16, అక్టోబర్ 2020, శుక్రవారం

పంచ భూతములు - States of matter

హైందవ సంప్రదాయ ప్రకారం ఈ సకల సృష్టి పంచభూతములనుండి ఉద్భవించింది. ఈ సృష్టి లో  ఏ పదార్ధం తీసుకున్న అది ఈ పంచభూతముల అనుసంధానమే అయ్యి ఉంటుంది. ఆ పంచభూతములుగా వారు చెప్పినవి 

 1. ఆకాశం 

2. వాయువు 

3. అగ్ని 

4. జలం

5. భూమి  

ఈ నాటి శాస్త్రవేత్తలు మొత్తం మీద ఉన్న పదార్ధములను వాని భౌతిక ధర్మాలను అనుసరించి ముఖ్యంగా మూడు రకాలుగానూ, విపులంగా సిచూసినప్పులేదు ఐదు రకాలుగాను చెప్పారు. వారి ప్రకారం ఏ పదార్ధమయిన ఈ ఐదు రకములలో ఒకటిగా  లేక, వాని మిశ్రమంగా  ఉంటుంది. అవి 

1. ఘనములు 

2. ద్రవములు 

3. వాయువులు 

4. ప్లాస్మా 

5. బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్ 

ఇప్పుడు మనం పైన చెప్పుకున్న రెండు రకముల ను పోల్చి చూద్దాం!

1. ఘనములు - భూమి :  ఘనం-భూమి ఒకే లక్షణములు కలిగి ఉంటాయి. ఈ రెడింటికి నిర్దిష్టమయిన ఆకారం, ఘనపరిమాణం ఉంటాయి. వాని అణువు లు చాలా దగ్గరగా ఉంటాయి. 

2. ద్రవములు - జలం: ఈ రెండు నిర్దిష్టమయిన ఘనపరిమాణం కలిగి ఉంటాయి కానీ నిర్దిష్టమయిన ఆకారం కలిగి ఉండవు. వాని అణువులు ఘనముల అణువులతో పోల్చిచూసినప్పుడు దూరంగాను, వాయువుల అణువులతో పోల్చి చూసినప్పుడు దగ్గరగాను ఉంటాయి. 

3. వాయువులు - వాయువు : వీనికి నిర్దిష్టమయిన ఆకారం కానీ ఘనపరిమాణం కానీ ఉండవు. వీని అణువులు ఒకదానికి ఒకటి దూరంగా ఉంటాయి. 

4. ప్లాస్మా - అగ్ని : సూర్యునిలో ఉండే మండి పోయే వాయువులను ప్లాస్మా గా గుర్తించ వచ్చు. అవి నిరంతరం శక్తిని, కాంతిని విలువరిస్తూ ఉంటాయి. వీనికి అత్యంత శక్తి ఉంటుంది. నిరంతరం చలిస్తూనే ఉంటాయి.అందుకే దీనిని మనం అగ్నితో పోల్చ వచ్చు. 

5. ఆకాశం - బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్ : గాలికంటే లక్ష రెట్లు  తేలికయిన పదార్ధాన్ని బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్  అంటారు. అంటే ఆ పరిస్థితిలో ఉన్న ఏ పదార్ధమయిన దానికి ఉండవలసిన  పరిమాణం కంటే చాలా తక్కువ పరిమాణమును కలిగి ఉంటుంది కనుక దీనిని మనం  ఆకాశం తో పోల్చవచ్చు. ఇవి అత్యంత తక్కువ శక్తిని కలిగి ఉంటాయి.  

కాబట్టి ఈ కాలంలో  మనం చెప్పుకుంటున్న అనేక విషయాముల గురించి మనకంటే ఎన్నో వేల  సంవత్సరముల ముందే మన ఋషులు అత్యంత సహజంగా సామాన్య మానవునకు అర్ధమయ్యే భాషలో చెప్పారు. 

21, ఆగస్టు 2020, శుక్రవారం

గణేషునికి ఒక చిన్న ఎలుక ఎలా వాహనం అయ్యింది?

మనం ఇంతకుముందు వినాయకుని గురించి చాలా విషయములు చెప్పుకున్నాం. అయితే అలా చెప్పుకున్నప్పుడు వినాయకుని వాహనం మూషికం అని చెప్పుకున్నాం!
వినాయకుని ఆహార్యం గురించి మనకు  తెలుసు. అటువంటి భారీకాయునికి ఒక చిన్న చిట్టి ఎలుక వాహనం ఎలా అయ్యింది? అని తెలుసుకోవటానికి ఒక చిన్న కధ ఉంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఒకానొక సమయంలో పరాశర మహర్షి ఆశ్రమంలోకి ఒక పెద్దదయిన ఎలుక వచ్చింది. అలా వచ్చిన ఆ ఎలుక ఆ ఆశ్రమంలో ఉన్న అందరిని ఇబ్బంది పెట్టసాగింది. ఆశ్రమంలోని సకల వస్తువులను పాడు చేయసాగింది.  మొక్కలను, వాటి పాదులను పాడు చేసింది. చివరకు మహర్షుల వస్త్రములను కూడా కొరికేయటం మొదలుపెట్టింది. వారు ఆశ్రమవాసులు అవ్వటంవలన వారు జీవ హింస చేయరు. కానీ ఆ ఎలుకను ఎలా వదిలించుకోవాలో వారికీ తెలియలేదు.
ఆ సమయంలో పరాశర మహర్షి శ్రీ మహాగణపతి  ని తమకు  సహాయం చేయమని కోరారు.వారి భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీ మహాగణపతి వారిని ఇబ్బంది పెడుతున్న ఆ భయంకరమైన ఎలుకను పట్టుకోవడానికి తమ చేతిలో ఉన్న పాశమును  విసిరారు. ఆ పాశము ఆ మూషికము యొక్క వెనుక తరిమి తరిమి పాతాళ లోకం వరకు వెళ్ళి మూషికమును బంధించి, దానిని తీసుకుని గణేషుని వద్దకు చేరింది. 
 అలా గణేషుని దగ్గరకు చేరిన మూషికం శ్రీ  గణేశుని స్తుతించటం ప్రారంభించింది. అప్పుడు గణేశుడు ఆ మూషికం పరాశరమహర్షిని, అతని ఆశ్రమవాసులను విసిగించినా ఇప్పుడు అతని శరణు కోరినది కనుక వరము కోరుకొమ్మన్నాడు.  గణేశుని ఆ మాటలు విన్న మూషికము భక్తిశ్రద్ధలతో, కొంత అహంభావంతో తనకు ఏ విధమైన వరమూ అవసరం లేదు అని అతనికి ఏమయినా వరం కావాలంటే కోరుకొమ్మని చెప్పినది. అలా గణేషునితో చెప్పిన మూషికమును తనకు వాహనంగా ఉండమని గణేశుడు అడిగాడు. తన అహంకారము తో ఆ మూషికం గణేశునికి వాహనంగా ఉండటానికి అంగీకరించింది. అయితే గణేశుడు ఒక్కసారి తనమీద కూర్చోగానే, దానికి తాను చేసిన తప్పు తెలిసిరాలేదు. అప్పుడు పశ్చాత్తాపం పొంది తిరిగి గణేశుని ప్రార్ధించింది. తనకి గణేశుని భారం వహించే శక్తిని ఇవ్వమని కోరుకున్నది. అప్పుడు గణేశుడు ఆ మూషికమునకు ఆ శక్తిని ఇచ్చాడు. అప్పటి నుండి అతను మూషిక వాహనుడు అయ్యాడు.
మన హిందూ ధర్మం లో ఉండే ప్రతీకాత్మకతను మనం గణేశుని ఆహార్యం లో చక్కగా చూడ వచ్చు. ఆ ప్రతీకాత్మకత తెలుసుకోవటం కోసం ఇక్కడ నొక్కండి.



1, జులై 2020, బుధవారం

కైకసి - కుమారులు పొందిన వరములు

దశకంఠునిలో అసూయ కలగటానికి తన తల్లి కైకసి ఎలా కారణం అయ్యిందో మనం ఇంతకు ముందు టపాలో తెలుసుకున్నాం కదా! అసూయతో రగిలిపోతున్న దశకంఠుడు తపస్సుకు బయలుదేరాడు. అతనితో పాటుగా అతని తమ్ములనుకూడా తీసుకుని వెళ్ళాడు. ఇంతకు ముందు టపాలలో అతని సోదరుల గురించి తెలుసుకున్నాం కదా! వారిలో పెద్దవాడు, అత్యంత భారీకాయుడు అయిన కుంభకర్ణుడు పుట్టిన సమయం నుండి కూడా నర భక్షకుడుగా ఉన్నాడు. సకల జనులను కష్టపెడుతూ ఉన్నాడు, అంతే కాక అతనికి రాక్షసత్వం వల్ల కలిగిన శక్తుల వలన అన్ని లోకములకు తిరుగుతూ అందరిని ఏడిపిస్తూ ఉండేవాడు.
చిన్నవాడు అయిన విభీషణుడు అత్యంత సౌమ్యుడు, బ్రాహ్మణత్వం,ధర్మజ్ఞత మరియు ఇంద్రియ నిగ్రహం  కలిగి ఉండేవాడు.
అలంటి తన తమ్ములతోబ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తున్న దశకంఠుడు తన ఒకొక్క తల నరుక్కుని బ్రహ్మదేవునికి హోమంలో అగ్నికి అర్పించసాగాడు. అలా తన తొమ్మిది తలలు అర్పించిన తరువాత కూడా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాకపోవటంతో, తన పదవ తలను కూడా నరుకుకొనుటకు సిద్ధపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యి అతనిని వరములు కోరుకొమ్మని చెప్పాడు.
అప్పుడు దశకంఠుడు మరణం లేని వరం కోరుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు అలాంటి వరం ఇవ్వటం కుదరదు అని చెప్పాక, అప్పుడు నాగ, యక్ష, కిన్నెర, దానవ, రాక్షస,దైత్య, దేవతల వలన తనకు మరణం రాకుండునట్లు కోరుకున్నాడు.అంతే కాకుండా తనకు మానవులు అంటే అస్సలు భయం లేదు కనుక వారి గురించి అడగవలసిన అవసరం లేదు అని చెప్పాడు.  బ్రహ్మదేవుడు తధాస్తు అని చెప్పాడు. అంతేకాక అప్పటివరకు దశకంఠుడు అర్పించిన అతని తొమ్మిది తలలను కూడా తిరిగి వచ్చేవిధంగా వరం ఇచ్చాడు. అవే కాకుండా అతనికి కామరూప విద్యను కూడా ప్రసాదించాడు.
బ్రహ్మదేవుడు అప్పుడు విభీషణుని వరం కోరుకొమ్మని చెప్పారు. అప్పుడు సాత్విక స్వభావం కలిగిన విభీషణుడు ఎళ్లవేళలా అతని మనస్సు ధర్మం తప్పకుండ ఉండేటట్లుగా వరం ఇవ్వమని కోరుకున్నాడు. అతని ధర్మ నిరతికి సంతోషించిన బ్రహ్మ దేవుడు అతనికి చిరంజీవిగా ఉండమని వరం ఇచ్చాడు.
తరువాత వరం కోరుకునే అవకాశం కుంభకర్ణునికి వచ్చింది.
అయితే అతని ఉదృతిని అప్పటికే దేవతలు చూసి ఉండుట వలన అతను అడిగే వరములు ఏవయినా వారిని బాధిస్తాయి కనుక, అతను ఎల్లప్పుడూ నిద్రావస్థలో ఉండేలా వరం కోరుకుంటే అన్ని లోకములకు మంచిది కనుక అలా అతనిని పలికించమని దేవతలు సరస్వతిని వేడుకున్నారు. వారి కోరికను మన్నించిన సరస్వతి వెళ్లి కుంభకర్ణుని నాలుక పై కూర్చున్నది. అతనితో కావలసిన తిండి తిని నిద్రావస్థను ప్రసాదించమని పలికించింది. బ్రహ్మదేవుడు తధాస్తు అని పలికి తన లోకమునకు వెళ్ళిపోయాడు. అతనితో సరస్వతి కూడా వెళ్ళిపోయింది.  అప్పుడు జరిగిన దానిని గురించి ఆలోచించిన కుంభకర్ణుడు ఇకమీదట చేసేది ఏమి లేదు అని తెలుసుకుని ఆ వరముతోనే ఉండిపోయాడు. 

29, జూన్ 2020, సోమవారం

దశకంఠుడు నిజంగా అంత చెడ్డవాడా?

మనం ఇంతకూ ముందు రాక్షసుల గురించి, కైకసి కి విశ్రవసునివలన కలిగిన సంతానం గురించి తెలుసుకున్నాం కదా!అలాగే ఒక తల్లి తన పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆమె అసూయను పిల్లల ముందు ప్రదర్శిస్తే, అది ఆ పిల్లల మనస్సు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం!

ఒకరోజు లంకాధిపతిగా ఉన్న వైశ్రవణుడు తన పుష్పక విమానంలో తన తండ్రి, విశ్రవసుని కలవటానికి వచ్చాడు. అతనిని అక్కడ అంత  వైభోగం లో చూసిన కైకసికి అసూయ కలిగింది. ఆమె తన పెద్దకుమారుడు అయిన దశకంఠుని వద్దకు వెళ్లి, అతనిని కూడా అతని సోదరుని వలే గొప్పవానిగా ఉంటె చుడాలీని ఉన్నది అని కోరుకున్నది. అంటే కాక అతను అనుభవిస్తున్న స్వర్ణలంక నిజమునకు తమదే అని చెప్పింది. ఆ మాటలు విన్న దశకంఠునికి, తన సవతి సోదరుని మీద విపరీతమయిన అసూయ, ద్వేషములు కలిగాయి.
అప్పటివరకూ అతనికి తన సవతి సోదరుని మీద అంత కోపం, ద్వేషం ఉన్నట్లు ఎవ్వరు ఎక్కడా చెప్పలేదు. పిల్లలకు తమ తల్లి మాట  మంత్రం లా పని చేస్తుంది. తన తల్లి అలా అతనిని, తన సవతి సోదరునితో పోల్చి మాట్లాడటం, అతను అనుభవిస్తున్న సౌకర్యములు నిజానికి అతనికే సంబందించినవి అని చెప్పి బాధపడటం అతని మనస్సును తీవ్రంగా ప్రభావితం చేసింది. అది అతనిలో కోపం, అసూయ, ద్వేషం మొదలయిన వికారములకు కారణం అయ్యింది.
 ఎలా అయినా తల్లి కోరికను తాను తీర్చుతాను అని చెప్పాడు. ఆమె కోరికలు అన్ని సిద్దించాలి అంటే కేవలం తపస్సు ఒక్కటే మార్గం అని తెలుసుకున్న అతను తన తమ్ముళ్లను కూడా తన వెంట తీసుకుని గోకర్ణము నకు వెళ్లి అక్కడ బ్రహ్మదేవుని గురించి ఘోరమయిన తపస్సు చేశారు.
మరి ఆ తపస్సు ఏమయ్యింది? వారు ఏమి వారములు కోరుకున్నారు అని తరువాతి టపాలో చెప్పుకుందాం!

28, జూన్ 2020, ఆదివారం

శరీరమును వదిలిన పితృదేవతలకోసం మనమెందుకు పిండ దానమును చేయాలి?

మనం ఇంతకు ముందు పితృదేవతల గురించి చెప్పుకున్నాం కదా! వారిలో మూర్త గణములు, అమూర్తగణముల గురించి కూడా చెప్పుకున్నాం! వారికి అమావాస్యతిధికి గల సంబంధం గురించి కూడా చెప్పుకున్నాం!!
మరి ఇంతకీ మానవులుగా జన్మించిన మనం పితృ కార్యములు ఎందుకు చెయ్యాలి? శరీరమును వదిలి వెళ్లినవారు మనం చేసే పిండ దానమును ఎలా స్వీకరిస్తారు?
ఈ ప్రశ్నను కరంధముడు స్వయంగా మహాకాళుని అడిగాడు. ఆ సంఘటన గురించి స్కందపురాణంలో చెప్పారు.
ఆ ప్రశ్నకు సమాధానంగా మహాకాళుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
భౌతిక దేహమును వదలి, పితృగణములుగా మారినవారు, మనం నివేదించే పిండములు, తర్పణములు మొదలగు వానిని తిన్నగా తీసుకోక పోయినా వానిలోని సారమును గ్రహించగలరు.
వారికి సమయం , దూరము మొదలగు ప్రతిబంధకములు ఉండవు. 
తరువాత కరందముడు మహాకాళుని మరొక ప్రశ్న అడిగాడు.
ప్రశ్న: శరీరమును వదలి ఒక ఆత్మ వెళుతున్నప్పుడు అది కర్మలతో కట్టబడి ఉంటుంది కదా! మరి అలా బంధించి ఉన్నవారు కూడా మనకు దీవెనలు ఎలా ఇస్తారు? వారిని తృప్తి పరిస్తే మనకు కలిగే లాభం ఏమిటి?
మహాకాళుని సమాధానం: శరీరమును వదలిన పితరులు అందరూ వారి కర్మలకు బందీలుగా ఉండరు.
దేవతలు, అసురులు, మరియు యక్షులకు సంబందించిన పితరులు అమూర్త పితరులు. అలాగే భూమిమీద ఉన్న ప్రజలకు సంబందించిన పితరులు మూర్తపితరులు. ఈ ఏడూ రకముల పితరులను శాశ్వత పితరులుగా పరిగణిస్తాం.  అటువంటి గణములు కర్మ సిద్ధాంతములను కూడా అధిగమించి ఉంటాయి. ఈ ఏడు పితృగణములకు లోబడి  31 గణములు ఉంటాయి. మానవులుగా మనం అర్పించే పిండములు, తర్పణములు ఆ ఏడు శాశ్వతమయిన పితరులకు చెందుతాయి. మనకు ఆశీర్వాదములను ఇచ్చేది ఆ ఏడు పితృ గణములే. 

27, జూన్ 2020, శనివారం

మంధర - పూర్వజన్మ

ఒకానొక కాలంలో విరోచనుడు అనే పేరు కల్గిన ఒక రాక్షసుడు ఉండేవాడు. అవ్వటానికి రాక్షసుడు అయినా బ్రాహ్మణత్వం పొంది, సకల సుకర్మలు చేస్తూ రాజుగా ఉన్నాడు. రాజుగా  దేవతలపై దండెత్తి వారిని ఓడించి దేవలోకమును స్వాధీన పరచుకున్నాడు. దేవలోకంనుండి పారిపోయిన దేవతలు వారి గురువు బృహస్పతి వద్దకు వెళ్లారు. వారి పరిస్థితిని తెలుసుకున్న బృహస్పతి, ఆ ఆపదకు నివారణ  ఉపాయం కేవలం అతనికి గల దానగుణమును ఉపయోగించుకొనుట మాత్రమే అని చెప్పాడు.
అతని మాటలు విన్న దేవతలు వెంటనే బ్రాహ్మణరూపములు ధరించి విరోచనుని వద్దకు వెళ్లారు. ఆలా తనవద్దకు వచ్చినవారు దేవతలు అని తెలిసి కూడా విరోచనుడు వారికి అతిధి సత్కారములు చేసి, ఏమి కావాలో కోరుకొమ్మని చెప్పాడు. అప్పుడు వారు విరోచనుని దేహమును ఇవ్వమని కోరారు. ఇంటికి వచ్చి అర్ధించిన అతిధులకు ఇవ్వటానికి పనికి రాకపోతే, అటువంటి శరీరం ఉన్న లేకపోయినా ఒకటే అని చెప్పి అతని శరీరమును వారికి ఇచ్చివేసాడు.
అప్పుడు రాక్షసులు ఆనాధలు అవ్వటం వలన  కోలాహలం చెలరేగింది. ఆ కోలాహలమునకు విరోచనుని కుమార్తె బయటకు వచ్చింది. ఆమె అనేక రాక్షస కృత్యములలో ఆరితేరినది. అనేక క్షుద్రవిద్యలు తెలిసినది అవ్వటం వలన వారికి దైర్యం చెబుతూ, అన్యాయంగా తన తండ్రిని మోసగించిన దేవతల పై తాను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి రాక్షసులను తన అధికారంలోనికి తెచ్చుకున్నది. అలా ఆమె అధీనంలో ఉన్న రాక్షసులు తిరిగి దేవలోకంపై దండెత్తారు. కానీ వారు మరలా దేవతల చేతిలో ఓటమి పొందుతున్న సమయంలో, కొందరు రాక్షసులు విరోచనుని కుమార్తె వద్దకు వచ్చి యుద్ధం లో వారు ఓడిపోతున్న విషయం చెప్పగా, ఆమె స్వయంగా దేవలోకమునకు వెళ్లి నేరుగా దేవతలతో తలపడింది. తన విద్యలతో దేవతలను, వారి వాహనములు బందించింది.
అలా బంధించబడిన దేవతలు శ్రీమహావిష్ణువు ను శరణు వేడుకున్నారు. ఆర్త త్రాణపరాయణుడు అయిన ఆ శ్రీ మహా విష్ణువు ఉన్నపళంగా అక్కడకు వచ్చి, దేవతలను బంధముల నుండి విడిపించి, ఆ విరోచనుని కుమార్తెను చంపటానికి ఇంద్రుడిని ప్రేరేపించాడు. అప్పుడు ఇంద్రుడు ఆమె పై వజ్రాయుధమును ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం తగిలిన ఆమె అలా కిందకు భూలోకమునకు పడిపోతూ, తనకు అటువంటి గతి పట్టటానికి కారణం ఇంద్రుడే అయినా , ఇంద్రుడు అలా ప్రవర్తించటానికి కారణం శ్రీమహావిష్ణువు కాబట్టి, తాను ఎలాగయినా విష్ణువునకు అపకారం చేయాలి అని తన మనస్సులోనే శపధం చేసుకుంది. ఆమె శరీరం భూమిపై పడినప్పుడు మూడు వంకరలుతిరిగింది. పెద్దగా అరుస్తూ ఆమె ప్రాణములు వదిలింది. అలా చివరి క్షణంలో ఆమె విష్ణువు నకు అపకారం చేయాలి అని అనుకున్నది కనుక ఆమె మరు జన్మలో, మానవ కాంతగా, గూని దానిగా జన్మించి, ఎంతో సంతోషంగా శ్రీరాముని పట్టాభిషేకమునకు సిద్ధపడుతున్న అయోధ్యను ఆశ్చర్యకరంగా బాధపెట్టిన మంధరగా జన్మించి, తన పూర్వజన్మ పంతమును నెరవేర్చుకున్నది.  

26, జూన్ 2020, శుక్రవారం

వైశ్రవణునికి కుబేరుడు అనే పేరు ఎందుకు వచ్చింది?

మనం ఇంతకు ముందు గుణనిధి గురించి, అతను దొంగగా మారుట,  అతనికి శివలోకం లభించిన విధానం, తరువాత అతను దమనుడు అనే రాజుగా జన్మించి జన రంజకంగా పరిపాలించిన సంగతి తెలుసుకున్నాం కదా!
మరి అంత జనరంజకంగా పరిపాలించిన గుణనిధి/ దమనుడు తరువాత ఏమి అయ్యాడు?
ధనునిగా తన తనువూ చాలించిన తరువాత, గుణనిధి ఆటను చేసిన పుణ్యఫలముల కారణంగా పులస్త్యుని వంశంలో విశ్రవసునికి కుమారునిగా జన్మించాడు. అతనికే వైశ్రవణుడు అని పేరు పెట్టారు. అతనే తరువాతి కాలంలో దిక్పాలకత్వం పొందాడు. అతనే లంకాధిపతిగా కొంతకాలం గడిపాడు. తరువాత తన తమ్ముడు అయిన  దశగ్రీవునిచేత అక్కడి నుండి తరుమబడి కైలాసం దగ్గరలో ఉన్న అలకాపురిలో తన నివాసం ఏర్పరచుకున్నాడు.
ఈ జన్మలో కూడా అతను సర్వదా శివధ్యానం చేస్తూ, దీప దానములు చేస్తూ ఉన్నాడు.
అదృష్టవశాత్తూ, అతని తపఃఫలంగా ఒకసారి శివుడు పార్వతీ సమేతుడయ్యి దర్శనం ఇచ్చాడు. శివుని పై ఉన్న భక్తి కారణంగా శివునికి నమస్కారం చేసిన వైశ్రవణునికి, శివుడు పార్వతికి కూడా నమస్కరించమని చెప్పాడు. శివుడు చెప్పిన మాటను విన్న వైశ్రవణుడు పార్వతిని చూసాడు. అలా చుసిన ఒక్క క్షణంలో ఆమె ఎంత తపస్సు చేస్తే ఇలా శివునిలో సగశరీర భాగం పొందగలిగిందో! అనే అసూయ కలిగింది.
వైశ్రవణునిలో ఎంత భక్తి కలిగినా అరిషట్వర్గములలో ఒకటయిన అసూయ కలిగిన కన్నులతో పార్వతిని చుసిన కారణంగా అతని కన్నుస్ఫుటిత నేత్రంగా మారిపొమ్మని చెప్పింది. అప్పటి నుండి ఆ వైశ్రవణుని అందరూ కుబేరుడు అని పిలిచారు.
కు = చెడ్డ / అసూయతో కూడిన
బేర = చూపు కల్గిన వాడు 

17, జూన్ 2020, బుధవారం

గుణనిధి - పునర్జన్మ- దమనుడు

గుణనిధి కోసం యమదూతలు, శివదూతలు వాదులాడుకుని చివరికి శివదూతలు గుణనిధిని కైలాసమునకు తీసుకువెళ్లారు. సూక్ష్మరూపంలో ఉన్న గుణనిధి వారి వాదనలను విన్నాడు. కైలాసమునకు వెళ్లిన గుణనిధి కొంతకాలం అక్కడ శివుని సేవలో గడిపేశాడు. కొంతకాలం తర్వాత ఆ గుణనిధి తన పూర్వజన్మలో చేసిన చివరి మంచిపనులు కారణంగా తిరిగి భూలోకంలో కళింగరాజ్యమునకు రాజయిన అరిందమునకు కుమారునిగా జన్మించాడు.
అరిందముడు తనకుమారునకు దమనుడు అని పేరుపెట్టారు. తిరిగి మానవునిగా జన్మించిన తరువాత కూడా అతనికి పూర్వజన్మ, చివరి కాలంలో జరిగిన సంఘటనలు గుర్తు ఉన్నాయి. అరిందముని తరువాత దమనుడు కళింగ రాజ్యమునకు రాజు  అయ్యాడు. అతను రాజు అయిన సమయం నుండి ప్రతి మాస శివరాత్రికి ప్రతిశివాలయంలో దీపములు ఏర్పాటుచేయాలని ప్రజలను కోరాడు.
అలా గుణనిధిగా సకల వ్యసనములకు బానిస అయిన వ్యక్తి అదృష్ట వశాత్తు శివపూజ చేసిన ఫలితంగా అతనికి ఉత్తమ గతులు ప్రాప్తించటమే కాక అతని ఒక రాజు అయ్యి తన రాజ్యంలో ఉన్న అందరు ప్రజలను కూడా శివుని భక్తులను చేసాడు. వారికి కూడా ఉత్తమ గతులను కలిగించాడు.  

15, జూన్ 2020, సోమవారం

గుణనిధి కి శివలోకం

మనం ఇంతకు ముందు గుణనిధి గురించి చెప్పుకుంటున్నాం! అతనిని అతని తండ్రి వదిలేసాడు. తరువాత అతను దొంగగా మారి ఆహారం దొగతనం చేస్తూ దొరికిపోయి రక్షకభటుల చేతిలో ఒక్క దెబ్బకు ప్రాణములు వదిలేసాడు. తరువాత ఏమయ్యిందో ఇప్పుడు చూద్దాం!
అతను చనిపోయిన మరుక్షణం యమదూతలు వచ్చి, గుణనిధి సూక్ష్మదేహాన్ని పాశములతో కట్టి బందించి యమలోకమునకు తీసుకు వెళ్లబోతుండగా వారికి శివదూతలు ఎదురువచ్చి ఆ గుణనిధి సూక్ష్మదేహము కైలాసమునకు వెళ్ళవలసి ఉన్నది కావున వారికి ఇవ్వవలసినది అని కోరారు.
ఆశ్చర్య పోయిన యమభటులు గుణనిధి చేసిన అకృత్యములను, అతనికి ఉన్న సప్తవ్యసనములను, అతని తండ్రి స్వయంగా అతనికి తిలోదకములు వదలటం అన్నీచెప్పి అతనికి యమలోకంలో తప్ప ఇంకెక్కడా ఉండటానికి అర్హత లేదు అని చెప్పారు. ఆ మాటలు విన్న శివదూతలు అతను ఇంతకుముందు ఎన్ని పాపములు చేసినా ఆ రోజు శివునికి అత్యంత ప్రీతికరమయిన బహుళ చతుర్దశి అంటే మాసశివరాత్రి అవ్వటం వలన, తెలిసో తెలియకో ఆటను ఆ రోజంతా ఉపవాసం ఉండటం వలన, శివుని గర్భగుడిలో దీపములను వెలిగించుట వలన అప్పటి వరకు కలిగిన పాపములు అన్ని తొలగిపోయాయి అని చెప్పారు.
అలా అత్యంత దుష్టుడు, వ్యసన పరుడు అయినా కూడా గుణనిధి చివరి సమయంలో చేసిన శివ పూజ కారణంగా శివలోకం చేరుకున్నాడు. 

14, జూన్ 2020, ఆదివారం

విశ్రవసుడు - కైకసి - సంతానం

మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది  అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది అని తెలుసుకున్నాం కదా!  తిరిగి లంకను రాక్షసులు ఎలా స్వాధీనం చేసుకున్నారు? అలా వారు స్వాధీనం చేసుకోవటానికి తోడ్పడిన సంఘటనల క్రమాన్ని కూడా తెలుసుకుందాం!
శ్రీ మహావిష్ణువు వలన కలిగిన భయంతో తమ పరివారాన్ని తీసుకుని పాతాళానికి వెళ్లిన సుమాలి అక్కడే కాలం గడపసాగారు. ఆప్పుడప్పుడు భూలోకమునకు వచ్చి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటూ ఉండేవాడు.  ఒక నాడు అతను అలా బయటకు వచ్చిన సందర్భంలో పుష్పక విమానంలో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వెళుతున్న వైశ్రవణుడు అతనికి కనిపించాడు. సుమాలి అతని ని చూసి కొంత అసూయ చెంది ఆటను ఎవరు, ఎలా ఆ ఐశ్వర్యమును పొందాడు అనే విషయములు తెలుసుకుని తిరిగి పాతాళమునకు వెళ్ళాడు.
సుమాలి కుమార్తెలలో ఒకరయిన కైకసి కి అప్పటివరకు వివాహం కాని కారణం వల్ల, ఆమెకు విశ్రవసుడు తగిన వరుడు అని తాను అభిప్రాయ పడుతున్నట్లుగా చెప్పాడు.  అంతేకాక ఆ సమయంలో వారు ఉన్న పరిస్థితులలో వారికి వైశ్రవణుని వంటి ఒక వారసుడు అవసరం కనుక విశ్రవసునితో కుమారులను కంటే, ఆ కుమారులు వారి రాక్షసజాతికి ఎంతో ఉపయోగపడతారు అని చెప్పాడు.
తండ్రి మాటలు విన్న కైకసి ఉన్నపళంగా విశ్రవసుని వద్దకు వెళ్ళింది. ఆమె రాకను గమనించిన విశ్రవసుడు ఆమె రాకకు కారణం అడిగాడు. ఆమె ఆ విషయమును తిన్నగా చెప్పకుండా, అతను సర్వము తెలిసినవాడు కనుక అతనినే దివ్యదృష్టితో కనుక్కోమని చెప్పింది. ఆటను ఆమె అక్కడకు రావటానికి గల కారణం తెలుసుకుని, ఆమె వచ్చిన సమయం సాయం సంధ్యా సమయం కనుక ఆమె  ప్రకారం కలిగే పిల్లలు రాక్షస ప్రవ్రుత్తి  కలవారు అవుతారు అని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించని కైకసి తనకి ఒక ధర్మాత్ముడయిన కుమారుని కూడా ప్రసాదించమని కోరుకున్నది.
అలా కైకసికి మొదటి సంతానం కలిగింది. నల్లగా, భయంకరంగా, పెద్ద కోరలతో, పది తలలతో జన్మించాడు. విశ్రవసుడు అతనికి దశకంఠుడు / దశగ్రీవుడు అని నామ కారణం చేసాడు.
రెండవవానిగా అత్యంత భారీకాయుడు జన్మించాడు. అతని చెవులే పెద్ద కుండలవలే కనిపించాయి. విశ్రవసుడు అతనికి కుంభకర్ణుడు అని పేరు పెట్టాడు.
మూడవసంతానం గా ఒక అమ్మాయి జన్మించింది. ఆమే శూర్పణఖ
నాల్గవవానిగా ధర్మాచరణ పరుడయిన విభీషణుడు జన్మించాడు. 

13, జూన్ 2020, శనివారం

గుణనిధి - దొంగ

మనం ఇంతకు ముందు యజ్ఞదత్తుడు - గుణనిధి గురించి తెలుసుకున్నాం కదా! మరి తండ్రి తనను వదిలేశాక గుణనిధి ఏమయ్యాడు? ఇప్పుడు తెలుసుకుందాం!
తానా తండ్రి తనను వదిలేసాడు అని తెలుసుకున్న గుణనిధి ఇంటికి వెళితే తన తండ్రి ఎం చేస్తాడో అనే భయంతో పారిపోయాడు. కొంతకాలం అలా తిరిగిన తరువాత ఒకరోజు అతనికి తినటానికి ఏమి దొరకక ఒక అడవిలో చెట్టుకింద కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఒక శివభక్తుడు తన పరివారంతో, అనేక తినుబండారములు తీసుకుని శివాలయమునకు వెళుతూ ఉండటం చూసాడు. ఆ తినుబండారముల సువాసనలు అతనిని ఎంతో ఆకర్షించాయి. ఎలాగయినా వానిని తినాలి అనే ఆలోచనతో గుణనిధి కూడా వారితో పాటుగా శివాలయంలోనికి ప్రవేశించాడు.  వారంతా వారు తెచ్చిన తినుబండారములను శివునకు నివేదించి, సందర్భానుసారంగా నృత్యగానములను ఆస్వాదించి అక్కడే పడుకుండిపోయారు.  వారి పూజలు అయ్యేంతవరకు గుణనిధి అక్కడే నక్కి కూర్చున్నాడు.అలావారంతా నిద్రపోయిన తరువాత గుణనిధి మెల్లిగా గర్భగుడిలోని ప్రవేశించాడు. అతనికి విపరీతమయిన ఆకలి కారణంగా కన్నులు సరిగా కనిపించలేదు. కనుక అక్కడ ఉన్న దీపములో తన ఉత్తరీయమును చించి ఒక వత్తి లా చేసి పెట్టి, దానిని వెలిగించాడు. ఆ తినుబండారాలు అన్ని మూటగట్టుకుని బయటకు రాబోతుండగా అక్కడ పడుకున్న భక్తులలో ఒకరికి మెలకువ వచ్చి దొంగా దొంగా  అని అరిచారు. ఆ అరుపులకు రక్షకభటులు వచ్చారు. అతని చేతిలోని తినుబండారాలు చూసి అతని దొంగ అని నిర్ణయించుకుని కొట్టారు. ఒక్క దెబ్బ పడగానే గుణనిధి ప్రాణములు వదిలేసాడు.  

12, జూన్ 2020, శుక్రవారం

తెలుగు మధురమయిన పద్యం - 3

ఇంతకూ ముందు మనం కొన్ని అద్భుతమయిన తెలుగు పద్యముల గురించి చెప్పుకున్నాం కదా! వానిలో ఒక పద్యం కవిరాజ శిఖామణి నన్నెచోడుడు రచించిన కుమారా సంభవం లోని ఒక పద్యం చూసాం కదా!! ఇప్పుడు అదే కుమారా సంభవం లోని మరొక పద్యం చూద్దాం!  
ఈ పద్యం ప్రార్ధనలోని భాగం. ఈ పద్యమునకు అర్ధం రెండురకములుగా చూద్దాం! 

తన జనకుడురుస్థాణువు 
జనని యపర్ణాఖ్య దా విశాఖుo డనగా 
దనరియు నభిమతఫలముల 
జనులకు దయ నొసగుచుండు షణ్ముఖు గొలుతున్  
  1. భావం: తనతండ్రి కదలలేని ఒక మొద్దు, తల్లి కి ఆకులే లేవు, అతనికి  కొమ్మలు కూడా లేవు, కానీ కోరినకోర్కెలు తీర్చే ఆరు ముఖములు కలిగినవానికి నమస్కరిస్తున్నాను. 
  2. భావం: ప్రళయకాలంలో కూడా చెదరనివాడు అతనికి తండ్రి, తపస్సుకోసం కనీసం ఆకులు కూడా ముట్టనిది అతని తల్లి, వారినుండి సాహసమును, సహనమును పొందిన విశాఖుడు అయ్యి, ఎవరు కోరినకోర్కెలు అయినా దయతో తీర్చేవాడయిన షణ్ముఖునకు నమస్కారం.  

11, జూన్ 2020, గురువారం

యజ్ఞదత్తుడు - గుణనిధి

మనం ఇంతకు ముందు సప్త వ్యసనముల గురించి చెప్పుకున్నాం కదా! ఆ వ్యసనములు ఉన్న వ్యక్తి తన  కోల్పోతాడు? అతనితో అతని తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో ఇప్పుడు ఒక చిన్న కధ ద్వారా చూద్దాం!

పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ యజ్ఞదత్తుడు సదాచార పరాయణుడు, యాజ్ఞికుడు. అతనికి చాలాకాలమునకు ఒక కుమారుడు కలిగాడు. లేకలేక కలిగిన ఆ కుమారునికి గుణనిధి అని పేరుపెట్టారు. ఐతే విద్యార్థి దశలోనే గుణనిధికి  చెడు స్నేహములు వాని వల్ల చెడు వ్యసనములు కూడా అలవాటు అయ్యాయి. లేకలేక కలిగిన కుమారుడు అవ్వటం వలన అతని తల్లి అతనిని చాలా గారాబంగా చూసుకునేది. అయితే యజ్ఞదత్తుడు తన నిత్య కార్యక్రములలో, యజ్ఞములలో చాలా సమయం గడుపుటవలన అతనికి కుమారుడిని పట్టించుకునే సమయం ఉండేది కాదు. అయినా అతడు తన కుమారుని గురించి తన భార్యను అడిగి తెలుసుకునే వాడు. అయితే కొడుకు మీద ఉన్న మమకారం కారణంగా అతని భార్య అతనికి ఎల్లప్పుడూ వారి కుమారుడు చక్కగా అన్ని శాస్త్రోక్తంగా చదువుకుంటున్నాడు అని చెప్పేది. కానీ నిజానికి గుణనిధి ఎంతోకాలం ముందే సప్తవ్యసనములకు బానిస అయ్యాడు. అవి ఏమి తెలియని యజ్ఞదత్తుడు అతనికి ఒక మంచి కన్యను చూసి వివాహం కూడా జరిపించాడు.
ఒకనాడు యజ్ఞదత్తుడు స్నానమునకు వెళుతూ తన ఉంగరమును బల్లమీద పెట్టి వెళ్ళాడు. అది గమనించిన గుణనిధి ఆ ఉంగరమును తీసుకుని వెళ్ళి తన జూదంలో పందెంగా పెట్టి ఓడిపోయాడు. యజ్ఞదత్తుడు తన ఉంగరం విషయం మరచిపోయాడు. ఒకరోజు యజ్ఞదత్తుడు అనుకోకుండా ఒక వ్యక్తి చేతికి ఆ ఉంగరాన్ని చూసి అది అతనికి ఎలా వచ్చింది అని అడుగగా, ఆటను యజ్ఞదత్తునికి గుణనిధి గురించి చెప్పి, ఇంటిలోని సమన్లు అతను అమ్ముకొనక ముందే అతనికి బుద్ధి చెప్పుకొమ్మని ఎగతాళి చేసాడు. ఆ విషయాన్నివిన్నయజ్ఞదత్తుడు ఇంటికి వచ్చి అతని భార్యను నిలదీయగా ఆమె నిజమును చెప్పింది. 
ఆ వివరం మొత్తం తెలుసుకున్న యజ్ఞదత్తుడు తక్షణం తన కుమారునికి తర్పణములు వదిలేసాడు. 

8, జూన్ 2020, సోమవారం

సప్త వ్యసనములు

మనం ఇంతకుముందు కామం వలన జనించిన 10 వ్యసనముల గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు అసలు సప్త వ్యసనములు అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం!
మానవుని జీవితంలో అత్యంత పాపమునకు కారణమయినవి  ఏడు వ్యసనములు. అవి 
  1. వేట 
  2. మద్యపానం 
  3. చాడీలు చెప్పటం 
  4. అబద్దాలు చెప్పటం 
  5. దొంగతనం 
  6. జూదం 
  7. పరస్త్రీ సంగమం 

7, జూన్ 2020, ఆదివారం

ముంగీస -ధర్మరాజు అశ్వమేధయాగం - శాప విమోచనం

మహాభారత యుద్ధం అయిపోయిన తరువాత యుద్ధంలో విజయం సాధించిన పాండవులు అశ్వమేధయాగం చేశారు. ఆ యాగమును అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా చేశారు. ఆ యాగమును చూడటానికి వచ్చినవారందరికీ వారు అత్యంత గొప్పవయినా దానాలు చేశారు. అలా రత్నములు, మణులు దానాలు తీసుకున్న రాజులు బ్రాహ్మణులూ వానిని మోయలేక మోయలేక వారి వారి ఇళ్లకు తీసుకెళుతూ ఉన్నారు. ఆ సమయంలో అన్నదానం కూడా జరుగుతోంది.
అలా వివిధములయిన దానములు తీసుకున్న బ్రాహ్మణులు ఒక చోట కొందరు గుంపుగా నిలబడి ఆ పాండవుల ధర్మనిరతని మెచ్చుకుంటూ, వారు చేసిన ఆ అశ్వమేధయాగాన్ని కీర్తిస్తూ, ఇంతగొప్ప దానములు చేసాడు అని మాట్లాడుకుంటూ ఉండగా!
అక్కడే చాటుగా సంచరిస్తున్న వింతగా  సగం దేహం బంగారు కాంతితో మెరిసిపోతున్న ఒక ముంగీస వచ్చి, ఈ అశ్వమేధయాగం ఎంతమాత్రమూ సక్తుప్రస్తుని త్యాగానికి, ధర్మానికి సరితూగదు అని చెప్పింది. ఆ మాటలు విన్న బ్రాహ్మణులూ ఆశ్చర్యపోయి ఆ సక్తుప్రస్తుని కథను తెలుసుకుని ఆనందించారు.  అంతేకాక సక్తుప్రస్తుడు చేసిన దాన విశేషణ ఫలముగా ముంగీసకు సగం దేహం బంగారు వర్ణం కలిగింది. మరి పాండవులు చేసిన అశ్వమేధ యాగ ప్రాంగణంలో ఆ ముంగీస మిగిలిన దేహం బంగారు మాయం కాలేదు కనుక ఆ బ్రాహ్మణులుకూడా ఆ ముంగీస మాటలతో ఏకిభవించారు.
దానికి కారణం కూడా మనకు మహాభారతం లో చెప్పారు. అశ్వమేధయాగం అనేది అశ్వమును వినియోగించి చేస్తారు. అంటే జంతువును హింసిస్తారు. కానీ సక్తుప్రస్తుడు, అతని కుటుంబం చేసిన దానము అహింస అనే పునాది మీద జరిగినది. కనుక ఎల్లప్పుడూ హింసకంటే అహింస ఎంతో గొప్పది.
అలా అక్కడ ఉన్న బ్రాహ్మణులు ముంగీస చెప్పిన మాటలు అంగీకరించారో అప్పుడు ఆ ముంగీసకు ఉన్న శాపవిమోచనం కలిగి ఆనందిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. 

6, జూన్ 2020, శనివారం

రాక్షసులు లంకను వదలి ఎందుకు వెళ్లారు?

మనం ఇంతకు ముందు లంక ను స్వర్ణలంక అని ఎందుకు అంటారో తెలుసుకున్నాం కదా! ఆ లంక ముందుగా రాక్షసుల నివాసస్థలంగా ఉండి ఆ తరువాత అది వైశ్రవణునికి నివాసంగా ఉంది. అయితే వైశ్రవణుడు అక్కడికి చేరే సమయానికి లంక కాళీగా ఉంది. మరి అతనికంటే ముంది  ఉన్న ఆ రాక్షసులు లంకను వదిలి ఎక్కడకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు?
రాక్షస గణములు ప్రగటానికి కారణం మాల్యవంతుడు,మాలి, సుమాలి అని చెప్పుకున్నాం కదా!  వారి వరముల కారణంగా మాల్యవంతుడు, మాలి, సుమాలి సోదరులు గర్వం పెరిగి,   సర్వ లోకములను వేధించటం మొదలుపెట్టారు. దేవతలు దిక్కులేనివారు అయ్యారు. దేవతలు కైలాసమునకు వెళ్లి శివునకు మొరపెట్టుకున్నారు. కానీ పరమేశ్వరుడు సుకేశుని మీది జాలి, ప్రేమ కారణంగా  కుమారులను సంహరించటానికి సుముఖం  కాలేక విష్ణుమూర్తి వద్దకు వెళ్ళమని చెప్పాడు.
వారి మొరలు  విష్ణువు దేవతలకు అభయం ఇచ్చాడు. ఆ విషయం ఆ ముగ్గురు అన్నదమ్ములకు చారుల  ద్వారా తెలిసింది. అప్పుడు పెద్దవాడయిన మాల్యవంతుడు విష్ణువు ఇంతకు ముందు కూడా రాక్షసులను చంపి ఉన్నాడు కనుక ఏమి చెయ్యాలి అని తన తమ్ముళ్లను అడిగాడు. దానికి ఆ తమ్ముళ్లు విష్ణువు అలా  మనలను చంపుతాను అని చెప్పుటకు కారణం ఆ దేవతలు కనుక ముందుగా ఆ దేవతలను నాశనం చేయాలి అని చెప్పారు. ఆ మాటలను అంగీకరించిన మాల్యవంతుడు వెంటనే దేవతల మీద యుద్ధం ప్రకటించారు.
అనేక రాక్షస సైన్యమును వెంటపెట్టుకుని వీరు స్వర్గం మీద దాడి చేశారు. రాక్షసులు దండెత్తి వస్తున్నారని తెలిసిన దేవతలు పారిపోయారు. ఈ విషయాలు అన్ని తెలుసుకున్న విష్ణువు తన వాహనం గరుడుని పై,సకల ఆయుధాలను ధరించి బయలుదేరాడు. యుద్ధభుమిని చేరే సమయానికి, గరుడుని రెక్కల వేగానికి ఆ యుద్ధభూమీలోని రాక్షసులు ఎగిరిపోయారు, వారి ఆయుధాలు చెల్లాచెదురు అయిపోయాయి. ఎగిరిపోగా మిగిలిన రాక్షసులు విష్ణువు మీద యుద్ధం చేయనారంభించారు. వారు ప్రయోగించిన అన్ని బాణములు విషుమూర్తి దేహంలో కలిసిపోతున్నాయి. విష్ణుమూర్తి కూడా వారిపై బాణముల వర్షం కురిపిస్తున్నాడు.
ఆ బాణ వర్షమునకు ఎందరో రాక్షసులు నేలకూలారు. కొందరు పారిపోయారు. ఆ విజయమునకు సూచనగా విష్ణువు తన పాంచజన్యమును పూరించాడు.  ఆ పాంచజన్య శబ్దమునకు రాక్షసుల వాహనములకు కట్టిన జంతువులు పారిపోయాయి. అలా వారి యుద్ధం ఓడిపోతున్న ఉక్రోషంతో సుమాలి తిన్నగా వెళ్లి విష్ణువుతో తలపడ్డాడు.  అలా మళ్ళీ కొందరు రాక్షసులు విష్ణువు చుట్టూ చేరి యుద్ధం చేయసాగారు. అప్పుడు విష్ణువు ఒక బాణంతో సుమాలి సారధిని సంహరించాడు. అప్పుడు అతని రధమును ఆ గుఱ్ఱములు దూరంగా లాక్కుని వెళ్లిపోయాయి. అప్పుడు మాలి యుద్దానికి వచ్చాడు. మాలి భయంకరంగా యుద్ధం చేసాడు. అయితే అతని బాణములు ఏవి విష్ణువును భాధించలేదు. అప్పుడు మాలి తన గధతో గరుడుని ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బను తట్టుకోలేక గరుడుడు అకస్మాతుగా కదిలాడు. గరుడుని ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత విష్ణుమూర్తి ఆ మాలిని సంహరించటం కోసం సుదర్శనమును ప్రయోగించాడు. ఆ సుదర్శనం మాలి కంఠమును నరికి వేసింది. ఆ దృశ్యమును చుసిన రాక్షసులు భయపడి పారిపోయారు.
అలా పారిపోతున్న రాక్షసులను విష్ణువు గరుడుని మీద వెంబడించాడు. అలా వెంబడిస్తున్న విష్ణువును మాల్యవంతుడు ఎదిరించాడు. అల ఎదిరించిన మాల్యవంతుడిని గరుడుడు తన రెక్కలతో కొట్టాడు. ఆ దెబ్బకు మాల్యవంతుడు దూరంగా ఎగిరిపోయాడు. అలా మాల్యవంతుడు ఎగిరిపోవటం చూసిన సుమాలి అతని సైన్యమును తీసుకుని, లంకకు వెళ్లి , అక్కడ వారి కుటుంబాలను కూడా తీసుకుని పాతాళమునకు వెళ్లి దాక్కున్నారు. మాలి చనిపోవటం, మాల్యవంతుడు దూరంగా ఎగిరి పోవటంతో రాక్షసులకు సుమాలి రాజుగా , రాక్షస రాజ్యమును స్థాపించి పరిపాలించాడు.
అలా ఖాళీ అయినా లంకను తనకు నివాస యోగ్యంగా మార్చుకొమ్మని విశ్రవసుడు  తన కుమారుడు వైశ్రవణునికి చెప్పాడు. 

5, జూన్ 2020, శుక్రవారం

సక్తుప్రస్తుని దానం - ఫలం

మనం ఇంతకుముందు మానవుడు తప్పని సరిగా చేయవలసిన పంచమహాయజ్ఞముల గురించి తెలుసుకున్నాం కదా! దానిలో అతిధి యజ్ఞం అద్భుతంగా చేసిన ఒక బ్రాహ్మణుని కధ ఇప్పుడు చూద్దాం!
పూర్వాకాలంలో కురుక్షేత్రం ప్రాంతంలో సక్తుప్రస్తుడు అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి కోరికలు ఏమీలేవు. అతనితో పాటుగా అతని భార్య, కొడుకు ,కోడలు కూడా అదేవిధమయిన భక్తి వైరాగ్యములు కలిగి ఉండేవారు. వారు ఉంచ్చవృత్తి చేస్తూ జీవించేవారు. వారు కేవలం పొలంలో రాలిన, ఎవ్వరూ ఆశించని ధాన్యమును ఏరుకుని తెచ్చుకుని దానిని మాత్రమే తిని జీవిస్తారు.
ఒకసారి వానలు సరిగా పడక పంటలు సరిగా పండక, ఆ ప్రాంతంలో కరువు సంభవించింది. వీరికి ఆహారం దొరకటం చాలా కష్టం అయ్యిపోయింది. వారు నలుగురు తెచ్చిన ఆహారఎం వారికి సరిపోయేది కాదు.
అల ఒకరోజు వారికి కొంత ధాన్యం దొరికింది. అది సాయంత్రానికి వారి భోజనానికి తయారు చేసుకున్నారు. ఆ రోజు చేయవలసిన శాస్త్రోక్తకర్మలను పూర్తిచేసుకుని వారు భోజనం చేయటానికి ఆ ఆహారాన్ని నలుగురూ సమంగా పంచుకుని తినబోతున్న సమయంలో వారి ఇంటికి ఒక అతిధి వచ్చారు. ఆ అతిథికి సకల మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు అడిగిన తరువాత, అతనికి మామగారు తన వంతు భోజనాన్ని అందించాడు. అతిధి ఆ ఆహారాన్ని స్వీకరించాడు. కానీ అతనికి ఆ ఆహారం అతనికి సరిపోలేదు అని ఆ బ్రాహ్మణుడు గమనించాడు. కానీ వచ్చిన అతిథిని ఇంకా ఎలా సంతృప్తిపరచాలో అతనికి తెలియక చూస్తున్న సమయంలో, అతని భార్య తనవంతు భోజనాన్ని అతిథికి ఇచ్చింది. అది కూడా అతనికి సరిపోకపోతే అతని కుమారుడు, ఆ తరువాత వారి కోడలు కూడా వారి వారి భోజనాన్ని పరం సంతోషంగా వచ్చిన అతిథికి సమర్పించారు . అలా అందరూ ఇచ్చిన ఆహారాన్ని బుభుజించిన ఆ అతిథి సంతృప్తుడు అయ్యాడు.
అలా సంతృప్తుడయిన ఆ అతిథి, భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పుతో కూడిన మర్యాద, దయ, అతిధులయందు ప్రేమ అన్ని ఉన్న ఆ బ్రాహ్మణ కుటుంబానికి తను యముడిని అని చెప్పి తన్మ నిజరూపమును చూపించాడు . అంతే కాక వీరి దానగుణమును సకల దేవతలు, సప్తఋషులు కూడా ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాడు. దేవతలు వారి మీద పుష్పవర్షం కురిపించారు. యముడు వారిని బ్రహ్మ తనలోకమునకు తీసుకువెళ్ళేందుకు విమానమును పంపిస్తాడు అని చెప్పాడు.   ఆలా చెప్తూ ఉండగానే ఒక విమానం వచ్చింది. అప్పుడు యముడు వారిని ఆ విమానంలో ఎక్కమని చెప్పాడు. వారు ఆ విమానంలో ఎక్కి బ్రహ్మలోకమునకి వెళ్లారు.
ఆ కుటుంబం మొత్తం విమానంలో బ్రహ్మలోకమునకు వెళుతున్న సమయంలో వచ్చిన కోలాహలం విన్న ఒక ముంగీస కలుగులో నుండి  బయటకు వచ్చి  చూస్తూ ఉండగా , ఆ అతిధిగా వచ్చిన యముడు చేతులు కడుగుకున్న నీటిని ఆ ముంగీస సగంశరీరం తాకుటవల్ల ఆ ముంగీస సగం శరీరం బంగారు వర్ణం లోనికి మారింది. ఇంట ఘనంగా దానం చేసిన ఫలములో కొంత భాగం తనకు దక్కినది అని తలచి ఆ ముంగీస మిగిలిన శరీరమును బంగారు వర్ణంగా మార్చుకోవటానికి దానములు జరిగే ప్రతి చోటుకూ వెళ్లి వారు చేతులు కడుగుకునే స్థలంలో తిరుగుతూ ఉండేది. 

4, జూన్ 2020, గురువారం

రాక్షస వంశాభివృద్ధి

మనం ఇంతకు ముందు రాక్షసుల జన్మ గురించి తెలుసుకున్నాం కదా! ఆ వంశంలో జన్మించిన మాల్యవంతుడు, మాలి, సుమాలి గురించి కూడా తెలుసుకున్నాం! ఇప్పుడు వారి సంతానం గురించి తెలుసుకుందాం!

మాల్యవంతుడు :

  1. వజ్రముష్టి 
  2. విరుపాక్షుడు 
  3. దుర్ముఖుడు 
  4. సుప్తఘ్నుడు 
  5. యజ్ఞకోపుడు
  6.  మత్తుడు 
  7. ఉన్మత్తుడు
  • కుమార్తెలు 
  1. అనల 
సుమాలి : కుమారులు

  1. ప్రహస్తుడు 
  2. అకంపనుడు 
  3. వికటుడు 
  4. కాలికాముఖుడు 
  5. ధూమ్రాక్షుడు 
  6. దండుడు 
  7. సుపార్శ్వుడు 
  8. సంహాద్రి 
  9. ప్రఘనుడు 
  10. భాసకర్ణుడు

కుమార్తెలు :

  1. రాక 
  2. పుష్పోత్కట 
  3. కైకసి 
  4. కుంభీనస 


మాలి : కుమారులు

  1. అనలుడు 
  2. అనిలుడు 
  3. హరుడు 
  4. సంనాతి 
  5. విభీషణుడు  


 

3, జూన్ 2020, బుధవారం

జమదగ్ని- శాంతం - శాపం

మనం ఇంతకు ముందు ఋచీకుని కుమారుడు జమదగ్ని అని తెలుసుకున్నాం కదా ! ఆ జమదగ్ని నిష్ఠ గురించి ఒక  సంఘటన ఇప్పుడు చూద్దాం!
ఒకసారి జమదగ్ని శ్రాద్ధం చేయదలచి ఒక ఆవుపాలు స్వయంగా ఒక కొత్త కుండలో తీసుకువచ్చి జాగ్రత్తగా ఒక చోట పెట్టాడు. అతని మనస్సును పరీక్షించాలి అనే ఉద్దేశ్యంతో క్రోధమునకు అధిదేవత సాకారంగా వచ్చి ఆ పాలు ఉన్న కుండను అనుకోకుండా తగిలినట్లు చేసి, ఆ పాలు ఒలికి  పోయేట్లుగా చేసింది. ఆ విధం గమనించిన జమదగ్ని కోపగించకుండా, సావధాన మనస్కుడై ఉన్నాడు. అతనిని గమనించిన క్రోధాదిదేవత అతనిని క్షమాపణ కోరింది.  అతను కోపగించకుండా , అక్కడ సంకల్ప సిద్ధంగా జరగవలసిన శ్రాద్ధ కర్మ సరిగా జరుగక పోవటం వలన పితృదేవతలు శపిస్తారు కనుక, వారు ఆలా చేయక మునుపే ఆమెను అక్కడ నుండి వెళ్లిపొమ్మని కోరాడు. ఆమె వెళ్ళిపోయింది.
అప్పుడు పితృదేవతలు జమదగ్నికి సాక్షాత్కరించి, జరుగవలసిన శ్రాద్ధం సరిగా జరిపించలేదు, దానికి కారణమయిన వారిమీద కోపం చూపించలేదు కనుక వారు జమదగ్నిని ముంగీస గా జన్మించమని శాపం ఇచ్చారు.
అప్పుడు జమదగ్ని వారితో, దీక్షాపరుడయిన కారణంగా క్రోధంవహించుట సరి అయిన పద్దతి కాదు కనుక తానూ కోపం తెచ్చుకోలేదు అని, తనకు శాప విమోచన మార్గం చెప్పమని ప్రార్ధించాడు.
అతని ధర్మ నిరతకు సంతోషించిన పితృదేవతలు, అతను ఏ రోజున పండిత, విద్వాంసులందరినీ కూడా ఒక మహాధర్మమును అధమ ధర్మముగా చెప్పి ఒప్పించగలుగుతాడో ఆ రోజున అతనికి శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు.

మరి ఇంతకూ అలా ముంగీసగా పుట్టిన జమదగ్నికి శాప విమోచనం ఎలా కలిగింది ? ఎలా పండితులను మహాధర్మమును అధమ ధర్మం అని  ఒప్పించగలిగాడు? తరువాతి టపా లో చెప్పుకుందాం!

2, జూన్ 2020, మంగళవారం

రాక్షస సంతాన వృద్ధి

ఇంతకుముందు మనం రాక్షసులకు పిల్లలు ఎలా వెంటనే కలుగుతారు,  వారు ఎందుకు తమ తల్లి వయస్సు కలవారు అవుతారు అని తెలుసుకున్నాం కదా!
పార్వతీదేవి, శివుని కరుణా కటాక్షామముల వల్ల పెరిగి పెద్దవాడయిన సుకేశునికి గ్రామణి అనే గంధర్వుడు తన కుమార్తె దేవవతిని ఇచ్చి వివాహం జరిపించాడు.  వారికి మాల్యవంతుడు, మాలి, సుమాలి అనే ముగ్గురు కుమారులు కలిగారు. వీరు ముగ్గురూ మేరుపర్వతం వద్ద బ్రహ్మగురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు వారిని వరములు కోరుకొమ్మన్నాడు. 
వారికి అత్యంత బలం కావాలని, వారి మధ్య ఎన్నటికీ విరోధం కలుగకుండా ఉండాలని కోరుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి ఆ వరములు ఇచ్చారు. తరువాత వారు విశ్వకర్మదగ్గరకు వెళ్లి తమకు నివాసయోగ్యమయిన స్థలమును చూపించమని అడిగారు. దానికి విశ్వకర్మ స్వర్ణలంక ని తమ నివాసంగా చేసుకోమని చెప్పాడు.   
తరువాత వారు ఒక గందర్వ కాంత నర్మద యొక్క ముగ్గురు కుమార్తెలు సుందరి, కేతుమతి, వసుధలను వివాహం చేసుకున్నారు.   వారికి అనేకమంది సంతానం కలిగారు. వీరి వలననే రాక్షస సంతానం వృద్ధి చెందింది. 
రావణాసురుని తల్లి అయిన కైకసి, సుమాలి పుత్రిక. 

1, జూన్ 2020, సోమవారం

మానవ జీవితం - పంచమహా యజ్ఞములు

మానవుని జీవితంలో ఉండే  బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాస అనే నాలుగు ఆశ్రమముల గురించి మనకు తెలుసు కదా! ఆ నాలుగు ఆశ్రమములలో ముఖ్యమయినది, మిగిలిన మూడు ఆశ్రమములకు ఆధారమయినది గృహస్థ ఆశ్రమం. 
అయితే ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వారు యజ్ఞములు చేస్తేనే వారికి పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. మరి ఇంతకీ ఆ యజ్ఞములు ఎన్ని రకములు? వానిని ఎలా చేయాలో తెలుసుకుందాం! 

ముఖ్యమయిన యజ్ఞములు ఐదు రకములు. అవి

  1. దేవ యజ్ఞము: వీనిని మనం వాడుక భాషలో యజ్ఞములు అనే వ్యవహరిస్తాము. ఇవి భగవదనుగ్రహం కోసం, ఇష్టకార్యార్ధ సిద్ధి కోసం చేస్తారు. గృహస్తులయితే తమ గార్హపత్యాగ్ని లో హవిస్సును సమర్పిస్తారు. బ్రహ్మచారులయితే లౌకికమైన అగ్నితోనే చేస్తారు. ఇక శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలమును ఇస్తుంది.  
  2. పితృ యజ్ఞము: ఇవి తమను వదలి పరలోకమునకు చేరిన తమ పితృదేవతల కొరకు చేస్తారు.  ఐతే తండ్రి బ్రతికి ఉండగా ఇట్టి  యజ్ఞమును చేయుటకు పుత్రునికి అధికారం లేదని చెప్పెదరు. 
  3. భూత యజ్ఞము: ఈ యజ్ఞమునకు అర్ధం తనతో పాటుగా ఈ భూమిమీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఉపయోగపడేలా తాను అండుచుకోవాలి అని. 
  4. మనుష్య యజ్ఞము: ఈ యజ్ఞమునే అతిధి యజ్ఞం అనికూడా పిలుస్తారు. మన ఇంటికి వచ్చిన అతిధిని గౌరవంగా చూసుకోవాలి.  ఈ యజ్ఞము ద్వారానే గృహస్తుడు మిగిలిన మూడు ఆశ్రమములవారికి ఆధారం అవుతున్నాడు.
  5. బ్రహ్మ యజ్ఞము: ఈ యజ్ఞము ద్వారా గృహస్తుడు అనేక కొత్త విషయములను తెలుసుకుంటాడు. అంతేకాక మిగిలినవారికి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞంలో భాగంగా గృహస్తుడు జ్ఞానమును ఆర్జిస్తాడు, అందరికి పంచి పెడతాడు. 

31, మే 2020, ఆదివారం

రాక్షస స్త్రీలు - పిల్లలు - పార్వతీదేవి

మన పురాణములలో రాక్షస స్త్రీలు గర్భం ధరిస్తే, పుట్టిన పిల్లలు వెంటనే ప్-పెద్దవారు అవుతారు   అంతే కాక ఆ పిల్లలు తమ తల్లికి సమానమయిన వయస్సు కలిగిన వారు అవుతారు. మరి ఇంతకీ ఇది ఎలా సాధ్యం? దానికి కారణం ఏమిటి?
దీనికి సమాధానం మనకు రామాయణంలో ఉత్తరకాండలో చెప్పారు. 
బ్రహ్మ తాను సృష్టి మొదలుపెట్టిన సమయంలో మొట్ట మొదటగా ఉన్న జలంలో కొన్ని ప్రాణులను సృష్టించాడు. ఆలా పుట్టిన వారు బ్రహ్మను ఏమి చెయ్యాలి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ వారిని ఆ జలమును రక్షించమని చెప్పాడు. వారిలో కొందరు "రక్షామ" అని కొందరు "యక్షామ" అని అన్నారు. రక్షామ అన్నవారిని రాక్షసులు అని, యక్షామ అన్నవారిని యక్షులు అని పేరుపెట్టారు. 

రాక్షసులకు  హేతి, ప్రహేతి అనే ఇద్దరు నాయకులు ఉన్నారు. వారిలో ప్రహేతి పరం ధర్మాత్ముడు. అతను  గృహస్థధర్మమును స్వీకరించటానికి యముకుని చెల్లి అయిన భయ ను వివాహం చేసుకున్నాడు. వీరికి విద్యుత్కేశుడు అనే కుమారుడు కలిగాడు. 
ఆ విద్యుత్కేశునికి యుక్త వయస్సు రాగానే అతనికి సంధ్యపుత్రికని ఇచ్చి వివాహం చేశారు. ఆమె కొంతకాలమునకు గర్భం ధరించింది. అయితే గర్భంధరించి ఉన్న ఆమె తన భర్తతో కొంతకాలం సుఖంగా గడపాలి అని కోరుకున్నది. ఆలా జరగటానికి అడ్డంగా ఉన్న నెలలు నిండని గర్భమును స్రావం చేసుకుని అక్కడి నుండి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది. 
అయితే బయటకు వచ్చిన నవజాత శిశువు ఏడుపు మొదలు పెట్టాడు. అదే సమయమునకు అటువైపుగా వెళుతున్న పార్వతీ పరమేశ్వరులు ఆ బిడ్డను చూసి, జాలి పడ్డారు. వారి జాలి చూపులు సోకిన ఆ బిడ్డ అప్పటికి అప్పుడే యుక్తవయస్కుడు అయ్యాడు. 
అప్పుడు పార్వతీదేవి రాక్షస స్త్రీలకు ఒక వరం ఇచ్చింది. ఆ వరం ప్రకారం రాక్షస స్త్రీలు గర్బంధరించిన వెంటనే ప్రసవిస్తారు, ప్రసవించిన బిడ్డలు కూడా వెంటనే పెద్దవారు, తమ తల్లి వయస్సు కలిగినవారు అవుతారు. 
అక్కడ ఉన్న శిశువు మీద ఆప్యాయత తో శివుడు అతను  సుఖంగా నివసించటానికి వీలుగా ఒక గాలిలో ప్రయాణించే నగరమును నిర్మించి ఇచ్చాడు. ఆ రాక్షసుని పేరు సుకేశుడు

30, మే 2020, శనివారం

వైశ్రవణుడు - దిక్పాలకత్వం

మనం ఇంతకు ముందు నవబ్రహ్మ లలో ఒకరయిన పులస్త్యుడు - విశ్రవసుడు , విశ్రవసునికి భరద్వాజుని కుమార్తెయందు కలిగిన వైశ్రవణుని జననం గురించి తెలుసుకున్నాం కదా!
 ఇప్పుడు అతనికి దిక్పాలత్వం, ధనాధిపత్యం ఎలా సంక్రమించింది,  లంక కు అధిపతి ఎలా అయ్యాడు అని తెలుసుకుందాం!

వైశ్రవణునికి తండ్రి విశ్రవసునివలెనే ధర్మాచరణ పరాయణుడు. అతను అనేక సంవత్సరములు 
తపస్సు చేసాడు. వెయ్యి సంవత్సరములు తపస్సు చేసిన తరువాత అతను కేవలం గాలిని మాత్రమే పేల్చి తపస్సు చేసాడు. ఆ ఘోరమయిన తపస్సుని చూసి దేవతలు ఆశ్చర్యపోయిఅందరూ బ్రహ్మదేవునిలో కలసి అతనికి దర్శనం ఇచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనిని వరం కోరుకోమని అడుగగా, అతను దిక్పాలత్వమును, ముల్లోకముల లోని ధనము పైన ఆధిపత్యము కావలి అన్ని కోరుకున్నాడు. అప్పటివరకు కేవలం ముగ్గురు దిక్పాలకులు ఉన్నారు. ఇంద్ర, వరుణ మరియు యముడు. అప్పుడు బ్రహ్మ అతనిని ఉత్తర దిక్కునకు అధిపతిని చేసాడు. అంతే కాక అతనికి ధనాధిపత్యం కూడా ఇచ్చారు. వానితో పాటు ఆటను అన్ని లోకములు తిరుగుటకు వీలుగా అద్భుతమయిన ఒక విమానము కూడా ఇచ్చారు. ఆ విమానం పేరే పుష్పక విమానం! దీని ప్రత్యేకత ఎంతమంది ఎక్కినా ఇంకా కొందరు ఎక్కటానికి చోటు ఉంటుంది. 

ఆ వరములను పొందినతరువాత  వైశ్రవణుడు తన తండ్రి దగ్గరకు వెళ్లి తాను పొందిన వరములా గురించి చెప్పి, తాను ఉండుటకు వీలుగా ఒక ప్రదేశం చూపించమని అడిగాడు. అప్పుడు విశ్రవసుడు ఆ సమయమునకు కాళీ గా ఉన్నస్వర్ణ  లంకా నగరమును తనకు నివాసంగా మార్చుకోమని చెప్పాడు. 
అప్పటి నుండి వైశ్రవణుడు లంకను తన నగరంగా మార్చుకుని అక్కడ నివాసం ఉన్నాడు. 

29, మే 2020, శుక్రవారం

ఉడుతా భక్తి - ఆ భక్తికి కారణం పూర్వజన్మ!!

ఉడుతా భక్తి అనే మాట మన తెలుగు వారు సహజంగా మనం చేసి పని ఎదుటివారికి  అంత ముఖ్యమయినది కాకపోయినా మనం వారిమీద ఉన్న ప్రేమ అభిమానంతో చేసే పనిని  ఎదో ఉడుతా భక్తి గా చేసాం అని చెబుతూ ఉంటారు.  
శ్రీ రాముని కరుణకు సంబందించిన ఉదాహరణ చెప్పాలంటే ముందుగా చెప్పేది సేతు బంధన సమయంలో ఉడుత చేసిన చిన్న సహాయమునకు శ్రీరాముడు దానిని తన చేతులలోకి తీసుకుని దానిని నిమురుట, ఆ నిమిరినప్పుడు పడిన శ్రీరాముని వేళ్ళ గుర్తులు ఇప్పటికీ ఆ ఉడుతల వీపుపైన ఉన్నాయి అని చెప్తారు కదా! 
మరి ఇంతకీ అలా రాముని చేతులతో నిమిరించుకున్న ఉడుత ఏమి అయ్యింది? ఆ ఉడుతకు రాముని కార్యంలో సహాయం చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది?  
దానికి కారణం ఆ ఉడుత పూర్వజన్మ.  ఆ పూర్వజన్మ కథను అద్భుత రామాయణంలో ప్రస్తావించారు. ఆ కథను ఇప్పుడు మన చూద్దాం!

పూర్వ కాలంలో ఒక బ్రాహ్మణ కుమారుడు కాశీ నగరమునకు వెళ్లి అక్కడ సకల విద్యలు నేర్చుకుని తిరిగి తన స్వగ్రామమునకు చేరుకున్నాడు. అతని పాండిత్యమును నిలిచి వాదములలో ఎవ్వరూ నిలువలేక పోయారు. అతని ఖ్యాతి నలుదిశలా వ్యాపించసాగింది. అతనితో పాటుగా అతని తండ్రిని కూడా ప్రజలు కీర్తించేవారు. అయితే ఆ పొగడ్తలను విన్న అతని తండ్రి ఆ పొగడ్తలను చాలా మర్యాదగా మా అబ్బాయి ఇంకా చిన్న పిల్లవాడు వాడు నేర్చుకోవలసినది చాలా ఉన్నది అని చెప్పే వాడు. ఆ మాటలు ఆ కుమారునికి రుచించలేదు. తన తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తనను అలా చిన్న పిల్లవానిగానే వీచుస్తారు కనుక తన తండ్రి చనిపోతేనే బాగుండు అనుకోవటం మొదలుపెట్టాడు. 
అలా ఆలోచిస్తూ కొంతకాలానికి తానే తన తండ్రిని చంపెయ్యాలి అని అనుకున్నాడు. ఒక రోజు తన తండ్రి ఇంటిలోకి వస్తున్న సమయంలో అతని మీదకు ఒక కర్రను గురిచూసి విసిరాడు. ఆ దెబ్బకు మూర్ఛిల్లిన తండ్రి, కొంతసేపటికి తేరుకుని ఎంత విద్యా, జ్ఞానము ఉన్నా విచక్షణను కోల్పోయిన కారణంగా ఇంత క్రూరమయిన కార్యం చేసాడు కనుక , క్రూరమృగంగా జన్మించమని శపించాడు. కొడుకు తన తరువాతి జన్మలో ఒక పెద్దపులిగా అడవిలో జన్మించాడు 
ఒకసారి తండ్రి బ్రాహ్మణుడు వేరే ఉరికి వెళ్ళవలసి వచ్చి ఆ అడవిమార్గంలో వెళుతూ ఉండగా, పులిగా జన్మించిన కుమారుడు అతనిమీద దాడి చేయబోయాడు. మృగ జన్మలో ఉండికూడా ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తున్నవు కనుక ఎవ్వరికీ హాని చేయని ఉడుత జన్మ ఎత్తు అని మరలా తండ్రి ఆ పులికి శాపం ఇచ్చాడు. అప్పుడు ఆ పులికి గత జన్మ, ఆ జన్మలో సంపాదించుకున్న జ్ఞానము జ్ఞాపకము వచ్చి, తన తండ్రి పాదములపై పడి క్షమాపణ కోరి, ఆ శాపమునకు విమోచనము చెప్పమని అడిగెను. అలా కుమారునిలో పశ్చాత్తాపం గమనించిన బ్రాహ్మణుడు, నీకు ఏమి ఉపకారామ్ జరుగక పోయినా నీవు ఏనాడయితే పక్క వారికి సహాయం చేస్తావో ఆనాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నిన్ను స్పర్శిస్తాడు. ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. 
ఆ రోజు నుండి ఆ ఉడుత అలా సముద్రతీరంలో గడుపుతూ ఉంది. 
తాను చేయగలిగిన అతి చిన్న సహాయం రామునికి అందించింది. ఆ సాయమునకు బదులుగా రాముడు ఆ ఉడుతను పట్టుకున్న కారణంగా ఆ బ్రాహ్మణ కుమారునికి శాపవిమోచనం కలిగింది. 

27, మే 2020, బుధవారం

కశ్యపుడు - కుటుంబం

కశ్యపుని గురించి మనం ఇంతకు  ముందు చాలా సార్లు చెప్పుకున్నాం! నవ బ్రహ్మ లలో ఒకడయిన దక్షుడు తన 13 మంది కుమార్తెలనుకశ్యపునికి ఇచ్చి వివాహం చేసాడు అని కూడా తెలుసుకున్నాం కదా! ఈ 13 మంది దక్షుని కుమార్తెల గురించి అనేక పురాణములలో అనేక రకములుగా చెప్పారు. ఇప్పుడు మనం మహాభారతంలో మరియు భాగవతంలో ఏమి చెప్పారో చూద్దాం!
ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశి కశ్యపుని వంశంలోనివే అని చెప్తారు. అటువంటి విచిత్రమయిన కుటుంబం గురించి తప్పకుండా తెలసుకోవాలి కదా!

 కశ్యపుని భార్యలుగా చెప్పబడిన 13 దక్ష పుత్రికలు, వారివలన కశ్యపునికి కలిగిన సంతానం ఇప్పుడు చూద్దాం!

 మహాభారతం ప్రకారం:
  1. అదితి          : ఆదిత్యులు 
  2. దితి              : దైత్యులు
  3. దనువు         : దానవులు 
  4. కాల              : వినాశనుడు, క్రోధుడు మొదలగు 8 మంది 
  5. అనాయువు : విక్షర, బాల, వీర, వృత్రులు 
  6. సింహిక        : రాహువు 
  7. ముని           : భీమసేనాదులయిన గంధర్వులు 16 మంది 
  8. కపిల           : అమృతం గోగణం, బ్రాహ్మణులు, అప్సరసలు 
  9. వినత          : గరుడ, అనూరుడు 
  10. క్రోధ             : క్రోధవశగణములు 
  11. ప్రాద్ధ           : సిద్దులు 
  12. క్రూర          : సుచంద్రాదులు 
  13. కద్రువ        : నాగులు 

భాగవతం ప్రకారం:
  1. అదితి          : ఆదిత్యులు 
  2. దితి              : దైత్యులు
  3. కాష్ట
  4. దనువు         : దానవులు 
  5. అరిష్ట           : గంధర్వులు 
  6. తామ్ర           : డేగ, గ్రద్ద 
  7. క్రోధవశ        : సర్పములు 
  8. సురస          : యాతుధానులు అనే ఒక రకం పిశాచములు 
  9. సురభి          : సురభులు 
  10. ముని            : అప్సరసలు 
  11. తిమి             : తిమింగలములు మొదలగు జలచరములు 
  12. ఇల              : చెట్లు 
  13. సరమ          : గిట్టలు చీలి ఉండే జంతువులు  

అయితే విచిత్రంగా భాగవతంలో తారక్ష్యుడు అనే వానికి భార్యలుగా వినత, కద్రువలను చెప్పారు. ఈ  వినత, కద్రువలను మహాభారతంలో కశ్యపుని భార్యలుగా చెప్పారు. 

26, మే 2020, మంగళవారం

సుమిత్ర, కైక విష్ణు అంశలకు తల్లులు ఎలా కా గలిగారు?

మనం ఇంతకు ముందు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎందుకు పుట్టాడు అని  చెప్పుకున్నాం  కదా! అయితే ఇంతకూ ముందు చెప్పినట్లు కొన్ని కధలలో అవి చెప్పిన గ్రంధం/పురాణం ను బట్టి ఆ సంఘటనలలో కొంత మేరకు మార్పులు ఉంటాయి.
ఒక జన్మలో ఆ కశ్యపుడు, అదితి లు శ్రీరాముని తన కుమారునిగా పొందుటకు దశరధునిగా మరియు కౌసల్య గా జన్మించారు. ఆ సమయంలో రామునితో పాటుగా శ్రీమహావిష్ణు అంశలు అయిన ఆదిశేషువు, శంఖ , చక్రములు కూడా లక్ష్మణ భరత శత్రుజ్ఞులుగా జన్మించారు. వీరికి తండ్రి దశరధ మహారాజు కాగా లక్ష్మణ, శత్రుజ్ఞులకు తల్లి సుమిత్ర, భరతుని కి తల్లి కైకేయి.
ఇంతకూ ముందు మనం చెప్పుకున్నట్లు శ్రీ మహావిష్ణువును పుత్రునిగా పొందుటకు కశ్యపుడు, అదితి తమ ముందు జన్మలో తపస్సు చేశారు. మరి సుమిత్ర, కైకేయి ఏమి చేశారు? వారికి శంఖం - భరతునిగా, ఆదిశేషుడు - లక్ష్మణుడిగా, చక్రం - శత్రుజ్ఞుడుగా ఎలా జన్మించారు? దానికి కారణం ఏమి అయ్యి ఉంటుంది?

మనం ఇంతకూ ముందు అసూయ గురించి, మదం మరియు క్రోధం గురించి చెప్పుకున్నప్పుడు కశ్యపుని భార్యలు అయిన వినత, కద్రువల మధ్య మాత్సర్యం గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం కదా!
కశ్యపునికి దక్షుడు తన 13 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేసాడు. ఆ 13 మందిలో అదితి, వినత కద్రువ కూడా ఉన్నారు. ఐతే కశ్యప ప్రజాపతి తన భార్యలందరికి సమానమయిన సమయమును కేటాయిస్తూ, ఎవరి సమయమునకు వారి వద్ద ఉండేలా ప్రణాళిక ప్రకారం నడచుకునేవాడు.
అయితే ఒకసారి కశ్యపుడు వినత దగ్గర ఉండగా, కద్రువ కోపంగా వచ్చింది. ఆ సమయంలో కశ్యపుడు కద్రువ వద్ద ఉండాల్సింది. ఆ కోపం మొత్తం వినత మీద తీర్చుకోవటానికి కద్రువ వినతకు శాపం ఇచ్చింది. ఆమె శాపం ప్రకారం వినత గర్భంలో సర్పము, మంట జన్మించాలి. అయితే ఆ శాపం విన్న వినతకు కూడా కోపం వచ్చింది, ఆ కోపంలో కద్రువకు అత్యంత అపకీర్తికలగాలని శపించింది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన తమ అక్క, కశ్యపుని మొదటి భార్య అయిన అదితి వారిని వారించ ప్రయత్నించగా తన కోపం ఇంకా చల్లారని కద్రువ తన భర్త అయినా కశ్యపుడు, వినత మరియు అదితి కూడా మానవ జన్మ ఎత్తవలసినది అని శపించింది.
అయితే ఆ కోపములు శాంతించిన తరువాత వినత కద్రువతు తమ తప్పు తెలుసుకుని, ఆ జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెంది శ్రీమహా విష్ణువు గురించి అద్భుతమయిన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమహా విష్ణువు, వారు మానవ జన్మ ఎత్తిన సమయంలో తానూ స్వయంగా వివిధ రూపములలో వారికి పుత్రునిగా జన్మిస్తాను అని వరం ఇచ్చారు. ఆ వరం ప్రకారమే కౌసల్య (అదితి) కి రాముని(విష్ణువు)గా, సుమిత్ర (వినత) కు లక్ష్మణుడు (సర్పం-ఆదిశేషుడు), శత్రుఘ్నుడు (అగ్ని-చక్రం - సుదర్శనం) గా, కైక (కద్రువ) కు భరతుని (శంఖం) గా జన్మించాడు.  కైక, రాముని వనవారం పంపుట వలన తనకు అనంత కాలంవరకు  తరగని అపకీర్తి ప్రాప్తించింది. 

23, మే 2020, శనివారం

రామ, హనుమల తొలి పరిచయం! హనుమంతుని వేషం!

రామాయణంలో కథను మలుపు తిప్పే ఘట్టములలో ముఖ్యమయినది హనుమంతుడు శ్రీరాముని కలుసుకునే ఘట్టం. 
రాముని, లక్ష్మణుడిని కలుసుకునే సమయమునకు హనుమంతుడు సుగ్రీవుని వద్ద మంత్రిగా ఉన్నాడు. ఆ సమయమునకు సుగ్రీవుడు తన రాజ్యమును కోల్పోయి, తన సొంత అన్నగారయిన వాలితో శత్రుత్వం వలన ప్రాణ భయంతో ప్రపంచం మొత్తం తిరిగి, చివరకు వాలి రాకుండా ఉండగలిగిన ప్రాంతం ఋష్యమూకం అని తెలుసుకుని ఆ పర్వతం మీద నివాసం ఉంటున్నాడు. ఆ సమయమునకు అతనితో హనుమంతుడు, జాంబవంతుడు మొదలయిన ముఖ్యులు ఉన్నారు. 
ఆ సమయంలో ఋష్యమూక పర్వత ప్రాంతంలో కొత్తగా కనిపించిన, ముని వేషదారులయిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవునికి వాలి తనకోసం వారిని పంపించాడేమో అన్న భయం కలిగింది. ఆ భయమును తననుండి దూరం చేయవలసినదిగా తన మంత్రి అయినా హనుమంతుని కోరాడు. దానికోసం హనుమంతుడు ఆ ఇద్దరు ముని వేషదారుల పూర్వాపరముల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆ విధమయిన విషయములు తెలుసుకోవాలంటే ముందు ఆ ఇద్దరికీ  ప్రశ్నలు అడుగుతున్నా వారి మీద నమ్మకం కలగాలి . ఒక వేళ ఆ వచ్చినవారు వాలి తరపున వచ్చి ఉంటే వారిని అక్కడే నిలువరించే సాహసం కలవాడు హనుమంతుడు కనుక సుగ్రీవుడు హనుమంతుడిని ఆ పనికోసం పురమాయించాడు.  
ఇప్పుడు సమస్య హనుమంతుడు ఏ వేషంలో వారి ముందుకు వెళ్ళాలి అని!
అనేక రామాయణములలో ఈ ఘట్టం లో హనుమంతుడు 
  1. భిక్షకుని/ సన్యాసి వేషం  అని  చెప్తారు.  
  2. వటువు / బ్రహ్మచారి వేషం అని చెప్తారు. 
మరి ఇంతకూ హనుమంతుడు ఈ వేషంలో వెళ్ళాడు?
  1. భిక్షకుని/ సన్యాసి వేషం ః ఒకవేళ హనుమంతుడు సన్యాసి వేషంలో వెళ్ళినట్లయితే, కథప్రకారం హనుమంతుడు ఆ సోదరుల వద్దకు చేరగానే వారికి నమస్కరించాడు. ఒక భిక్షకుడు / సన్యాసి గృహస్తుకు నమస్కారం చేయడు. హనుమంతుడు భిక్షకుని/ సన్యాసి వేషం లో కనుక అలా చేస్తే రామ లక్ష్మణులకు ముందుగా అతని మీద అనుమానం కలుగుతుంది. తరువాతి ఘట్టములు మన ఊహకు అందని విధం గ ఉండేవి. సుగ్రీవ రాముల మైత్రి ప్రారంభం కూడా అనుమానాస్పదంగానే ఉండేది కదా! 
  2. వటువు / బ్రహ్మచారి వేషం: ఈ వేషం అయితే ఎవరికీ అయినా నమస్కారం చేయవచ్చు. అంటే కాకుండా ఇతను ఆ ఇద్దరినీ ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనే సంకల్పంతో వచ్చాడు కనుక వటువు వేషం అయితే అతను ఈని ప్రశ్నలు అడిగినా వటువుకు కలిగిన సహజసిద్దమయిన జిజ్ఞాస వలన అడుగుతున్నాడు అని అనుకోవటానికి ఆస్కారం దొరుకుతుంది. 
కనుక హనుమంతుడు తొలిసారిగా రామలక్ష్మణులను కలసినప్పుడు ఆటను బ్రహ్మచారి వేషంలో కలిసాడు. 







22, మే 2020, శుక్రవారం

చిలుక - ఉపకారం

మానవుని జీవితంలో ఒకరికి ఉపకారం చేయటం, మరొకరి సహాయం తీసుకోవటం చాలా సహజం. అయితే మనం ఒకరి వద్ద సహాయం తీసుకుంటే వారి పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయం గురించి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పారు. ఆ కదా ఇప్పుడు మనం చూద్దాం!
ఒకానొక సమయంలో కాశీ దేశంలో ఒక వేటగాడు ఉన్నాడు. ఆ వేటగాడు ఒకసారి వేటకు వెళ్లి ఒక జింకను వెంబడించాడు. ఆ జింకకు గురిపెట్టి ఒక విషపూరితమయిన బాణమును వదిలాడు. ఆ జింక ఆ బాణం నుండి తప్పించుకుని పారిపోయింది. ఆ బాణం తిన్నగా వెళ్లి ఒక పెద్ద చెట్టుకు తగిలింది. చాలా పువ్వులతో, కాయలతో అద్భుతంగా ఉన్న ఆ చెట్టు ఒక్కసారిగా ఆ బాణమునకు ఉన్న విషం కారణంగా నిర్జీవం అయిపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక కాపురం ఉండేది.
ఆ చెట్టు నిర్జీవంగా మారినా, ఆ చిలుకకు ఇప్పుడు ఏ సహాయం చేసే స్థితిలో లేకపోయినా, ఆ చిలుక ఆ చెట్టు తొర్రలోనే నివసిస్తూ ఉంది. ఎండ,  చలి,వర్షం వంటి ఏ పరిస్థితి లోనూ ఆ చిలుక ఆ చెట్టును వదిలిపోలేదు. కారణం ఆ చెట్టు ఇంతకు  ముందు ఆ చిలుకకు ఆశ్రయం కలిగించుట వలన కలిగిన గౌరవ మర్యాదలు. ఏమి జరిగినా తనకు ఎంతో సహాయం చేసిన ఆ చెట్టును వదిలి పోకూడదు అని ఆ చిలుక దృఢసంకల్పం గురించి ఇంద్రునికి తెలిసింది. ఆ చిలుకను పరీక్షిద్దామని ఇంద్రుడు మానవ రూపంలో ఆ చిలుక దగ్గరకు వచ్చాడు.
ఆ చిలుకను చూసి ఇంద్రుడు "ఓ చిలుకా, ఈ అడవిలో ఎన్నో పుష్పించిన, ఫలములు ఉన్న చెట్లు ఉండగా నీవు ఈ ఎండిపోయిన చెట్టు తొర్రలో ఎందుకు ఉంటున్నావు ?" అని అడిగాడు.
ఆ మాటలు విన్న చిలుక "ఓ దేవేంద్రా ! మనకు సహాయం చేసిన వారిని అంటిపెట్టుకుని ఉండుట మన ధర్మం కదా! ఈ వృక్షం ఫలములతో పుష్పములతో ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చింది, ఇప్పుడు దీనికి ఆ శక్తి లేదు, ఆశ్రయం ఇచ్చినప్పుడు తీసుకుని, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం మనకు సహాయం చేసిన వారిని వదలి వెళ్ళిపోతే కృతఘ్నత అవుతుంది కదా!"అని సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న దేవేంద్రుడు, నేను మారువేషంలో వచ్చినా ఈ చిలుక నన్ను గుర్తుపట్టింది అంటే అది దీని పూర్వజన్మ శుభఫలముల వలెనే కనుక తానూ ఆ చిలుకకు సహాయం చేయాలి అని కున్నాడు.
అప్పుడు ఆ చిలుకతో "ఓ చిలుకా! నీవు చెప్పిన ధర్మమునకు నేను ఏంటో సంతోషించాను, నీకు ఏదయినా వరం ఇవ్వాలి అనుకుంటున్నాను నీకు ఏమి కావాలో కోరుకో" అన్నాడు. ఆ మాటలు విన్న చిలుక "ఓ దేవేంద్రా! ఈ వృక్షమునకు తిరిగి పూర్వ స్థితి కలిగించు అని చెప్పింది"
 ఆ మాటలు విన్న దేవేంద్రుడు అత్యంత సంతోషించి ఆ చెట్టు మీద అమృతం చల్లి , ఇంతకూ ముందు ఉన్న వైభవం కంటే ఇంకా ఎక్కువ వైభవమును కలుగజేసాడు.
మనం మనకు సహాయం చేసిన వారికి కష్టం కలిగిన పరిస్థితిలో వారికి తిరిగి మన సహాయమును అందించాలి 

21, మే 2020, గురువారం

ఋచీకుడు - పరశురాముడు - విశ్వామిత్రుడు

ఋచీకుడు నవబ్రహ్మలలో  ఒకరయిన భృగు మహర్షి యొక్క కుమారుడు. ఇతను తన తండ్రి వలెనే  అత్యంత తపస్సంపన్నుడు. ఆ తపస్సులో నిమగ్నమయ్యి ఉండుట వలన ఆటను వివాహం చేసుకోకుండానే వృద్దాప్యమును పొందాడు. అయితే ఒకసారి అతను సత్యవతి అనే రాజకుమారిని చూసి, వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె వివరములు కనుక్కున్నాడు. ఆమె జహ్నుని కులంలోని కుశనాభుని కుమారుడయిన గాధి పుత్రిక. కనుక ముందుగా తన తండ్రి అయినా భృగువు అనుమతి తీసుకుని, మహారాజు అయిన గాధి వద్దకు వెళ్ళి రాకుమార్తెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. ఆ ప్రతిపాదన రాజుకు ఇష్టం కాలేదు.  ముసలివాడయిన ఒక ఋషికి తన కుమార్తెను ఇవ్వటం గాధికి ఇష్టంలేదు. ఆ విషయం తిన్నగా చెబితే ఆ మహర్షి శపిస్తాడేమో అని భయం. అందుకే అతి కష్టసాధ్యమయిన ఒక కోరిక కోరాలి అని తలచి, కన్యాశుల్కం / ఓలి కింద తనకు శరీరం మొత్తం తెల్లగా ఉండి, కేవలం ఒక్క చెవిమాత్రమే నల్లగా ఉండే వెయ్యి గుఱ్ఱములు ఇస్తే ఆమెను వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు.

ఆ మాటలు విన్న  ఋచీకుడు వరుణదేవుని ప్రార్ధించాడు. ఆ ప్రార్థనలకు మెచ్చి వరుణుడు ఋచీకుడు ఎక్కడ కావాలంటే అక్కడే ఆ అశ్వములు వస్తాయి అని చెప్పాడు. ఆ తరువాత ఋచీకుడు గంగానది ఉత్తరపు ఒడ్డున ఆ గుఱ్ఱములు రావాలి అని సంకల్పం చేసాడు. అలా వచ్చిన గుఱ్ఱములను తీసుకుని గాధి కి ఇచ్చి, అతను రాకుమారి సత్యవతిని వివాహం చేసుకున్నాడు.
వీరి వివాహమయిన కొంతకాలానికి ఋచీకునికి సంతానేచ్ఛ కలిగింది. ఆ మాట తన భార్యకి చెప్పగా, ఆ సత్యవతి తన తండ్రికి వంశోద్ధారకుడు లేదు కనుక తనతో పాటు తన తల్లి కోసం కూడా పుత్ర సంతానం కలిగేలా చూడామణి ప్రార్ధించింది. ఆ ప్రార్ధన విన్న ఋచీకుడు ఒక బ్రాహ్మణత్వం కలిగిన ప్రసాదమును, ఒక క్షత్రియత్వం కలిగిన ప్రసాదమును ఇచ్చి బ్రాహ్మణ ప్రసాదమును సత్యవతి ని స్వీకరించమని, క్షత్రీయ ప్రసాదమును ఆమె తల్లిని స్వీకరించమని , ఆ తరువాత వారు ఋతుస్నాతలు అయినా సమయంలో సత్యవతిని మేడిచెట్టును, ఆమె తల్లిని రావి చెట్టును కౌగలించుకోమని చెప్పాడు.
ఆ సమయం వచ్చినప్పుడు సత్యవతి , ఆమె తల్లి ఇద్దరూ తమతమ ప్రసాదమును, వారు కౌగలించుకోవలసిన చెట్టును తారుమారు చేశారు. ఆ విషయం గమనించిన ఋచీకుడు సత్యవతి వద్దకు వచ్చి బ్రాహ్మణుడయిన తనకు క్షత్రియ అంశతో, గాధి మహారాజుకు బ్రాహ్మణ అంశతో ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న సత్యవతి బాధపడి, తనకు సద్బ్రాహ్మణుడు కుమారునిగా ప్రసాదించమని అడిగింది. అప్పుడు ఋచీకుడు తన తపో శక్తిని ప్రయోగించి, తమకు ఒక బ్రాహ్మణుడే కుమారునిగా పుట్టేలా, మనుమడు మాత్రం క్షత్రీయ లక్షణములతో పుట్టేలాగా మార్చాడు. ఆ విధంగా ఋచీకుడు, సత్యవంతులకు పుట్టిన పుత్రుడు జమదగ్ని, వారి మనుమడు క్షత్రియ లక్షణములు కలిగిన పరశురాముడు.
మహారాజు గాధికి బ్రాహ్మణ లక్షణములతో జన్మించిన వాడు విశ్వామిత్రుడు.

20, మే 2020, బుధవారం

సుందోపసుందులు

పూర్వం దైత్య వంశంలో నికుంభుడు అనే దైత్యునకు సుందుడు, ఉపసుందుడు  అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారిద్దరూ అత్యంత స్నేహభావంతో పెరిగి పెద్దవారయ్యారు. ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఒకసారి ఇద్దరూ  కలిసి అనేక సంవత్సరములు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు. వారిని ఇంద్రుడు అనేక రకములుగా పరీక్షించినా వారు తపస్సును మానలేదు. ఇక తప్పని పరిస్థితిలో బ్రహ్మదేవుడు వారు ముందు ప్రత్యక్షం అయ్యి వరమును కోరుకొమ్మని అడిగాడు.
అందరు దైత్యులు లాగానే మరణం లేని వరం కోరుకున్నాడు. కానీ ఆ వరం ఇవ్వటం సాధ్యంకాదు అని బ్రహ్మదేవుడు చెప్పిన తరువాత, వారు ఒక విచిత్రమయిన కోరిక కోరారు.
వారు కోరిన వరం , వారు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగేలాగా,అన్ని మంత్రములు, మాయలు వారి వశంలో ఉండేలాగా, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలిగేలాగా, వారిని యుద్ధ రంగంలో ఎవరూ ఓడించకుండా, ఒకవేళ వారిద్దరూ ఒకరితో ఒకరు గొడవపడి యుద్ధం చేసుకుంటే మాత్రమే చనిపోయేలాగా వారు వరం కోరుకున్నారు.
బ్రహ్మదేవుడు తధాస్తు అని దీవించి వారికి ఆ వరములు ఇచ్చాడు.
వర గర్వితులయిన దైత్యులు అన్ని లోకముల మీద దండెత్తి వానిని స్వాధీన పరుచుకోవటం మొదలు పెట్టారు. వీరి ఆగడాలు సహించలేని దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, బ్రహ్మదేవుడు అలోచించి, విశ్వకర్మను పిలిపించాడు. విశ్వకర్మ చేత తిలోత్తమ అనే అప్సరసను సృజింపజేసి ఆమె ను ఆ దైత్యుల వద్దకు పంపారు.
ఆ సుందోపసుందులు ఆమెను చూసి మోహించి, తనకు మాత్రమే సొంతం, తనకు మాత్రమే సొంతం అని గొడవ పడి, వారిలో వారే  యుద్ధం చేసుకుని , చివరకు మరణించారు.  

19, మే 2020, మంగళవారం

పినాకం - శివుని విల్లు

శివుని ధనస్సును పినాకం అంటారు. దాని వల్లనే శివునికి పినాక పాణి అని పేరు వచ్చింది. అయితే ఆ పినాకమును ఎవరు తయారుచేసారు ? దానిని శివునకు ఎవరు ఇచ్చారు? దీనికి సమాధానం స్వయంగా శివుడే పార్వతికి చెప్పిన ఘట్టం మనకు మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కనిపిస్తుంది.
మనం ఇంతకూ ముందు కల్పములు మరియు యుగములు గురించి చెప్పుకున్నాం కదా! వాని లోని మొదటి కల్పంలోని మొదటి కృతయుగంలో కణ్వుడు అనే మహర్షి మహానిష్ఠ కలిగి అత్యంత కఠినమయిన తపస్సు చేసాడు. ఆటను తపస్సులో లీనమయ్యి ఉండగా, అతని శరీరంమీద పెద్ద పుట్టలు ఏర్పడ్డాయి. పుట్టమీద ఒక వెదురు మొక్క జన్మించినది. ఆ వెదురు మొక్క సహజంగా కాక అతని తపస్సు వలె అత్యంత గొప్పగా పెరిగింది. దాని పొడవు, వెడల్పు చాలా ఎక్కువగా పెరిగాయి. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వరములను ఇచ్చాడు.
 ఆ వెదురుని బ్రహ్మదేవుడు తనతో తీసుకుని వెళ్ళాడు. దానిని విశ్వకర్మకు ఇచ్చి రెండు విల్లులు చేయమన్నాడు. అలా తయారయిన విల్లులే శివుని చేతిలో ఉండే పినాకం, ఇంకా శ్రీ మహా విష్ణువు చేతిలో ఉండే శారఙము. ఆ రెండు ధనస్సులే కాక మిగిలిన చిన్న ముక్కతో మరొక విల్లును తయారుచేసాడు విశ్వకర్మ. ఆ మూడవ ధనస్సే అర్జునుని చేతికి వచ్చి చేరిన గాండీవము.

18, మే 2020, సోమవారం

విష్ణుమూర్తికి దాస్యం చేయటానికే శివుడు హనుమంతునిగా పుట్టాడా?

మనం ఇంతకుముందు హనుమంతుడు శివుని అంశ ,వాయువు పుత్రుడు ఎలా అయ్యాడు అని చెప్పుకున్నాం! దానితో పాటు దశరధుని పుత్రకామేష్టి ఫలమయిన పాయసం కారణంగా హనుమానితుడు జన్మించాడు అనే విషయం కూడా చెప్పుకున్నాం!  మరి అసలు హనుమంతుని జన్మకు సార్ధకత అతని దాస్యభక్తి అని మనకు అందరికి తెలుసు కదా! మరి విష్ణుమూర్తికి దాస్యం చేయటానికే శివుడు హనుమంతునిగా పుట్టాడా?
మన పురాణములలో ఒక కథాప్రకారం అవును అనే చెప్పుకోవాలి మరి. ఆ కధ ఏమిటో చూద్దామా!

పుర్వకాలంలో గార్దభనిస్వనుడు అనే ఒక పరమశివ భక్తుడు ఉండేవాడు. అయితే ఎల్లప్పుడూ శ్రీహరిని ద్వేషిస్తూ ఉండేవాడు. శివునికి భక్తుడు అవ్వటం వలన శివునికొరకు  అత్యంత ఘోరమయిన తపస్సు చేసి తనకు జాగ్రత్తు, సుషుప్తి మరియు స్వప్నావస్థలలో ఎవ్వరి చేత మరణం రాకుండా వరం సంపాదించాడు. ఆ వర గర్వంతో  విష్ణుభక్తులను హింసించటం మొదలుపెట్టాడు.    అలాగే  దేవతలను కూడా హింసించాడు. అతని బాధలు పడలేక దేవతలు, మునులు బ్రహ్మదగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ వారిని తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. వారి బాధలని ఆలకించిన శ్రీమహావిష్ణువు వారిని ఓదార్చి, ఆ రాక్షసుడిని చంపి, అందరికి శాంతిని కలిగిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట విన్న శివుడు విష్ణువు వద్దకు వచ్చి, అతను గార్దభనిస్వనుని కి ఇచ్చిన వరముల గురించి చెప్పి, అతనిని నిర్జించుట అసాధ్యం అని చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీహరి నవ్వి పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదు కదా! అలాగే గార్దభనిస్వనుడు కూడా మరణిస్తాడు అని చెప్పారు. శ్రీ హరి చెప్తున్న ఆ మాటలు విన్న శివునికి కుతూహలము పెరిగి, ఒకవేళ శ్రీ మహావిష్ణువు కనుక ఆ గార్దభనిస్వనుడిని సంహరించినట్లయితే తాను స్వయంగా శ్రీమహా విష్ణువుకు దాస్యం చేస్తాను అని పలికారు.
శివుని మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వారు.
తరువాత అతను విశ్వమోహన సౌందర్యవతియైన జగన్మోహిని రూపందాల్చి ఆ గార్దభనిస్వనుడు నివసించే అంతఃపురం దగ్గరకు వెళ్లి మధురస్వరంతో సామవేద గానం ప్రారంభించారు. ఆ అద్భుత గానమునకు ఆకర్షితుడయ్యి గార్దభనిస్వనుడు అంతఃపురంనుండి బయటకు వచ్చి ఆ జగజన్మోహిని సౌందర్యం చుసి మోహితుడయ్యి  ఆమె ఎవరు? ఎక్కడినుండి వచ్చింది? మొదలయినవి వివరములు అడిగాడు. తరువాత అతని గురించి గొప్పలు చెప్పుకున్నాడు, అలా చెప్పుకుని ఆమెను తనని వివాహం చేసుకోమంటూ ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదనను వినిన మోహిని,  ఆమెను నాట్యగానములలో  ఓడించితే అలాగే చేద్దాం అని అతనికి సవాలు చేసింది. ఆ సవాలని స్వీకరించిన అతను అలా  నాట్యం చేస్తున్న మోహినిని చూసి మైమరిచిపోసాగాడు. ఆ అదును చూసుకుని మోహిని అతనికి సురాపానమును చేతికి అందించింది. ఆమెమీద వ్యామోహం తో ఉన్న గార్దభనిస్వనుడు దానిని  తాగి జాగ్రదావస్థ కాక స్వప్నావస్తా కాక ఉన్న సమయంలో జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు వృకనారాయణావతారం ధరించి గార్దభనిస్వనుడిని తన వాడి అయిన గోళ్ళతో చంపివేసాడు.

ఆ విషయం తెలుసుకున్న శివుడు శ్రీమహావిష్ణువు వద్దకు వచ్చి తాను దాస్యమును స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నాను అని తెలుపగా దానికి శ్రీమహావిష్ణువు ఆ దాస్యమునకు సరిఅయిన సమయం అప్పుడు కాదని, ద్వాపర యుగంలో  తాను శ్రీరామావతార సమయంలో ఆ ముచ్చట తీర్చుకుందాం అని చెప్పారు.
తరువాత శ్రీహరి తన రామావతారమును గురించి, ఆ సమయంలో అతనికి శివుని అవసరం గురించి ఇలా చెప్పారు.
రామావతారంలో నా శక్తి అయిన లక్ష్మి అపహరించబడినప్పుడు, నేను నా అవతార కార్యమును పూర్తిగావించుటకు నాకు తోడుగా ఓ మహాదేవా! తమరు ఆదిశక్తి సహితముగా నా అంశను కూడా పొంది , ఆ కార్యమును సాధించుటకు నాకు నవ్యశక్తి ని ప్రసాదించి, నన్ను పరిపూర్ణునిగా చేయండి. 

17, మే 2020, ఆదివారం

సువర్చల అప్సరస

ఒకసారి బ్రహ్మలోకంలో అప్సరసలు నాట్యం చేస్తున్న సమయంలో, సువర్చల అనే ఒక అప్సరస సరిగా నాట్యం చేయలేదు. దానికి కోపగించిన బ్రహ్మదేవుడు ఆమెకు గ్రద్ద కమ్మని శాపం ఇచ్చారు. తాను చేసిన తప్పుకు చింతించిన సువర్చల తనకు శాప విమోచనం కలిగే మార్గం చెప్పమని కోరుకున్నది. ఆ ప్రార్ధన విన్న బ్రహ్మదేవుడు శాంతించి, ద్వాపరయుగంలో దశరధ మహారాజు పుత్రకామేష్టి చేసినప్పుడు, ఫలంగా దొరికిన పాయసము ను తాకగానే ఆమెకు శాప విమోచనం దొరుకుతుంది అని చెప్పారు. ఆ రోజునుండి ఆమె గ్రద్దగా మారి విమోచనం కలిగే రోజు కోసం ఎదురుచూస్తూ ఉంది. 
దశరధుని పుత్రకామేష్టి జరిగినప్పుడు ఆమె కైకేయి పాయసం పాత్ర తీసుకుని వెళ్లింది.  ఆమెకు శాప విమోచనం జరిగింది. 

హనుమంతుడు- దశరధుని పుత్రకామేష్టి

మనం ఇంతకు ముందు హనుమంతుడు శివుని అంశ , వాయుపుత్రుడు ఒకేసారి ఎలా అయ్యాడు అని తెలుసుకున్నాం కదా! అలాగే హనుమంతుని జన్మకు సంబందించిన మరొక విచిత్ర మయిన విషయం ఇప్పుడు తెలుసుకుందాం! ఈ విచిత్రమయిన సంఘటన ఆనందరామాయణం లో చెప్పారు. మూల వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టం చెప్పలేదు.

దశరథమహారాజు తనకు పుత్రులు కలగాలని, తన భార్యలతో కలిసి ఋష్యశృంగుని అద్వర్యం లో పుత్రకామేష్టి చేశారు. ఆ యాగంలో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యి దశరధుని చేతికి ఒక కలశమును అందించారు. ఆ కలశంలో ఉన్న పాయసమును దశరధుడు తన ముగ్గురు భార్యలకు సమానంగా పంచాడు. అప్పుడు దశరధుని మూడవ భార్య అయినా కైక చేతిలోని పాయసం నిండిన పాత్రను ఒక గద్ద తన ముక్కుతో పట్టుకుని వేగంగా వెళ్లి పోయింది. ఆ హఠాత్ సంఘటనతో దిగులు చెందిన కైకకు దశరధుని మిగిలిన భార్యలు అయినా సుమిత్ర, కౌసల్య తమతమ పాయసమునందలి కొంత కొంత భాగములు ఇచ్చారు.
అలా ఆ పాయసపాత్రను పట్టుకుని వేగంగా పైకి ఎగిరిన గ్రద్ద ఆ పాయసము తనను తాకగానే ఒక అప్సరసగా మారి వెళ్లి పోయింది. అలా అప్సరసగా మారిన గ్రద్ద వదిలేసిన ఆ పాయసపాత్రను
వాయుదేవుడు అంజనాద్రి పై పుత్రుని కొరకు పరమ శివుని ప్రార్ధిస్తున్న అంజనాదేవి వొడిలో పడేవిధంగా చేసాడు. పరమేశ్వర ప్రసాదంగా భావించి అంజనాదేవి దానిని స్వీకరించి, ఏకాదశమ రుద్రుని అంశగా శ్రీ హనుమంతునికి జన్మను ఇచ్చింది.



16, మే 2020, శనివారం

తిలోత్తమ

మనకు పురాణములలో అనేక సందర్భాలలో అప్సరసల ప్రస్తావన వస్తుంది. ఇంతకు ముందు మనం 31 మంది అప్సరసల పేర్లు చెప్పుకున్నాం కదా!   వారిలో ఒకరు తిలోత్తమ.
ఇప్పుడు ఆ తిలోత్తమ జన్మకు కారణం తెలుసుకుందాం!

ఈ సంఘటనను మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పారు.  ఆ ఘట్టం ప్రకారం తిలోత్తమను సృష్టించిన వాడు విశ్వకర్మ. పుర్వం సుందుడు, ఉపసుందుడు అనే రాక్షసులు, బ్రాహామా వర గర్వితులయ్యి సకల లోకములను భాదించుతూ ఉండగా, వారిని సంహరించాలంటే ఉన్న ఒకే ఒక మార్గం వారిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి, యుద్ధం చేసి చనిపోవటం మాత్రమే మార్గం అని గ్రహించి, ఇద్దరు వీరుల మధ్య కలహం మొదలు అవ్వాలి అంటే దానికి కారణం ధనం లేదా మగువ మాత్రమే అయ్యి ఉండాలి అని భావించారు. వారికి ఇంతకూ మునుపే అనేకములయిన ధనరాశులు ఉన్నాయి కనుకకేవలం స్త్రీ మాత్రమే ఆ కార్యమును సాధించగలడు అని భావించి, ఆ కార్యమునకు సరిపోయే విధంగా ఒక అద్భుతమయిన సౌందయము కల అప్సరసను సృష్టించవలసినది గా బ్రహ్మ విశ్వకర్మను కోరాడు.
అటువంటి అద్భుతమయిన స్త్రీని తయారు చేయటానికి విశ్వకర్మ సకల సృష్టి లోని అమూల్యములు, అద్భుతములు అయిన అందములను చిన్న నువ్వుల పరిమాణంలో పేర్చి, అత్యంత సుందరమయిన స్త్రీని మలిచాడు. దానికి ప్రాణం పోసాడు. అలా ఉద్భవించిన స్త్రీకి తిలోత్తమ అనే పేరు పెట్టారు. 

15, మే 2020, శుక్రవారం

అఙాతవాసం - పాండవుల పేర్లు

మహాభారతం లోని ముఖ్య మయిన ఘట్టములలో ఒకటి పాండవుల వనవాసం, వారి అఙాతవాసం. మరి పాండవులు వారి అఙాతవాసంను విరాటరాజు కొలువులో గడిపారు. మరి అక్కడ వారు ఏ పేర్లతో, ఏమి పని చేస్తూ గడిపారు? ఇప్పుడు తెలుసుకుందాం!

ధర్మరాజు - కంకుభట్టు అనే పేరుతో రాజా ఆస్థానంలోని ప్రవేశించాడు. రాజు కు మానసిక ఉల్లాసం కలిగించే శాస్త్ర చర్చలు చేయటం, స్నేహపూర్వకమయిన జూదం ఆడటం అతను చేస్తూ ఉంటాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు  జయుడు.
భీముడు- వలలుడు అనే పేరుతో ఒక వంటవానిగా విరాట రాజు వద్ద చేరాడు. ఇతని వంట అద్భుతం.  వంట మాత్రమే కాక మల్ల విద్య కౌశలం కూడా ప్రదర్శించే వాడు.  అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయంతుడు.
అర్జునుడు- బృహన్నల అంటే పేడి వానిగా విరాటుని ఆశ్రయించాడు. ఇతను స్వర్గంలో ఉన్న సమయంలో ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇలా వాడుకున్నాడు. అంతే కాక స్వర్గంలో ఉన్న సమయంలో నేర్చుకున్న సంగీత, నృత్య శాస్త్రములను అంతఃపురంలోని కన్యలకు నేర్పించేవాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు విజయుడు.
నకులుడు - దామగ్రంథి అనే పేరుతో అశ్వశిక్షకుడుగా అక్కడ చేరాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు విజయత్సేనుడు
సహదేవుడు - తంత్రీపాలుడు అనే పేరు తో గోసంరక్షకుడుగా చేరాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయద్బలుడు.
ద్రౌపది -  మాలిని అనే పేరుతో విరాటుని అంతఃపురంలో అతని రాణి సుధేష్ణ వద్ద సైరంద్రి గా ఉన్నది. అయితే పాండవులకు మరొక పేరూరు ఉన్నట్లు, వారు ద్రౌపదికి మరో పేరు సంకేతనామం గా పెట్టుకొనలేదు.  

14, మే 2020, గురువారం

ధర్మరాజు -- 16 కళలు

మనకు ఉన్న ముఖ్యమయిన గ్రంధాలు రెండు. రామాయణం, మహాభారతం. రామాయణం సూర్య వంశంలో జన్మించిన రాముని యొక్క చరితము. కానీ మహాభారతంలో చంద్ర వంశం గురించి చెప్పినా, ఏ ఒక్కరి గురించి మాత్రమే చెప్పిన కధ కాదు. కానీ ఈ కధలో ప్రధానుడు, ఇప్పటి మన భాషలో "హీరో" గా పిలువటానికి అర్హత  గలిగిన వాడు పాండవుల లో పెద్దవాడు అయిన ధర్మరాజు.
ఇంతకు  ముందు మనం రాముని గురించి  పదహారు కళల (లక్షణాల )గురించి చెప్పుకున్నాం కదా! అలాగే ధర్మ రాజు ని చంద్రునిలా  పదహారు కళలు కలిగిన వానిగా చెప్పిన సందర్భం మహాభారతం లో ఒకచోట కనిపిస్తుంది . అది విరాట పర్వం మొదటి భాగంలో, వారు విరాటుని కొలువులో పనిచేయవలసి ఉంటుంది  అని నిర్ణయించుకున్న తరువాత తన తమ్ములు ధర్మరాజు గురించి చెప్పిన సందర్భంలో ఈ పద్యం చెప్తారు.

సీ : మహనీయ మూర్తియు, మానవైభవమును, 
సౌకుమార్యంబును,సరసతయును  
మార్దవంబు, బ్రభుత్వ మహిమయు, నపగత 
కల్మషత్వంబును, గౌరవంబు 
శాంతియు, దాంతియు, జాగంబు, భోగంబు 
గారుణ్యమును, సత్యసారతయును 
ధర్మమయ క్రియా తత్పరత్వంబును 
గీర్తి, ధనార్జన క్రీడానంబు 

ఆ : గలిగి జనుల నేల గాని, యెన్నందును 
నొరులఁ గొల్చి తిరుగ వెరవు లేని 
యట్టి నీవు విరటు నెట్టి చందంబున 
ననుచరించు వాడ వధిప ! చెపుమ !

భావం : ఓ ధర్మరాజా! నీకు చక్కని రూపం, అభిమాన వైభవం, సౌకుమార్యం, సరసత, మృదుత్వం,ప్రాభవం, నిష్కల్మషత్వం, గౌరవం, శాంతి, దాంతి,  త్యాగం, భోగం, దయ , సత్యం, ధార్మిక క్రియాశీలత, కీర్తి , ధనము అనేవి నీకు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఇతరులను సేవించే నేర్పు నీకు లేదు, (ఇప్పటివరకు అటువంటి అవసరం నీకు రాలేదు), అటువంటి నీవు సామాన్యుడు అయిన విరాటుని ఎలా సేవించగలవు? చెప్పు!

13, మే 2020, బుధవారం

మన్మదావస్థలు

అలంకార శాస్త్రములను అనుసరించి మన్మదావస్థలు దశ విధములు. వాని గురించి చెప్పే శ్లోకం చూద్దామా !
చక్షుఃప్రీతిః ప్రధమం చింతాసంఘస్తతో ధ  సంకల్పః
నిద్రాచ్ఛేదస్తనుతా విషయనివృత్తి స్త్రపానాశః
ఉన్మాదో మూర్ఛా మృతిరిత్యతే స్మరదశా దశైవ న్యుః

భావం ః కనులతో చూచుట వలన చక్షుప్రీతి, ఆలోచనలలో కలిసినట్లు ఉహించుకొనుట, కలవాలి అనే సంకల్పం, నిద్ర లేకుండా జాగారం, శరీరం కృశించుట, ఆరాటం, సిగ్గును కూడా మరచి ప్రవర్తించుట, ఉన్మాదం, మూర్ఛ మరియు చివరికి చనిపోవుట అనే ఈ పది లక్షణములను మన్మదావస్థలుగా ప్రబంధములలో నిర్వచించారు. 

11, మే 2020, సోమవారం

సాక్షులు

మనం ఏదయినా న్యాయసంబంధమయిన విషయములు చర్చించవలసి వస్తే, ఆ సమయంలో ముఖ్యంగా పరిగణలోనికి తీసుకునేది సాక్ష్యుల వాంగ్మూలములు. మరి మన శాస్త్రములలో చెప్పిన సాక్ష్యములు ఎన్ని రకములు  ఏమిటి? ఇప్పుడు చూద్దామా!

మన శాస్త్రములు చెప్పినదాని ప్రకారం సాక్ష్యములు పదకొండు రకములు.  ఈ పదకొండు రకముల సాక్షులను తిరిగి రెండు రకములుగా విభజించారు. 

కృతసాక్ష్యులు : ముందుగానే నిర్ణయించబడిన సాక్ష్యులు. వీరు ఐదు రకములు. 
  • లిఖితుడు
  • స్మారితుడు
  • యదృచ్చాభిజ్ఞుడు
  • గూడుడు 
  • ఉత్తరుడు 
అకృతసాక్ష్యులు: ముందుగా నిర్ణయించ బడని సాక్ష్యులు. వీరు ఆరుగురు 

  • గ్రామస్థులు 
  • ప్రాడ్వివాక 
  • లేఖకసభ్యులు 
  • రాజు 
  • కార్యాధికారి 
  • వాదిచే పంపబడిన వాడు

7, మే 2020, గురువారం

వసిష్టుడు- పుత్రశోకం

మానవుని జీవితంలో అత్యంత బాధాకరమయినవి అష్ట కష్టములు అని చెప్పుకున్నాం కదా! అయితే వాతన్నేంటిని మించిన అత్యంత భాదాకరామయిన విషయం తన సొంత బిడ్డలను పోగొట్టుకోవటం. ఒక బిడ్డను పోగొట్టుకుంటేనే అంత కష్టం అయితే, వందమంది కొడుకులను ఒకేరోజు పోగొట్టుకుంటే?? ఆ బాధ ఎంత వర్ణనాతీతమో కదా!!!
ఇంతకీ ఇంతటి కష్టం ఎవరికీ వచ్చింది? ఆ భాదను వారు ఎలా భరించారు? ఆ బాధనుండి ఎలా బయట పడ్డారు? ఈ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం!

వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ల మధ్య స్పర్ధలు పెరుగుతున్న సమయంలో శాపవశాత్తూ రాక్షసుడిగా మారిన కల్మాషపాదుడు వశిష్ఠుని పుత్రులు శక్తి మొదలయిన వారు అయిన వందమందిని ఒకే రోజు చంపేశాడు. దానికి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు ఏం  చేసాడు?
తన తపో బలం ఏంటో ఉన్నా , ఆ కల్మాషపాదుడిని శపించలేదు, తన పుత్రులను బ్రతికించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. విధిని తప్పించుకొనుట సాధ్యం కాదు అని అనుకున్నాడు. కానీ తన పుత్రులు మరణించిన భాధను భరించలేక ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు మొత్తంగా ఐదు సార్లు ఆ ప్రయత్నం చేసాడు. ఎంత మహర్షి అయినా, బ్రహ్మర్షి అయినా పుత్ర వియోగ బాధ ను భరించుట కటం కదా!

మరి ఇంతకీ అతను ఆ బాధనుండి ఎలా బయట పడ్డాడో తెలుసా? అతను  అత్యంత బాధాకరమయిన స్థితి లో ఉన్న వశిష్ఠుడు తన ఆశ్రమములో గర్భంతో ఉన్న శక్తి భార్య అయిన తన కోడలిని చూసాడు. ఆమె పేరు అదృశ్యంతి. ఆమె గర్భంలో ఉన్న శిశువు వేదములు చదవటం అతనికి వినిపించింది. ఆ కడుపులోని బిడ్డ స్వరం చక్కని శక్తి మహర్షి స్వరంలా వినిపించ సాగింది. ఆ బిడ్డ కడుపులో ఉండగా శక్తి ఉచ్చరించే వేదములను  ఆ బిడ్డ విన్నాడు. ఇప్పుడు అదే వేదములను చక్కని స్వరంతో ఉచ్చరిస్తున్నాడు. ఆ చక్కని స్వరం విన్న వశిష్ఠుని మనస్సు  ఊరట చెందింది.

అత్యంత బాధ కలిగినప్పుడు సామాన్య మానవుని నుండి మహర్షి, బ్రహ్మర్షులయినా ఒకేరకంగా ఆలోచిస్తారు. కానీ ఆ బాధను మరచిపోయే మార్గం తెలుసుకుని, ఆ కారణంకోసం తన జీవితాలను అంకితం చేస్తే వారు అత్యంత శక్తివంతులు అవుతారు.








6, మే 2020, బుధవారం

లంక- స్వర్ణలంక

 ఇంతకు ముందు ఎన్నిసార్లు మనం లంక  గురించి చెప్పుకున్న అది స్వర్ణ లంక  అని చెప్పుకున్నాం కదా! ఇంతకీ అది స్వర్ణ లంక ఎందుకు అయ్యింది? ఆ లంక త్రికూటాచల పర్వతంలో ఉన్నది అని చెప్తారు కదా! ఇంతకీ ఆ త్రికూటాచల పర్వతం ఏమిటి?

దీని గురించి ఆనంద రామాయణంలో సారకాండ - చతుర్దాశ్వాసం లో చెప్పారు.

మనం ఇంతకు  ముందు టపా లలో మహాభారతములోని ఆదిపర్వంలో గరుడుడు - ఆకలి  గురించి చెప్పుకున్నాం కదా!
ఆనంద రామాయణం ప్రకారం ఇలాంటి సందర్భం గురించి చెప్పారు కానీ అది  గజేంద్ర మోక్షం తరువాత  జరిగిన సంఘటన వలే చెప్పారు.
శ్రీ హరి గజేంద్రమునకు ముక్తిని ప్రసాదించిన తరువాత వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ గరుడుడు తిరిగి ఆ గజేంద్రమోక్షం జరిగిన ప్రదేశమునకు వచ్చాడు. అక్కడ ఉన్న ఏనుగు (ఆనంద రామాయణం ప్రకారం ఏనుగు కు అక్కడే మోక్షం ప్రాప్తించింది ) మరియు మొసలి కళేబరములు ఆరగించటానికి గరుడుడు తిరిగి వచ్చాడు. అతను వచ్చే సమయమునకు అక్కడ ఒక గ్రద్ద ఉంది దాని పేరు భృభంగం. గరుడుడు దానిని కూడా చంపి ఆ గ్రద్దను ఒక కాలితో, ఏనుగు మరియు మొసలిని మరొక కాలితో పట్టుకుని పైకి ఎగిరాడు. కూర్చొని తినటానికి మంచి స్థానం కోసం చూస్తుండగా, ఒక బంగారమును స్రవించే జంబూ వృక్షం యొక్క కొమ్మపై కూర్చునే ప్రయత్నం చేసాడు. కానీ ఆ కొమ్మ విరిగింది. అలా విరిగిన కొమ్మకు వాలఖిల్యులు ఉన్నారు, కనుక ముక్కుతో ఆ కొమ్మను పట్టుకుని ఎక్కడికి వెళ్లాలో తెలియక గంధమాధన పర్వతం మీద ఉన్న తన తండ్రి కశ్యపుని దగ్గరకు వెళ్ళి, వాలఖిల్యులను అక్కడ విడచి,  తనకు ఎవ్వరు నివశించని ఒక ప్రదేశం గురించి చెప్పమని అడిగాడు. దానికి సమాధానంగా తన తండ్రి కశ్యపుడు వంద యోజనముల సముద్రమునకు అవతల ఒక లంక ఉన్నది అని  అక్కడ ఎవ్వరూ  నివాసం ఉండరు కనుక అక్కడకు వెళ్లి  తినవచ్చును అని చెప్పాడు.   ఆ లంకకు చేరుకున్న గరుడుడు మూడు జంతువులను అక్కడే తిన్నాడు. అలా తిన్న సమయంలో ఆ మూడు జంతువుల ఎముకలు మూడు కొండలుగా ఏర్పడ్డాయి. ఆ మూడు కొండలను త్రికూటములు అంటారు. అంతే  కాకుండా అతను తీసుకు వచ్చిన  జంబూ వృక్ష కొమ్మను కూడా అక్కడే వదిలాడు. కనుక ఆ కొమ్మ నుండి స్రవించిన స్వర్ణం అక్కడ ఉన్న మూడు కొండలలో చేరి అవి గట్టిపడి, అత్యంత దృఢమయిన త్రికూటములుగా ఏర్పడ్డాయి. అప్పటి నుండి ఆ లంకను స్వర్ణ లంక / త్రికూటాచలం అని అంటారు.
కాల క్రమం లో ఈ లంకను రాక్షసులు , తరువాత ధనాధిపతి కుబేరుడు, ఆతరువాత రావణుడు స్వాధీనం చేసుకున్నారు.

5, మే 2020, మంగళవారం

షట్చక్రవర్తులు

మన పురాణములలో అత్యంత ముఖ్యమయిన రాజులు, చక్రవర్తులు ఆరుగురు ఉన్నారు అని చెప్తారు. ఆ ఆరుగురిని గురించి చెప్పే శ్లోకం కింద మీకోసం!

హరిశ్చంద్రో నలోరాజా పురుకుత్సః పురూరవాః
సగరః కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తిన ః

హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు మరియు కార్తవీర్యార్జునుడు అనే ఈ ఆరుగురిని కలిపి షట్చక్రవర్తులు అంటారు.


4, మే 2020, సోమవారం

గరుడుడు-- ఆకలి

గరుడుడు తన తల్లిని దాస్యం నుండి విముక్తురాలిని చేయుటకు బయలుదేరాడు. తన తల్లి ఆశీర్వాదం తర్వాత తన తండ్రి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. తల్లి చెప్పిన నిషాదులని తినిన తర్వాత కూడా అతని ఆకలి తీరలేదు కనుక తినుటకు ఏమయినా దొరుకుతుందా అని ఆటను తండ్రిని ఆడిగాడు. అప్పుడు కశ్యపుడు విభావసుడు - సుప్రతీకుడు అనే అన్నదమ్ముల గురించి, వారు ఈ జన్మలో ఏనుగు, తాబేలు గా పుట్టుట గురించి చెప్పి వానిని తినమని చెప్పాడు. అవి ఉండే చోటు గురించి తెలుసుకుని గరుడుడు అక్కడికి వెళ్లి ఆ రెండింటిని తన రెండు కళ్ళతో పట్టుకుని అత్యంత  వేగంగా పైకి ఎగిరాడు.
ఎక్కడయినా కూర్చుని తినాలని ఒక స్థలం కోసం వెతుకుతూ  అలంబం అనే శిఖరం ఉన్న క్షేత్రానికి చేరుకున్నాడు. ఆ క్షేత్రం లో రోహిణము అనే వృక్షం అతనికి ఆతిధ్యం ఇవ్వటానికి సిద్ధపడి తన అతిపెద్ద కొమ్మను అతని కోసం చూపింది. దాని మీద గరుడుడు కూర్చోగానే ఆ కొమ్మ విరిగింది. అలా విరిగిన ఆ కొమ్మకు వాలఖిల్యులు ఉండుట గమనించిన గరుడుడు ఆ కొమ్మను తన ముక్కుతో పట్టుకున్నాడు. అలా రెండు కాళ్లతో ఏనుగు,  తాబేలు మరియు ముక్కుతో ఆ విరిగిన కొమ్మను తీసుకుని తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాడు. కశ్యప ప్రజాపతి గరుడుని నోటిలో ఉన్న కొమ్మను దానికి వేళ్ళాడుతున్న వాలఖిల్యులను చూసి వారికి నమస్కరించగా వారు వారి తపస్సును కొనసాగించుటకు  హిమాలయాలకు వెళ్లిపోయారు.
ఆ తరువాత గరుడుడు తనకు లభించిన ఆహారం తినుటకు వీలుగా ఒక స్థలం చూపమని అడుగగాదానికి కశ్యపుడు తాని నివసిస్తున్న గంధమాదన పర్వతానికి లక్ష ఆమడల దూరంలో నిష్పురుషం అనే కొండ ఉన్నది అని , అక్కడ ఎవరూ ఉండరు కనుక అక్కడకు వెళ్లి తినమని చెప్పాడు. అక్కడకు వెళ్లి గరుడుడు తన ఆకలి తీర్చుకున్నాడు. అక్కడి నుండి అమృతమును తీసుకు రావటానికి స్వర్గానికి బయలుదేరాడు. 

3, మే 2020, ఆదివారం

హనుమంతుడు-పుష్పక విమానము- పార్వతి

లంకలో సీతాదేవిని వెతుకుటకు వచ్చిన హానానుమంతుడు ఎంత జాగ్రత్తగా వెతుకుతున్నాడో ఇంతకు ముందు ఒక చక్కని పద్యంలో చూశాం కదా!

అలా వెదుకుతున్న హనుమంతుడు లంక  అంతా కలియదిరిగి, సీత జాడ తెలియక వెదుకుతూ రావణుని పుష్పక విమానం వద్దకు వచ్చి ఆ విమానపు సౌందర్యానికి, కాంతికి తనను  తాను మరచి అలాగే నిలుచుండి  పోయాడు.
అప్పుడు అతనిని తిరిగి కార్యోన్ముఖుడ్ని చేయటానికి సాక్షాత్తు పార్వతీదేవి చిన్న పాప రూపంలో వచ్చింది అని మల్లెమాల రామాయణం లో కవి వర్ణించారు.
చిన్న పాపగా వచ్చిన పార్వతీదేవి అలాగే బొమ్మలా నిలబడిన హనుమంతుని విచిత్రంగా చూసి అతని కన్నులలోకి ఉఫు  అని ఊదినది. వెంటనే తేరుకుని హనుమంతుడు తన తప్పును వెంటనే  గ్రహించి క్షమాపణ అడిగాడు. దానికి బాల రూపంలో ఉన్న పార్వతి, ఎవరయినా ఇంత సౌందర్యము కల్గిన ఈ పుష్పక విమానమును చూసి తమను తాము మరిచిపోవుట సహజం అని చెప్పి ఆ పుష్పక విమానం కథను చెప్పటం మొదలుపెట్టింది.
ముందుగా బ్రహ్మదేవుని కొరకు విశ్వకర్మ చేసాడు. దాని తరువాత అత్యంత తపస్సు చేసిన ధనాధిపతి అయిన కుబేరుడు  దీనికి అధిపతి అయ్యాడు. ఆ తరువాత యుద్ధంలో కుబేరుడిని ఓడించిన రావణుడు దీనిని స్వాధీనం చేసుకున్నాడు అని ఆ పుష్పక విమానం కథను చక్కగా హనుమంతునకు సాక్షాత్తు పార్వతి దేవి చెప్పింది.  అలా పార్వతి చెప్పిన మాటలు విని హనుమంతుడు ఆమెకు నమస్కారం చేసి, సీతని వెదకుటకు ఆ పుష్పక విమానంలోకి ప్రవేశించారు. 

2, మే 2020, శనివారం

వాలఖిల్యులు

బ్రహ్మాండ పురాణం మరియు భాగవతం ప్రకారం వాలఖిల్యులు నవబ్రహ్మలలో ఒకరయిన క్రతువు పుత్రులు. క్రతువు దేవహుతి, కర్ధముల పుత్రిక అయిన క్రియను వివాహం చేసుకున్నారు. ఈ క్రతువు మరియు క్రియలకు కలిగిన సంతానమే 60,000 మంది వాలఖిల్యులు.
వీరు బొటన వేలు పరిమాణంలో ఉండి నిరంతరం తపస్సులో ఉంటారు. వారి తపస్సు అత్యంత కఠినమయినది. వారు చెట్టు కొమ్మలకు తలక్రిందులుగా వ్రేళ్ళాడుతూ తపస్సు చేస్తారు.
వీరు తపస్యులు అయిన కారణంగా కశ్యప ప్రజాపతి పుత్రుల కోసం పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు వీరిని ఆహ్వానించారు. ఆ ఇష్టి కి వెళ్లే వారు అందరూ  మోయగలిగినంత చెరువు (యాగం లో ఉపయోగించుటకు వీలు అయిన వస్తువులు, కర్రపుల్లలు వంటివి) తీసుకు రావటం పరిపాటి కనుక వీరు తాము మోయగలిగిన గడ్డి పరకలు తీసుకు వచ్చారు.
వారిని చూసి ఆ సమయంలో అక్కడ ఉన్న ఇంద్రుడు వెక్కిరింతగా నవ్వాడు. అలా నవ్విన ఇంద్రుని చుసిన వాలఖిల్యులు అత్యంత బలవంతుడు, అనితర సాధ్యుడు ఈ ఇంద్రుని కంటే వంద రెట్లు బలం కలిగిన వాడు అయిన మరో ఇంద్రుడు ఈ యాగ ఫలముగా పుట్టుగాక అని అన్నారు. అంటే వారి కోపము కూడా ఇతరులకు (ఇక్కడ కశ్యపునకు) మేలు చేసింది. ఇలా వాలఖిల్యులు చెప్పటం విన్న ఇంద్రుడు కశ్యపుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. ఆ మాటలు విన్న కశ్యపుడు ఇది వరకు బ్రహ్మచే నియమించబడిన ఇంద్రుని కాదనుట సరి కాదు అని, తనకు కలగబోయే సంతానం పక్షి గా, ఆ పక్షులలో ఇంద్రునిగా ఉంటుంది అని వాలఖిల్యులను కోరాడు. దానికి అత్యంత దయగలిగిన వాలఖిల్యులు  ఒప్పుకున్నారు.
ఆ పుత్ర కామేష్టి కారణం గా కశ్యపునకు గరుడుడు జన్మించాడు. ఆ గరుడునకు పక్ష్మీంద్రుడు అనే పేరు కూడా ఉన్నది.
తరువాతి కాలంలో తన తల్లి దాస్య విముక్తి కోసం ప్రయత్నిస్తున్న గరుడుడు ఆకలి తీర్చుకోవటం కోసం తండ్రి ఆదేశం మేరకు గజమును, తాబేలును తినటానికి ప్రయత్నం చేసినప్పుడు విరిగిన రోహిణము అనే వృక్ష కొమ్మకు తల క్రిందులుగా వ్రేళ్ళాడుతూ తప్పస్సు చేసిన వారు వీరే.  

1, మే 2020, శుక్రవారం

తెలుగు మధురమయిన పద్యం - 2

రామాయణములో అత్యంత ముఖ్యమయినది, ఎంతో ప్రాముఖ్యం కలిగినది సుందరకాండ. ఆ సుందర కాండ ముఖ్య ఉద్దేశ్యం హనుమంతుడు సీతాదేవిని లంకలో వెతుకుట. ఆ ఘట్టమును అనేక కవులు అనేక రకములుగా వర్ణించారు. అటువంటి వర్ణనలలో ఉన్న ఒక సీస పద్యం మల్లెమాల రామాయణం లోనిది మీకోసం!
ఈ పద్యమునకు సందర్భం : హనుమంతుడు లంకలో సీతాదేవి కోసం ఎంత ఏకాగ్రతగా, మిగిలినవారికి తన ఉనికి తెలియకుండా ఉండేలా ఎంత జాగ్రత్తగా మసలుకుంటూ వెతుకుతున్నాడో చెప్తున్న సందర్భం

కడునేర్పు తో పాలు కాజేయ వంటింట 
మెల్లగా తారాడు పిల్లివోలె 
కటిక చీకటివేళ కలవారి గృహములో 
దూరి యన్వేషించు దొంగవోలె 
బొక్కలోపల గూడ నెక్క డేమున్నదో 
నక్కి గాలించు నక్కవోలె 
అతినిగూఢ మ్మైన ఆత్మతత్వమ్మును 
తనలోన వెదకెడు తపసివోలె 

ఇంత మంచి అచ్చ తెలుగు పద్యమునకు విడిగా భావం చెప్పటం అవసరం లేదు కదా!

30, ఏప్రిల్ 2020, గురువారం

విభావసుడు - సుప్రతీకుడు

మనకు పురాణములలో, ఇతిహాసములలో మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి చాలా విపులంగా చర్చించాయి.
రామాయణంలో సోదరుల మధ్య నమ్మకం, ప్రేమ ఎలా ఉంటాయో చూపించారు, అలాగే  భారతంలో దాయాదుల మధ్య గొడవలు మొదలయితే అవి ఎంతవరకు వెళతాయో కూడా చెప్పారు. అటువంటి మరోకథ మహాభారతంలో ఉంది.  ఇద్దరు అన్నదమ్ములు అస్తి  కోసం గొడవపడుతూ ఆ గొడవను తరువాతి జన్మలో కూడా కొనసాగించారు.  మరి ఆ కధ ఎమిటో చూద్దామా!
విభావసుడు - సుప్రతీకుడు  అని ఇద్దరు అన్నదమ్ములు. వారికి పెద్దలనుండి చాలా ఆస్తి సంక్రమించింది.  తమ్ముడయిన సుప్రతీకుడు అన్నగారిదగ్గరకు వెళ్లి  ఆస్తి ని ధర్మంగా పంచమని కోరాడు. దానికి విభావసుడు అంగీకరించలేదు. ఇలా వారి గొడవ పెరిగి పెద్దది అయ్యి, విభావసుడు సుప్రతీకుని ఏనుగుగా జన్మించమని, సుప్రతీకుడు విభావసుని తాబేలువు కమ్మని ఒకరికి ఒకరు శాపం ఇచ్చుకున్నారు.
అలా శాపం ఇచ్చుకున్న కారణంగా కొంతకాలానికి ఇద్దరు ప్రాణములు విడచి ఆ శాపముల ప్రకారం ఒకరు ఏనుగు గాను మరొకరు తాబేలు గాను జన్మించి, పూర్వజన్మ లోని శతృత్వం కారణంగా జంతు జన్మలో కూడా ఆ శతృత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ గొడవ కొన్ని వేల యేండ్లవరకు సాగింది.
మరి ఇంతకీ వీరి గొడవ ఎలా తీరింది? వీరి గొడవ తీరలేదు, వారు ఇద్దరూ  గరుడునికి  ఆహారం అయ్యారు. ఆ విషయం మరో టపాలో!!

 

29, ఏప్రిల్ 2020, బుధవారం

హనుమంతుడు - తొమ్మిది అవతారములు

హనుమంతునికి ముఖ్యముగా తొమ్మిది అవతారాలు ఉన్నాయి అని చెప్తారు. దీనిని గురించి పరాశర సంహిత లో ప్రస్తావించారు.

ఆద్య: ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః
తృతీయో వింశతిభుజః చతుర్దః పంచ వక్త్రకః
పంచమో ష్టాదశ భుజః శరణ్యస్సర్వ దేహినాం
సువర్చలాపతి షష్ఠః సప్తమస్తు చతుర్భుజ ః
అష్టమః కధితశ్శ్రీమాన్ ద్వాత్రింశద్భుజమండలః
నవమో వానరాకార ఇత్యేవం నవరూపధృక్

భావం:: ప్రసన్న హనుమదవతారం, వీరాంజనేయ అవతారం, వింశతి (ఇరవై భుజములు కలిగిన ) భుజాంజనేయావతారము, పంచముఖాంజనేయావతారము, అష్టాదశ భుజాంజనేయావతారము (పద్దెనిమిది భుజముల), సువర్చలాహనుమావతారం, చతుర్భుజాంజనేయావతారం(నాలుగు భుజములు), ద్వాత్రింశత్ భుజాంజనేయావతారం  (ముప్పది రెండు భుజముల), వానరాంజనేయావతారము. 

28, ఏప్రిల్ 2020, మంగళవారం

వినత- గరుడుడు

మనం ఇంతకు ముందు వినత కద్రువల గురించి వారి అసూయ, మదము- క్రోధము గురించి చెప్పుకున్నాం కదా!!
ఆ తరువాతి కధ ఇప్పుడు చూద్దాం!

మరునాడు వినత కద్రువలు వెళ్లి ఆ అశ్వాన్ని చూసారు. ముందే అనుకున్న ప్రకారం కద్రువ కొంచెం దూరం నుండి ఆ గుర్రాన్ని చూసే ఏర్పాటు చేసింది. కర్కోటకుడు వెళ్లి ఆ గుర్రం తోకను పట్టుకుని ఉన్నాడు. అలా ఆ గుర్రాన్ని దూరంగా చూస్తున్న వారికి దాని తోకలో కొంతభాగం నల్లగా కనిపించింది. అంటే వారి షరతు ప్రకారం వినత కద్రువకు దాస్యం చేయాలి .

అప్పటి నుండి వినత కద్రువకు దాసీ గా ఉండిపోయియింది. కొంతకాలానికి వినతకు మిగిలిన రెండవ గుడ్డు లోనుండి గరుడుడు జన్మించాడు. అతను కూడా ఒక దాసీ పుత్రునిగా కద్రువకు, ఆమె పుత్రులకు సేవలు చేస్తూ ఉన్నాడు. అతను పక్షి కనుక తన రెక్కల మీద కద్రువ పిల్లలయిన పాములను ఎక్కించుకుని గాలిలోకి తీసుకెళ్లి విహారం చేయించేవాడు. అలా ఉండగా ఒకసారి  గరుడుడు ఆ పాములను అత్యంత ఎత్తుకు తీసుకుని వెళ్ళాడు. అలా ఎత్తుగా సూర్యునికి దగ్గరగా వెళ్ళటం వలన గరుడుని రెక్కల మీద ఉన్న పాములు ఆ వేడిని తట్టుకోలేక తమ పట్టుజారి కిందకి పడిపోయాయి. తన పుత్రుల దీనావస్థ చూసిన కద్రువ ఇంద్రుని ప్రార్ధించి వర్షం కురిపించి, వారిని కాపాడుకున్నది. జరిగిన దానికి గరుడుని నిందించినది.

తరువాత గరుడుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ఈ దాస్యం చేయటానికి గల కారణం తెలుసుకున్నాడు. ఆ పాముల వద్దకు వెళ్లి తనను, తన తల్లిని దాస్యము నుండి విముక్తి కలిగించటానికి ఏమి చేయాలి అని అడిగాడు. దానికి వారు అతనిని స్వర్గం నుండి అమృతమును  తెచ్చి ఇవ్వమని అడిగారు.

తనతల్లి అనుమతితో అమృతమును తెచ్చి వారికి ఇవ్వటానికి బయలుదేరాడు. తాను ఆ ఘనకార్యం సాధించే ముందు తన ఆకలి తీరే మార్గం చెప్పమని అడిగాడు. అప్పుడు ఆమె సముద్రంలో ఉన్న కిరాతులను తినమని చెప్పింది. అవి తిని అతను తన తండ్రి కశ్యపుని దగ్గరకు ఆశీర్వాదము పొందటానికి బయలుదేరాడు. 

27, ఏప్రిల్ 2020, సోమవారం

వైశాఖం - విశిష్టత

స్కంద పురాణములో ప్రతి సంవత్సరము లో వచ్చే పన్నెండు నెలలో ఏ నెలలు ముఖ్యమయినవి అని, ఆ యానెలలలో ఏమి చేయాలి అని చెప్పారు.

తతో మాసా విశిష్ట్యోక్తాః కార్తీకోమాఘఏవచా 
మాధవ స్తేషు వైశాఖం మాసానాముత్తమం వ్యధాత్ 

భావం : అన్ని మాసములలో విశిష్టమయిన మాసములుగా కార్తీకం, మాగము మరియు మాధవం అని పిలువబడే వైశాఖం ముఖ్యమయినవి.

మరి అంత  విశిష్ట కలిగిన ఈ వైశాఖ మాసంలో ఏమి చేస్తే మానవునకు మంచి జరుగుతుంది? మానవునికి మంచి జరుగుతుంది అని చెప్పటంలో మన పెద్దల దృష్టి ఎలా ఉంటుంది అని ఇక్కడ మనం చూడవచ్చు. మనకి మంచి జరగాలి అంటే మనం ఈ సమాజానికి ఎం చేయగలం అని అర్ధం. ఎండలు ఎక్కువగా ఉండే ఈ వైశాఖ మాసంలో ఏమి చెయ్యాలో కింద శ్లోకంలో చెప్పారు.

మార్గే ధ్వగానాంయోమర్త్యః ప్రపాదానంతకరోతిహి
సంకోటికులముద్ధృత్య విష్ణులోకే మహీయతే

భావం: అనేక మంది నడిచే మార్గమద్యములో ఒక చలివేంద్రము ఏర్పరచి వైశాఖమాసములో ఎవరయితే బాటసారులకు మంచినీటిని అందిస్తూ ఉంటారో అటువంటి సత్పురుషునకు, అతనితో పాటు అతని వంశమునందు జన్మించిన తరువాతి అనేక తరముల వారికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది. 

26, ఏప్రిల్ 2020, ఆదివారం

తెలుగు మధురమయిన పద్యం-1

కవి హృదయం, అతను చెప్పబోయే విషయముల మీద అత్యంత నిమగ్నమై, ఆ విషయమును అద్భుతంగా చెప్పే ప్రయత్నంలో ఉంటుంది.
అటువంటి ఒక మధురమయిన తెలుగు పద్యం ఇప్పుడు ఒకటి చూద్దామా!
ఈ పద్యం కవిరాజ శిఖామణి నన్నెచోడుడు రచించిన కుమారసంభవం లోనిది.

హరి వికచామలాంబుజసహస్రము పూన్చి మృగాంకునం దవి 
న్ఫురిత మలాసితాబ్జమని పుచ్చగ జాచిన చేయి చూచి చం 
దురు డది రాహు సావి వెఱ దుప్పల దూలగ జారుచున్న న 
య్యిరువుర జూచి నవ్వు పరమేశ్వరు డీవుత మా కభీష్టముల్

భావం: విష్ణువు చక్కగా వికసించిన, కొంచెము కూడా మురికి లేకుండా శుభ్రపరచి వేయి తామర పువ్వులతో శివుని శిరస్సు పైన పూజించు చుండగ, ఆ శివుని తలపైన ఉన్న చంద్రుడ్ని చూసి,
ఆ చంద్రుని కూడా ఒక కమలం అనుకుని, ఆ కమలంలో ఎదో మచ్చ కనిపించుటతో ఆ పువ్వు మలినమైంది అని అనుకుని, ఆ ఆపువ్వును అక్కడ నుండి తన చేతితో  తీయబోగా
తనవైపు వచ్చుచున్న నల్లని చేతిని చూచిన చంద్రుడు ఆ చేతిని రాహువుగా భావించి తన నిజస్థానము నుండి కిందకు జారాడు. అలా చంద్రుడు కదలటం చుసిన విష్ణువు కూడా తన చేతిని వెనుకకు తీసాడు. అలా జారుచున్న విష్ణువు, చంద్రులను చూసి నవ్వుతున్న పరమేశ్వరుడు మాకు గల కోరికలను తీర్చును గాక.

విశ్లేషణ: ఈ పద్యంలో విశేషం ఏంటంటే విష్ణువు ఇంకా చంద్రుడు ఇద్దరు శివునికి సన్నిహితమయినవారే. అయితే కవి ఇక్కడ ఊహించిన విధానం చాలా హృద్యంగా ఉంది. పూజకు సిద్ధం చేసిన పువ్వులు ఎంతో శుభ్రంగానే  ఉన్నాయి.  ఆ పువ్వుల మధ్యలో ఉన్న చంద్రుడు కూడా ఒక పువ్వులాగే కనిపించాడు. అయితే చంద్రునిలో సహజంగా ఉన్న మచ్చల కారణంగా అది మురికిగా ఉన్న పువ్వు అని విష్ణువు భావించాడు. ఆ మలినమయిన పువ్వు ని తీయాలనే ఉద్దేశం తో దానిని తీయటానికి తన చేయి చాచాడు. అయితే అలా తన వద్దకు వస్తున్న  విష్ణుమూర్తి చేతిని చూసి అది రాహువు అనుకున్నాడు. దానికి కారణం విష్ణుమూర్తి  నలుపుగా  ఉంటాడు కనుక అతని చెయ్యి కూడా నల్లగా ఉంటుంది. రాహువు ఛాయాగ్రహం. కనుక విష్ణుమూర్తి చేతిని రాహువుగా ఊహించారు.
ఇక్కడ అద్భుతం ఏంటి అంటే విష్ణువు, చంద్రుడు ఇద్దరూ కూడా లేని విషయమును ఉహించుకుని దాని గురించి భయపడ్డారు. అటువంటి అపోహలను పోగొట్టాలంటే అవి ఊహలు అని తెలిసిన వాళ్ళ వాల్ల మాత్రమే అవుతుంది. ఇక్కడ వారి ఇద్దరి అపోహలను పోగొట్ట గలిగిన వాడు శివుడు. కనుక ఆ పరమ శివుడు మన కోరికలను తీర్చగలడు ఆని ఆతనిని మన కవి  ప్రార్ధిస్తున్నాడు.




  

25, ఏప్రిల్ 2020, శనివారం

పురుషుడు - అష్టపురములు

మనం సహజంగా పురుష శబ్దాన్ని మగవారి కోసం వాడతాము. కానీ మన పూర్వీకుల కధనం ప్రాకారం పురుష అనే శబ్దానికి అర్ధం అష్టపురములను ఆధారము చేసుకుని జీవనం సాగించేవారు అని అర్ధం. మరి ఇంతకీ ఆ అష్టపురములు అంటే ఏమిటి?

జ్ఞానేంద్రియాణి ఖలు పంచ తథాపరాణి కర్మేంద్రియాణి మనః ఆది చతుష్టయం చ
ప్రాణాదిపంచకమధో వియదాదికం చ కామశ్చ కర్మచ తమః పున రష్టధాపూః


భావం ః  జ్ఞానేంద్రి యాలు (ఐదు), కర్మేంద్రియాలు (ఐదు), అంతః కారణములు (నాలుగు, అవి మనస్సు ,బుద్ధి, చిత్తము మరియు అహంకారము), ప్రాణాలు (ఐదు), పంచభూతములు, కామము, కర్మ మరియు అజ్ఞానము ఈ ఎనిమిది ని కలిపి అష్టపురములు అంటారు.

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

పంచ క్లేశములు

మనం ఇంతకు ముందు అష్ట కష్టముల గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆ అషట కష్టములకు మాత్రమే కాక అసలు మానవుని బాధలకు కారణమయిన ఐదు కిలేసముల గురించి చెప్పుకుందాం. ఆ పంచ క్లేశములు

  1. అవిద్యాక్లేశము : తన నిజ స్వరరూపమును గుర్తించకుండా తాని ఒక జీవుడు అని అనుకోవటం అవిద్య క్లేశము
  2. అభినవ క్లేశము : సంసారమును, దానిని పట్టుకుని ఉండే మనస్సును అంటి పెట్టుకొనుట/ వదలకుండా ఉండుట అభినవ క్లేశము 
  3. అస్థిగత క్లేశము : విషయములలో అత్యంత నిమగ్నుడు అయ్యి గర్వించుట అస్థిగత క్లేశము
  4. రాగ క్లేశము : ధనము మొదలగు వానిలో మిక్కిలి కోరిక కలిగి ఉండుట రాగ క్లేశము
  5. ద్వేషక్లేశము : మన పనుల కోసం పక్కవారిని ఆశ్రయించి వారి వలన సహాయం పొందుతూ తిరిగి వారి పైననే ద్వేషము కలిగి ఉండుట ద్వేష క్లేశము