25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

పుష్పక విమానం రావణునికి ఎలా లభించింది?

 మనం ఇంతకుముందు దశగ్రీవుడు అత్యంత బలశాలి, సకల శాస్త్రముల జ్ఞానము కలిగి ఉండి కూడ  తన చుట్టూ ఉన్నవారి మాటలు విని తన వివేకాన్ని పూర్తిగా కోల్పోతున్న విధానాన్నిచూసాం! ఇంతకు ముందు భాగంలో మనం దశగ్రీవుని అరాచకాలను గురించి విన్న కుబేరుడు తన తమ్ముని ధర్మమార్గంలోనికి మార్చడానికి ఒక ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నం గురించి, దానికి దశగ్రీవుడు ఎలా స్పందించాడు అని తెలుసుకుందాం!

కుబేరుడు తన తమ్ముని అధర్మ ప్రవృత్తి గురించి తెలుసుకుని, అతనిని మంచి మార్గంలోనికి మార్చడనికి ఒక ప్రయత్నం చేయడనికి ఒక దూతను పంపాడు.  ఆ దూత దశగ్రీవుని వద్దకు వచ్చి, కుబేరుడు అతనికి చెప్పమన్న అన్ని విషయములను చెప్పాడు. కానీ ముందే అధర్మ మార్గంలో ఉన్న దశగ్రీవునికి ఆ మాటలు రుచించలేదు. అంతేకాక ఆ మాటలలో కుబేరుడు తాను పరమశివునకు మిత్రుడని చెప్పడం అతని అహానికి పెద్ద శరాఘాతంగా అనిపించింది. కుబేరుడు తనను హెచ్చరిస్తున్నట్లుగా అతనికి అనిపించింది. దానివలన అతను తన ఆధిపత్యాన్ని చూపించడానికి, కుబేరుని దూతను హతమార్చాడు. అంతేకాక అతను స్వయంగా కుబేరుని పై యుధ్ధాన్ని ప్రకటించాడు. 

అలకాపురి చుట్టూ తన రాక్షససేనను మొహరింపజేసాడు. ఆ సేనను చూసిన యక్షులు కూడా తమ యుధ్ధాన్ని ప్రారంభించారు. యుధ్దం హొరాహోరీగా సాగింది. అనేక మంది యక్షులు తమ ప్రాణాలను కోల్పోయారు.  ధర్మ యుధ్దం చేస్తున్న కుబేరుడు రాక్షస సేనలను తమపురినుండి తరమ సాగాడు. తమ అపజయాన్ని పసిగట్టిన దశగ్రీవుడు మాయా యుధ్ధాన్ని ప్రారంభించాడు. ఆ మాయా యుధ్ధంలో కుబేరుడిని దశగ్రీవుడు ఒడించాడు. అతని దగ్గరి నుండి పుష్పకవిమానమును లాక్కున్నాడు. అప్పటినుండి ఆ పుష్పక విమానం అతని వద్దనే ఉంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి