23, ఫిబ్రవరి 2015, సోమవారం

మేలుకోటిలోని తిరునారాయణ వైరముడి

 వైరముడి అనేది మేలుకోటి లో కొలువై ఉన్న ఆ చెలువ నారాయణుని కిరీటం పేరు. ఇంతకుముందు మనం మెల్కోటే కు చెలువనారాయణుడు, రామప్రియ ఎలాచేరుకున్నారో చెప్పుకున్నాం కదా! మరి ఈ కిరీటం ఏమిటో, అంత గొప్ప కిరీటం ఇక్కడకు ఎలా చేరినదో, దానిని ఎప్పుడు ఎలా దర్శించ గలమో తెలుసుకుందామా?

శ్రీ హరి ఒకసారి పాల సముద్రంలో పవళించి ఉండగా పరమ భక్తాగ్రేస్వరుడయిన ప్రహ్లాదుని కుమారుడు, విరోచనుడు శ్రీహరి పవిత్రమైన కిరీటమును   దొంగిలించాడు. అలా తీసుకువెళ్ళిన కిరీటమును విరోచనుడు ఎవరికీ తేలియని ప్రదేశంలో దాచి ఉంచాడు. అప్పుడు శ్రీహరి తన వాహనమయిన గరుక్మంతుని తన కిరీటం ఎక్కడ ఉన్నదో వెదకి తనకు తెచ్చి ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అప్పుడు గరుక్మంతుడు ఆ కిరీటమును గురించి దశ దిశలా వెదక సాగాడు. చివరకు ఆ కిరీటం జాడ తెలుసుకుని ఆ కిరీటమును కనుగొని, దానిని శ్రీహరికి సమర్పించాలి అనే తొందరలో ఆ కిరీటమును ముక్కున కరచుకొని పయనం సాగించాడు. అప్పుడు వాడి అయిన గరుక్మంతుని ముక్కు తగిలి ఆ కిరీటమునకు పొదగ బడిన ఒక అపూర్వమైన నీలి రత్నం ఒకటి రాలి నేలపై పడినది. ఆ రత్నం పడిన చోటునుండి ఒక నది ప్రారంభం ఐయి ప్రవహిస్తూ ఉన్నది. ఆ నదిని చింతామణి అని పిలిచారు. (ఇప్పటికీ  ఈ నది తంజావూరు వద్ద ఉన్నది )
గరుక్మంతుడు అత్యంత శ్రమించి తెచ్చిన శ్రీవారి కిరీటం వారికి సమర్పించటానికి ఆత్రుతగా గరుడుడు శ్రీవైకుంఠ పురమునకు చేరుకున్నారు. కాని అప్పటికి శ్రీహరి భూలొకం లో అవతరించారు అని తెలుసుకుని, కించిత్ నిరుత్సాహమునకు లోనయ్యి ఎలా అయినా శ్రీఘ్రంగా శ్రీహరికి ఈ కిరీటం అందించాలి అనే సంకల్పంతో గరుక్మంతుడు అతివేగంగా భూలోకమునకు వచ్చి శ్రీహరి గురించి అనేక ప్రదేశములు వెదకారు. చివరకు రేపల్లెలో తన మిత్రులతో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుని చూసి అమితానందం పొందారు. ఆ కిరీటం బాలకృష్ణుని తలపై ఉంచారు. అది ఆబాలగోపాలమును పరిపాలించే బాలగోపాలుని తలకు సరిగ్గా సరిపోయినది. ఆ కిరీటం ధరించిన బాల కృష్ణుని చూసిన గరుక్మంతుడు సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు.
శ్రీకృష్ణుడు స్వయంగా రామప్రియకు ఆ కిరీటమును ఉంచి పూజించేవారు.  తరువాతి కాలంలో శ్రీకృష్ణుడు రామప్రియతో పాటుగా ఆ కిరీటమును కూడా తీసుకు వచ్చి మేల్కోటలో ఉన్న చెలువనారాయణ దేవాలయంలో ఉంచారు అని ఇక్కడి పురాణం.
ఈ కిరీటమును వైరముడి అంటారు. చెలువ నారాయణుడు కూడా ఈ కిరీటమును సంవత్సరమునకు ఒక్కరోజే ధరిస్తారు. అది బ్రహ్మోత్సవంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం ఈ వైరముడి బ్రహ్మోత్సవం దర్శించటానికి కొన్ని లక్షలమంది మేల్కొటేకు చేరుకుంటారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఏప్రిల్ 30 నుండి జరుగుతుంది.        
ఈవైరముడి మిగిలిన రోజులు కర్నాటక ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. ఈ కిరీటము అస్సలు సూర్యరశ్మి ప్రవేశించకుండా ఉండేటట్లుగా ఉన్నటువంటి పెట్టెలలో భద్రపరుస్తారట. అంతేకాదు, ఈ కిరీటం చెలువనారాయణుని తలపై ఉన్నపుడు తప్ప విడిగా చూడకూడదట.
మరి అందుకే స్వామివారి తలపై ఈ కిరీటమును ధరింపచేసే ఆ ఆలయ ముఖ్య పూజారి కూడా ఆ కిరీటము ఉన్న పెట్టెను శ్రీ రామానుజాచార్యుల వారి ముందు ఉంచి, తన కన్నులకు సన్నని వస్త్రమును కట్టుకుని, అప్పుడు ఆ పెట్టెను తెరిచి, శ్రీవారికి ఆ కిరీటం అలంకరింపచేస్తారట.
అది సంగతి. ఇటువంటి అధ్బుతమైన, అపుర్వమిన ఒక ఉత్సవం మన పక్క రాష్ట్రం లో మర్చి 30, 2015 వ తారీకున జరుగుతుందట. పిల్లలకు పరిక్షలు ఐపోయి ఎక్కడకు వెళ్దామా అని ఆలోచిస్తున్న వారు చక్కగా బెంగళూరు, మైసూరు, ఇంకా మెల్కోటే వెళితే బాగుంటుంది కదా!                                                                             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి