27, జూన్ 2020, శనివారం

మంధర - పూర్వజన్మ

ఒకానొక కాలంలో విరోచనుడు అనే పేరు కల్గిన ఒక రాక్షసుడు ఉండేవాడు. అవ్వటానికి రాక్షసుడు అయినా బ్రాహ్మణత్వం పొంది, సకల సుకర్మలు చేస్తూ రాజుగా ఉన్నాడు. రాజుగా  దేవతలపై దండెత్తి వారిని ఓడించి దేవలోకమును స్వాధీన పరచుకున్నాడు. దేవలోకంనుండి పారిపోయిన దేవతలు వారి గురువు బృహస్పతి వద్దకు వెళ్లారు. వారి పరిస్థితిని తెలుసుకున్న బృహస్పతి, ఆ ఆపదకు నివారణ  ఉపాయం కేవలం అతనికి గల దానగుణమును ఉపయోగించుకొనుట మాత్రమే అని చెప్పాడు.
అతని మాటలు విన్న దేవతలు వెంటనే బ్రాహ్మణరూపములు ధరించి విరోచనుని వద్దకు వెళ్లారు. ఆలా తనవద్దకు వచ్చినవారు దేవతలు అని తెలిసి కూడా విరోచనుడు వారికి అతిధి సత్కారములు చేసి, ఏమి కావాలో కోరుకొమ్మని చెప్పాడు. అప్పుడు వారు విరోచనుని దేహమును ఇవ్వమని కోరారు. ఇంటికి వచ్చి అర్ధించిన అతిధులకు ఇవ్వటానికి పనికి రాకపోతే, అటువంటి శరీరం ఉన్న లేకపోయినా ఒకటే అని చెప్పి అతని శరీరమును వారికి ఇచ్చివేసాడు.
అప్పుడు రాక్షసులు ఆనాధలు అవ్వటం వలన  కోలాహలం చెలరేగింది. ఆ కోలాహలమునకు విరోచనుని కుమార్తె బయటకు వచ్చింది. ఆమె అనేక రాక్షస కృత్యములలో ఆరితేరినది. అనేక క్షుద్రవిద్యలు తెలిసినది అవ్వటం వలన వారికి దైర్యం చెబుతూ, అన్యాయంగా తన తండ్రిని మోసగించిన దేవతల పై తాను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి రాక్షసులను తన అధికారంలోనికి తెచ్చుకున్నది. అలా ఆమె అధీనంలో ఉన్న రాక్షసులు తిరిగి దేవలోకంపై దండెత్తారు. కానీ వారు మరలా దేవతల చేతిలో ఓటమి పొందుతున్న సమయంలో, కొందరు రాక్షసులు విరోచనుని కుమార్తె వద్దకు వచ్చి యుద్ధం లో వారు ఓడిపోతున్న విషయం చెప్పగా, ఆమె స్వయంగా దేవలోకమునకు వెళ్లి నేరుగా దేవతలతో తలపడింది. తన విద్యలతో దేవతలను, వారి వాహనములు బందించింది.
అలా బంధించబడిన దేవతలు శ్రీమహావిష్ణువు ను శరణు వేడుకున్నారు. ఆర్త త్రాణపరాయణుడు అయిన ఆ శ్రీ మహా విష్ణువు ఉన్నపళంగా అక్కడకు వచ్చి, దేవతలను బంధముల నుండి విడిపించి, ఆ విరోచనుని కుమార్తెను చంపటానికి ఇంద్రుడిని ప్రేరేపించాడు. అప్పుడు ఇంద్రుడు ఆమె పై వజ్రాయుధమును ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం తగిలిన ఆమె అలా కిందకు భూలోకమునకు పడిపోతూ, తనకు అటువంటి గతి పట్టటానికి కారణం ఇంద్రుడే అయినా , ఇంద్రుడు అలా ప్రవర్తించటానికి కారణం శ్రీమహావిష్ణువు కాబట్టి, తాను ఎలాగయినా విష్ణువునకు అపకారం చేయాలి అని తన మనస్సులోనే శపధం చేసుకుంది. ఆమె శరీరం భూమిపై పడినప్పుడు మూడు వంకరలుతిరిగింది. పెద్దగా అరుస్తూ ఆమె ప్రాణములు వదిలింది. అలా చివరి క్షణంలో ఆమె విష్ణువు నకు అపకారం చేయాలి అని అనుకున్నది కనుక ఆమె మరు జన్మలో, మానవ కాంతగా, గూని దానిగా జన్మించి, ఎంతో సంతోషంగా శ్రీరాముని పట్టాభిషేకమునకు సిద్ధపడుతున్న అయోధ్యను ఆశ్చర్యకరంగా బాధపెట్టిన మంధరగా జన్మించి, తన పూర్వజన్మ పంతమును నెరవేర్చుకున్నది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి