రామాయణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రామాయణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, మార్చి 2022, మంగళవారం

దశగ్రీవుని మరణానికి ఒక కారణం నంది శాపమా?

మనం ఇంతకుముందు దశగ్రీవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం! అతని వివాహం, అతని జననం, పక్కవారి ప్రభావం వలన అతను తన విచక్షణా శక్తిని కోల్పొతున్న సందర్భాలగురించి, తెలుసుకున్నాం! కానీ  దశగ్రీవునికి నంది శాపం ఎందుకు ఇచ్చాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం!

తన అన్న కుబేరుని ఓడించిన తరువాత  దశగ్రీవుడు పుష్పక విమానం సొంతం చేసుకుని గర్వంతో విర్రవీగ సాగాడు. అలా ఒకసారి హిమాలయ పర్వతముల మీదుగా వెళ్తూఉండగా అతని విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ముందుకు వెళ్ళలేదు. అలా విమానం ఆగిపోవడనికి కారణం ఏమిటో అర్ధంకాలేదు. అప్పుడు అక్కడికి శివుని భక్తుడు, అనుచరుడు అయిన నంది వచ్చాడు. 

ఆ విమానం అలా అగిపోవడానికి కారణం వారు ఉన్న ప్రాంతం అని, ఆ ప్రాంతంలో పరమేశ్వరుడు పార్వతీ దేవితో సంచారం చేస్తుంటాడు కనుక అక్కడి నుండి ఎవ్వరూ వెళ్ళకూడదు కనుక తన మార్గమును మార్చుకొమ్మని చెప్పాడు. అప్పటికే గర్వం తలకెక్కిన  దశగ్రీవుడు నంది చెప్పిన మాటలను విని, నందిని, అతని సగం మనిషి మరోసగం ఎద్దు రూపమును చూసి ఆ ఎద్దులా ఉన్న ముఖాన్ని చూసి, కోతిలా ఉన్నది అని హేళన చేసాడు. అంతే కాకుండా పరమేశ్వరుడు అనే పేరు అతను ఇంతకు ముందు తన అన్న కుబేరుని వద్ద విని ఉండడం వల్ల అన్నగారి మీద కోపం పరమేశ్వరుని పైకిమారింది, అందువలన అతను కోపంగా ఆ పరమేశ్వరుడు ఎవరు? అని అమర్యాదగా మాట్లాడాడు. 

అతని మాటలకు కోపగించిన నంది అతనిని శపించాడు. అతని శాపం ప్రకారం  దశగ్రీవుడు, అతని జాతి, కోతుల వలన పరాభవం పాలయ్యి, ఆ కోతులే  దశగ్రీవుని మరణానికి కారణం అవుతారు. అతని శాపమును విన్న  దశగ్రీవునికి మరింత నవ్వువచ్చింది. దానికి కారణం అతనికి ఉన్న బ్రహ్మవరం. కానీ అతను తను కోరుకున్నవరంలో అతను మానవులను, కోతులనుండి రక్షణ కోరుకొనలేదు అనే విషయం మరచిపోయాడు. 

2, మార్చి 2022, బుధవారం

దశగ్రీవుడు - మండోదరి వివాహం

 మనం ఇంతకు ముందు దశగ్రీవుని గురించి, అతని  మూర్ఖత్వం పక్కన ఉన్నవారి వలన ఏ విధంగా పెరుగుతోందో తెలుసుకున్నాం కదా! పంచకన్యలలో ఒకరయిన మండోదరిని దశగ్రీవుడు ఎలా వివాహం చేసుకున్నాడు అని ఇప్పుడు తెలుసుకుందాం!

దశగ్రీవుడు కుబేరుని గెలిచిన తరువాత అతని పుష్పకవిమానం లాక్కుని గర్వంతో ప్రవర్తిస్తున్న సమయంలో అనుకోకుండా ఒకసారి వారికి దితి పుత్రుడు దైత్యులలో ఒకడయిన మయుడు అతని కుమార్తె మండోదరిని కలిశాడు. 

అప్పుడు మయుడు తన భార్య ఒక అప్సరస  అని, ఆమె కొంతకాలం అతనితో గడిపిన తరువాత మాయావి,దుంధుభి అనే ఇద్దరు పుత్రులను, మండోదరి అనే ఈ పుత్రికకు జన్మను నిచ్చిన తరువాత దేవలోకమునకు వెళ్ళో తిరిగిరాలేదు అని, ఇప్పుడు మండోదరికి వివాహ వయస్సు వచ్చినందు వలన తగిన వరునికోసం చూస్తున్నానని చెప్పాడు. దశగ్రీవుడు కూడా తనని తాను పరిచయం చేసుకున్నాడు. తాను పులస్త్యుని మనుమడిననీ, విశ్రవనుని పుత్రుడననీ తన పేరు దశగ్రీవుడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న మయునికి ఒక ఆలోచన తట్టింది. 

అప్పటికే దశగ్రీవుని గురించి, అతని దుర్వ్యవహారముల గురించి, అతని అన్నతోనే యుద్ధం చేసిన విషయం గురించి అన్నీ తెలిసినా మయుడు తన కుమార్తెను దశగ్రీవునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. ఆ ప్రస్థావనను దశగ్రీవుడు అంగీకరిం చాడు. అప్పుడు అక్కడికి అక్కడే అగ్నిసాక్షిగా వివాహం చేయించాడు. 

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

పుష్పక విమానం రావణునికి ఎలా లభించింది?

 మనం ఇంతకుముందు దశగ్రీవుడు అత్యంత బలశాలి, సకల శాస్త్రముల జ్ఞానము కలిగి ఉండి కూడ  తన చుట్టూ ఉన్నవారి మాటలు విని తన వివేకాన్ని పూర్తిగా కోల్పోతున్న విధానాన్నిచూసాం! ఇంతకు ముందు భాగంలో మనం దశగ్రీవుని అరాచకాలను గురించి విన్న కుబేరుడు తన తమ్ముని ధర్మమార్గంలోనికి మార్చడానికి ఒక ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నం గురించి, దానికి దశగ్రీవుడు ఎలా స్పందించాడు అని తెలుసుకుందాం!

కుబేరుడు తన తమ్ముని అధర్మ ప్రవృత్తి గురించి తెలుసుకుని, అతనిని మంచి మార్గంలోనికి మార్చడనికి ఒక ప్రయత్నం చేయడనికి ఒక దూతను పంపాడు.  ఆ దూత దశగ్రీవుని వద్దకు వచ్చి, కుబేరుడు అతనికి చెప్పమన్న అన్ని విషయములను చెప్పాడు. కానీ ముందే అధర్మ మార్గంలో ఉన్న దశగ్రీవునికి ఆ మాటలు రుచించలేదు. అంతేకాక ఆ మాటలలో కుబేరుడు తాను పరమశివునకు మిత్రుడని చెప్పడం అతని అహానికి పెద్ద శరాఘాతంగా అనిపించింది. కుబేరుడు తనను హెచ్చరిస్తున్నట్లుగా అతనికి అనిపించింది. దానివలన అతను తన ఆధిపత్యాన్ని చూపించడానికి, కుబేరుని దూతను హతమార్చాడు. అంతేకాక అతను స్వయంగా కుబేరుని పై యుధ్ధాన్ని ప్రకటించాడు. 

అలకాపురి చుట్టూ తన రాక్షససేనను మొహరింపజేసాడు. ఆ సేనను చూసిన యక్షులు కూడా తమ యుధ్ధాన్ని ప్రారంభించారు. యుధ్దం హొరాహోరీగా సాగింది. అనేక మంది యక్షులు తమ ప్రాణాలను కోల్పోయారు.  ధర్మ యుధ్దం చేస్తున్న కుబేరుడు రాక్షస సేనలను తమపురినుండి తరమ సాగాడు. తమ అపజయాన్ని పసిగట్టిన దశగ్రీవుడు మాయా యుధ్ధాన్ని ప్రారంభించాడు. ఆ మాయా యుధ్ధంలో కుబేరుడిని దశగ్రీవుడు ఒడించాడు. అతని దగ్గరి నుండి పుష్పకవిమానమును లాక్కున్నాడు. అప్పటినుండి ఆ పుష్పక విమానం అతని వద్దనే ఉంది. 

21, ఫిబ్రవరి 2022, సోమవారం

దారితప్పిన దశగ్రీవుడు

 మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది  అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది, దశగ్రీవుడు నిజంగా అంత చెడ్డవాడా,  కైకసి కుమారులు  పొందిన వరముల గురించి, అతనిపై ఉన్న చెప్పుడు మాటల ప్రభావాన్ని గురించి తెలుసుకున్నాం కదా! 

ఎంత మంచివారయినా తమ చుట్టూ ఉన్నవారిని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. ఆ విషయం దశగ్రీవుని విషయంలో నిజం అని మనం చూడవచ్చు. అతను తన చుట్టూ తన తాత సుమాలి, అతని మంత్రులు ఉన్నారు.  వారు చెప్పే మాటలు వింటూ కాలం గడుపుతున్న దశగ్రీవునికి వారి అలోచనలలో నుండి అనేక చెడ్డ ఆలోచనలు అతని మెదడులో ఊపిరి పోసుకోసాగాయి. అతని మనస్సులోనికి అరిషట్వర్గములు ప్రవేశించాయి. అతనికి తను సొంతం చేసుకున్న స్వర్ణలంక చిన్నది అనిపించసాగింది. హింస ప్రవృత్తి పెరిగింది. స్వార్ధం పెరిగిపోయింది. అహంకారం మితిమీరి ప్రవర్తించసాగాడు. ఋషులను మునులను భాదించడం మొదలు పెట్టాడు. అతని పద్దతులను, అతని జీవన విధానంలోని మార్పులను తెలుసుకున్న అతని అన్న కుబేరుడు అతనిని మార్చాలని అనుకున్నాడు. మరి అతను ఏమి చేసాడు? దశగ్రీవుడు అన్నగారి మాట విన్నాడా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

16, ఫిబ్రవరి 2022, బుధవారం

కుబేరుడు శివునితో స్నేహం

మనం ఇంతకు ముందు గుణనిధి గురించి, అతను దొంగగా మారుట,  అతనికి శివలోకం లభించిన విధానం, తరువాత అతను దమనుడు అనే రాజుగా జన్మించి జన రంజకంగా పరిపాలించిన సంగతి ,తరువాత అతను పులస్త్యుని వంశంలో విశ్రవసునికి కుమారునిగా జన్మించడం, అతనికి వైశ్రవణుడు అని పేరు పెట్టడం, అతను దిక్పాలకత్వం పొందడం,  ఆ తరువాత అతనే కుబేరునిగా మారడం గురించి కూడా తెలుసుకున్నాం! అయితే ఆ కుబేరుడు పరమ శివునికి మిత్రుడు అని చెప్తారు. అతనికి పరమ శివునికి స్నేహం ఎలా కుదిరింది?

పార్వతిదేవి శాపానికి గురి అయిన తరువాత కుబేరుడు పశ్చాత్తాపాన్ని పొందాడు. ఆ పశ్చాత్తాపంతో సుదీర్ఘకాలం మౌనవ్రతం చేసాడు. అతని మౌనవ్రతాన్ని చూసి ప్రసన్నుడయిన ప్రమ శివుడు కుబేరిని వద్దకు వచ్చి, అటువంటి కఠినమయిన వ్రతమును పూర్వకాలంలో తాను స్వయంగా చేసానని, మళ్ళీ ఇంతకాలం తరువాత కుబేరుడు చేసాడు కనుక అతనికి తనతో సమానంగా, అతని స్నేహితుని స్థానం ఇచ్చాడు. అంతేకాకుండా అతనికి ఏకాక్షి అని పింగళి అని పేరు ఇచ్చాడు. 

17, డిసెంబర్ 2021, శుక్రవారం

వరరుచి, కేరళ జానపద కథ

మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి, కాలక్రమంలో విధిని తప్పించలేక పంచమకన్యతో  అతనికి జరిగిన వివాహం గురించి, వివాహానంతరం  పొందిన సంతానాన్ని వరరుచి వదలిపెట్టటం గురించి కూడా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి కథ చూద్దాం!  

తనకు కలిగిన 11 మంది కుమారులను నిర్దాక్షిణ్యంగా అడవిలో పొత్తిళ్లలోనే వదిలిన వరరుచి భార్య, తనకు ఒక బిడ్డను పెంచుకోవాలని కోరిక బలంగా కలిగింది. అందుకే తనకు 12 వ సారి ప్రసవవేదన మొదలవగానే అడవిలోని పొదల చాటుకువెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. ఎప్పటి వలెనే వరరుచి "ఆ బిడ్డకు నోరు ఉందా" అని అడిగాడు. పిల్లవాడిని తానే పెంచుకోవాలి అనే కోరిక ఉన్న ఆమె వెంటనే ఆ బిడ్డకు నోరులేదు అని చెప్పింది. ఆ తరువాత బిడ్డను చూస్తే నిజంగానే అప్పుడు పుట్టిన ఆ బిడ్డకు నోరులేదు. 

అప్పుడు వరరుచి ఆ నోరులేని పిల్లవాడిని ఒక కొండమీద దేవతలా ప్రతిష్టించి తన భార్యతో కలసి దారిన అతను యాత్రలలో వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలానికి అతను కాలధర్మం చేసాడు. 

మరి అడవిలో వదిలిన ఆ 11 మంది పిల్లలు ఎం అయ్యారు?

వారిని వివిధజాతులకు చెందిన కుటుంబాలు పెంచుకుని వారి వారి కుటుంబ సంప్రదాయాలను వారి ద్వారా కొనసాగేలా చేసుకున్నారు. కేరళలో ప్రసిద్ధమయిన జానపద కధలలో ఈ వరరుచి కధ ఒకటి. వారికి కలిగిన సంతానం, వారు పెరిగిన కులం/జాతి/వృత్తి ఇప్పుడు తెలుసుకుందాం!

  1. మేళత్తూళ్ అగ్నిహోత్రి : నిత్యఅగ్నిహోత్రులు 
  2. పాక్కనార్ : పంచమజాతి 
  3. రజకుడు :: చాకలి 
  4. నారణతు  బ్రాహ్మణ :నాయి బ్రాహ్మణ 
  5. కారెక్కాల్ మాత :: వరరుచి సంతానంలో ఒకేఒక ఆడపిల్ల 
  6. అకవూర్ చాటన్ :: వైశ్య
  7. వడుతల నాయర్ : సైనిక 
  8. తిరువళ్ళువర్: తమిళనాట ప్రముఖ కవి , కన్యాకుమారిలో సముద్రములో పెద్ద విగ్రహం ఉంటుంది 
  9. ఉప్పుకొట్టం : ముస్లిం 
  10. పాణనర్ : సంగీత కారుడు 
  11. పేరుంథచ్చం :: వడ్రంగి 
  12. వాయిళ్ళకుణ్ణిల్ అప్పన్ : నోరులేని కొండమీది దేవత
మనం చెప్పుకున్న ఈ కథ కేరళలో ఒక ప్రముఖమైన జానపద కథ. ఆ కథపేరు పరాయి పెట్ట పంతిరుక్కులం ఈ పేరుకు అర్ధం "నిమ్నజాతి స్త్రీ ముంది జన్మించిన 12 కులములు".  పైన చెప్పుకున్న వారి సంతతి ఇప్పటికి ఉన్నారు అనై వారు ఇప్పటికి కూడా కలుస్తూ ఉంటారు అని కేరళలో కధనాలు ఉన్నాయి.  

16, డిసెంబర్ 2021, గురువారం

వరరుచి విధి

 మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి, కాలక్రమంలో అతనికి జరిగిన వివాహం గురించి కూడా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి కథ చూద్దాం! 

వివాహం జరిగిన  వరరుచి భార్యతో కాలంగడుపుతూ ఉన్నాడు. ఒకరోజు ఉద్యానవనంలో వరరుచి తన భార్యతలను తన ఒడిలో ఉంచుకుని ఆమె జుట్టును చేతితో సరిచేస్తుండగా ఒక నల్లని మచ్చ ఆమె తలపైన గమనించాడు.  అని ఎలా వచ్చింది అని  తన భార్యను ప్రశ్నించాడు. అప్పుడు ఆమె  ఆ బ్రాహ్మణునకు సొంత కుమార్తె కానని, చిన్నప్పుడు ఒక అరటి బోదెలో తలపైన దీపంతో నదిలో కొట్టుకు వస్తున్న ఆమెను ఆ బ్రాహ్మణుడు కాపాడి తన కుమార్తెగా పెంచాడు అని చెప్తుంది. ఆ వివరం విన్న వరరుచికి ఆశ్చర్యం వేసి, విధిని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు అని తెలుసుకుంటాడు. ఆమె జన్మ వృత్తాంతం అంతా ఆమెకు వివరించి చెప్తాడు. కానీ బ్రాహ్మణునిగా పెరిగినా ఆమె ఒక పంచమజాతి కన్య కనుక, ఆమెను వివాహం చేసుకున్నందుకు అతనుకూడా బ్రాహ్మణ్యం వదలి తీర్ధ యాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నట్లు ఆమెకు చెప్తాడు. ఆ తీర్ధయాత్రలు ఆజన్మాంతం చేయాలి అనుకుంటున్నట్లుగా కూడా చెప్తాడు. ఆమె కూడా అతని వెంట తీర్థయాత్రలకు వెళుతుంది. 

ఆ తీర్ధయాత్రలు చేసే క్రమంలో ఆమె పదకొండుసార్లు గర్భవతి అయ్యి పదకొండుమంది మగశిశువుకు జన్మఇచ్చింది. అయితే  ఆమె ప్రసవవేదన పడుతూ అడవులలో గుట్టల ప్రక్కన బిడ్డలకు జన్మ ఇచ్చినప్పుడు వరరుచి ఆ పొదల బయట నిలబడి ఒక ప్రశ్న అడిగేవాడు. పుట్టిన ఆ పసివానికి నోరు ఉందా అని. ఆమె బిడ్డను చూసి ఉంది అని చెప్పగానే "నోరు ఇచ్చిన దేవుడు వానికి ఆహారంకూడా సమకూరుస్తాడు కనుక ఆ బిడ్డను అక్కడే వదలి రా" అని చెప్పేవాడు. ఆమె భర్తమాట విని అలాగే తన 11 మంది పిల్లలను అడవిలో పొదల మద్యవదలి తన భర్తతో తీర్థయాత్రలకు సాగిపోతూ ఉండేది. 

అలా వదిలివేయబడిన 11మంది పిల్లలు ఏమి అయ్యారు? ఆమె తనకంటూ ఒక కుమారుని పెంచుకోవాలి అని ఎందుకు అనుకోలేదు? అలా పెంచుకునేందుకు ప్రయత్నించిందా? తరువాత ఏం  జరిగింది ? తరువాతి టపాలో చూద్దాం!

15, డిసెంబర్ 2021, బుధవారం

వరరుచి వివాహం

 మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి కూడా తెలుసుకున్నాం కదా!  తరువాత వరరుచి ఏం చేసాడో ఇప్పుడు తెలుసుకుందాం! 

విక్రమాదిత్యుని ఆస్థానంనుండి బయటకు వచ్చి, దేశాటన చేస్తూ వరరుచి కేరళ చేరుకున్నాడు. అలా గమ్యం లేకుండా తిరుగుతున్న అతనిని ఒక బ్రాహ్మణుడు అతని ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని స్వీకరించిన వరరుచి అతని ఇంట్లో భోజనాన్ని స్వీకరించాలంటే కొన్ని షరతులు పాటించాలని చెప్పాడు. 

  1. అతనికి వడ్డించే భోజనం 1008 రకాల వంటకాలతో ఉండాలి, 
  2. ఆ ఆహారాన్ని తిన్న తరువాత  అతను నమలటానికి నలుగురు  కావాలి 
  3. ఆ భోజనం తిన్నతరువాత అతను నిద్రపోతున్నప్పుడు అతనిని నాలుగురు  తమ భుజాలమీద మోస్తూ ఉండాలి 
ఆ షరతులు విన్న బ్రాహ్మణుడు ఏమి సమాధానం చెప్పలేక పోయాడు. కానీ ఆ బ్రాహ్మణుని కుమార్తె ఆ నియమాలకు ఒప్పుకుని అతిధిని స్నానం చేసి రమ్మని పంపింది. వరరుచి భోజన్నని కి వచ్చినప్పుడు అతనికి ఆ బ్రాహ్మణుని కుమార్తె  భోజనం వడ్డించింది.  
  1. అల్లంవేసిన పెరుగు (కేరళ సంప్రదాయం ప్రకారం ఇది 1008 రకాల ఆహారం తో సమానం) 
  2. భోజనం ఆరగించిన తరువాత అతనికి ఆకు, వక్క, సున్నం, యాలకలు ఇచ్చారు నమలటానికి 
  3. అతను నిద్రపోవటానికి మంచం వేశారు. అతను నిద్రపోతున్నప్పుడు ఆ మంచానికి ఉన్న నాలుగు కాళ్ళు అతనిని మోస్తాయి. 
ఈ ఏర్పాట్లు చూసిన వరరుచి ఆ బ్రాహ్మణుని తెలివికి మెచ్చుకున్నాడు. అయితే ఆ బ్రాహ్మణుడు ఆ ఆలోచన తనది కాదు అని తమ కుమార్తెది అని చెప్పగా ఏంతో  జ్ఞానం ఉన్న వరరుచి అడిగిన ఆ షరతులను ఆమె అంత చక్కగా అర్ధంచేసుకున్నందుకు,  ఆమె తెలివితేటలు మెచ్చుకుని ఆమెను వివాహం చేసుకోవాలన్న ప్రస్తావన ఆ బ్రాహ్మణుని ముందు ఉంచాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కుమార్తెను వరరుచికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. 

ఇంతకూ వరరుచి భార్యకావలసిన ఆ పంచమ కన్య ఏమి అయ్యింది? ఆమె వరరుచి భార్య  కాగలిగిందా లేదా? తరువాతి టపా లో చూద్దాం!

14, డిసెంబర్ 2021, మంగళవారం

వరరుచి అమానుషత్వం

మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యునికి చెప్పటం వల్ల సత్కారం పొందాడు  తెలుసుకున్నాం.  ఆ వరరుచి  విధిరాతలో ఉన్న పంచమజాతి కన్యతో వివాహాన్ని ఎలా తప్పించుకోవచ్చని అనుకున్నాడు? నిజంగా తప్పించుకున్నాడా లేదా? ఇప్పుడు చూద్దాం! 

మహారాజుగారు వరరుచిని విందుకు ఆహ్వానించి,అతను రాజ్యసభలో ఏమి చెప్పకుండా మౌనంగా ఉండటానికి కారణం అడిగాడు. ఆ సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ, ఈ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నంలో తనకు వారి రాజ్య భవిష్యత్తుకు సంబందించిన ఒక విచిత్రమయిన విషయం తెలిసిందని, దానిని సభలో అందరి ముందు చెప్పలేక మౌనంగా ఉన్నాను అని చెప్పాడు వరరుచి. 

వరరుచి మాటలు విన్న మహారాజు కు ఆశ్చర్యంతో పాటుగా కుతూహలం కూడా పెరిగి ఆ విషయాన్నీ తమకు చెప్పా వలసినదిగా కోరారు. అప్పుడు వరరుచి తాను ఆలోచించి పెట్టుకున్న వ్యూహాన్ని రాజ్యరక్షణకోసం అన్నట్లుగా మహారాజుకు చెప్పాడు. 

"మహారాజా! నాకు తెలిసిన విషయమా ప్రకారం నిన్నటి రాత్రి మన రాజ్యమునకు సంబందించిన ఒక గ్రామంలో పంచమజాతి స్త్రీ ఒక ఆడపిల్లకు జన్మను ఇచ్చింది. ఆ శిశువు భవిష్యత్తులో ఈ రాజ్యమునకు తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుంది కనుక ఆ బిడ్డను తక్షణమే అంతమొందించాలి" అని చెప్పాడు వరరుచి. 

వరరుచి తెలివితేటల గురించి, అతని పాండిత్యము గురించి తెలిసిన విక్రమాదిత్యుడు అతని మాటలను ఏమాత్రం అనుమానించలేదు. కానీ ఒక పురిటి పసికందును చేతులారా చంపటానికి మనసుకూడా రాలేదు. ఇదే విషయం  వరరుచికి చెప్పి ఏమి చేయమంటారు అని వరరుచిని సలహా అడిగాడు మహారాజు. దానికి వరరుచి ఆ పసిబిడ్డను ఒక అరటి దూటలో పడుకోబెట్టి, ఆ బిడ్డ తలవైపున ఒక వెలుగుతున్న దీపాన్ని ఉంచి నదిలో వదిలి వేయమని చెప్పాడు. 

విక్రమాదిత్యుడు తూచా తప్పకుండ వరరుచి ఆలోచనను అమలుపరచాడు. తరువాత ఆ విష్యం గురించి మహారాజు, వరరుచి ఇద్దరు మరచిపోయి తమ జీవనాన్ని సాగించారు. కొంతకాలానికి వరరుచి రాజ ఆస్థానాన్ని వదలి గమ్యంలేకుండా దేశాటనకు వెళ్ళాడు. 

ఆ పసిబిడ్డ బ్రతికిందా? వారి వివాహం నిజంగా జరిగిందా? లేక వరరుచి నిజంగా విధిని తప్పించుకోగలిగాడా? తరువాతి టపాలలో చూద్దాం!  

12, డిసెంబర్ 2021, ఆదివారం

వరరుచి ఆలోచన

మనం ఇంతకు ముందు విక్రమాదిత్యుని ఆస్థానం లోని నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని తెలుసుకోవటానికి దేశాటన చేసాడని, ఆ శ్లోకం గురించి కొందరు వనదేవతలు మాట్లాడుకుంటున్నప్పుడు వినిని విక్రమాదిత్యునితో చెప్పగా అతను సంతోషించి బహుమానం కూడా ఇచ్చాడు అని తెలుసుకున్నాం! ఆ శ్లోకానికి ఉన్న కొన్ని అర్ధాలనుకూడా మనం తెలుసు కున్నాం కదా! 

ఇప్పుడు వరరుచి ఆరాత్రి అడవిలో చెట్టు కిందపడుకున్నప్పుడు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం!

దేశాలు అన్ని తిరిగి అనేక పండితులని కలసి, రామాయణంలోని ముఖ్యమయిన శ్లోకం ఏది అని చర్చలు జరిపిన వరరుచికి అన్ని చోట్ల నిరాశ ఎదురయ్యింది. దానికి కారణం ఏ యిద్దరు పండితులూ ఓకే శ్లోకాన్ని చెప్పలేదు. అలా అతని యాత్ర చివరికి చేరుకున్న సమయంలో అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఒక చెట్టుకిందకు చేరి, అలసట వల్ల నిద్రపోయాడు. 

కొంతసేపటికి అతనికి కొన్ని మాటలు వినిపించి మెలకువ వచ్చింది. ఆ మాటలు అతని నిద్రిస్తున్న చెట్టుమీద ఉన్న వానదేవతలవిగా అతనికి అర్ధం అయింది. 

ఒక వనదేవి ప్రక్క ఊరిలో ఒక పంచమజాతి స్త్రీ ఒక ఆడపిల్లకు జన్మను ఇచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ తనకు తెలిసిన జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆ చంటిపిల్ల ఈ చెట్టుకింద పడుకున్న రామాయణంలో ప్రామూఖమయిన శ్లోకం మామ్ విద్ధి అని తెలియని ఈ పండితునికి భార్య అవుతుంది అని చెప్పింది. 

ఆ మాటలు విన్న వరరుచి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ శ్లోకం గురించి తనకు తెలిసినా దానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోలేక పోయినందుకు చింతిస్తూ, భవిష్యత్తు లో తను ఆ పంచమ కన్యను వివాహం చేసుకోకుండా ఎలా విధిని మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అక్కడినుండి తన రాజ్యానికి బయలుదేరాడు. 

తన రాజ్యమునకు చేరుకున్న వరరుచి ఆ శ్లోకాన్ని మహారాజు విక్రమాదిత్యుని చెప్పి, దానికి ఉన్న 18 రకముల అర్థాలను చెప్పాడట. అతని ప్రతిభకు ఆశ్చర్యపోయిన మహారాజు అతనికి సన్మానం చేసి, బహుమానంగా ప్రకటించిన 1000 బంగారు నాణేలతో పాటుగా ఇంకా ఏమి కోరుకున్నా చేస్తాను అని మాట ఇచ్చారు. వరరుచి  ఆమాటకు సాంతోషించినా అతని కోరికను బయట పెట్టకపోవటం వల్ల రాజుగారు వరరుచిని విందుకు ఆహ్వానించారు. 

విందుకు వెళ్లిన వరరుచి ఏమి కోరుకున్నాడు? రాజుగారి మాటని వరరుచి తన విధిని మార్చుకోవటానికి వాడుకున్నాడా? నిజంగా విధి నుండి తప్పించుకోగలిగాడా? తరువాతి టపాలలో చూద్దాం!

9, డిసెంబర్ 2021, గురువారం

రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం

ఇంతకు మూడు టపాలో విక్రమాదిత్యుడు వాల్మీకి రామాయణంలో ని విశిష్టమయిన శ్లోకం గురించి అడిగినప్పుడు వరరుచిచెప్పిన శ్లోకం ఇది అని చెప్పుకున్నాము కదా!  

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్

అయోధ్యామ్ అటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్    

ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలోఅరణ్య కాండ లో 40వ సర్గలో వస్తుంది. రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి  లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ, తన తల్లి సుమిత్ర ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం. ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం.


మొదటి అర్ధం

రామ= రాముడు: దశరథం=దశరథుడు:  విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా

తాత్పర్యం: లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో, సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!


రెండవ అర్ధం
రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం) దశరథం= పక్షిని రధంగా కలిగిన వాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకుని కూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా
తాత్పర్యం: ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లి రా!

మూడవ అర్ధం
రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీ తల్లి (కైకను ఉద్దేశించి ); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్= వీలయినంత సుఖంగా
తాత్పర్యం: ఓ పుత్రా! నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో, సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు. రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక శోకిస్తుంది. కనుక వీలయినంత దైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు.

నాలుగవ అర్ధం:

పుత్రా! దశరధుడు లేడనుకో, నేను దశరధుని భార్యగా కాక నా తండ్రికి పుత్రికగానే ఉన్నాను అనుకో, అయోధ్యను మరచి సంతోషంగా రామునితో వెళ్ళు.

నాల్గవ సరి చెప్పిన ఈ అర్ధం వాల్మీకి చెప్పవలసిన భావం అయ్యి ఉండదు. కానీ ఆ పదములకు ఇటువంటి అర్ధం కూడా ఉంది కదా!

ఇంతకు విక్రమాదిత్యుని రాజాస్థానంలోని వరరుచి గురించి తరువాతి టపాలో చూద్దాం! 

8, డిసెంబర్ 2021, బుధవారం

రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?

ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న నవరత్నాలలో ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది. రాజ్యసభ లో ఉన్నా పండితుల అందరినీ పిలిచి రామాయణం లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు. ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు. ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు. విక్రమాదిత్యుని రాజ్యసభలో వరరుచి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి ఆ వెయ్యి వెయ్యి బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది. అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాల లో తిరిగి రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు. అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానంమే దొరికింది. 40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు. ఆ సంభాషణ విన్నవరరుచికి ఎంతో ఆనందం కలిగింది. అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు. ఆ శ్లోకం ఇది 

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్
అయోధ్యామ్ అటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్

ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు. అతను

చెప్పిన 18రకాలయిన అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి

1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.

ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి? ఏందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు? ఆ వనదేవతలు ఆ చెట్టుమీద ఏం మట్లాడుకున్నారు? తరువాతి టపాలలో నేర్చుకుందాం! 

1, జులై 2020, బుధవారం

కైకసి - కుమారులు పొందిన వరములు

దశకంఠునిలో అసూయ కలగటానికి తన తల్లి కైకసి ఎలా కారణం అయ్యిందో మనం ఇంతకు ముందు టపాలో తెలుసుకున్నాం కదా! అసూయతో రగిలిపోతున్న దశకంఠుడు తపస్సుకు బయలుదేరాడు. అతనితో పాటుగా అతని తమ్ములనుకూడా తీసుకుని వెళ్ళాడు. ఇంతకు ముందు టపాలలో అతని సోదరుల గురించి తెలుసుకున్నాం కదా! వారిలో పెద్దవాడు, అత్యంత భారీకాయుడు అయిన కుంభకర్ణుడు పుట్టిన సమయం నుండి కూడా నర భక్షకుడుగా ఉన్నాడు. సకల జనులను కష్టపెడుతూ ఉన్నాడు, అంతే కాక అతనికి రాక్షసత్వం వల్ల కలిగిన శక్తుల వలన అన్ని లోకములకు తిరుగుతూ అందరిని ఏడిపిస్తూ ఉండేవాడు.
చిన్నవాడు అయిన విభీషణుడు అత్యంత సౌమ్యుడు, బ్రాహ్మణత్వం,ధర్మజ్ఞత మరియు ఇంద్రియ నిగ్రహం  కలిగి ఉండేవాడు.
అలంటి తన తమ్ములతోబ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తున్న దశకంఠుడు తన ఒకొక్క తల నరుక్కుని బ్రహ్మదేవునికి హోమంలో అగ్నికి అర్పించసాగాడు. అలా తన తొమ్మిది తలలు అర్పించిన తరువాత కూడా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాకపోవటంతో, తన పదవ తలను కూడా నరుకుకొనుటకు సిద్ధపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యి అతనిని వరములు కోరుకొమ్మని చెప్పాడు.
అప్పుడు దశకంఠుడు మరణం లేని వరం కోరుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు అలాంటి వరం ఇవ్వటం కుదరదు అని చెప్పాక, అప్పుడు నాగ, యక్ష, కిన్నెర, దానవ, రాక్షస,దైత్య, దేవతల వలన తనకు మరణం రాకుండునట్లు కోరుకున్నాడు.అంతే కాకుండా తనకు మానవులు అంటే అస్సలు భయం లేదు కనుక వారి గురించి అడగవలసిన అవసరం లేదు అని చెప్పాడు.  బ్రహ్మదేవుడు తధాస్తు అని చెప్పాడు. అంతేకాక అప్పటివరకు దశకంఠుడు అర్పించిన అతని తొమ్మిది తలలను కూడా తిరిగి వచ్చేవిధంగా వరం ఇచ్చాడు. అవే కాకుండా అతనికి కామరూప విద్యను కూడా ప్రసాదించాడు.
బ్రహ్మదేవుడు అప్పుడు విభీషణుని వరం కోరుకొమ్మని చెప్పారు. అప్పుడు సాత్విక స్వభావం కలిగిన విభీషణుడు ఎళ్లవేళలా అతని మనస్సు ధర్మం తప్పకుండ ఉండేటట్లుగా వరం ఇవ్వమని కోరుకున్నాడు. అతని ధర్మ నిరతికి సంతోషించిన బ్రహ్మ దేవుడు అతనికి చిరంజీవిగా ఉండమని వరం ఇచ్చాడు.
తరువాత వరం కోరుకునే అవకాశం కుంభకర్ణునికి వచ్చింది.
అయితే అతని ఉదృతిని అప్పటికే దేవతలు చూసి ఉండుట వలన అతను అడిగే వరములు ఏవయినా వారిని బాధిస్తాయి కనుక, అతను ఎల్లప్పుడూ నిద్రావస్థలో ఉండేలా వరం కోరుకుంటే అన్ని లోకములకు మంచిది కనుక అలా అతనిని పలికించమని దేవతలు సరస్వతిని వేడుకున్నారు. వారి కోరికను మన్నించిన సరస్వతి వెళ్లి కుంభకర్ణుని నాలుక పై కూర్చున్నది. అతనితో కావలసిన తిండి తిని నిద్రావస్థను ప్రసాదించమని పలికించింది. బ్రహ్మదేవుడు తధాస్తు అని పలికి తన లోకమునకు వెళ్ళిపోయాడు. అతనితో సరస్వతి కూడా వెళ్ళిపోయింది.  అప్పుడు జరిగిన దానిని గురించి ఆలోచించిన కుంభకర్ణుడు ఇకమీదట చేసేది ఏమి లేదు అని తెలుసుకుని ఆ వరముతోనే ఉండిపోయాడు. 

29, జూన్ 2020, సోమవారం

దశకంఠుడు నిజంగా అంత చెడ్డవాడా?

మనం ఇంతకూ ముందు రాక్షసుల గురించి, కైకసి కి విశ్రవసునివలన కలిగిన సంతానం గురించి తెలుసుకున్నాం కదా!అలాగే ఒక తల్లి తన పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆమె అసూయను పిల్లల ముందు ప్రదర్శిస్తే, అది ఆ పిల్లల మనస్సు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం!

ఒకరోజు లంకాధిపతిగా ఉన్న వైశ్రవణుడు తన పుష్పక విమానంలో తన తండ్రి, విశ్రవసుని కలవటానికి వచ్చాడు. అతనిని అక్కడ అంత  వైభోగం లో చూసిన కైకసికి అసూయ కలిగింది. ఆమె తన పెద్దకుమారుడు అయిన దశకంఠుని వద్దకు వెళ్లి, అతనిని కూడా అతని సోదరుని వలే గొప్పవానిగా ఉంటె చుడాలీని ఉన్నది అని కోరుకున్నది. అంటే కాక అతను అనుభవిస్తున్న స్వర్ణలంక నిజమునకు తమదే అని చెప్పింది. ఆ మాటలు విన్న దశకంఠునికి, తన సవతి సోదరుని మీద విపరీతమయిన అసూయ, ద్వేషములు కలిగాయి.
అప్పటివరకూ అతనికి తన సవతి సోదరుని మీద అంత కోపం, ద్వేషం ఉన్నట్లు ఎవ్వరు ఎక్కడా చెప్పలేదు. పిల్లలకు తమ తల్లి మాట  మంత్రం లా పని చేస్తుంది. తన తల్లి అలా అతనిని, తన సవతి సోదరునితో పోల్చి మాట్లాడటం, అతను అనుభవిస్తున్న సౌకర్యములు నిజానికి అతనికే సంబందించినవి అని చెప్పి బాధపడటం అతని మనస్సును తీవ్రంగా ప్రభావితం చేసింది. అది అతనిలో కోపం, అసూయ, ద్వేషం మొదలయిన వికారములకు కారణం అయ్యింది.
 ఎలా అయినా తల్లి కోరికను తాను తీర్చుతాను అని చెప్పాడు. ఆమె కోరికలు అన్ని సిద్దించాలి అంటే కేవలం తపస్సు ఒక్కటే మార్గం అని తెలుసుకున్న అతను తన తమ్ముళ్లను కూడా తన వెంట తీసుకుని గోకర్ణము నకు వెళ్లి అక్కడ బ్రహ్మదేవుని గురించి ఘోరమయిన తపస్సు చేశారు.
మరి ఆ తపస్సు ఏమయ్యింది? వారు ఏమి వారములు కోరుకున్నారు అని తరువాతి టపాలో చెప్పుకుందాం!

14, జూన్ 2020, ఆదివారం

విశ్రవసుడు - కైకసి - సంతానం

మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది  అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది అని తెలుసుకున్నాం కదా!  తిరిగి లంకను రాక్షసులు ఎలా స్వాధీనం చేసుకున్నారు? అలా వారు స్వాధీనం చేసుకోవటానికి తోడ్పడిన సంఘటనల క్రమాన్ని కూడా తెలుసుకుందాం!
శ్రీ మహావిష్ణువు వలన కలిగిన భయంతో తమ పరివారాన్ని తీసుకుని పాతాళానికి వెళ్లిన సుమాలి అక్కడే కాలం గడపసాగారు. ఆప్పుడప్పుడు భూలోకమునకు వచ్చి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటూ ఉండేవాడు.  ఒక నాడు అతను అలా బయటకు వచ్చిన సందర్భంలో పుష్పక విమానంలో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వెళుతున్న వైశ్రవణుడు అతనికి కనిపించాడు. సుమాలి అతని ని చూసి కొంత అసూయ చెంది ఆటను ఎవరు, ఎలా ఆ ఐశ్వర్యమును పొందాడు అనే విషయములు తెలుసుకుని తిరిగి పాతాళమునకు వెళ్ళాడు.
సుమాలి కుమార్తెలలో ఒకరయిన కైకసి కి అప్పటివరకు వివాహం కాని కారణం వల్ల, ఆమెకు విశ్రవసుడు తగిన వరుడు అని తాను అభిప్రాయ పడుతున్నట్లుగా చెప్పాడు.  అంతేకాక ఆ సమయంలో వారు ఉన్న పరిస్థితులలో వారికి వైశ్రవణుని వంటి ఒక వారసుడు అవసరం కనుక విశ్రవసునితో కుమారులను కంటే, ఆ కుమారులు వారి రాక్షసజాతికి ఎంతో ఉపయోగపడతారు అని చెప్పాడు.
తండ్రి మాటలు విన్న కైకసి ఉన్నపళంగా విశ్రవసుని వద్దకు వెళ్ళింది. ఆమె రాకను గమనించిన విశ్రవసుడు ఆమె రాకకు కారణం అడిగాడు. ఆమె ఆ విషయమును తిన్నగా చెప్పకుండా, అతను సర్వము తెలిసినవాడు కనుక అతనినే దివ్యదృష్టితో కనుక్కోమని చెప్పింది. ఆటను ఆమె అక్కడకు రావటానికి గల కారణం తెలుసుకుని, ఆమె వచ్చిన సమయం సాయం సంధ్యా సమయం కనుక ఆమె  ప్రకారం కలిగే పిల్లలు రాక్షస ప్రవ్రుత్తి  కలవారు అవుతారు అని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించని కైకసి తనకి ఒక ధర్మాత్ముడయిన కుమారుని కూడా ప్రసాదించమని కోరుకున్నది.
అలా కైకసికి మొదటి సంతానం కలిగింది. నల్లగా, భయంకరంగా, పెద్ద కోరలతో, పది తలలతో జన్మించాడు. విశ్రవసుడు అతనికి దశకంఠుడు / దశగ్రీవుడు అని నామ కారణం చేసాడు.
రెండవవానిగా అత్యంత భారీకాయుడు జన్మించాడు. అతని చెవులే పెద్ద కుండలవలే కనిపించాయి. విశ్రవసుడు అతనికి కుంభకర్ణుడు అని పేరు పెట్టాడు.
మూడవసంతానం గా ఒక అమ్మాయి జన్మించింది. ఆమే శూర్పణఖ
నాల్గవవానిగా ధర్మాచరణ పరుడయిన విభీషణుడు జన్మించాడు. 

6, జూన్ 2020, శనివారం

రాక్షసులు లంకను వదలి ఎందుకు వెళ్లారు?

మనం ఇంతకు ముందు లంక ను స్వర్ణలంక అని ఎందుకు అంటారో తెలుసుకున్నాం కదా! ఆ లంక ముందుగా రాక్షసుల నివాసస్థలంగా ఉండి ఆ తరువాత అది వైశ్రవణునికి నివాసంగా ఉంది. అయితే వైశ్రవణుడు అక్కడికి చేరే సమయానికి లంక కాళీగా ఉంది. మరి అతనికంటే ముంది  ఉన్న ఆ రాక్షసులు లంకను వదిలి ఎక్కడకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు?
రాక్షస గణములు ప్రగటానికి కారణం మాల్యవంతుడు,మాలి, సుమాలి అని చెప్పుకున్నాం కదా!  వారి వరముల కారణంగా మాల్యవంతుడు, మాలి, సుమాలి సోదరులు గర్వం పెరిగి,   సర్వ లోకములను వేధించటం మొదలుపెట్టారు. దేవతలు దిక్కులేనివారు అయ్యారు. దేవతలు కైలాసమునకు వెళ్లి శివునకు మొరపెట్టుకున్నారు. కానీ పరమేశ్వరుడు సుకేశుని మీది జాలి, ప్రేమ కారణంగా  కుమారులను సంహరించటానికి సుముఖం  కాలేక విష్ణుమూర్తి వద్దకు వెళ్ళమని చెప్పాడు.
వారి మొరలు  విష్ణువు దేవతలకు అభయం ఇచ్చాడు. ఆ విషయం ఆ ముగ్గురు అన్నదమ్ములకు చారుల  ద్వారా తెలిసింది. అప్పుడు పెద్దవాడయిన మాల్యవంతుడు విష్ణువు ఇంతకు ముందు కూడా రాక్షసులను చంపి ఉన్నాడు కనుక ఏమి చెయ్యాలి అని తన తమ్ముళ్లను అడిగాడు. దానికి ఆ తమ్ముళ్లు విష్ణువు అలా  మనలను చంపుతాను అని చెప్పుటకు కారణం ఆ దేవతలు కనుక ముందుగా ఆ దేవతలను నాశనం చేయాలి అని చెప్పారు. ఆ మాటలను అంగీకరించిన మాల్యవంతుడు వెంటనే దేవతల మీద యుద్ధం ప్రకటించారు.
అనేక రాక్షస సైన్యమును వెంటపెట్టుకుని వీరు స్వర్గం మీద దాడి చేశారు. రాక్షసులు దండెత్తి వస్తున్నారని తెలిసిన దేవతలు పారిపోయారు. ఈ విషయాలు అన్ని తెలుసుకున్న విష్ణువు తన వాహనం గరుడుని పై,సకల ఆయుధాలను ధరించి బయలుదేరాడు. యుద్ధభుమిని చేరే సమయానికి, గరుడుని రెక్కల వేగానికి ఆ యుద్ధభూమీలోని రాక్షసులు ఎగిరిపోయారు, వారి ఆయుధాలు చెల్లాచెదురు అయిపోయాయి. ఎగిరిపోగా మిగిలిన రాక్షసులు విష్ణువు మీద యుద్ధం చేయనారంభించారు. వారు ప్రయోగించిన అన్ని బాణములు విషుమూర్తి దేహంలో కలిసిపోతున్నాయి. విష్ణుమూర్తి కూడా వారిపై బాణముల వర్షం కురిపిస్తున్నాడు.
ఆ బాణ వర్షమునకు ఎందరో రాక్షసులు నేలకూలారు. కొందరు పారిపోయారు. ఆ విజయమునకు సూచనగా విష్ణువు తన పాంచజన్యమును పూరించాడు.  ఆ పాంచజన్య శబ్దమునకు రాక్షసుల వాహనములకు కట్టిన జంతువులు పారిపోయాయి. అలా వారి యుద్ధం ఓడిపోతున్న ఉక్రోషంతో సుమాలి తిన్నగా వెళ్లి విష్ణువుతో తలపడ్డాడు.  అలా మళ్ళీ కొందరు రాక్షసులు విష్ణువు చుట్టూ చేరి యుద్ధం చేయసాగారు. అప్పుడు విష్ణువు ఒక బాణంతో సుమాలి సారధిని సంహరించాడు. అప్పుడు అతని రధమును ఆ గుఱ్ఱములు దూరంగా లాక్కుని వెళ్లిపోయాయి. అప్పుడు మాలి యుద్దానికి వచ్చాడు. మాలి భయంకరంగా యుద్ధం చేసాడు. అయితే అతని బాణములు ఏవి విష్ణువును భాధించలేదు. అప్పుడు మాలి తన గధతో గరుడుని ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బను తట్టుకోలేక గరుడుడు అకస్మాతుగా కదిలాడు. గరుడుని ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత విష్ణుమూర్తి ఆ మాలిని సంహరించటం కోసం సుదర్శనమును ప్రయోగించాడు. ఆ సుదర్శనం మాలి కంఠమును నరికి వేసింది. ఆ దృశ్యమును చుసిన రాక్షసులు భయపడి పారిపోయారు.
అలా పారిపోతున్న రాక్షసులను విష్ణువు గరుడుని మీద వెంబడించాడు. అలా వెంబడిస్తున్న విష్ణువును మాల్యవంతుడు ఎదిరించాడు. అల ఎదిరించిన మాల్యవంతుడిని గరుడుడు తన రెక్కలతో కొట్టాడు. ఆ దెబ్బకు మాల్యవంతుడు దూరంగా ఎగిరిపోయాడు. అలా మాల్యవంతుడు ఎగిరిపోవటం చూసిన సుమాలి అతని సైన్యమును తీసుకుని, లంకకు వెళ్లి , అక్కడ వారి కుటుంబాలను కూడా తీసుకుని పాతాళమునకు వెళ్లి దాక్కున్నారు. మాలి చనిపోవటం, మాల్యవంతుడు దూరంగా ఎగిరి పోవటంతో రాక్షసులకు సుమాలి రాజుగా , రాక్షస రాజ్యమును స్థాపించి పరిపాలించాడు.
అలా ఖాళీ అయినా లంకను తనకు నివాస యోగ్యంగా మార్చుకొమ్మని విశ్రవసుడు  తన కుమారుడు వైశ్రవణునికి చెప్పాడు. 

4, జూన్ 2020, గురువారం

రాక్షస వంశాభివృద్ధి

మనం ఇంతకు ముందు రాక్షసుల జన్మ గురించి తెలుసుకున్నాం కదా! ఆ వంశంలో జన్మించిన మాల్యవంతుడు, మాలి, సుమాలి గురించి కూడా తెలుసుకున్నాం! ఇప్పుడు వారి సంతానం గురించి తెలుసుకుందాం!

మాల్యవంతుడు :

  1. వజ్రముష్టి 
  2. విరుపాక్షుడు 
  3. దుర్ముఖుడు 
  4. సుప్తఘ్నుడు 
  5. యజ్ఞకోపుడు
  6.  మత్తుడు 
  7. ఉన్మత్తుడు
  • కుమార్తెలు 
  1. అనల 
సుమాలి : కుమారులు

  1. ప్రహస్తుడు 
  2. అకంపనుడు 
  3. వికటుడు 
  4. కాలికాముఖుడు 
  5. ధూమ్రాక్షుడు 
  6. దండుడు 
  7. సుపార్శ్వుడు 
  8. సంహాద్రి 
  9. ప్రఘనుడు 
  10. భాసకర్ణుడు

కుమార్తెలు :

  1. రాక 
  2. పుష్పోత్కట 
  3. కైకసి 
  4. కుంభీనస 


మాలి : కుమారులు

  1. అనలుడు 
  2. అనిలుడు 
  3. హరుడు 
  4. సంనాతి 
  5. విభీషణుడు  


 

2, జూన్ 2020, మంగళవారం

రాక్షస సంతాన వృద్ధి

ఇంతకుముందు మనం రాక్షసులకు పిల్లలు ఎలా వెంటనే కలుగుతారు,  వారు ఎందుకు తమ తల్లి వయస్సు కలవారు అవుతారు అని తెలుసుకున్నాం కదా!
పార్వతీదేవి, శివుని కరుణా కటాక్షామముల వల్ల పెరిగి పెద్దవాడయిన సుకేశునికి గ్రామణి అనే గంధర్వుడు తన కుమార్తె దేవవతిని ఇచ్చి వివాహం జరిపించాడు.  వారికి మాల్యవంతుడు, మాలి, సుమాలి అనే ముగ్గురు కుమారులు కలిగారు. వీరు ముగ్గురూ మేరుపర్వతం వద్ద బ్రహ్మగురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు వారిని వరములు కోరుకొమ్మన్నాడు. 
వారికి అత్యంత బలం కావాలని, వారి మధ్య ఎన్నటికీ విరోధం కలుగకుండా ఉండాలని కోరుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి ఆ వరములు ఇచ్చారు. తరువాత వారు విశ్వకర్మదగ్గరకు వెళ్లి తమకు నివాసయోగ్యమయిన స్థలమును చూపించమని అడిగారు. దానికి విశ్వకర్మ స్వర్ణలంక ని తమ నివాసంగా చేసుకోమని చెప్పాడు.   
తరువాత వారు ఒక గందర్వ కాంత నర్మద యొక్క ముగ్గురు కుమార్తెలు సుందరి, కేతుమతి, వసుధలను వివాహం చేసుకున్నారు.   వారికి అనేకమంది సంతానం కలిగారు. వీరి వలననే రాక్షస సంతానం వృద్ధి చెందింది. 
రావణాసురుని తల్లి అయిన కైకసి, సుమాలి పుత్రిక. 

31, మే 2020, ఆదివారం

రాక్షస స్త్రీలు - పిల్లలు - పార్వతీదేవి

మన పురాణములలో రాక్షస స్త్రీలు గర్భం ధరిస్తే, పుట్టిన పిల్లలు వెంటనే ప్-పెద్దవారు అవుతారు   అంతే కాక ఆ పిల్లలు తమ తల్లికి సమానమయిన వయస్సు కలిగిన వారు అవుతారు. మరి ఇంతకీ ఇది ఎలా సాధ్యం? దానికి కారణం ఏమిటి?
దీనికి సమాధానం మనకు రామాయణంలో ఉత్తరకాండలో చెప్పారు. 
బ్రహ్మ తాను సృష్టి మొదలుపెట్టిన సమయంలో మొట్ట మొదటగా ఉన్న జలంలో కొన్ని ప్రాణులను సృష్టించాడు. ఆలా పుట్టిన వారు బ్రహ్మను ఏమి చెయ్యాలి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ వారిని ఆ జలమును రక్షించమని చెప్పాడు. వారిలో కొందరు "రక్షామ" అని కొందరు "యక్షామ" అని అన్నారు. రక్షామ అన్నవారిని రాక్షసులు అని, యక్షామ అన్నవారిని యక్షులు అని పేరుపెట్టారు. 

రాక్షసులకు  హేతి, ప్రహేతి అనే ఇద్దరు నాయకులు ఉన్నారు. వారిలో ప్రహేతి పరం ధర్మాత్ముడు. అతను  గృహస్థధర్మమును స్వీకరించటానికి యముకుని చెల్లి అయిన భయ ను వివాహం చేసుకున్నాడు. వీరికి విద్యుత్కేశుడు అనే కుమారుడు కలిగాడు. 
ఆ విద్యుత్కేశునికి యుక్త వయస్సు రాగానే అతనికి సంధ్యపుత్రికని ఇచ్చి వివాహం చేశారు. ఆమె కొంతకాలమునకు గర్భం ధరించింది. అయితే గర్భంధరించి ఉన్న ఆమె తన భర్తతో కొంతకాలం సుఖంగా గడపాలి అని కోరుకున్నది. ఆలా జరగటానికి అడ్డంగా ఉన్న నెలలు నిండని గర్భమును స్రావం చేసుకుని అక్కడి నుండి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది. 
అయితే బయటకు వచ్చిన నవజాత శిశువు ఏడుపు మొదలు పెట్టాడు. అదే సమయమునకు అటువైపుగా వెళుతున్న పార్వతీ పరమేశ్వరులు ఆ బిడ్డను చూసి, జాలి పడ్డారు. వారి జాలి చూపులు సోకిన ఆ బిడ్డ అప్పటికి అప్పుడే యుక్తవయస్కుడు అయ్యాడు. 
అప్పుడు పార్వతీదేవి రాక్షస స్త్రీలకు ఒక వరం ఇచ్చింది. ఆ వరం ప్రకారం రాక్షస స్త్రీలు గర్బంధరించిన వెంటనే ప్రసవిస్తారు, ప్రసవించిన బిడ్డలు కూడా వెంటనే పెద్దవారు, తమ తల్లి వయస్సు కలిగినవారు అవుతారు. 
అక్కడ ఉన్న శిశువు మీద ఆప్యాయత తో శివుడు అతను  సుఖంగా నివసించటానికి వీలుగా ఒక గాలిలో ప్రయాణించే నగరమును నిర్మించి ఇచ్చాడు. ఆ రాక్షసుని పేరు సుకేశుడు

30, మే 2020, శనివారం

వైశ్రవణుడు - దిక్పాలకత్వం

మనం ఇంతకు ముందు నవబ్రహ్మ లలో ఒకరయిన పులస్త్యుడు - విశ్రవసుడు , విశ్రవసునికి భరద్వాజుని కుమార్తెయందు కలిగిన వైశ్రవణుని జననం గురించి తెలుసుకున్నాం కదా!
 ఇప్పుడు అతనికి దిక్పాలత్వం, ధనాధిపత్యం ఎలా సంక్రమించింది,  లంక కు అధిపతి ఎలా అయ్యాడు అని తెలుసుకుందాం!

వైశ్రవణునికి తండ్రి విశ్రవసునివలెనే ధర్మాచరణ పరాయణుడు. అతను అనేక సంవత్సరములు 
తపస్సు చేసాడు. వెయ్యి సంవత్సరములు తపస్సు చేసిన తరువాత అతను కేవలం గాలిని మాత్రమే పేల్చి తపస్సు చేసాడు. ఆ ఘోరమయిన తపస్సుని చూసి దేవతలు ఆశ్చర్యపోయిఅందరూ బ్రహ్మదేవునిలో కలసి అతనికి దర్శనం ఇచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనిని వరం కోరుకోమని అడుగగా, అతను దిక్పాలత్వమును, ముల్లోకముల లోని ధనము పైన ఆధిపత్యము కావలి అన్ని కోరుకున్నాడు. అప్పటివరకు కేవలం ముగ్గురు దిక్పాలకులు ఉన్నారు. ఇంద్ర, వరుణ మరియు యముడు. అప్పుడు బ్రహ్మ అతనిని ఉత్తర దిక్కునకు అధిపతిని చేసాడు. అంతే కాక అతనికి ధనాధిపత్యం కూడా ఇచ్చారు. వానితో పాటు ఆటను అన్ని లోకములు తిరుగుటకు వీలుగా అద్భుతమయిన ఒక విమానము కూడా ఇచ్చారు. ఆ విమానం పేరే పుష్పక విమానం! దీని ప్రత్యేకత ఎంతమంది ఎక్కినా ఇంకా కొందరు ఎక్కటానికి చోటు ఉంటుంది. 

ఆ వరములను పొందినతరువాత  వైశ్రవణుడు తన తండ్రి దగ్గరకు వెళ్లి తాను పొందిన వరములా గురించి చెప్పి, తాను ఉండుటకు వీలుగా ఒక ప్రదేశం చూపించమని అడిగాడు. అప్పుడు విశ్రవసుడు ఆ సమయమునకు కాళీ గా ఉన్నస్వర్ణ  లంకా నగరమును తనకు నివాసంగా మార్చుకోమని చెప్పాడు. 
అప్పటి నుండి వైశ్రవణుడు లంకను తన నగరంగా మార్చుకుని అక్కడ నివాసం ఉన్నాడు.