విశ్లేషణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విశ్లేషణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఫిబ్రవరి 2022, బుధవారం

విదుర నీతి - 4

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో మూడు భాగములు చెప్పుకున్నాం కదా! మూడవ భాగంలో విదురుడు దృతరాష్టృని అదిగిన ప్రశ్నల గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు ఆ ప్రశ్నలకు దృతరాష్టృడు సమాధానం ఇచ్చాడా లేదా? అని తెలుసుకుందాం!

సంస్కృత శ్లోకం:

శ్రోతుమిచ్ఛామి తే ధర్మ్యం పరం నైఃశ్రేయసం వచః

అస్మిన్రాజర్షివంశే హి త్వమేకః ప్రాజ్ఞసంమతః

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః 

అనవిని ధృతరాష్టృండనె, విను కౌంతేయాగృజోక్తివినకునికంజిం

తనుజెంది ధర్మమునీ,లిని రాజర్షికులవర్య తెలియంజెపుమా

భావంః

విదురుని మాటలు విన్న దృతరాష్టృడు, కౌంతేయ పుత్రులలో పెద్దవాడయిన ధర్మరాజు మాటలు (సమాధానం) సంజయుడు చెప్పనందువల్ల కలిగిన ఆలోచన కారణంగా, ఈ రాజర్షికులములో పుట్టిన నీ నోటి నుండి ధర్మబద్దమయిన గొప్ప  శుభములను కలిగించే మాటలను వినాలి అనుకుంటున్నాను. 

విశ్లేషణః

ఇక్కడ దృతరాష్టృడు విదురునికి సమాధానం ఇచ్చాడా లేదా? అబద్దం అయితే చెప్పలేదు. అలాగని నిజము పూర్తిగా చెప్పలేదు. ఈ సందర్భంలో మనకు దృతరాష్టృని లౌక్యం తెలుస్తుంది. అతనికి  మంచి చెడుల మద్య వ్యత్యాసం బాగా తెలుసు. కానీ ఆమాటలు బయట పెట్టని లౌక్యం ఉంది. మంచి మాటలు వినాలని ఉంది తప్ప ఆ మాటలలోని మంచిని స్వీకరించే మనస్తత్వం మాత్రం లేదు. 

29, జనవరి 2022, శనివారం

విదురనీతి - 3

 మనం ఇంతకు ముందు విదురనీతి శీర్షికలో రెండు భాగాలు  చెప్పుకున్నాం! రెండవ భాగంలో దృతరాష్ట్రుడు విదురుని ప్రశ్నించటం చూశాం! ఇప్పుడు ఆ విదురుడు చెప్పే సమాధానం ఎంత విచిత్రంగా ఉందో  చూద్దాం!

సంస్కృత శ్లోకం:

అభియుక్తం బలవతా దుర్బలం హీనసాధనం 

హృతస్త్వం కామినం చోరమావిశన్తి ప్రజాగరాః

కచ్చిదేతైర్మహాదోషైర్న స్పృష్టోసి నరాధిప

కచ్చిన్న పరవిత్తేషు గృధ్యన్నిపరితప్యసే

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

ఇలబలశాలితోడ నెదురేగెడు హీనబలుడు నన్యకాం 

తల నెదగోరువాడపహృతస్వుడు చౌర్యసమర్ధుడన్న వీ 

రలు గతనిద్రులౌదురు ధరావరయుంటివె వీరిలోన న 

న్యుల ధనమున్ హరింపదలపుంచితివే కతమెద్ది మేల్కొనన్ 


భావం:

ఓ మహారాజా! తనకంటే బలవంతుడిని ఎదుర్కోబోతున్న వాడు, తన ఆస్తిని/ సొమ్మును అంతటినీ పోగొట్టుకున్న వాడు , పరస్త్రీలను మనసునందు కోరుకుంటున్న వానికి, ఇతరుల సంపద దోచుకోవాలని అనుకున్న వారికి నిద్ర రాదు. కనుక మహారాజా మీరు ఇటువంటి ఆలోచనలు ఏమయినా ఉన్నాయా!

విశ్లేషణ:

మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు విదురుడు సాక్షాత్తు ధర్ముని అవతారం. అతనికి ధర్మాధర్మముల విచక్షణ ఉంది. ఇక్క డ దృతరాష్ట్రుడు రాజు, విదురుడు అతనికి వరుసకు తమ్ముడే అయినా అతనికి కేవలం సలహాలు చెప్పే అవకాశం తప్ప అతనిని తిన్నగా ప్రశ్నించే అవకాశం లేదు. కనుక పైన అడిగిన ప్రశ్న అడిగాడు. ఆ సమాధానం చుస్తే నిజంగా అన్ని సందర్భాలు కూడా ఆ సమయంలో దృతరాష్ట్రునికి సంబంధించినవే. 

సంజయుడు పాండవుల సభలో ఎం జరిగిందో ధృతరాష్ట్రునికి చెప్పలేదు. 

తనకంటే బలవంతుడిని : ధృతరాష్ట్రునికి అన్ని వేళలా తమకంటే పాండవులే బలవంతులు అనే నమ్మకం ఉంది. కనుక ఒక వేళ వారు సంధికి ఒప్పుకోకుండా తిన్నగా యుద్ధానికి రమ్మన్నారేమో అని అతని అనుమానం!

తన ఆస్తిని/ సొమ్మును అంతటినీ పోగొట్టుకున్న వాడు: ధృతరాష్ట్రునికి ఆ రాజ్యం మీద సింహాసనం మీద విపరీతమయిన వ్యామోహం. అదే అతని సర్వస్వం. దానిని ఆ పాండవులు లక్కుంటారేమో అని భయం

పరస్త్రీలను మనసునందు కోరుకొనుట:  ఇది ధృతరాష్ట్రుని దృష్టి కాక పోయినా, ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తున్నప్పుడు, అతను ఏమీ మాట్లాడలేదు, పరస్త్రీని మనస్సులో కొరుకొవడానికీ, ఆమెకు నలుగురిలో అవమానం జరుగుతున్నప్పుడు దానిని ఆపకుండ ఉండడానికి తేడాలేదు

ఇతరుల సంపద దోచుకోవడంః నిజంగా ధృతరాష్ట్రునికి పాండవుల రాజ్యమును దోచుకోవాలని కోరిక ఉంది. 

ఇది విదురుని గొప్పతనం. తాను అడగాలని అనుకున్నది అడుగుతూనే, మహారాజు తప్పులను ఎత్తి చూపటం. 

28, జనవరి 2022, శుక్రవారం

కలికాల ప్రభావాన్ని తప్పించుకునే మార్గం

 మనం ఇంతకు ముందు కలి ప్రభావం, కలికాలంలో మానవుని లక్షణముల గురించి తెలుసుకున్నాం కదా!

ఇప్పుడు ఆ కలి ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఒక సులభమయిన మార్గం గురించి చెప్పుకుందాం!

ఈ మార్గన్ని స్వయంగా వ్యాసభగవానుడే మహాభారతంలో అరణ్యపర్వంలో చెప్పాడు. మనం ఇప్పుడు వ్యాసుడు చెప్పిన సంస్కృత శ్లోకం, దాని కవిత్రయ భారతంలోని తెలుగు అనువాదం కూడా చెప్పుకుందాం!

శ్లోః 

కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ

ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం

 తెలుగు అనువాదంః

కర్కోటకుని, దమయంతి, బుణ్యమూర్తియైన నలుని

ఋజు చరిత్రుడైన ఋతుపర్ణు గీర్తింప గలిభయంబు లెల్ల గ్రాగు నధిప

భావంః కర్కోటకుడు అనే పాము, భార్యాభర్తలయిన నల దమయంతుల గురించి, రఘువంశజుడయి మంచి ప్రవర్తన కలిగిన ఋతుపర్ణుడు అనే రాజుని నిరంతరం తలుచుకొనుట వలన కలి వలన కలిగే భయములు అన్నీ తొలగుతాయి. 

విశ్లేషణ

ఈ శ్లోకమును వ్యాసుడు నలదమయంతుల కధకు ఫలశ్రుతిగా చెప్పాడు. వీరి కధ అనేక మలుపులతో ఆసక్తి దాయకంగా ఉంటుంది. ఎంతో అన్యోన్య దాంపత్యమునకు ఉదాహరణగా నలదమయంతులు, వారు విడిపోయిన సమయంలో దమయంతి చూపిన మనోధైర్యం, నలుడు తాను  దూరమయితే తన భార్య పుట్టింటికి వెళ్ళి సంతోషిస్తుంది అనే త్యాగం, తనకు ఉపకారం చేసిన వ్యక్తికి అపకారం రూపంలో ఉపకారం చేసిన కర్కోటకుడు, తాను ఒక రాజు అయ్యి ఉండీ తన వద్ద పనిచేసే ఒక వ్యక్తికి ఎలా మర్యాద ఇవ్వలి, ఒక విషయం వారి వద్ద నేర్చుకున్నప్పుడు వారికి తిరిగి ప్రత్యుపకారం ఎలా చేయాలి అని ఋతుపర్ణుని వద్ద మనం నేర్చుకోవలసిన పాఠములు. ఈ విషయములు అన్నీ మనం అర్ధం చేసుకోగలిగినప్పుడు, కలి అనే విషప్రభావం నుండి మనం బయట పడగలుగుతాము.

ఈ పాఠములు మనం రాబోయే టపాలలో తప్పకుండా నేర్చుకుందాం!

23, మే 2020, శనివారం

రామ, హనుమల తొలి పరిచయం! హనుమంతుని వేషం!

రామాయణంలో కథను మలుపు తిప్పే ఘట్టములలో ముఖ్యమయినది హనుమంతుడు శ్రీరాముని కలుసుకునే ఘట్టం. 
రాముని, లక్ష్మణుడిని కలుసుకునే సమయమునకు హనుమంతుడు సుగ్రీవుని వద్ద మంత్రిగా ఉన్నాడు. ఆ సమయమునకు సుగ్రీవుడు తన రాజ్యమును కోల్పోయి, తన సొంత అన్నగారయిన వాలితో శత్రుత్వం వలన ప్రాణ భయంతో ప్రపంచం మొత్తం తిరిగి, చివరకు వాలి రాకుండా ఉండగలిగిన ప్రాంతం ఋష్యమూకం అని తెలుసుకుని ఆ పర్వతం మీద నివాసం ఉంటున్నాడు. ఆ సమయమునకు అతనితో హనుమంతుడు, జాంబవంతుడు మొదలయిన ముఖ్యులు ఉన్నారు. 
ఆ సమయంలో ఋష్యమూక పర్వత ప్రాంతంలో కొత్తగా కనిపించిన, ముని వేషదారులయిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవునికి వాలి తనకోసం వారిని పంపించాడేమో అన్న భయం కలిగింది. ఆ భయమును తననుండి దూరం చేయవలసినదిగా తన మంత్రి అయినా హనుమంతుని కోరాడు. దానికోసం హనుమంతుడు ఆ ఇద్దరు ముని వేషదారుల పూర్వాపరముల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆ విధమయిన విషయములు తెలుసుకోవాలంటే ముందు ఆ ఇద్దరికీ  ప్రశ్నలు అడుగుతున్నా వారి మీద నమ్మకం కలగాలి . ఒక వేళ ఆ వచ్చినవారు వాలి తరపున వచ్చి ఉంటే వారిని అక్కడే నిలువరించే సాహసం కలవాడు హనుమంతుడు కనుక సుగ్రీవుడు హనుమంతుడిని ఆ పనికోసం పురమాయించాడు.  
ఇప్పుడు సమస్య హనుమంతుడు ఏ వేషంలో వారి ముందుకు వెళ్ళాలి అని!
అనేక రామాయణములలో ఈ ఘట్టం లో హనుమంతుడు 
  1. భిక్షకుని/ సన్యాసి వేషం  అని  చెప్తారు.  
  2. వటువు / బ్రహ్మచారి వేషం అని చెప్తారు. 
మరి ఇంతకూ హనుమంతుడు ఈ వేషంలో వెళ్ళాడు?
  1. భిక్షకుని/ సన్యాసి వేషం ః ఒకవేళ హనుమంతుడు సన్యాసి వేషంలో వెళ్ళినట్లయితే, కథప్రకారం హనుమంతుడు ఆ సోదరుల వద్దకు చేరగానే వారికి నమస్కరించాడు. ఒక భిక్షకుడు / సన్యాసి గృహస్తుకు నమస్కారం చేయడు. హనుమంతుడు భిక్షకుని/ సన్యాసి వేషం లో కనుక అలా చేస్తే రామ లక్ష్మణులకు ముందుగా అతని మీద అనుమానం కలుగుతుంది. తరువాతి ఘట్టములు మన ఊహకు అందని విధం గ ఉండేవి. సుగ్రీవ రాముల మైత్రి ప్రారంభం కూడా అనుమానాస్పదంగానే ఉండేది కదా! 
  2. వటువు / బ్రహ్మచారి వేషం: ఈ వేషం అయితే ఎవరికీ అయినా నమస్కారం చేయవచ్చు. అంటే కాకుండా ఇతను ఆ ఇద్దరినీ ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనే సంకల్పంతో వచ్చాడు కనుక వటువు వేషం అయితే అతను ఈని ప్రశ్నలు అడిగినా వటువుకు కలిగిన సహజసిద్దమయిన జిజ్ఞాస వలన అడుగుతున్నాడు అని అనుకోవటానికి ఆస్కారం దొరుకుతుంది. 
కనుక హనుమంతుడు తొలిసారిగా రామలక్ష్మణులను కలసినప్పుడు ఆటను బ్రహ్మచారి వేషంలో కలిసాడు. 







20, ఏప్రిల్ 2020, సోమవారం

అజ్ఞాన భూమిక

అజ్ఞాన భూమిక అంటే మనలో అజ్ఞానము స్థిరముగా ఉండటానికి కారణములు అని అర్ధము.  ఆ అజ్ఞాన భూమికలు ఏడు ఉన్నాయి. వీని గురించి  శ్రీసీతారామాంజనేయ సంవాదం అనే గ్రంధంలో చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం!!


  1. బీజాగ్రము:: నామ రూప రహిత,  అఖండ  పరిపూర్ణ స్చచిదానంద పరబ్రహ్మమందు జగత్తు ని సృషించాలి అనే ఆలోచన  బీజాగ్రము
  2. జాగ్రము::  ఆ ఆలోచన కలుగుటకు ముందులేని బేధము/ మార్ఫు చిన్నగా మొదలయ్యి అది ప్రపంచముగా మార్ఫు  చెందుట జాగ్రము
  3. మహాజాగ్రము:: ప్రపంచము లో  వచ్చిన అనేకములయిన మార్పులకు అనుగుణముగా మారుట మహాజాగ్రము
  4. జాగ్రత్స్వప్నము:: జాగ్రదవస్థ లో కనిపించని వానిని ఉహించి, మనస్సులో దానిని గురించి ధ్యానము చేయుట జాగ్రత్స్వప్నము. (పగటి కలలు)
  5. స్వప్నము:: జాగ్రదవస్థలో లేనప్పుడు కల్పితమయిన రూపములు చూచుట ఆజాగ్రమందు కల్పిత స్వరూపములు చూచుట స్వప్నము
  6. స్వప్నజాగ్రము:: ఇంతకు  ముందు జరిగినదానిని మరల మరలా గుర్తుకు తెచ్చుకోవటం స్వప్నజాగ్రము
  7. సుషుప్తి:: ఆత్మ ప్రతిబింబముగా అనిపిస్తున్న జగత్తుకు సంబందించిన విషయములలో మునుగుట సుషుప్తి




11, ఏప్రిల్ 2020, శనివారం

అనగనగానే ఎందుకు?

మొన్న ఆ మధ్య ఒక మిత్రుడు ఈ ప్రశ్న వేసాడు. మన తెలుగు కధలు అన్నీ  అనగనగా అనే ఎందుకు మొదలవుతాయి అని?
నాకు కూడా ముందుగా తెలియలేదు కానీ ఆలోచిస్తే ఒక సమాధానం దొరికింది. ఈ సమాధానం మీకుకూడా సమంజసంగా ఉంటుందేమో చూద్దామా!

ఈ మధ్య సినిమాలు, సీరియళ్లు చూస్తున్నప్పుడు వానికి ముందు "DISCLAIMER" అని ఒకటి వేస్తున్నారు కదా! అంటే ఈ సినిమాలోని పాత్రలు కేవలం కల్పితం ఎవరినీ  ఉద్దేశించినవి కావు అని, అలాగే మన అనగనగా కూడా ఒక "DISCLAIMER" అని నా ఉద్దేశం. 

అంటే ఈ కధ నేను చెప్పటంలేదు, నాతో ఎవరో అన్నారు, వారితో ఇంకెవరో అన్నారు, ఇలా అందరూ  అనగనగా ఆ కధ నేను మీకు చెప్తున్నాను అని అయ్యి ఉంటుంది అని నా భావన. 

ఒకవేళ మీకు ఎలా కాకుండా ఇంక  ఏమయినా సమాధానం తెలిస్తే దయచేసి చెప్పగలరు!

6, మే 2019, సోమవారం

రామాయణం - 7 చక్రములు

మనం ఇంతకు ముందు మనం రామాయణం దానిలోని ఆధ్యాత్మిక అర్ధం గురించి చెప్పుకున్నాం కదా! ఆ రామాయణం మానవునిలో ప్రాణశక్తిని మేల్కొలిపి 7 చక్రములను జాగృతం చేసి పరమాత్ముని చేరుకొనే మార్గంలో కలిగే అనేకములయిన అనుభవాలను చెప్తుంది అని పెద్దల వాక్కు. అయితే రామాయణంలో ఏ సంఘటనలు ఆయా చక్రములను సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం!


  1. మూలాధారం: రామాయణంలో శివధనుర్బంగం జరిగిన సంఘటన ను మూలాధారంగా చెప్తారు. స్థిరత్వమును చేకూర్చే ఈ చక్రమును శ్రీరాముని కళ్యాణముతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  2. స్వాధిష్టానం: రామాయణంలో కైక అడిగిన రెండు వరముల కారణంగా శ్రీరాముడు వనవాసమునకు వెళ్లే సంఘటనను స్వాధిష్టాన చక్రం గా చెప్తారు. భావావేశములకు మూలమయిన ఈ చక్రమును విపరీతమయిన భావావేశము నిండిన ఈ సంఘటనతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  3. మణిపుర: వనవాసమునకు వెళ్లిన సీతారాములకు దివ్యమయిన ఆభరణములు పరమ పతివ్రత అయిన అనసూయాదేవి ఇవ్వటం అనే సంఘటనను మణిపుర చక్రంగా చెప్తాము. ఈ ఆభరణములు తరువాతి కధలో అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తాయి. అటువంటి దివ్య మణిమయములయిన ఆభరణములు సీతాదేవికి సంక్రమించే సంఘటనను మణిపుర చక్రంతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  4. అనాహతం: వనవాసం సజావుగా ఆనందముగా సాగుతున్న సమయములో శూర్పణఖ ప్రవేశించుటను అనాహత చక్రంతో పోల్చారు. సరిగ్గా రామాయణంలో అసురవధ ఈ ఘట్టంతరువాతనే ముఖ్యంగా జరుగుతుంది కనుక అడ్డంకులు తొలగించు అనాహత చక్రం తో ఈ సంఘటనను పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  5. విశుద్ధి: సీతా వియోగం వలన పరితపిస్తున్న శ్రీరాముడు  పరమ శుద్ధ భక్తురాలయిన శబరిని కలిసిన సంఘటనను ఈ విశుద్ధి చక్రంతో పోల్చారు. 
  6. ఆజ్ఞా: రామాయణంలో సుగ్రీవుని ఆజ్ఞతో సీతాదేవిని వానరులు వెతుకుటకు బయలుదేరు సంఘటనను ఆజ్ఞా చక్రం మొదలుగా పోల్చారు. అయితే సహజంగా ఈ చక్రం వరకు చేరిన ప్రాణమునకు దివ్య దర్శనం జరుగుతుంది. మరి రామాయణంలో జరిగిన ఆ క్షణకాల దివ్య దర్శనం ఎం అయ్యి ఉంటుంది?  దీనికి సమాధానంగా మన పెద్దలు కిష్కిందకాండలో సీతను వెతుకుతూ వెళ్లిన హనుమంతుడు మొదలగు వారికి కలిగిన ఒక అనుభవాన్ని చెప్తారు. సూర్యప్రభాదేవి . అనుకోకుండా ఒక కొండా గుహలో బందీలయిన వానర వీరులను సూర్యప్రభాదేవి ఒక్క క్షణకాలంలో సముద్ర తీరమునకు చేర్చుతుంది. 
  7. సహస్త్రారం: ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది అని చెప్పుకున్నాం కదా! రామాయణంలో శ్రీరామ పట్టాభిషేకం ఘట్టమును ఈ చక్రముతో పోల్చారు. 

14, ఏప్రిల్ 2019, ఆదివారం

రామాయణము - ఆధ్యాత్మిక అర్ధము

రామాయణము లోని  కధ చిన్నపిల్లలకు కూడా చాల బాగా తెలుసు. ఈ కధలోని విశిష్టత పట్టే, కొట్టే , తెచ్చే అను మూడు మాటలలో చెప్పవచ్చు. ఆలా కాకుండా సవిస్తారంగా వర్ణించవచ్చు. సర్వదా ఒక మానవుడు ఏ మార్గంలో చరించాలో చెప్పేది రామాయణం. ఇప్పుడు ఆ కథను మనం క్లుప్తంగా చెప్పుకుందాం! ఆ తర్వాత ఆ కధలో దాగిఉంది అని మన పెద్దలు చెప్పిన ఆధ్యాత్మిక కోణం గురించి తెలుసు కుందాం!
కథ : రాముడు సీత దంపతులు. పదితలలు ఉన్న రావణాసురుడు ఆమెను అపహరించి, సముద్రం అవతల లంకలో దాచివుంచాడు. అప్పుడు రాముడు హనుమంతుని సహాయంతో సీత లంకలో ఉన్నదని గుర్తించి రావణుని సంహరించి సీతను తిరిగి తెచ్చుకున్నాడు.

ఆధ్యాత్మిక అర్ధము: అర్ధము తెలుసుకోవటానికి ముందు ఇంకా కొన్ని విషయములు చూద్దాం!

రాముడు - పరబ్రహ్మ
సీత - జీవాత్మ / జీవరూపిణి
దశకంఠుడు, రావణుడు - దశ ఇంద్రియములు
సముద్రం - సంసారం
లంక - దేహం
హనుమంతుడు - గురువు

పరబ్రహ్మ నుండి జీవాత్మను దశ ఇంద్రియములు దూరం చేస్తాయి. పరబ్రహ్మ కు జీవాత్మకు మధ్య సాగరమే సంసారం మరియు దేహమనే లంకలో జీవాత్మ బంధించ బడింది. జీవాత్మ పరమాత్మను చేరుకోవాలంటే గురువు ప్రమేయం తప్పనిసరిగా అవసరం. 

6, ఏప్రిల్ 2019, శనివారం

భరతుడు వంటి సోదరుడు ....

భరతుడు, రామాయణం లోని అనేక వ్యక్తుల చేత అనుమానించబడిన వాడు. దశరధుడు, గుహుడు చివరకు తన సోదరుడయిన లక్ష్మణుడు కూడా అతనిని అనుమానించారు. అటువాని భరతుని గురించి శ్రీ రాముడు ఏమన్నాడో తెలుసా!
న సర్వే భ్రాతర స్తాత భవంతి భారతోపమాః 
 అంటే భరతుని వంటి సోదరుడు ఎవరికయినాను లభించుట దుర్లభము అని అర్ధము.  మరి శ్రీ రామునితో అంత చక్కగా తనగురించి చెప్పించుకున్న భరతుడు ఎలాంటి వాడు? నిజంగా శ్రీ రామునితో అటువంటి పొగడ్తలకు అర్హుడా?

అర్హుడే అని వాల్మీకి రామాయణం చెప్తుంది. దానికి కారణం అతని హృదయంలోగల భాతృ భక్తి. దానికి ఈ కింద శ్లోకమే తార్కాణం.

అభిషేక్ష్యతి రామతు రాజా యజ్ఞంను యజ్ఞంను యక్ష్యతే!
ఇత్యహం కృత సంకల్పో హృష్టో యాత్రా మాయాశిషం!!
తదిదం హ్యన్యధా భూతం వ్యవదీర్ణం మనోరమ !!!

     నేను ఏంతో సంతోషంగా తాతగారి ఇంటికి వెళ్ళాను. నేను అటు వెళ్ళగానే తండ్రిగారి అన్నగారయిన శ్రీరాముని రాజుగా ప్రకటించి, పట్టాభిషేకం చేసి ఆ తరువాత యాగాన్ని కూడా జరిపించి ఉంటారని అనుకున్న.  ఈ శ్లోకమునకు ఉన్న అర్థమును చూసి మన పెద్దలు భరతుని వ్యక్తిత్వమును చాలా చక్కగా విశ్లేషించారు. భరతుడు ఈ విధంగా అనుకున్నాడు అంటే, అతను శ్రీరామ పట్టాభిషేకం అతని పరోక్షంలో జరగాలని అనుకున్నాడు. అలా ఎందుకు అనుకోని ఉండవచ్చు? 2 కారణములు 
  1. భరతునికి రాజ్యకాంక్ష ఉండి శ్రీరామునికి పట్టాభిషేకం అవుతుంటే చూడలేక !
  2. భరతునికి దశరధుడు తన తల్లి కైకేయికి వివాహం జరిగిన సమయంలో ఆమె తండ్రికి ఇచ్చిన మాట తెలిసి. 
ఈ రెండు సందర్భాలలో మొదటిది అసలు సంభవమే కాదు, ఒకవేళ తాను శ్రీరామ పట్టాభిషేకం చూడలేక అమ్మమ్మగారి ఇంట్లో ఉండగా పట్టాభిషేకం జరిగి పోవాలి అని కోరుకుంటే, అతను తిరిగి వచ్చాక రాజ్యం అకంటకంగా తన పరం అవుతున్నప్పుడు మరలా రామునికోసం అడవులలోనికి పరుగులు పెట్టాడు కదా!
అంటే దీనిని బట్టి మన పెద్దలు ఎలా విశ్లేషించారంటే భరతునికి దశరధుడు తనతల్లికి ఇచ్చిన 2 వరముల గురించి తెలిసిన తెలియక పోయినా, తన తాతగారికి దశరధుడు ఇచ్చిన వాగ్దానం బాగా తెలుసు.  దశరధుని రాముని పైన గల ప్రేమ, రామునికి గ రాజ్య పరిపాలనా దక్షత , రాజ్యంలో ప్రజల కు రాముని పై గల ప్రేమ అన్ని తెలుసు. కనుక రాజ్యమును పరిపాలించే అవకాశం తనకు ఉంది తెలిసినా తన అన్నగారికి పట్టాభిషేకం జరగాలి అని కోరుకున్నాడు. మరి అటువంటి భరతుని గురించి రాముడు ఆలా చెప్పటం చాలా సబబే కదా!

2, ఏప్రిల్ 2019, మంగళవారం

రామాయణం - వేదం

రామాయణం సాక్షాత్తు  వేదం అని చెప్తారు.

వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే 
వేదః ప్రాచేసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా!

పరమాత్మ వేదవేద్యుడు. అంటే పరమాత్మ కేవలం వేదముల ద్వారానే తెలియదగినవాడు. అలాగే వేదములు కేవలం పరమాత్మగురించి మాత్రమే చెప్తాయి. కానీ ఒకసారి పరమాత్మ హఠాత్తుగా తన నామ,రూప, స్థానములను మార్చుకుని దశరథాత్మజుడు అయ్యాడట. అతని రూప, నామ , స్థానములు తెలియని వేదం సతమతమయ్యి అతని కోసం వెతికినదట. ఎక్కడ వెతకాలి తెలియక కవి మరియు ఋషి అయిన వాల్మీకి దగ్గరకు వచ్చిందట. అయితే పరమాత్మ రామునిగా ఉన్న విషయం తెలిసిన వాల్మీకి వేదము యొక్క రూపమును ఒక కావ్యముగా  మార్చినాడట. 

31, మార్చి 2019, ఆదివారం

రామాయణం - కల్ప వృక్షం

మనకు ఉన్న అనేకములయిన పురాణములలో ఉత్తమమయినది రామాయణం. ఒక మానవుడు తన కర్మలతో, ధర్మ దీక్షతో పురుషోత్తముడు అవ్వవచ్చు అని మనకు నిరూపించిన ఉత్తమ గ్రంధం అది. అటువంతో ఈ అద్భుతమయిన గ్రంధమును మన పెద్దలు కల్పవృక్షం అని చెప్పారు. వృక్షం అనే పదమునకు రామాయణమును ఎందుకు, ఎలా అన్వయించ వచ్చో ఈ శ్లోకం లో చెప్పారు.

శ్రీమద్బ్రహ్మ తదేవ బీజ మమలం యస్యాంకుర శ్చిన్మయః 
కాండై స్సప్తభి రన్వితో తివితతో ఋష్యాలవాలోదితః 
పత్రై స్తత్త్వ సహాస్రకై  స్సువిలస ఛ్చ ఖా శతై పంచభి 
శ్చాత్మ ప్రాప్తి ఫల ప్రదో విజయతే రామాయణ స్వస్తారః     

రామాయణం ఒక కల్ప వృక్షం అయితే ఆ వృక్షం లో వివిధ భాగములు

  1. బీజం : బ్రహ్మ బీజం 
  2. వేర్లు : ఋగ్వేదం (ఇక్కడ చెప్పలేదు కానీ మరికొన్ని చోట్ల ఇలా చెప్పారు)
  3. అంకురం : చిన్మయము 
  4. కాండము : రామాయణములో 7 కాండలు ఉన్నాయి. రామాయణము 7 కాండములు గల మహా వృక్షం 
  5. చెట్టు పాదు : దండకారణ్యములో గల మునులు 
  6. ఆకులు : రామాయణము లోని అనేక సన్నివేశములు, సంఘటనలు 
  7. కొమ్మలు : సర్గలు, రామాయణములో 500 సర్గలు ఉన్నాయి 
  8. ఫలము : ఆత్మ తృప్తి 
శ్రీరామ తాపత్యుపనిషత్తులో ఈ విధం గా చెప్పారు 

యథైవ వట బీజస్థ ప్రాకృతస్థో మహాద్రుమః 
తదైవ రామబీజస్థం జగదేతచ్చరాచరమ్ !

ఎంతో పెద్దదయిన వట వృక్షం అత్యంత చిన్నదయిన బీజంలో ఉండి, కాలక్రమములో విస్తరించినట్లు  ఈ చరాచర జగత్తు మొత్తం శ్రీ రాముడను బీజంలో నిక్షిప్తమై ఉండి , అతని నుండే విస్తసించినది. 

29, మార్చి 2019, శుక్రవారం

రామాయణం - గాయత్రి మంత్రము

రామాయణం ని వాల్మీకి మహర్షి రచించినప్పుడు దానికి "సీతాయా చరితం మహత్" "పౌలస్య వధ" అని కూడా పేరు పెట్టారు. అంతే కాకుండా మన పెద్దలు ఈ  రామాయణం నకు గాయత్రీ మంత్రమునకు గల అవినాభావ సంబంధం అనేక రకములుగా చెప్పారు.
వారు చెప్పిన అనేక రకములయిన సంబంధములలో కొన్ని ఇక్కడ చెప్పుకుందాం!

  1. సంఖ్య : రామాయణం లోని శ్లోకముల సంఖ్య 24000, గాయత్రి మంత్రము లోని అక్షరముల సంఖ్య  24. కనుక ఈ గాయత్రి మంత్రములలోని ఒకొక్క అక్షరంతో ఒకొక్క వెయ్యి శ్లోకములను వ్రాసి , ఆ మంత్ర అర్థమును నిబంధించారని మన పెద్దలు చెప్తారు. అలాగే  గాయత్రీ రామాయణం అను పేరున రామాయణము 24 శ్లోకములతో లోకములో ప్రసిద్ధి లో ఉన్నది. 
  2. రామాయణం లో మనకు 7 కాండలు ఉన్నాయి. అవి 
బాలకాండ 
అయోధ్య కాండ 
అరణ్య కాండ 
కిష్కింద కాండ 
సుందరకాండ 
యుద్ధ కాండ 
ఉత్తర కాండ 

వీనిలో ఒక్కొక్క కాండ గాయత్రి మంత్రం లోని ఏ భాగాన్ని సూచించునో ఇప్పుడు చూద్దాం! 

  • బాలకాండ : తత్స వితృ 
  • అయోధ్య కాండ : వరేణ్య 
  • అరణ్య కాండ : భర్గో 
  • సుందరకాండ : దేవస్య 
  • యుద్ధ కాండ : ధీమహీ 
  • ఉత్తర కాండ : ధీయోయోనః  
3. గాయత్రి మంత్రమునకు ఆదిమంత్రము, మహామంత్రము అని పేరు. 
     అలాగే రామాయణమునకు ఆది కావ్యము, మహా కావ్యము అని పేరు 
4. గాయత్రి మంత్రమునకు మహర్షి విశ్వామిత్రుడు 
    రామాయణమున శ్రీరామునకు సర్వశాస్త్రములను నేర్పించింది కూడా విశ్వామిత్రుడే 
5. గాయత్రి మంత్రాధిదేవత సవిత 
    శ్రీ రాముని వంశమే సూర్య వంశము. 
6. గాయత్రి మంత్రమునకు ముఖము అగ్ని దేవుడు 
    శ్రీ రామావతారమునకు అగ్నియే మూలము 
7. గాయత్రి మంత్రమునకు హృదయం శ్రీవిష్ణువు, శిఖ రుద్రుడు 
    రామాయణం లో శ్రీ విష్ణు అవతారమయిన శ్రీరాముడు హృదయము, రుద్రుని అంశ కల్గిన            హనుమంతుడు రామాయణమునకు శిఖ వంటి వాడు. 

7, మార్చి 2019, గురువారం

నటరాజ మూర్తి - ఆహార్యం

నటరాజ మూర్తి శివునికి గల అనేక రూపములలో ఒకటి అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! అలాగే శివుని రూపం ఆహార్యం గురించి, వినాయకుని ఆహార్యం గురించి  దానిలో దాగి ఉన్న రూపాత్మకత గురించి కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాం! ఇప్పుడు నటరాజ రూపం ఆహార్యం గురించి చెప్పు కుందాం.
ఇది నటరాజ స్వామి రూపం. ఇప్పుడు మనం ఈ రూపం, దీనిలోని విశేషములు గురించి తెలుసు కుందాం.

నటరాజ స్వరూపం పంచ కృత్యాత్మకం. ఇది శివుని సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది.

  1. అపస్మారక పురుష : నటరాజు పాదముల కింద ఉన్న మానవుని రూపం అపస్మారక పురుషునిది. అపస్మారక స్థితిని నియంత్రణలో ఉంచితేనే జ్ఞానము ప్రకాశిస్తుంది అని దాని భావం 
  2. ఢమరు : పైన ఉన్న ఒక చేతిలో ఢమరు ఉంది. శివ రూప విశ్లేషణ లో మనం ఢమరు గురించి చెప్పు కున్నాం. ఇది నిరంతర జ్ఞాన ప్రవాహమునకు ప్రతీక 
  3. నిప్పు : పైన ఉన్న రెండవ చేతిలో నిప్పు ఉంది. ఈ నిప్పు లయమునకు ప్రతీక. అంతే కాకుండా మండపము వలే తన చుట్టూ అగ్ని కీలలు ఉంటాయి. ఇవి ప్రకృతి నటరాజ నాట్యమును సరిగా ప్రతిబింబిస్తాయి. 
  4. కింద ఉన్న ఎడమ చేయి పైకి లేచిన తన పాదమును చూపిస్తూ ఉంటుంది. తన పాదములను ఆశ్రయించమని దాని అర్ధం. 
  5. అభయ ముద్ర : క్రింద ఉన్న కుడి చేయి అభయ ముద్రలో ఉంటుంది. తన పాదములను ఆశ్రయించిన వారికి తన రక్ష సర్వదా ఉంటుంది అని ఈ అభయం. 
  6. జింక: కొన్ని చోట్ల నటరాజు చేతిలో జింక పిల్ల ఉంటుంది. జింక చంచలత్వమునాకు ప్రతీక. చంచలమయిన మనస్సును నియంత్రించుట అలవరచుకొమ్మని దాని అర్ధం. 
  7. పుర్రె : శివుని తలలో ఒక పుర్రె కనిపిస్తుంది. ఈ పుర్రె లయమునకు ప్రతీక 
  8. గంగ : నటరాజ సిగలోని గంగ కరుణకు ప్రతీక 
  9. నెలవంక : నటరాజ సిగలోని నెలవంక కాలమునకు ప్రతీక 
  10. భుజంగం : నటరాజు తలమీద ఉన్న పాము సహస్రార చక్రమును చేరుకొన్న కుండలిని శక్తి కి ప్రతీక
  11. మూడవ కన్ను : ఇది శివుని సర్వజ్ఞతకు ప్రతీక 
  12. మకర కుండలము: నటరాజ కుడి చెవికి మకర కుండలములు ఉంటాయి. ఇది పురుషత్వానికి ప్రతీక 
  13. తాటంకము: నటరాజు ఎడమ చెవికి తాటంకములు ఉంటాయి. ఇది స్త్రీత్వానికి ప్రతీక. 
  14.  పుఱ్ఱెల మాల: నటరాజు మెడలోని పుర్రెల మాల అనేక సృష్టి లయములకు ప్రతీకలు. 
  15. భస్మం : భస్మము స్వచ్ఛతకు ప్రతీక. ఈ వస్తువయినా అగ్నిలో పునీతమయితే మిగిలేది భస్మమే. అలాగే మానవుని జీవనానంతరం మిగిలేది కూడా భస్మమే. కనుక ఈ లోకములలోని ఆకర్షణలు చూసి దేవుని మరచిపోవద్దు అని హెచ్చరిక ఈ భస్మ దారుణం. 
  16. రుద్రాక్ష : ఈ రుద్రాక్షలు తన భక్తులు చేసిన పాపములు చూసి జాలితో దయతో శివుడు కార్చిన కన్నీరు అని చెప్తారు. కనుక రుద్రాక్షలు నటరాజు జాలి కి ప్రతీక 
  17. ఉపవీతం : నటరాజ స్వామి ఉపవీతంలో 96 పోగులు (దారపు వరుసలు) ఉంటాయట. ఇవి 96 తత్వములకు ప్రతీకలు అని చెప్తారు. ఇవి నటరాజు ధరించుట వలన వానికి అన్నింటికి తానే  అధిపతి అని అర్ధం. 
  18. పాము : నటరాజుని చుట్టుకుని ఉన్న పాము విశ్వశక్తి కి ప్రతీక 
  19. పులి చర్మం : పులి అహంకారమునకు, కామమునకు ప్రతీక. ఆ పులి చర్మమును ధరించుట వలన మన అహంకారమును, కామమును అదుపులో ఉంచగలను అని చెప్పుట. 


19, మార్చి 2016, శనివారం

నింద - స్తుతి

మన శాస్త్రములలో చెప్పిన విషయములు వినటానికి కొంచెం కఠువుగా ఉన్నప్పటికీ నిర్దుష్టంగా సత్యం చెప్తాయి. ఇప్పుడు అటువంటి నిర్వచనముల గురించి తెలుసుకుందాం!
అవి నింద మరియు స్తుతి.  వీనిని నిర్వచించు శ్లోకము చూడండి.

గుణేషు దోషారోపణం యసూయ అధవా దోషేషు గుణారోపణ యసూయ 
 తధా గుణేషు గుణారోపణం దోషేషు దోషారోపణం స్తుతిః 

పైన చెప్పిన శ్లోకం ప్రకారం 
నింద : ఒక వ్యక్తి గుణములను దోషములుగా, దోషములను గుణములుగా చెప్పటం నింద. 
స్తుతి: ఒక వ్యక్తి గుణములను గుణములుగా, దోషములను దోషములుగా చెప్పటం స్తుతి. 

విశ్లేషణ:
వినటానికి అర్ధం చేసుకోవటానికి కొంచెం విపరీతంగా ఉన్నా ఒక వ్యక్తి దోషములను దోషములుగా చూపటం కూడా స్తుతి అని చెప్పారు. అలా ఎత్తి చూపటం వలన ఆ వ్యక్తి తన దోషములను దూరం చేసుకునే అవకాశం పొందగలుగుతాడు. 
నింద అంటే అతని దోషములను కూడా గుణములుగా చెప్పినప్పుడు అతనికి అతనిలోని లోపం తెలుసుకునే అవకాశం ఉండదు. అతని దోషమును తెలుసుకోలేని వారు, ఆ దోషమును దూరం చేసుకునే అవకాసం కూడా ఉండదు. 
గుణములను దోషములుగా చూపినప్పుడు బలహీన మనస్సుకల వారయితే వారి గుణములను వదిలే అవకాశం కూడా ఉండవచ్చు. 
మరో విధంగా చుస్తే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం స్తుతి, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కల్పించి చూపుట నింద. 

6, మార్చి 2016, ఆదివారం

శివుని ఆహార్యం - విశ్లేషణ

 సర్వదా సదాశివుడ్ని మనం అరూపరూపిగా అంటే లింగ రూపంలో చూస్తాం. కానీ మన పెద్దలు శివుని మానవ రూపంలో చూపే సందర్భంలో ఆతని ఆహార్యానికి ఎంతో విలక్షణతను ఇచ్చారు. మన హిందూ ధర్మంలో ఒక దేవతకు ఏదయినా ఒక రూపం ఇచ్చినప్పుడు, అది వారి ప్రత్యేకతను చాటటమే కాకుండా ఆ దేవత సర్వమానవాళికి ఇవ్వవలసిన/ ఇవ్వగలిగిన వరములు లేదా చేయగలిగిన కార్యములను ఒక చిన్న అమరిక ద్వారా చెప్తారు. మనం ఈ విషయాన్ని ఇంతకు ముందు వినాయకుని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మహాదేవుని గురించి తెలుసుకుందాం!


శివుని ఆకారం మనకు సదా ధ్యాన మగ్నుడయి, చంద్ర మరియు సర్పాభరణ భుషితుడయి, తలపై గంగమ్మతో, పరచి ఉన్న జఠాజూఠంతో, వొంటినిండా విభూది రాసుకుని, నుదుటిన మూడవ కన్నుతో, మెడలో పుర్రెల మాల (కొన్ని చోట్ల), చేతిలో త్రిశూలం, ఢమరు ధరించి, నీలి కాంతులు వెదజల్లుతున్న దేహంతో, పులి/ ఏనుగు చర్మం ధరించి కనిపిస్తారు కదా ఇప్పుడు అవి అలా ఎందుకు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

  1. చంద్రుడు: శివుని తలపై చంద్రుడు ఉంటాడు. దీనికి రెండు కారణములు చెప్తారు.
    • చంద్రుడు మనః కారకుడు. మానవుని సుఖసంతోషములు అతని మనఃస్తితిపై ఆధార పడి ఉంటాయి కనుక శివుడు చంద్రుడ్ని ధరించాడు 
    • చంద్రుడు కాలమునకు ప్రతీక (కాలాన్ని చంద్రాయణాలుగా కొలుస్తారు). శివుడు కాలమును జయించినవాడు అని చెప్పటానికి చంద్రుడుని శివుని తలపై చూపిస్తారు. 
  2. భుజంగ భూషణం: శివుడు పాములను ధరించటానికి అనేక అర్ధములు చెప్తారు.  అవి 
    • పాములు నిరంతర జాగరూకతకు ప్రతీకలు. మనకు అత్యంత భయ కారకములు, వానిని ధరించుట ద్వారా శివుడు మనలను కాపాడతాను అనే అభయం ఇస్తున్నాడు. 
    • మెడ చుట్టూ తిరిగి ఉన్న పాము కాల చక్రంనకు సంకేతం.   
    • పాము ఆకారం కుండలిని శక్తిని పోలి  ఉంటుంది కనుక తనను భక్తిశ్రధలతో పూజిస్తే వారికి జ్ఞానమును ప్రసాదిస్తాడు.
    • పాము గర్వమునకు సూచిక. తన గర్వమును ఎవరైతే గెలుస్తారో వారికి అది ఒక ఆభరణం అవుతుంది తప్ప వారికి హాని చేయలేదు అని చెప్పటం 
    • పాము మానవుని కోరికలకు ప్రతిరూపం. శివుడు సకల కోరికలను జయించినవాడు కనుక ప్రతీకాత్మకంగా పాము అతనికి ఆభూషణం అయింది 
  3. గంగమ్మ : బ్రహ్మదేవుని, శ్రీ మహావిష్ణువును తాకి శివుని తలపై నిలచిన గంగమ్మ పవిత్రతకు ప్రతీక. గంగమ్మ నిరంతర ప్రవాహం జ్ఞానమునకు ప్రతీక. జలము, జ్ఞానము నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. 
  4. త్రినేత్రం : మహాదేవుని నుదుటిన ఉన్న మూడవ నేత్రం సకల ద్వంద్వములకు అతీతమైన పరమ జ్ఞానమునకు ప్రతీక. ఇది సత్గురు కృపవలన మాత్రమే సాధ్యం కనుక దీనిని కన్నుగా సూచించారు.  దీని వలన మాత్రమే  గెలువగలరు. ఇది ఆజ్ఞా చక్రమునకు స్థానం. 
  5. భస్మం: 
    • స్థూలంగా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ఏ వస్తువు అయినా అగ్నికి ఆహుతి అయితే మిగిలేది భస్మమే. కనుక శివుడు లయకారుడు  చెప్పేందుకు భస్మం ధరిస్తాడు.  
    • సూక్ష్మంగా చెప్పాలంటే భస్మం నిరంతర బ్రహ్మానందమునకు ప్రతీక. భస్మమునకు నాశనం లేదు. 
  6. త్రిశూలం:  ఇది శివుని ఆయుధం. అజ్ఞానమును అంతమొందిస్తుంది. శూలం అంటే సకల భాధలను తొలగించేది అని అర్ధం 
    • శివుడు త్రిగుణాతీతుడు (సత్వ రజః తమో గుణములకు అతీతుడు) అని చెప్పటం.
    • త్రికాలములు (భూత భవిష్యత్ వర్తమాన)  అధిపతి అని చెప్పటం 
    • త్రిస్థితులకు (జాగృత్, స్వప్న, సుషుప్తి) అధినేత అని చెప్పటం 
    • త్రితాపములను (ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక) పోగొడుతుంది. 
  7. ఢమరు : 
  8. Image result for infinity symbol

    • ఈ సృష్టి వస్తూ పొతూ ఉంటుంది అని స్థూలంగా చెప్పటం ఈ ఢమరు ఆకారం చెప్తుంది. అంతేకాకుండా ఈ ఢమరు ఆకారం అనంతమునకు (infinity) ప్రతీక.
    • ఈ ఢమరు సృష్టిమొదటి శబ్దమును (ప్రణవమును) పలికింది. కనుక ఢమరు శబ్దమునకు ప్రతీక. ఈ సృష్టిలో సర్వం ఈ శబ్దమునకు చెందినదే. 
  9. జఠాజూఠం/శరీరపు నీలి క్రాంతి: నిజమునకు శివునికి ఒక ప్రత్యేకమయిన ఆకారం లేదు. మనం మన సౌకర్యార్ధం అతనికి ఒక రూపమును ఆరోపించాము. అతను సర్వత్రా ఆకాశం వలే వ్యాపకుడు అని చెప్పటానికి నీలి రంగు చూపబడినది. అతని పరచుకున్న జఠాజూఠం అతని సర్వవ్యాపకత్వమునకు సూచిక. 
  10. నంది వాహనం: నంది మహా దేవుని వాహనం మాత్రమే కాదు. అతని సర్వసైన్యాధి పతి కూడా. 
    • నంది ధర్మమునకు ప్రతీక 
    • నంది అంటే పశువు. పాశముతో కట్టబడునది, మనందరికీ ప్రతీక. తన నాధుడయిన పశుపతినాదునికి సదా వసీభూతమై ఉంటుది. 
    • నంది అంటే నిరంతర భగవత్ చింతన. ఎంతకాలమయినా సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 
  11. పులి చర్మం: శివుడు పులి చర్మంపై కుర్చుని ఉంటాడు. పులి అంటే అతి క్రూర జంతువు. కాలం కూడా క్రురమైనదే. 
    • పులి అమ్మవారి (శక్తి) వాహనం. శివుడు సర్వ శక్తులకు అధిపతి. 
    • పులి కామమునకు ప్రతీక. శివుడు కామారి. 
  12. ఏనుగు / జింక చర్మం: శివుడు ఏనుగు లేదా జింక చర్మం కట్టుకుని ఉన్నట్లు చూస్తాం. 
    • ఏనుగు గర్వమునకు ప్రతీక. ఏనుగు చర్మం ధరించుట ద్వారా గర్వమును గెలిచిన వానిగా గుర్తించాలి
    • జింక అత్యంత ఉద్విగ్నంగా ఉంటుంది, మనసులా. ఉద్విగ్నమైన మనసును గెలిచినవాడు అని చెప్పటం 
  13. మెడలో పుర్రెల మాల: ఇది మనకు కొన్ని కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. 
    • శివుడు లయకారకుడు అని చెప్పటం.
    • సృష్టి ముగిసిన ప్రతిసారి బ్రహ్మగారి కపాలం ఆ మాలకు గృఛుతూ ఉంటారట. అంటే శివుడు అనంతుడు అని చెప్పటం. 

9, జనవరి 2016, శనివారం

మదం - క్రోధము

వినత, కద్రువ లు కశ్యప ప్రజాపతి భార్యలు. వినత కద్రువకు లబించిన సంతానం చూసి అసూయ చెంది, ఆ కారణంగా తన కుమారుని చేతనే శాపం పొందింది.
ఐతే కద్రువ ఇంతకు మించిన మదం మరియు క్రోధము కారణంగా కన్నతల్లి అయి ఉండి కూడా తనపిల్లలను చనిపోమని శాపం ఇచ్చినది.
ఒక రోజు వినత, కద్రువ విహారానికి వనమునకు వెళ్లారు. వారు అలా నడుస్తూ ఉండగా సాయంకాలం అవుతుండగా, వారికీ దూరంగా ఉచైశ్రవం అని పిలువబడే ఒక అందమైన తెల్లని గుర్రం కనిపించినది.
దానిని చూసిన కద్రువ, వినతకు చూపి, ఆ గుర్రం అంతా తెల్లగా ఉన్నా దాని తోకకు ఉన్న నలుపు చంద్రునిలో మచ్చ వలే ఉన్నది అని అన్నది. ఆ మాటలు విని వినత అదేమిటి అక్క అలా అంటావు ఆ గుర్రం వెన్నెలలా తెల్లగా ఉంది. దాని తోకకు నలుపు లేనే లేదు అని అన్నది. అప్పుడు కద్రువ ఒక విచిత్రమైన షరతు విధించినది. ఆ గుర్రం తోక నల్లగా ఉన్నట్లయితే వినత కద్రువకు దాసిగా ఉండాలి, ఒకవేళ ఆ గుర్రం తోక తెల్లగానే ఉన్నట్లయితే కద్రువ వినతకు దాసీ అవ్వాలి. ఇద్దరూ ఆ షరతుకు ఒప్పుకున్నారు. వినత అప్పుడే వెళ్లి ఆ గుర్రం తోకను చూడడం అని అన్నది. కానీ అప్పటికే సంధ్యా సమయం యించి కనుక ఈ రోజుకి ఇంటికి వెళ్లి రేపు వచ్చి చూడడం అని కద్రువ చెప్పింది. సరే అని వారిద్దరూ వారి వారి ఇళ్ళకు వెళ్లి పోయారు.
అప్పుడు కద్రువ ఎలాగయినా వినతను తన దాసిగా చేసుకోవాలని కోరికతో తనకుమారులయిన పాములను పిలిచినది. తనకు, వినతకు మధ్య జరిగిన విషయం చెప్పి, వారిని ఆ గుఱ్ఱము తోకకు నల్లని మచ్చలా ఉండమని కోరినది.
ఆ సర్పములు ధర్మ మార్గమునకు విరుద్ధమైన ఆ పని చేయుటకు నిరాకరించారు. అప్పుడు కద్రువ క్రోధమునకు వశమై తన కుమారులు భవిష్యత్తు లో జరుగబోయే ఒక విపరీతమైన యాగం లో పడి చావండి అని శపించినది.ఆ శాపమునకు భయపడిన కర్కోటకుడు అనే పేరుగల ఒక్క పాము మాత్రం తల్లి చెప్పిన ఆ పని చేయుటకు ఒప్పుకున్నాడు.

విశ్లేషణ  

మదం: 

నిజానికి ఆ గుర్రం తోక నల్లగా లేదని కద్రువకు తెలుసు. తన సవతి వినత తనపై పెంచుకున్న అసూయ కూడా  కద్రువకు తెలుసు. ఆమె తనపై అసూయ పడుతుందంటే తను వినతకంటే గోప్పదానిని అని గర్వం కద్రువకు ఎక్కువ ఐంది. అది ఏదో ఒకలా బయటకు రావాలి. కనుక గుర్రం తోక నల్లగా ఉంది అని వినతతో వాదించింది. వాదించటమే కాకుండా తన సవతిని భయ పెట్టే విధంగా షరతు విధించింది. ఆమే ఆ షరతు విధించినప్పుడు బహుశా వినత భయపడి గుర్రం తోక నల్లగానే ఉంది అని ఒప్పుకుంటుంది అని అనుకోని ఉండ వచ్చు.  కానీ నిజాన్ని కనిపెట్టటానికి వినత అప్పుడే గుర్రం దగ్గరకు వెళదాం అని అడిగితే సంధ్యాసమయం అడ్డు చెప్పి, ఆ రోజుకు తప్పించుకుంది. ఒకవేళ తాము వెంటనే ఆ గుర్రం దగ్గరకు వెళ్ళినట్లయితే తను ఖచితంగా వినతకు దాసీ కావలసి ఉంటుంది. కనుక ఆమె అప్పటికి తప్పించుకుంది. 

క్రోధం 

ఆమె చేసిన ఈ తప్పు, తన పిల్లలు ఎత్తి చూపించారు. వెంటనే ఆమె మదం క్రోధంగా మార్పుచెందింది. కన్న బిడ్డలు అని కనికరం కూడా లేకుండా వారని చనిపోమని శపించింది. 


28, అక్టోబర్ 2014, మంగళవారం

తామస మనువు జననం- విశ్లేషణ

తామస మనువు జననం- విశ్లేషణ

ఈ ఘట్టం లో విశ్లేషించవలసిన అంశం నా మనస్సునకు తట్టినది ఒక్కటే ఉన్నది. అది ప్రాపంచిక విషయముల మీద వైరాగ్యం కలిగి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్న ఒక తపస్వి మనస్సుని ఒక లేడి వంటి జంతువు కదిలించటం.
ఇటువంటి విషయములు ప్రస్తావనకు వచ్చినప్పుడు మన హిందూ ధర్మ శాస్త్రముల మీద మనకే కొంచెం అపనమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది. దానికి కారణం మనం ఆ విషయమును గురించి తప్ప అందులోని సూక్ష్మ అర్ధమును గ్రహించే ప్రయత్నం చేయలేకపోవుట.
లెక్కకు మించిన ఆయుష్షు కలిగిన సురాష్ట్రుడు, తన భార్యలు, ప్రజలు, మంత్రులుతన ముందే చనిపోవటం చూసాడు కనుక అతనికి వైరాగ్యం కలిగినది. అందుకని అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేయనారంభించాడు. అదికూడా ఘోరమయిన తపస్సు. ఐతే ఇక్కడ ఒక విషయం గమనించండి. అతను ఏమి కోరి తపస్సు చేస్తున్నాడు? ఏ విధమైన కోరికా లేదు. కేవలం భగవత్ సాక్షాత్కారం కోసం మాత్రమే! అతనికి దేహం మీద, దానివలన సంభవించే ఏ విధమైన భోగం మీద కోరిక లేదు కనుకనే తన రాజ్యమును వదలి తపస్సునకు వెళ్ళాడు.
ఇక వర్షం రావటం అనేది సృష్టిలో సహజం. ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నపుడు, పంచాభుతాత్మకమైన శరీరం తనలో ప్రాణమును నిలుపుకోవాలనే చూస్తుంది కనుక ఆధారం కోసం చేతులు వెతికాయి. అప్పుడు తనకు దొరికిన ఒక లేడి ని పట్టుకోవలసి వచ్చినది.
ఇక్కడ ఒక విషయం గమనించండి. అతని చేతికి ఒక లేడి దొరికింది. అంటే అది కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుని పొతూ ఉంది. నాకు తెలిసి లేడి కంటే మానవుని శరీరం నీటిలో ఈదే సామర్ధ్యం కలిగి ఉంటుంది. కనుక తన చేతికి దొరికిన ఆ లేడి ప్రాణములను కాపాడాలన్న దృఢ నిశ్చయం ఆ తపస్వికి కలిగి, ఒడ్డునకు చేరే, లేడిని చేర్చే ప్రయత్నం చేసి ఉండాలి. అలా ఒడ్డుకు చేరిన తరువాత, లేడి తన ప్రాణములను కాపాడినందుకు అతనిపై కృతజ్ఞతా భావం ఉంచుకొనుట సహజం.
అలా కాకుండా ఆ తపస్వి మనస్సు ఆ లేడి వలన కదలటం విచిత్రం. తపస్వి అనేవాడు తన మనస్సును నిగ్రహించే సామర్ధ్యం కలిగి ఉంటాడు. అప్పటికి చాలా కాలం నుండి అతను తపస్సులో ఉన్నాడు కనుక అతని మనస్సును నియంత్రించటం అతనికి తెలుసు. కానీ అతని మనస్సు కదిలినది. దానికి కారణం తనకు తెలిసి ఉన్నదేమో అని తనని తను పరిశీలించుకుని ఉండాలి. కానీ అటువంటిది ఏమి అతని తపొదృష్టికి అందలేదు. కనుక ఈ విధంగా తన మనస్సు చలించుటకు కారణం ఆ లేడికి తప్పని సరిగా తెలిసి ఉండాలి.
తనకు తెలిసిన గతజన్మ గురించి చెప్పిన సంగతులను విన్న సురాష్ట్రుడు ఆమెను మానవ కన్యగా అయ్యే అవకాసం కలిగించాడు. ఆమెతో రాజ్యమునకు వెళ్లి, రాజ్య భోగములను అనుభవించాడు.

  1. ఒక తపస్వి ఇలా ఎందుకు చేసాడు ?

తపస్వి అంటే తనగురించి కాక ఈ లోకం, ప్రజల గురించి ఆలోచించే వాడు. ఆమె తన గత జన్మ గురించి చెప్తున్న సమయంలో ఆమె చెప్పిన ఒక విశేషం అతనిని ఈ విధంగా రాజ్యమునకు తిరిగి వచ్చేందుకు ప్రోత్సహించి ఉండాలి.
అది వారికి ఒక మనువు పుట్టబోతున్నాడు అని.
మనువు అంటే అత్యంత గొప్పదయిన భాద్యత. అటువంటి భాద్యతలను గ్రహించబోయే వాడు తపోధనుడయిన తనకు, విజ్ఞానవతి అయిన ఉత్పలమాలకు జన్మించటం సరి ఐనదే అని అతను భావించి, అటువంటి మనువు అరణ్యములలో ఉండే కంటే, ఒక రాకుమారునిగా పుట్టి, అలాగే విద్యాభ్యాసం చేసుకుంటే, అతనికి, అతను పరిపాలించబోయే ప్రజలకు మేలు జరుగుతుంది అని భావించి తిరిగి రాజ్యమునకు వచ్చి ఉండాలి.

నా మనస్సుకు తట్టిన విశ్లేషణ ఇది. ఇంతకంటే గొప్పగా, ఏ పండితులవారయిన చెప్పగలిగితే, వారి పాదములకు నమస్కరించి, దానిని తిరిగి మీ అందరికి తెలిపే ప్రయత్నం చేస్తాను.

20, సెప్టెంబర్ 2014, శనివారం

అధర్మం వంశవృక్షం

ఇంతకు ముందు ధర్ముని భార్యల గురించి వారి సంతానమును గురించి చెప్పుకున్నాం కదా! మరి అధర్మం సంగతి? అది ఈ రోజు చెప్పుకుందాం! భాగవతం లో మరొక విచిత్రమైన విషయం చెప్పారు. ఈ అధర్మ వంశం గురించి కల్కి పురాణంలో కూడా చెప్పారు. 
అధర్ముడు స్వయంగా బ్రహ్మ కు పుత్రునిగా జన్మించాడు.
అధర్మునకు భార్య అబద్దం. వీరి సంతానం దంబం(ఇప్పుడు దబాయించుట అంటున్నాం!) అనే పుత్రుడు, మాయ అనే పుత్రిక.
పుత్రికను నిరృతి (అసలు సత్యం అంటే తెలియని వాడు) చేపట్టాడు. వారికి లోభుడు, నికృతి (తిరస్కారం) జన్మించారు.
లోభుడు, నికృతి వివాహం చేసుకోగా వారికి క్రోధము, హింస జన్మించారు.
క్రోధం, హింస వివాహం చేసుకొనగా వారికి కలి, నింద జన్మించారు.
కలి, నింద  వివాహం చేసుకోగా వారికి భయము. మృత్యువు జన్మించారు
భయం, మృతువు వివాహం చేసుకోగా వారికి యాతన మరియు నరకము పుట్టిరి.

నా ఆలోచన:
ఇక్కడ పెద్దగా విశ్లేషించ వలసిన పని లేదు కదా! అంతా చక్కగా చెప్పారు.
మనిషిలోనికి ఎప్పుడయితే అధర్మం ప్రవేశిస్తుందో అప్పుడు అబద్దం బయలుదేరుతుంది. అవి రెండూ రాగానే ఎదుటివానికి మాయమాటలు చెప్పుట, వారిని దబాయించుట చేస్తాం! అప్పుడు వానితో పాటుగా ఎదుటి వారు చెప్పే విషయాలను తిరస్కరిస్తూ ఉంటాం. లోభం కూడా ప్రారంభం అవుతుంది.
దాని ఫలితంగా క్రోధం మనస్సులో స్థానం సంపాదించుకుంటుంది. ఆ క్రోధం హింసను ప్రోత్సహిస్తుంది. దానిద్వారా ఇతరులను నిందించాలన్న ఆలోచన మొదలవుతుంది. అక్కడి నుండి నన్ను ఎవరైనా చంపేస్తారేమో అనే భయం మొదలవుతుంది. దానిని మించిన నరకము. యాతన ఉండవు కదా!

పైన చెప్పినవి అన్నీ  మనలోని విషయములే తప్ప అధర్ముడు అనే ఒక వ్యక్తికి అబద్దం అనే భార్య అని చదువుకుంటే అది పై విషయాన్ని అన్వయించుకునే విషయంలో మనకు ఎంతో జుగుప్సాకరంగా ఉంటుంది. పూర్వికులకు ఒక కధలా చెప్పటం అలవాటు కనుక మనకు అర్ధం అవటానికి ఇలా ఆ భావనల మధ్య అనుభందాలను చూపాలని చేసిన చిన్న ప్రయత్నం అని నా అభిప్రాయం. 

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

13 మంది దక్షుని పుత్రికలు

శ్రీమద్భాగవత మహా పురాణంలో దక్షుని గురించి చెప్పారు. దక్షుడు అంటే మనకు తెలుసు మహాదేవుని మామగారు.
దక్షుని భార్య పేరు ప్రసూతి. ఆమె స్వయంభుమనువు కుమార్తె.
దక్షునికి ఆమె భార్య యందు కలిగిన అనేక మంది పుత్రికలలో 13 మంది పుత్రికలను ధర్మునకు ఇచ్చి వివాహం చేసారు. వారి పేర్లు
  1. శ్రద్ద 
  2. మైత్రి 
  3. దయ 
  4. శాంతి 
  5. తుష్టి 
  6. పుష్టి 
  7. క్రియ 
  8. ఉన్నతి 
  9. బుద్ధి 
  10. మేధ 
  11. తితిక్ష 
  12. హ్రీ 
  13. మూర్తి 
నా ఆలోచన:
మన పెద్దలు ప్రతి విషయమును చదువుతున్న మన అందరికి అర్ధం అయ్యే విధంగా చక్కగా చిన్నగా ఆ రహస్యములను చెప్తారు. మనం చేసే ప్రతి చిన్న పనికి ఏవిధమైన ఫలితం లభిస్తుందో ఈ సందర్భంగా చెప్పారు అని నా అభిప్రాయం. 
ఇక్కడ చెప్పిన 13 మంది దక్షుని పుత్రికలు నిజంగా స్త్రీలేనా? ఐతే అయి ఉండవచ్చు కానీ వారు ఈ పుత్రికలను ధర్మునకు ఇచ్చుట ద్వారా ఏమి ఫలమును పొందారని చెప్పదలచుకున్నారో చూద్దామా!

ఈ 13 మందిని ధర్మునకు ఇచ్చారు. ధర్ముని వల్ల వారికి కలిగిన సంతానం 
  1. శ్రద్ద - శ్రుతము (వినవలసినది), : ధర్మమును శ్రద్దగా వినుము 
  2. మైత్రి - ప్రసాదము (ప్రసన్నత/ అనుగ్రహము) : ధర్మము నందు మైత్రి (స్నేహం) తో ఉండుట వలన ప్రసన్నత కలుగును 
  3. దయ - అభయము : ధర్మముతో కూడిన దయ వలన అభయము కలుగుతుంది 
  4. శాంతి - సుఖము : ధర్మముతో కూడిన శాంతి వలన సుఖము లభిస్తుంది 
  5. తుష్టి (సంతృప్తి) - సంతోషం : ధర్మం తో కూడిన సంతృప్తి వలన సంతోషం 
  6. పుష్టి (బలము) - స్మయం (ఆశ్చర్యం) : ధర్మం తో కూడిన బలం వలన ఆశ్చర్యకరమైన ఫలితములు 
  7. క్రియ (పని) - యోగము : ధర్మం తో చేసిన పని వలన ఆ పని తప్పని సరిగా యోగిస్తుంది 
  8. ఉన్నతి - దర్పము : ధర్మం తో కలిగిన ఉన్నతి వలన దర్పం ప్రప్తిస్తున్నది 
  9. బుద్ధి - అర్ధం (లాభం/ ప్రయోజనం) : ధర్మం తో కూడిన బుద్ధి వలన లాభం కలుగుతుంది  
  10. మేధ - స్మృతి (జ్ఞాపకం) : ధర్మం కలిగిన మేధ వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది 
  11. తితిక్ష(ఓర్పు) - క్షేమము : ధర్మం తో కూడిన ఓర్పు సర్వదా క్షేమకరం 
  12. హ్రీ (లజ్జ/సిగ్గు)- అనునయము : ధర్మముతో కూడిన సిగ్గుకు సర్వదా అనునయము చేరుతుంది 
  13. మూర్తి (రూపం)- నరనారాయణులు : మనలో ధర్మం సాంతం మూర్తీభవించి ఉన్నట్లయితే భగవత్ స్వరూపం మనలను కాపాడుతూనే ఉంటుంది. 

28, ఆగస్టు 2014, గురువారం

వినాయక ఆకారం - విశ్లేషణ

వినాయక ఆకారం చూడగానే మనస్సును ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఐతే ప్రతి విషయానికి ఎంతో విశేషార్ధం ఉండేలా మన పూర్వికులు వినాయకునికి ఈ ఆకారాన్ని సూచించారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా!

  1. అతి పెద్దదయిన తల - పెద్దగా ఆలోచించమని చెపుతుంది 
  2. అతి పెద్ద చెవులు - ఎదుటివారు చెప్పేది కూలంకషంగా వినమని 
  3. అతి చిన్న కన్నులు - దృష్టి నిశితం గా ఉండాలి, ఏకాగ్రతగా ఉండాలి 
  4. నోటిని కప్పుతూ ఉన్న తొండం - నీ మాటలను అదుపులో ఉంచుకో 
  5. ఒక విరిగిన దంతం, ఏకదంతం - సర్వదా మంచిని నీతో ఉంచుకుని చెడును విరిచి పడేసే ప్రయత్నం చేయి 
  6. వంపుతిరిగిన తొండం - పరిస్థితులను తట్టుకునేవిధంగా తనను తాను మలచుకొంటూ, తనదైన వ్యక్తిత్వాన్ని వదలకుండా చూసుకో మని చెపుతుంది 
  7. యజ్ఞోపవీతంగా సర్పం - సర్పం కుండలిని శక్తికి ప్రతీక, ప్రతి ఒక్కరు తమ కుండలిని శక్తిని వృద్ధి చేసుకోవటం కోసం ప్రయత్నించాలి అని 
  8. లంబోదరం - జీవితం లో ఎదురయ్యే మంచిని చెడుని సమన్వయము చేసుకుంటూ ముందుకు సాగమని, (వినాయకుని ఉదరంలో సమస్త లోకములు ఉన్నాయి అని మరో అర్ధం చెప్పుకోవచ్చు) 
  9. అభయ ముద్ర - భక్తులకు భయపడనవసరం లేదని చెప్పుట 
  10. వరద ముద్ర - కోరిన కోరికలు తీర్చగలను అని చెప్పుట 
  11. పాశం (పై ఎడమ చేతిలో) -  భక్తులను ఆధ్యాత్మిక విషయముల వైపునకు లాగుతాను అని 
  12. గొడ్డలి (పై కుడి చేతిలో) - కర్మబంధములనుండి విముక్తిని కలిగించగలను అని 
  13. మోదకము/ కుడుము - సాధన ద్వారామత్రమే అతి మధురమైన మోక్షం లభిస్తుంది అని 
  14. పాదముల వద్ద ఉన్న ఫలములు - ఈ ప్రపంచములో కావలసినవి అన్ని ఉన్నాయి, కేవలం నీవు శ్రమించి వాటిని సాధించుకోవాలి 
  15. ఎలుక - ఎక్కడి, ఏమూలకు అయిన చేరగలిగిన, తనకు అడ్డంగా ఉన్నదానిని దేనిని అయిన నాశనం చేయగలిగిన సామర్ధ్యం ఉండాలి, కాని అది మన ఆధీనంలో ఉండాలి 
  16. ఇద్దరు భార్యలు  సిద్ధి ,బుద్ధి వారి పుత్రులు శుభము, లాభము మరియు పుత్రిక సంతోషి - మన బుద్ధి (మనస్సు) మన ఆదీనం లో ఉంటే మనం కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయి. దానితో పాటుగా మనకు మంచి జరుగుతుంది, లాభము కూడా లభిస్తుంది 
  17. మరి సంతోషి ని కుమార్తె అని ఎందుకు చెప్పారు?  మనకు జరిగిన మంచిని కాని శుభమును కాని మరొకరికి పంచటానికి మనం ఆలోచించ వచ్చు కాని వాని వల్ల కలిగిన ఆనందాన్ని అందరికి పంచుతాము. కనుకనే సంతోషి ని కుమార్తెగా చెప్పారు.