30, ఏప్రిల్ 2019, మంగళవారం

పాండవులు - ఇంద్రుడు

 మహాభరతం లో ఎన్ని సార్లు ఎంతమంది సమాధానాలు చెప్పినా మల్లి మల్లి అందరు అడిగే ప్రశ్న ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండుట ధర్మమేనా?
ఈ ప్రశ్నకు మహాభారతంలో అనేక సందర్భములలో అనేక వృత్తాంతములతో ఇది ధర్మమే అని చెప్పారు. ఆ వృత్తాంతములు చెప్పే ముందు అసలు పంచ పాండవులు ఎవరు? ద్రౌపది ఎవరు అని ముందుగా చూద్దాం!

ద్రౌపది - స్వర్గ లక్ష్మి
ధర్మరాజు - యమధర్మ రాజు అంశ
భీముడు - వాయుదేవుని అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశ

ఇలా పాండవులు వివిధ దేవతల అంశాలుగా చెప్పబడినా , వారిలో నుండి బయటకు వచ్చిన ఆయా అంశలు కూడా ఇంద్రుని అంశలే అని ద్రౌపది కల్యాణ సమయంలో స్వయంగా వ్యాసుడు ద్రుపదునికి చెప్పాడు.
ఇదే కథను మార్కండేయ పురాణంలో మరోవిధంగా చెప్పారు. ఆ కదా ప్రకారం :

ఇంద్రుడు దేవతల రాజు. అత్యంత ధర్మవంతునిగా ఉండవలసిన భాద్యత అతనిది. కానీ ఆ విధంగా చేయవలసిన అనేక సందర్భములలో కొన్నిసార్లు అధర్మం చేయవలసి వచ్చింది. అలా అధర్మం చేసినప్పుడు అతనిలోని కొంత శక్తి కోల్పోతూ వచ్చాడు. అయితే అతను కోల్పోయిన ఆ శక్తి ఆయా సందర్భములలో అతనిని ఉద్దరించటానికి సహాయం చేసిన దేవతలకు ఆ  శక్తి అంశలుగా చేరాయి. మరి ఇంద్రుడు ఏ పనులు చేసాడు, ఆలా  చేసినప్పుడు  అంశ ఏ దేవతలను చేరిందో తెలుసుకుందాం!

అహల్యా వృత్తాంతం : గౌతమ ముని శాపం తర్వాత అత్యంత జుగుప్సాకరంగా మారిన అతని శరీరమును తిరిగి పూర్వ రూపం వచ్చేలా ప్రయత్నించిన వారు దేవా వైద్యులయిన  అశ్విని దేవతలు. కనుక ఇంద్రుడు ఆ సమయంలో కోల్పోయిన శక్తి ఈ సందర్భంలో అశ్వినీ దేవతలకు సంక్రమించింది.  

వృత్రాసుర వధ : వృత్రాసురుని వధ తరువాత అతనికి బ్రహ్మహత్యాపాతకం సంక్రమించింది. 
ఆ బ్రహ్మహత్యాపాతకమును కొంత తాను తీసుకున్న వాయుదేవునికి కొంత ఇంద్రతేజస్సు సంక్రమించింది. 

త్రిశిరుని వధ : త్రిశిరుడు అనే రాక్షసుని సంహరించిన తరువాత ఆ పాపంలో కొంత పాపం తాను తీసుకుని ఇంద్రునికి సహాయం చేసిన యమునిలో ఇంద్ర అంశ కొంత వచ్చి చేరింది. 

కనుక కుంతీ దేవి, మాద్రిదేవి వివిధదేవతలను ఉపాసించి పుత్రులను కోరినప్పుడు ఆయా దేవతలు వారివద్ద ఉన్న ఇంద్రుని అంశలను వారికి పుత్రులుగా ఇచ్చారు కనుక 

ధర్మరాజు - యమధర్మ రాజు అంశ గా వచ్చిన ఇంద్ర అంశ
భీముడు - వాయుదేవుని అంశగా  వచ్చిన ఇంద్ర అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశగా వచ్చిన ఇంద్ర అంశ

కనుక అందరు పాండవులు కూడా ఇంద్రుని అంశలే. మరి ఇంద్రుని రాజ్యలక్ష్మి అయిన స్వర్గ లక్ష్మి  పాండవుల పట్ట మహిషి అయిన ద్రౌపది గా వచ్చినది.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి