27, మార్చి 2019, బుధవారం

సీత - చిలుక శాపం

రామాయణములో ఉన్న అనేక ఘట్టములలో శ్రీరాముడుకి  ఇప్పటికి అపకీర్తిని తెచ్చి పెడుతున్న ఘట్టం సీతాపరి త్యాగం. కేవలం ఒక చాకలివాని మాటలకు శ్రీరాముడు సీతను పరిత్యజించాడు అని చెప్పుకుంటాం. అయితే ఇలా చాకలివాని ప్రస్తావన మూల రామాయణం అంటే వాల్మీకి రామాయణంలో లేదు. ఆ ప్రస్తావన పద్మపురాణంలో ఉంది. ఆ చాకలి వాడు ఆలా చేయటానికి కారణం కూడా పద్మ పురాణం పాతాళ కండములో వివరించారు.
ఆ కధ ప్రకారం 
సీతా దేవి తన చిన్నతనంలో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా ఒక చెట్టు మీద జంటగా ఆనందముగా ఉన్న చిలుకల జంటను చూసింది. అప్పటికే ఆ చిలుకలు సీతను చూసి ఆనందముగా, ఈ సీతను శ్రీరాముడు వివాహం చేసుకుంటాడు, గొప్ప రాజుగా కీర్తిని గడిస్తాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సీత ఆ చిలుకలను పట్టించి పంజరంలో ఉంచి వారు ఇంతకు ముందు మాట్లాడుకుంటున్న విషయమములను గురించి విస్తారముగా చెప్పమని కోరుకున్నది.
ఆ మాటలు విన్న చిలుకలు తాము ఇంతకు ముందు వాల్మీకి ఆశ్రమములో ఉన్నప్పుడు ఆ మహర్షి రామాయణమును రచించారని, ఆ సమయములో వారు శ్రీ రాముడు భువిలో అవతరిస్తారని, మిథిలా రాజ పుత్రిక సీతను వివాహం చేసుకుంటారని, అనితరసాధ్యమయిన పనులు చేసి కీర్తిని గడిస్తారని, తమ రాజ్యమును సుభిక్షంగా పరిపాలిస్తారని చెప్పాయి. ఆ మాటలు విన్న సీత సంతోషించి ఆ జంటలోని మగ పక్షిని పంజరములోనుండి విడుదల చేసింది. కానీ గర్భవతి అయిన ఆడ చిలుకను పంజరంలోనే ఉంచింది. ఆడ చిలుక తనను తన భర్త వద్దకు పంపమని అర్ధించినా ఆమె బాల్య చాపల్యము వలన ఆ చిలుక ప్రసవించిన తరువాత మాత్రమే  బయటకు పంపుతాను అని చెప్పెను. తన భర్త వద్దకు వెళ్లలేకపోయిన బాధతో సీతకూడా గర్భవతిగా ఉన్నప్పుడు పతివియోగ బాధను అనుభవించగలదని శపించి ఆ అడా చిలుక మరణించెను. తన ప్రియమయిన భార్య అలా శపించటం వినిన మగ చిలుక ఆ శాపాన్ని నిజం చేయటానికి తన చిలుక శరీరమును గంగలో మునిగి పరిత్యజించి, అయోధ్యలో చాకలివానిగా జన్మించినది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి