19, ఫిబ్రవరి 2022, శనివారం

దమయంతి -- హంస

మనం ఇంతకు ముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావాన్ని తగ్గించుకునే శ్లోకాన్ని తెలుసుకున్నప్పుడు నలుని గురించిన ప్రస్తావన,  నలునికి హంస దొరకడం గురించి, ఆ హంస దమయంతికి అతని గురించి చెప్తాను అని చెప్పడం గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు దమయంతి గురించి తెలుసుకుందాం!
విదర్భరాజు భీముడు, అతని భార్య కు సంతానం లేదు. వారు దమనుడు అనే మహర్షికి అనేక సపర్యలు, సేవలు చేసి అతని అనుగ్రహాన్ని సంపాదించారు. అప్పుడు వారికి దముడు, దాంతుడు, దమనుడు అనే ముగ్గురు కుమారులు, దమయంతి అని ఒక కుమార్తె కలిగారు. ఆమె అపురూప సౌందర్యవతి, గుణశీలి. ఎలావేళలా ఆమెను కనిపెట్టుకుని ఉండడానికి అమె చుట్టూ అనేకమంది పరిచారికలు ఉండేవారు. వారు నలుని గురించి అనేక విషయములు చెప్తూ ఉండేవారు. వారి వద్ద నుండి నలుని ప్రసంశలు విన్న దమయంతి మనస్సులో నలునిపై ప్రేమ చిగురించింది. 
ఆ సమయంలోనే నలుని దగ్గరి నుండి వచ్చిన హంసల గుంపు ఆమె ఉన్న ఉద్యానవనమునకు వచ్చింది. ఆ హం స ల గుంపును చూసిన ఆమె చెలికత్తెలు వానిని పట్టుకోవాలని ప్రయత్నించసాగారు. అక్కడ జరుగుతున్న కోలాహలం వల్ల హంసలు అటూ ఇటూ పరుగులు పెడుతూ వారికి దొరకకుండా తప్పించుకోసాగాయి. కానీ నలునితో మాట్లాడిన హంస తనకు తానుగా వచ్చి దామయంతీదేవి కి దొరికిపోయింది. అంతేకాక ఆ హంస నలుని ప్రస్తావన తెచ్చి, ఈ భూమండలంమొత్తం మీద ఆమెకు భర్త కాగలిగిన సుందరుడు, రాఅజ కుమారుడూ కేవలం నలుడు మాత్రమే అని అనేక విధములుగా చెప్పింది. ముందే నలుని గురించి ఆలోచనలలో ఉన్న దమయంతికి ఇప్పుడు హంస కూడా అలాగే చెప్పడమ్ వల్ల ఆమె మరింతగా అతని ఆలోచనలలో మునిగిపోయింది. ఆమె చెలికత్తెల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆమె తండ్రి భీముడు ఆమెకు స్వయంవరాని ఏర్పాటు చేసాడు. 
మరి ఆమె తనకు నచ్చిన వరుడిని స్వయంవరంలో వరించిందా? ఆ స్వయంవరం ఎంత విచిత్రంగా జరిగింది? అనే విషయాలు తరువాతి టపాలలో చుద్దాం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి