25, ఆగస్టు 2014, సోమవారం

త్రిశంకు

 త్రిశంకుడు

ఇతనికి ఒక ప్రత్యేకమైన స్వర్గలోకం ఉంది. దానిని త్రిశంకుస్వర్గం అంటారు. కాని ఈయన ఆ స్వర్గం లో తలక్రిందులుగా ఉంటారు. ఈయన సశరీరం గా ఎలా స్వర్గం లో ఉన్నాడు? ఈయనకోసం ప్రత్యేకమైన స్వర్గాన్ని ఎవరు సృష్టించారు? ఎందుకు? తలక్రిందులుగా ఎందుకు ఉంటారు?

ఇక్ష్వాకు వంశం లో పృధు మహారాజు పుత్రుడు త్రిశంకుడు అనే రాజు ఉండేవారు. వారి వంశం లో అందరి మంచిని ప్రజలు శ్లాఘించుట  చూసిన త్రిశంఖునకు తన పుర్వీకుల కంటే  మరేదయినా విశిష్టమైన పనిని చేసి అమితమైన కీర్తి గడించాలి అని కోరిక కలిగింది. ఎంతగానో ఆలోచించిన మీదట ఇప్పటివరకు ఎవరూ శరీరం తో స్వర్గానికి వెళ్ళలేదు కనుక తను వెళితే బాగుంటుంది అని నిర్ణయానికి వచ్చాడు.

వెంటనే తమ కుల గురువైన వశిష్టునికి తన కోరిక చెప్పాడు. అది విని ఆశ్చర్య పోయిన వశిష్టుడు ఎంత గొప్ప మహారాజైనా కానీ, ఎంత గొప్ప యజ్ఞ యాగాలు చేసినా కానీ శరీరం తో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. పంచ భూతములతో నిర్మితమైన ఈ శరీరo కొంత కాలానికి పడిపోవాల్సిందే. అది పడిపోయిన తరువాతే శరీరం లోని జీవుడు స్వర్గం లోకి ప్రవేశిస్తాడు. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళటం అనేది జరగదు అని ఖచ్చితంగా చెప్పాడు వశిష్టుడు. కుల గురువు వశిష్టుని మాటలకు సంతృప్తి చెందని  త్రిశంకుడు నూరుగురు గురుపుత్రుల వద్దకు వెళ్లి తన కోరికను వివరించాడు. ఐతే తమతండ్రి జరగదు అని చెప్పిన పనిని తాము ఎంత మాత్రమూ చేయము అని చెప్పారు. పైగా అన్ని శాస్త్రములు తెలిసిన తమ తండ్రి ఒక పని జరగదు అని చెప్తే అది ఎన్నటికీ  జరుగదు కనుక తాను  ఆ ఆలోచనను మానుకోవలసినది అని కూడా సూచిoచారు.
అయినా కూడా తన ఆలోచన మార్చుకోని  త్రిశంకుడు తాను మరొక గురువును ఆశ్రయిస్తాను అన్నాడు. ఆ మాటలకు ఆగ్రహించిన నూరుగురు గురుపుత్రులు ముక్తకంఠంతో ఆ  త్రిశంకుడు చేయతలచిన గురుద్రోహానికి అతనిని చండాలుడవు కమ్మని శపించారు.
 మరునాటి ఉదయం నిద్రలేచే సమయానికి  త్రిశంకుని ముఖంలో కాంతి పోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్ని ఇనుము ఆభరణాలు అయ్యాయి. జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరు భయపడి పారిపోయారు. ఆ రూపంతో అలాతిరుగుతూ చివరికి  త్రిశంకుడు విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. 

అప్పటికి విశ్వామిత్రుడు వశిష్టుని మీద కోపంతో తప్పస్సు చేస్తూ రాజర్షి అయ్యారు. అప్పటికే తన దనుర్విధ్య వశిష్టుని మీద పనిచెయ్యదు అని కుడా తెలుసుకున్నారు కాబట్టి ఎలా వశిష్టుని మీద పై చేయి సాధించాలా అని ఆలోచిస్తున్న విశ్వామిత్రునికి  త్రిశంకుడు ఒక మార్గం గా కనిపించాడు. వసిష్టుడు చేయను అన్న పనిని విశ్వామిత్రుడు చేస్తే ఆది వశిష్టుని ఓటమే అవుతుందని ఆలోచించాడు. అందుకే  త్రిశంకుని కోరిక తాను తీరుస్తాను అని చెప్పాడు,
అప్పుడు విశ్వామిత్రుడు తన పుత్రులను, శిష్యులను పిలిచి వారందరిని ఈ సమస్త బ్రహ్మాండం తిరిగి వశిష్టుడు చేయలేని పనిని విశ్వామిత్రుడు చేస్తున్నాడు అని అందరికి చెప్పి అందరిని ఆహ్వానించమని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా రాను అన్నా, ఈ పనిని తప్పు పట్టినా వారి వివరాలు తనకు చెప్పమని ఆజ్ఞ ఇచ్చాడు.
 ఆహ్వానం అందుకున్న అందరూ విశ్వామిత్రుడికి భయపడి వచ్చారు. ఆ తరువాత విశ్వామిత్రుని పుత్రులు వచ్చి వశిష్టుని పుత్రులు, మరొక బ్రాహ్మణుడు మహోదయుడు ఈ యజ్ఞానికి రాము అన్నారు అని చెప్పారు. వారు ఏమి కారణం చెప్పారని అడుగగా ఆ బ్రాహ్మణుడు "ఒక క్షత్రియుడు ఒక చండాలుని కోసం యజ్ఞం చేస్తుంటే దేవతలు ఎలా వచ్చి తమ తమ హవిస్సులను తీసుకుంటారు? అది జరిగే పని కాదు కనుక అక్కడకు వచ్చి మా సమయం ఎందుకు వృధా చేసుకోవాలి?" అని అన్నాడు అని చెప్పారు.

దానికి కోపించిన విశ్వామిత్రుడు వశిష్టుని నూరుగురు పుత్రులు ఇప్పుడే భస్మరాసులై పడిపోయి నరకానికి వెళ్లి తరువాత 700 జన్మల పాటు నరమాంస భక్షకులుగా,  ఆ తరువాత కొన్ని జన్మల పాటు ముష్టికులు అనే పేరుతొ పుట్టి కుక్కమాంసం తింటూ బ్రతుకుతారు, ఆ బ్రాహ్మణుడు మహోదయుడు సర్వలోకాలలొ జనాల చే ద్వేషింపబడే నిషాదుడై జీవిస్తాడు అని శపించాడు. 
అప్పుడు యాగం మొదలు పెట్టాడు. విశ్వామిత్రుడు యాగాగ్ని లో హవిస్సులు ఇస్తున్నాడు, కానీ వానిని తీసుకోవటానికి దేవతలు రావటం లేదు. ఇది చుసిన విశ్వామిత్రునికి కోపం వచింది. అహంకారం విజృంభించింది. తన తపోబలం తోనే  త్రిశంకుడిని స్వర్గానికి పంపాలని అనుకుని సంకల్పించాడు. అనన్య సామాన్య మైన అతని తపోబలం వల్ల  త్రిశంకుడు స్వర్గలోకం దిశగా ప్రయాణమయ్యాడు. ఈ విషయం దేవేంద్రడికి తెలిసి ఆయన  త్రిశంకునితో "  త్రిశంకుడా! నువ్వు గురు శాపానికి గురి అయ్యావు. నీకు స్వర్గలోక ప్రవేశం లేదు" అని తలక్రిందులుగా క్రిందికి పో అన్నాడు. అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసివెయ్యబడ్డ ఆ  త్రిశంకుడు క్రిందకి  పడిపోతూ తనను రక్షిoచమని విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు.
మరింత ఆగ్రహించిన విశ్వామిత్రుడు త్రిశంకుడిని ఆకాశం లో నిలిపాడు, త్రిశంకునకు స్వర్గం లో స్థానం లేదు అని కిందకు నెట్టేశారు కనుక తన మిగలిన మిగిలిన తపశక్తి తో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృస్టించాడు. సప్తర్షులని సృస్టించాడు. ఇక దేవతలను దేవాధిపతి  ఇంద్రుడిని సృష్టించే ప్రయత్నం లో ఉండగా దేవతలందరు వచ్చారు.

మహానుభావా! శాంతించు. ఎంత తపహ్శక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృస్తిస్తావా! మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవ్వరినీ స్వర్గానికి పంపాలేము, పైగా ఈ త్రిశంకుడు గురుశాపo పొందినవాడు కనుక స్వర్గ ప్రవేశం లేదు. కానీ మీరు మీ తపశక్తి ని ధారపోసినతపహ్శక్తిని ధారపోసి సృస్టించిన ఈ నక్షత్రమండలం జ్యోతిష్య చక్రానికి ఆవల వైపున ఉంటుంది. అందులో త్రిశంకుడు ఇప్పుడు ఉన్నట్లుగానే తలకిందకు, కాళ్ళు పైకి ఉంది సేవింపబడుతూ ఉంటాడు అని వరం ఇచ్చారు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి