాయు రూపము . శివుడు వాయువే తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం వాయురూపంలో ఉన్న శివుని శ్రీ కాళహస్తి (ఆంధ్రప్రదేశ్) లో శ్రీ కాళహస్తీశ్వరునిగా దర్శించవచ్చు. 
  5. భీమ : ఆకాశ రూపం . శివుడు ఆకాశమే తన రూపంగా కలిగి ఉన్నాడు. మనం ఆకాశ రూపంలో ఉన్న శివుని చిదంబరం (తమిళనాడు)లో చిదంబరేశ్వరుని గా దర్శించవచ్చు. 
  6. పశుపతి : క్షేత్రజ్ఞ రూపం. అంటే ప్రతి జీవిలో ఉండే జీవాత్మరూపం. మనం ఈ క్షేత్రజ్ఞుడయిన రూపమును  ఖాట్మండు (నేపాల్)లో పశుపతినాధ్ గా దర్శించవచ్చు. 
  7. ఈశాన : సూర్య రూపం. సూర్యుడు స్వయంగా సూర్యునిగా ఉన్నాడు. మనం ఈ సూర్య రూపంలోని శివుని కోణార్క్ (ఒరిస్సా) లో సూర్య లింగునిగా దర్శించవచ్చు. 
  8. మహాదేవ : సోమ రూపం. శివుడు చంద్ర రూపంలో ఉన్నాడు. మనం సోమరూపంలో శివుని చట్టగావ్ (పశ్చిమ బెంగాల్)లో సోమనాథుని గా దర్శించవచ్చు. 
శివుడు సర్వ ప్రాణులయందు సర్వదా ఉంటాడు అనటానికి, ప్రతిజీవి పరమాత్మ రూపం అని చెప్పటానికి ఈ ఎనిమిది రూపములలో ఉన్న శివుడే తార్కాణం. ఎందుకంటే ఈ ఎనిమిది కాకుండా మరొక రూపం/ వస్తువు/ స్థితి ఈ సమస్త సృష్టి లో మరొకటి లేదు. 
ఓం నమః శివాయ 

29, జనవరి 2019, మంగళవారం

పురాణంల వివరణ

ఇంతకు ముందు మనం పురాణాలలో భేదములకు అవి చెప్పబడిన  కల్పం అని చెప్పుకున్నాం. మరి ఏ పురాణం ఏ కల్పంలో చెప్పారో చూడాలి కదా! మరి ఆ పురాణములను మొట్ట మొదటి సారిగా ఎవరు ఎవరికీ చెప్పారో, అలాగే ఇంతకు ముందు మనం పురాణాత్మక విష్ణు స్వరూప కధనం చెప్పుకున్నాం కదా! దాని ప్రకారం మనకు గల 18 పురాణాలలో ఏ పురాణం ఏ భాగానికి చెందినదో మొత్తం ఒక టేబుల్ లా ఇస్తున్నాను మీకోసం.

       

పురాణం పేరు 
కల్పం 
విష్ణుమూర్తి శరీరభాగం 
ఎవరు ఎవరికి చెప్పారు 
 1 
 బ్రహ్మ 
 బ్రహ్మ కల్పం 
  శిరస్సు
  బ్రహ్మ మరీచికి
 2
 పద్మ 
 పద్మకల్పం 
 హృదయం 
 స్వయంభుమనువు  బ్రహ్మకు 
 3
 విష్ణు 
 వరాహ 
 కుడి భుజం 
 పరాశరుడు బ్రహ్మకు 
 4
 శివ/వాయు 
 శ్వేత 
 ఎడమ భుజం 
 శివుడు వాయువుకు 
 5
 భాగవతం 
 సారస్వత 
 తొడలు 
 విష్ణువు బ్రహ్మకు 
 6
 నారద 
 బృహత్ 
 బొడ్డు 
 పూర్వ భాగం : సనకాదులు  నారదునికి 
 ఉత్తర భాగం : వశిష్ఠ మహర్షి మాంధాతకు 
 7
 మార్కండేయ 
 శ్వేతవరాహ 
కుడి  పాదం  
 మార్కండేయ మహర్షి జైమిని 
 8 
 అగ్ని 
 ఈశాన 
 ఎడమ పాదం 
 అగ్ని వశిష్ట మహర్షికి 
 9
 భవిష్య 
 అఘోర 
 కుడి మోకాలు 
 బ్రహ్మ మనువు కు 
 10
 బ్రహ్మ వైవర్త 
 రదాంతర 
 ఎడమ మోకాలు 
 సావర్ణి నారదునికి 
 11
 లింగ 
 కల్పాంత కల్పం/ అగ్ని కల్పం 
 కుడి చీలమండ 
 శివ నారదునికి 
 12
 వరాహ 
 మను 
 ఎడమ చీలమండ 
 విష్ణు పృద్వికి 
 13
స్కంద  
తత్పురుష
జుట్టు
 స్కందుడు భూమికి 
 14
వామన
కూర్మ            
చర్మం
బ్రహ్మ పులస్త్యునికి 
 15
కూర్మ  
లక్ష్మి
వెన్ను  
విష్ణు  పులస్త్యునికి 
 16
మత్స్య
సప్త/సత్య    
మెదడు
విష్ణు మనువుకు 
 17
గరుడ
గరుడ
మజ్జ
విష్ణు గరుడునికి 
 18
బ్రహ్మాండ
భవిష్య
ఎముక
బ్రహ్మ మనువుకు