5, జులై 2014, శనివారం

ఖాoడవ వన దహనం

ఖాoడవ వన దహనం 

ఒకరోజు శ్రీకృష్ణుడు, అర్జునుడు కలిసి యమునా నది తీరం లో విహరిస్తూ ఉండగా వారికి  ఒక ఆజానుబాహుడు, అమిత తేజోసంపన్నుడు ఐన ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతనిని చూడగానే శ్రీకృష్ణుడు, అర్జునుడు అతనికి ఎదురు వెళ్లి స్వాగతించి, ఒక ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టారు. కుశల ప్రశ్నలు ఐన తర్వాత శ్రీకృష్ణుడు, అర్జునుడు ఆ బ్రాహ్మణుని తో తమరు ఎవరు, ఈ ప్రాంతానికి రావటానికి గల కారణం ఏమిటి అని అడుగగా ఆ బ్రాహ్మణుడు తాను ఎక్కువగా భుజించే అలవాటు కలవాడను అని, ఎంత తిన్నా కుడా అరిగించుకో గల శక్తి కలవాడను అని తనకు తృప్తి కలిగించగల భోజనాన్ని కోరి ఈ ప్రాంతానికి వచ్చాను అని చెప్పాడు. ఆ మాట విన్న శ్రీకృష్ణుడు, అర్జునుడు మీ వంటి సత్ బ్రాహ్మనునికి ఆతిధ్యం ఇవ్వగలగటం మా అదృష్టం, మీకు ఏవిధమైన భోజనం తృప్తి కలిగిస్తుందో సెలవిస్తే అట్టి భోజనాన్నే ఏర్పాటు చేయగలము అన్నారు.  ఖాoడవ వన దహనం 

ఆ మాటలు విని సంతోషించి ఆ బ్రాహ్మణుడు తాను అగ్నిదేవుడను అని, తనకు తగిన భోజనాన్ని ఇవ్వవలసినది గా కోరాడు. అది విన్న శ్రీకృష్ణుడు, అర్జునుడు తమకు ఏమీ కావాలో దయచేసి చెప్పండి అని అడుగగా అప్పుడు అగ్ని దేవుడు తాను ఈ ఖాoడవ వనాన్ని దహించాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను, కానీ ఈ వనాన్ని,ఇందులో ఉంటున్న తక్షకుని దేవేంద్రుడు కాపాడుతున్నాడు కనుక ఇంతకాలం కుదరలేదు అని ఇప్పుడు తాను ఈ వనాన్ని దహించటానికి శ్రీకృష్ణార్జునులు సహాయం చేయవలసినది గా కోరాడు. అది విని కృష్ణార్జునులు అగ్నిదేవుడు ఈ వనాన్నే ఎందుకు దహించాలని కోరుకుంటున్నాడో, దాని కోసం ఇంత కాలం వేచి ఎందుకు ఉన్నారో అన్న కుతూహలం కలిగింది. అప్పుడు అగ్నిదేవుడు వారికి జరిగిన విషయాన్ని ఇలా చెప్పరు. 

పూర్వం శ్వేతకి అనే ఒక రాజర్షి ఎన్నో యజ్ఞములు చేసాడు,దానములు చేసాడు. ఎన్ని యజ్ఞములు చేసినా ఇంకాఇంకా చేస్తూనే ఉండేవాడు. యజ్ఞములు ఎంతగా చేసాడంటే ఆ యజ్ఞం చేయించే ఋత్విజులకు కుడా పొగాసూరి పోయేoతగా. ఒకరోజు అతనికి వేయి సంవత్సరములు చేసే సత్రయాగం చేయాలి అని కోరిక కలిగింది.  
కోరిక కలిగినదే ఆలస్యం  ఋత్విజులకు కబురు పంపి తన కోరిక చెప్పాడు. ఐతే ఏ  ఋత్విజు కుడా ఈ యజ్ఞము చేయటానికి అంగీకరించలేదు. ఐనా తన కోరిక బలంగా ఉండుట చేత పరమ ఖటోరమైన నియమాలతో ఆ పరమశివుని గురించి తపస్సు చేసాడు. తపస్సుకు మెచ్చిన భోళాశంకరుడు వరం కోరుకోమనగా తన కోరికను విన్నవించాడు, శంకరుడినే ప్రధాన ఋత్విజు గా ఉండి తనతో యాగం చేయిo చ వలసినదిగా కోరాడు. దానికి  శంకరుడు యజ్ఞం చేయించే పని బ్రాహ్మణులది కనుక ఈ యాగాన్ని తన అంశ ఐన దుర్వాసుడు చేయిస్తాడు కాని దానికోసo నీవు పన్నెండు సంవత్సరముల పాటు ఎడతెగని ఆజ్య ధారలతో అగ్నికి ఆహుతి ఇవ్వాలి అని చెప్పాడు. చెప్పిన విధంగానే పన్నెండు సంవత్సరముల పాటు ఆ రాజర్షి ఎడతెగని ఆజ్య ధారలతో అగ్నికి ఆహుతి ఇచ్చాడు. పరమేశ్వరుడు చెప్పిన మాటప్రకారం దుర్వాసుడు సేతకి తో సత్రయాగాన్ని చాలా గొప్పగా చేయించాడు. 
ఇన్ని సంవత్సరాలపాటు ఎడతెరిపి లేకుండా ఆ రాజర్షి ఇస్తూ వచ్చిన ఆజ్య ధారలు త్రాగి త్రాగి నాకు అగ్నిమాoధ్యం ఆవరించింది. హవిర్వాహనుడనైన నేను దేవతలకు హవిస్సు కుడా తీసుకు పోలేక శక్తి హీనుడను ఐయి పితామహుడైన బ్రహ్మ దేవుడిని శరణు వేడగా ఆ బ్రహ్మదేవుడు నాకు ఈ  ఖాoడవ వనo లో గల ఔషదముల వల్ల, సర్వ జంతు క్రొవ్వు వల్ల  నా పరిస్తితి చక్కబడుతుందని సలహా ఇచ్చారు. నేను అలాగే వచ్చి ఈ వనాన్ని దహించాలని ప్రయత్నించగా తక్షకుడిని కాపాడేనిమిత్తమై ఇంద్రుడు వర్షధారలు కురిపించగా నేను ఈ వనాన్ని దహించలేక మళ్ళీ వెళ్లి ఆ బ్రహ్మను కోరగా, అప్పుడు బ్రహ్మదేవుడు ఈ భూమి మీద నరనారాయణులు మరలా జన్మించ బోతున్నారు, వారు నీ కోరిక తీర్చగలరు అని సెలవిచ్చారు. మహానుభావులార అప్పటి నుండి నేను మీ కొరకు వేచి చూస్తున్నాను అని చెప్పాడు.

ఈ వృత్తాంతం అంతా విన్న అర్జునుడు అగ్నిదేవునితో ఇలా అన్నాడు "ఓ అగ్నిదేవా,మేము నీకు తప్పక సహాయం చేయగలము. కానీ ఈ సమయం లో మేము విహారానికి వచ్చాము. మా వద్ద ఇంద్రుని తో యుధం చేయుటకు కావలసిన శ్రేష్టమైన ధనస్సు, తూణీరములు,రధములు లేవు కనుక వీనిని నీవు మాకు ప్రసాదిస్తే మేము నీకు తప్పక సహాయము చేస్తాము."

ఆ మాటలు విన్న అగ్నిదేవుడు వరుణ దేవుని ప్రార్ధించాడు "ఓ వరుణ  దేవా, ఈ నాడు నాకు ఈ కృష్ణార్జునుల అవసరం ఎంతో  ఉన్నది. అందువల్ల సోముడు మీ వద్ద ఉంచిన గాంఢీవం అనే ధనుస్సును, అక్షయ బాణ తూణీరములను, కపి ధ్వజంతో ఉన్న దివ్య రధమును, తెల్లని గంధర్వ హయాలను ఈ పాండవమధ్యముడైన అర్జుననుకు ఇవ్వవలసినది. అలాగే ఈ శ్రీకృష్ణునకు అపురూపమైన సుదర్శన చక్రం, గంధర్వహయసహితమైన దివ్య రధమును,కౌమోదకిని ఇవ్వవలసినది"

అప్పుడు వరుణుడు అర్జునునకు  గాంఢీవము గురించి చెప్తూ అర్జునా ఈ గాంఢీవం చాల విశిష్టమైనది. ఏ అస్త్రశస్త్రములనైనా ఎదిరించగలదు,అనేక వత్సరములపాటు దేవ, దానవ, గంధర్వ గణాలచే పూజలందుకున్నది. ఈ అక్షయబాణ తూణీరాలు అక్షయమైన బాణములను ఇస్తూనే ఉంటాయి. అని చెప్పి గాంఢీవం,అక్షయబాణ తూణీరాలు, కపి ధ్వజంతో ఉన్న దివ్య రధమును, తెల్లని గంధర్వ హయాలను అర్జుననుకు ఇచ్చాడు.

ఇక శ్రీకృష్ణునకు వజ్ర సమానమైన నాభి కల సుదర్శన చక్రమును, శత్రుభయం కరమైన కౌమోదకి అనే గధను, దివ్య రధమును, తెల్లని గంధర్వ హయాలను ఇచ్చాడు

అప్పుడు అర్జునుడు యుధానికి సిధమౌతూ  గాంఢీవానికి నారి బిగించాడు, అప్పుడు వచ్చిన టంకారానికి ఆ వనం లోని క్రూరమృగాలు దిక్కులకు పారిపోయాయి. అర్జునుడు తాము సర్వ సంసిధులుగా ఉన్నాం అని అగ్ని ఇక తన దహనాన్ని మొదలుపెట్టవలసినదిగా చెప్తే అప్పుడు అగ్నిదేవుడు తన ఏడు తేజోరూపాలతొ ఆ వనాన్ని అన్ని వైపులనుండి ఆక్రమించాడు.

అప్పుడు అందులో కల జంతువులు ఎటూ పారిపోలెక పెద్దగా అరుస్తూ ఉన్నాయి, ఎగిరి పారిపోదమనుకున్న పక్షులను అర్జునుడు తన బాణాలతో ముక్కలుచేసి మళ్ళి  ఆ మంటలలో పడవేస్తున్నాడు. ఆ అగ్నికీలల వేడిమికి తట్టుకోలేని దేవతలు, ఋషులు ఇంద్రుని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా ఇంద్రుడు వర్షం కురిపించాడు. ప్రచండం గా వ్యాపిస్తున్న ఆ అగ్ని ని వర్షం ఏమీ  చేయలేక పోయింది. అప్పుడు ఇంద్రుడు పెద్ద పెద్ద మేఘాలను సృష్టించి నిరంతరాయంగా వర్షం కురిపిస్తుండగా, అర్జునుడు తన శస్త్రనైపుణ్యం తో ఆ ఖాoడవ వనానికి అంతా  ఒక గొడుగులా తన బాణాలను ప్రయోగించాడు. ఒక్క వర్షపు చుక్కకూడా వనం చేరలేకపోయింది.

ఈ ఖాoడవ వనదహన సమయం లో తక్షకుడు  ఆ వనం లోలేడు కానీ  అతని భార్య, పుత్రులు అక్కడే ఉన్నారు. తమపుత్రుడైన అశ్వసేనుడిని  రక్షిo చుకోవాలని  తక్షకుని భార్య తనపుత్రుని శరీరం చుట్టూ తన శరీరం ఉంచుతూ ప్రయత్నిస్తూ తన ప్ర్రాణాలను కోల్పోయింది. ఇది  చుసిన ఇంద్రుడు ఎలా  ఐనా  తన మిత్రుని యొక్క పుత్రుడిని కాపాడతలచి  ఒక్కసారిగా విపరీతమైన గాలి వానలను సృస్టించాడు. కృష్ణార్జునులు ఆ గాలివానను నిలువరించే  ప్రయత్నంలో ఉండగా ఈ అశ్వసేనుడు తప్పించుకున్నాడు.

అశ్వసేనుడు  తప్పించుకూవటం చూసిన అర్జునుడు ఇంద్రునితో యుధానికి సిధమైనాడు. ఇంద్రుడు ఐoద్రాస్త్రాన్ని ప్రయోగించాడు, దానికి బదులుగా అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. రాక్షస, యక్ష, నాగ సైన్యం కృష్ణార్జునులమీద  ఒక్కసారిగా విజృంభించారు. అర్జునుడు అందరిని నిలువరించాడు. సర్వదేవతలు వారి వారి ఆయుధాలను ప్రయోగించగా కృష్ణార్జునులు అందరిని ఎదిరించారు. కృష్ణుని చక్ర ధాటికి దేవతలు నిలువ లేక తమ ఓటమిని అంగీకరించి , వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు.

వన దహనం సాగుతుండగా తక్షకుని ఇంటిలో ఉన్న మయుడు అనే రాక్షస శిల్పి అగ్నికీలల నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా శ్రీకృష్ణుడు చూసి చక్రప్రయోగం చెయబోవటాన్ని చూసి ఆర్జునుడిని శరణు వేడాడు. శరణాగత వత్సలత్వం క్షత్రియ ధర్మం కావున అర్జునుడు మయునికి అభయం ఇచ్చాడు.

ఈ విధంగా అగ్ని ఖాoడవ వనాన్ని పదిహేను రోజులపాటు నిర్విరామం గా దహించిన తర్వాత ఒక ఆరు రోజులు విశ్రాంతి తీసుకున్నాడు.

ఆనాటి ఖాoడవ వన దహనం నుండి తప్పించుకున్న వారు మొత్తం ఆరుగురు. అశ్వసేనుడు, రాక్షస శిల్పి మయుడు, మందపాలుని నలుగురు పుత్రులు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి