9, జులై 2014, బుధవారం

ఋష్యశృంగుడు

ఋష్యశృంగుడు 

పూర్వకాలంలో విభండక మహర్షి చాలా కాలం తపస్సు చేసాడు. ఒక రోజు స్నానం చేయటానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా, అక్కడ అటుగా వెళ్తున్న ఉర్వశిని చూసేసరికి ఆయనకు వీర్య స్కలనం జరిగి, ఆ వీర్యం సరోవరం లో పడింది. ఆ వీర్యాన్ని అప్పుడే దాహం తీర్చుకోవటానికి అక్కడకి వచ్చిన ఒక జింక త్రాగిoది. ఆ జింక గర్భం దాల్చి కొంతకాలానికి శిరస్సు మీద ఒక కొమ్ము ఉన్న పిల్లవాడికి జన్మనిచ్చింది.  అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి, అతనికి ఋష్యశృంగుడు  అని పేరు పెట్టారు. ఆ విభండక మహర్షి, ఋష్యశృంగునికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞ యాగాదులు అన్ని చెప్పాడు. కానీ ఆ ఋష్యశృంగుడు పుట్టినప్పటి నుండి ఆ అరణ్యంలో లోకం తెలియకుండా పెరిగాడు. ఆయనకి అసలు ఈ సృష్టి లో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియదు. ఎప్పుడూ ఆ ఆశ్రమములోనే తండ్రి పక్కనే ఉండి నిత్యనుస్టానమును  ఆచరిస్తూ ఉండేవాడు. 

అదే కాలం లో అంగారాజ్యాన్నిరోమపాదుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఐతే ఒకసారి రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడటం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. తన ప్రజల వెతలు చూసిన  రాజు దీనికి నివారణోపాయాన్ని తెలుపమని కొందరు మహర్షులను సంప్రదించగా వారు ఋష్యశృంగుడు వారి రాజ్యం లో అడుగు పెడితే తప్పక వర్షాలు కురుస్తాయి అని చెప్పారు. 
వెంటనే రోమపాదుడు తన మంత్రులని పిలిచి విషయం చెప్తే, ఋష్యశృంగుడిని తీసుకురావటం వీలు కాదు,  ఏవిధమైన కోరికలు లేని వాడు, అసలు ప్రపంచం అని ఒకటి ఉన్నది అని కూడా తెలియని వాడు  రాజ్యానికి ఎందుకు వస్తాడు? కానీ మంత్రులు మేధో సంపన్నులు కనుక తప్పు మార్గం అని తెలిసి కూడా ఒక సలహా ఇచ్చారు. ఋష్యశృంగునికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి, కాకపొతే ఇప్పటివరకు అతనికి లోకం తెలియదు, కనుకనే విషయసుఖాల గురించి కూడా తెలియదు. ఋష్యశృంగునికి అవి కొంచెం రుచి చూపిస్తే తమ రాజ్యం లోకి రప్పించవచ్చు అని. 

అప్పుడు రాజు కొంతమంది అందంగా అలంకరించుకున్నవేశ్యలని అడవికి పంపించాడు. వారు విభండక మహర్షి ఆశ్రమం లో లేని సమయం లో ఆ ఆశ్రమానికి కొంతదూరం లో ఆటపాటలు ప్రారంభించారు. వీరి ఆహ్లాదకరమైన మాటలు పాటలు విన్నఋష్యశృంగుడు వారి వద్దకు వెళ్లి ఇప్పటి వరకు చూడని వారు ఇక్కడ ఎందుకు ఉన్నారో తెలియక వారిని అడిగారు. "ఓ మహానుభావులారా! మీరు ఏ ఆశ్రమం నుండి వచ్చారు? ఇక్కడ అమీ చేస్తున్నారు? మా ఆశ్రమానికి వచ్చి మా ఆతిధ్యం స్వీకరించండి"

ఆ ప్రశ్నకు ఆ వేశ్యలు సమాధానం చెప్తూ వారి ఆశ్రమం కొoత దూరo లో ఉంది అని, మరొక సారి వచ్చినప్పుడు ఋష్యశృంగుడి ఆశ్రమాన్ని దర్సిస్తము అని వారి ఆటపాటలతో అప్పటికి అతనిని అలరించారు. కొంతసేపటి తరువాత విభండక మహర్షి ఆశ్రమానికి వచ్చేస్తారేమో అని భయం తో ఆ వేశ్యలు వెనుకకు బయలుదేరబోతు ఋష్యశృంగుడిని ఒకసారి కౌగలించుకుని వెళ్లారు. అప్పటి వరకు స్త్రీలు, వారి స్పర్స తెలియని ఋష్యశృంగునికి ఆ సంఘటన ఒక వింత అనుభూతిని కలిగించింది. మరలా వారు ఎప్పుడు వస్తారో అన్న ఆలోచన కూడా కలిగింది.
మరొక రోజు వారు రాగానే ఋష్యశృంగుడు వారిని తమ ఆశ్రమానికి ఆహ్వనించాడు. వారు వస్తూ తమవెంట కొన్ని తినుబండారాలు తెచ్చి, అవి వారి ఆశ్రమం లోని ఫలములు అని చెప్పి ఋష్యశృంగునికి ఇచ్చారు. కొంత సమయం తరువాత వారు తెరిగి వెళుతూ మరోసారి వారు వచ్చినప్పుడు ఋష్యశృంగుడు తమతో తమ ఆశ్రమానికి రావాలి అని ఆహ్వానించి వెళ్ళిపోయారు.
 ఈసారి వారు వచ్చినప్పుడు ఋష్యశృంగుడు వారి వెంట బయలుదేరాడు. ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగుపెట్టిన మరుక్షణం బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, వారి అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంత ని ఇచ్చివివాహం జరిపించారు.

తరువాత కొంతకాలానికి ఈ ఋష్యశృంగుడే దశరధుని చేత పుత్రకామేష్టి  జరిపించాడు.

మన ఈ కాలం లో శంకరాచార్యుడు సంపూర్ణ భారతదేశ యాత్ర చేస్తున్న సమయం లో ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడే ఈనాటి శ్రుంగగిరి పీఠం స్థాపించారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి