8, జులై 2014, మంగళవారం

కబందుడు

కబందుడు

కబంద హస్తములు అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం. కాని ఎవరీ కబందుడు? అతని హస్తముల విశిస్టత ఏమిటి?

కబందుని గురించి మనకు రామాయణం లో వాల్మీకి మహర్షి చెప్పారు.

రామలక్ష్మణులు సీతాదేవి ని ఎవరో రాక్షసుడు  అపహరించాడు అని జఠాయువు ద్వారా  తెలుసుకుని ఆమె కోసం వెతుకుతూ తిరుగుతున్న సమయం లో లక్ష్మణ స్వామికి ఎడమ భుజం అదిరింది. అది అశుభ సూచన. మనసు అకారణం గా చంచలం గా ఉంది. జరగకూడనిది  ఏదో జరగబోతున్నది అని మనస్సు చెప్పుతున్నది. కాని ఆ జరగబోయే అశుభం నుండి మనం తప్పించుకోగలo అని ఆ వంచులకం అనే పక్షి కూత చెపుతోంది. ఆ పక్షికూత విన వస్తే ఆ శబ్దం విన్నవారు త్వరలో యుధం చేయబోతున్నారు, కాని ఆ యుధం లో వారికి విజయం లభిస్తుంది, అని లక్ష్మనుడు రామునకు చెపుతూ ఉన్న ఆ సమయం లో వారికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అది ఏమి శబ్దమో వారు తెలుసు కోవాలని ప్రయత్నించే లోగా ఒక విచిత్రమైన,వికృతమైన ఆకారం వారికి ఎదురుగా కనిపించింది.
ఆ ఆకారానికి తల లేదు, కాళ్ళు లేవు. నుదురు వంటి భాగం చాతి లోనూ, ముఖం వంటి ఒక భాగం పొట్ట వద్ద, అక్కడే ఒక కన్ను వంటి ఆకారం ఆ కంటికి ఒక పెద్ద రెప్ప, ఆ రెప్పకు పచ్చటి పొడవైన వెంట్రుకలు ఉన్నాయి. ఆ కన్ను అగ్నిజ్వాల లాగ ఎర్రగా ఉంది. ఆ ఆకారం యొక్క చేతులు ఒక యోజనం (సుమారు గా 12 కిలోమీటర్లు) పొడవుగా ఉన్నాయి. ఆ ఆకారాన్ని చూస్తె అది ఆ చేతులతో జంతువులను ఈడ్చి లాగుతుంది అని అర్ధం అవుతుంది. వారు ఇలా ఆలోచిస్తున్నoతలోనే ఆ ఆకారం తన రెండు చేతులతో వారిని పట్టుకుంది. ఆ ఆకారం తన చేతికి దొరికిన ప్రతిదాన్ని తన ఆహారం లానే భావిస్తుంది కనుక వారిని కూడా తినుటకు సంసిధం అయింది. ఆ పరిస్తితిలో లక్ష్మనుడు రామునితో "అన్నయ్యా!  ఈ విచిత్రమైన ఆకారం కదలలేదు కనుక మనం ఇతనిని మనం చంపకూడదు, ఇది ఇప్పుడు మనకు అపకారం చేయబోతోంది కనుక శిక్షించాలి. కనుక వీనికి కల ఈ చేతులను మనం త్రుంచివేయాలి" అని అన్నాడు. వెంటనే రాముడు ఆ ఆకారం యొక్క కుడి చేతిని, లక్ష్మనుడు ఎడమ చేతిని ఖండించి వేసారు.  చేతులు ఖండించగానే ఆ ఆకారం పరమానందం పొందింది.
ఆహా మహానుభావులారా! ఇంతకాలంగా  నా ఈ చేతులు ఖండించే వారికోసమే ఇటు వచ్చిన వారిని పట్టుకుంటూ ఉన్నాను. ఇంతకాలానికి మీరు ఈ కార్యానికి వచ్చారు. దయచేసి మీరు ఎవరు?ఇక్కడకి  ఎలా వచ్చారో  చెప్పండి? అని అడిగాడు.

దానికి లక్ష్మనుడు " ఈ యన మా అన్నగారయిన శ్రీరాముడు, నేను వారి తమ్ముడు లక్ష్మనుడిని. మేము ఇక్ష్వాకు వంశమునకు చెందిన వారము. మా అన్నగారి ధర్మపత్ని ఐన మాతల్లి సీతమ్మను ఎవరో రాక్షసుడు అపహరించాడు అని తెలిసి ఆమెను వెతుకుతూ ఇటు వచ్చాము. తమరు ఎవరు?" అని అడిగాడు.
దానికి ఆ వింత ఆకారం సమాధానం చెప్తూ "నేను శ్రీ అనే వాని యొక్క మద్యముడైన పుత్రుడను, నా పేరు దనువు.నేను చంద్రునివలె, ఇంద్రునివలె అత్యంత సుందరమైన, ఆహ్లాదకరమైన శరీరం కలిగిన వాడిని. ఆ అందం వల్ల అతిశయించిన గర్వంతో నావద్ద ఉన్న కామరూప శక్తి చేత విచిత్రమైన, భయంకరమైన రూపములు ధరించి అనేక ప్రాంతములలో ఉన్న ఋషులను, మునులను భయకంపితులను చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు కoద మూలములు ఏరుకుంటున్న స్థూలసిరస్కుడు అనే ఒక ఋషికి ఈరోజు నేను ఉన్నఈ రూపం తో ఒక్కసారిగా కనిపించాను. నన్ను చుసిన ఆ ఋషి ఉలిక్కిపడి, నిజమును గ్రహించి నీకు ఇటువంటి  భయంకరమైన, జుబుక్త్సాకరమైన రూపం ఇష్టం లా అనిపిస్తున్నది కనుక నువ్వు ఈరూపం తోనే ఉందువు గాక అని నాకు శాపవాక్కు విడచాడు.అప్పుడు సిగ్గు పడిన నేను శాపవిమోచనం చెప్పమని కోరగా, ఆ ఋషి కొంతకాలం అరణ్యంలో నేను ఈ రూపం తో పడిఉండగా రామచంద్రుడు వచ్చి నా చేతులు ఖండించి నన్ను అగ్నిలో దాహిoచిన  తర్వాత నాకు నిజరూపం వస్తుంది అని సెలవిచ్చారు.
ఆ ఋషి  శాపం కార్యరూపం నాకు సంక్రమించేలోపు బ్రహ్మగురింఛి ఘోర తపస్సు చేస్తే, ఆయన నన్ను దీర్ఘాయుష్మాన్భవ అని దీవించి వెళ్ళిపోయాడు. అప్పుడు మరలా గర్వం అతిశయించిన నేను ఇంద్రుని మీదకు యుధానికి వెళ్ళాను. ఐతే ఇంద్రుడు తన వజ్రాయుధం తో నా తలను ఖండించి, తలను, కాళ్ళను పొట్టలోకి తోచి వేసాడు. దీర్ఘయుషు ఉన్ననేను ఈ రూపం తో ఎలా ఉండగలను బ్రతకటానికి ఆహారం కావలి కదా అని నేను ఇంద్రుని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నాకు కన్ను కనిపించేలాచేసి, యోజనం ప్రమాణం లో చేతులను ఇచ్చి వాటితో తడుముకొని దొరికినవి తినమని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీరామా అప్పటినుండి నేను మీకోసం ఎదురు చుస్తూ ఉన్నాను. మీరు నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే, నాకు నిజరూపం వచ్చిన తర్వాత నాకు గల శక్తి చేత మీరు సీతమ్మను వెతకుటకు నేను మార్గం చెప్పగలను అని అన్నాడు.
సూర్యాస్తమయం సమీపిస్తున్నది కావున లక్ష్మనుడు ఒక పెద్ద గొయ్యి తీసాడు. అతనిని ఆ గోతిలోకి నెట్టి వేసారు. ఎనుగులచేత విరచి, ఎండినటివంటి కర్రలను వేసి అగ్ని సంస్కారం చేసారు. ఇంతకాలం గా కదలకుండా తినుటవల్ల బాగా కొవ్వుపట్టిన శరీరం అవుటవల్ల మెల్లగా కాలింది. ఆ శరీరం పూర్తిగా కాలిన తర్వాత ఒక సుందరమైన ఆకారం కల దివ్యపురుషుడు రధంలోకనిపించాడు. ముగ్ధమనోహరమైన, కృతజ్ఞతతో కూడిన  చిరునవ్వుతో వారికి నమస్కరించి, ఒక్క క్షణం కన్నులు మూసుకుని, తర్వాత ఇలామాట్లాడాడు.
" రామా! మీరు దుర్ధశాఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కనుక భార్యావియోగం కలిగింది. మీరు ఈ విధంగా వెతికితే మీకు కలిగే ప్రయోజనం చాల తక్కువ. ఈ సమయం లో ఈ భూమండలం అంతా తిరిగిన మిత్రుని వల్ల  మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీకు ఇప్పుడు అటువంటి ఒక మిత్రుడు అవసరం.అటువంటి ఒక వానరరాజు ఉన్నాడు. అతని పేరు సుగ్రీవుడు. ఆతను సూర్యుని ఔరస పుత్రుడు. కొన్ని కారణముల వాళ్ళ తన అన్నగారయిన వాలితో విభేదించి తన నలుగురు మంత్రులతో ఋష్యమూక పర్వతం మీద ఉన్నారు. సుగ్రీవుడు అత్యంత బలవంతుడు, ఈ భూమిమీద ఎక్కడ ఏమి ఉన్నదో తెలిసిన వాడు. కావున నీవు అతనితో అగ్ని సాక్షిగా స్నేహం చేసుకో మని చెప్పాడు. అక్కడికి ఎలావేళ్ళాలో కుడా చెప్పి రాముని అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి