14, ఆగస్టు 2026, శుక్రవారం

స్వరొచిష మను సంభవం లో గణేశ ప్రార్ధన

గ్రంధములను ముందుగా గణపతిని ప్రార్ధించి తరువాత విషయము లోనికి వెళ్లడం అనేది ఒక  సాంప్రదాయం. 

అటువంటి అనేక గ్రంధములలోనుండి అనేక గణేశ ప్రార్ధనలను మనం తెలుసుకుందాం !

ఈ రోజు మన తెలుసుకుంటున్న ఈ పద్యం అల్లసాని పెద్దన రచించిన స్వరోచిషమనుసంభవం లోనుండి తీసుకున్నాం!



అంకము జేరి శైలతనయాస్తనదుగ్ధము లానువేళ బా 

 ల్యాంకవిచేష్ట దొండమున నవ్వలి చన్గబళింప బోయి యా 

వంక గుచంబు గాన కహి వల్లభహారము గాంచి వే మృణా 

ళాంకుర శంక నంటెడు గ జాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ !


అర్ధము: 

అంకమున్ = ఒడిలో ; చేరి = కూర్చుని ; శైలతనయ = హిమాలయ పర్వత పుత్రి, పార్వతీ దేవి ; స్తనదుగ్ధములు= చనుబాలు; ఆనువేళ = త్రాగే సమయంలో ; బాల్యంక = బాల్యం వల్ల కలిగే ; విచేష్టన్ = ఆట లాగ ; తొండమున్ = తొండముతో ; అవ్వలి = అటుపక్క ఉన్న ; చన్ = చను భాగాన్ని ; కబళించ బోయి = పట్టుకోవాలని ప్రయత్నించగా ; ఆ వంకన్ = అటు ప్రక్కన ; కుచంబున్ = స్తనమును ; కానక = అందుకోలేక , కనిపించక ; అహివల్లభ = సర్పరాజు ను ; హారమున్ = హారముగా; కాంచి = చూసి ; వే = వేగంగా; మృణాళ= తామర ; అంకుర = లేత కాడలు ; అంటెడు = పట్టుకునే ; గజాస్యునిన్ = గజముఖము కలిగిన వినాయకుని ; అభీష్ట = కోరికలు ; సిద్ధికిన్ = తీరునట్లుగా ; కొల్తున్ = సేవించెదను.


తాత్పర్యం:
 వినాయకుడు పార్వతీ దేవి ఒడిలో కూర్చుని, ఒక చన్ను నుండి పాలు త్రాగుతూ , చిన్నపిల్లలకు ఉండే చాపల్యముతో రెండవ స్తనమును పట్టుకోవడానికి తన తొండముతో ప్రయత్నించగా, అర్ధనారీశ్వర తత్వము వల్ల అటుపక్క సగ దేహము శివుని రూపములో ఉన్న కారణంగా వినాయకుని తొండము నాకు మరొక స్థానము బదులుగా శివుని మెడలోని నాగాభరణం దొరకగా,  గజముల సహజ లక్షణమయిన తూడులను పట్టుకొనుటకు ప్రయత్నించుచున్న ఆ గణపతిని కోరికలు తీర్చుకొనుటకు ప్రార్ధించెదను .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి