31, డిసెంబర్ 2015, గురువారం

పరీక్ష - ఫలితం

శివ శర్మ వరుసగా తన నలుగురు పుత్రులయిన యజ్ఞశర్మ, వేదశర్మ, ధర్మశర్మ మరియు విష్ణుశర్మ లను పరీక్షించి, వారు తమ తమ పితృభక్తిని నిరుపించుకున్న తరువాత, అమితానందం పొందాడు.
తన పుత్రులను పిలచి " ఓ కుమారులార! మీ పితృభక్తి కి నేను ఎంతో  సంతోషించాను. మీకు ఏదయినా వరం ఇస్తాను కోరుకొనండి" అని అడిగాడు.
అప్పుడు ఆ పుత్రులు " తండ్రీ మీరు మాయందు దయఉంచి మా తల్లిని తిరిగి బ్రతికించండి అని ప్రార్ధించారు". వారు అలా అడుగగానే ఆ తండ్రి ఒక చిరునవ్వు నవ్వాడు, వెంటనే జ్యేష్ట పుత్రునిచే వధింపబడిన ఆమె వెంటనే నడచి వచ్చి, తన భర్త పాదములకు నమస్కరించినది. తన పుత్రులను చూసి " ఓ కుమారులార! ఒక స్త్రీకి తన పుత్రులు ధర్మ మార్గంలో నడచుటకంటే పెద్దదయిన బహుమానం ఉంటుందా! సత్ బ్రాహ్మణ కులంలో జన్మించాను, ఉత్తముడయిన భర్తను పొందాను, నా గర్భం నుండి మీవంటి పరమ ఉత్తములను పొందాను. నా జన్మ ధన్యం కదా! " అని పలికినది. వెంటనే ఆమె పుత్రులు ఆమెకు ప్రణామములు చేసారు.
వీరిని మరలా వరం కోరుకొనమని శివశర్మ అడుగగా, అప్పుడు వారు విష్ణుదామము కావలెను అని కోరారు. అప్పుడు శివశర్మ తధాస్తు అని పలుకగానే, శ్రీమహావిష్ణువు తన పరివారంతో, రధంలో ప్రత్యక్షం అయ్యాడు. "శివశర్మ, నీ నలుగురు పుత్రులు పితృభక్తి లో వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు. నీవు వారికి విష్ణులోకమును అనుగ్రహించావు. నీవు నాకు భక్తునువి అవ్వటం వలన నేను నీకు స్వాదీనుడను. కావున నీవు నీ భార్యా బిడ్డలతో కలసి నా ధామమునకు విచ్చేయుము" అని పలికెను.
ఆ మాటలు విని శివశర్మ " ఓ విష్ణుమూర్తి! ఇప్పటికి నా నలుగురు పుత్రులను నీ ధామమునకు తీసుకొని వెళ్ళు. నేను నా భార్య మరియు ఐదవ పుత్రునితో ఇంకొంత కాలం భూలోకం లో ఉండి తరువాత తమరిని చేరుకొనెదను" అని చెప్పెను. అప్పుడు శ్రీమహావిష్ణువు శివ శర్మ నలుగురు పుత్రులను ఇంద్రనీలమణి సామానమయిన కాంతి కలవారుగా, శంఖచక్రగధా ధరులుగా, దివ్యాలంకరణ భూషితులుగా చేసి గోలోకమునకు తీసుకొని వెళ్ళిరి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి