1, జులై 2020, బుధవారం

కైకసి - కుమారులు పొందిన వరములు

దశకంఠునిలో అసూయ కలగటానికి తన తల్లి కైకసి ఎలా కారణం అయ్యిందో మనం ఇంతకు ముందు టపాలో తెలుసుకున్నాం కదా! అసూయతో రగిలిపోతున్న దశకంఠుడు తపస్సుకు బయలుదేరాడు. అతనితో పాటుగా అతని తమ్ములనుకూడా తీసుకుని వెళ్ళాడు. ఇంతకు ముందు టపాలలో అతని సోదరుల గురించి తెలుసుకున్నాం కదా! వారిలో పెద్దవాడు, అత్యంత భారీకాయుడు అయిన కుంభకర్ణుడు పుట్టిన సమయం నుండి కూడా నర భక్షకుడుగా ఉన్నాడు. సకల జనులను కష్టపెడుతూ ఉన్నాడు, అంతే కాక అతనికి రాక్షసత్వం వల్ల కలిగిన శక్తుల వలన అన్ని లోకములకు తిరుగుతూ అందరిని ఏడిపిస్తూ ఉండేవాడు.
చిన్నవాడు అయిన విభీషణుడు అత్యంత సౌమ్యుడు, బ్రాహ్మణత్వం,ధర్మజ్ఞత మరియు ఇంద్రియ నిగ్రహం  కలిగి ఉండేవాడు.
అలంటి తన తమ్ములతోబ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తున్న దశకంఠుడు తన ఒకొక్క తల నరుక్కుని బ్రహ్మదేవునికి హోమంలో అగ్నికి అర్పించసాగాడు. అలా తన తొమ్మిది తలలు అర్పించిన తరువాత కూడా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాకపోవటంతో, తన పదవ తలను కూడా నరుకుకొనుటకు సిద్ధపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యి అతనిని వరములు కోరుకొమ్మని చెప్పాడు.
అప్పుడు దశకంఠుడు మరణం లేని వరం కోరుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు అలాంటి వరం ఇవ్వటం కుదరదు అని చెప్పాక, అప్పుడు నాగ, యక్ష, కిన్నెర, దానవ, రాక్షస,దైత్య, దేవతల వలన తనకు మరణం రాకుండునట్లు కోరుకున్నాడు.అంతే కాకుండా తనకు మానవులు అంటే అస్సలు భయం లేదు కనుక వారి గురించి అడగవలసిన అవసరం లేదు అని చెప్పాడు.  బ్రహ్మదేవుడు తధాస్తు అని చెప్పాడు. అంతేకాక అప్పటివరకు దశకంఠుడు అర్పించిన అతని తొమ్మిది తలలను కూడా తిరిగి వచ్చేవిధంగా వరం ఇచ్చాడు. అవే కాకుండా అతనికి కామరూప విద్యను కూడా ప్రసాదించాడు.
బ్రహ్మదేవుడు అప్పుడు విభీషణుని వరం కోరుకొమ్మని చెప్పారు. అప్పుడు సాత్విక స్వభావం కలిగిన విభీషణుడు ఎళ్లవేళలా అతని మనస్సు ధర్మం తప్పకుండ ఉండేటట్లుగా వరం ఇవ్వమని కోరుకున్నాడు. అతని ధర్మ నిరతికి సంతోషించిన బ్రహ్మ దేవుడు అతనికి చిరంజీవిగా ఉండమని వరం ఇచ్చాడు.
తరువాత వరం కోరుకునే అవకాశం కుంభకర్ణునికి వచ్చింది.
అయితే అతని ఉదృతిని అప్పటికే దేవతలు చూసి ఉండుట వలన అతను అడిగే వరములు ఏవయినా వారిని బాధిస్తాయి కనుక, అతను ఎల్లప్పుడూ నిద్రావస్థలో ఉండేలా వరం కోరుకుంటే అన్ని లోకములకు మంచిది కనుక అలా అతనిని పలికించమని దేవతలు సరస్వతిని వేడుకున్నారు. వారి కోరికను మన్నించిన సరస్వతి వెళ్లి కుంభకర్ణుని నాలుక పై కూర్చున్నది. అతనితో కావలసిన తిండి తిని నిద్రావస్థను ప్రసాదించమని పలికించింది. బ్రహ్మదేవుడు తధాస్తు అని పలికి తన లోకమునకు వెళ్ళిపోయాడు. అతనితో సరస్వతి కూడా వెళ్ళిపోయింది.  అప్పుడు జరిగిన దానిని గురించి ఆలోచించిన కుంభకర్ణుడు ఇకమీదట చేసేది ఏమి లేదు అని తెలుసుకుని ఆ వరముతోనే ఉండిపోయాడు.