26, జూన్ 2020, శుక్రవారం

వైశ్రవణునికి కుబేరుడు అనే పేరు ఎందుకు వచ్చింది?

మనం ఇంతకు ముందు గుణనిధి గురించి, అతను దొంగగా మారుట,  అతనికి శివలోకం లభించిన విధానం, తరువాత అతను దమనుడు అనే రాజుగా జన్మించి జన రంజకంగా పరిపాలించిన సంగతి తెలుసుకున్నాం కదా!
మరి అంత జనరంజకంగా పరిపాలించిన గుణనిధి/ దమనుడు తరువాత ఏమి అయ్యాడు?
ధనునిగా తన తనువూ చాలించిన తరువాత, గుణనిధి ఆటను చేసిన పుణ్యఫలముల కారణంగా పులస్త్యుని వంశంలో విశ్రవసునికి కుమారునిగా జన్మించాడు. అతనికే వైశ్రవణుడు అని పేరు పెట్టారు. అతనే తరువాతి కాలంలో దిక్పాలకత్వం పొందాడు. అతనే లంకాధిపతిగా కొంతకాలం గడిపాడు. తరువాత తన తమ్ముడు అయిన  దశగ్రీవునిచేత అక్కడి నుండి తరుమబడి కైలాసం దగ్గరలో ఉన్న అలకాపురిలో తన నివాసం ఏర్పరచుకున్నాడు.
ఈ జన్మలో కూడా అతను సర్వదా శివధ్యానం చేస్తూ, దీప దానములు చేస్తూ ఉన్నాడు.
అదృష్టవశాత్తూ, అతని తపఃఫలంగా ఒకసారి శివుడు పార్వతీ సమేతుడయ్యి దర్శనం ఇచ్చాడు. శివుని పై ఉన్న భక్తి కారణంగా శివునికి నమస్కారం చేసిన వైశ్రవణునికి, శివుడు పార్వతికి కూడా నమస్కరించమని చెప్పాడు. శివుడు చెప్పిన మాటను విన్న వైశ్రవణుడు పార్వతిని చూసాడు. అలా చుసిన ఒక్క క్షణంలో ఆమె ఎంత తపస్సు చేస్తే ఇలా శివునిలో సగశరీర భాగం పొందగలిగిందో! అనే అసూయ కలిగింది.
వైశ్రవణునిలో ఎంత భక్తి కలిగినా అరిషట్వర్గములలో ఒకటయిన అసూయ కలిగిన కన్నులతో పార్వతిని చుసిన కారణంగా అతని కన్నుస్ఫుటిత నేత్రంగా మారిపొమ్మని చెప్పింది. అప్పటి నుండి ఆ వైశ్రవణుని అందరూ కుబేరుడు అని పిలిచారు.
కు = చెడ్డ / అసూయతో కూడిన
బేర = చూపు కల్గిన వాడు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి