20, సెప్టెంబర్ 2014, శనివారం

అధర్మం వంశవృక్షం

ఇంతకు ముందు ధర్ముని భార్యల గురించి వారి సంతానమును గురించి చెప్పుకున్నాం కదా! మరి అధర్మం సంగతి? అది ఈ రోజు చెప్పుకుందాం! భాగవతం లో మరొక విచిత్రమైన విషయం చెప్పారు. ఈ అధర్మ వంశం గురించి కల్కి పురాణంలో కూడా చెప్పారు. 
అధర్ముడు స్వయంగా బ్రహ్మ కు పుత్రునిగా జన్మించాడు.
అధర్మునకు భార్య అబద్దం. వీరి సంతానం దంబం(ఇప్పుడు దబాయించుట అంటున్నాం!) అనే పుత్రుడు, మాయ అనే పుత్రిక.
పుత్రికను నిరృతి (అసలు సత్యం అంటే తెలియని వాడు) చేపట్టాడు. వారికి లోభుడు, నికృతి (తిరస్కారం) జన్మించారు.
లోభుడు, నికృతి వివాహం చేసుకోగా వారికి క్రోధము, హింస జన్మించారు.
క్రోధం, హింస వివాహం చేసుకొనగా వారికి కలి, నింద జన్మించారు.
కలి, నింద  వివాహం చేసుకోగా వారికి భయము. మృత్యువు జన్మించారు
భయం, మృతువు వివాహం చేసుకోగా వారికి యాతన మరియు నరకము పుట్టిరి.

నా ఆలోచన:
ఇక్కడ పెద్దగా విశ్లేషించ వలసిన పని లేదు కదా! అంతా చక్కగా చెప్పారు.
మనిషిలోనికి ఎప్పుడయితే అధర్మం ప్రవేశిస్తుందో అప్పుడు అబద్దం బయలుదేరుతుంది. అవి రెండూ రాగానే ఎదుటివానికి మాయమాటలు చెప్పుట, వారిని దబాయించుట చేస్తాం! అప్పుడు వానితో పాటుగా ఎదుటి వారు చెప్పే విషయాలను తిరస్కరిస్తూ ఉంటాం. లోభం కూడా ప్రారంభం అవుతుంది.
దాని ఫలితంగా క్రోధం మనస్సులో స్థానం సంపాదించుకుంటుంది. ఆ క్రోధం హింసను ప్రోత్సహిస్తుంది. దానిద్వారా ఇతరులను నిందించాలన్న ఆలోచన మొదలవుతుంది. అక్కడి నుండి నన్ను ఎవరైనా చంపేస్తారేమో అనే భయం మొదలవుతుంది. దానిని మించిన నరకము. యాతన ఉండవు కదా!

పైన చెప్పినవి అన్నీ  మనలోని విషయములే తప్ప అధర్ముడు అనే ఒక వ్యక్తికి అబద్దం అనే భార్య అని చదువుకుంటే అది పై విషయాన్ని అన్వయించుకునే విషయంలో మనకు ఎంతో జుగుప్సాకరంగా ఉంటుంది. పూర్వికులకు ఒక కధలా చెప్పటం అలవాటు కనుక మనకు అర్ధం అవటానికి ఇలా ఆ భావనల మధ్య అనుభందాలను చూపాలని చేసిన చిన్న ప్రయత్నం అని నా అభిప్రాయం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి