31, డిసెంబర్ 2015, గురువారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొందరు ఒక విచిత్రమైన వాదన వాదించుకోవటం  నేను విన్నాను. జనవరి ఒకటవ తేదిన నూతన సంవత్సరం జరుపుకుంటున్నారు కదా! మరి మన సంప్రదాయాలు వదిలేసినట్లేనా? అని. ఈ వాదన నాకు విచిత్రంగా అనిపించింది.
ప్రపంచం మొత్తం ఈ రోజున కొత్త సంవత్సరం వచ్చింది అని సంబర పడుతుంటే, కొందరు ఇలా! వాళ్ళ వాదనలో కొంతవరకు కాదనలేని నిజాలు ఉన్నా, ఖండించవలసిన విషయం కూడా ఉంది మరి. మనం ఒక విషయం చెప్పినప్పుడు విని మనముందు అంగీకరించి, పక్కకు వెళ్లి మనలను చూసి నవ్వుకునే వాళ్ళు ఈరోజుల్లో చాలా ఎక్కువ. వారి విషయం పక్కన పెడదాం.
అసలు విషయానికి వస్తే, మన కొత్త సంవత్సరం అదేనండి మన పండుగ "ఉగాది" నాటికి వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి, మరియు ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కనుక మన పండుగ గొప్ప. కనుక అది జరుపుకుందాం. అని  అనుకుంటే మంచిదే. మీరు చాల చక్కగానే ఆలోచించారు. మీరు అక్కడితో ఆగితే సాహబాష్!
కానీ ఈ ఆలోచనకి  పైత్యాన్ని జోడించి, కొంచెం రెక్కలు తొడిగి జనవరి ఒకటవ తారీకున పండగ చేసుకునే వారందరినీ అవహేళన చేస్తూ ఉండకండి.
అలాంటి వారు ఒక్క విషయం గుర్తు ఉంచుకోండి. మీరు ప్రతిరోజూ చేసే ప్రతి పనికి ఆ రోజు తారీకు వేస్తారు కదా! మరి అది కూడా ఆంగ్లసంవత్సర మానం ప్రకారం వేస్తున్నారు. అంతే కానీ మన తిధివారములు వ్రాయటం లేదు. మరి అప్పుడు మీరు కూడా ఇప్పుడు తమరు వెలివేసిన ఆంగ్ల సంవత్సర మానం పాటించక తప్పటం లేదు కదా!
ప్రపంచంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో సమయం ఉంటుంది. అది ఆయా స్థలములను బట్టి మారుతుంది. ప్రపంచం మొత్తం ఒప్పుకుంటున్న ఈ తేదీలను మీరు కాదనలేరు. కాదని మీరు ఒక్కరు తిధి, వార ములను ప్రామాణికంగా పాటించలేరు. ఒక వేళ పాటించినా అది మీకు తప్ప వేరెవరికీ అర్ధంకాదు.  మరి అందరు సంతోషంగా ఉంటున్న ఈ సమయంలో, మీరు పాలు పంచుకోగలిగితే మంచిదే, అలా కాని సమయంలో ఎదుటివారి సంతోషాని చూసి మనం కూడా సంతోషిద్దాం.

సరే ఈ క్రొత్త సంవత్సరం మనందరిలో మరింత మంచితనం నింపాలి, మనం కన్న కలలు నిజం చేసుకునే మార్గం చూపాలి, కొందరికి అయిన మనం కొంత సహాయం చేయగలగాలి, మన జీవితాలలో మరింత మధుర జ్ఞాపకాలు మిగలాలి, మనతో పాటు మన మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, పరిచయస్తులు, పరిచయంలేనివారు అందరూ సకల సంతోషాలతో ఉండాలి. అందరికీ ఈ ఆంగ్ల సంవత్సరాది మంచి ప్రారంభంకావాలి.   


మన పాత మిత్రుడు 2015 మనకు మిగిల్చిన జ్ఞాపకాలు, అనుభవాలు ఒక్కసారి తలచుకుందాం. ఏమైనా తప్పులు జరిగి ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. 2015 కు వీడ్కోలు పలుకుదాం. అందరం సంతోషంగా నూతన సంవత్సరం - 2016 కి స్వాగతం పలుకుదాం. 

మీ 
దీపిక 

పరీక్ష - ఫలితం

శివ శర్మ వరుసగా తన నలుగురు పుత్రులయిన యజ్ఞశర్మ, వేదశర్మ, ధర్మశర్మ మరియు విష్ణుశర్మ లను పరీక్షించి, వారు తమ తమ పితృభక్తిని నిరుపించుకున్న తరువాత, అమితానందం పొందాడు.
తన పుత్రులను పిలచి " ఓ కుమారులార! మీ పితృభక్తి కి నేను ఎంతో  సంతోషించాను. మీకు ఏదయినా వరం ఇస్తాను కోరుకొనండి" అని అడిగాడు.
అప్పుడు ఆ పుత్రులు " తండ్రీ మీరు మాయందు దయఉంచి మా తల్లిని తిరిగి బ్రతికించండి అని ప్రార్ధించారు". వారు అలా అడుగగానే ఆ తండ్రి ఒక చిరునవ్వు నవ్వాడు, వెంటనే జ్యేష్ట పుత్రునిచే వధింపబడిన ఆమె వెంటనే నడచి వచ్చి, తన భర్త పాదములకు నమస్కరించినది. తన పుత్రులను చూసి " ఓ కుమారులార! ఒక స్త్రీకి తన పుత్రులు ధర్మ మార్గంలో నడచుటకంటే పెద్దదయిన బహుమానం ఉంటుందా! సత్ బ్రాహ్మణ కులంలో జన్మించాను, ఉత్తముడయిన భర్తను పొందాను, నా గర్భం నుండి మీవంటి పరమ ఉత్తములను పొందాను. నా జన్మ ధన్యం కదా! " అని పలికినది. వెంటనే ఆమె పుత్రులు ఆమెకు ప్రణామములు చేసారు.
వీరిని మరలా వరం కోరుకొనమని శివశర్మ అడుగగా, అప్పుడు వారు విష్ణుదామము కావలెను అని కోరారు. అప్పుడు శివశర్మ తధాస్తు అని పలుకగానే, శ్రీమహావిష్ణువు తన పరివారంతో, రధంలో ప్రత్యక్షం అయ్యాడు. "శివశర్మ, నీ నలుగురు పుత్రులు పితృభక్తి లో వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు. నీవు వారికి విష్ణులోకమును అనుగ్రహించావు. నీవు నాకు భక్తునువి అవ్వటం వలన నేను నీకు స్వాదీనుడను. కావున నీవు నీ భార్యా బిడ్డలతో కలసి నా ధామమునకు విచ్చేయుము" అని పలికెను.
ఆ మాటలు విని శివశర్మ " ఓ విష్ణుమూర్తి! ఇప్పటికి నా నలుగురు పుత్రులను నీ ధామమునకు తీసుకొని వెళ్ళు. నేను నా భార్య మరియు ఐదవ పుత్రునితో ఇంకొంత కాలం భూలోకం లో ఉండి తరువాత తమరిని చేరుకొనెదను" అని చెప్పెను. అప్పుడు శ్రీమహావిష్ణువు శివ శర్మ నలుగురు పుత్రులను ఇంద్రనీలమణి సామానమయిన కాంతి కలవారుగా, శంఖచక్రగధా ధరులుగా, దివ్యాలంకరణ భూషితులుగా చేసి గోలోకమునకు తీసుకొని వెళ్ళిరి.

30, డిసెంబర్ 2015, బుధవారం

విష్ణుశర్మ

శివశర్మ తన ముగ్గురు పుత్రులను వరుసగా పరీక్షించిన తరువాత తన నాలుగవ పుత్రుడయిన విష్ణుశర్మ ను పిలిచాడు.
శివ శర్మ విష్ణు శర్మతో ఇలా అన్నాడు " పుత్రా! ఈ స్త్రీ ని నేను ఇప్పుడే గ్రహించాను. ఈమె యవ్వనంలో ఉన్నది. నాకు శరీరంలో వృద్ధాప్యపు చాయలు ఉన్నాయి. కనుక వానిని నేను పోగొట్టు కొనేందుకు వీలుగా, నాకు నీవు అమృతం తెచ్చి ఇవ్వు " అని కోరెను.
తండ్రి కోరిక ప్రాకారం అమృతం తెచ్చే కోరికతో విష్ణుశర్మ స్వర్గానికి బయలుదేరాడు. విష్ణు శర్మ స్వర్గమునకు వస్తున్నాడు అని తెలుసుకొన్న ఇంద్రుడు ఆతనిని దారిలో ఆపాలన్న ఆలోచనతో మేనకను అతనిని ఆపే పని కై నియమించాడు.
ఆ మేనక విష్ణుశర్మ వచ్చే దారిలో ఒక ఉద్యానవనంలో ఉయ్యాలలూగుతూ పాటలు పాడుతూ ఆతనిని ఆకర్షించే ప్రయత్నం చేసినది. ఆమె పాటలు వినీ, వినని వానివలె, ఆమెను చూసీ చూడని వానివలే విష్ణుశర్మ ముందుకు సాగిపోసాగాడు. ఐనా మేనక ఆతని వెనుకనే వచ్చి ఆతనితో మాటలు కలిపినది. ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకు వెళుతున్నావు అంటూ! కానీ విశ్నుషరం ఆమె అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పి, ఆగకుండా వెళ్ళటం చూసి,మేనక తన సహజ స్వభావం తో ఆతనిని నిలువరించే ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నములు గ్రహించిన విష్ణుశర్మ " ఓ మేనకా! నేను శివశర్మ పుత్రుడను. ఇట్టి మాయలకు లొంగే వానను కాదు. నీ ప్రయత్నములు నావద్ద చేయకు" అని మెత్తగా మందలించి, తన దారిన తను వెళుతూ ఉన్నాడు.
మేనక తన ప్రయత్నంలో వెనుతిరిగినది అని తెలుసుకున్న ఇంద్రుడు సింహం, పులి వంటి క్రూర జంతువులను సృష్టించి విష్ణుశర్మ మీదకు ప్రయోగించాడు. అవి కూడా విష్ణుశర్మను నిలువరించలేక పోవటంతో ఈ సారి ఇంద్రుడు రాక్షస గణములను సృష్టించి అతనిమీదకు ప్రయోగించాడు. అన్నింటిని తన పితృభక్తి వలన ఎదుర్కొన్న విష్ణుశర్మ ఈసారి ఇంద్రుడు బాణ వర్షం కురిపించుతచే కోపగించాడు. "నేను మా తండ్రి ఆజ్ఞ మేరకు అమృతం తీసుకు రావటానికి వస్తుంటే, ఇంద్రుడు నిర్ధాక్షిణ్యం గా నా మీదకు యుద్ధానికి కాలుదువ్వు తున్నాడు కనుక ఇతనిని ఈ ఇంద్రపదవి నుండి తప్పించి మరొకరిని ఇంద్రుడుని చేస్తాను" అని కన్నులు ఎర్రవిగా అయి ఉన్న విష్ణుశర్మను చూసి భయపడిన ఇంద్రుడు "ఓ బ్రాహ్మణోత్తమ! నేను నీకు సకల దేవతలతో కలసి నమస్కరిస్తున్నాను! నీకు కావలసిన వరం కోరుకొనుము ఇచ్చెదను" అని అన్నాడు. వెంటనే తనకోపమును తన వసంలోనికి తెచుకున్న విష్ణుశర్మ "ఓ ఇంద్రా!నేను మా తండ్రిగారి ఆజ్ఞ మేరకు అమృత కలశం కోసం వచ్చాను. నీవు నాకు వరం ఇస్తాను అన్నావు కనుక, ఆ అమృత కలశంతో పాటుగా నాకు అచంచలమైన పితృభక్తిని ఇవ్వు" అని కోరెను.
ఇంద్రుడు అలాగే అని అమృత కలశమును విష్ణుశర్మకు ఇచ్చెను. ఆ కలశంతో  విష్ణుశర్మ తండ్రిని సమీపించి జరిగినది చెప్పి, ఆ కలశమును  తండ్రికి సమర్పించెను.
ఈ విధంగా నాలుగవ పుత్రుదయినా విష్ణు శర్మ పరీక్ష ముగిసినది. 

29, డిసెంబర్ 2015, మంగళవారం

తృతీయ కుమార - పరీక్ష

శివశర్మ తనవద్దకు తన రెండవకుమారుడయిన వేదశర్మ  తలతో వచ్చిన స్త్రీ ని చూసి, ఆమె చెప్పిన వృత్తాంతం అంతా విన్నాడు. ఈ వృత్తాంతం అంతా విన్న మిగిలిన పుత్రులు వేదశర్మ చేసిన త్యాగం గురించి ఆశ్చర్యపోయారు.
అప్పుడు శివశర్మ తన మూడవ పుత్రుడయిన ధర్మశర్మను పిలిచి, వేదశర్మను బ్రతికించమని కోరాడు.
తండ్రి మాటలు విన్న ధర్మశర్మ తక్షణం కన్నులు మూసుకుని, తండ్రి ఆదేశించిన విధంగా, యమధర్మరాజును ప్రార్ధించాడు.
అతని ప్రార్ధనను మన్నించి సమవర్తి ఆతనిముందు ప్రత్యక్షం అయ్యాడు. ఆతను కోరిన కోరిక ఏదయినా తీరుస్తాను అని చెప్పాడు. ఆమాటలు విన్న ధర్మశర్మ "ఓ యమధర్మరాజా! మీరు నా భక్తిని మెచ్చినట్లయితే, ఈనా సోదరుని వెంటనే బ్రతికించండి అని కోరెను. " ఆతని కోరిక విన్న యమధర్మ రాజు, మీ పితృభక్తి ఆతనికి ఆయుషు పోయగలదు అని చెప్పి అదృశ్యం అయ్యాడు.
అప్పుడు వేదశర్మ నిద్రలోనుండి మేలుకొన్న విధంగా, లేచి నిలుచున్నాడు. తనతండ్రిని, ఆ స్త్రీని చూసి, వారికి పాదాభి వందనం చేసాడు. ఈ విధంగా శివ శర్మ తన మూడవ కుమారుని పితృభక్తిని పరీక్షించాడు. 

28, డిసెంబర్ 2015, సోమవారం

ద్వీతీయ పుత్ర - పరీక్ష

శివశర్మ జ్యేష్ట పుత్రుని పరీక్ష ముగిసిన వెంటనే, ద్వీతీయ పుత్రుడయిన వేదశర్మని పిలిపించెను. అతనితో  "పుత్రా ! నేను నిత్య కర్మలయందు కొంచెం కూడా ఆలస్యం చేయక ఉందును. ఈ నాడు మీ తల్లి లేదు. నిత్య కర్మలు చేయుటకు నేను ధర్మపత్నితో ఉండుట అవసరం, మరియూ నాకు ఇంకనూ సంపూర్ణ వైరాగ్యం కలుగలేదు. నేను ఇప్పుడే ఒక చంద్ర వదనను ఆ విధిలో వెళుతుండగా చూసాను. ఆమెను తెచ్చి నాకు పత్నిగా చేయుము." అని చెప్పెను. తమ తండ్రి చెప్పిన మాటలు విన్న వేదశర్మ ఒక్క క్షణంలో వీదిలోనికి వచ్చి తండ్రి చెప్పిన ఆ స్త్రీని కనుగొని అంజలి ఘటించి "తల్లీ ! మా తండ్రిగారు తమరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు, కావున తమరు నాతో దయచేసి వారిని వివాహం చేసుకొనండి." అని చెప్పెను.
ఆ స్త్రీ వేదశర్మతో " నేను కన్యను, ఒక ముసలివానిని ఎందుకు వివాహం చేసుకోవాలి? వృధ శరీరం అనేకములయిన వ్యాధులకు ఆలవాలం. నేను నీ తండ్రిని వివాహం చేసుకోను, కానీ నిన్ను చేసుకుంటాను." అని చెప్పినది.
ఆమె మాటలు విని వేదశర్మ " అమ్మా! క్షమించాలి. మీరు నా తండ్రి మనస్సు గెలిచిన వారు. మీరు వారిని వరించిన సర్వ జగమ్ములు మీకు వశంలో ఉండేటట్లు చేయగలవాడను. నేను పలికిన ఒక్క మాటకూడా ఏనాడు తప్పదు." అని తలవంచి మరలా నమస్కరించెను.
ఆమాటలు విన్న ఆ స్త్రీ " ఓ బ్రాహ్మణోత్తమా! నిజంగా మీకు అంత శక్తి ఉన్నట్లయితే, ఇప్పుడే నాకు సమస్త దేవతలను చూపించుము. అప్పుడు మీ మాటలు నేను నమ్ముతాను. " అని పలికినది.
ఆమె అలా అడుగ గానే వేదశర్మ మనస్సులో ధ్యానం చేసాడు. ఆటను అలా ధ్యానం చేయగానే సకల దేవతలు వచ్చి వారిరువురికీ దర్శనం ఇచ్చి, ఆతనిని వరం కోరుకొనమని అడుగగా, వేదశర్మ " సకల దేవతలారా మీరు నాయెడల ప్రసన్నులయిన నాకు అవిచ్చిన్న మయిన పితృభక్తి ని ప్రసాదించండి" అని కోరెను. అప్పుడు ఆ దేవతలు ఆ తనిని అట్లే దీవించి అంతర్ధానం చెందారు.  
ఆతని పితృభక్తి ని చూచి ఆమె, " ఓ బ్రాహ్మణోత్తమ! నీకు గల పితృభక్తి అమోఘం. నీవు నన్ను నీ మాతృ స్థానంలో ఉంచాలని అనుకున్నందుకు సంతోషం. కానీ మరి నీ మాతృభక్తికి పరిక్ష ఇవ్వవా ?" అని అడిగినది.
ఆ మాటలు విని అనందం పొందిన వేదశర్మ ఆమె ఏ పరీక్ష పెట్టినా  తాను ఎదుర్కోనగాలను అని చెప్పగా, ఆమె అతనిని తన చేతులతో, స్వయంగా తలను నరుక్కొని ఆమె చేతికి ఇవ్వమని కోరినది.
మరుక్షణం వేదశర్మ పరమ సంతోషంతో తన తలను తన చేతులతో నరికి ఆమె చేతికి అందించెను.
ఆతని తలను చేతితో పట్టుకుని ఆ స్త్రీ శివశర్మ ఇంటికి వెళ్లి జరిగిన వృత్తాంతం అంటా వివరించెను.      

26, డిసెంబర్ 2015, శనివారం

జ్యేష్ట పుత్ర-పరీక్ష

శివ శర్మ ఒక రోజు తన పెద్ద కుమారుని పరీక్షించాలని అనుకున్నాడు.
జబ్బుతో భాదపడుతున్న తన భార్యను చూచి, జ్యేష్ట పుత్రుడయిన యజ్ఞశర్మను పిలిచెను. అతనితో శివశర్మ,  "చూడు! మీతల్లి ఈ విపరీతమయిన ఈ జ్వరముతో అనేక విధములుగా వేదన అనుభవిస్తున్నది. ఏవిధంగా ఆలోచించినా ఈమె వ్యాధికి మందు తెలియటంలేదు. ఆమె ఈ విధంగా భాదను అనుభవించుట కంటే ఆమెకు మనం మరణమును ప్రసాదించుట మేలు. కనుక నా జ్యేష్ట పుత్రుడవయిన నీవు, నీ స్వహస్తములతో ఒక ఖడ్గం తెచ్చి, దాని ద్వారా నీ తల్లిని వదించుము. ఆ పిదప ఆమె శరీరమును ఖండ ఖండములుగా త్రుంచి, నలు దిక్కులా పడవేయుము. అలా చేస్తేనే ఆమెకు గల ఈ విచిత్ర జ్వరం నివృత్తి అవుతుంది." అని చెప్పెను.
తన తండ్రి చెప్పిన మాటలు విన్న యజ్ఞశర్మ "తమరి అజ్ఞ" అని పలికి, అక్షరాల తండ్రి చెప్పిన విధంగా, చేసి తిరిగి వచ్చి తన తండ్రికి నమస్కారం చేసెను. కేవలం ఆతని మనస్సు నందు తన తండ్రి చెప్పిన మాటను నిస్సందేహంగా పూర్తి చేయవలెనను సంకల్పం తప్ప మరొకటి లేదు. అతనికి కనీసం ఇది తమ తండ్రి తనకు పెడుతున్న పరీక్ష అనికూడా తెలియదు.
జ్యేష్ట పుత్రుడు తన తండ్రి చెప్పిన విధంగా చేసి, తన పితృభక్తి ని నిరూపించుకున్నాడు. 

25, డిసెంబర్ 2015, శుక్రవారం

పితృ భక్తి

పితృ భక్తి, ఈ పదం ఈ రోజుల్లో మనం వినటానికి చదువుకోవటానికి మాత్రమే వాడుతున్నాం. కానీ పితృభక్తి అనే మాటకు విస్తృత ప్రాముఖ్యం ఇస్తూ మన కు గల 18 పురాణాలలో "హరేరేవ హృదయం పద్మ సంజ్ఞకం" అని అనిపించుకున్న పద్మ పురాణం లో భుమిఖండంలో అనేక అధ్యాయములలో చెప్పబడి ఉన్నది.
ఒకానొక సమయంలో శివశర్మ అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ద్వారకలో నివాసం ఉండేవాడు. అతనికి ఐదుగురు పుత్రులు ఉన్నారు. వారి పేర్లు

  1. యజ్ఞశర్మ 
  2. వేదశర్మ 
  3. ధర్మశర్మ 
  4. విష్ణు శర్మ 
  5. సోమశర్మ 
ఈ ఐదుగురు తమ తండ్రి వలెనే వేద విధ్యలలో నిష్ణాతులు. అంతే కాకుండా పితృభక్తి పరాయణులు. 

ఇలా కొంతకాలం గడిచినది. అప్పుడు శివశర్మ తమ పుత్రుల పితృభక్తికి పరీక్ష పెట్టాలని అనుకున్నాడు. అందుకు అనుగుణంగా తన అనుకూలవతి, ఐదుగురు పుత్రుల తల్లి అయిన తన భార్యకు ఒక విచిత్రమైన జ్వరం వచ్చేలా చేసాడు. అప్పుడు ఒక్కొక్క పుత్రునికి ఒక్కో విచిత్రమైన పరీక్ష. పెట్టటం  ప్రారంభించాడు 

24, డిసెంబర్ 2015, గురువారం

పీనాసి మొగుడు

ఒక భార్య భర్తలు వేసవి కాలంలో ఎవరినో హాస్పిటల్లో కలుద్దామని బయలుదేరారు. కలిసి కొంచెం సేపు మాట్లాడి ఇంటికి బయలుదేరారు.
భార్య : ఏమండి! ఇందాక కూడా నడిపించారు. దాదాపు 20 min. నేను నడవలేను.
భర్త : అదికాదోయ్! నడిస్తే సరదాగా ఉంటుంది. ఆటో ఎక్కితే 50 రూపాయలు ఖర్చు ఎందుకు. అదిగో అక్కడి వరకు          నడిస్తే మనం ఎక్కాల్సిన bus వస్తుంది.
భార్య : సరే! నాకు దాహంగా ఉంది. juice తాగుదామా!
భర్త : సరే! కొంచెం ముందుకు వెళితే అక్కడ షాప్ ఉంది అక్కడ తాగుదాం లే. నడువు.

Juice shop దగ్గరలో
భర్త : juice చల్లగా ఉండదు కదా! cool drink ఐతే ఈ ఎండలో చల్లగా బాగుంటుంది. అదిగో ఇంకొంచెం ముందు షాప్ ఉంది అక్కడ తాగుదాం.
భార్య : (అయిష్టంగా) సరే

Cool drink shop దగ్గరలో
భర్త : ఐన ఈ మధ్య newsలో ఈ cool drinks లో ఏవో విష పదార్ధాలు కలుపుతున్నారు అని రాస్తున్నారు కదా! అమ్మో వద్దు మనం తాగవద్దు. అదిగో అక్కడ చూడు Bus stand దగ్గర  చెరుకు రసం అది తాగుదాం నడు.
భార్య : ...
చెరకురసం బండి దగ్గర
భర్త : వీళ్ళు ఈ చెరుకును రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఇక్కడ పిండుతారు. వాడు ఏనీళ్ళు వాడాడో ఏమో!
        ఐనా నువ్వు handbag తీసుకొస్తావ్ కదా, దానిలో ఒక్క water bottle పెట్టుకోవచ్చు కదా! అదిగో మనం                   ఎక్కాల్సిన బస్సు వచ్చింది. నీకు కావలసిన జ్యూస్ నువ్వే ఇంట్లో చెయ్. ఇద్దరం తాగుదాం!
భార్య : (మనసులో)ఇంత  పీనాసి మొగుడు నాకు ఎక్కడ దాపురించాడో!

మీకు ఏమి అనిపిస్తుంది? పాపం ఆ భార్య ఏమి అనుకుంటుందో మీరు చెప్పగలరా! 

పురాణాత్మక విష్ణు స్వరూప కధనము

మనం ఇంతకుముందు 18 పురాణములు, వానిలోగల శ్లోకముల సంఖ్య గురించి చెప్పుకున్నాం. ఐతే పద్మ పురాణం ప్రకారం ఈ 18 పురాణములు శ్రీహరి యొక్క అంగములుగా చెప్పబడి ఉన్నాయి.
మీకోసం సంస్కృత పద్మపురాణమందలి శ్లోకములు, మరియు దానిని తెలుగులో అనువదించిన శ్రీ చిదంబర శాస్త్రి వారి శ్రీమదాంధ్ర పద్మపురాణం నందలి పద్యములు అందిస్తున్నాను!

సంస్కృతం:

బ్రాహ్మం మూర్ధా హరేరేవ హృదయం పద్మ సంజ్ఞకం 
వైష్ణవం దక్షిణో బాహుః వాయుర్వామో మహేశితుః 
ఊరూ భాగవతం ప్రోక్తం నాభి స్యాన్నారదీయకం 
మార్కండేయంచ దక్షాంఘ్రీః వామోహ్యగ్నేయ ముచ్యతే 
భవిష్యం దక్షిణో జానుర్విష్ణో రేవ మహాత్మనః 
బ్రహ్మ వైవర్త సంజ్ఞంత వామోజాను రుదా హృతః 
వైంగ్యంతు గుల్ఫకం దక్షం వారాహం వామ గుల్ఫకం 
స్కాందం పురాణం లోమాని త్వగస్య వామనం స్మృతం 
కౌర్మం పృష్టి సమాఖ్యాతం మత్స్యమేదః ప్రకీర్తతే 
మజ్జాతు గారుడం ప్రోక్తం బ్రహ్మాండ మస్తి గీయతే 
ఏవమేవా భవద్విష్ణుః పురాణా విమావో హరిః 
సంస్కృత పద్మ పురాణం : 1-62-67


తెలుగు 

తెలుగు లోనికి దీనిని అనువదించినప్పుడు ఈ వివరణకు శీర్షిక "పురాణాత్మక విష్ణు స్వరూప కధనము" అని ఇవ్వబడినది. 

సీ . పాద్మము హృదయంబు బ్రాహ్మము మూర్ధంబు 
                       మజ్జ గారుడము వామనము త్వచము 
      భాగవతం దొదల్  బ్రహ్మాండమస్థులు 
                       మాత్స్యము మెదడు కౌర్మంబు వెన్ను 
      లైంగ వారాహముల్ దక్షిణవామ గు 
                      ల్ఫంబులు నారదీయము నాభి 
      రోమముల్ స్కాందము వామ దక్షిణ భుజ 
                      ద్వందంబు శైవంబు వైష్ణవంబు 
గీ . వామపాద మాగ్నేయంబు వామజాను తలము  బ్రహ్మ వైవర్తంబు దక్షిణోరు 
      పర్వము భవిష్య మపసవ్య భావమొంది నట్టి పదము మార్కండేయ మచ్యుతునకు 

    శ్రీమద్ ఆంధ్రపద్మ పురాణం : ఆదిఖండం : 828

23, డిసెంబర్ 2015, బుధవారం

18 పురాణములు

మనకు 18 పురాణములు ఉన్నాయి. ఆ పురాణములు వానిలో గల శ్లోకముల సంఖ్య:
  1. బ్రహ్మ పురాణము - 10,000
  2. పద్మ  పురాణము - 55,000
  3. విష్ణు  పురాణము - 23000
  4. శివ/వాయు  పురాణము -24000
  5. వామన  పురాణము - 10,000
  6. మార్కండేయ  పురాణము - 9,000
  7. వరాహ  పురాణము - 24000
  8. అగ్ని  పురాణము - 15,400
  9. కూర్మ  పురాణము - 17,000
  10. భాగవత  పురాణము - 18000
  11. లింగ  పురాణము - 11,000
  12. నారద  పురాణము -25,000
  13. స్కంద  పురాణము - 81,000
  14. గరుడ  పురాణము - 19,000
  15. మత్స్య పురాణము - 14,000
  16.  బ్రహ్మ వైవర్త పురాణము - 18,000
  17. భవిష్య  పురాణము -14,500
  18. బ్రహ్మాండ  పురాణము - 12,000
ఈ శ్లోకముల సంఖ్యను ఒక్కొక పురాణంలో ఒక్కో విధంగా చెప్పారు. 

ప్రపంచంలోని మొట్టమొదటి అద్దముల దేవాలయం part 2

మనం ప్రపంచంలోని మొట్టమొదటి అద్దముల దేవాలయం గురించి  మాట్లాడుకుంటున్నాం కదా! ఆ దేవాలయానికి అంత ప్రత్యేకత తెచ్చినవారు ఎవరు? ఆ దేవాలయం ఎక్కడ ఉన్నది అని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఆ దేవాలయ దర్శనం చేసోద్దమా!
ఈ దేవాలయం గోపురం నుండి మన కన్నులకు పండుగ మొదలవుతుంది. ఈ క్రింది ఫోటో ఆ గోపురం లోని ఒక భాగం. 
source: Internet
గోపురం తరువాతి వంతు ముఖద్వారానిది. అది ఒక అధ్బుతం.

గడపదాటి లోపలి వెళ్ళగానే ద్వజస్థంభం కాంతులీనుతూ దర్శనం ఇస్తుంది. ఈ ధ్వజస్తంభానికి క్రింద భాగం లో వినాయకుని ముఖం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Source : internet
ధ్వజ స్థంభం వెనుకగా మన చూపులను ఆకట్టుకునే మరొక కళాఖండం ఒకటి ఉంది. మానవుని అనేక స్థాయిలు. అవును. మానవ జీవితంలో వచ్చే 11 దశలు శిల్పాలుగా మలచి ఉన్నాయి.

ఇక అమ్మవారి గర్భగుడి ద్వారానికి ఇరువైపులా నృత్య గణపతి అందంగా దర్సనం ఇస్తారు. అంతే  కాకుండా ఆ ద్వారానికి పైన ఉన్న అమ్మవారి ముఖం మనలను మంత్రం ముగ్ధులను చేస్తుంది.

ఈ ఆలయంలో ఉపఆలయములు కూడా ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ఉప ఆలయాలలో వెంకటేశ్వర స్వామి, కాళిక, గణేశ, కుమారస్వామి, శివులకు కూడా నిత్య పూజలు జరుగుతాయి. ఈ ఉపఆలయములే కాకుండా 10 పాలరాతి విగ్రహములు ఉన్నాయి. అవి జీసస్, షిరిడి సాయి, పుట్టపర్తి సాయి, రామకృష్ణ పరమ హంస, రాఘవేంద్ర స్వామి, గౌతమ బుద్ధ, గురునానక్ మొదలయిన దైవ అవధూతలకు సంబందించినవి. వీరే కాకుండా ఈ యుగపు మానవతా మూర్తి మదర్ థెరిస్సా.  వీరి  విగ్రహాలు ఒక్కొక్కటి 120 cm పరిమాణంలో ఉన్నాయి. తెలియని వారికి కూడా తేలిక అర్ధం అయ్యే విధంగా వారి వారి విగ్రహాల క్రింద వారి పేర్లు వివరాలు పొందు పరచారు. మత మరస్యానికి ఇంతకంటే మరో నిదర్శనం అవసరమా!



ఇవే కాకుండా త్రిమూర్తుల విగ్రహాలు చూడటానికి నిజంగా రెండుకళ్ళు సరిపోవు.








ఐతే ఇక్కడి ఉపాలయం లోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ లింగాన్ని ఆత్మలింగం అని పిలుస్తారు. ఆ లింగం యొక్క పీఠం కమలం ఆకారంలో ఉంటుంది. అక్కడకు వచ్చిన భక్తులు స్వయంగా తాము తెచ్చిన రోజ్ వాటర్తో అభిషేకం కుడా చేయవచ్చు. లింగ దర్శనం అయిన తరువాత ఆ శివాలయపు  ప్రత్యెక ఆకర్షణ రుద్రాక్షలు పొదిగిన గర్భాలయం. అమ్మవారికి అలంకారం ఇష్టం కనుక 3,00,000 ల అద్దముల తో  దేవాలయమును అలంకరించాము, కానీ శివునికి ఇంతకు మించి ఏదయినా చేయాలి అని అనుకున్నారేమో మన సినతంబి, 3,00,000 ల రుద్రాక్షలని నేపాల్ నుండి తెప్పించి, ఒక్కొక్క రుధ్రక్షా  మంత్రపూరితంగా ఆ గోడలో పొదిగారు. ఆ రుద్రాక్షలు  పై ఫోటో లో శివలింగం వెనుక భాగంలో నల్లగా కనిపిస్తున్న గోడను పరిశీలిస్తే కనిపిస్తాయి.
ఈ దేవాలయం లో ఒకేసారి 1500 మంది కూర్చోన వచ్చు. అంత విశాలంగా ఉంటుంది. ఐతే ఈ దేవాలయ అద్దములు అంతగా మెరిసిపోవటానికి కారణం ఆ దేవాలయంలో వారు అమర్చిన చండ్లియర్స్, మరియు వానిని నిరంతరం శుభ్రంగా ఉంచే శ్రామికులు. మీరు జీవితంలో ఎప్పుడయినా మలేషియా వెళ్ళే ఆలోచన ఉంటే తప్పని సరిగా ఈ దేవాలయ దర్శనం చేసుకోండి.
ఇన్ని విషయాలు చెప్పి ఒక్క విషయం చెప్పక పొతే నా వ్రాత అసంపూర్ణం అని నా అభిప్రాయం. దేశం కాని దేశంలో, మన దేవాలయానికి ఇంత  అపూర్వ ఖ్యాతి నందించిన శ్రీ  సినతంబి గారు నిజంగా ధన్యులు. వారి భక్తి ఈ దేవాలయం అణువణువునా ప్రతిభింబిస్తుంది.
ఈ దేవాలయం అందాలను ఈ క్రింది లింక్ లలో వీడియో ద్వారా చూడండి.

  1.  https://www.youtube.com/watch?v=KWPnZ7QbOvY
  2. https://www.youtube.com/watch?v=Ei3Zo_tVgQo
  3. https://www.youtube.com/watch?v=bn3pFJ_bo0w

19, డిసెంబర్ 2015, శనివారం

ప్రపంచంలో మొట్ట మొదటి అద్దముల (హిందూ) దేవాలయం

ఈ రోజులలో సహజంగా దేవాలయములకు వెళ్ళేది ఆడవాళ్లే. ఆడవాళ్ళ బలహీనత అద్దం. ఈ రెండింటిని ఒకే చోట చేరిస్తే, అద్దములతో ఒక దేవాలయం నిర్మించి, అక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటే, అక్కడికి మీరు కూడా వెళ్ళవచ్చు అని చెప్తే ఇక ఆడవాళ్ళ ఆనందం అపరిమితం కదా! మరీ అంత ఆనంద పడకండి. ఆ దేవాలయం మనకు అందుబాటులో లేదు, మలేషియాలో ఉన్నది. కొంత నిరుత్సాహం కలిగినా మన దేవాలయమునకు దొరికిన అత్యంత అపూర్వమైన ఖ్యాతి గురించి తెలుసుకోవటం మంచిదే కదా!
ఈ దేవాలయం మలేషియా లోని జోహోర్ రాష్ట్రంలో ఉన్నది. ఈ రాష్ట్రం సింగపూర్ కి అతి దగ్గరలో ఉంటుంది.
ఈ దేవాలయంలో దేవత పేరు ఆరుల్మిగు శ్రీ రాజకాళీ అమ్మ. 1922 లో నిర్మించబడిన ఈ దేవాలయం ఆ ప్రదేశంలో ఉన్న చాలా పాత దేవాలయం. తరువాత 1996 లో పునరుద్ధరణకు లోనయింది. ఈ దేవాలయమునకు ఇంత విశిష్టత చేకూర్చిన ఆ వ్యక్తి పేరు "సిన్నతంభి శివసామి". వీరు ఒకప్పుడు బాంగ్కాక్ (Bangkok) వెళ్లారట. అక్కడ ఒక దేవాలయం గోపురం మీది ఒక అద్దం ఎంతో దూరంలో రోడ్ పై కార్ లో వస్తున్న సిన్నతంబి శివసామి వారి కళ్ళలోకి తళ్ళుక్కు మని ప్రతిబింబించిందట. అది ఏమిటో తెలుసుకోవాలని వారు ఎంతో ప్రయాసపడి చివరకు అది ఒక దేవాలయం పైన అమర్చిఉన్న చిన్న అద్దం అని తెలుసుకున్నారట. అంతే అప్పుడే వారి కి ఒక అపూర్వమైన ఆలోచన వచ్చింది. ఒక చిన్న అద్దంముక్క ఎక్కడో ఉన్న రోడ్ మీదకి ప్రతిబింబిస్తే, ఒక దేవాలయం మొత్తం అద్దాలతో అలంకరిస్తే? అంతే వెంటనే మలేషియా తిరిగి వచ్చారు. ఇక తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు. ఒకటికాదు రెండుకాదు 3,00,000 ముక్కల అద్దాలు. ఎరుపు, ఆకుపచ్చ, నీలి, పసుపు, ఉదా మరియు తెలుపు రంగుల అద్దపు ముక్కలతో అధ్బుతంగా కన్నులు చెదిరేలా తయారయ్యింది. అంతే కాకుండా ఈ దేవాలయం మొత్తం శీతలీకరణం చేయబడినది. (airconditioned). ఈ దేవాలయం 2009 లో సర్వాంగ సుందరంగా భక్తులకు అందుబాటులోకి వచ్చినది.
My husband with my princess

ఈ దేవాలయ ఘనత ఏమంటే ప్రపంచంలో మొట్టమొదటి అద్దాల దేవాలయం ఇదే. అంతే కాదు 2010 లో మలేషియా బుక్ అఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించింది.

ఎలా చేరుకోవచ్చు?
ఒకవేళ మీరు మలేషియాలో ఉన్నట్లయితే ఫ్లైట్, రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇంకా ఈ రాష్ట్రం సింగపూర్ కు దగ్గరగా ఉండటం వలన సింగపూర్ నుండి కూడా రోడ్డు మార్గం ద్వారా చేరుకొనవచ్చు. ఒకసారి ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాక ఏదయినా క్యాబ్ లో ఈ దేవాలయమునకు చేరుకోవచ్చు. ఐతే అక్కడి క్యాబ్ డ్రైవర్స్ ని GLASS TEMPLE అని అడగాలి. ఐతే మీరు ముందు అక్కడకు చేరుకోగానే ఆ సిటీ మ్యాప్ ఒకటి చేతులో ఉంచుకోవటం మంచిది. ఒకవేళ డ్రైవర్ కి దారి తెలియక పొతే మీరు గైడ్ చేయవచ్చు. అంతే కాదు మీరు వెళ్లేముందు దేవాలయం సమయాలు చూసుకుని వెళ్ళటం మంచిది.

ఇది కేవలం ఆ దేవాలయ ముఖచిత్రం మాత్రమే. ఆ దేవాలయం లోపలికి వెళితే కన్నులు చెదిరిపోయే ఆ సౌందర్యం స్వయంగా అనుభవించాల్సిందే. మరి ఆ వివరాలతో తరువాతి పోస్ట్ చేస్తాను. అప్పటివరకు... తెలుగే మాట్లాడదాం. 

7, ఏప్రిల్ 2015, మంగళవారం

మలేషియా లోని గణపతి దేవాలయం

మలేషియాలోని మొదటి గణపతి దేవాలయం పెటలింగ్ జయ లో ఉన్నది మలేషియా లోని ఇతర గణపతి దేవాలయములకంటే ఇదే పెద్దది. ఇక్కడి శిల్పకళ నిజంగా మన భారతదేశం లోని దేవాలయముల వలెనే ద్రావిడ శైలిలో ఉంటుంది.  గోపురమే కాదు ఆ గోడలమీది శిల్పములు కూడా మనస్సును మరియు కళ్ళను కూడా ఆకర్షిస్తాయి. ఈ  నిర్వహణ భాద్యత పెటలింగ్ జయ  హిందూ అసోసియేషన్ వారు వహిస్తున్నారు.









ఈ దేవాలయంలో వినాయక చతుర్ధి ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో శ్రీరామ పట్టాభిషేకం ఘట్టం అత్యంత మనోహరంగా ఉంటుంది. 
ఈ దేవాలయంలో శివాలయం, మారియమ్మ దేవాలయం ఉన్నాయి. 

 ఈ దేవాలయం లో గణపతి ఉరెరిగింపు కోసం రధం ఉన్నది. ఆ రధమునకు పంచిన గుఱ్ఱములు, ఆ రధ చోధకునిగా సక్షాత్తు బ్రహ్మదేవుడు ఆశీనులయి ఉంటారు.
 గణేశునికి మూషిక వాహనం కూడా ఉన్నది.

 ఆ దేవాలయంలో హారతి ఇచ్చే ఆ సన్నివేశం  మీకోసం క్రింద ఇచ్చాను.



16, మార్చి 2015, సోమవారం

ఉత్తరమునకు తల ఉంచి ఎందుకు పడుకో కూడదు?

ఉత్తరమునకు తల ఉంచి పడుకుంటే ఇక ఏమయినా ఉందా! అలా పడుకుంటే దయ్యములు వచ్చి మనల్ని పట్టేసుకుంటాయి, మనల్ని పీల్చి పిప్పి చేస్తాయి. లేదంటే తిన్నగా చావే వస్తుంది అని కొందరు, అబ్బే అవి అన్నీ మూఢనమ్మకములు అని కొందరు, అనేకమయిన సమాధానములు వినిపిస్తాయి కదా! మరి నిజం ఏంటి?
భూమికి కూడా అయస్కాంత శక్తి ఉన్నది(గురుత్వాకర్షణ దీనికి రుజువు).
మనం చిన్నప్పుడు అయస్కాంత తత్త్వం గురించి చదువుకున్నాం కదా! ఒక అయస్కాంతాన్ని వ్రేలాడదీస్తే అది ఉత్తర దక్షిణ ద్రువముల వైపుగా విశ్రాంతి స్థానమునకు చేరుతుంది. అంటే భూమి యొక్క  అయస్కాంత క్షేత్రం ఉత్తర దక్షిణ దృవములకు ఉంటుంది.
మనకు ఈరోజు ఉన్న అధునాతనమయిన విజ్ఞాన శాస్త్రము ప్రకారం మానవుని దేహం కూడా తనదయిన ఒక అయస్కాంత పరిధిని కలిగి ఉంటుంది. దీనికి కారణం నిరంతరం మన దేహంలో నిర్విరామం గా ప్రవహిస్తూ ఉండే రక్తం అని చెప్తారు. కనుక మనం ఉత్తరం వైపునకు తల పెట్టి పడుకున్నట్లయితే మన శరీరంలోని అయస్కాంత పరిధి భూమి యొక్క అయస్కాంత పరిధితో  సమాంతరంగా ఉంటుంది. అలా ఉండటం వలన మన దేహంలో నిరంతరం ప్రవహించే రక్తం వలన కలిగే రక్తపీడనంలో మార్పులు సంభవిస్తాయి. దాని కారణంగా రక్తమును నిరంతరం మన శరీరంలో పంపు చేసే గుండె ఆ మార్పులను తట్టుకోవటానికి మరింత బలంగా పనిచేయవలసి వస్తుంది.
మరో విషయం ఏంటంటే మన రక్తంలో కొంత ఐరన్ ఉంటుంది. భూమికి ఉన్న అయస్కాంత శక్తి కారణంగా మన దేహంలోని ఇనుము కూడా రక్త ప్రసరణ కార్యక్రమంలో అవరోధంగా ఉంటుంది. దీనివలన తలనొప్పులు, ఆల్జిమర్, పార్కిన్సన్ వ్యాధులతో పాటు మెదడుకు సంబంధించిన రుగ్మతలు కూడా కలిగే అవకాశం ఉంటుంది.
అబ్బో అన్నీ ఇలానే చెప్తారు! మేం ఎప్పటి నుండో ఇలానే పడుకునే అలవాటు ఉంది మాకు ఏమీ తేడా లేదు. అని ఎవరైనా అనుకోవచ్చు. ఇలా ఒకరోజు పడుకుంటేనే ఇవన్నీ  జరుగుతాయని కాదు. ఇలా పడుకోవటం ఒక అలవాటుగా మారితే మన ఆరోగ్యంలో అనేకమయిన మార్పులు వస్తాయి అనే మనకు అటువైపు తల పెట్టి పడుకోవద్దు అని చెప్తారు. 

13, మార్చి 2015, శుక్రవారం

నేను చదివిన ఒక మంచి టపా

జ్యోతిష శాస్త్రమా? విజ్ఞాన శాస్త్రమా? అని రాజసులోచనం గారు రాసిన టపా చాలా బాగుంది.
ఒకరు మూఢనమ్మకం అంటారు. ఒకరు శాస్త్రం అంటారు. ఒక నిజమును  దాచి అది అబద్దం అబద్దం  అని వంద సార్లు ప్రచారం చేసినంత మాత్రాన అది అబద్దం అయిపోదు కదా! మన విజ్ఞానం, మన జ్ఞానం పూర్వికుల నుండి మనకు ప్రాప్తించిన అత్యంత అమూల్యమైన నిధి. అది నిధి అని కొందరు చెబుతున్నా దానిని నమ్మకుండా వితండవాదములు, పిడి వాదములు చేసే పిచివాళ్ళు ఎక్కువ కదా! వారిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారు కనుక నిజమును  నిరూపించుకోవటానికి (సాద్వి మా తల్లి సీతకే తప్పలేదు కదా!) కొన్ని పరిక్షలకు పూనుకోవలసినదే.
ఈ సృష్టిలో మనం మనకు తెలిసిన, మనం అర్ధం చేసుకున్నది ఎంత మాత్రమో ముందు మనకు తెలిస్తే, అప్పుడు ఏది సాస్త్రమో ఏది శాస్త్రం కాదో తెలుస్తుంది. "కోడి ముందా? గుడ్డు ముందా?" అనే ప్రశ్నలను ముందు పెట్టుకుని దాని మీద గంటలు గంటలు కార్యక్రమములు నిర్వహించి చివరకు మనకెందుకు అని నిట్టూర్చే అలవాటు ఉన్న సామాజిక భాద్యతగల అనేక చానళ్ళు దీని గురించి అంతగా పట్టించుకోవు. కానీ ఈ రోజు మొదలయిన ఈ పరిశోధన మన మున్డుతరముల వారికి తప్పకుండ మార్గదర్శకం అవుతుందని ఆశిస్తున్నాము.

దీపిక 

9, మార్చి 2015, సోమవారం

విశ్వామిత్రుడు - ఆకలి

మనిషి భరించే అనేకమైన కష్టములలో ఆకలి అనేది అత్యంత భయంకరమైనది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న అష్ట కష్టములలో యాచన అనేది ఆకలి తీర్చుకోవటం కోసమే కదా! అటువంటి ఆకలి మనిషిని ఎంత పని అయినా చేయిస్తుంది. మరి ఆ ఆకలి ఒక తపోధనుడయిన విశ్వామిత్ర మహర్షిచేత ఎటువంటి పని చేయించినదో  తెలుసుకుందామా?
ఇంతకూ ముందు సత్యవ్రతుని కారణంగా రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చినది అని తెలుసుకున్నాం కదా! ఈ సంఘటన ఆ సమయంలోనే జరిగినది. ఈ కరువు ప్రారంభం కాక మునుపే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదవిని కోరి తపస్సు చేయటం కోసం తన భార్య బిడ్డలను వదలి, అరణ్యములకు వెళ్ళాడు.
కొంతకాలం తీవ్రమైన తపస్సు చేసాడు. అప్పటికి ఆ రాజ్యంలో కరువు వచ్చి 12 సంవత్సరముల కాలం అయింది. ఇంకా వర్షం పడలేదు. ఎక్కడా  పచ్చదనం అనేది లేదు. కాయలు కాసే చెట్లు  కాదుకదా, ఒక మొక్క కూడా లేవు. ఆ సమయంలో విశ్వామిత్రునికి తీవ్రమైన ఆకలి భాద మొదలయ్యింది. దానిని తీర్చుకొనుటకు అనేక మార్గములా ప్రయత్నించాడు. ఎక్కడా  ఒక్క ఫలం కూడా దొరక లేదు.
చివరకు ఆ అడవిలో ఒక ఇల్లు కనిపించినది. తీవ్రమైన ఆకలి భాద తట్టుకోలేక ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని నిద్రపోతున్నాడు. ఆకలి భాదను తట్టుకోలేని విశ్వామిత్రుడు నిద్రపోతున్న యజమానిని చూసి, అతనిని నిద్రలేపే ప్రయత్నం చేయకుండా, ఉట్టిపై ఉన్న కుండను క్రిందకు దించాడు. ఆ కుండలో వండిన కుక్క మాంసం ఉన్నది. మూత తీసిన మరుక్షణం అది కుక్క మాంసం అని  విశ్వామిత్రునికి తెలిసింది. కానీ తట్టుకోలేని ఆకలి కారణంగా, కుక్క మాంసం తినకూడదు అని తెలిసి కూడా తినటానికి నిర్ణయించుకున్నాడు.
సరిగా అప్పుడే ఆ ఇంటి యజమాని నిద్రలేచాడు. తన ఇంటికి ఒక దొంగగా వచ్చి, తన కుండను క్రిందికి దింపిన విశ్వామిత్రుడిని అనేక రకములయిన ప్రశ్నలు వేసాడు. ఆకలి మనిషిని ఇంతగా లొంగదీసుకుంటుంది అనే విషయం అర్ధమయిన విశ్వామిత్రుడు అతనికి నిజమును చెప్పాడు. ఆకలి కారణంగా పోతున్న ప్రాణమును నిలబెట్టుకోవటం ముఖ్యం కనుక ఆటవికుని ఇంటిలో పరమ దూష్యమయిన కుక్క మాంసం కూడా తినటానికి సిద్దమయిన విషయం చెప్పి, ఒకవేళ ఒక మునిగా తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడు కుక్క మాంసం తినటం వలన అతనికి పాపం వచ్చినట్లయితే, ఆ పాపం తనకు కాక, ఈ రాజ్యం మొత్తం ఆకలికి అల్లాడేలా చేసిన ఆ వరుణ దేవునికి వస్తుంది అని చెప్పాడు.
ఆ మాటలు అలా విశ్వామిత్రుని నోటినుండి వచ్చాయోలేదో అప్పుడే విపరీతమైన కుంభవృష్టి ప్రారంభం అయినది. అంటే రాజ్యమును ఆకలికి గురిచేసిన పాపం నుండి వరుణుడు తప్పుకున్నట్లు. 

2, మార్చి 2015, సోమవారం

సత్యవ్రతుడు

సూర్య వంశం లో  జన్మించిన అనేక రాజులలో ఒకరు అరుణుడు.  అరుణుని పుత్రుడే సత్యవ్రతుడు. కాలాంతరంలో ఈ సత్యవ్రతుడే త్రిశంకు అనే నామాంతరం పొందాడు. ఇతని కారణంగా తండ్రి అయిన అరుణుని రాజ్యంలో 12 సంవత్సరముల  వర్షము కురవక, ప్రజలు అనేక కష్టములను అనుభవించారు.  దానికి కారణం?
సత్యవ్రతుడు సూర్య వంశ రాజకుమారుడు. చిన్న తనం నుండి లభించిన గారాబంతో పాపాత్ముడుగా ప్రవర్తించ సాగాడు. కామమునకు కూడా వశుడయ్యి జీవించసాగాడు. ఒకనాడు వివాహం జరగ బోవుచున్న ఒక బ్రాహ్మణ కన్యను పెళ్లి పీతల మీద నుండి అపహరించి తీసుకుని వెళ్ళాడు. ఈ విషయం బ్రాహ్మణులూ అంటా కలిసి తమ రాజయిన అరుణునికి తెలియచేసారు. ఇన్ని రోజులు కొడుకు చేస్తున్న తప్పులు తెలిసీ తెలియనట్లు ఊరుకున్న అరుణుడు సత్యవ్రతుడ్ని తీవ్రంగా శిక్షించ తలచాడు. కొడుకుకి దేశ బహిష్కారం విధించాడు. అడవులలోకి వెళ్లి నాగరికత తెలియని ఆటవిక జనంతో కలిసి బ్రతకమని వెలివేసాడు.
తండ్రి మీద కోపంతో రాజమును వదిలి వెళ్ళే సమయంలో తమ కుల గురువు గారయిన వశిష్టుడు చెపితే తన తండ్రి ఏమయినా తన శిక్షను తగ్గించే అవకాసం ఉండొచ్చు అని, వెంటనే గ్ఫురువు గారి వద్దకు వెళ్ళాడు. అప్పుడు సత్యవ్రతుడిని చూసిన వశిష్టుడు అప్రియంగా మొహం పెట్టి, సత్యవ్రతుడు చేసిన అన్యాయానికి అరుణుడు సరి అయిన శిక్షనే విధించి మంచి పని చేసాడు అని సత్యవ్రతుని దేశ బహిష్కారమును సమర్ధించాడు.
అప్పుడు సత్యవ్రతుడు అడవులలో ధనుర్భాణములు ధరించి వేట ద్వారా తన కడుపు నింపుకుంటూ బ్రతక సాగాడు.
కుమారుడు చేసిన పనికి కుమిలిపొతూ అరుణుడు రాజ్యమును వదలి తపస్సుకోసం వెళ్ళాడు. అప్పుడు  12 సంవత్సరముల  పాటు తీవ్రమయిన కరువు, అనావృష్టి సంభవించాయి.

నా ఆలోచన:
ఇక్కడ సూర్యవంశం లో ఒక రాజు అతని కుమారుని గురించి చెప్పారు. మనం ఇక్కడ గుర్తించ వలసిన విషయములు
  1.  ఒక రాజ కుమారుడు తప్పు చేస్తే భాదితులు ఆ రాకుమారుని తండ్రికే పిర్యాదు చేసారు. అంటే ఆ కాలంలో ప్రజలు రాజుతమకు న్యాయం చేస్తారు అని నమ్మారు. 
  2. రాజుగారు తప్పు చేసినది తన కొడుకు కనుక పక్షపాత దృష్టితో తప్పుకు తగిన శిక్ష విధించకుండా ఉండలేదు. తప్పు తన వారు చేసినా కూడా న్యాయం చేయటం తమ కర్తవ్యంగా భావించే వారు అని మనకు అర్ధం అవుతుంది. 
  3. గురువు తనకు వత్తాసు పలుకుతాడేమో అని ఆశ పడిన శిక్షార్హుని గురించి గురువు ఎంత మాత్రం జాలి చూపించలేదు సరి కదా తగిన న్యాయం జరిగినది అని రాజును ప్రసంశించాడు. ఆ రోజులలో గురువులు సత్యం తరపున నిలబడే వారు అని తెలుస్తుంది. 
  4.  రాజు కొడుకు రాజ్యం వదలి వెళ్ళిన తరువాత తను కూడా ఉండలేక  తపస్సు సాగాడు. అంటే రాజ్యమును వదిలి వేశాడు. అతని కర్త్యవం నిర్వర్తిన్చాకునాడ కొడుకు పై ప్రేమతో రాజమును అనాధలా వదలి వెళ్లి పోయాడు. కనుక రాజ్యం లో అరాచకం నెలకొన్నది కనుక ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించి ఉంటారు, కనుక అధర్మం తాండవం చేసి ఉండాలి. కనుకనే ఆ రాజ్యం కరువుతో భాద పడవలై వచ్చి ఉండాలి. సరి అయిన రాజు (నాయకుడు) లేక పొతే ప్రజలు ఎన్ని కష్టములు పడవలసి వస్తుందో మనకు తెలుసు కదా!!

28, ఫిబ్రవరి 2015, శనివారం

ధనుష్కోటి - మేలుకోటి

ధనుష్కోటి కూడా మేలుకోటిలోని ఒక చూడ దగిన ప్రదేశం. మీరు శారీరిక ధారుడ్యం కలవారైతే తప్పకుండా చూడవలసిన ఒక అద్భుతమైన, అందమైన, సుమనోహరమైన ప్రదేశం. మీ శారీరిక ధారుడ్యంఅంత బాగోలేదు అనుకుంటే....... !
my parents coming down from dhanushkoti

ఇంతక ముందు రాయగోపురం గురించి చెప్పుకున్నపుడు సీతారాములు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడకు వచ్చారు అని చెప్పుకున్నాం కదా! ఈ ధనుష్కోటి కూడా వారికి సంబందించిన ప్రత్యేకమైన ప్రదేశం.
సీతారాములు విహారం కోసం ఈ కొండపైకి వచ్చారట. అప్పుడు సీతామాతకు విపరీతమైన దాహం వేసిందట. ఆమె అవస్థ చుసిన శ్రీ రాముడు తన ధనుస్సు తీసుకుని ఒక బాణమును ఆ కొండయొక్క ఒక రాతి మీద ప్రయోగించారట. అప్పుడు ఆ రాతినుండి ఎప్పటికీ ఎండిపోని ఒక జల బయటకు వచ్చినదట. సీత మాత  ఆ జలముతో తన దప్పికను తీర్చుకొన్నదట.   ధనుస్సు ఉంది ప్రయోగించబడిన బాణము కొనవలన జలము ఉద్భవించినది కనుక ఈ ప్రదేశమును ధనుష్కోటి అని పిలిచారట.
ఈవిధంగా చెప్పబడిన ఆ జలం నేటికి కూడా ఎండిపోకుండా ఉన్నది. ఐతే ఆ నీరు త్రాగుటకు వీలుగా లేవు. ఐతే ఆ జలమును మనం తలపై ప్రోక్షించుకొనుటకు యోగ్యంగా ఉన్నవి.
source: internet

ఆ ప్రక్కనే సీతారాముల ఆలయం ఉన్నది.

శ్రీ సీతా రాముల పాద ముద్రలు కూడా ఇక్కడ చూడ వచ్చు. ఐతే ఇక్కడ వచ్చిన తరువాత అక్కడి ప్రకృతి రమణీయత అత్యంత అద్భుతం.


ధనుష్కోటికి మేల్కోటి చెలువ నారాయణుని దేవాలయం నుండి రాయగోపురం మీదుగా నడచి చేరుకొన వచ్చును. ఐతే ఆ కొండ ఎక్కటం అంత తేలిక ఐన విషయం కాదు. అ కొండ క్రింది వరకూ  కావాలంటే మీ వీలును బట్టి ఏదయినా వాహనంలో చేరుకొన వచ్చును.
ఇక్కడ చూపించినది ఆ కొండ యొక్క క్రింది భాగం. ఆ ఫోటోలో కనిపిస్తున్నంతవరకు ఏదయినా వాహనంలో రావచ్చును. 

26, ఫిబ్రవరి 2015, గురువారం

దేవుడు నరునిగా అవతరించాడా? - అనే ఒక ప్రశ్నకు సమాధానం

దేవుడు నరునిగా అవతరించాడా? 

అనే ఒక ప్రశ్నకు సమాధానం గా ఈ టపా రాస్తున్నాను. 

దేవుడు మనిషిగా అవతరించాడో లేదో మనం ఇప్పుడు ఇక్కడ కుర్చుని చెప్పలేము. మీరు చెప్పిన ధార్మిక గ్రంధముల పరిజ్ఞానం పెంపొందించుకోవాలి అనే నినాదంతో నేను ఏకీభవిస్తున్నాను. మీరు ఉటంకించిన భగవద్గీత శ్లోకములు మీ భావమునకు మంచి సామర్ధ్యమును తెచ్చి పెట్టాయి. 
మీరు చెప్పిన శ్లోకములకు మీకు అర్ధం మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 
  అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ:
               పరం భావ మజానంతే వమామయ మనుత్తమం. గీత:7:24

ఈ శ్లోకం లో చెప్పిన "మాం" అనే పదమునకు అర్ధం చెప్తారా? "మాం" అంటే సంస్కృతం లో అర్ధం "నేను" అని. అంటే శ్రీకృష్ణుడు తనగురించి తాను భగవంతునిగా చెప్పుకుంటున్నాడు. 

మీరు చెప్పిన అర్ధం ఇప్పుడు సరిగా చూడండి. "నా పూర్తి స్వభావం తెలియని మందబుద్దులు నన్ను కేవలం పంచభూతాత్మకమైన శరీరంగా తలుస్తారు" అని. అంతే కానీ నీను ఎప్పుడూ  అవతరించలేదు అని కాదు. మీకు సమాధానం దొరికినది అని భావిస్తున్నాను.   

ఆణిముత్యాలు-1

మనం ఎటువంటి ఉరిలో నివాసం ఉండాలో మన పెద్దలు సంస్కృతంలో ఇలా చెప్పారు

ధనిక: శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమ: l
పంచ యత్ర న విద్యన్తే న తత్ర దివనం వసేత్ ll

ఇదే శ్లోకం తెలుగులో సుమతీ శతక కర్త ఈ విధంగా చెప్పాడు.

అప్పిచ్చు వాడు వైద్యుడు 
ఎప్పుడు నెడతెగక పారు నేరు ద్విజుడున్ 
చొప్పడిన యూరనుండుము 
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతి.  

భావం: ధనవంతుడు, వేద శాస్త్రములు చదివి వానిని నిరంతరం అనుగమించె బ్రాహ్మణుడు, ధర్మ మరియు న్యాయముల ప్రకారం పరిపాలన చేయు రాజు, ఆహారం పండించుటకు పొలమును తడుపుటకు ఉపయోగపడే నీరు కలిగిన నది, ఇంకా వైద్యుడు అనే ఈ ఐదుగురూ ఉందని ఊరిలో ఒక్క రోజు కూడా ఉండకూడదు.

సంస్కృతంలో చెప్పిన పై శ్లోకం చాణుక్యుడు చెప్పినట్లుగా ఉన్నది. ఈ శ్లోకం తెలుగులోనికి తీసుకు వచ్చిన సుమతీ శతక కర్త ఒక న్యాయ పరమైన పరిపాలన సాగించే రాజు కూడా ఆ ఊరిలో ఉండాలి అని ఎందుకు చెప్పలేదో మరి!

25, ఫిబ్రవరి 2015, బుధవారం

నక్షత్రములు - అధిపతులు

మనం ఇంతకు ముందు నక్షత్రములు 27 అనీ, వారు దక్షుని పుత్రికలు అనీ వారిపేర్లు కుడా తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు ఆ నక్షత్రముల అధిపతుల గురించి తెలుసుకుందాం.
  1. అశ్విని  కి అధిపతి అశ్వినీ దేవతలు 
  2. భరిణి కి అధిపతి యముడు 
  3. కృత్తిక కి అధిపతి అగ్ని 
  4. రోహిణి కి అధిపతి బ్రహ్మ 
  5. మృగశిర కి అధిపతి చంద్రుడు 
  6. ఆరుద్ర కి అధిపతి శివుడు 
  7. పునర్వసు కి అధిపతి  అదితి 
  8. పుష్యమి కి అధిపతి గురుడు 
  9. ఆశ్లేష కి అధిపతులు సర్పములు 
  10. మాఘ/ మఖ కి అధిపతులు పితృ దేవతలు   
  11. పూర్వ ఫల్గుని కి అధిపతి భగుడు అనే సూర్యుడు
  12. ఉత్తర ఫల్గుణి కి అధిపతి అర్యముడు అనే సూర్యుడు
  13. హస్త కి అధిపతి సూర్యుడు 
  14. చిత్త కి అధిపతి  ఇంద్రుడు 
  15. స్వాతి కి అధిపతి వాయువు 
  16. విశాఖ కి అధిపతులు ఇంద్రుడు మరియు అగ్ని 
  17. అనురాధ కి అధిపతి మిత్రుడు అనే సూర్యుడు 
  18. జ్యేష్ట కి అధిపతి ఇంద్రుడు 
  19. మూలా కి అధిపతి రాక్షసుడు 
  20. పుర్వాషాడ కి అధిపతి వరుణుడు 
  21. ఉత్తరాషాడ కి అధిపతులు విశ్వేదేవతలు 
  22. శ్రవణ కి అధిపతి విష్ణువు 
  23. ధనిష్ఠ కి అధిపతులు అష్టవసువులు 
  24. శతభిష కి అధిపతి వరుణుడు 
  25. పూర్వాభాద్ర కి అధిపతి కజచరణుడు 
  26. ఉత్తరాభాద్ర కి అధిపతి ఆహిర్భుద్న్యు డు 
  27. రేవతి కి అధిపతి పూషుడు అనే సూర్యుడు 

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

రాయ గోపురం/ సీతారామ గోపురం

మేల్కొటేలో  చూడదగిన ప్రదేశాలలో రాయ గోపురం/ సీతారామ గోపురం అని పిలువబడే ఈ ప్రదేశంలోనే శ్రీ సీతారాములు ఈ ప్రదేశమునకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు వారికి స్వాగతం పలికిన స్థలం అని చెప్తారు. ఐతే ఈ గోపురం తన శిల్పకళా నైపుణ్యంతో చిరస్థాయిగా తనపేరు నిలుపుకున్న శ్రీ జక్కన మహాశిల్పి ఒక్క రాత్రిలో చెక్కారు అని మరో కధనం.
జక్కన గారి ప్రత్యర్ధులు జక్కన శిల్పకళా నైపుణ్యం పరిక్షించదలచి, వారిని ఒక్కరాత్రి లో ఈ గోపురమును నిర్మించమని షరతు విధించారట. ఆ షరతుకు అంగీకరించిన జక్కన ఈ గోపురమును నిర్మించటం మొదలు పెట్టారట. ఐతే మధ్యరాత్రికి దాదాపుగా సగంపూర్తయిన చూసి, తెల్లవారేసరికి జక్కన ఈ గోపురం పూర్తిగా నిర్మించాగలడు కనుక వారి ఓటమిని ముందుగా ఉహించిన ఆ ప్రత్యర్ధులు నాలుగవ ఝాము వచ్చేసినది అనేటట్లుగా ఆ అర్ధరాత్రి సమయంలో గంటలు మొగించారట. తన శిల్పకళా నైపుణ్యం మరొకరి స్వార్ధం ముందుఓడిపోయినది అని తెలుసుకున్న జక్కన గారు ఈ గోపురమును పుర్తిచేయకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారట.
ఇప్పటికి ఇక్కడ నాలుగు స్తంభాలు, వాని చుట్టూ శిల్పకళా ఖండాలు ఉంటాయి తప్ప వాటి పైన గోపురం ఉండదు.  ఈ రాయగోపురం శ్రీ యాదవగిరికి చేరుకునేందుకు ముఖద్వారంగా ఉంటుంది.

ఈ గోపురమును చేరుకోవాలంటే కాళ్ళకు కొంచెం పని చెప్పాల్సిందే. దారి కొండరాళ్ళతో మలచి ఉంటుంది.

పైకి వెళ్ళాక అక్కడ నుండి మెల్కోటే అందాలను చూసిన వారికి ఇది పెద్ద విషయంగా అనిపించదు. చెలువనారయణుని దేవాలయం నుండి కేవలం 10 నిముషములలో ఈ రాయగోపురమునకు నడచి చేరుకోవచ్చు. 

23, ఫిబ్రవరి 2015, సోమవారం

మేలుకోటిలోని తిరునారాయణ వైరముడి

 వైరముడి అనేది మేలుకోటి లో కొలువై ఉన్న ఆ చెలువ నారాయణుని కిరీటం పేరు. ఇంతకుముందు మనం మెల్కోటే కు చెలువనారాయణుడు, రామప్రియ ఎలాచేరుకున్నారో చెప్పుకున్నాం కదా! మరి ఈ కిరీటం ఏమిటో, అంత గొప్ప కిరీటం ఇక్కడకు ఎలా చేరినదో, దానిని ఎప్పుడు ఎలా దర్శించ గలమో తెలుసుకుందామా?

శ్రీ హరి ఒకసారి పాల సముద్రంలో పవళించి ఉండగా పరమ భక్తాగ్రేస్వరుడయిన ప్రహ్లాదుని కుమారుడు, విరోచనుడు శ్రీహరి పవిత్రమైన కిరీటమును   దొంగిలించాడు. అలా తీసుకువెళ్ళిన కిరీటమును విరోచనుడు ఎవరికీ తేలియని ప్రదేశంలో దాచి ఉంచాడు. అప్పుడు శ్రీహరి తన వాహనమయిన గరుక్మంతుని తన కిరీటం ఎక్కడ ఉన్నదో వెదకి తనకు తెచ్చి ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అప్పుడు గరుక్మంతుడు ఆ కిరీటమును గురించి దశ దిశలా వెదక సాగాడు. చివరకు ఆ కిరీటం జాడ తెలుసుకుని ఆ కిరీటమును కనుగొని, దానిని శ్రీహరికి సమర్పించాలి అనే తొందరలో ఆ కిరీటమును ముక్కున కరచుకొని పయనం సాగించాడు. అప్పుడు వాడి అయిన గరుక్మంతుని ముక్కు తగిలి ఆ కిరీటమునకు పొదగ బడిన ఒక అపూర్వమైన నీలి రత్నం ఒకటి రాలి నేలపై పడినది. ఆ రత్నం పడిన చోటునుండి ఒక నది ప్రారంభం ఐయి ప్రవహిస్తూ ఉన్నది. ఆ నదిని చింతామణి అని పిలిచారు. (ఇప్పటికీ  ఈ నది తంజావూరు వద్ద ఉన్నది )
గరుక్మంతుడు అత్యంత శ్రమించి తెచ్చిన శ్రీవారి కిరీటం వారికి సమర్పించటానికి ఆత్రుతగా గరుడుడు శ్రీవైకుంఠ పురమునకు చేరుకున్నారు. కాని అప్పటికి శ్రీహరి భూలొకం లో అవతరించారు అని తెలుసుకుని, కించిత్ నిరుత్సాహమునకు లోనయ్యి ఎలా అయినా శ్రీఘ్రంగా శ్రీహరికి ఈ కిరీటం అందించాలి అనే సంకల్పంతో గరుక్మంతుడు అతివేగంగా భూలోకమునకు వచ్చి శ్రీహరి గురించి అనేక ప్రదేశములు వెదకారు. చివరకు రేపల్లెలో తన మిత్రులతో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుని చూసి అమితానందం పొందారు. ఆ కిరీటం బాలకృష్ణుని తలపై ఉంచారు. అది ఆబాలగోపాలమును పరిపాలించే బాలగోపాలుని తలకు సరిగ్గా సరిపోయినది. ఆ కిరీటం ధరించిన బాల కృష్ణుని చూసిన గరుక్మంతుడు సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు.
శ్రీకృష్ణుడు స్వయంగా రామప్రియకు ఆ కిరీటమును ఉంచి పూజించేవారు.  తరువాతి కాలంలో శ్రీకృష్ణుడు రామప్రియతో పాటుగా ఆ కిరీటమును కూడా తీసుకు వచ్చి మేల్కోటలో ఉన్న చెలువనారాయణ దేవాలయంలో ఉంచారు అని ఇక్కడి పురాణం.
ఈ కిరీటమును వైరముడి అంటారు. చెలువ నారాయణుడు కూడా ఈ కిరీటమును సంవత్సరమునకు ఒక్కరోజే ధరిస్తారు. అది బ్రహ్మోత్సవంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం ఈ వైరముడి బ్రహ్మోత్సవం దర్శించటానికి కొన్ని లక్షలమంది మేల్కొటేకు చేరుకుంటారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఏప్రిల్ 30 నుండి జరుగుతుంది.        
ఈవైరముడి మిగిలిన రోజులు కర్నాటక ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ఈ కిరీటము అస్సలు సూర్యరశ్మి ప్రవేశించకుండా ఉండేటట్లుగా ఉన్నటువంటి పెట్టెలలో భద్రపరుస్తారట. అంతేకాదు, ఈ కిరీటం చెలువనారాయణుని తలపై ఉన్నపుడు తప్ప విడిగా చూడకూడదట.
మరి అందుకే స్వామివారి తలపై ఈ కిరీటమును ధరింపచేసే ఆ ఆలయ ముఖ్య పూజారి కూడా ఆ కిరీటము ఉన్న పెట్టెను శ్రీ రామానుజాచార్యుల వారి ముందు ఉంచి, తన కన్నులకు సన్నని వస్త్రమును కట్టుకుని, అప్పుడు ఆ పెట్టెను తెరిచి, శ్రీవారికి ఆ కిరీటం అలంకరింపచేస్తారట.
అది సంగతి. ఇటువంటి అధ్బుతమైన, అపుర్వమిన ఒక ఉత్సవం మన పక్క రాష్ట్రం లో మర్చి 30, 2015 వ తారీకున జరుగుతుందట. పిల్లలకు పరిక్షలు ఐపోయి ఎక్కడకు వెళ్దామా అని ఆలోచిస్తున్న వారు చక్కగా బెంగళూరు, మైసూరు, ఇంకా మెల్కోటే వెళితే బాగుంటుంది కదా!                                                                             

31, జనవరి 2015, శనివారం

తెనాలి లో హనుమత్ చాలీసా పారాయణ మహాయజ్ఞం


 తెనాలి లో హనుమత్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఈనాటి (31 జనవరి 2015) ఉదయం బుర్రిపాలెం రోడ్డులో గల శ్రీ జానకి రామ హనుమత్ ప్రాంగణం లో అత్యంత భక్తీ శ్రద్ధలతో మొదలు పెట్టారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతులు శ్రీశ్రీగణపతి సచ్చిదానంద స్వామిజి అధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత మనోహరంగా కొనసాగుతూ ఉన్నది.
సహజంగా జరిగే హనుమత్ చాలీసా పారాయణకు భిన్నంగా ఇక్కడ ఒక్కసారి 40 శ్లోకముల చాలీసా చదవటం పూర్తి అవ్వగానే 1 లేదా 2 నిముషముల సమయం ఆగి, శ్రీ రామ నామం 4 సార్లు పలికి మరలా చాలీసా పారాయణం మొదలు పెడుతున్నారు. 111000 మంది భక్తులు ఈ చాలీసా చేస్తారు అని అంచనా మారి ఇప్పటివరకు సుమారుగా 125000 మంది పారాయణం చేస్తున్నారు.
అనేకమంది వాలెంటీర్లు స్వచ్చందంగా అక్కడకు చేరిన భక్తులకు కావలసిన సదుపాయములను చూస్తున్నారు. ఈ కార్యక్రమమునకు అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు కుడా విచ్చేశారు.
తెనాలి లో ఈరోజు వ్యాపారస్తులు స్వచందంగా తమ వ్యాపారములను ఆపేసి. వారు కూడా ఈ మహాయజ్ఞం లో పాలుపంచుకుంటున్నారు. తెనాలి తో అనేక మైన భద్రతా ఏర్పాట్లు చేసారు. ట్రాఫిక్ ను కూడా నియంత్రిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం అత్యంత మనోహరంగా, ఈవిధమైన అవంచనియమైన సంఘటనలు లేకుండా సాగుతోంది.
మన హిందూ సంప్రదాయమును ఒక తాటిపైకి తీసుకు వచ్చే ఇటువంటి అనేకమైన కార్యక్రమములు నా తెనాలిలో మరిన్ని జరగాలని కోరుకుంటూ

మీ
దీపిక