6, జనవరి 2016, బుధవారం

ప్రహ్లాదుని పూర్వజన్మ

శివశర్మ తన నలుగురు పుత్రులు విష్ణులోకమునకు వెళ్ళిన తరువాత మిగిలిన ఐదవ పుత్రుడు, సోమశర్మను పిలచి, అతని చేతికి నాలుగవ కుమారుడు తెచ్చి ఇచ్చిన అమృత కలశమును ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పి, తన భార్యతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరి వెళ్ళెను.
ఇలా దాదాపుగా పది సంవత్సరములు శివశర్మ తన భార్యతో కలసి అన్ని తీర్ధములు తిరిగి, తమ ఇంటికి చేరుకొనే సమయమునకు శివశర్మతపోబలంతో, అతనికి అతని భార్యకి కూడా కుష్టు రోగం వచ్చేలా చేసాడు. ఆ కుష్టు రోగంతో భాదపడుతూ ఇంటికి తిరిగి వచ్చిన తల్లితండ్రులను చూసిన సోమశర్మ అత్యంత విస్మయం చెందాడు.
"ఓ తండ్రీ! తమరు నిత్యం అత్యంత నియమ నిష్టలతో ఉంటారు. అటువంటి కలుశారహితులయిన మీకు ఇట్టి అవస్థ ఏ పాపమువలన కలిగినదో ? దయచేసి చెప్పండి" అని నీరు నిండిన కన్నులతో అడిగెను. సోమశర్మ మాటలు విన్న శివశర్మ "మీము పూర్వ జన్మములలో ఏదో పాపం చేసే ఉంటాం దాని నివ్రుట్టికోరకు ఇప్పుడు ఈ విధంగా శిక్ష అనుభవించ వలసి వచ్చినది. పూర్వం చేసిన కర్మములకు ఫలములు తప్పక అనుభవించవలసినదే కదా! నీవు మాగురించి మా పాపముల గురించి విచారించక, నీవు పితృభక్తి తత్పరుడవు కనుక ఈ శరీరములను వేడి నీటితో కడిగి రక్షించుము" అని బదులు ఇచ్చెను.
సోమశర్మ తనతల్లితండ్రులకు చేయవలసిన సేవలు చేస్తూ, వారి పుండ్లను శుభ్రం చేస్తూ, వారికి విధిగా స్నానం చేయిస్తూ, మధురమయిన భోజనములను పెడుతూ తన నిత్య కృత్యములను చేస్తూ ఉన్నాడు. ఐతే శివశర్మ, అతని భార్య వారి సరీరములకు కలిగిన భాదల వలన తమ కుమారుడు తమకు సరిగా సేవలు చేయటంలేదని, అతనిని తిడుతూ, ఒక్కొక్కచో కొడుతూ ఉన్నారు. అయినా సోమశర్మ భయభక్తులు కలిగి తల్లితండ్రులకు సేవలు చేస్తూనే ఉన్నాడు. ఇలా కొంతకాలం గడచినా తరువాత, శివశర్మ ఇక తన ఐదవ పుత్రునికి విడుదల ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు. తను తన భార్యతో కలసి తీర్ధయాత్రలకు వెళ్లేముందు సోమశర్మకు ఇచ్చిన అమృత కలశమును దొంగిలించాడు. ఇక ఏమి తెలియనివానివలే సోమశర్మను పిలచి " పుత్రా సోమశర్మ! మీము ఇంతకు  మునుపటి జన్మలలో చేసిన పాపములకు ఇప్పటివరకు మేము అనుభవించిన శారీరిక క్లేశం  సరిపోతుంది కనుక మేము ఇక ఈ భాద నుండి విముక్తి పొంద దలచాం కనుక నేను నీకు ఇంతకుమునుపు ఇచ్చిన అమృతకలశమును తెచ్చి ఇవ్వుము. " అని అడిగెను.
తండ్రి కోరిక మేరకు అమృతం ఇవ్వటానికి చూడగా, సోమశర్మకు అమృత కలశం కనిపించలేదు. ఈ విషయం తన తండ్రికి తెలిసినచో భాదపడతాడని తలచి, తన తపఃశక్తితో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని మరొక అమృత కలశం సంపాదించి తెచ్చి తన తండ్రికి ఇచ్చెను. తన పుత్రుని పితృభక్తి ని చూసి అమితానందం పొందిన శివశర్మ తన భార్యతోకుడా తన నిజ రూపం పొందిరి. అప్పుడు శివశర్మ సోమశర్మతో "ఓ పుత్రా! నీ భక్తి కి మేము అత్యంత ప్రసన్నులం అయ్యాము. నీవు ఇంకొంతకాలం ఈ భూమి పై ఉండవలసి ఉన్నది కనుక నీవు నిత్యం ధర్మాచరణలో ఉండుము. నీకు ఉన్నత పదవులు సిద్దించగలవు" అని ఆశీర్వదించి వారు విష్ణులోకమునకు చేరుకున్నారు.
సోమశర్మ తపస్సుచేసుకుంటూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడచినది. సోమశర్మకు అంతిమ ఘడియలు సమీపించగానే అతనికి తనకు దగ్గరలో ఎవరివో రాక్షస గర్జనలు, కోలాహలములు వినిపించినవి. ఆ శబ్దములు వింటూ, రాక్షసుల గురించి ఆలోచిస్తూ తుదిశ్వాస విడిచాడు.
తుదిశ్వాస విడచే సమయంలో ఎవరు ఏవిషయం గురించి ఆలోచిస్తారో మరు జన్మలో వారు అలా జన్మిస్తారు. కనుక సోమశర్మ రాక్షసయోనిలో జన్మించాడు. కానీ పూర్వజన్మలో చేసుకున్న అమితమయిన పుణ్యం కారణంగా అతనికి విష్ణు భక్తి ప్రాప్తించినది. అతనే విష్ణుభక్తులలో అగ్రగణ్యుడుగా చెప్పుకునే "ప్రహ్లాదుడు".
ఇది ప్రహ్లాదుని పూర్వజన్మ వృత్తాంతం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి