27, ఏప్రిల్ 2019, శనివారం

వాల్మీకి - ఒక ఆలోచన

ఇది వరకు మనం ఆధ్యాత్మరామాయణం లో శివుడి పార్వతితో చెప్పిన ఒక శ్లోకమును ఆధారముగా చేసుకుని వాల్మీకి ప్రచేతసుల కుమారుడు అని చెప్పుకున్నాం కదా! మరి మనకు తెలిసిన కథ సంగతి ఏమిటి? ఆ విషయం తెలుసుకునే ముందు అసలు మనకు తెలిసిన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం!

అనగనగా ఒక బోయవాడు. వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. వేట దొరకనప్పుడు దారి కాచి బాటసారులను దోచుకుని ధనం సంపాదించేవాడు. ఒకరోజు నారద మునిని అలానే బెదిరించగా తాను చేస్తున్నది పాపం కనుక ఆ పాపంలో వాని కుటుంభం సభ్యులు పాలు పంచుకుంటారేమో అడుగ మని చెప్పగా, బోయవాడు వెళ్లి అందరిని అడుగగా ఎవ్వరూ ఆ పాప భారమును స్వీకరించుటకు సుముఖంగా ఉండకపోవుట చూసి వైరాగ్యము కల్గిన బోయవాడు నారదుని కాళ్లపై పడగా , నారదుడు అతనికి "రామ" మంత్రం ఉపదేశించారు.  ఆ మంత్రము నోరుతిరుగక పోవుట వలన నారదుడు బోయవానికి "మర" అని పలుకమని తరుణోపాయము చెప్పారు. ఆ తారక మంత్రములో నిమగ్నుడయిన అతని చుట్టూ పుట్టలు పట్టాయి. కొన్ని రోజుల తరువాత ఆ పుట్టలోనుండి బయటకు చచ్చాడు కనుక అతనిని వాల్మీకి అని సంభోదించారు.

అయితే ఈ కథలోని కొన్ని భాగాలు కొంచెం ఆలోచిస్తే ప్రక్షిప్తాలేమో అనే అనుమానం తప్పకుండా వస్తుంది.

  1. ఈ కథ జరిగిన కాలం: రామాయణం ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణ రచన రాముడు భూమిమీద నడయాడుతున్న కాలంలోనే జరిగింది, అనగా సుమారుగా త్రేతా యుగ చివరి సమయం . అంటే అతను తపస్సు చేసిన కాలం అంతకంటే ముందు అనగా ద్వాపర మధ్య లేక మొదటి భాగం.  మరి ఆ కాలంలో దారి దోపిడీ లు జరిగేవా? కొంచెం అనుమానమే కదా!
  2. కుటుంబ సభ్యులు పాప భారం తీసుకోము అని చెప్పటం: ఆ యుగములలో ఎవరి ధర్మం వారికి ప్రాణప్రదం. ఆ కాలం లో భర్త పాపములో భాగము తీసుకోను అని చెప్పే సందర్భం ఉండే అవకాశం ఉంటుందా?
  3. మంత్రం: మన సనాతన ధర్మములో ఉన్న అనేక మంత్రముల కంటే అతి చిన్నదయిన, సరళమయిన మంత్రం "రామ", ఈ మంత్రం నోరుతిరుగాక పోవటం, "మర" అనేది నోరు తిరగటం ఎంతవరకు నిజమై ఉండవచ్చు?
కనుక వాల్మీకి బోయవాడు అని చెప్పే విషయం కంటే వాల్మీకి ప్రచేతసుల కుమారుడు అని నమ్మటానికి కొంత అవకాశములు ఎక్కువగా ఉన్నాయి అని నా అభిప్రాయం!

2 కామెంట్‌లు: