7, ఫిబ్రవరి 2022, సోమవారం

సంధ్య- ఛాయ- సూర్యుడు- విశ్వకర్మ

  మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, యమునికి చాయాదేవి ఇచ్చిన శాపం గురించి, ఆ శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

తన భార్య పిల్లలమీద వివక్ష చూపడానికి కారణం తెలుసుకోవడానికి సూర్యుడు తిన్నగా ఛాయాదేవి వద్దకు వెళ్ళి ఆమె పిల్లల మధ్య అలా ఎందుకు వివక్ష చూపుతోందో అని అడిగాడు. ఆమె సూర్యునికి సరి అయిన సమాధానం చెప్పలేక పోవాడాన్ని గమనించిన సూర్యునికి అమె పై అమితమైన కోపం వచ్చింది. అప్పుడు అతను ఆమెను శపిస్తానని అన్నాడు. సూర్యుని మాటలకు భయపడి, ఆమె సంధ్యాదేవికి ఇచ్చిన మాట ప్రకారం ప్రాణ సంకట సమయంలో నిజమును చెప్పవచ్చు అని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు తన ప్రాణములకు సంకటం ఉన్నది అని గమనించి ఆమె నిజాన్ని అతనికి తాను సంధ్యాదేవిని కానని, ఆమె తయారు చేసిన ఒక ఛాయను మాత్రమే అని, సంధ్యాదేవి చాలాకాలం క్రితమే తనను అక్కడ ఉంచి వెళ్ళిందనీ, సావర్ణి, శనైశ్చరుడు తన పిల్లలు అని చెప్పింది.  

ఛాయాదేవి చెప్పిన  విషయాలను విన్న సూర్యుడు సంధ్యాదేవి ఇంకా పుట్టింట్లోనే ఉన్నది అనే ఆలోచన వల్ల మామగారయిన దేవశిల్పి విశ్వకర్మ దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. సూర్యుడు చెప్పిన విషయాలను విన్నవిశ్వకర్మ, కొంతకాలం క్రితం  తన కుమార్తె తన వద్దకు వచ్చిందనీ,  వచ్చినప్పుడు ఆమె సుర్యుని వేడిని తాను భరించలేక పోతున్నందున అలా వచ్చినట్లు చెప్పిందని, ఆమెకు నచ్చజెప్పి ఆమెను తిరిగి పంపానని, ఆమె అప్పుడే తన వద్ద నుండి తిరిగి వెళ్ళి పోయిందని చెప్పాడు. అప్పుడు ఆమెకు ప్రియం కలిగించేలా సూర్యునికి అతని వేడిని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తానని  దేవశిల్పి విశ్వకర్మ చెప్పాడు. మామగారు చెప్పిన మాటలు విన్న సూర్యుడు  అతను చెప్పిన మాట ప్రకారం  ఒక భ్రమియంత్రంలో ప్రవేశించి అతని ప్రకాశమును 16వ వంతునకు తగ్గించుకున్నాడు.

ఆ తరువాత సూర్యుడు స్వయంగా తన దివ్య దృష్టి ద్వారా తన భార్య సంధ్యాదేవి ఎక్కడ ఉన్నదో తెలుసుకుని, ఆమె  వద్దకు వెళ్ళాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి