4, సెప్టెంబర్ 2014, గురువారం

ప్రవరాఖ్యుడు

ప్రవరాఖ్యుడు బ్రాహ్మణుడు. సర్వసద్గుణ వంతుడు. అందంలో ఆశ్వినిదేవతల తో సమానమైన వాడు. తల్లితండ్రులకు సేవచేయటంలో ఉత్తముడు. భార్యాబిడ్డలకు ప్రేమానురాగాములు పంచుటలో మేటి. నిరంతరం అతిధులకు ఆతిధ్యం ఇస్తూ, వారి ప్రయాణ విషయముల గురించి, వారు దర్శించిన స్థలముల గురించి వివరములు తెలుసుకొనుట అతని దినచర్యగా ఉన్నది. ఇలా చిన్నప్పటినుండి తన స్వగ్రామము వదలి వెళ్ళని ప్రవరాఖ్యునికి అనేక దేశములను చూసిన వారి అనుభవములను విని విని తనకు కూడా ఇతర ప్రదేశములను చూడాలన్న కోరిక కలిగినది.
ఒకనాడు రాత్రివేళ వారి ఇంటికి ఒక యువఅతిధి వచ్చాడు. అతనికి ఆతిధ్యం ఇస్తున్న వేళ ఆ అతిధి చూసివచ్చిన ప్రదేశముల గురించి ప్రవరాఖ్యునకు చెప్తూ ఉన్నాడు. అనేక దేశములు, వివిధ వింతలు, విశేషాలు, అధ్బుతములు ఎన్నో మరెన్నో. అన్నీ  వింటున్న ప్రవరాఖ్యునకు ఈ అతిధి అన్ని ప్రదేశములు ఏవిధంగా సంచరించాడో అర్ధంకాలేదు. ఆటను చూస్తే యువకుడు, అన్ని ప్రదేశములు తిరిగి రావాలంటే అతని వయస్సు సరిపోదు. మరి ఎలా ఇతను అన్ని ప్రదేశములను చుట్టి రాగలిగాడు? అదే సందేహం ఆ అతిధిని అత్యంత ఉత్య్సుకతతో అడిగాడు.
దానికి ఆ యువ సిద్ధుడు తనకు అనేక దివ్య ఔషదముల గురించి, దివ్య లేపనముల గురించి తెలుసనీ, తనవద్ద ఒక దివ్యమైన పాదలేపనము ఉన్నది అని ఆ లేపనము పాదములకు పెట్టుకుని అనేక యోజనముల దూరం కేవలం ఒక్క పూటలో వెళ్ళ వచ్చు అని చెప్పారు. ఆ మాటలు విన్న ప్రవరాఖ్యుడు తనకు ఆ లేపనము ఇస్తే తనకు సర్వదా కల ఇతరదేశములను దర్శించాలన్న కోరికను తీర్చుకోగలను అని అడిగాడు. ఆ సిద్ధుడు ప్రవరాఖ్యునకు కొంత లేపనమును ఇచ్చాడు. తనకు లభించిన ఈ అవకాశమును ఉపయోగించ దలచుకున్నాడు.
ఉదయాన్నే నిత్యకృత్యములను పూర్తిచేసుకుని ఆ లేపనమును తన పాదములకు వ్రాసుకుని ప్రవరాఖ్యుడు హిమాలయప్రాంతమునకు చేరుకున్నాడు.  
ఆ హిమాలయప్రాంత అందములను చూస్తూ, వాటిని గమనిస్తూ అటూ ఇటూ ఆ హిమపర్వతం మీద పరుగులు తీస్తూ, తన పాదములకు ఉన్న లేపనం మంచులో కరిగిపోతుండగా గమనించలేక పోయాడు. మధ్యాహ్న సమయం అవ్వటం గమనించి తిరిగి తన ఇంటికి చేరుకోవాలి అనే కోరికతో, వేగంగా నడవటానికి ప్రయత్నించగా అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు తన పాదలేపనము లేకపోవుట గమనించి, పరి పరి విధములా భాదపడ్డాడు. తనను తానూ నిందించుకున్నాడు.
ఆ సమయంలో ప్రక్కనే ఎవరో గానం చేస్తున్న సవ్వడి వినిపించినది. అక్కడ ఎవరైనా ఉంటే తను తన స్వగృహమునకు వెళ్ళేందుకు సహాయం చేస్తారు అని సంతోషించాడు.
అక్కడకు వెళ్లి చూడగా అక్కడ ఒక గంధర్వ కాంత ఉన్నది. ఆమె, వరూధిని, ప్రవరాఖ్యుని చూసిన మరుక్షణం అతనిని మోహించినది. కాని ఇంటికి వెళ్ళాలన్న తొందరలో ఉన్న ప్రవరాఖ్యుడు ఆమెను తన ఇంటికి వెళ్ళే మార్గం చెప్పమని అడిగాడు. దానికి ఆమె అతనిని తాను వలచానని, వారిరువురూ ఈ హిమాలయములలో సుఖంగా జీవనం సాగించవచ్చును  అని ప్రతిపాదించినది.
ఆ ప్రస్తావన నచ్చని ప్రవరాఖ్యుడు ఆమెకు నచాచేప్పాలని ప్రయత్నించాడు. కానీ  ఆమె వినే పరిస్థితిలో లేదని తెలుసుకుని, తాను నిత్యం పూజించే గార్హపత్యాగ్నిని ప్రార్ధించి తనను తన గృహమునకు చేర్చమని వేడుకున్నాడు.
అప్పుడు గార్హపత్యాగ్ని ప్రవరాఖ్యుని తన గృహమునకు చేర్చాడు.
ఈ సంఘటన వల్ల ఒక మనువు, స్వారోచిషుని జననమునకు బీజం పడినది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి