30, సెప్టెంబర్ 2014, మంగళవారం

నాభాగుడు

నాభాగుడు నభగుని పుత్రుడు. సూర్య వంశమునకు చెందినవాడు.
ఇతను మెతకగా ఉండుట చూసి, ఆ అవకాశమును వినియోగించుకుంటూ అతని సోదరులు అతనికి ధనమును ఇవ్వకుండా ఉండిరి. తనకు తన భాగమును ఇప్పించ వలసినదిగా అన్నలను కోరగా, అప్పుడు అన్నలు తమ తండ్రి అయిన నభగుడు చెప్పినట్లయితే అతనికి అతని వాటా ఇస్తాం అని చెప్పారు. అప్పుడు నాభాగుడు తండ్రివద్దకు వెళ్లి, ఈ వృత్తాంతం చెప్పి, ఏమి చేయవలసినది అని తండ్రిని అడిగాడు.
అప్పుడు నభగుడు,  ఆ సమయంలోఅత్యంత జ్ఞానులయిన అంగిరసులు సత్రయాగం చేస్తూ ఉన్నారని, ఆ యాగంలో వారికి ఆ యాగం చేసే 6వ రోజున విస్వేదేవతలకు చేసే సూక్తులు జ్ఞాపకమునకు రావు కనుక నాభాగుని అక్కడ వెళ్లి వారికి ఆ సూక్తులను గుర్తు చేయమని చెప్పాడు. అలా గుర్తు చేసినందువలన బ్రహ్మజ్ఞాని అని లోకం నాభాగుని కీర్తిస్తుంది అని,అలా చేయుట వలన ఆ యాగం చివర మిగిలిన ధనమును నాభాగునకు ఇస్తారు అని కూడా చెప్పి నాభాగుడిని అక్కడకు పంపించాడు.
నాభాగుడు తండ్రికి నమస్కరించి ఆ యాగామునకు వెళ్లి తన తండ్రి చెపిన విధంగా అంగిరసులకు వారు మరచిపోయిన సూక్తులను గుర్తు చేసాడు.అప్పుడు  ఆ అంగిరసులు ఆ యాగంలో మిగిలిన ధనమును అతనికి ఇచ్చాం అని చెప్పి వారు స్వర్గమునకు వెళ్ళిపోయారు. అతనికి అలా లభించిన ఆ ధనమును తీసుకొనుటకు నాభాగుడు వెళుతుండగా, ఒక నల్లని సుందరమైన ఆకారం కలిగిన ఒక యువకుడు ఆ ధనమును తన  చేసుకొనెను.
అప్పుడు నాభాగుడు తనకు అంగిరసులు ఆ ధనమును ఇచ్చినారు కనుక ఆ ధనమును తిరిగి ఇవ్వమని అడిగాడు. అప్పుడు అతను ఒకవేళ నీ తండ్రి అయిన నభగుడు ఈ ధనమును నీకు ఇవ్వమని చెప్పినట్లయితే ఇస్తాను కనుక నీవు వెళ్లి నీ తండ్రిని అడిగిరా! అని చెప్పి పంపెను.
నాభాగుడు నభగుని వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పగా, నభగుడు జరిగిన విషయమును తన మనోనేత్రంతో చూసి ఆ యాగం చేసిన బ్రాహ్మణులు ఆ యాగంలో మిగిలిన భాగమును మహాదేవుడయిన శివునకు ఇస్తాం అని సంకల్పించారు కనుక ఆ భాగం శివునకు మాత్రమే చెందుతుంది అని తీర్పు చెప్పి నాబాగుని పంపించాడు.
తిరిగి వచ్చిన నాభాగుడు తన తండ్రి చెప్పిన విషయమును యధాతధంగా చెప్పి, ఆ భాగం మీద తనకు ఏవిధమైన హక్కులేదని చెప్పాడు.
నాభాగుని సత్య సంధతకు సంతోషించిన శివుడు ఆ యజ్ఞ భాగమును నాభాగునకు ఇచ్చి, అతనికి సనాతనమైన బ్రహ్మజ్ఞానమును ఉపదేశించి  వెనుతిరిగి వెళ్ళాడు. కాలాంతరంలో నాబాగునకు అంబరీషుడు జన్మించాడు.
వ్యాసమహర్షి నాబాగుని ఈ చరిత్రకు ఫలశృతి కూడా చెప్పారు.
ఎవరైతే శ్రద్దగా ఈ నాభాగుని వృత్తాంతం ప్రతిరోజూ చదువుతారో/ వింటారో/ పారాయణం చేస్తారో వారు జ్ఞానమును పొందుతారు, మరణానంతరం ముక్తిని పొందుతారు.

నా ఆలోచన:
మన పూర్వులు ఇటువంటి కధలను చాలా చెప్పారు. కొన్ని కధలకు ఫలశృతి కూడా చెప్పారు. అయితే  ఆ ఫల శృతి  ఆ కధను మరలా మరలా చదివేలా చేయాలి అని చెప్పి ఉన్నారు. అలా ఎందుకు? మరి ఈ కధకు ఈ ఫలశృతి ఎందుకు చెప్పారు?

  1. నాభాగుడు తన సోదరులు తన సొమ్మును బలవంతముగా తీసుకున్నపుడు ఏమి ఎదురు చెప్పలేదు, పైగా వెళ్లి వారిని మెల్లిగా అడిగాడు. మనం సహజంగా మన సంపదను ఎవరైనా తీసుకున్తరేమో అనే అనుమానం వస్తేనే వారి మీద గొడవకు దిగుతాం. 
  2. నాభాగుని అతని సోదరులు తండ్రిని అడిగి రమ్మనగానే, తన ఆస్తి మీరు తీసుకుని నన్ను తండ్రిని అడుగమంటారేమిటి అని విసుగును ప్రదర్శించలేదు. 
  3. తీరా తండ్రి వద్దకు వెళ్లి అడిగితే  అన్నలకు చెప్పి నీ ఆస్తి నీకు ఇప్పిస్తాను అని చెప్పకుండా, యాగమునకు వెళ్లి దానం తేసుకో అని చెప్పాడు. మరి ఒక తండ్రిగా అది తప్పుకాదా! ఒకసారి ఆలోచించండి, అన్యాయం చేసిన వారు, పొందినవారు కూడా తన పుత్రులే. కానీ కొందరు అన్యాయ మార్గంలో ఉన్నపుడు వారి తప్పును అలా ఒకేసారి చూపిస్తే వారు మరింత అన్యాయులుగా మరే అవకాశం ఉంటుంది. కనుక అన్యాయమునకు గురి అయిన నాభాగుని అతని విద్యాను ఉపయోగించి అతని ధనమును స్వయంగా సంపాదించుకునే మార్గం చెప్పి, కేవలం ధనమే కాకుండా బ్రహ్మజ్ఞాని అనే బిరుదు కూడా పొందగలవు అని చెప్పి పంపాడు.  
  4. మరి అంగిరసులు నాభాగునకు ఇచ్చిన అదే భాగమును ఋత్విక్కులు శివునకు ఎందుకు ఇచ్చారు? ఆ భాగమును ఎవరికైనా ఇవ్వటానికి ఎవరికి అధికారం ఉంటుంది? మనం ఒక బ్రాహ్మణుని యాగామునకు పిలిచి ఆ యాగమునకు కావలసినవి అన్నీ  సమకూర్చి వారికి అప్పగిస్తాం. అంటే ఆక్షణం నుండి ఆ వస్తు,ధనముల మీద ఆ బ్రాహ్మణులకే అధికారం ఉంటుంది. కనుక ఆ భాగమును దానం చేసే అధికారంకూడా ఋత్విక్కులకే ఉంటుంది. 
  5. శివుడు ఈ భాగం నాదే నీకు చెందదు అని స్వయంగా చెప్పకుండా నభగుని అడిగిరమ్మని ఎందుకు చెప్పాడు? ఒక కొడుకు తప్పు చేసే సమయం అని తెలిసినప్పుడు అతనిని సరిదిద్దే మొదటి అవసరం, భాద్యత తండ్రికి ఉండాలి. పైగా అక్కడ వచ్చే ధనమును తెచ్చుకోమని సలహా ఇచ్చిన వాడు నభగుడే. కనుక నభగుడు జరిగిన సంగతి తెలుసుకుని నాభాగునకు చెప్తేనే అది బాగుంటుంది. 
  6. అసలు ఏమిటి ఈ కధ? మనం మన మనస్సునందు ఈవిధమైన దురాలోచనలు లేకుండా, పెద్దలు చెప్పిన పనిని చేస్తూ ఉంటే మనకు చెందవలసిన సొమ్ము, పేరు, ప్రతిష్టలు మనను చేరి తీరుతాయి. ఒక్కసారి దానం మీది ఆశతో నాభాగుడు అబద్దం చెప్తే పరమశివుడు  అతనికి ఆ ధనమును తిరిగి ఇచ్చే అవకాశం ఉండేది కాదు కదా!
  7. మరి ఆ ఫలశృతి? ఈ కధను ప్రతిరోజూ చదవటం/ వినటం అంటే ప్రతిరోజూ గుర్తు చేసుకోవటం. అంటే మన మనస్సులలో ఈ కద నిలచిపోతుంది. ఒకవేళ మనకు ఎవరితో అయినా గొడవ పడవలసిన సందర్భం ఎదురయినప్పుడు మన మనస్సు ఆ గొడవ పడకుండా ఆపుతుంది. అప్పుడు మన మనస్సు మన ఆదీనంలో ఉండి విచక్షణా శక్తి ని కోల్పోకుండా ఉంటుంది. మరి అదేకదా జ్ఞానం అంటే. 
  8. జీవితాంతం మనం ఈ కధను స్మరిస్తూ ఉంటే జీవితంలో మనం చేసే తప్పులు గణనీయంగా తగ్గుతాయి కనుక మోక్షం కూడా లభించవచ్చు. 

1 కామెంట్‌: