మార్కండేయ పురాణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మార్కండేయ పురాణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

సూర్యుడు సంధ్యాదేవి కలయిక - అశ్వినీ దేవతలు

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి, ఆ నిజం తెలుసుకున్న సూర్యుడు తన ప్రభావాని తగ్గించుకుని తన భార్య వద్దకు బయలుదేరాడు అని, సూర్యుని నుండి తొలగించిన ప్రకాశాన్ని ఉపాయోగించి దేవశిల్పి విశ్వకర్మ దేవతలకు అనేకా రకములయిన ఆయుధాలను తయారు చేసాడు అని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు సూర్యుడు సంధ్యాదేవి వద్దకు ఎలా వెళ్ళాడు? అప్పుడు ఏమి జరిగింది అని తెలుసుకుందాం!

తన భార్య ఎక్కడ ఉన్నదో ముందే తెలుసుకున్న సూర్యుడు తన ప్రకాశాన్ని తగ్గించుకున్న తరువాత ఆమె వద్దకు ఉత్తరకురుదేశమునకు బయలుదేరాడు. ఆమె ఆడగుర్రం రూపంలో ఉన్నది కనుక అతనుకూడా మగ గుర్రం రూపాన్ని ధరించి అమె వద్దకు వెళ్ళాడు. అలా తన వద్దకు వచ్చిన భర్తతో అమె ఇద్దరు కుమారులను (కవల పిల్లలు) కన్నది. అయితే వారు గుర్రం రూపంలో ఉండగా వారికి సంతానం కలిగింది కనుక ఆ ఇద్దరిని అశ్వినులు అని పిలిచారు. వారే దేవవైద్యులుగా ప్రసిద్ది పొందారు. ఆ తరువాత సూర్యునికి, సంధ్యాదేవికి రేవతుడు అని ఒక కుమారుడు జన్మించాడు. అతను సకల శస్త్రాస్త్రకోవిదుడు. 

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

దేవశిల్పి - దేవతల ఆయుధాలు

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, యమునికి చాయాదేవి ఇచ్చిన శాపం గురించి, ఆ శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి, ఆ నిజం తెలుసుకున్న సూర్యుడు తన ప్రభావాని తగ్గించుకుని తన భార్య వద్దకు బయలుదేరాడు అని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

సూర్యుని నుండి తొలగించిన ప్రకాశాన్ని దేవశిల్పి విశ్వకర్మ కొన్ని విచిత్రమయిన శక్తివంతములయిన ఆయుధాలను, వాహనాలను తయారు చేయడానికి ఉపయోగించాడు. అలా తయారుచేయబడిన వస్తువులు

  1.  విష్ణుమూర్తి సుదర్శన చక్రం, 
  2. పరమశివుని త్రిశూలం, 
  3. కుమారస్వామి శక్తి ఆయుధం,
  4. యముని దండం
  5.  వసువులకు శంఖములు,
  6. అగ్నికి రధము,
  7.  కుబేరునికి పుష్పకము మరియు కొందరు దేవతల ఆయుధములు తయారుచేసెను. 
అంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రం, పరమశివుని త్రిశూలం కూడా సూర్యుని తగ్గించబడిన ప్రకాశంనుండి తయారు చేశారంటే సుదర్శన చక్రం, త్రిశూలంకి ఉన్న శక్తి అపరిమితం కాదా! మన పురాణాల ప్రకారం సుదర్శన చక్రం, త్రిశూలల శక్తి అపరిమితం, వానిని కేవలం విష్ణుమూర్తి , పరమశివులు మాత్రమే సంధించగలరు. మరి ఇక్కడ మనం నేర్చుకున్నదానికి, నిజానికి ఉన్నతేడాను ఎలా అర్ధం చేసుకోవాలి? తరువాతి టపాలలో చూద్దాం!

7, ఫిబ్రవరి 2022, సోమవారం

సంధ్య- ఛాయ- సూర్యుడు- విశ్వకర్మ

  మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, యమునికి చాయాదేవి ఇచ్చిన శాపం గురించి, ఆ శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

తన భార్య పిల్లలమీద వివక్ష చూపడానికి కారణం తెలుసుకోవడానికి సూర్యుడు తిన్నగా ఛాయాదేవి వద్దకు వెళ్ళి ఆమె పిల్లల మధ్య అలా ఎందుకు వివక్ష చూపుతోందో అని అడిగాడు. ఆమె సూర్యునికి సరి అయిన సమాధానం చెప్పలేక పోవాడాన్ని గమనించిన సూర్యునికి అమె పై అమితమైన కోపం వచ్చింది. అప్పుడు అతను ఆమెను శపిస్తానని అన్నాడు. సూర్యుని మాటలకు భయపడి, ఆమె సంధ్యాదేవికి ఇచ్చిన మాట ప్రకారం ప్రాణ సంకట సమయంలో నిజమును చెప్పవచ్చు అని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు తన ప్రాణములకు సంకటం ఉన్నది అని గమనించి ఆమె నిజాన్ని అతనికి తాను సంధ్యాదేవిని కానని, ఆమె తయారు చేసిన ఒక ఛాయను మాత్రమే అని, సంధ్యాదేవి చాలాకాలం క్రితమే తనను అక్కడ ఉంచి వెళ్ళిందనీ, సావర్ణి, శనైశ్చరుడు తన పిల్లలు అని చెప్పింది.  

ఛాయాదేవి చెప్పిన  విషయాలను విన్న సూర్యుడు సంధ్యాదేవి ఇంకా పుట్టింట్లోనే ఉన్నది అనే ఆలోచన వల్ల మామగారయిన దేవశిల్పి విశ్వకర్మ దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. సూర్యుడు చెప్పిన విషయాలను విన్నవిశ్వకర్మ, కొంతకాలం క్రితం  తన కుమార్తె తన వద్దకు వచ్చిందనీ,  వచ్చినప్పుడు ఆమె సుర్యుని వేడిని తాను భరించలేక పోతున్నందున అలా వచ్చినట్లు చెప్పిందని, ఆమెకు నచ్చజెప్పి ఆమెను తిరిగి పంపానని, ఆమె అప్పుడే తన వద్ద నుండి తిరిగి వెళ్ళి పోయిందని చెప్పాడు. అప్పుడు ఆమెకు ప్రియం కలిగించేలా సూర్యునికి అతని వేడిని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తానని  దేవశిల్పి విశ్వకర్మ చెప్పాడు. మామగారు చెప్పిన మాటలు విన్న సూర్యుడు  అతను చెప్పిన మాట ప్రకారం  ఒక భ్రమియంత్రంలో ప్రవేశించి అతని ప్రకాశమును 16వ వంతునకు తగ్గించుకున్నాడు.

ఆ తరువాత సూర్యుడు స్వయంగా తన దివ్య దృష్టి ద్వారా తన భార్య సంధ్యాదేవి ఎక్కడ ఉన్నదో తెలుసుకుని, ఆమె  వద్దకు వెళ్ళాడు. 

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

యముని శాప పరిష్కారం

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ  గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

తల్లితో శపించబడిన యముడు, తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా వివరించాడు. యముడు చెప్పిన మాటలు విన్న వివస్వంతుడు / సూర్యుడు ఆలోచించాడు.  యమునికి సంధ్యాదేవి ఇచ్చిన శాపమును తప్పించే అవకాశం లేనందువలన సూర్యుడు ఆతనికి మధ్యేమార్గంగా ఒక వరం ఇచ్చాడు. అతని తల్లి ఇచ్చిన శాప కారాణంగా యముని కాలు  భూమిపై పడాలి, దానికి సూర్యుడు యముని కాలులోని మాంసమును క్రిములు తీసుకుని భూమిపైకి వెళతాయి అని, అలా జరగడం వలన అతని కాలులోని మాంసం భూమి పైకి వెళ్ళిన కారణంగా యమునికి పుర్తిగా శాప విమొచనం కూడా కలుగుతుంది అని చెప్పాడు. ఆ పరిష్కారం విన్న యముడు తన అవేశమును తగ్గించుకుని వెళ్ళిపోయాడు. 

ఒక తల్లి తన బిడ్డలందరినీ సమానంగా చూస్తుంది. కానీ తన భార్య ముందు పుట్టిన పిల్లలు, తరువాత పుట్టిన పిల్లల మధ్య భేదం ఎందుకు చూపుతోందో అర్ధం కాలేదు. ఆ విషయాన్ని తెలుసుకోవడనికి  సూర్యుడు తన భార్య వద్దకు బయలుదేరాడు. 

మరి తరువాత ఏం జరిగింది? నిజం బయటపడిందా, లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

30, ఏప్రిల్ 2019, మంగళవారం

పాండవులు - ఇంద్రుడు

 మహాభరతం లో ఎన్ని సార్లు ఎంతమంది సమాధానాలు చెప్పినా మల్లి మల్లి అందరు అడిగే ప్రశ్న ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండుట ధర్మమేనా?
ఈ ప్రశ్నకు మహాభారతంలో అనేక సందర్భములలో అనేక వృత్తాంతములతో ఇది ధర్మమే అని చెప్పారు. ఆ వృత్తాంతములు చెప్పే ముందు అసలు పంచ పాండవులు ఎవరు? ద్రౌపది ఎవరు అని ముందుగా చూద్దాం!

ద్రౌపది - స్వర్గ లక్ష్మి
ధర్మరాజు - యమధర్మ రాజు అంశ
భీముడు - వాయుదేవుని అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశ

ఇలా పాండవులు వివిధ దేవతల అంశాలుగా చెప్పబడినా , వారిలో నుండి బయటకు వచ్చిన ఆయా అంశలు కూడా ఇంద్రుని అంశలే అని ద్రౌపది కల్యాణ సమయంలో స్వయంగా వ్యాసుడు ద్రుపదునికి చెప్పాడు.
ఇదే కథను మార్కండేయ పురాణంలో మరోవిధంగా చెప్పారు. ఆ కదా ప్రకారం :

ఇంద్రుడు దేవతల రాజు. అత్యంత ధర్మవంతునిగా ఉండవలసిన భాద్యత అతనిది. కానీ ఆ విధంగా చేయవలసిన అనేక సందర్భములలో కొన్నిసార్లు అధర్మం చేయవలసి వచ్చింది. అలా అధర్మం చేసినప్పుడు అతనిలోని కొంత శక్తి కోల్పోతూ వచ్చాడు. అయితే అతను కోల్పోయిన ఆ శక్తి ఆయా సందర్భములలో అతనిని ఉద్దరించటానికి సహాయం చేసిన దేవతలకు ఆ  శక్తి అంశలుగా చేరాయి. మరి ఇంద్రుడు ఏ పనులు చేసాడు, ఆలా  చేసినప్పుడు  అంశ ఏ దేవతలను చేరిందో తెలుసుకుందాం!

అహల్యా వృత్తాంతం : గౌతమ ముని శాపం తర్వాత అత్యంత జుగుప్సాకరంగా మారిన అతని శరీరమును తిరిగి పూర్వ రూపం వచ్చేలా ప్రయత్నించిన వారు దేవా వైద్యులయిన  అశ్విని దేవతలు. కనుక ఇంద్రుడు ఆ సమయంలో కోల్పోయిన శక్తి ఈ సందర్భంలో అశ్వినీ దేవతలకు సంక్రమించింది.  

వృత్రాసుర వధ : వృత్రాసురుని వధ తరువాత అతనికి బ్రహ్మహత్యాపాతకం సంక్రమించింది. 
ఆ బ్రహ్మహత్యాపాతకమును కొంత తాను తీసుకున్న వాయుదేవునికి కొంత ఇంద్రతేజస్సు సంక్రమించింది. 

త్రిశిరుని వధ : త్రిశిరుడు అనే రాక్షసుని సంహరించిన తరువాత ఆ పాపంలో కొంత పాపం తాను తీసుకుని ఇంద్రునికి సహాయం చేసిన యమునిలో ఇంద్ర అంశ కొంత వచ్చి చేరింది. 

కనుక కుంతీ దేవి, మాద్రిదేవి వివిధదేవతలను ఉపాసించి పుత్రులను కోరినప్పుడు ఆయా దేవతలు వారివద్ద ఉన్న ఇంద్రుని అంశలను వారికి పుత్రులుగా ఇచ్చారు కనుక 

ధర్మరాజు - యమధర్మ రాజు అంశ గా వచ్చిన ఇంద్ర అంశ
భీముడు - వాయుదేవుని అంశగా  వచ్చిన ఇంద్ర అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశగా వచ్చిన ఇంద్ర అంశ

కనుక అందరు పాండవులు కూడా ఇంద్రుని అంశలే. మరి ఇంద్రుని రాజ్యలక్ష్మి అయిన స్వర్గ లక్ష్మి  పాండవుల పట్ట మహిషి అయిన ద్రౌపది గా వచ్చినది.   

28, అక్టోబర్ 2014, మంగళవారం

తామస మనువు జననం- విశ్లేషణ

తామస మనువు జననం- విశ్లేషణ

ఈ ఘట్టం లో విశ్లేషించవలసిన అంశం నా మనస్సునకు తట్టినది ఒక్కటే ఉన్నది. అది ప్రాపంచిక విషయముల మీద వైరాగ్యం కలిగి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్న ఒక తపస్వి మనస్సుని ఒక లేడి వంటి జంతువు కదిలించటం.
ఇటువంటి విషయములు ప్రస్తావనకు వచ్చినప్పుడు మన హిందూ ధర్మ శాస్త్రముల మీద మనకే కొంచెం అపనమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది. దానికి కారణం మనం ఆ విషయమును గురించి తప్ప అందులోని సూక్ష్మ అర్ధమును గ్రహించే ప్రయత్నం చేయలేకపోవుట.
లెక్కకు మించిన ఆయుష్షు కలిగిన సురాష్ట్రుడు, తన భార్యలు, ప్రజలు, మంత్రులుతన ముందే చనిపోవటం చూసాడు కనుక అతనికి వైరాగ్యం కలిగినది. అందుకని అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేయనారంభించాడు. అదికూడా ఘోరమయిన తపస్సు. ఐతే ఇక్కడ ఒక విషయం గమనించండి. అతను ఏమి కోరి తపస్సు చేస్తున్నాడు? ఏ విధమైన కోరికా లేదు. కేవలం భగవత్ సాక్షాత్కారం కోసం మాత్రమే! అతనికి దేహం మీద, దానివలన సంభవించే ఏ విధమైన భోగం మీద కోరిక లేదు కనుకనే తన రాజ్యమును వదలి తపస్సునకు వెళ్ళాడు.
ఇక వర్షం రావటం అనేది సృష్టిలో సహజం. ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నపుడు, పంచాభుతాత్మకమైన శరీరం తనలో ప్రాణమును నిలుపుకోవాలనే చూస్తుంది కనుక ఆధారం కోసం చేతులు వెతికాయి. అప్పుడు తనకు దొరికిన ఒక లేడి ని పట్టుకోవలసి వచ్చినది.
ఇక్కడ ఒక విషయం గమనించండి. అతని చేతికి ఒక లేడి దొరికింది. అంటే అది కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుని పొతూ ఉంది. నాకు తెలిసి లేడి కంటే మానవుని శరీరం నీటిలో ఈదే సామర్ధ్యం కలిగి ఉంటుంది. కనుక తన చేతికి దొరికిన ఆ లేడి ప్రాణములను కాపాడాలన్న దృఢ నిశ్చయం ఆ తపస్వికి కలిగి, ఒడ్డునకు చేరే, లేడిని చేర్చే ప్రయత్నం చేసి ఉండాలి. అలా ఒడ్డుకు చేరిన తరువాత, లేడి తన ప్రాణములను కాపాడినందుకు అతనిపై కృతజ్ఞతా భావం ఉంచుకొనుట సహజం.
అలా కాకుండా ఆ తపస్వి మనస్సు ఆ లేడి వలన కదలటం విచిత్రం. తపస్వి అనేవాడు తన మనస్సును నిగ్రహించే సామర్ధ్యం కలిగి ఉంటాడు. అప్పటికి చాలా కాలం నుండి అతను తపస్సులో ఉన్నాడు కనుక అతని మనస్సును నియంత్రించటం అతనికి తెలుసు. కానీ అతని మనస్సు కదిలినది. దానికి కారణం తనకు తెలిసి ఉన్నదేమో అని తనని తను పరిశీలించుకుని ఉండాలి. కానీ అటువంటిది ఏమి అతని తపొదృష్టికి అందలేదు. కనుక ఈ విధంగా తన మనస్సు చలించుటకు కారణం ఆ లేడికి తప్పని సరిగా తెలిసి ఉండాలి.
తనకు తెలిసిన గతజన్మ గురించి చెప్పిన సంగతులను విన్న సురాష్ట్రుడు ఆమెను మానవ కన్యగా అయ్యే అవకాసం కలిగించాడు. ఆమెతో రాజ్యమునకు వెళ్లి, రాజ్య భోగములను అనుభవించాడు.

  1. ఒక తపస్వి ఇలా ఎందుకు చేసాడు ?

తపస్వి అంటే తనగురించి కాక ఈ లోకం, ప్రజల గురించి ఆలోచించే వాడు. ఆమె తన గత జన్మ గురించి చెప్తున్న సమయంలో ఆమె చెప్పిన ఒక విశేషం అతనిని ఈ విధంగా రాజ్యమునకు తిరిగి వచ్చేందుకు ప్రోత్సహించి ఉండాలి.
అది వారికి ఒక మనువు పుట్టబోతున్నాడు అని.
మనువు అంటే అత్యంత గొప్పదయిన భాద్యత. అటువంటి భాద్యతలను గ్రహించబోయే వాడు తపోధనుడయిన తనకు, విజ్ఞానవతి అయిన ఉత్పలమాలకు జన్మించటం సరి ఐనదే అని అతను భావించి, అటువంటి మనువు అరణ్యములలో ఉండే కంటే, ఒక రాకుమారునిగా పుట్టి, అలాగే విద్యాభ్యాసం చేసుకుంటే, అతనికి, అతను పరిపాలించబోయే ప్రజలకు మేలు జరుగుతుంది అని భావించి తిరిగి రాజ్యమునకు వచ్చి ఉండాలి.

నా మనస్సుకు తట్టిన విశ్లేషణ ఇది. ఇంతకంటే గొప్పగా, ఏ పండితులవారయిన చెప్పగలిగితే, వారి పాదములకు నమస్కరించి, దానిని తిరిగి మీ అందరికి తెలిపే ప్రయత్నం చేస్తాను.

27, అక్టోబర్ 2014, సోమవారం

తామస మనువు

పూర్వకాలమునందు సురాష్ట్రుడు అనే పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. అతని మంత్రి పేరు నరసింహశర్మ. సురాష్ట్రుడు ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు. యజ్ఞయాగాదులు చేస్తూ ప్రజలను తన కన్నబిడ్డలవలే చూసుకుంటూ ఉండేవాడు. యుద్ధమునకు వెళితే అరివీర భయంకరుడుగా ఉంటూ, మహశూరుడుగా గుర్తించేవారు.
అతని మంత్రి అయిన నరసింహశర్మ అత్యంత రాజభక్తి కలిగి, అన్ని కార్యములలో రాజునకు కుడి భుజంలా, తలలో నాలుకలా ఉండేవాడు. ఇతనికి  అమితమైన రాజభక్తి వలన ప్రత్యక్ష పరమేశ్వరుడైన సూర్యుని గురించి తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు వరంకోరుకోమనగా, నరసింహశర్మ తమ రాజయిన సురాష్ట్రుని మీది భక్తి, ప్రేమ వలన అతనికి అమితమైన ఆయుష్షు ఇవ్వమని కోరాడు. సూర్యుడు తధాస్తు అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు.
నరసింహశర్మ తమ రాజ్యమునకు తిరిగి వచ్చి రాజునకు జరిగిన సంగతి, అతనికి తాను సంపాదించి పెట్టిన వరమును గురించి చెప్పెను. అప్పటినుండి సురాష్ట్రుడు మరింత ధర్మబద్దంగా పరిపాలన చేయసాగాడు. ఐతే అమితమైన ఆయుష్షు ఇతనికి మాత్రమే ఉన్నది కానీ భార్యలకు, మంత్రులకు లేకపోవుట చేత వారంతా తన కన్నుల ముందరే కాల గర్భంలో కలిసిపోవుట చూసి అతనికి ఈ రాజ్యపాలనయందు విరక్తి కలిగినది. ఆ విరక్తి కారణంగా తన రాజ్యమును మంత్రిమండలికి అప్పగించి తను అడవికి వెళ్లి తపస్సు చేయనారంభించాడు.
మండు వేసవికాలంలో పంచాగ్నియందు (నాలుగు వైపులా అగ్ని కుండలు, కన్నులతో అగ్నికుండం వంటి సూర్యుని చూస్తూ) ఘోరమైన తపస్సు చేసాడు. వర్షాకాలంలో ఆకాశం క్రింద, చలికాలంలో కంఠంవరకు నీటిలో మునిగి ఘోరమైన తపస్సు చేసాడు.
కొంతకాలం అలా తపస్సులో గడచిపోయినది. తరువాత వర్షాకాలం వచ్చినది. ఆకాశం, నేల కలసిపోయే విధంగా అతి భయంకరమైన వర్షం ప్రారంభం అయినది. భూమి మొత్తం నీటితో నిండి, ప్రవహించసాగెను. సురాష్ట్రుడు కూడా ఆ నీటిలో కొట్టుకుని పోవుచుండగాఅతను ఆధారం కోసం ప్రయత్నించాడు. ఆ ప్రవాహంలో తనతోపాటు కొట్టుకు వస్తున్న ఒక లేడి ఆ రాజు చేతికి దొరికినది. అలా ఆ రాజు, లేడి కలిసి ఒక అడవికి చేరుకోగలిగారు. ఆ సమయంలో అత్యంత ఇంత తపోదనుడయిన ఆ సురాష్ట్రుని మనస్సు ఆ లేడి వలన కదిలినది. అది తనకే ఆశ్చర్యం కలిగించగా ఆ లేడిని స్వయంగా దీనికి కారణం ఏమిటి అని అడిగాడు.
దానికి బదులుగా ఆ లేడి తన గత జన్మ సంగతులు చెప్పి, ఆమె అతని మొదటి భార్య, ఉత్పలమాల అనే పేరు కల దానిని అని చెప్పినది.
ఆమె శాపవిమోచనం కలిగేందుకు రాజు సురాష్ట్రుడు ఆమెను కౌగలించుకున్నాడు.
ఆమె వెంటనే మానవ రూపమును పొందినది. ఆమెను ఉత్పలమాలగా గుర్తించి, ఆమెను తీసుకుని తమ రాజ్యమునకు తిరిగి వచ్చాడు. తన మంత్రులకు, రాజ్య ప్రజలకు జరిగిన సంగతి చెప్పి అందరి ముందు ఆమెను యధావిధిగా వివాహం చేసుకుని, సర్వభోగములను అనుభవించ సాగాడు.
కొంతకాలం తరువాత ఆ ఉత్పలమాల ఒక మంచి శుభ ముహూర్తమందు ఒక పుత్రునకు జన్మనిచ్చినది. ఆనందించిన సురాష్ట్రుడు తన రాజ్యం మొత్తం పుత్రొత్సవములను జరిపించాడు. కాలక్రమంలో ఆ పుత్రుని గారాబంగా పెంచుతూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి ఈ పుత్రుడే తామస మనువుగా ప్రసిద్ధి పొందుతాడు అని చెప్పినది. ఆ నాటి నుండి ఆ బాలుని అందరూ తామసుడు అని పిలిచేవారు.
తామసుడు అత్యంత చిన్నవయస్సులోనే అన్ని శాస్త్రములను అభ్యసించెను. తరువాత తామసునకు రాజ్యమును అప్పగించి సురాష్ట్రుడు, ఉత్పలమాల తపోవనమునకు వెళ్ళిపోయారు.
తామస మనువు జననం విశ్లేషణ ఇక్కడ చూడండి. 

ఉత్పలమాల - సురాష్ట్రుని మొదటి భార్య జన్మ వృత్తాంతం

ఉత్పలమాల సురాష్ట్రుని మొదటి భార్య. తమ అమాత్యుడు నరసింహశర్మ చేసిన తపస్సు ఫలితంగా సురాష్ట్రుడు అమితమైన ఆయుష్షు కలిగి ఉన్నాడు. కనుక కాల గమనంలో ఉత్పలమాల గతించి పోయినది.
మరు జన్మలో ధృఢధన్వుని వంశంలో జన్మించినది. కానీ ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఒకనాటి సమయంలో తన చెలికత్తెలతో వనము నందు సంచరిస్తుండగా, ఒక మునికుమారుడు ఆమెను చూసి, ఆమె అందమునకు వశుడయ్యి, తనను వివాహం చేసుకోమని కోరాడు.
ఆమెకు పూర్వజన్మ గుర్తు ఉన్న కారణంగా ఆమె మనస్సు నందు సురాష్ట్రుడు  ఉన్నాడు. కానీ ఆ విషయం బ్రాహ్మణకుమారునకు చెప్పనవసరం లేదని భావించి, " ఓ బ్రాహ్మణోత్తమా! నేను ఒక రాజ కన్యను, నీవు ముని పుత్రునివి! కనుక నీవు నీకు తగినట్లుగా ఒక బ్రాహ్మణ కన్యను చూసి వివాహం చేసుకో!" అని చెప్పినది.
అలా మాట్లాడుతున్న రాకుమారి తనను అవమానించినది అని భావించిన ఆ ముని కుమారుడు ఆమెను లేడిగా తిరుగుము అని శపించాడు.
ఆ శాపము విని భయం కలిగిన రాకుమారి ఆ ముని కుమారుని క్షమాపణ కోరి, శాపవిమోచనం చెప్పమనగా, ఆ ముని కుమారుడు ఆమె లేడిగా తిరుగుతున్న సమయంలో, సంభవించిన అత్యంత భయకరమైన వర్షం కారణంగా నీటిలో కొట్టుకు పోయే సమయమందు, నీ పూర్వజన్మ భర్త (సురాష్ట్రుడు) నిన్నుఆధారంగా చేసుకుని ఈది, గట్టుకు వచ్చిన సమయంలో, నీకు పూర్వజన్మ స్మృతి  కలుగుతుంది. అప్పుడు ఆ రాజు నీ కంఠమును కౌగలించుకొనిన మరుక్షనణం నీకు మానవ రూపం తిరిగి లభిస్తుంది. అప్పుడు నీవు అతనిని వివాహం చేసుకుని, కొంతకాలమునకు అతని కారణంగా ఒక మనువు కు జన్మనిస్తావు అని శాపవిమోచనం చెప్పారు.
కాలాంతరంలో  మనకు గల 14 మంది మనువులలో నాలుగవ వాడయిన తామస మనువు వారికి జన్మించాడు.  

21, అక్టోబర్ 2014, మంగళవారం

అష్ట నిధులు

పురాణముల ప్రకారం మనవద్ద ఉన్న ధనమును 8 నిధులు గా చెప్పబడినవి. వీని గురించి మార్కండేయ పురాణంలో చెప్పారు. అవి
  1. పద్మ: ఈ నిధికి సత్వగుణం ప్రధానం. ఈ నిధి వంశ పారంపర్యంగా క్రింది తరములకు చెందుతుంది.  అంతే కాక అది నిరంతరం వృధి చెందుతూనే ఉంటుంది. ఈ నిధి దాన ధర్మములకు, యజ్ఞ యాగాదులకు ఇతర పుణ్యకార్యములకు ఉపయోగపడుతుంది. 
  2. మహాపద్మ: ఇది కూడా సత్వగుణం కలిగిన నిధి. ఈ నిధి 7 తరములవరకు ఉంటుంది. ఇది దాన ధర్మములకు, గృహదానములకు ఇతర సత్కార్యములకు ఉపయోగపడుతుంది. 
  3. మకరనిది: ఈ నిధి మనస్సును ప్రభావితం చేసి, గొప్పలు చెప్పుకునే వారికి, ఇంకొకరితో గొడవపెట్టుకునే వారికి చేరుతుంది. ఒక జీవితకాలం మాత్రమే ఉంటుంది. 
  4. కచ్ఛపనిధి: ఈ నిధి, తాను  స్వధర్మమును వదిలి, తను తినకుండా, ఇంకొకరికి పెట్టకుండా దాచి ఉంచేది. ఇది అతి తక్కువ కాలం చాలా తక్కువకాలం ఉంటుంది. 
  5. ముకుంద: ఈ నిధి రజోగుణం కలది. తమ భోగములను, సుఖములను చూసుకుంటూ, ఇతరులను అవమానించుటకు కూడా వెనుకాడరు. ఈ నిధి కూడా అత్యంత తక్కువ కాలం ఉంటుంది. 
  6. కుంద: ఈ నిధి రజోగుణ ప్రధానమైనది. 7 తరములవరకు నిలిచి ఉంటుంది. ధాన్యమును అమ్ముటవలన ప్రాప్తిస్తుంది. అతిధులను, బంధువులను పోషించుటకు, తమ భోగమునకు ఉపయోగపడుతుంది. 
  7. నీల నిధి: ఇది సర్వ తమోగుణములు కలిగి ఉంటుంది. ఈ ధనం 3 తరములవరకు ఉంటుంది. జ్ఞానం లేని మూర్ఖులుగా ఉంటారు.
  8. శంఖము: ఇది మరింత రజోగుణం కలిగి ఉంటుంది. తను ఒక్కడే తింటూ, తన స్వంత అనుకూలములను చూసుకుంటూ, భార్యా బిడ్డలకు కూడా పెట్టే ఆలోచన కూడా చేయరు. ఇది అత్యంత తక్కువ కాలం ఉంటుంది.