26, మార్చి 2020, గురువారం

శ్రీ మహ విష్ణువు బట్టలు పసుపు (పీతాంబరములు) గా ఎందుకు ఉంటాయి?

ఏదయినా విషయములు చెప్పే సమయంలో కవి ఎంతో సృజనాత్మకంగా, ఇంతకూ ముందు చెప్పినవారి కంటే భిన్నంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. అలాగే పైన మనం చెప్పుకున్న ఆ ప్రశ్నకు సమాధానం వికటకవి గా పేరు పొందిన తెనాలి రామకృష్ణుడు తను రచించిన పాండురంగమహత్యం లో చాలా చక్కగా చెప్పాడు.

అభినవాయాతి తనపుత్రు నజుని గాంచి
సంతసంబున నాభివేశంత జలజ
ముబ్బి వెలిగ్రాయు పుప్పొడి యొరపు నెరపు
హళది పుట్టంబు కటిసీమ నలదువాని

భావం : అప్పుడే వచ్చిన తన పుత్రుడు అయిన బ్రహ్మ ను చూసి, విష్ణుమూర్తి నాభిలోని కమలం ఉబ్బితబ్బిబ్బు అయినదట. అలా తబ్బిబ్బు అవుతున్నప్పుడు ఆ కమలంలోని పుప్పొడి రేణువులు బయటకు చింది శ్రీ మహావిష్ణువు పంచె మొత్తం పడినవట.

బ్రహ్మదేవుడు  విష్ణు నాభి కమలంలో నుండి జన్మించాడు. కనుక పుత్రుని చుసిన సమయంలో జనకులకు అనందం కలుగుట సహజం. అలా ఆనందంలో ఉన్న సమయంలో చేతిలోవి జారిపోవుట సహజం. కానీ ఆలా జరుగుట వలన శ్రీ మహావిష్ణువు పంచె పసుపుగా మారింది అని చెప్పటం కవి హృదయం.  అందునా వికటకవి కనుక ముందే ఉన్నదానికి ఇలా ఒక కారణం చెప్తున్నాడు. అలంకార శాస్త్రంలో దీనిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి