13, జనవరి 2016, బుధవారం

నారదుడు - గర్వ భంగం

గర్వంతో విష్ణుమాయను గెలవగలను అని ప్రకటించిన నారదుడు, స్త్రీ గా మారి అడవులలో తిరుగుతూ ఉన్నాడు. ఆ అడవి ఇప్పుడు మనం చూస్తున్న పిఠాపురం పరిసరాలలో ఉన్నది.
అప్పుడు అటుగా వేట ముగించుకుని వస్తున్న పిఠాపురం మహారాజు "నికుంఠమణి" ఆ "నారద కన్య" ను చూసి ఆమెను తనతో పిఠాపురం తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆమె చిత్రపటం వేయించి అన్ని రాజ్యములకు ఆమె చిత్రపటమును పంపించి, ఆమె ఎవరికి చెందినదో తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. కానీ ఎవరూ ఈమె తమకు సంబందించినది అని ముందుకు రాలేదు. కనుక కొంతకాలం చూసి నికుంఠమణి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను అందరూ "సుదతి" అని పిలిచే వారు. వారికి 60 మంది పుత్రులు కలిగారు. వారి పేర్లు ప్రస్తుతం వాడుకలో ఉన్న మన తెలుగు సంవత్సరాల పేర్లు. ఇలా కొంతకాలం గడచిన తరువాత, ఒకసారి పరదేశపు రాజులు వీరి రాజ్యం మెడకు దండెత్తి వచ్చారు. ఆ యుద్ధంలో నికుంఠమణి, అతనితో అతని 60 మంది కుమారులు కూడా చనిపోయారు. అప్పుడు శత్రురాజులు ఆ సుదతిని రాజ్యంనుండి తరిమేశారు. ఆమె ఆకలి దప్పులతో అక్కడ ఇక్కడ తిరుగుతూ చివరకు తన భర్త మరియు పుత్రులు మరణించిన యుద్ధభూమి వరకు వచ్చినది. ఆకలితో నీరసించిపొతున్న ఆమెకు ఒక చెట్టు చిటారి కొమ్మన ఉన్న ఒక పండు కనిపించింది. చెట్టు ఎక్కే ఓపికలేదు కనుక ఆ యుద్ధభూమిలో పడి ఉన్న శవాలను ఒకొక్క దానిని తీసుకెళ్ళి ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ వెళ్ళింది. చివరకు ఆమె భర్త శవాన్ని కూడా అక్కడకు తీసుకు వచ్చింది. దానిమీద ఎక్కి పండు అందుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతను సుదతిని ఆ పని చేయకుండా ఆపి, ఆమెను కొంతదూరం తీసుకు వెళ్లి అక్కడ ఉన్న ఒక కొలనులో స్నానం చేయమని చెప్పాడు.
ఆమె అలా కోనేట్లో మునగ గానే ఆమెకు తిరిగి నారద రూపం వచ్చేసింది.కానీ అతని ఎడమ చేతికి గాజులు అలాగే ఉన్నాయి.  అంతే కాకుండా ఇంతకుముందు జరిగిన వింత అనుభవం కూడా బాగా గుర్తు ఉన్నది. ఆ సంఘటనలు తలుచుకుని నారదుడు విష్ణుమాయ కారణంగా ఇది జరిగినది అని తెలుసుకున్నాడు. పశ్చాతాపం చెందాడు.
అప్పుడు శ్రీ మహావిష్ణువు కొరకు తప్పస్సు ప్రారంభించాడు. అలా 10,000 సంవత్సరములు తపస్సు చేయగా అప్పుడు, గరుడుని మీద విరాజితుడయిన శ్రీమన్నారాయణుడు పాతాళంనుండి పైకి వచ్చి దర్శనం ఇచ్చాడు. అప్పుడు నారద మహర్షి తన తప్పును క్షమించమని, తన చేతికి ఉన్న గాజులు పోయేలా అనుగ్రహించమని కోరాడు. ఆవిధంగా నారదునికి కలిగిన భవ  బంధాలను పోగొట్టిన వాడు కనుక ఆ నారాయణుడిని "భావ నారాయణుడు " అని పిలిచారు.
ఐతే పాతాళం నుండి వచ్చిన భావనారాయణుడు అక్కడే నివాసం ఉండేలా నారదుడు కోరుకున్నాడు. దానికి మహా విష్ణువు సరే అని చెప్పి, తాను స్వయంభువు గా అక్కడే నిలిచి, మరొక అర్చా మూర్తిని శ్రీ రాజ్యలక్ష్మీ సమేతంగా ప్రతిష్టించమని ఆదేశించాడు. నారద మహర్షి అలాగే ప్రతిష్టించాడు. అదే ఈనాడు "త్రిలింగ క్షోణి వైకుంఠం" గా చెప్ప బడే సర్పవరం యొక్క స్థల పురాణం.

ముఖ్య విషయులు:

  1. నారదుడు స్త్రీగా మారిన కొలను - నారద కుండం 
  2. సుదతి నారదునిగా మారిన కొలను - ముక్తి కుండం 
  3. సుదతిని వివాహం చేసుకున్న రాజు - పిఠాపురం మహారాజు 
  4. యుద్ధం జరిగిన ప్రదేశం - పండూరు 
  5. స్వయంభు - పాతాళ భావనారాయణ 
  6. నారద ప్రతిష్ట - రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి