7, సెప్టెంబర్ 2014, ఆదివారం

స్వరోచి - స్వారోచిషుడు

స్వరోచి, ప్రవరాఖ్యుని మనస్సునందు తలుచుకొంటూ మాయా ప్రవరుని రూపంలో గల కలి అనే గంధర్వుని వల్ల వరూధినికి జన్మించిన వాడు. అతను పుట్టుకతోనే అత్యంత శరీర తేజస్సుతో జన్మించాడు. శుక్లపక్ష చంద్రుని వలే దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నాడు. అతను యుక్త వయస్సుకు వచ్చే సమయమునకు సర్వ సద్గుణములు అలవడ్డాయి. వేద, వేదాంగాలు పట్టుబడ్డాయి. సర్వ ఆయుధముల గురించిన విద్యను తెలుసుకున్నాడు. 
ఒకనాడు మంధర పర్వత ప్రాంతం లో తిరుగుతూ ఉండగా ఒక కన్య సహాయంకోసం అరవటం విని అక్కడకు మనోరమ ను రాక్షసుని బారి నుండి కాపాడి,  మనోరమ తండ్రి అయిన ఇందీవరాక్షుడి కి శాపవిమోచనం కలిగించి,  ఇందీవరాక్షుని వద్ద ఉన్న ఆయుర్వేద విద్యను స్వీకరించి, మనోరమతో పాటు శాపగ్రస్తులైన తన స్నేహితురాళ్ళు కళావతి, విభావరిలకు ఆయుర్వేద విద్యద్వారా వారికి గల కుష్టురోగము నుండి విముక్తి కలిగించి, వారి వద్ద నుండి పద్మిని విద్యను,సర్వప్రాణుల భాషలను తెలుసుకొనగలిగిన విద్యను పొందిఇందీవరాక్షుని సమక్షంలో వారు ముగ్గురిని వివాహం చేసుకుని వారితో ఆనందంగా గడప సాగాడు. 
ఒకనాడు స్వరోచి,అతని భార్యల అన్యోన్యత గురించి ఒక కలహంస తన స్నేహితురలయిన చక్రవాకమునకు చెప్పుట స్వరోచి విన్నాడు. 
కలహంస: జగతిలో ఎందరో భార్యాభర్తలు ఉండవచ్చు కానీ వారు ఒకరికి ఇంకొకరు సరి ఐనవారు అయిఉండరు. ఒకరికి మరొకరి పైగల ప్రేమ సమానంగా ఉండదు. కానీ స్వరోచి, అతని ముగ్గురు భార్యలు అందంలో, ప్రేమలో ఒకరికి మరొకరు ఏ మాత్రం తక్కువ కాదు 
చక్రవాకం: స్వరోచి గురించి అంత గొప్పగా చెప్పుకోనుతకు ఏమి లేదు. అతను భార్యలను విద్యను ప్రాప్తించుకొనుటకు మాత్రమే వివాహం చేసుకున్నాడు. ఒక భార్యతో ఉండగా మరొక భార్య గురించి ఆలోచిస్తాడు. 
వీరి మాటలు విన్న స్వరోచికి ఎంతో అవమానంగా అనిపించినది. వారు చెప్పిన మాటలు నిజములు. అలా  కాలం 100 సంవత్సరములు గడచి పోయినది. 
ఒకనాడు స్వరోచి అరణ్యములలో కొన్ని కస్తూరి మృగములను చూసాడు. మగ కస్తూరి మృగం కస్తూరి వాసనను ఒక ఆడ మృగం చూస్తూ ఉన్నది. అది గమనించిన మగ మృగం ఆడమృగం తో " నేను స్వరోచి వంటి వాడిని కాదు, నా భార్యను కనుల ముందు ఉంచుకుని మరొక భార్య గురించి ఆలోచించుటకు, ఒక స్త్రీకి అనేక పురుషులతో సంబంధం ఉంటే ఏ విధంగా ఆమె దారి తప్పినది అంటారో ఒక పురుషుని మనస్సులో అనేక మంది భార్యలు ఉంటే అతనిని కూడా దారి తప్పినా వాని గానే చెప్తారు. నీను నిన్ను దగ్గరకు రానివ్వటానికి నేను ఏమి స్వరోచిని కాను. నీవు దూరంగా వెళ్ళు" అన్నది. ఈ మాటలు విన్న స్వరోచికి వైరాగ్యం వచ్చినట్లు అనిపించసాగినది. కాని ఇంటికి వెళ్లి వారిని చూడగానే మరలా నిత్యనుస్టానము, సర్వ కార్యములు యధావిధిగా సాగుతూనే ఉన్నాయి. 
స్వరోచికి ముగ్గురు భార్యల యందు ముగ్గురు పుత్రులు కలిగారు. 
మనోరమకు విజయుడు, విభావారికి మేరునందనుడు మరియు కళావతికి ప్రభవుడు. స్వరోచి తనకు గల పద్మిని విద్య ద్వారా వారు ముగ్గురి కోసం మూడు నగరములను నిర్మించాడు. తూర్పున కామపుర అనే పర్వతం మీద విజయుని క్కోసం విజయ అనే నగరం, ఉత్తరమున మేరునందుని కోసం నందవతి అనే నగరం, దక్షిణ దిక్కున తల అనే నగరమును ప్రభవునకు నిర్మించి ఇచ్చాడు. 
ఇలా కాలం గడుస్తూ ఉన్నది. ఒకనాడు స్వరోచి అరణ్యములలో తిరుగుతూ ఉండగా ఒక ఎలుగుబంటి ని చూసి, తన బాణమును బయటకు తీసాడు. కాని ఆ ఎలుగుబంటి కనిపించకుండా పారిపోయినది. అప్పుడు ఒక జింక అతనివద్దకు వచ్చి, తనమీద బాణ ప్రయోగం చేయవలసినది అని అడిగినది. దానికి స్వరోచి, నీకు శరీరంలో ఏమీ అనారోగ్యం ఉన్నట్లు కనిపించుట లేదు, నీకు ఈ విధంగా మరనిమ్చావలెను అనే కోరిక ఎందుకు కలిగినది? అని అడిగాడు. 
జింక : నేను ఒక మానవుని వలచాను కాని అతనికి అతని భార్య పై అమిత మైన ప్రేమ కలదు. మరి నేను బ్రతికి ఉండుట వ్యర్ధం కదా! అందుకనే నన్ను వధించు 
స్వరోచి : ఓ అందమైన జింకా! నీవు ఒక మానవుని ఎలా వరించావు? నీవు మృగానివి. ఇది ఎలా సాధ్యం?
జింక: నేను నిన్నే వారించాను స్వరోచి. అది అసంభవం అని నాకు కూడా తెలుసు కనుకనే నన్ను వధింపమని నిన్నే కోరుకున్నాను 
స్వరోచి: నీవు నన్ను వలచినట్లయితే నేను నిన్ను చంపలేను. కనుక నేను ఎప్పుడు ఏమి చేయాలో చెప్పవలసినది. 
జింక : ఓ స్వరోచి! నీవు ఒకాసారి నన్ను ప్రేమగా దగ్గరకు చేర్చుకో! 
అప్పుడు స్వరోచి ఆ జింకను దగ్గరకు తీసుకున్నాడు. అప్పుడు ఆ జింక ఒక అందమైన స్త్రీ రూపును ధరించినది. 
ఆశ్చర్య పోయిన స్వరోచి ఆమె ను నీవు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆమె తను వనదేవతను అని చెప్పినది. కాలంలో రెండవ మనువు జన్మకు కారణం కావలసినది అని దేవతలు తనను ప్రార్ధించగా జింక రూపం లో వచ్చాను అని చెప్పినది. ఆ కలయిక వల్ల  వారికి ఒకపుత్రుడు జన్మించాడు. అత్యంత రమణీయమైన రూపంతో, సర్వశక్తులతో జన్మించిన ఆ బాలునికి ధ్యుతిమంతుడు అని పేరు పెట్టారు. స్వరోచి పుత్రుడు కనుక స్వారోచిషుడు అని కుడా అన్నారు. 
తరువాత స్వరోచి ఒక జలాశయం దగ్గరకు వెళ్లి నప్పుడు రెండు బాతులు వైరాగ్యమును గురించి మాట్లాడుకొనుట విన్న తరువాత అతనికి వైరాగ్యం కలిగి తనభార్యలను పుత్రులకు అప్పగించి, అరణ్యమునకు వెళ్లి తపస్సు చేయుట ప్రారంభించాడు. 

1 కామెంట్‌: