14, జూన్ 2020, ఆదివారం

విశ్రవసుడు - కైకసి - సంతానం

మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది  అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది అని తెలుసుకున్నాం కదా!  తిరిగి లంకను రాక్షసులు ఎలా స్వాధీనం చేసుకున్నారు? అలా వారు స్వాధీనం చేసుకోవటానికి తోడ్పడిన సంఘటనల క్రమాన్ని కూడా తెలుసుకుందాం!
శ్రీ మహావిష్ణువు వలన కలిగిన భయంతో తమ పరివారాన్ని తీసుకుని పాతాళానికి వెళ్లిన సుమాలి అక్కడే కాలం గడపసాగారు. ఆప్పుడప్పుడు భూలోకమునకు వచ్చి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటూ ఉండేవాడు.  ఒక నాడు అతను అలా బయటకు వచ్చిన సందర్భంలో పుష్పక విమానంలో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా వెళుతున్న వైశ్రవణుడు అతనికి కనిపించాడు. సుమాలి అతని ని చూసి కొంత అసూయ చెంది ఆటను ఎవరు, ఎలా ఆ ఐశ్వర్యమును పొందాడు అనే విషయములు తెలుసుకుని తిరిగి పాతాళమునకు వెళ్ళాడు.
సుమాలి కుమార్తెలలో ఒకరయిన కైకసి కి అప్పటివరకు వివాహం కాని కారణం వల్ల, ఆమెకు విశ్రవసుడు తగిన వరుడు అని తాను అభిప్రాయ పడుతున్నట్లుగా చెప్పాడు.  అంతేకాక ఆ సమయంలో వారు ఉన్న పరిస్థితులలో వారికి వైశ్రవణుని వంటి ఒక వారసుడు అవసరం కనుక విశ్రవసునితో కుమారులను కంటే, ఆ కుమారులు వారి రాక్షసజాతికి ఎంతో ఉపయోగపడతారు అని చెప్పాడు.
తండ్రి మాటలు విన్న కైకసి ఉన్నపళంగా విశ్రవసుని వద్దకు వెళ్ళింది. ఆమె రాకను గమనించిన విశ్రవసుడు ఆమె రాకకు కారణం అడిగాడు. ఆమె ఆ విషయమును తిన్నగా చెప్పకుండా, అతను సర్వము తెలిసినవాడు కనుక అతనినే దివ్యదృష్టితో కనుక్కోమని చెప్పింది. ఆటను ఆమె అక్కడకు రావటానికి గల కారణం తెలుసుకుని, ఆమె వచ్చిన సమయం సాయం సంధ్యా సమయం కనుక ఆమె  ప్రకారం కలిగే పిల్లలు రాక్షస ప్రవ్రుత్తి  కలవారు అవుతారు అని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించని కైకసి తనకి ఒక ధర్మాత్ముడయిన కుమారుని కూడా ప్రసాదించమని కోరుకున్నది.
అలా కైకసికి మొదటి సంతానం కలిగింది. నల్లగా, భయంకరంగా, పెద్ద కోరలతో, పది తలలతో జన్మించాడు. విశ్రవసుడు అతనికి దశకంఠుడు / దశగ్రీవుడు అని నామ కారణం చేసాడు.
రెండవవానిగా అత్యంత భారీకాయుడు జన్మించాడు. అతని చెవులే పెద్ద కుండలవలే కనిపించాయి. విశ్రవసుడు అతనికి కుంభకర్ణుడు అని పేరు పెట్టాడు.
మూడవసంతానం గా ఒక అమ్మాయి జన్మించింది. ఆమే శూర్పణఖ
నాల్గవవానిగా ధర్మాచరణ పరుడయిన విభీషణుడు జన్మించాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి