31, మార్చి 2020, మంగళవారం

పులస్త్యుడు - విశ్రవసుడు

మనం ఇంతకు ముందు ఒక పురాణమునకు మరొక పురాణమునకు భేదములు ఉండటానికి కారణం అవి జరిగిన కల్పములే కారణం అని చెప్పుకున్నాం కదా!
ఇప్పుడు అటువంటిదే మరొక సంఘటన గురించి తెలుసుకుందాం!
భాగవతం ప్రకారం నవబ్రహ్మలలో ఒకరయిన పులస్త్యుని భార్య హవిర్భువు అని, ఆమె స్వయంగా కర్దమ ప్రజాపతి మరియు దేవహూతి లకు కలిగిన తొమ్మిది మంది కుమార్తె లలో ఒకటి అని చెప్పుకున్నాం!

కానీ వాల్మీకి రచించిన రామాయణం ప్రకారం పులస్త్యుని భార్య తృణబిందుని పుత్రిక.
రామాయణం ప్రకారం:
పులస్త్యుడు మేరు పర్వత ప్రాంతంలో తృణబిందు అనే ఆశ్రమ సమీపంలో నివసిస్తూ, తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ ఆశ్రమ సమీపంలో ఉన్న వనంలో ఎప్పుడూ వసంతకాలంలా ఉండేది. ఆ ప్రకృతిని ఆస్వాదించటానికి వచ్చినవారు అక్కడ చేసే కోలాహలమునకు ఇతని తపస్సు భంగం అవుతూ ఉండేది. అలా కొంతకాలం భరించిన అతనికి సహనం నశించి ఆ స్థలమునకు వచ్చి ఎవరయినా అతని కంట పడితే ఆ స్త్రీ గర్భం ధరిస్తుంది అని శపించాడు. ఇతని శాపము తెలియని తృణబిందుని కుమార్తె ఒకసారి అలా వనంలో విహరిస్తూ ఇతని కంట పడింది. అప్పటి నుండి ఆమె శరీరంలో గర్భసూచనలు కనిపించసాగాయి.
ఈ విషయం తెలుసుకున్న తృణబిందు తన కుమార్తెను తీసుకుని పులస్త్యుని వద్దకు వచ్చి, తన కుమార్తెను అతనికి దానం చేసాడు. అలా గర్భం దాల్చిన ఆమెను పులస్త్యుడు వివాహం చేసుకున్నాడు.  గర్భం దాల్చిన ఆమె ఆ ఆశ్రమ వాతావరణంలో కాలం గడుపుతూ, వారు చదివే శాస్త్రములు వేదములు వింటూ ఉన్నది కనుక ఆ పుట్టిన బిడ్డకు విశ్రవసుడు అని పేరు పెట్టారు.
ఈ విశ్రవసుడు కూడా తన తండ్రికి వలెనే అత్యంత నిష్టా గరిష్టుడు. ఇతని ధర్మాచరణమును గురించి తెలుసుకొనిన భరద్వాజుడు తన కుమార్తెను ఈ విశ్రవసునకు ఇచ్చి వివాహం చేశారు. తరువాత వీరికి ఒక పుత్ర సంతానం కలుగగా ఆ బాలునికి వీరు వైశ్రవణుడు అని పేరు పెట్టారు. అతనే కాలాంతరంలో ధనాధిపతి కుబేరుడు గా మనకు సుపరిచితుడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి