25, జనవరి 2016, సోమవారం

సర్పవరం భావనారాయణ దేవాలయం

కాకినాడకు సమీపంలోని  సర్పవరం లోని త్రిలింగ క్షోణి వైకుంఠం గా పిలువబడే  ఈ భావనారాయణ దేవాలయం ముందుగా ఎవరు నిర్మించారో ఎవరికీ సరిగా తెలియదు. కానీ క్షేత్ర మహత్యం ప్రకారం, కలియుగ ప్రారంభం నుండి అంటే సుమారుగా 2000 సంవత్సరములుగా ఉన్నట్లు భావిస్తున్నారు. క్రీ. శ 4 వ శతాబ్దంలో యాళులు, తరువాతికాలం లో పాండ్యులు, రెడ్డి రాజులు, చోళులు, కళింగులు, వసంత భోగరాయలు, శ్రీ కృష్ణ దేవరాయలు, రాజరాజ నరేంద్రుడు, కాటయ వేమారెడ్డి ఈ దేవాలయమునకు వారి సేవలు అందించినట్లుగా కొన్ని శాసనములు ఉన్నాయి.
క్రీ శ 1779 వ సంవత్సరంలో పిఠాపురం రాజా "శ్రీ గంగాధర రాయనం గారు" శిధిలావస్థలో ఉన్న ఈ దేవాలయమును బాగు చేయించి, శిఖరములు నిర్మింపచేసి, ఉత్తర దిక్కున గాలిగోపురం నిర్మింప చేసారు. అంతే కాకుండా దేవాలయం లో 12 మంది ఆళ్వారులను, వైష్ణవ మత స్థాపకులయిన రామానుజుల వారికి మరుజన్మగా చెప్పుకునే శ్రీ మనవాళ మహాముని సన్నిధిని వారు స్థాపించారు. అంతే కాకుండా పాడయి ఉన్న నారద కుండం మరియు ముక్తి కుండములను తిరిగి తవ్వించారు. వారి కాలంలో దేవాలయమునకు సంబందించిన చాకలి, మంగలి పురోహితులు అందరికి రాజుగారు మాన్యములు ఇచ్చారు.
గాలిగోపురం స్వామి ఎదురుగా ఉన్న తూర్పు వైపున కాకుండా ఉత్తరమున ఎందుకు కట్టించారు?
ఎందుకంటే ఈ దేవాలయమునకు ఉత్తరం వైపున పిఠాపురం ఉన్నది. కనుక వారు ప్రతి నిత్యం ఈ దేవాలయమునకు రాకున్నా వారు ఈ గాలిగోపురం చూసి నమస్కారం చేసుకునేందుకు వీలుగా రాజావారు అలా కట్టించారట.
దేవాలయం ప్రాంగణం:
ఈ దేవాలయమునకు తూర్పున ముఖ ద్వారం ఉంది, ఉత్తరమున గాలిగోపురం ఉంది. తూర్పువైపు నుండి ప్రవేశిస్తే ఆలయ ప్రాంగణంలో మొదటగా దర్సనం ఇచ్చేవి స్వామివారి పాదములు.  ఆ వెనుకగా ద్వజస్థంభం. ఆ వెనుక రాతి గరుడ స్థంబం ఉంటాయి.   అక్కడి నుండి దేవాలయ ప్రదక్షిణ మొదలు పెడితే ముందుగా కనిపించేది అక్కడి గో సంపద. ఆ తరువాత అక్కడ ఉన్న నక్షత్ర మొక్కలు. అవునండి మనకు ఉన్న 27 నక్షత్రములకు సంబందించిన 27 మొక్కలు అక్కడ ఉన్నాయి. వాని చుట్టూ చక్కగా ఫెన్సింగ్ చేసి, ఆయా నక్షత్రముల చుట్టూ తిరిగే వారు చదువుకోవలసిన శ్లోకములను, ఆయా ఫెన్సింగ్ లపై వ్రాయించి ఉంచారు.  
దేవాలయం లోపలి భాగం:
గర్భగుడిలో శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ భావనారాయణ స్వామి దర్శనం ఇస్తారు. జయ విజయాల నిలువెత్తు రూపములు. అక్కడి నుండి ప్రదక్షిణ పురస్సరంగా వెళితే ఆ ప్రాకారంలో పడమర ముఖంగా ముందు 12 మంది ఆళ్వారుల సన్నిధి ఉంటుంది. వారికి ప్రక్కగా శ్రీ అనంత ప్రతిష్ట శ్రీ మూల భావనారాయణ స్వామి దర్సనం ఇస్తారు. వీరికి ఇరువైపులా శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ విఖనస మహర్షి ఉంటారు. అలా సుమారుగా గర్భగుడి వెనుక వైపుకు వస్తే అక్కడ దాదాపు 5-6 అడుగుల లోతులో శ్రీ పాతాళ భావనారాయణుడు దర్సనం ఇస్తాడు. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే, మూల మూర్తికి  వాయువ్య మూలగా మనవాళ మహాముని ఉంటారు.   వీరికి ఎదురుగా, మూల మూర్తికి ఈశాన్యంలో శ్రీ లక్ష్మి అమ్మవారు/ గోదా దేవి దర్శనం ఇస్తారు. వీరిని సాక్షాత్తూ శ్రీ వేదవ్యాసులు ప్రతిష్టించారట.

ఉత్తర గాలి గోపురం: 
ఉత్తరమున ఉన్న ఈ గాలిగోపురం 42 అడుగుల ఎత్తు ఉంటుంది. దేవాలయం లో ముఖ్యంగా ఆకట్టుకునేది ఆఉత్తర గాలిగోపుర శిల్ప సంపద. పురాణేతిహాసములలోని అనేక ముఖ్య ఘట్టములు చాలా మనోహరంగా ఈ గాలిగోపురంలో మలచారు. రామ రావణ యుద్ధం
హంసవాహనారూడుడయిన బ్రహ్మ 



దేవాలయ ప్రాకారంలో పశ్చిమవైపున ఉన్న గోడలోపల తూర్పు ముఖంగా వినాయకుని దర్శించవచ్చు.

ఇతర విశేషములు:

ఉత్తర ద్వారం (గాలిగోపురం) నుండి బయటకు వస్తూనే సర్పవరం జంక్షన్ - మాధవపట్నం కలిపే రహదారి కనిపిస్తుంది. ఆ రహదారికి అవతల ఒక కోనేరు ఉన్నది. అదే ముక్తి కుండం. ఆ ముక్తి కుండం ప్రక్కన ఈమధ్యనే శ్రీ నారదులవారిని ఉంచారు. నారదులవారి చేతికి ఉన్న గాజులను ఇక్కడ చూడవచ్చు.

మరి నారద కుండం ఎక్కడ ఉంది?
ఉంది. ఉంది. అది మరొక టపాలో చెప్పుకుందాం!
ముఖ్య విషయములు 
  1. ఈ దేవాలయం సుమారుగా 40 సంవత్సరముల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ క్రింద ఉన్నది.
  2.  ప్రస్తుతం ఈ దేవాలయమునకు 80ఎకరముల భూమి ఉన్నది. 
  3. మూల భావనారాయణ, భావనారాయణ ల మెడలో 108 సాలగ్రామములతో చేసిన మాల ఉంటుంది. వీనిని గండకి నది నుండి తెప్పించారు. 

పూజల వివరములు:

నిత్య పుజావిధానం:
ఉదయం :    6.00  - అర్చన 
                   7. 30 - బాల భోగం 
                            సేవాకాలం (తిరుప్పావై )
                            తీర్ధ ప్రసాదములు 
                    11. 00- అర్చన, రాజ భోగం 
సాయంత్రం :   5. 00 - దేవాలయం తెరుస్తారు 
                    6. 30 - అర్చన, శనగలు నివేదన 
                    8. 00 - పవళింపు సేవ 
                    8. 30 - 9. 00 - దేవాలయం ముసి వేస్తారు. 
మంగళ, శని వారములు - సాయంత్రం 7. 00 - 8. 00 వరకు సంక్షేప రామాయణం(మహిళా మణుల పారాయణం)
శుక్రవారం - సాయంత్రం 7. 00 - 8. 00 వరకు విష్ణు సహస్త్రనామ పారాయణం
పర్వదినములు- ప్రత్యేక పూజలు 
చైత్ర మాసం : ఉగాది - ఉదయం : బాల భోగం - ఉగాది పచ్చడి 
                                సాయంత్రం : పంచాంగ శ్రవణం 
వైశాఖ మాసం : శుద్ధ ఏకాదశి నుండి 7 రోజులు కల్యాణోత్సవం (7 వాహనములపై ఊరేగింపు )
శ్రావణ మాసం : పుబ్బ నక్షత్రం - గోదాదేవి తిరు నక్షత్రం 
                        పౌర్ణమి తరువాతి అష్టమి - కృష్ణాష్టమి - సాయంత్రం 5. 00 - పంచామృతాభిషేకం 
                                                                                                        9 రకముల ప్రసాదములు   
                                         మరుసటి రోజు - నవమి - ఉట్టి సంబరం ; తిరువీధి ఉత్సవం 
ఆశ్వయుజ మాసం: నవరాత్రులు 
                              దశమి రోజు - జమ్మి ఉత్సవం, గ్రామోత్సవం 
కార్తీక మాసం : మూలా నక్షత్రం - మనవాళ మహాముని జయంతి ఉత్సవం 
మార్గశిర మాసం : డిసెంబర్ 16- జనవరి 13 : ధనుర్మాసం 
                              ప్రతిరోజూ ఉదయం : తిరుప్పావై 
                          వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్సనం 
                            గరుడ వాహనం పై గ్రామోత్సవం 
                      బోగి నాడు : గోదా కల్యాణం 
మాఘ మాసం : నాలుగు ఆదివారములు తిరునాళ (నారదునికి స్వామి దర్సనం ఇచ్చింది మాఘ మాసంలోనే)    

15 సంవత్సరముల నుండి సర్పవరం గ్రామంలోని సేవాసమితి వారు ప్రతి శుద్ధ ఏకాదశి నాడు సామూహిక పూజలు నిర్వహించి, స్వామివారికి దశ హారతులు ఇచ్చి. తీర్ధ ప్రసాద వితరణం చేస్తున్నారు.           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి