3, జూన్ 2020, బుధవారం

జమదగ్ని- శాంతం - శాపం

మనం ఇంతకు ముందు ఋచీకుని కుమారుడు జమదగ్ని అని తెలుసుకున్నాం కదా ! ఆ జమదగ్ని నిష్ఠ గురించి ఒక  సంఘటన ఇప్పుడు చూద్దాం!
ఒకసారి జమదగ్ని శ్రాద్ధం చేయదలచి ఒక ఆవుపాలు స్వయంగా ఒక కొత్త కుండలో తీసుకువచ్చి జాగ్రత్తగా ఒక చోట పెట్టాడు. అతని మనస్సును పరీక్షించాలి అనే ఉద్దేశ్యంతో క్రోధమునకు అధిదేవత సాకారంగా వచ్చి ఆ పాలు ఉన్న కుండను అనుకోకుండా తగిలినట్లు చేసి, ఆ పాలు ఒలికి  పోయేట్లుగా చేసింది. ఆ విధం గమనించిన జమదగ్ని కోపగించకుండా, సావధాన మనస్కుడై ఉన్నాడు. అతనిని గమనించిన క్రోధాదిదేవత అతనిని క్షమాపణ కోరింది.  అతను కోపగించకుండా , అక్కడ సంకల్ప సిద్ధంగా జరగవలసిన శ్రాద్ధ కర్మ సరిగా జరుగక పోవటం వలన పితృదేవతలు శపిస్తారు కనుక, వారు ఆలా చేయక మునుపే ఆమెను అక్కడ నుండి వెళ్లిపొమ్మని కోరాడు. ఆమె వెళ్ళిపోయింది.
అప్పుడు పితృదేవతలు జమదగ్నికి సాక్షాత్కరించి, జరుగవలసిన శ్రాద్ధం సరిగా జరిపించలేదు, దానికి కారణమయిన వారిమీద కోపం చూపించలేదు కనుక వారు జమదగ్నిని ముంగీస గా జన్మించమని శాపం ఇచ్చారు.
అప్పుడు జమదగ్ని వారితో, దీక్షాపరుడయిన కారణంగా క్రోధంవహించుట సరి అయిన పద్దతి కాదు కనుక తానూ కోపం తెచ్చుకోలేదు అని, తనకు శాప విమోచన మార్గం చెప్పమని ప్రార్ధించాడు.
అతని ధర్మ నిరతకు సంతోషించిన పితృదేవతలు, అతను ఏ రోజున పండిత, విద్వాంసులందరినీ కూడా ఒక మహాధర్మమును అధమ ధర్మముగా చెప్పి ఒప్పించగలుగుతాడో ఆ రోజున అతనికి శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు.

మరి ఇంతకూ అలా ముంగీసగా పుట్టిన జమదగ్నికి శాప విమోచనం ఎలా కలిగింది ? ఎలా పండితులను మహాధర్మమును అధమ ధర్మం అని  ఒప్పించగలిగాడు? తరువాతి టపా లో చెప్పుకుందాం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి