28, ఏప్రిల్ 2020, మంగళవారం

వినత- గరుడుడు

మనం ఇంతకు ముందు వినత కద్రువల గురించి వారి అసూయ, మదము- క్రోధము గురించి చెప్పుకున్నాం కదా!!
ఆ తరువాతి కధ ఇప్పుడు చూద్దాం!

మరునాడు వినత కద్రువలు వెళ్లి ఆ అశ్వాన్ని చూసారు. ముందే అనుకున్న ప్రకారం కద్రువ కొంచెం దూరం నుండి ఆ గుర్రాన్ని చూసే ఏర్పాటు చేసింది. కర్కోటకుడు వెళ్లి ఆ గుర్రం తోకను పట్టుకుని ఉన్నాడు. అలా ఆ గుర్రాన్ని దూరంగా చూస్తున్న వారికి దాని తోకలో కొంతభాగం నల్లగా కనిపించింది. అంటే వారి షరతు ప్రకారం వినత కద్రువకు దాస్యం చేయాలి .

అప్పటి నుండి వినత కద్రువకు దాసీ గా ఉండిపోయియింది. కొంతకాలానికి వినతకు మిగిలిన రెండవ గుడ్డు లోనుండి గరుడుడు జన్మించాడు. అతను కూడా ఒక దాసీ పుత్రునిగా కద్రువకు, ఆమె పుత్రులకు సేవలు చేస్తూ ఉన్నాడు. అతను పక్షి కనుక తన రెక్కల మీద కద్రువ పిల్లలయిన పాములను ఎక్కించుకుని గాలిలోకి తీసుకెళ్లి విహారం చేయించేవాడు. అలా ఉండగా ఒకసారి  గరుడుడు ఆ పాములను అత్యంత ఎత్తుకు తీసుకుని వెళ్ళాడు. అలా ఎత్తుగా సూర్యునికి దగ్గరగా వెళ్ళటం వలన గరుడుని రెక్కల మీద ఉన్న పాములు ఆ వేడిని తట్టుకోలేక తమ పట్టుజారి కిందకి పడిపోయాయి. తన పుత్రుల దీనావస్థ చూసిన కద్రువ ఇంద్రుని ప్రార్ధించి వర్షం కురిపించి, వారిని కాపాడుకున్నది. జరిగిన దానికి గరుడుని నిందించినది.

తరువాత గరుడుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ఈ దాస్యం చేయటానికి గల కారణం తెలుసుకున్నాడు. ఆ పాముల వద్దకు వెళ్లి తనను, తన తల్లిని దాస్యము నుండి విముక్తి కలిగించటానికి ఏమి చేయాలి అని అడిగాడు. దానికి వారు అతనిని స్వర్గం నుండి అమృతమును  తెచ్చి ఇవ్వమని అడిగారు.

తనతల్లి అనుమతితో అమృతమును తెచ్చి వారికి ఇవ్వటానికి బయలుదేరాడు. తాను ఆ ఘనకార్యం సాధించే ముందు తన ఆకలి తీరే మార్గం చెప్పమని అడిగాడు. అప్పుడు ఆమె సముద్రంలో ఉన్న కిరాతులను తినమని చెప్పింది. అవి తిని అతను తన తండ్రి కశ్యపుని దగ్గరకు ఆశీర్వాదము పొందటానికి బయలుదేరాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి