22, జులై 2014, మంగళవారం

వజ్రాంగుడు

కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. వారిలో దితి, అదితి పుత్రులు దైత్యదేవతలు. వారిరువురి మద్య ఉన్న విభేదాల కారణoగా ఎల్లప్పుడూ దితిపుత్రులైన దైత్యులు మృత్యువాత పడుతూ ఉన్నారు.

ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు దితి తన భర్త ఐన కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్లి తన భాదలు చెప్పుకోసాగింది. ప్రాణనాద! నా పుత్రులైన హిరణ్యకశిపుడను, హిరణ్యాక్షుడను శ్రీహరి నరసింహ, వరాహావతారములు ధరించి చంపాడు. ఇంద్రుని చంపే పుత్రుని కోసం నేను నిష్టగా వ్రతం చేస్తూ ఉన్న సమయం లో ఒకనాటి మద్యాహ్నం జరిగిన కించిత్ అపచారానికి ఇంద్రుడు నా గర్భం లో ప్రవేశించి ఆ పిండాన్ని ముక్కలు చేసాడు. ఆ ముక్కలు మరుత్తులుగా ఉన్నారు. నాకు ఇప్పుడు మరొక సంతానం కలిగించవలసినది అని కోరినది. 

అప్పుడు కశ్యపుడు ఆమెను బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేయమని చెప్పారు. అప్పుడు ఆమె ఒక పది వేల సంవత్సరములు తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగగా, ఆమె అన్ని లోకములను గెలువగలిగిన పుత్రుడు కావలి అని కోరింది. బ్రహందేవుడు వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావం తో ఆమె గర్భం దాల్చి ఒక బిడ్డను ప్రసవించినది. అతనికి వజ్రాంగుడు అని నామకరణం చేసారు.  

వజ్రాంగుడు పుట్టిన నాటి నుండి ఆమె అతనికి ఇంద్రుని గురించి, ఇతర దేవతలగురించి మనోవైకల్యం కలిగేటట్లు చెప్తూ ఉండేది. ఇలా పెరిగి పెద్దవాడయిన వజ్రాంగుడు దేవతలను గెలిచి, అందరిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. సర్వదేవతలను బంధించి తన కారాగారం లో ఉంచాడు. 

అది గమనించిన బ్రహ్మదేవుడు, కశ్యపుడు వజ్రాంగుని వద్దకు వచ్చారు. వచ్చినవారిని చూసిన వజ్రాంగుడు వారికి అతిధి మర్యాదలు చేసాడు. వజ్రాంగుడు చేసిన అతిధి మర్యాదలను చూసి సంతోషించిన బ్రహ్మదేవుడు ఇంద్రుడిని, ఇతర దేవతలను వజ్రాంగుడు భందించటానికి గల కారణం తెలుపమని, వారిని కారాగారం నుండి విడుదల చేయమని కోరాడు. బ్రహ్మదేవుని మాటలు విన్న మరుక్షణం వజ్రాంగుడు వారిని విడుదల చేసాడు. తాను ఇంద్రాది దేవతలను భందిస్తే తనకు మనఃశాంతి కలుగుతుందని తన తల్లి ఐన దితి కోరిక మేర వారిని భందించాను అని చెప్పాడు. 
స్వతహాగా మంచివాడయిన వజ్రాంగుడిని చూసి బ్రహ్మదేవుడు అతనికి సత్వగుణమే ప్రమాణంగా ఇకముందు జీవించు అని చెప్పి, వరాంగి అనే ఒక కన్యను సృష్టించి అతనికి ఇచ్చి వివాహం చేసాడు. 

అలా వరాంగితో కలసి దైవచింతనతో, సత్వగుణం తో జీవనం సాగిస్తూ ఉండగా, ఒకరోజు వజ్రాంగుడు తనభార్య వద్దకు వచ్చి ఆమెకు పుత్రసంతానం కలిగేలా దేవిoచటానికి మనస్సు ఉవ్విళ్ళూరుతుంది కనుక ఆమెకు ఎటువంటి పుత్రుడు కావాలో కోరుకొమ్మని అడిగాడు. దానికి వరాంగి తనకు వజ్రాంగుడి తో సమానమైన బలపరాక్రమములు కలిగి, సర్వలోకములను తన అధినం లో ఉంచుకోగలిగిన పుత్రుడు కావలి అనికోరింది. ఇట్టి వరం ఆమె కోరుతుందని ఊహించని వజ్రాంగుడు నివ్వెరపోయి తన అంతఃపురానికి వెళ్లి బాగా అలోచించి, బ్రహ్మగురించి తపస్సు చేయ సాగాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఇట్టి తపస్సుకు కారణం ఏమని అడుగగా బ్రహ్మదేవునిచే సృష్టించబడిన తన భార్య వరాంగి కోరికని వివరించి ఆమెకు అట్టి పుత్రుడిని ప్రసాదించవలసినది అని కోరుకున్నాడు. తధాస్తు అని బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. 

ఆ వర ప్రాభవం వల్ల వరంగి కొంతకాలానికి ఒక మగబిడ్డను ప్రసవించినది. ఆ బిడ్డకు కశ్యపుడు తారకుడు అని నామకరణం చేసాడు. కాలాంతరంలో అతనే తారకాసురుడు అని లోకం చేత పిలిపించుకున్నాడు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి