1, అక్టోబర్ 2014, బుధవారం

రేవతి

రేవతి బలరాముని భార్య. ఆమె బలరామునికి చేరిన విధం అత్యంత విచిత్రమైనది.
రేవతి రైవతుని పుత్రిక. పుత్రిక పై అత్యంత ప్రేమ కలిగిన రైవతుడు, ఆమెకు సరి అయిన భర్త ఎవరో సాక్షాత్తు బ్రహ్మదేవుని అడుగుదామని బ్రహ్మలోకమునకు తన కుమార్తెను తీసుకుని వెళ్ళాడు.
అక్కడకు వారు వెళ్ళిన సమయంలో బ్రహ్మదేవుని ముందు కిన్నెరులు నృత్యం, గంధర్వులు గానం చేయుచూ ఉండగా బ్రహ్మదేవుని కలిసే అవకాసం కొరకు వారు కొంత సమయం వేచి ఉన్నారు. వారికి ఆ సమయం దొరకగానే బ్రహ్మదేవుని దర్శించుకుని, నమస్కరించి అప్పుడు వారు అక్కడకు వచ్చిన కారణం బ్రహ్మదేవునకు చెప్పారు.
వారి కోరికను వినిన బ్రహ్మదేవుడు కొంచెం నవ్వి, "ఓ రైవతా! నీ మనస్సులో నీ కుమార్తెకు ఎవరు సరి అయిన భర్త అని ఏ కొందరిని తలచినావో వారు ఎవరూ ఈ సమయంలో జీవించి లేరు. వారే కాదు ఈ కాల గమనంలో వారి పుత్రులు, మనుమలు, ముదిమనుమలు కూడా జీవించి లేరు. మీరు ఇక్కడ నాకోసం వేచి ఉన్న ఈ కొంత సమయంలో భూలోకములో 27 మహాయుగములు గడచినవి. నీవు ఇప్పుడు భూలోకమునకు వెళ్ళుము అక్కడ భూభారమును తగ్గించే నిమిత్తమై శ్రీమహావిష్ణువు శ్రీ కృష్ణునిగా, అనంతుడు బలరామునిగా జన్మించి ఉన్నారు. కనుక నీ కుమార్తెను బలరామునకు ఇవ్వు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. తిరిగి భూలోకమునకు తిరిగి వచ్చిన రైవతుడు తన కుమార్తె రేవతిని బలరామునకు ఇచ్చి వివాహం చేసి, బదరి వనమునకు వెళ్లి తపస్సు చేసుకోసాగాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి