29, అక్టోబర్ 2014, బుధవారం

నలకూబర, మణిగ్రీవులు- నారద శాపం

నలకూబర, మణిగ్రీవులు మహాదేవుని మిత్రుడయిన కుబేరుని పుత్రులు. వారి తండ్రికి కలిగిన ధనం వలన, తమతండ్రి మహాదేవుని మిత్రుడు అనే భావం వలన వారికి గర్వం అతిశయించినది. ఒకనాటి సమయమందు వారిద్దరూ తమ తమ ప్రియురాళ్ళతో కలిసి, గంగానదిలో వివస్త్రులై  జల క్రీడలు ఆడుతూ తమను తాము మరచిపోయారు. అటువంటి సమయంలో నారద మహర్షి అటు వైపుగా రావటం చూసిన స్త్రీలు వెంటనే సిగ్గుతోవెళ్లి తక్షణం బట్టలు ధరించి చేతులు జోడించి, నారదునకు నమస్కారం చేసారు.
కానీ మధ్యంమత్తు కారణంగా నలకూబర, మణిగ్రీవులు తమ శరీరము మీద స్పృహ లేకుండా ఉన్నారు. తమ శరీరం వివస్త్రంగా ఉన్నది అనే విషయంకూడా మరచి నారదునికి అలాగే నమస్కరించారు. అప్పుడు నారదుడు వారిని 100 దివ్య సంవత్సరముల పాటు భూలోకంలో మద్ది వృక్షములుగా ఉండమని శపించారు.
source: internet
అప్పుడు వారు తమ తప్పును గ్రహించి శాప విమోచనం చెప్పమని కోరగా బాల కృష్ణుని పాదముల స్పర్శ ఏనాడు వీరికి కలుగుతుందో నాడు వీరి నిజరూపం తిరిగి పొందగలరు అని, కారణంగా సర్వలోకములయందు మిక్కిలి కీర్తి గడించగలరు. అని చెప్పి నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

విశ్లేషణ:
యౌవ్వనం, ధన సంపత్తిః ప్రభుత్వం అవివేకితా 
ఏకైకమాప్యనర్దాయ, కిము యత్ర చతుష్టయం
ఇది కాదంబరిలోని ఒక ముఖ్యమైన శ్లోకం. దీని అర్ధం 
యౌవ్వనం, ధనం, అధికారం మరియు మూర్ఖత్వం నాలిగింటిలో ఒక్కటి ఉన్ననూ అత్యంత అనర్ధం కలుగుతుంది, కానీ నాలుగూ ఉన్నట్లయితే ఇక ఏమి చెప్పాలి అని
ఇక్కడ నలకూబర, మణిగ్రీవులకు పైన చెప్పిన నాలుగునకు తోడు తాగిన మధిర, ప్రక్కన మగువ కూడా ఉన్నారు. అందుకని వారికి ఏమి చేస్తున్నామో కూడా తెలియలేదు
 ఇక్కడ వ్యాస భగవానుని రచనా విశిష్టత గురించి చెప్పుకోవాలి. నారదుడు సమయమునకు అక్కడకు ఎందుకు వచ్చాడు అనే దానికి "యదృచ్ఛయా" అని వాడారు. అంటే దైవ ఘటన చేత ప్రేరేపించబడిన వాడు అని వైదికమైన అర్ధం చెప్తారు
నలకూబర, మణిగ్రీవులు తనను అవమానించారు అనే దానికంటే వారికి హితమును తెలియచెప్పాలి అని నారద మునీంద్రుడు భావించాడు. కనుక వ్యాసులవారు సమయమందు "అనుగ్రహార్థాయ శాపం దాస్యన్న్ ఇదం జగౌ" అని చెప్పారు. అంటే వారిమీది అనుగ్రహం వలన వారికి శాపం ఇచ్చారు కానీ కోపంతో కాదు. ఈ సందర్భంలో పోతన భాగవతంలో మరింత అందంగా చెప్పారు. మనం ప్రాస్తుతం వాడుతున్న పదజాలం చక్కగా మొదట ప్రయోగించినది పోతనగారే అని ఈ పద్యం చదివిన తరువాత మనకు అనిపించక మానదు. 

కలవాని సుతులమనుచు 
గలకంఠులతోడగూడి కానరు పరులం 
గలలొనైనను వీరికి 
గల క్రోవ్వడగించి బుధులగలపుట యొప్పున్. 
కనుక వారికి గల క్రొవ్వును(పొగరు/అతిశయించిన గర్వం) తీసేసి/ తొలగించి వారిని మంచివారిలో కలుపుట అవసరం అని భావించి శపించారు. కనుకనే బాలకృష్ణుని పాద స్పర్శ కలుగగానే  సర్వలోకములందు కీర్తి కలవారు అవుతారు అని చెప్పారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి