27, ఆగస్టు 2014, బుధవారం

వినాయక ఆవిర్భావం

వినాయక జననం గురించి అనేక పురాణములలో అనేక విధములుగా చెప్పబడినది.

లింగపురాణం :
రాక్షసులు సర్వత్రా మహాదేవుని గురించి తపస్సు చేసి అమితమైన బల, పరాక్రమములను పొంది, సర్వదేవతలను కష్టముల పాలుచేయసాగారు. వారి భాదలు తట్టుకోలేక ఆ దేవతాగణములు దేవదేవుని వారి కష్టములను తొలగించే ఉపాయం చెప్పమని ప్రార్ధించారు. అప్పుడు మహాదేవుడు తన మనోబలంచేత వినాయకుని సృష్టించి ఆ రాక్షసులకు అన్ని రకముల విఘ్నములు కలిగించేవిధంగా ఆజ్ఞ ఇచ్చి పంపారు.

సుప్రభేదాగమము :
ఈ ఆగమము ప్రకారం, పార్వతీ పరమేశ్వరులు ఒకసారి హిమాలయములో విహరిస్తూ ఉండగా, వారికి సృష్టికార్యములో నిమగ్నమైన ఒక గజద్వయం కనిపించినది. ఆ దృశ్యమును చూసిన పార్వతీదేవి సిగ్గుతో పరమశివుని  చూసినది, ఆమె ఆంతర్యమును గ్రహించిన శివుడు, పార్వతీదేవి కూడా గజరూపం ధరించారు. అప్పుడు వారి ఆనందమునకు ప్రతిగా గజముఖం కలిగిన వినాయకుడు జన్మించాడు.

శివ పురాణం: 
ఇక మనం సర్వదా వినాయక చవితి రోజు అనుసంధానం చేసే వినాయక సంభవ కధ శివపురాణంలోనిది. 

విష్ణుదేవుని ద్వారపాలకులు ఒకసారి శివపార్వతుల దర్శనార్ధం కైలాసానికి వచ్చారు. దేవిని దర్శించుకునే సమయంలో వారు పార్వతీదేవికి ఒక విజ్ఞాపన చేసారు. 
" దేవీ! పార్వతీమాతా! మహాదేవునకు నంది, భ్రుంగి వంటి ద్వారపాలకులు ఉన్నారు. జగన్మాతవైన నీకు కనీసం ఒక్కరైనా ఉండాలికదా, అలా ఉండుట ఎంతయినా అవసరం" అని చెప్పారు. 
వారి మాటలు విన్న పార్వతీ దేవి చిరునవ్వుతో ఆ కార్యం త్వరలోనే నెరవేరుతుంది అని వారికి చెప్పినది. 

గజాసురుని కోరికమీద, అతని పొట్టలో నివాసముంటున్న మహాదేవుని, శ్రీహరి ఒక గంగిరెద్దులవాని రూపంలో వెళ్లి తీసుకువస్తున్నాడని తెలిసిన పార్వతీదేవి అమిత సంతోషాన్ని పొందినది. మహాదేవుడు తిరిగి వచ్చేలోపు ఆమె సర్వాంగసుందరంగా ఎదురు వెళ్ళాలి అని భావించినది. ఆమె నలుగుపెట్టుకున్న పిండిని ముద్దగా చేసి సంతోషంతో ఆ ముద్దకు ఒక బాలుని ఆకారం ఇచ్చినది. ఆ మూర్తిని చుసిన ఆమె లో మాతృత్వపు భావన కలిగినది. వెంటనే ఆ మూర్తికి ప్రాణం పోసినది. ఆ బాలునికి వినాయకుడు అని పేరు పెట్టినది. ఆ బాలుని ద్వారపాలకునిగా ఉంచి ఎవరినీ లోనికి రానివ్వవద్దని చెప్పి స్నానాధికములు చేయుటకు లోపలకు వెళ్ళినది.
అప్పుడు ఎంతో కాలం తరువాత కైలాసానికి వచ్చిన శివుడు ఉమను చూడాలన్న కోరికతో ఆతృతగా వచ్చాడు. కాని శివుడే తన తండ్రి అని తెలియని వినాయకుడు అతనిని అడ్డగించాడు. వారి మధ్య వాదోపవాదములు జరిగిన తరువాత శివుడు స్వయంగా తన త్రిశూలంతో ఆ బాలుని కంఠమును ఉత్తరింఛి లోనికి ప్రవేశించారు.
ఎంతో కాలంతరువాట తనపతిదేవుని చుసిన పార్వతి ఎంతో సంతోషించినది. కొంతసమయం తరువాత వారి మాటలలో ద్వారపాలకునిగా ఉన్న బాలుని ప్రస్తావన వచ్చినది. శివుడు తానూ బాలుని శిరచ్చేదంచేసిన విధంవిన్న పార్వతీదేవి శోకితురాలయినది.
అప్పుడు మహాదేవుడు తన గణములను ఉత్తరాదిశగా తలను ఉంచి పడుకుని కనిపించిన మొదటి ప్రాణి యొక్క శిరస్సును తెమ్మని ఆదేశించారు. అన్ని గణములు వెళ్లి వెతుకగా వారికి ఒక ఏనుగు కనిపించినది. వారు ఆ ఏనుగు యొక్క తలను తెచ్చి శివునకు ఇచ్చారు. అప్పుడు మహాదేవుడు ఆ బాలునకు ఏనుగు తలను ఉంచి బ్రతికించారు. అప్పటినుండి వినాయకునకు గజముఖుడు అని నామాంతరం వచ్చినది.

కాని ఇక్కడ మనకు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.

  1. శివునికి ఒక బాలుడిని శిరచ్చేదం చేసి సంహరించేంత కోపం ఉంటుందా?
  2. సర్వాంతర్యామి ఐన మహాదేవునికి తన పుత్రుని గురించి తెలియదా? 
  3. ఒక ఏనుగు తల నిర్ధక్షిణ్యం గా ఒక చిన్న బాలునకు ఎందుకు అమర్చవలసి వచ్చినది?

ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చుడండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి