23, ఫిబ్రవరి 2022, బుధవారం

ఇంద్రాది దేవతలు నలునికి వేసిన ముందరికాళ్ళ బంధం!

మనం ఇంతకు ముందు నలుని గురించి, దమయంతి గురించి, వారి మద్యన జరిగిన హంస రాయభారం గురించి తెలుసుకున్నాం కదా! ఆ తరువాత భీమసేనుడు తన కుమార్తె దమయంతికి స్వయంవరం ప్రకటించారని కూడా చెప్పుకున్నాం!

స్వయంవరానికి భీముడు సకల రాజ్యములకు చెందిన రాజులను అహ్వానించాడు. అందరు రాజులు ఆ స్వయంవరానికి వచ్చేసారు. 

ఆ సమయంలోనే నారదుడు ఆ దమయంతి స్వయంవర వార్తను తీసుకుని స్వర్గమునకు వెళ్ళాడు. దమయంతి సౌందర్యమును, గుణవర్ణనము విన్న తరువాత దేవేంద్రునితో కలిసి అందరు దిక్పాలకులు ఆ స్వయంవరమును చూడడానికి బయలుదేరారు. వారికి నారదుని వలన దమయంతికి సరి అయిన వరుడు నలుడు అని తెలుసుకున్నారు. వారు నలుని ధర్మనిరతిని పరిక్షించాలని అనుకున్నారు. 

వారు స్వయంవరానికి వెళ్తున్న నలునికి ఎదురు వచ్చారు. వారు నలుని చూసి తమను తాము పరిచయం చేసుకోకుండానే తమకు నలునివల్ల ఒక సహాయం కావాలని, నలుడు వారి తరపున దూతగా వెళ్ళాలని కోరుకున్నారు. వారు ఎవరో తెలుసుకోకుండానే వారికి సహాయం  చేస్తాను అని, దూతగా వారి అభీష్టం నెరవేరుస్తాను అని మాట ఇచ్చేసాడు. 

అప్పుడు దేవతలు నలునితో ఇంద్రుడు, తాను ఇంద్రుడననీ, తనతో ఉన్న వారు దిక్పాలకులనీ, వారు దమయంతీదేవి స్వయంవరమునకు వచ్చామనీ, కనుక నలుడు వారి తరపున ఆమె వద్దకు వెళ్ళి, వారి గొప్పతనములను, బిరుదులను, వారి వారి శౌర్య ప్రతాపాలను వివరించి చెప్తే ఆమె వారిలో ఎవరినైనా వివాహం చేసుకొనుటకు అవకాశం దొరుకుతుంది కనుక నలుడిని అలా దౌత్యం జరుపమని కోరుకున్నాడు. 

తాను ప్రేమించి, వివాహం చేసుకోవాలని అనుకున్న అమ్మాయి వద్దకు మరొకరి గురించి దౌత్యం చేయడానికి నలుడు ఒప్పుకున్నాడా? అలా ఒప్పుకోకుండా మాట తప్పాడా? తరువాతి టపాలలో చుద్దాం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి